24, ఏప్రిల్ 2020, శుక్రవారం

మల్లాది గారికి క్షమాపణలతో

మల్లాది వేంకట కృష్ణమూర్తి గారు ఇప్పుడే ఫోన్ చేసి తన ఫొటో తీసేయమని చాలా మృదువుగా రిక్వెస్ట్ చేశారు. అందుచేత ఆ పోస్టును, వారి ఫొటోను తీసేస్తున్నాను. వారి మనోభావాలను గౌరవించడం నా విధి. అలాగే ఇప్పటికే ఈ ఫొటోను, పోస్టును షేర్ చేసినవారు ఎవరైనా వుంటే దయచేసి వాటిని తొలగించి మీ అభిమాన రచయిత మనసు గాయపడకుండా చూడండి. ఇది నా విజ్ఞప్తి - భండారు శ్రీనివాసరావు

22, ఏప్రిల్ 2020, బుధవారం

ట్రంప్ పిచ్చోడో గట్టోడో కొద్ది నెలల్లో తేలుతుంది


వాడో పిచ్చోడు. దేశాన్ని నాశనం చేయడానికే వచ్చాడు”
అమెరికాలో ఎవరినన్నా కదిలిస్తే చాలామంది ట్రంప్ గురించి చెప్పే మాటలు. నిజానికి ఇందులో నిజమెంత?
చూడడానికి పెద్ద తాగుబోతులా కనిపించే ఈ పెద్ద మనిషికి తాగుడు అంటే గిట్టదు. నోరు తెరిస్తే ఏం మాట్లాడుతున్నాడురా బాబూ  అని ముక్కుమీద వేలేసుకునేలా వుంటాయి అయన మాటలు. అమెరికా అధ్యక్షుడు కాకముందు, అయిన తర్వాతా ఆయన తీరింతే! మనసులో మాట పైకి అనేయడం తప్ప అలా అనడంవల్ల వచ్చే మంచీచెడుల గురించి పట్టించుకోని భోలాశంకరుడు.
కింది ఫోటో ట్రంప్ దే. 1987 లో ప్రసిద్ధ టీవీ యాంకర్ ల్యారీకింగ్,  సీఎన్ఎన్ ఛానల్ కు ఇంటర్వ్యూ చేసినప్పటిది. అప్పటికి ఆయనకు రాజకీయాల వాసన తెలియదు. తన వ్యాపారం తప్ప వేరే వ్యాపకాలు లేవు.
లారీ కింగ్ ఆ ప్రశ్నే అడిగాడు, రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందా? అని.
ట్రంప్ ఇలా జవాబు చెప్పాడు.
“ఎంతమాత్రం లేదు. కానీ ఒక విషయం. నేను అమెరికా ప్రెసిడెంట్ కావాలని అనుకున్న మరుక్షణం ఆ పనిలోనే వుంటాను. మరో విషయం.  అలా నేను నిర్ణయించుకున్న తర్వాత నన్నెవ్వరూ ప్రెసిడెంట్ కాకుండా అడ్డుకోలేరు”     
అలానే అయ్యారు ఇరవై తొమ్మిదేళ్ళ తర్వాత. అదీ మొదటి ప్రయత్నంలోనే.
ప్రెసిడెంట్ ఎలక్షన్లకు ముందు ట్రంప్ మరో మాట చెప్పారు.
“మన దేశ ఆర్ధిక వ్యవస్థ, మనం గొప్పలు చెప్పుకునేంత గొప్పదేమీ కాదు. నిజం చెప్పాలంటే అదొక గాలి బుడగ. ఏ క్షణంలోనైనా పేలిపోవచ్చు”
“అమెరికా అమెరికన్లది. వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైనా తట్టాబుట్టా సర్దుకుపోవాల్సిందే” ఇలా సాగేవి ఆయన ఎన్నికల ప్రసంగాలు.
ఇప్పుడు కొరానా విషయంలో కూడా ఆయనది వేరే దారి. ప్రస్తుత దుస్తితికి కారణం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలే అని అభిప్రాయపడేవాళ్ళే ఎక్కువ ఆ దేశంలో.
ఈ నేపధ్యంలోనే అయన మరో బాంబు పేల్చారు.
బయటి దేశాల వాళ్లకి అమెరికాలోకి ‘నో ఎంట్రీ’ అని ప్రకటించారు.
ఆయనకి ఆత్మవిశ్వాసం ఎక్కువ అని 1987 లో ఇచ్చిన ఇంటర్వ్యూ లోనే తేలిపోయింది.
కాదు అది అహంకారం అంటుంది అక్కడి మెజారిటీ మీడియా. మీడియా విశ్వసనీయతని ఆయన గత ఎన్నికల్లోనే దెబ్బతీసారు.
ఆయనది  ఆత్మవిశ్వాసమా లేక అహంకారమా తేల్చుకోవడానికి మరి కొద్ది నెలల్లో జరిగే అమెరికన్ ప్రెసిడెంట్ ఎన్నికలు వేదిక కాబోతున్నాయి.
ఈ సారి కూడా మీడియా ఓడిపోతే ఇక దాని విశ్వసనీయత పూర్తి ప్రశ్నార్ధకమవుతుంది..     


