7, జనవరి 2017, శనివారం

తెలుగదేలయన్న దేశంబు తెలుగు ......

  
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 08-1- 2017, SUNDAY)
వున్నట్టుండి తెలుగు భాష, తెలుగు పత్రికలలోనే కాకుండా ఇంగ్లీష్ ప్రచార, ప్రసార మాధ్యమాల్లో కూడా ఒక పెద్ద చర్చనీయాంశం అయికూర్చుంది. ముదనష్టం పట్టడం  అంటే ఇదే కాబోలు. ఇదేమంత తప్పు పదం ఏమీ  కాదు, కొద్దిరోజుల క్రితం తెలుగుదేశం పార్టీ పాలనలో వున్న  తెలుగు రాష్ట్రంలో  తెలుగు భాష  విషయంలో జరిగిన  పొరబాటును గమనంలో వుంచుకుంటే. పొరబాట౦టేనే దిద్దుకునేది కాబట్టి పత్రికల్లో, సాంఘిక మాధ్యమాల్లో వెల్లువెత్తిన ఆందోళనను, నిరసనలను అర్ధం చేసుకుని సత్వరమే దిద్దుబాటు చర్యలు తీసుకుంది. అంతవరకూ మంచిదే అనుకోవాలి.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక పేరు వుంది, ప్రతిపక్షం చెప్పినా చెవిన పెట్టని మనిషి మీడియాలో వస్తే వెంటనే పట్టించుకుంటారని. మునిసిపల్ పాఠశాలల్లో తెలుగు భాషను మాధ్యమంగా తొలగించి ఆ స్థానంలో ఆంగ్ల భాషను ప్రవేశపెట్టాలనే   నిర్ణయంపై  మీడియాలో వ్యతిరేకత కనబడడంతో కాస్త వెనక్కి తగ్గినట్టు వార్తలు వెనువెంటనే వచ్చాయి, స్పష్టమైన  అధికారిక ప్రకటన ఏదీ వెలువడక పోయినప్పటికీ.  
తెలుగు భాషను బోధనామాధ్యమంగా తొలగించాలని  నిర్ణయం తీసుకోవడమే ఆలస్యం ఒక   జీవో కూడా జారీ అయింది.
ఆంధ్రప్రదేశ్ లోని అన్ని మునిసిపల్ స్కూళ్ళలో తెలుగు బోధనా మాధ్యమాన్ని తొలగిస్తూ, ఆ స్థానంలో ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్టు ఆ ఉత్తర్వు సారాంశం. విద్యార్ధుల సంఖ్యతో కానీ, ఉపాధ్యాయుల సంఖ్యతో కానీ నిమిత్తం లేకుండా ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు బోధనా మాధ్యమాన్ని తెలుగు నుంచి ఇంగ్లీష్ భాషకు మారుస్తూ ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే 2016- 17 విద్యా సంవత్సరానికి పదవ తరగతికి మాత్రం  ఇది వర్తించదని జీవోలో పేర్కొన్నారు.
ఈ ఆదేశాలు వెనువెంటనే అమల్లోకి వస్తాయని జీవో స్పష్టం చేసింది.   
“విషయాలను అన్నింటినీ సమగ్రంగా పరిశీలన జరిపిన తరువాతనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని” ప్రతి జీవోలో ముందుగా పేర్కొంటూ వుంటారు. మరి అవే ఉత్తర్వులను, సంతకాల తడి ఆరకముందే సవరించి కొత్తవి జారీ చేస్తుంటారు. అంతమాత్రం దానికి, ‘జాగ్రత్తగా పరిశీలించిన మీదట’ అనే పడికట్టు పదం ఎందుకు వాడతారో అర్ధం కాని విషయం.
పొతే, బోధనా మాధ్యమంగా తెలుగు తొలగింపు అనే  అంశం మీడియాలో, ప్రధానంగా సాంఘిక మాధ్యమాల్లో పెద్ద దుమారాన్నే రేపింది. పెద్ద నోట్ల రద్దు మాదిరిగానే  ఈ అంశంపై కూడా అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలతో ఆ మాధ్యమాలు మారుమోగుతున్నాయి.
ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా వస్తున్న విమర్శలు అన్నీ ఇన్నీ కాదు. పార్టీ పేరులోనే తెలుగు దేశం అని వున్నప్పుడు తెలుగుకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా వుందంటూ  సోషల్ మీడియా రచయితలు చెలరేగిపోతున్నారు. మొన్నటికి మొన్న తమిళనాడులో తెలుగు మీడియం రద్దు చేసినప్పుడు అక్కడి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పడుతూ, మహజర్లు పెట్టుకున్న తెలుగుదేశం సర్కారు,  సొంత రాష్ట్రంలో తెలుగు మీడియంను ఏ మొహం పెట్టుకుని రద్దు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.  ఇది రెండు కళ్ళ సిద్దాంతం కాక మరేమిటని నిప్పులు చెరుగుతున్నారు. పోటీ ప్రపంచంలో తెలుగు పనికి రాదనే వాదనను వారు కొట్టి వేస్తున్నారు. యావత్ భారత దేశంలో సంపూర్ణ అక్షరాస్యత కలిగిన కేరళ రాష్ట్రంలో మాతృభాష మాత్రమే బోధనా భాషగా ఉంటోంది. అభివృద్ధి పధంలో పురోగమిస్తున్న రాష్ట్రాలలో అది అగ్రస్థానంలో వుంది అని ఉదాహరణలు చూపిస్తున్నారు.    
‘విజ్ఞాన సముపార్జనకోసం విద్య  అనేది బూజుపట్టిన పాత చింతకాయపచ్చడి. ఈ సిద్దాంతానికి ఎప్పుడో  కాలం చెల్లింది. ఇంగ్లీష్ పరిజ్ఞానం లేకుండా కేవలం తెలుగును అడ్డం పెట్టుకుని ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకు రావడం అసాధ్యం.’ అంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్ధించే వారు బల్ల గుద్ది చెబుతున్నారు.  ఏది చదివినా, యెంత చదివినా నాలుగు రాళ్ళు సంపాదించిపెట్టే  ఉద్యోగం కోసమే అనే వాదన, భావన వీరివి. తెలుగు తెలుగు అని పట్టుకుని వేళ్ళాడితే పిల్లల భవిష్యత్తు ఎలా అని వారు ప్రశ్నిస్తున్నారు. తెలుగు భాష  గురించి ఇంతగా  మధనపడేవాళ్ళెవరయినా వాళ్ళ  పిల్లల్ని తెలుగు మీడియంలో చదివిస్తున్నారా, లేక  కాన్వెంటు స్కూళ్ళకు పంపుతున్నారా చెప్పాలని ఎద్దేవా చేస్తున్నారు.
