17, ఏప్రిల్ 2020, శుక్రవారం

వృత్తి, ప్రవృత్తి


(ఎటో వెళ్లిపోయింది మనసు)  
‘వైద్యం నా వృత్తి, రచనావ్యాసంగం నా ప్రవృత్తి’ అంటుంటారు రెండింటిలో చేయి తిరిగిన వాళ్ళు.
చిన్నప్పటి నుంచి నాకు తెలుగంటే అవ్యాజానురాగం. బహుశా వేరే ఇతర భాషలు ఒంటపట్టక పోవడం దీనికి కారణమేమో! మాస్కో రేడియోలో ఉద్యోగం చేసే రోజుల్లో నాకు రష్యన్ భాష నేర్పడానికి ఒక టీచరమ్మను పెట్టారు. ఆవిడ వారానికి మూడు సార్లు మా ఇంటికి వచ్చి రష్యన్ పాఠాలు చెప్పేది. చివరికి జరిగిందేనిటంటే నాకు రష్యన్ ఒక్క ముక్క అంటకపోగా ఆవిడ మాత్రం ఎంచక్కా తెలుగు నేర్చుకుని చక్కాపోయింది. సరే! మా ఇద్దరు పిల్లలు అక్కడే ఇండియన్ ఎంబసీ వారి స్కూల్లో చదువుకున్నారు. మాస్కో మొత్తంలో అదొక్కటే  ఇంగ్లీషు మీడియం స్కూలు. క్లాసులో వుండేది పదిహేను, ఇరవై మంది విద్యార్ధులే అయినా ఒకడు అమెరికా, మరొకడు ఇంగ్లాండ్, ఇంకొకడు ఆఫ్రికా, ఇండోనేషియా ఇలా  ఐక్యరాజ్య సమితి భద్రతా సమితిలా వుండేది. మిగిలిన వాళ్ళు మన దేశానికి చెందిన వివిధ రాష్ట్రాల వాళ్ళు, వివిధ భాషల వాళ్ళు.  ఇలా మొత్తం ఇంటర్నేషనల్. అయితే వీళ్ళని కలిపి వుంచేది దండలో దారంలా ఇంగ్లీషు భాష ఒక్కటే.
ఆ మాస్కో అధ్యాయం ముగిసి ఇండియాకు తిరిగొచ్చాము. పెద్ద వాడు ఇంజినీరింగు పాసయ్యాడు. చిన్నవాడు డిగ్రీ. ఇంజినీరింగు అయిన తర్వాత ఉద్యోగాల వేట. ఆ రోజుల్లో పెద్ద కంపెనీల వాళ్ళు  ఎక్కడెక్కడినుంచో ఫోను ఇంటర్వ్యూలు చేసి అభ్యర్ధుల్ని  వడపోసేవాళ్ళు. చివరికి పర్సనల్  ఇంటర్వ్యూదాకా వెడితే ఏముంది అక్కడ అందరూ ఐఐటీవాళ్ళు పోటీ.  అక్కడ మా వాడికి మాస్కో ఇంగ్లీష్ అక్కరకు వచ్చి సెలక్టు అయి అమెరికాలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. రెండోవాడు  కేవలం డిగ్రీ అయినా ఇంగ్లీష్ ప్రావీణ్యం వాడిని ఒక అంతర్జాతీయ సంస్థలో పెద్ద ఉద్యోగిని చేసింది.
నాది ప్రవృత్తి, వాళ్ళది వృత్తి.  
అలా అడ్జస్ట్ అయిపోయి, ‘తెలుగదేలయన్న’ అని పద్యాలు పాడుకుంటూ  నా తెలుగు అభిమానాన్ని నాలోనే దాచుకున్నాను.  

16, ఏప్రిల్ 2020, గురువారం

సర్కారీ రేడియోలో ఉన్న స్వేచ్చ ఈనాటి మీడియాకు వున్నదా!