(1987లో ట్రంప్)


    

21, ఏప్రిల్ 2020, మంగళవారం

లాక్ డౌన్ – భండారు శ్రీనివాసరావు


“ఈ కషాయం తాగించి రాత్రికి లంఖణం వుంచండి. రేపటికి తగ్గిపోతుంది’
“ఓ అయిదు రోజులు ఉదయం సాయంత్రం ఈ గోలీలు వేయండి. లేచి తిరుగుతాడు”
“భయపడాల్సిన పనేమీ లేదు, మూడ్రోజులు ఆస్పత్రిలో వుంటే చాలు, టెస్టులు చేయించి మందులు వాడతాం. నాలుగోరోజు ఇంటికెళ్ళి పోవచ్చు”
“ఐసీయూ నుంచి రేపు రాత్రి డిశ్చార్జ్ చేస్తాం! ఒక రోజు వార్డులో వుంచి పంపేస్తాం”
“రేపు ఉదయం ఆపరేషన్. తర్వాత మూడు నాలుగు రోజులు హాస్పటల్ లో వుండి వెళ్లి పోవచ్చు”
“పరిస్తితి బాగాలేదు. మహా అయితే నాలుగయిదు రోజులు, ఇంటికి తీసుకువెళ్ళి కావాల్సిన వాళ్లకు కబురు పెట్టుకోండి”
ఇవన్నీ ఇంతవరకు అందరికి తెలిసిన మాటలు. వింటూ వచ్చిన మాటలు.
ఈ కరోనా వచ్చిన తర్వాత వినబడని మాటలు.
ఎలా వచ్చిందో తెలవదు. ఎలా పోతుందో తెలవదు. ఎన్నాళ్ళు వుంటుందో తెలవదు.
జబ్బేమిటో తెలవదు. మందేమిటో తెలవదు. తెలిసినదల్లా బయట ప్రపంచంలో తిరగకుండా ఎవరికివారు ఇంట్లో ఉండడమే. ఒక రకంగా మంచి రోగం. ఖర్చులేని రోగం.
ఖర్చు లేదు సరే! ఆదాయం మాటేమిటి?
జరిగితే జబ్బంత సుఖం లేదంటారు. కానీ ఆ జరగడం ఎలా! ఎన్నాళ్ళిలా !
అన్నీ జవాబులేని ప్రశ్నలు. ఎవర్ని అడిగినా జవాబు చెప్పలేని ప్రశ్నలు.
జవాబులు వెతుక్కోవడానికి మాత్రం బోలెడు ఖాళీ సమయం వుంది.
అదే,
కరోనా లాక్ డౌన్!   

20, ఏప్రిల్ 2020, సోమవారం

“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....