ఏతావాతా విషయం యావత్తు రచ్చ రచ్చ అయిన తరువాత, ప్రభుత్వ పెద్దలు ఒక మెట్టు దిగి, ఈ  నిర్ణయాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టి, వచ్చే ఏడు చూద్దాము అనే నిర్ణయానికి వచ్చినట్టు వివరణలు వెలువడ్డాయి.
ఇదంతా చూసినప్పుడు కలం కూలీ, ప్రముఖ పాత్రికేయులు,కీర్తిశేషులు  జి. కృష్ణ ఒకప్పుడు చెప్పిన తెలుగు ముచ్చట్లు గుర్తుకు వస్తున్నాయి.
పూర్వపు మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడి ఏర్పడ్డ  ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రిగా వున్న రోజులు. రమేశన్ అనే తెలుగు తెలిసిన తమిళ అధికారి గుంటూరు కలెక్టర్ గా వుండేవారు. తెలుగు వాడు కాకపోవడం వల్ల కావచ్చు, ఆయనకు తెలుగంటే వల్లమాలిన అభిమానం. అంచేత, జిల్లా కలెక్టర్  కి పంపుకునే ఆర్జీలను తెలుగులో పంపుకోవచ్చని ప్రకటించాడు. ఇంగ్లీష్ వచ్చిన వాళ్లకు ఈ నిర్ణయం తలవంపులుగా అనిపించి పోయి ప్రకాశం గారికి పిర్యాదు చేశారు. ఆంధ్రకేసరికి కోపం వచ్చింది. రమేశన్ ని సంజాయిషీ అడిగారు. ఆయన ఈనాటి అధికారుల కోవలోని వాడు కాదు కాబట్టి ధైర్యంగా జవాబు చెప్పాడు, ‘ఆంద్ర రాష్ట్రం వచ్చింది కదా. అది ఏర్పడిన సిద్దాంతం ప్రకారం ఇట్లా ప్రకటించాను’ అంటూ. మరి ఆంద్ర కేసరి కూడా ఈనాటి నాయకుల బాపతు కాదుకదా! అధికారి చెప్పింది విని, సరే అని ఒప్పుకుని, తన చెవులు కొరికిన వాళ్ళను తరువాత  చెడామడా ఉతికేసాడు.
ఆంగ్లంలో పెద్ద చదువులు చదవకుండానే  పెద్ద పెద్ద ఇంగ్లీష్ పత్రికల్లో పనిచేసిన  కృష్ణ గారికి, రమేశన్ మాదిరిగానే  తెలుగు అంటే మంచి అభిమానం. కాన్వెంటు స్కూళ్ళకు ఆయన పెట్టిన ముద్దు పేరు మమ్మీ డాడీ బడులు.
ఆయన చెప్పినదే మరో తెలుగు కధ.
1990 లో కాబోలు, హైదరాబాదులోని అంతర్జాతీయ తెలుగు సంస్థ కార్యాలయానికి దక్షిణాఫ్రికా నుంచి పీ.ఎం. నాయుడు అనే పెద్దమనిషి వచ్చాడు. ఆయన అంతదూరం నుంచి వచ్చి మన ప్రభుత్వాన్ని అడిగింది ఏమిటో తెలుసా, ‘ఒకరిద్దరు తెలుగు పండితుల్ని ఇవ్వండి, ఆఫ్రికాలో  మా పిల్లలకు తెలుగు నేర్పుకుంటాము’ అని.  
స్వతంత్రం వచ్చిన తరువాత ఏర్పడ్డ భాషాప్రయుక్త రాష్ట్రాలలో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్. కృష్ణ గారు  అనేవారు, అలాంటి ఆంధ్రప్రదేశ్ లో ఇంటాబయటా తెలుగు ‘హుష్ కాకి’.
అయితే, తెలుగు భాష పరిస్తితి మునపటంత దయనీయంగా లేదు.
ఇంటర్ నెట్ ఆగమనంతో తెలుగు భాష మరో మృతభాషగా మారిపోతుందనే భయాలు వట్టివని తొందర్లోనే  తేలిపోయింది. భాష బతకాలంటే కేవలం మాట్లాడితే సరిపోదు, రాయడం, చదవడం వచ్చి తీరాలి అంటారు. ఈరోజు  సోషల్ మీడియాలో అలాటి చక్కదనాల తెలుగు సౌరభం వెల్లివిరుస్తోంది. తెలిసిన వారి నుంచి తెలియని వారు నేర్చుకునే వేదికగా కూడా ఈ మీడియా ఉపయోగపడుతోంది. తెలుగు భాష ఈ మాత్రం ప్రాణంతో నిలబడి ఉన్నదంటే నిజానికి బ్లాగర్, ఫేస్ బుక్, వాట్స్ ఆప్ వంటి అధునాతన మీడియాలే కారణం అనడం అతిశయోక్తి కాదు.  ఇప్పుడు అనేకమంది ప్రతి రోజూ తెలుగులో రాస్తున్నారు. తెలుగులో రాసింది చదువుతున్నారు. తెలుగులో అభిప్రాయాలు పరస్పరం తెలుపుకుంటున్నారు. ఇదొక శుభ పరిణామం.
అయితే ఇదొక్కటే సరిపోదు.
భాషలను, సంస్కృతులను పరిరక్షించాల్సిన బాధ్యత ఒకనాడు ప్రభువులది, ఈనాడు మాత్రం ప్రజాప్రభుత్వాలది.
ఉపశృతి: 1980 లో కాబోలు మిమిక్రీ వేణుమాధవ్ కొంతమంది కళాకారులతో కలిసి మారిషస్, దక్షిణాఫ్రికా దేశాల్లో పర్యటించారు. అప్పుడు వారికి డర్బన్ నగరంలో ‘వరంగల్లు వీధి’ కనిపించింది. వివరం అడిగితే అక్కడివాళ్లు చెప్పారట. ఆ నగరంలో తెలుగు వాళ్ళు వుండే వీధికి మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండని నగరపాలక సంస్థ సూచించింది. అంతే! అందరూ కలిసి మరో మాట లేకుండా వరంగల్ పేరు పెట్టుకున్నారట.
తెలుగుతనం, తెలుగు అభిమానం చూడాలంటే ముందుముందు విదేశాలకు వెళ్ళాలేమో!  