(ఎటో వెళ్ళిపోయింది మనసు)
సుమారు  మూడు దశాబ్దాలు హైదరాబాదు ఆకాశవాణి కేంద్రం ప్రాంతీయ వార్తావిభాగంలో పనిచేసిన అనుభవం నాకుంది. ఇన్నేళ్ళ ఉద్యోగ పర్వంలో ఏనాడు పై అధికారులెవ్వరూ, ఆ మాటకు వస్తే కేంద్రప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖ మంత్రులుగా పనిచేసిన తెలుగువారు కూడా  'ఈ వార్త ఇలా ఇవ్వండి, ఆ వార్త అలా యెందుకు ఇచ్చారు' అని అడిగిన జ్ఞాపకం లేదు. ఆ పాటి ఫంక్షనల్ అటానమీ (విధి నిర్వహణా స్వేచ్ఛ) ని నాతోపాటు పత్రికల్లో పనిచేసిన సాటి జర్నలిష్టు మిత్రులు  అనుభవించారని అనుకోవడం లేదు. అయినా కానీ, సర్కారీ వార్తలు రాసే సర్కారీ జర్నలిష్ట్ అనే ముద్ర నుంచి తప్పించుకోలేకపోవడం విచిత్రం. బహుశా, పాలక పక్షాలకు ఎలాటి రాతలు, ఎలాటి వార్తలు రుచిస్తాయో అవగతం చేసుకుని అందుకు తగ్గట్టుగానే వార్తలు వండి వడ్డించి వుంటామని అని అనేవాళ్ళు కూడా లేకపోలేదు.
రేడియో వార్తల సేకరణ, కూర్పు, ప్రసారాల్లో 'విధి నిర్వహణా స్వేచ్ఛ' గురించి సోదాహరణంగా చెప్పుకోవడం సముచితంగా వుంటుంది.   
నర్రావుల సుబ్బారావు గారు. మోచేతుల కిందకి చొక్కా, పంచెకట్టుతో, చేతిలో చుట్టతో  అచ్చం ఒక రైతు మాదిరిగా కనిపించేవారు. ఆయన్ని చూడగానే హైదరాబాదు ఆకాశవాణి ప్రాంతీయ వార్తావిభాగంలో న్యూస్ ఎడిటర్ అని ఎవరూ అనుకోరు. ఆకారంలోనే కాదు, నిజంగానే ఆయన రైతు పక్షపాతి. ఆ నైజం వార్తల్లో కూడా ప్రతిఫలించేది. వర్షాలు కురవక పలానా జిల్లాలో పైర్లు ఎండిపోతున్నాయని వార్తల్లో వివరాలతో సహా ప్రసారం చేసేవారు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రి చెన్నారెడ్డి గారు. ఆయన మాటకు ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో ఎదురులేదు. అయినా సుబ్బారావు గారు తరువాత అనేక సంవత్సరాలు రేడియోలో కొనసాగారు.
ఒకసారి ముఖ్యమంత్రి విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుబ్బారావు గారు లేచి పలానా ప్రాంతంలో పంటలు ఎండి పోతున్నాయని, అధికారులు చేతులు ముడుచుకుని కూర్చున్నారని అన్నారు ఆయన తరహాలో. చెన్నారెడ్డి గారి తరహా కూడా విలేకరులకు తెలుసు. ఆ ప్రశ్న ఆయనకు సుతరామూ నచ్చలేదు. అది ఆయన మాటల్లో కనబడింది.
“చూడు సుబ్బారావ్! నువ్వు విలేకరిగా ఈ ప్రశ్న వేస్తే జవాబు చెబుతాను. రైతుల ప్రతినిధిగా వేస్తె ఇక్కడ సమాధానం   చెప్పాల్సిన అవసరం నాకు  లేదు”
ఇరువురూ హుందాగా వ్యవహరించడంతో రసాభాస కాకుండా అది అక్కడకి  ముగిసిపోయింది.
రేడియోమీద కానీ, రేడియో వార్తలమీద కానీ సర్కారువారికి పట్టో, పెత్తనమో వుంటుందని ఆ రోజుల్లో ఓ అభిప్రాయం ప్రచారంలో వుండేది. ఇలాటి ఉదంతాలు విన్నప్పుడు వాటికి సరైన ప్రాతిపదిక లేదన్న వాస్తవం బోధపడుతుంది.
నా ఈడువాడే, కొంచెం చిన్నవాడు కూడా ఓ జర్నలిస్టు స్నేహితుడు ఉండేవాడు. ప్రముఖ పత్రికలో పనిచేసేవాడు. నన్ను ఎప్పుడూ సర్కారీ జర్నలిస్ట్ అని ఎద్దేవా చేస్తుండేవాడు. నేనొకసారి అతడితో అన్నాను.
‘గంటలో ప్రాంతీయ వార్తలు వస్తాయి. నువ్వు ఒక వార్త ఇవ్వు ఏదైనా సరే. అది రేడియోకి ఇస్తాను. అలాగే నేను నీకొక వార్త చెబుతాను. అది రేపటి నీ పత్రికలో వచ్చేట్టు చూడు. ఆ తర్వాత జర్నలిస్టుల  స్వేచ్చ గురించి తీరిగ్గా  మాట్లాడుకుందాము’
అతడు చెప్పిన వార్త రేడియోలో వచ్చింది. నేను చెప్పిన వార్త అతడి పేపర్లో రాలేదని వేరే చెప్పక్కరలేదు. మరునాడే కాదు, ఎప్పటికీ రాదని అతడికీ తెలుసు.
ఆ తర్వాత అతడెప్పుడూ సర్కారీ జర్నలిస్టు అనే పదం నా వద్ద తేలేదు.   