“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా...” అంటూ రెండుసార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రేడియో విలేకరిగా నేను ప్రత్యక్ష సాక్షిని. మూడోమారు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేనాటికి నేను యాక్టివ్ జర్నలిజంలో లేను.
ఏప్రిల్ ఇరవై చంద్రబాబునాయుడు పుట్టిన రోజు. ఊహకు అందని రాజకీయ పరిణామాల నేపధ్యంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడెనిమిది మాసాలకు ఆయన పుట్టిన రోజు వచ్చింది. ముఖ్యమంత్రి జన్మదినం అంటే చాలా హడావిడి వుంటుంది. కానీ అప్పటికి ఎన్టీఆర్ మరణించి మూడు మాసాలే అయింది. ఆ పరిస్తితిలో వేడుకలు సంభావ్యం కావని భావించి, తనకు శుభాకాంక్షలు చెప్పదలచుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పుష్ప గుచ్చాలతో హడావిడి చేయవద్దని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేసారు. సాధారణంగా నాయకులు చేసే ఈ నిరాడంబర వినతులను అభిమానులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోరు. దానితో తరువాతి సంవత్సరాలలో అయన మరో పద్దతిని ఎంచుకున్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుని ఇంట్లో లేకుండా ఆ రోజున ప్రజల నడుమ గడపడం.
అధికారంలో లేని కాలంలో కూడా పుట్టిన రోజులు ఆయనకు కొత్తకాదు. కాకపొతే ఈ సారి కరోనా లాక్ డౌన్ నడుమ ఈ ఏడాది పుట్టిన రోజు రావడం ఆయనకీ, అభిమానులకి ఒక కొత్త అనుభవం.
ఒక తరానికి చెందిన రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే చంద్రబాబు అదృష్టవంతులయిన రాజకీయులలో మొదటి స్థానంలో నిలుస్తారు. అత్యంత పిన్న వయసులో మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలిగారు.
ముందే చెప్పినట్టు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాస్తున్న వ్యాసం ఇది. దీన్ని గమనంలో వుంచుకుంటే రాజకీయంగా ఆయనతో విబేధించేవారికి అనవసరమైన అనుమానాలు కలగవు. గత నలభయ్ ఏళ్ళకు పైగా ఆయనతో వృత్తిపరంగా పెంచుకున్న సాన్నిహిత్యం కారణంగా తెలియవచ్చిన కొన్ని సంఘటనలు ఒక చోట గుదిగుచ్చి, వాటి ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేసుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడుతున్నాను.
బ్రహ్మాండమయిన ప్రజాకర్షణ, అద్భుతమైన ప్రసంగ పాటవం కలిగిన ఎన్టీ రామారావుని త్రోసిరాజని అధికార పీఠం ఎక్కిన చంద్రబాబుకు తన బలహీనత ఏమిటో బాగా తెలుసు. అంతవరకూ రాజకీయాల్లో మామ చాటు మనిషిగా ఉంటూ వచ్చారు. చంద్రబాబు ఎవరో తెలిసిన వారికి కూడా ఆయన ఎలా ఉంటాడో తెలియదు. ప్రజలకు పరిచయం కావడానికి ఆయన ఎంచుకున్న మార్గం ప్రచారం. ఇందుకోసం ప్రతి సోమ వారం దూరదర్సన్, రేడియోల్లో ప్రజలతో నేరుగా మాట్లాడే ఒక కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. అలాగే అందివచ్చిన ప్రతి సందర్భంలో విలేకరుల సమావేశాల్లో ప్రసంగించడం. అప్పుడే కొత్తగా పురుడు పోసుకుంటున్న ప్రైవేటు మీడియాని వాడుకోవడం. ఈ ప్రయత్నం ఫలించింది. ప్రజలకి దగ్గర కావడానికి బాగా ఉపయోగపడ్డాయి.