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com,  మొబైల్: 98491 30595       

5, జనవరి 2017, గురువారం

ఇంతకంటే ఏం కావాలి?

ఎప్పటి రేడియో మాస్కో? ఎప్పటి తెలుగు వార్తలు?
పాతికేళ్ళు దాటింది నేను మాస్కో రేడియోలో తెలుగు వార్తలు అయిదేళ్లపాటు చదివి హైదరాబాదుకు తిరిగొచ్చి.
ఇవ్వాళ ఉదయం రాజమండ్రి నుంచి చంద్రశేఖర్ గారనే పరిచయం లేని పెద్దమనిషి ఫోను చేశారు. పత్రికల్లో నేను రాసే వ్యాసాలు చదివి గూగుల్ సెర్చి ద్వారా నా ఆనుపానులు పట్టుకున్నారుట. ఆరోజుల్లో మాస్కో రేడియో తెలుగు వార్తలు క్రమం తప్పకుండా వినే అలవాటు తనకు ఉండేదని, ఒకసారి నా సంతకంతో మాస్కోనుంచి పంపిన చిరుకానుక తన దగ్గర ఇప్పటికీ భద్రంగా ఉందనీ చెప్పారు. శ్రోతలకు అలా కానుకలు పంపే సంప్రదాయం రేడియో మాస్కోలో వుండేది.
మాస్కో రేడియోతోటే ఒదిలిపెట్టలేదు. అంతకుముందు 1971లో బెజవాడ ఆంద్ర జ్యోతిలో పనిచేసేటప్పుడు నేను రాసిన ‘వాక్టూనులు’, ‘బుక్ రివ్యూలు’ గురించి సవిస్తరంగా ప్రస్తావించడం చూసి ఆయన ధారణ శక్తికి ఆశ్చర్యపోవడం నావంతయింది. అల్లాగే హైదరాబాదు ఆలిండియా రేడియోలో నా కార్యక్రమం ‘జీవన స్రవంతి’ గురించి కూడా చంద్రశేఖర్ గారు ప్రస్తావించారు. 1975 లో ఆ కార్యక్రమం నేను మొదలు పెట్టినప్పటి నుంచి జీవనస్రవంతి ప్రసారం చేసే వేళలు ఎలా మారుతూ వచ్చాయో అన్న వివరాలు కూడా ఆయన చెప్పేసరికి నాకేం మాట్లాడాలో తోచలేదు.
చంద్రశేఖర్ గారూ. మీకు నా సెల్యూట్.




కింది ఫోటో : 1975 లో నా 'జీవన స్రవంతి'

3, జనవరి 2017, మంగళవారం

ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్ ?