మహాభారతంలో కూటనీతి – భండారు శ్రీనివాసరావు


(ఎటో వెళ్ళిపోయింది మనసు)
పేరుకు తగ్గట్టే మంచి రాజుకు ఉండాల్సిన  సుగుణాలు అన్నీ కురుసార్వభౌముడు సుయోధనుడికి  వున్నాయి.  అయితే, అతడి దురదృష్టం,  అసూయ అనే దుర్గుణం ఒక్కటే అతగాడి  వినాశనానికి హేతువు అయింది.
దాయాది ధర్మరాజు నిర్వహించిన రాజసూయ యాగానికి వెళ్లి వచ్చిన తర్వాత అతడిలో ఈ మత్సరం మరింతగా  వెర్రి తలలు వేసింది. లక్కఇంటిని తగలబెట్టి పంచపాండవులను హతమార్చాలనే పన్నాగం బెడిసి కొట్టడంతో దుర్యోధనుడిలోని అసూయాద్వేషాలకు అంతం లేకుండా పోయింది.
ఈ నేపధ్యంలో కౌరవ సలహాదారులలో ఒకడయిన కణికుడు దుర్యోధనుడికి ఇచ్చిన సలహాలు కూటనీతి పేరిట ప్రాచుర్యం పొందాయి. ప్రత్యర్ధుల పీచమణచడానికి ఉద్దేశించిన ఈ కుటిల పన్నాగాలకు సంబంధించి   మహాభారతంలో ఏకంగా ఒక అధ్యాయమే వుంది. కాకతాళీయమో ఏమో తెలియదు కానీ ఈనాటి రాజకీయులు కణికుడు బోధించిన ఆ కూటనీతినే పాటిస్తున్నట్టు అనిపిస్తుంది.
ఆ కూటనీతి ప్రకారం రాజు అనేవాడు శత్రురాజుపై హమేషా ఓ కన్నేసి ఉంచాలి. తనకు నమ్మకస్తులైన సాటి రాజులను వైరి రాజుకు అనుకూలంగా మాట్లాడేటట్టు చేయాలి.
దేశ సంచారం చేసే కొంతమంది పండిత శ్రేష్టులను మచ్చిక చేసుకుని వారి ద్వారా ఇరుగుపొరుగు రాజ్యాల్లో తన మంచితనం గురించి, తన సామర్ధ్యం గురించి తన సుపరిపాలన గురించి సానుకూల ప్రచారం ప్రజాబాహుల్యంలోకి చొచ్చుకు పోయేలా చేయాలి.
విశ్వాసపాత్రులయిన తన సొంత మనుషులను  కొంతకాలంపాటు శత్రు దేశపు రాజు కొలువులో చేర్పించి వారి ద్వారా అతడి లోగుట్లను, బలహీనతలను గురించిన సమాచారం తనకు ఎప్పటికప్పుడు అందేలా ఏర్పాటు చేసుకోవాలి. వాళ్ళు వైరి ప్రభువుల ఎదుట తనను తూలనాడుతూ ఆ రాజు నమ్మకాన్ని చూరగొనేలా చూసుకోవాలి.
ఇలా అనేకానేక బోధలు ఈ కూటనీతిలో వున్నాయి.
అవన్నీ ఆ గాంధారిసుతుడు ఎన్ని ఏమేరకు ఆచరించాడో లేదో తెలియదు కానీ మహాభారతంలో పేర్కొన్న ఆ కూటనీతి శాస్త్రాన్ని ఈనాటి రాజకీయ నాయకులు పుణికి పుచ్చుకుని అక్షరం పొల్లు పోకుండా ఆచరణలో పెడుతున్నారు.
‘ఎందుకైనా మంచిది అతడిపై ఓ కన్నేసి ఉంచు’ అంటుంది సినిమాలో ఓ దుష్ట పాత్ర. ‘ఒక కన్నేమిటి రెండు కళ్ళూ అతడిమీదనే’ అంటుంది అతడి సహాయక దుష్టపాత్ర.
ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు అసెంబ్లీ లాబీ విశేషాలు సేకరించే విలేకరులు కొందరు లాబీలో ఒక చోట చేరి ఆ వైపుగా వచ్చిన ఒక మంత్రితో పిచ్చాపాటీ మాటలు కలిపారు. మూడు దశాబ్దాల అనుభవం వున్న ఓ సీనియర్ పాత్రికేయుడు హాస్యోక్తిగా ఆయనపై ఓ వాక్బాణం విసిరి, అది విని అక్కడ ఉన్న  అందరూ పెద్దగా నవ్వుతుండగా మెల్లగా నడుచుకుంటూ దగ్గరలో వున్న ముఖ్యమంత్రి ఛాంబర్లోకి వెళ్ళాడు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి.  ఆ విలేకరిని  చూస్తూనే ముఖ్యమంత్రి ఒక చిరునవ్వు నవ్వి, ‘ఏమిటి మా మంత్రిని అలా  ఆట పట్టిస్తున్నావ్’ అని అడిగారు. జరిగి  నిమిషాలు కూడా  గడవక ముందే ఈ విషయం సిఎం చెవులకు ఎవరు చేరవేసారా అని ఆశ్చర్య పోవడం ఆ విలేకరి వంతయింది.
అలా పనిచేస్తాయి ప్రభుత్వ నిఘా వర్గాలు. టెర్రరిస్టులు, అసాంఘిక శక్తుల కదలికలు కనిపెట్టి వారి ఆనుపానులు సంబంధిత అధికార వర్గాలకు అందచేయడం వారి ప్రాధమిక బాధ్యత. కానీ వాళ్ళు ఎక్కువగా దృష్టి సారించేది ప్రత్యర్ధి పార్టీల నాయకుల మీద. నిఘా విభాగంలో పనిచేసిన అధికారే మరో విశేషం ఓ సందర్భంలో చెప్పారు. తన సొంత పార్టీ  నాయకుల గురించిన సమాచారం మీదే ఎక్కువమంది ముఖ్యమంత్రులు ఆసక్తి చూపేవారట.
అలా మహాభారత కాలంనాటి ఆ కూటనీతి నేటి భారత కాలంలో ఇలా వూడలు దిగి విస్తరిస్తోంది.   