ఇప్పుడంటే గంటలు గంటలు మాట్లాడే చంద్రబాబు నేటి తరానికి తెలుసు. కానీ తన బలహీనత ఏమిటో బాగా తెలిసిన మనిషి. దాన్ని అధిగమించడానికి ఆయన ప్రత్యేకమైన శిక్షణ కూడా తీసుకున్నారు.
చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా కరెంటు అవసరం లేని రేడియోని పక్కన బెట్టి, కరెంటు లేకుండా పనిచేయని 'టీవీ' లకు ముఖ్యమంత్రిగారు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ, నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, 'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి ఆయన లోపలకు వెళ్ళిపోయారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి, ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. ‘బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదనగా వుండేది.
సీరియస్ గా పనిచేసుకుపోతూ చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు. కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చా’ అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
‘రేపు హైదరాబాదు వస్తున్నాను, చంద్రబాబు గారిని కలిపిస్తారా?’
ఏడాదికి ఒక్క మారు వచ్చేది ఈ అభ్యర్ధన.
ఆవిడ బెజవాడలో ఓ స్కూలు టీచరు. రేడియోలో నా సీనియర్ సహోద్యోగికి దగ్గరి చుట్టం. ప్రతియేటా ఏప్రిల్ పందొమ్మిది సాయంత్రానికల్లా హైదరాబాదు చేరుకునేవారు. ఇరవయ్యవ తేదీ చంద్రబాబు పుట్టినరోజున ఆయన్ని కలిసి శుభాకాంక్షలు తెలిపి వెంటనే బస్సెక్కి బెజవాడ వెళ్ళిపోయేవారు.
పుట్టిన రోజున వీ ఐ పీలను కలిసి శుభాకాంక్షలు తెలిపే అలవాటు నాకు లేదు. కానీ ఆవిడ పుణ్యమా అని నేను వెంటబెట్టుకు వెళ్లి పనిలో పనిగా శుభాకాంక్షలు చెప్పేవాడిని.
అధికారంలో ఉన్నవారిని కలవడానికి ఉబలాట పడేవాళ్ళు చాలామంది వుంటారు. కానీ ఈవిడ మనస్తత్వం నాకే ఆశ్చర్యమనిపించేది. చంద్రబాబునాయుడు అధికారం కోల్పోయి ప్రతిపక్షంలో వున్నప్పుడు కూడా ఆవిడ క్రమం తప్పకుండా హైదరాబాదు వచ్చి శుభాకాంక్షలు తెలిపేది. నాకు తెలిసి ఇంతకూ మినహా ఆవిడ ఏనాడూ కూడా ఒక కోరిక కోరడం కానీ, ఆయనతో ఒక ఫోటో తీయించమని అడగడం కానీ చేసేవారు కాదు. నిష్కళంకమైన అభిమానానికి ఆవిడ ప్రతీక.
అభిమానం అంటే చొక్కాలు చించుకోవడం, పోస్టర్లపై పేడ కొట్టడం, తమ వ్యాఖ్యలతో ఇతరుల గోడలను నానా అంకచండాలం చేయడం ఎంతమాత్రం కాదు.
చివర్లో ఒక హితవాక్యం.
గతంలో ఆయన్ని అభిమానించినవారు, చంద్రబాబులో ఒక చాణక్యుడిని చూసి దగ్గరయ్యారు. ఇప్పుడు రాజకీయ చాణక్యం మాత్రమే కనబడుతూ వుండడం వల్ల దూరం జరిగారు.