మూన్నెళ్ళుగా ఆర్ కే ప్రసాద్ మనసును తొలుస్తున్న అనుమానం.
అతను చాలా  సంవత్సరాలు అమెరికాలో ఉద్యోగం చేసి  ఇండియా రాగానే  హైదరాబాదులోని ఒక సంస్థలో ఫైనాన్స్ విభాగంలో ఉన్నతాధికారిగా చేరాడు. తన కింద పనిచేసే కొన్ని డజన్ల మంది ఉద్యోగులతో ముఖతః పరిచయం లేక పోయినా రికార్డులను బట్టి వారేమిటో, ఏ పని చేస్తుంటారో తనకు తెలిసిపోతూనే వుంటుంది, ఒక్క ఈ హరిశ్చంద్ర ప్రసాద్ విషయం తప్ప. ఆయన ఆ ఊళ్లోనే బ్రాంచి ఆఫీసులో పనిచేస్తారు.
ఆయన తన దృష్టిని ఆకర్షించడానికి  కారణం కూడా వుంది. అది ఆయన నడవడిక. తనిఖీ నిమిత్తం తాను నెలలో అనేక పర్యాయాలు  ఆ బ్రాంచికి వెళ్ళాల్సిన అవసరం పడేది. ఎప్పుడు వెళ్ళినా ఆయన తన సీట్లోనే కనబడేవాడు. ఆఫీసు టైం కల్లా ఠంచనుగా గంట కొట్టినట్టు వచ్చి తన సీట్లో కూర్చుంటాడని చెప్పేవాళ్ళు.  వచ్చీ రాగానే అందర్నీ చిరునవ్వుతో పలకరిస్తాడు. అంతే! ఆ తరువాత మౌనముని.  కంప్యూటర్ ఓపెన్ చేసి తన పనిలో పడిపోతాడు. ఎవరితో మాటా ముచ్చటా వుండదు. లంచ్ బాక్స్ ఇంటి నుంచే తెచ్చుకుని తన సీటు దగ్గరే భోజనం ముగిస్తాడు. ఆయన ఎవరికీ రిపోర్ట్ చేయడు. పలానా పని చేసారా ఎవరూ ఆయన్ని అడగ్గా చూడలేదు. సాయంత్రం ఆఫీసు పని వేళలు ముగియగానే కారు నడుపుకుంటూ వెళ్ళిపోతాడు. ఇదీ ఆయన గురించి విన్న విషయాలు. వారికి తెలియని విషయం ఒకటి ఫైనాన్స్ అధికారిగా తనకు తెలుసు. ఆయన జీతం లక్షల్లో. ఏపనీ లేకుండా ఎందుకంత జీతం ఇస్తున్నట్టు!
‘ఇంతకీ ఎవరీయన?’
అదే ప్రశ్న సహచరులను అడిగి చూశాడు.
“మాకూ తెలియదు. మన బాస్ కావాలని ఆయన్ని తెచ్చి పెట్టుకున్నాడు. అలా అని బాస్ తో చనువుగా వుండగా మేమెప్పుడూ చూడలేదు. తన పనేమిటో  తన లోకమేమిటో. గతంలో ఒకరిద్దరు బాస్ తో ఈ ప్రస్తావన చేయ బోయారు. ‘మీకు అది అంత అవసరమా” అని కట్ చేసారు. ఆ తరువాత ఎవ్వరూ ధైర్యం చేయలేదు”
ఈ సమాధానం ప్రసాద్ లో ఉత్సుకతను మరింత పెంచింది.
ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్!
ఫైనాన్స్ విభాగం అధిపతిగా ఆయన ఎవరో తెలుసుకునే అధికారం తనకుంది. ఎవరో తెలియకుండా అంతంత జీతాలు చెల్లించే పత్రాల మీద సంతకం చేయాల్సిన అవసరం తనకు లేదు.
అదే విషయం బాస్ తో అనేశాడు. ఆయన కనుబొమ్మలు ముడిపడ్డాయి.
‘పోనీ ఒక పని చేయండి. ఎవరో తెలియకుండా జీతం ఇవ్వలేని పక్షంలో నా కంపెన్సేషన్ నుంచి ఆయనకు ఆ డబ్బు ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడూ ఈ విషయం నా వద్ద ఎత్తకండి’
బాస్ స్పందన ప్రసాద్ ఆశ్చర్యాన్ని రెట్టింపు చేసింది.
మరో రెండేళ్ళు గడిచాయి. ఒక రోజు ఆఫీసు పని మీద ఆ బ్రాంచికి  వెళ్ళే సరికి అంతా హడావిడిగా వుంది. ఓమూలన కూర్చుని పనిచేసే ఆ ముసలాయన కనిపించలేదు. భోరున వర్షం కురవనీ, ఊళ్ళో కర్ఫ్యూ పెట్టనీ టైముకు ఆఫీసుకు వచ్చే పెద్దాయన ఈ రోజు రాలేదు. బాస్ కూడా అప్పుడు అక్కడే వుండడం చూసి ఆశ్చర్యం వేసింది. అందరూ బయటకు వెళ్ళడానికి సిద్ధంగా వున్నారు. ప్రసాద్ కూడా తన కారులో వాళ్ళని అనుసరించాడు.
ఊరికి దూరంగా విసిరేసినట్టున్నప్రాంతంలో విశాలమైన ఆవరణలో పూదోట వంటి ఓ పెంకుటిల్లు.  ఇంటి ముందు పాడె మీద  ఆ పెద్దాయన శవం.
ఎక్కువ హడావిడి లేకుండానే కర్మ కాండలు ముగిశాయి. అంతా ఆఫీసుకు తిరిగి వచ్చారు.
ఆ సాయంత్రం ఒక సంతాప సభ ఏర్పాటు చేశారు.
రెండు నిమిషాలు మౌనం పాటించిన తరువాత బాస్ మైక్ తీసుకున్నాడు.
‘ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్? మన ఆఫీసులో ప్రతి ఒక్కరికీ దీనికి జవాబు తెలుసుకోవాలని వుందని నాకు తెలుసు. ఆయన ఎవ్వరోకాదు, మన ఈ కంపెనీకి అసలు యజమాని. కంపెనీ మంచి వృద్ధిలో వున్న సమయంలో విదేశాల్లో విహార యాత్రకు వెళ్ళిన ఆయన కుటుంబ సభ్యులు అందరూ ఒకే సారి  మరణించారు. వారసులు ఎవ్వరూ లేరు. ఆ సమయంలో ఆయన నాకు ఒక బాధ్యత ఒప్పచెప్పారు. అప్పుడాయన చెప్పిన మాటలు నాకు బాగా జ్ఞాపకం వున్నాయి.
‘ఎంతో విలువలతో ఈకంపెనీని నడుపుకుంటూ వచ్చాను. నాకూ వయసయిపోయింది. మా కుటుంబ సభ్యుల మరణం చూసాక మృత్యువు అనివార్యమని తెలిసిపోయింది. నేనూ ఒక రోజు పోక తప్పదు. కానీ ఈ కంపెనీ బతికి  తీరాలి. ఇన్నేళ్ళుగా ప్రతి రోజూ క్రమం తప్పకుండా ఆఫీసుకు వెళ్లి పనిచేస్తూ వస్తున్నాను. ఈ పరిస్తితుల్లో నేను మనసు పెట్టి పనిచేయలేను. అలా  అని  ఖాళీగా కూడా  వుండలేను. అంచేత మన కంపెనీ లోనే పనిచేస్తాను. సంస్థ చైర్మన్ గా కాదు, ఒక ఉద్యోగిగా. కానీ ఈ విషయం ఎవరికీ తెలియనివ్వకూడదు. హెడ్ ఆఫీసులో అది కుదరని పని. కాబట్టి ఏదైనా బ్రాంచిలో చూడు’
‘అలా నాకు చెప్పిన ఆయన ఇప్పుడు లేరు. కానీ అయన మనకు ఒప్పచెప్పిన ఆశయాల ప్రకారం  పనిచేసి కంపెనీని నిలబెడదాం. ఇన్నేళ్ళుగా ఆయన కూర్చున్న కుర్చీని అలాగే ఉంచేద్దాం. ఆయన అక్కడే కూర్చుని వున్నారు అనుకుంటే అదొక ప్రేరణగా వుంటుంది. అందుకే  ఈ ఏర్పాటు’’

ఎవరీ హరిశ్చంద్ర ప్రసాద్ అని మధన పడుతున్న ప్రసాద్ కి అసలు  విషయం బోధపడింది.    (03-01-2017)            

2, జనవరి 2017, సోమవారం

ఎలా? ఇలా!