15, ఏప్రిల్ 2020, బుధవారం

మబ్బుల్లో రాజకీయాలు

(ఎటో వెళ్ళిపోయింది మనసు)
టీవీ చర్చల్లో పాల్గొనే విశ్లేషకులకు వివరంగా మాట్లాడే అవకాశం అరుదుగా లభిస్తుందనేది స్వానుభవం.
‘నువ్వీరోజు గంట చర్చలో మాట్లాడింది నాలుగున్నర నిమిషాలు మాత్రమే’ అని ఒకసారి జ్వాలా లెక్క కట్టి మరీ చెప్పాడు. ఇక ఉండబట్టలేక ఓ టీవీ యాంకరిణితో అన్నాను కూడా, ‘మాట్లాడే చాన్స్ లేకపోతే పీడా పాయె. కనీసం తెరమీద అన్నా కాసేపు కనబడేట్టు చూడండి. మా ఆవిడ అనుమానస్తురాలు కాదు కానీ ప్రతిసారీ ఇలా టీవీ చర్చల పేరుతొ ఇంకెక్కడో తిరిగొస్తున్నానని ఏనాటికయినా అనుమానించే ప్రమాదం లేకపోనూ లేదు’.
నా మాటలో శ్లేష ఆ అమ్మడికి అర్ధమయిందో లేదో నాకు తెలియదు. అంతకంటే గట్టిగా చెప్పడం నాకు రాదు.
ఒక రోజు ఉదయం టీవీ 5 ఛానల్లో ఎక్జిక్యూటివ్ ఎడిటర్ (ఇప్పుడు ఎడిటర్ అయ్యారు) విజయ్ నారాయణ్ న్యూస్ స్కాన్ చర్చాకార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం వారాలబ్బాయిగా నా హాజరీ అక్కడ. అలా అయిదారేళ్ళు క్రమం తప్పకుండా వెళ్లి వుంటాను. విజయ్ గారికి నా మీద అవ్యాజానురాగమో ఎందుకో తెలియదు కాని ముందు నా చేతనే మాట్లాడిస్తుంటారు. తర్వాత అవకాశం ఇచ్చే ఛాన్స్ రాదు అనేమో!
‘ఏపీ రాజకీయ పరిణామాలపై మీరేమనుకుంటున్నారు?’ అనేది ఆయన అడిగిన ప్రశ్న. బహుశా ఈ ప్రశ్ననే మార్చి మార్చి అనేక డజన్ల పాటు అనేక చర్చల్లో అడిగివుంటారు. నేను పలుమార్లు నా జవాబునే తిరగేసి మరగేసి చెప్పివుంటాను.
“ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా మబ్బులు కమ్మేశాయి. వాటి చాటున దాగున్న రాజకీయ చిత్రం అస్పష్టంగా కనిపిస్తోంది. ఆకాశంలో మబ్బుల్లోకి చూస్తే వాటిలో ఒకరికి ఏనుగు ఆకారం కనిపిస్తుంది. మరికొందరికి అదే మబ్బులో మరో ఆకారం కనబడుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరికించేవారికి కూడా విభిన్నమైన చిత్రాలు కనబడుతున్నాయి. రాజకీయపు పొరలు తొలగించుకుని చూస్తే వాస్తవమైన రాజకీయ చిత్రం గోచరిస్తుంది”
ఆనాటి చర్చలో నాతోపాటు శ్రీ కుటుంబరావు (టీడీపీ, అమరావతి నుంచి), శ్రీ రఘురాం (బీజేపీ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్లో) పాల్గొన్నారు.