19, ఏప్రిల్ 2020, ఆదివారం

కధలు రాయడం ఎలా!

‘నేను పుట్టడానికి కొన్ని నెలల ముందు నుండే నన్ను మట్టుబెట్టడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఆ దుర్మార్గానికి పూనుకుంది కూడా నా కన్నతల్లే కావడం విధి విచిత్రం’
‘కధలెలా రాయాలి’ అని కొత్త రచయితలకు మార్గ నిర్దేశం చేస్తూ కీర్తిశేషులు ఆరుద్ర రాసిన వ్యాసం ఈ విధంగా మొదలవుతుంది. కధ ఎత్తుగడ ఎలావుండాలి, తొలి వాక్యంతోనే పాఠకులను యెలా ఆకట్టుకోవాలి అనే అంశానికి ఉదాహరణగా ఆయన ఈ రెండు వాక్యాలను ఉటంకించారు.
పుట్టడానికి ముందే చంపే ప్రయత్నం అంటే ‘అబార్షన్’ అనుకోవాలి. తల్లే దానికి పూనుకున్నదంటే ఆమెకు పెళ్లి కాకుండానే గర్భం వచ్చిందని భావం. ఆ క్రమంలో ప్రాణాలు కోల్పోవాల్సిన పాపే ఈ మాటలు చెబుతోందంటే అబార్షన్ విఫలమయిందని అర్ధం. రెండు చిన్న వాక్యాలలో ఇంత కధను ఇమడ్చగలిగితే ఇక ఆ కధ పట్ల పాఠకుల ఆసక్తి అపరిమితంగా పెరిగిపోయే అవకాశం కూడా అంతే వుంటుంది. ఏమంటారు?