“ఏటీఎంలలో డబ్బులు వస్తున్నాయని కొందరు, రావడం లేదని మరికొందరు వాదించుకొనుచున్నారు. మీరు ఎవరితో ఏకీవభించెదరు ఎడిటర్జీ?”
“ఇద్దరితో..”
“అదెలా?”
“అంటే ఇలా. చెబుతాను ఇనుకో!.....సోషల్ మీడియా రెండుగా విడిపోయింది. తాము ఒకటి నమ్ముతూ దాన్నే ఇతరులు కూడా నమ్మి తీరాలనే మనస్తత్వం ఇందులో ప్రబలంగా వుండడమే దీనికి కారణం”
“మరి ఏది దారి?”
“కంటితో చూసి రుజువు చేసుకోవడమే... నిన్న కాక మొన్న మా కజిన్ వాళ్ళు అరకు టూరు వెళ్లివచ్చారు. వాళ్లకు ఎక్కడా ఇబ్బంది కాలేదు. అన్ని ఏటీఎంలు పనిచేస్తూనే వున్నాయి. డబ్బులు దొరుకుతూనే వున్నాయి.  అంతే కాదు, చిన్న షాపుల్లో చిన్న వస్తువు కొనుక్కుని రెండువేల నోటు ఇచ్చినా మరో మాట అడగకుండా చిల్లర లెక్కపెట్టి ఇస్తున్నారట. పైగా కొత్త అయిదు వందల నోట్లు పుష్కలంగా దొరుకుతున్నాయట. ఇన్ని ‘ట’ లు వున్నాయని నమ్మను అనబోకు. మా కజిన్ చెప్పింది మరి. అదెప్పుడూ అబద్ధం చెప్పదు. మరి హైదరాబాదులో ఈ గొడవ ఏమిటి? అక్కడ లేని ఇబ్బందులు ఇక్కడ ఎందుకు?”
 “అది అరకు. ఇది హైదరాబాదు. పెద్ద నగరం. పెద్ద జనాభా. పెద్ద నోట్ల అవసరం ఇక్కడ ఎక్కువ. అందుకే ఇక్కడ కొరత”
“మళ్ళీ ఇదేమి ఫిట్టింగు”
“ఫిట్టింగు కాదు నాయనా పచ్చి నిజం. అందుకే ముందే చెప్పాను, రెండు వాదనలు నిజమే అని. విషయం విడమరచి చెబుతాను విను. ఇప్పుడు ఇక్కడ టైం ఎంత? పగలు పన్నెండు గంటలు. అమెరికాలో వున్న మీ అబ్బాయికి ఫోను చేసి కనుక్కో. రాత్రి పన్నెండు అంటాడు. అదీ నిజమే. ఇదీ నిజమే. అదన్న మాట”   

  

1, జనవరి 2017, ఆదివారం

సంగీత కళానిధి అవసరాల కన్యాకుమారి

    
2016 జులైలో కృష్ణా పుష్కరాలకు ఏర్పాట్లు జరుగుతున్న వేళ.
విజయవాడలోని ఒక రికార్డింగ్ స్టూడియోలో ఒక  వయొలిన్ విద్వాంసురాలు, పుష్కరాలకోసం  ‘కృష్ణాతరంగాలు’ అనే కార్యక్రమాన్ని రూపొందించే పనిలో తలమునకలుగా వున్నారు.
ఇంతలో సెల్ మోగింది. చెన్నై నుంచి మద్రాసు మ్యూజిక్ అకాడమి చైర్మన్ ఎన్.మురళి లైన్లోకి వచ్చి చెప్పారు. “2016 సంవత్సరానికి ‘సంగీత కళానిధి’ పురస్కారానికి మిమ్మల్ని ఎంపిక చేశాము, మా అభినందనలు అందుకోండి’ అంటూ.
ఆ సంగీత కళాకారిణికి ఆశ్చర్యంతో,  ఆనందంతో కాసేపు మాట పెగల్లేదు. కర్నాటక సంగీత ప్రపంచంలో ఆ అవార్డుకు వున్న విశిష్టత అలాంటిది మరి. పద్మవిభూషణ్ కన్నా సంగీత కళానిధి మిన్న అని భావించే కళాకారులు ఎందరో వున్నారు.
డిసెంబరు నెల చెన్నై నగరం  సంగీత ప్రియులకు శీతాకాలపు విడిది. మద్రాసు మ్యూజిక్ అకాడమీతో సహా అనేక సంగీత సభలు ఆ మాసంలో వీనులవిందైన కార్యక్రమాలు నిర్వహిస్తాయి. దేశం నలుమూల నుంచి కర్ణాటక సంగీత ప్రియులకు, సంగీత దిగ్గజాలకి అదొక మ్యూజిక్ సీజన్. చెన్నై హోటళ్ళన్నీ వారితో నిండిపోతాయి. టిక్కెట్లు కొని సంగీత కచ్చేరీలకు వెళ్ళేవాళ్ళు అక్కడే కనిపిస్తారు. మద్రాసు మ్యూజిక్ అకాడమీ నిర్వహించే కార్యక్రమాలకు మరింత ప్రత్యేకత. ఈ ఏడాది అకాడమీ కార్యక్రమాలకు సంగీత కళానిధిగా ఎంపిక అయిన అవసరాల కన్యాకుమారికి  ‘ముఖ్య అతిధి’ గౌరవం లభించింది. గతంలో ఈ పురస్కారం పొందిన ఘనాపాటీల సరసన మొదటి వరసలో స్థానం దొరికింది. పదిహేడు రోజులపాటు జరిగిన అకాడమీ సంగీత ఉత్సవాలు పాత సంవత్సరంలో మొదలయి నూతన సంవత్సరం మొదటి తేదీన ముగిశాయి. చివరి రోజున సంగీత దిగ్గజాల నడుమ అవసరాల కన్యాకుమారిని సంగీత కళానిధి పురస్కారంతో సత్కరించారు.