ఎటో వెళ్ళిపోతోంది మనసు


ఈ లాక్ డౌన్ కాలంలో అందరికీ పుష్కలంగా దొరుకుతోంది ఒక్కటే! అది ఖాళీ సమయం. ఎంత ఖర్చు చేస్తున్నా ఇంకా మిగిలిపోతోంది. కాబట్టి గత స్మృతులను నెమరు వేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం. మనసు ఎటు తిరిగితే అటు తిరుగుదాం అనిపిస్తోంది. చిన్ననాటి సంగతులు, స్కూలు,  కాలేజి జ్ఞాపకాలు, పిల్లలు, చదువులు, పెళ్ళిళ్ళు, విదేశాల్లో తిరుగుళ్ళు ఇలా ఏదిపడితే  అది గుర్తు చేసుకోవడం. అందుకోసమే ఈ రాతలు. దీనికి ఒక పద్దతి అంటూ వుండదు. ముళ్ళపూడి వారి ‘కోతికొమ్మచ్చి’ లాగా ముందుకూ, వెనక్కి, వెనక్కీ ముందుకూ. జీవితం అన్నాక కష్టాలు, సుఖాలు రెండూ వుంటాయి. కష్టాలను మనసులోనే దాచేసుకుని  ఆనంద క్షణాలను అందరితో పంచుకుంటే ఈ కరోనా హాలిడేస్ ని మరింత ఎంజాయ్ చేయగలుగుతాం.
“ఫేస్ బుక్ లో కానీ, పత్రికల్లో కానీ ఎవరు రాసినవి వాళ్ళు చదువుకోవడమే. మొహమాటానికి లైకులు కొట్టినా పూర్తి పాఠం చదివేవారు బొత్తిగా లేకుండా పోయార”ని  మితృడు  జ్వాలా నరసింహరావు ఒక పోస్టుకు కామెంటు పెట్టాడు. మొన్నమొన్నటి వరకు నాదీ ఇదే  అభిప్రాయం. ఫేస్ బుక్ లో ప్రవేశించిన చాలాకాలం వరకు నేను రాస్తూ పోయానే తప్ప ఇతరులు ఏం రాస్తున్నారనేది అంతగా పట్టించుకునేవాడిని కాదు. ఎందుకంటే ఆ రోజుల్లో నాకు వేరే వ్యాపకాలు చాలా ఉండేవి. ముప్పూటలు రోజూ ఏదో ఒక టీవీ స్టూడియోకి పోయిరావడం, నా బ్లాగుకు, పత్రికలకు వారం వారం వ్యాసాలు రాసే పనిలో తలమునకలుగా వుండడం, ఇప్పట్లా ఇంట్లో ‘ఒంటరితనం’ లేకపోవడం ఇలా అనేకానేక కారణాలు. ఇప్పుడు ఈ బాదర బందీలు లేవు. మా ఆవిడ పోయినదగ్గరి నుంచి ఐచ్చికంగా ఇవన్నీ  మానేసాను. పగలూ రాత్రీ అనే తేడా లేకుండా ఒంటరితనం నన్ను తోడుగా చేసుకుంది. దాంతో ఫేస్ బుక్ లో  ఎవరు రాస్తున్నారు, ఏమి రాస్తున్నారు అనేదానిపై ఆసక్తి పెరిగింది. ఆణిముత్యాల వంటి రచనలు కళ్ళబడ్డాయి. మెరికల్లాంటి రచయితలు పరిచయం అయ్యారు. వాళ్ళ పూర్వ రంగం చూస్తే వాళ్ళలో ఎవ్వరూ కాగితం మీద కలం పెట్టిన వారిలా లేరు. కానీ వాళ్ళ రచనల్లో వడీ, వేగం, సహజత్వం ఏ ప్రమాణాల ప్రకారం తీసుకున్నా చేయి తిరిగిన రచయితలకు   ఏమాత్రం తీసిపోవు. మరో వాస్తవం ఏమిటంటే వీళ్ళల్లో చాలామంది ఆడవాళ్ళు. ఆడవాళ్ళ ఫోటోలు పెట్టుకున్న ఆడవాళ్ళు మాత్రం కాదు. నేను ఫేస్ బుక్ లో ప్రవేశానికి ముందు ఒక నియమం పెట్టుకుని పాటిస్తూ వచ్చాను. బాగా తెలిసిన ఆడవారు అయితే తప్ప నేను లైక్ కూడా కొట్టను. కామెంట్ల జోలికి పోను. మొదట్లో అది నా అహంభావానికి చిహ్నంగా భావించినవాళ్ళూ వున్నారు. తర్వాత రోజుల్లో వాళ్ళే ఈవిషయం నాతో చెప్పారు. ఏడెనిమిది మంది మహిళలు, నలుగురయిదుగురు మగవాళ్ళు రాసినవి నేను తప్పకుండా చదువుతాను. ఫేస్ బుక్ లో సాధారణ పోస్టులకి భిన్నంగా, హాయిగా ఇంట్లోని  సంగతులు, చిన్ని చిన్ని ముచ్చట్లు చాలా ఆహ్లాదకరంగా రాస్తుంటారు. ఎవరినీ నొప్పించేవి కావు.
మరో సంగతి ఏమిటంటే వీళ్ళల్లో చాలామంది నా పోస్టులు చదివేవారిలో లేరు. నేను రాసేవి చాలావరకు రాజకీయ పరంగా వుంటాయి. బహుశా వారి అభిరుచికి తగినట్టుగా ఉండకపోవచ్చు.
అందుకే జ్వాలా అభిప్రాయంతో నేను ఏకీవభించడం లేదు. ఓ ఎనిమిది నెలలకు పూర్వం అయితే ఆయన అభిప్రాయమే నా అభిప్రాయం కూడా.     