18, ఏప్రిల్ 2020, శనివారం

రజ్జుసర్ప భ్రాంతి – భండారు శ్రీనివాసరావు

తాడును చూసి పాము అని భ్రమించడం వల్ల చిక్కేమీ వుండదు కానీ పామును తాడు అనుకుని పట్టుకుంటేనే ప్రమాదం.
దేవరకొండ ప్రసాద్ ఆయన ఫేస్ బుక్ లో స్నేహితుడు మాత్రమే కాదు, విజయవాడ సీవీఆర్ స్కూల్లో క్లాస్ మేట్ కూడా. నాలాగే పదవీవిరమణ అనంతరం విశ్రాంత జీవనం గడుపుతూ, ఫేస్ బుక్ లో తన పోస్టింగులతో మంచి స్నేహబృందాన్ని తయారు చేసుకున్నారు. చేసింది బ్యాంకు ఉద్యోగం. అయినా సమకాలీన సమస్యలపై తనదైన రీతిలో స్పందిస్తుంటారు. వీరి తమ్ముడు దేవరకొండ మురళి కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు నా చిన్ననాటి స్నేహితుడు.
ఈ ప్రసాద్ దేవరకొండ ఈ రోజు మధ్యాన్నం రెండున్నర ప్రాంతంలో ఒక పోస్ట్ పెట్టారు. అదేమిటంటే:
“బీజేపీ లీడర్ శ్రీ విష్ణువర్ధన్ రెడ్డిగారిని AP పోలీసులు హైద్రాబాద్ లో అరెస్ట్ చేసారు. ఎందుకు చేసారో తెలియదు. అయన పాపం చాలాసార్లు రాష్ట్ర ప్రభుత్వం ఇంకా సీఎం గారికి మద్దతుగా TV డిబేట్లలో మద్దతుగా మాట్లాడేవాడు. అలాగే సోము వీర్రాజుగారు, విష్ణు కుమార్రాజుగారు, కూడా మంచి మద్దతుదారులు. GVL గారయితే సీఎం గారికి ఏ చిన్నసమస్య వొచ్చిన AP లో వాలిపోయి TV ల్లో మద్దతుగా మాట్లాడేవారు. రాజధాని మార్పుకి మద్దతు ప్రకటించారు. CM గారు ఇవి దృష్టిలో ఉంచుకుని విష్ణువర్ధన్రెడ్డి గారిని విడుదల చేయగలరని ఆశిస్తున్నాను”
నాకు చాలా ఆశ్చర్యం వేసింది.
విష్ణువర్ధన రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలో ప్రముఖుడు. ఆయనకు కేంద్రంలో డిప్యూటి మంత్రి హోదా కలిగిన నెహ్రూ యువక కేంద్రం ఉపాధ్యక్ష పదవి వుంది. అలాంటి వ్యక్తిని ఆంధ్రప్రదేశ్ పోలీసులు వచ్చి హైదరాబాదులో అరెస్టు చేయడం ఏమిటి అని.
విష్ణువర్ధనరెడ్డి గారికి ఫోన్ మెసేజ్ పెట్టాను. ఆయన తిరిగి కాల్ చేశారు. విషయం చెప్పి వివరణ అడిగితే ఆయన చిన్నగా నవ్వారు.
‘విష్ణువర్ధన రెడ్డి అరెస్టు నిజమే. కానీ ఆ విష్ణువర్ధనరెడ్డిని నేను కాదు’ అంటూ విషయం చెప్పుకొచ్చారు.
మెదక్ జిల్లాకు చెందిన ఒక విష్ణువర్ధన రెడ్డి మాజీ పైలట్. కాణిపాకం దేవాలయంలోకి చెప్పులతో జనాన్ని అనుమతిస్తున్నారని ఒక సెల్ఫీవీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.
అయితే ఆయన పొరబాటు పడి అతిగా స్పందించారు. కాణిపాకం దేవాలయానికి చెందిన కొన్ని గదుల్లో కరొనా క్వారంటైన్ నడుపుతున్నారు. ఆయన కాణిపాకం దేవాలయంలోనే అదంతా జరుగుతోందని అర్ధం వచ్చేట్టు వీడియో పోస్ట్ చేసారు. దీనిపై ఏపీ పోలీసులు స్పందించి ఆయన్ని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. మరో విషయం ఏమిటంటే కరోనా లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుంచి బీజేవైఎం అద్యక్షులు రెడ్డి గారు అనంతపురంలోనే వుండిపోయారు.
ఇద్దరి పేర్లు ఒకటే కనుక ప్రసాద్ పొరపడి ఉండవచ్చు. కానీ ఆయన పోస్టు చదివిన వారికి వేరే భావన కూడా కలుగుతుంది. అక్కడ అరెస్టు కంటే ఏపీ ప్రభుత్వం పై తనకున్న వైమనస్య భావమే అందులో ద్యోతక మవుతుంది. అంతేకాకుండా ఏపీ బీజేపీ నాయకుల్లో కొందరి పేర్లను ఉదహరిస్తూ వారంతా జగన్ అనుకూలురు అనే అభిప్రాయం వచ్చేలా ఆ పోస్ట్ వుంది.
నిజానికి దీనిపై ఇంత వివరణ అవసరం లేదు. కానీ ఇందులో ఇన్వాల్వ్ అయింది నా క్లాస్మేట్. కాబట్టి ఇంతగా రాయాల్సి వచ్చింది.
రాజకీయ పరిస్తితులు ఉద్రిక్తంగా వున్నప్పుడు ప్రతిదీ వివాదాస్పదమే అవుతుంది. పెళ్లి పుస్తకం సినిమాలో ముళ్ళపూడి వారన్నట్టు, అపార్ధాలు ముసురుకున్నప్పుడు సీతా అన్నా బూతుగా వినిపిస్తుంది. అందుకే జాగ్రత్త అవసరం. నాకు ఇలాంటి వార్తలు తెలిసినా తొందరపడి పోస్ట్ చేయను. నా సోర్సుల ద్వారా నిర్ధారించుకుంటాను. ఈ వెసులుబాటు అందరికీ ఉండకపోవచ్చు. అటువంటప్పుడు తెలిసిన వాళ్ళను సంప్రదించాలి. ఈ లోగా కొంపలు మునిగేది ఏమీ వుండదు. రాజకీయ పార్టీల వాళ్ళంటే అది వేరే సంగతి. చిక్కుల్లో చిక్కుకోవడం వారికి తెలుసు. బయటకు రావడం వారికి తెలుసు.
ఈ విషయం నా స్నేహబృందంలోని ప్రసాద్ వంటి వాళ్ళు తెలుసుకోవాలి.