పద్మశ్రీ వంటి అనేక పురస్కారాలు గతంలోనే ఆమెను వరించాయి. అయినా, సంగీత కళానిధి బిరుదు రావడంతో సంగీత ప్రపంచంలో తనకు అత్యున్నతమైన  గుర్తింపు వచ్చినట్టుగా, స్థానం లభించినట్టుగా  భావిస్తున్నానని కన్యాకుమారి చెప్పారు. ఇటువంటి సందర్భాలలో విలేకరుల నుంచి ఆమెకు ఎదురయ్యే ప్రశ్న ఒకటి వుంటుంది. “మీరు పెళ్లి ఎందుకు చేసుకోలేదు?”. ఆమె చెప్పే జవాబు కూడా అలాగే వుంటుంది. “ ఎందుకు చేసుకోలేదు. చేసుకున్నాను. వాయులీనాన్ని (వయోలిన్) నేను ఎన్నడో పెళ్ళాడాను”. ఇలా అంటూనే మరో మాట అంటుంటారు. “మా తలితండ్రులు ఎంతో ముందుగానే ఊహించి నా పేరు కన్యాకుమారి అని పెట్టి వుంటారు”
ఆమెకు వయొలిన్ అంటే పంచ ప్రాణాలు. ఇందుకు దృష్టాంతంగా ఒక సంఘటన చెబుతారు. ఓసారి తన గురువు గారయిన ఎం ఎల్ వసంతకుమారితో కలిసి సంగీత కచ్చేరీ చేయడానికి  శ్రీ లంక వెళ్ళారు. వాళ్ళు బస చేసిన హోటల్ పై  ఎల్ టీటీఈ  ఉగ్రవాదులు దాడిచేసే ప్రమాదం వుందని, నిమిషాల్లో ఖాళీ చేయమని పోలీసులు హెచ్చరించారు. ‘గదిలో నా వయొలిన్ వుంది తెచ్చుకుంటాను” అని కన్యాకుమారి వెళ్లబోతుంటే ‘ఏమాత్రం ఆలస్యం చేసినా ప్రాణాలకు ముప్పు’ అనే పోలీసుల హెచ్చరికలను ఖాతరు పెట్టకుండా వెళ్లి దాన్ని తెచ్చుకున్నారు.  ఆ సంగీత పరికరంతో ఆమెకు వున్న అనుబంధం అలాంటిది.
విజయనగరానికి చెందిన ఆ సంగీత సరస్వతికి సంగీత కళానిధి పురస్కారం లభించడం తెలుగు నేలకు గర్వకారణం. (01-01- 2017)

       


30, డిసెంబర్ 2016, శుక్రవారం

2017 లో ప్రతిపక్షాలను కాదు ప్రజలను చూడండి ప్రభువులూ!


(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 01-01-16,SUNDAY)

అనాదిగా అలుపులేకుండా తిరుగుతున్న కాలచక్రం, తిరిగి తిరిగి, తిరిగొచ్చిన చోటికే తిరిగిరావడం  మామూలే.
అనేక అనుభవాలను, అనుభూతులను మన మదిలో, ఒడిలో  ఒదిలిపెట్టి  గత  ఏడాది సెలవు తీసుకుంది. సరికొత్త ఆశలతో కొత్త ఏడాది గడప దాటి అడుగు పెట్టింది.
చివరాఖర్లో కొంత హడావిడి చేసి 2016  తప్పుకుంటోంది. ఆ ప్రకంపనలను వారసత్వంగా అందిపుచ్చుకుని  2017 ప్రవేశిస్తోంది.