అభిమానం అర్ణవమైతే.....ఒక పరిశీలన


రాష్ట్ర విభజనకు ముందరి నుంచి, సరిగ్గా చెప్పాలంటే జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ అధిష్టానంతో విబేధించి సొంతంగా వై.ఎస్.ఆర్.సి.పి. పేరుతొ కొత్తగా కొత్త  పార్టీ పెట్టుకున్నప్పటి నుంచి అటు చంద్రబాబును, ఇటు జగన్ మోహన రెడ్డిని వ్యక్తిగతంగా అభిమానించే అనేకమంది నాకీ ఫేస్ బుక్ లో తారసపడ్డారు. అయితే వీరందరూ వారిద్దరినీ ప్రగాఢంగా అభిమానించే వారే కాని, మూఢ౦గా  అనుసరించే వారు కాదు. ఈ నాయకులను అభిమానించడానికి వీరికి కులమూ, రాజకీయాలు కారణాలు కావు. జస్ట్. అంతే! ‘బాబు అంటే మాకు ఇష్టం, జగన్ అంటే మాకు అభిమానం’.  ఇవే వారిని కదిలిస్తే వచ్చే జవాబులు. నాకు తెలిసి ఒకే కుటుంబంలో ఇలా వీరిద్దర్నీ విడివిడిగా అభిమానించేవారు కూడా వున్నారు. 2014లో జగన్ ఓడిపోయి బాబు గెలిచినప్పుడు,2019 లో జగన్ గెలిచి బాబు ఓడిపోయినప్పుడు కూడా ఏమాత్రం తేడా రాలేదు.
‘బాబు మంచి సమర్ధకుడైన పాలకుడు. రాష్ట్రం ఆయన చేతిలో సురక్షితంగా వుంటుంది’.
‘జగన్ పాపం చిన్నవాడు, అమాయకుడు, రాజకీయాలు తెలవ్వు,  అందరూ కలిసి ఈ పిల్లవాడిని  వేధిస్తున్నారు’
ఇవీ వాళ్ళు తమ అభిమానానికి కొలమానంగా పెట్టుకున్న ప్రాతిపదికలు.
అభిమానాలు వుంటే పర్వాలేదు. దురభిమానాల స్థాయి కూడా తక్కువేమీ కాదు.
‘చంద్రబాబువి కుటిల రాజకీయాలు. నమ్మిన వారిని నట్టేట ముంచుతారు. పత్రికలను అడ్డుపెట్టుకుని పేపర్ టైగర్ మాదిరిగా జనంలో తానో పెద్ద రాజనీతిజ్ఞుడిని అని ప్రచారం చేసుకుంటూ దాన్ని తానే నమ్ముతూ ఊహాలోకంలో మునిగితేలుతూ వుంటారు’
‘జగనా! బాబోయి! పెద్ద దోపిడీ దొంగ. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్నాడు. పరిపాలన బొత్తిగా తెలవదు. ఈ రాష్ట్రాన్ని ఆ దేవుడే కాపాడాలి’     