రోశయ్య గారితో కాసేపు – భండారు శ్రీనివాసరావు


(ఎటో వెళ్ళిపోయింది మనసు)
పాత విషయాలు కదా తేదీలు సంవత్సరాలు సరిగా గుర్తుండడం లేదు.
తిరుపతికి దగ్గరలో, మరీ అంత దగ్గర కాదు, శ్రీ సిటీ అనే ఒక సెజ్ రూపు దిద్దుకుంటోంది. ఆ సంస్థ పీఆర్వో కి మాకు ఆ సిటీలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు చూపించాలనే సత్సంకల్పం కలిగింది. జర్నలిస్టు శంకర్, జ్వాలా నేను. తిరుపతిలో స్వామి దర్శనం అనే మాట మమ్మల్ని మరో మాట మాట్లాడ నివ్వలేదు. హైదరాబాదు నుంచి విమానంలో చెన్నై వెళ్లి, అక్కడి నుంచి శ్రీ సిటీ కారులో అక్కడికి చేరడం మా ప్రోగ్రాం.
సుమారు ఏడుగంటల ప్రాంతంలో చెన్నై ఎయిర్ పోర్ట్ లో దిగగానే జ్వాలా రాజ్ భవన్ కు ఫోన్ చేసి తుల్జానంద్ సింగ్ తో మాట్లాడాడు. ఆయన వెంటనే రాజ్ భవన్ కు ఆహ్వానించారు. ఒక రకంగా చెప్పాలంటే చెన్నైలో దిగేంతవరకు ఈ రాజ్ భవన్ సందర్శన కార్యక్రమం లేదు. ఏ వూరు పోయినా ఆ వూళ్ళో ఎవరెవరు తెలిసిన వాళ్ళు వున్నారో వాళ్లకి ఫోను చేయడం కాని, వీలయితే కలిసిరావడం కానీ జ్వాలా పీఆర్ లో ఒక భాగం.
తుల్జానంద్ రండి రండి అంటూ ఆహ్వానం పలకడం, మేము ప్రయాణిస్తున్న వాహనం రూటు మార్చుకుని రాజ్ భవన్ లోకి దూసుకుపోవడం జరిగింది. లోపలకు వెళ్ళగానే అప్పుడే వాకింగ్ నుంచి వస్తూ గవర్నర్ రోశయ్యగారు కనబడ్డారు. అందర్నీ పేరు పేరునా పేరుతొ పలకరించి, ఎలావున్నారు, ఎప్పుడొచ్చారు ఎన్నాళ్ళు వుంటారు అని కుశల ప్రశ్నలు వేసారు. వెంటనే వెళ్ళాలని చెప్పాం. కుర్చీలు తెప్పించి బయట లాన్ లో వేయించారు. రాజ్ భవన్ కదా మర్యాదలు మామూలే. టీ తాగుతూ పిచ్చాపాటీ. ఒకరకంగా గత కాలపు ముచ్చట్లే. పాత కబుర్లు చెబితే రోశయ్యగారే చెప్పాలి. ఆయన ధారణ శక్తి అసాధారణం. ఎప్పటెప్పటివో సంగతులు చెప్పారు. తెనాలి, గుంటూరు, విలేకరులను ఆయన పేర్లతో సహా గుర్తు పెట్టుకోవడం గమనించి ముచ్చటేసింది.
పనిలోపనిగా చెన్నై రాజ్ భవన్ ముచ్చట్లు. ఒకప్పుడు అది సుమారు పదమూడువందల ఎకరాల్లో వుండేది. చాలావరకు దట్టమైన అడవి. మేము కూర్చున్న చోటుకు దగ్గర్లో కొన్ని హరిణాలు తచ్చాడుతూ కనిపించాయి. ప్రస్తుత రాజ భవన్ విస్తీర్ణం బాగా కుదించుకు పోయినా, ఇంకా వంద ఎకరాల పైమాటే. రాజ్ భవన్ లో విశాలమైన ప్రాసాదాలు గవర్నర్ నివాసంకోసం వున్నప్పటికీ, రోశయ్య గారు వాటి జోలికి పోకుండా పక్కనే వున్న ఓ చిన్న గెస్ట్ హౌస్ లో మకాం చేస్తున్నారు.
'వుండేది నేనూ నా భార్య ఇద్దరమే. మరీ పెద్ద ఇళ్ళల్లో అయితే ఒకరినొకరం వెతుక్కోవాలి.'
చిన్న భవనంలో వుంటున్నందుకు రోశయ్యగారు ఇచ్చుకున్న సంజాయిషీ అది.
కాసేపు కబుర్లు చెప్పుకుని, తుల్జానంద్ సింగ్ ఫోటోలు తీయగా తీయించుకుని, రోశయ్య గారికి నమస్కారాలు, ధన్యవాదాలు చెప్పి మళ్ళీ రోడ్డున పడ్డాము. దోవలో శరవణ భవన్ కనిపిస్తే టిఫిన్లు, కాఫీల పనిపూర్తి చేసుకుంటుంటే జ్వాలా ఎవరితోనో తెలుగులో ఫోన్లో మాట్లాడుతూ కన్పించాడు. దాంతో మరో స్టాప్ అనివార్యం అని తేలిపోయింది.