నేను గమనించింది ఏమిటంటే ఈ అభిమానులలో ఎవ్వరికీ రాజకీయ ప్రయోజనాలు లేవు. అసలు రాజకీయాల అంటూ సొంటూ అంటని వారే వీరిలో ఎక్కువ. యువతీయువకులు, చదువుకున్న గృహిణులు, ఉద్యోగాలు చేసుకుంటున్న వారు. ఏ రాజకీయ పార్టీతో కానీ ప్రత్యక్ష పరోక్ష సంబంధాలు లేనివాళ్ళు.  ఇది మొదటి తరగతి. ఇలాంటివారు నాతోపాటు మీకు కూడా ఈ ఫేస్ బుక్ లో తారసపడి ఉండవచ్చు. వీరిది కల్తీ లేని అభిమానం. వారిపట్ల అవ్యాజానురాగం. అదే వారిచేత అలా మాట్లాడిస్తోంది. ఇలా ఉంచుదాం.
పొతే రెండో తరగతి. వీరికి రాజకీయాలతో సంబంధం వుంది. ఏదో ఒక రాజకీయ పార్టీతో ఏదో ఒక సంబంధం ఉన్నవాళ్ళే. ఒకరకంగా ఒక శ్రేణి నాయకులు. వీలును బట్టి, గాలి వాలునుబట్టి వీరి రాజకీయ విధేయతలు తారుమారవుతుంటాయి. ఎంతోకొంత ప్రయోజనం ఆశించే ఈ రకమైన రాజకీయాలు నెరుపుతుంటారు. బాబు పట్ల, జగన్ పట్ల వీరి అభిమానాలు కాలనుగుణంగా, అవసరాలను బట్టి  మారిపోతుంటాయి. ఇలాంటివాళ్ళు ఫేస్ బుక్ లోను, టీవీల్లోనూ కనబడి తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ వుంటారు. ఓ పదేళ్ళ కాలాన్ని జాగ్రత్తగా గమనిస్తే,  ఈ కొద్దికాలంలోనే వీళ్ళు  తమ రాజకీయ అభిప్రాయాలను ఎన్నిసార్లు ఎలా   మార్చుకుంటూ వచ్చిందీ అవగతమవుతుంది.
ఇంతకీ చెప్పవచ్చింది ఏమిటంటే మొదటి తరగతి వారి అభిమానం  ఇప్పటికీ ఆ నాయకుల పట్ల చెక్కు చెదరకుండా ఉంటూ వస్తోంది.  ఈ ఇద్దరు నాయకుల పట్ల వారి అభిమాన దురభిమానాలలో ఎలాంటి తేడా రాలేదు. ఎందుకంటే అవి రాతిమీది గీతలు. తేలిగ్గా చెరిగిపోవు. రెండో తరగతి వాళ్ళవి నీటి మీద రాతలు. ఇట్టే మాయమై పోతాయి.
మొదటి తరగతి వారివల్ల రాజకీయ నాయకులకు పెద్ద ఉపయోగం లేదు. తమ ఓటు బ్యాంకును పదిలంగా ఉంచుకునేందుకు వీలుగా ప్రజాభిప్రాయాన్ని ఏదో ఒక మేరకు ప్రభావితం చేసేందుకు వీరి రాతలు, అభిప్రాయాలు వారికి ఉపయోగపడుతుంటాయి. ప్రతిఫలం ఆశించకుండా  ఈ పనులు చేస్తుంటారు కాబట్టి వీళ్ళను పెద్దగా పట్టించుకోవాల్సిన  పని వారికీ లేదు.
పొతే, రెండో తరగతి వాళ్ళను ఎలా ఉపయోగించుకోవచ్చో రాజకీయులకు కొట్టిన పిండి. రాజకీయుల్ని ఎలా వాడుకోవచ్చో వీరికీ వెన్నతో పెట్టిన విద్య.
ఇతి వార్తాః   