అప్పుడీ గూగుల్ మ్యాపులు లేవు. దోవలో దారి కనుక్కుంటూ కువైట్ శర్మ గారింటికి వెళ్ళాము. నిజానికి ఆయన బాంబే శర్మగారు. షిప్పింగ్ కార్పొరేషన్ లో పనిచేసేవారు. అప్పుడెప్పుడో ఏదో పని మీద బాంబే వెడితే (అప్పటికి ముంబై కాలేదు) ఆయన జ్వాలని, నన్నూ ఒకరోజంతా షిప్పులో అతిధులుగా మర్యాదలు చేశారు. బీరు సీసాల్లో కాకుండా టిన్నుల్లో దొరుకుతుందన్న లోకజ్ఞానం అప్పుడే కలిగింది. . ప్రపంచంలో దొరికే అరుదైన స్కాచ్ విస్కీలు అన్నీ ఆ షిప్ బార్లో వున్నాయి.
ఆ తర్వాత శర్మ గారు కువైట్ వెళ్ళిపోయారు. అక్కడ ఉండగానే యుద్ధం వచ్చి ఆ దేశంలో ఉన్న భారతీయులు అందరూ కట్టుబట్టలతో స్వదేశం చేరుకోవాల్సి వచ్చింది. అలా కాందిశీకులుగా దేశం చేరుకున్నవారిలో శర్మ గారి కుటుంబం కూడా వుంది. పిల్లలు పెరిగి పెద్దయి, పెళ్ళిళ్ళూ పేరంటాలు అయిన తర్వాత ముందు ఢిల్లీలో, తర్వాత చెన్నైలో సెటిల్ అయ్యారు.
ఆయన ఇంటికి వెళ్ళే సరికి శర్మ గారికి ఒంట్లోబాగాలేదని తెలిసింది. పడక పక్కన ఆక్సిజన్ సిలిండరు వగైరా. మమ్మల్ని చూడగానే ఒంటిమీద అంటించిన తీగెల్ని సినిమాలో హీరోలా పీకి పారేసి డ్రాయింగు రూములో మా దగ్గర కూర్చుని హుషారుగా కబుర్లు మొదలు పెట్టారు. శర్మ గారి భార్య కూడా సంతోష పడింది, ఆయనలో మార్పు చూసి.
తర్వాత అడంగు శ్రీ సిటీ. కొన్ని వేల ఎకరాల్లో విస్తరించి వుంది. అక్కడ తయారయ్యే వస్తువులు అన్నీ ఎగుమతికి ఉద్దేశించినవి కాబట్టి అక్కడ కష్టమ్స్ అధికారుల అనుమతి లేకుండా లోపలకు బయటకు రాకపోకలు నిషిద్ధం. అయితే ముందస్తు ఏర్పాట్ల కారణంగా మా వాహనానికి గేట్లు బార్లా తెరుచుకున్నాయి. గెస్ట్ హౌస్ లో దిగి కాసేపు విశ్రాంతి. సెజ్ ఉన్నతాధికారులతో ఇష్టాగోష్టి మాటలు. ఆ తర్వాత మమ్మల్ని సెజ్ లోని వివిధ ఉత్పత్తి విభాగాలకు తీసుకు వెళ్ళారు. విశాలమైన రోడ్లు. చల్లటి నీడనిస్తూ బాగా పెరిగిన చెట్లు. కాలిబాటలు. వాటికి కూతవేటు దూరంలో పెద్ద పెద్ద భవనాలు. ఫాక్టరీ షెడ్లు.
మెత్తటి దూది కూరిన బొమ్మలు తయారు చేసే ఫాక్టరీకి వెళ్ళాము.
నా చిన్నప్పుడు మా నాన్నగారు చెన్నపట్నం నుండి ఓ దూది (కూరిన) చిన్న కుక్క బొమ్మ తెచ్చారు. యెంత ముద్దొచ్చేదో!
పెరిగి పెద్దయి మాస్కోలో ఉద్యోగం చేసే రోజుల్లో అక్కడ బొమ్మలే బొమ్మలు. సోఫాలో కూర్చోబెడితే మనకంటే పెద్దగా కనబడే భారీ సైజు ఎలుగుబంటి బొమ్మ నాకు ప్రాణసమానంగా వుండేది. అదేమిటో ఏండ్లు మీద పడుతున్నా బొమ్మలన్నా, చందమామ పత్రిక అన్నా మోజు రోజు రోజుకూ పెరిగిపోతూనే వుంది.
శ్రీ సిటీలో వున్న బొమ్మల ఫాక్టరీ చిన్న పిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేసే ఫాక్టరీ అయినా చాలా పెద్దగానే వుంది. చైనా వాళ్ళది కాబోలు. (Pals Plush Ltd., China). ఇక్కడి వ్యవహారాలను శ్రీమతి సీమా నెహ్ర పర్యవేక్షిస్తున్నారు. వెంట వుండి అందులోని విభాగాలను అన్నీ చూపించారు. ఎగుమతుల వ్యవహారం కాబట్టి నాణ్యతలో రాజీపడే ప్రసక్తి వుండదు. పిల్లల బొమ్మలు కాబట్టి వాటితో ఆడుకునే చిన్నారులకు ఎలాటి అనారోగ్యసమస్యలు, ప్రమాదాలు కలగకుండా అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయాల్లో ఏమాత్రం తభావతు వచ్చినా ఇంతే సంగతులు. మొత్తం సరుకు తిప్పి పంపిచేస్తారు. ఇన్ని ప్రమాణాలు పాటించే ఈ యూనిట్ లో పనిచేసేవాళ్ళు చాలామంది ఆ చుట్టు పక్కల వుండే జనాభాలో అరకొర చదువులు చదివిన వారే కావడం గమనార్హం. వారికి సాంకేతిక పరమైన శిక్షణ ఉచితంగా ఇచ్చి ఉపాధులు కూడా అక్కడే కల్పిస్తున్నారు.