14, ఏప్రిల్ 2020, మంగళవారం

ఐ వాంట్ టు డై ఎట్ మై హోం


రెండు సంఘటనలు చెప్పుకుందాం.
2018 ఏప్రిల్ పద్నాలుగో తేదీ సాయంత్రం. కార్పొరేట్ ఆసుపత్రిలో ఓ  డాక్టరు తన పేషెంటుతో   చెబుతున్నాడు.
‘మీకు మంచి వైద్యం అందుతోంది, త్వరలో కోలుకుంటారు’
‘సరే కానీ డాక్టర్! ఐ వాంట్ టు డై ఎట్ మై హోమ్. ప్లీజ్ డిశ్చార్జ్’
ఆ పేషెంటు కూడా డాక్టరే. మా అక్కయ్య కుమారుడు డాక్టర్ ఏపీ రంగారావు.
పేషెంటు అభ్యర్ధన మేరకు డిశ్చార్జ్ చేసారు. ఇంటికి చేరాడు. పన్నెండు గంటలు కూడా కాలేదు. ఆ రాత్రి గడవలేదు. తెల్లవారుజామున కన్ను మూశాడు.
ఇక రెండోది.
మా దగ్గరి బంధువును హైదరాబాదులోని ఓ పెద్ద ఆసుపత్రిలో చేర్చారు. వారిది ఈ ఊరు కాదు. పరిస్తితి క్రిటికల్ అన్నారు. రెండు రోజులు గడిస్తే కాని చెప్పలేమన్నారు. ‘ఒక టెస్ట్ చేయించాలి, అదిక్కడ లేదు, బయట వాళ్ళు చేస్తారు, ఏడు వేలు అవుతుంది, ఆ టెస్ట్ చేయడానికి వచ్చిన వాడికి ఏడు వేలు ఇవ్వండి’ అని చెప్పారు ఆసుపత్రివాళ్ళు. ఆ టెస్ట్ చేయించారు. డబ్బు చెల్లించారు. గంటలు గడవక ముందే ఆ పేషెంటు కన్ను మూసింది. ఆసుపత్రి ఫీజులన్నీ ముందే కట్టేశారు కనుక డిశ్చార్జ్ కి ఎక్కువ టైం తీసుకోలేదు. ఇంతలో వాళ్లకు అంతకు ఒక రోజు ముందు చేయించిన టెస్ట్ జ్ఞాపకం వచ్చి అడిగారు. ఆ రిజల్ట్ అయిదు రోజులకు వస్తుంది అని జవాబు.
‘రెండు రోజులు గడవటం కష్టం’ అని చెప్పిన వాళ్ళు అయిదు రోజుల తర్వాత రిజల్ట్ వచ్చే టెస్ట్, అదీ ఆసుపత్రి వెలుపల వాళ్ళ చేత చేయించడం ఏమిటో అర్ధం కాని స్తితిలోనే వాళ్ళు పేషెంటు బాడీ తీసుకుని  ఊరికి వెళ్ళిపోయారు.   
చికిత్స పేరుతో డబ్బులు పిండుతూ చేసే ఇటువంటి వైద్యాలకు డాక్టర్ రంగారావు పరమ విరోధి. అతితక్కువ ఖర్చుతో చేసే వైద్యమే పేదవారు ఎక్కువగా వుండే మన వంటి దేశాలకు ఉపయుక్తమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. స్వల్ప ఖర్చుతో సత్వర వైద్యం అనేది ఆయన నినాదం. చిన్న చిన్న అస్వస్థతలను శరీరమే తట్టుకుంటుందని, వీటి కోసం పెద్ద పెద్ద వైద్యాలు, పరీక్షలు అనవసరమన్నది డాక్టర్ రంగారావు నిశ్చితాభిప్రాయం. ఇలా వచ్చిన వారికి ఆయన ఓ క్రోసిన్ గోలీ వేసుకోండని చెబుతూ వుండేవారు. ఆయన అన్నట్టే వారికి స్వాంతన చేకూరేది. దానితో ఆయనకు డాక్టర్ క్రోసిన్ అనే పేరు వచ్చింది.
ఎన్నో ఏళ్ళక్రితం వైద్య విద్యార్ధిగా తొలిపాఠం నేర్చుకున్నప్పుడు, యువ డాక్టర్లకు నేర్పే ఓ నీతిపాఠాన్ని ఆయన ఒంటపట్టించుకున్నాడు. జీవితాంతం దాన్నే పాటిస్తూ వచ్చాడు.
రోగికి అవసరం లేని వైద్యం చేయకూడదు, చేసిన వైద్యానికి డబ్బు తీసుకోకూడదుఅన్నది ఆ పాఠం.
నిజానికి డాక్టర్ రంగారావు ఒక మామూలు డాక్టర్. ‘నేనొక షరా మామూలు డాక్టర్ ని’  ఆయన అనుకున్నట్టయితే ఆయన కధే వేరుగా వుండేది. ఎక్కడో సంపన్నుల కాలనీలో ఓ పెద్ద భవంతి కట్టుకుని ‘నాకిది చాలు’ అనుకుంటూనో, ’ఇంకా కావాలి’ అని తాపత్రయ పడుతూనో జీవితాన్ని దొర్లించి ఉండేవాడు. కానీ ఆయన అలా అనుకోలేదు. సాధారణ మనుషులు కూడా నిబద్ధతతో వ్యవహరిస్తే గొప్ప పనులు చేయడం అసాధ్యం కాదని నిరూపించాడు.
పది జీవితాల్లో చేయాల్సిన మహత్తరమైన పనులన్నింటినీ ఆయన ఒక్క జీవితంలోనే చక్కబెట్టగలిగారు.
అలాంటి విశిష్ట వ్యక్తిత్వం కల మనిషి కనుకనే ఇతరులకు అసాధ్యం అనుకున్న 108, 104 వంటి అనేక అపూర్వ  పధకాలను ఆయన నిజం చేసి చూపించగలిగారు.
సకల జనులు మెచ్చుకున్న ఆ గొప్ప పనుల వెనుక తానున్నానని చెప్పుకోవడానికి ఆయన ఎప్పుడూ వెంపర్లాడలేదు. కనుకనే ఆయన మరణించిన తర్వాత జ్వాలా వంటివారు డాక్టర్ రంగారావు గురించి రాసిన అనేక వ్యాసాలు పత్రికల్లో చదివి,  ‘ఈయన ఇంతటి గొప్పవాడా, మాకు తెలియదే’ అంటూ ఫోన్లు చేసి కొనియాడిన అపరిచితులు అనేకమంది.

ఏప్రిల్ పదిహేను ఆయన వర్ధంతి.   



(డాక్టర్  ఏపీ రంగారావుతో నేను)