కొంచెం అటూ ఇటూగా కేంద్రంలోను, రెండు కొత్త తెలుగు రాష్ట్రాలలో నూతన ప్రభుత్వాలు కొలువుతీరి  రెండున్నర సంవత్సరాలు దాటుతోంది. ‘ఎన్నికలకు ముందు చెప్పినవేవీ చేయకుండా చేతులు ముడుచుకు కూర్చున్నారని’ ప్రతిపక్షాల వాదన. ‘కాదు, ఈ కొద్ది కాలంలో మేము చేసినన్ని మంచి పనులు గతంలో చాలాకాలం పాలించిన పార్టీలు ఏవీ చేయలేదని’ ఈ కొత్త పాలకుల సమర్ధన.  2016 లోనే కాదు, గత రెండున్నరేళ్లలో ఏం జరిగిందో సింహావలోకనం చేసుకుందాం.
ముందు ఢిల్లీ నుంచి మొదలుపెడదాం. చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయాన్ని సాధించి నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయ్యారు. మొదటి రెండేళ్లలో రాజకీయంగా కొన్ని ఆటుపోట్లు ఎదురయినా వ్యక్తిగతమైన ప్రజాదరణ ఇసుమంత కూడా కోల్పోలేదు. అన్నింటికీ మించి అధికారంలోకి రాగానే సహజంగా అంటుకునే అవినీతి మరకలు ఆయన్ని అంటుకోలేదు. బ్రహ్మాండమయిన పనులేవీ చేసి చూపించిన దాఖాలాలు పెద్దగా లేకపోయినా ప్రజలకు ఆయన పట్ల నమ్మకం తగ్గిపోలేదు.  పెద్ద నోట్ల రద్దు వంటి కీలక నిర్ణయం తగిన ముందు జాగ్రత్తలు తీసుకోకుండా తీసుకున్నప్పటికీ, అందువల్ల ముందుగా  చీకాకులు పడుతున్నది తామే అయినప్పటికీ సామాన్య ప్రజలు పంటి బిగువన ఆ కష్టాన్ని భరిస్తూ వచ్చిన విషయం అంత చిన్నవిషయమేమీ  కాదు. కారణం ఏదైనా, కారకులు ఎవరయినా, పెద్ద నోట్ల రద్దుకు సంబంధించి  మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గత ఏడాది చివరి రెండు మాసాల్లో యావత్ జాతిని ప్రభావితం చేసింది. దేశానికి పట్టిన నల్ల ధనం రోగాన్ని మటుమాయం చేయడానికి మోడీ తలపెట్టిన కాయకల్ప చికిత్స తొలి ప్రభావం సామాన్య జనజీవనంపైనే పడింది. ఈ ఆకస్మిక నిర్ణయం తమ జీవితాల్లో తీసుకొచ్చిన అనూహ్య పరిణామాలను వారు అతి సహజంగా తీసుకుంటున్నారనే చెప్పాలి. వెనిజులా దేశంలో ఇటువంటి నిర్ణయం పట్ల అక్కడి ప్రజలు ఎంత కోపోద్రిక్తులయింది గమనిస్తే, భారతీయులు ప్రదర్శిస్తున్న సహనం మోడీ అదృష్టమనే అనుకోవాలి.  అయితే దాన్ని ప్రజలు తమకిస్తున్న సహకారంగా ప్రభుత్వం భావిస్తున్నట్టుంది. అందులో కొంత నిజం లేక పోలేదు,  కానీ అది పూర్తిగా నిజం కాదన్న ఎరుక సర్కారు వారికి వున్నట్టు అనిపించడం లేదు.        
 ఈ అంశంపై ప్రతిపక్షాలు చేస్తున్న యాగీ పట్ల పాలక పక్షానికి కొంత అసహనం వుండవచ్చు. అలాగని వస్తున్న ప్రతి విమర్శను రాజకీయ కోణం నుంచి చూస్తూ తప్పుపట్టే ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వానికి మంచిది కాదు. ప్రతిపక్షాలు సరే! ప్రజలు ఏమనుకుంటున్నారో చారుల ద్వారా సమాచారం తెప్పించుకుని వారి ఇబ్బందులను కొంతవరకయినా తగ్గించి  ఒకింత ఉపశమనం కలిగించండం మోడీ ప్రభుత్వ ప్రధమ కర్తవ్యం. నూతన సంవత్సరం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పుకోవాల్సిన సంకల్పం ఇదే!
ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే.
దాదాపు పదేళ్ళ విరామం తరువాత చంద్రబాబు నాయుడు తిరిగి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. చేజారిన అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకున్నారు. ఏ రాజకీయ నాయకుడికి అయినా ఇంతకుమించిన సంతోషం మరోటి వుండదు. అయితే ఈ ఆనందం ఈ సంతోషం   తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అనుభవిస్తున్నారా అంటే ఆ దాఖలా కానరావడం  లేదు. ఎందుకంటే ఈసారి అధికారం లభించింది కానీ దానితోపాటే అనేకానేక సమస్యలు కూడా వెన్నంటి వచ్చాయి.  ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఆయన్ని  చుట్టుముడుతూనే వస్తోంది. ఒకదాని చిక్కుముడి విప్పేలోగా మరోటి సిద్ధం. కొన్ని వచ్చి పడ్డవి అయితే మరి కొన్ని తెచ్చి పెట్టుకున్నవి.
సమస్యను అవకాశంగా మలచుకోవడం తనకలవాటని చెప్పుకునే చంద్రబాబు, ఎదురయిన ప్రతి సమస్యను పార్టీకి, రాష్ట్రానికి పనికి వచ్చే అవకాశంగా మార్చుకునే పనిలో అహరహం కష్టపడుతుంటారు. కనీసం కష్టపడుతున్నట్టు కానవస్తారు. 'పని చేయడంతో సరిపోదు పనిచేసినట్టు కనబడాలి కూడా' అనే ఈ కాలపు రాజకీయానికి నిజానికి ఆయనే ఆద్యులు.
ఎన్ని చేస్తున్నా, ఎన్నో చేస్తున్నామని చెప్పుకుంటున్నా ఇంకా కొన్ని కొత్త సమస్యలు పుట్టుకొస్తూనే వున్నాయి. రాజ్యం వుంది రాజధాని లేదు. ఖజానా వుంది. నిధులు లేవు. కేంద్రంలో మిత్ర ప్రభుత్వం వుంది. అయినా ఆశించిన విధంగా అక్కరకు రావడం లేదు. ఇటువంటి వ్యతిరేక పరిస్తితులను కూడా ఆయన అనుకూలంగా మార్చుకునే పనికే ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారు. అందులో కూడా రాజకీయంగా బలపడే ప్రయత్నం స్పష్టంగా కానవస్తుంది. ప్రతిపక్షాన్ని బలహీన పరిచే వ్యూహం దాగుంటుంది.
చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికీ రాని అపూర్వ అవకాశం చంద్రబాబు నాయుడుకి కొత్త రాజధాని నిర్మాణం  విషయంలో లభించింది. కొంత వివాదాస్పదం అవుతున్నప్పటికీ ఈ విషయంలో కూడా చంద్రబాబు తన పంధాను ఏమాత్రం మార్చుకోకుండా ముందుకు సాగుతున్నారు. కొత్త రాష్ట్రానికి రాజధాని అవసరం కనుక ఆయన ప్రయత్నాలకు ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత కానరాని మాట నిజమే. కాకపోతే కొత్త రాష్ట్రానికి వుండే ఇబ్బందులను ప్రజలు అర్ధం చేసుకుని సహకరిస్తున్నారు కానీ  ఇష్టపూర్తిగా కాదన్న వాస్తవాన్ని తెలుగు దేశం అధినేత గుర్తుపెట్టుకోవాలి.
ఇక చంద్రబాబుకు మరో సువర్ణావకాశం పోలవరం రూపంలో వచ్చింది.  
దేశంలోని నదులన్నింటినీ అనుసంధానం చేయాలన్న ఆలోచనలోనుంచే ఈ ప్రాజెక్ట్ పురుడు పోసుకుంది. 1941 జులైలో అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి ఈ ప్రతిపాదన వచ్చింది.  ప్రెసిడెన్సీ నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ ఎల్. వెంకట కృష్ణ అయ్యర్ మొదటి ప్రాజెక్ట్ నివేదిక తయారుచేసారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా మూడు లక్షల యాభై వేల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యంతో పాటు నలభయ్ మెగావాట్ల విద్యుత్ ను కూడా ఉత్పత్తి చేయవచ్చని ఆయన ఆ రోజుల్లోనే తలపోశారు. మొత్తం ప్రాజెక్ట్ వ్యయాన్ని ఆరున్నర కోట్ల రూపాయలుగా అంచనా వేసారు. ప్రాజెక్ట్ అతీగతీ లేదు కాని అంచనావ్యయం మాత్రం స్వతంత్రం వచ్చేనాటికి ఆరున్నర కోట్ల నుంచి రెండువందల కోట్లు దాటిపోయింది.  ప్రాజెక్ట్ రిజర్వాయర్ జలాలు వెనుకవున్న భద్రాచలం సీతారామస్వామి గుడిని తాకే అవకాశం వున్నందువల్ల 'రామపాద సాగర్' అని పేరు పెట్టారు. తదనంతరం కె.ఎల్.రావు గారు, పోలవరం కుడి గట్టు కాల్వని, కృష్ణానదిపై ఆక్విడక్ట్ నిర్మించి గుంటూరు జిల్లావరకు పొడిగించేట్టు ప్రతిపాదించారు. ఇలా ప్రతిపాదనలన్నీ కాగితాలపై వుండగానే, ప్రాజెక్ట్ అంచనా వ్యయం వేల కోట్లకు పెరిగిపోయింది. 1980 లో అప్పటి ముఖ్యమంత్రి టి.అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు మొదటి పునాది రాయి వేసారు. శంఖుస్థాపన పలకం బీటలు వారిపోయింది కాని ప్రాజెక్టు పనులు ఒక అంగుళం కూడా ముందుకు సాగలేదు. ఇలా పురోగతి లేకుండా దస్త్రాలలోనే పడివున్న పోలవరం ప్రాజక్టుకు,  వై. ఎస్. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న చొరవతో కదలిక మొదలయింది. ఆయన ఈ ప్రాజెక్టుకు పదమూడువందల కోట్లు మంజూరు చేసి మూలపడ్డ ప్రాజెక్టును మళ్ళీ పట్టాలు ఎక్కించారు. కుడిగట్టు కాల్వ నిర్మాణానికి టెండర్లు పిలిచారు. అలాగే ఎడమగట్టు కాల్వకోసం మరో పదమూడువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు.
పోలవరం ప్రాజెక్ట్ కూడా  చంద్రబాబుకు రాజకీయంగా చాలా కీలకం. విభజన తరువాత తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ తలకు మించిన భారమే.  అయినా ప్రతి సోమవారం ఆ ప్రాజెక్టు పురోగతి గురించిన సమీక్షలు నిర్వహిస్తూ వస్తున్నారు. సమీక్షలతో ప్రాజెక్టు పూర్తి కాదు కదా! అది ఆయనకు బాగా తెలుసు. అందుకే ఢిల్లీ మీద ఒత్తిడి పెంచారు.
ఏడాది చివర్లో చంద్రబాబు ప్రభుత్వానికి చిన్న తీపి కబురు అందింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన కేంద్ర నిధుల్లో కొంత భాగం చెక్కు రూపంలో చేతికి వచ్చింది. అంతే! క్షణం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టు స్పిల్ వే కాంక్రీటు పనులకు స్వయంగా ఆయనే శంకుస్థాపన చేశారు. చెక్కు చేతికి అందిన నాలుగు రోజుల్లోనే మెరుపు వేగంతో ఆ కార్యక్రమాన్ని నిర్వహించిన  తీరు గమనించిన వారికి సకాలంలోనే దాన్ని పూర్తి చేయగలరన్న నమ్మకం కలిగి వుంటుంది. అయితే కేంద్రం ఎంతో అబ్బురంగా అందించిన డబ్బు, ప్రాజెక్టు అంచనా వ్యయం  ఈ రెంటినీ పోల్చి చూసుకుంటే రెండేళ్లలో పని పూర్తి కావడం సాధ్యమా అనే సందేహం కలుగుతుంది.              
ఈ ప్రాజెక్ట్ అనుకున్న విధంగా పూర్తి చేయగలిగితే ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాలకు వరంగా మారుతుంది. పూర్తి చేయకుండా ఒదిలేస్తే రాజకీయంగా తెలుగు దేశం పార్టీకి శాపంగా మారుతుంది. అంచేతనే 2018 కల్లా పోలవరం పూర్తి చేసితీరుతామనే ప్రకటనలు ఆ పార్టీ  నాయకులు తరచూ చేస్తూ వస్తున్నారు. ప్రాజెక్ట్ అనుకున్న విధంగా, అనుకున్న వ్యవధిలో పూర్తి అవుతుందా అంటే జవాబులేని ప్రశ్నే.  ఒక సమాధానం మాత్రం ఇబ్బంది లేకుండా చెప్పవచ్చు. ప్రాజక్ట్ అంచనా వ్యయం మాత్రం అంచనాలకు మించి పెరిగిపోవడం ఖాయం.
ఎన్ని సంక్షేమ పధకాలు మొదలు పెట్టినా చంద్ర బాబు ఎన్నికల వైతరణి దాటాలంటే అటు రాజధాని నిర్మాణం కొంతయినా చేసి చూపించాలి. ఇటు పోలవరం ప్రాజక్టును కొంతయినా కట్టి చూపించాలి. ఇది ఎరిగిన రాజకీయ నాయకుడు కావడం వల్లనే ఈ రెండిటి పట్లా ఆయన చాలా శ్రద్ధ చూపిస్తున్నారు.
ఇక చంద్రబాబు నాయుడు చెప్పుకోవాల్సిన నూతన సంవత్సర సంకల్పం.
ప్రతి విషయానికీ ప్రతిపక్షాన్ని ఆడిపోసుకోకుండా, అభివృద్ధికి అడ్డుపడుతున్నారని నెపం మోపకుండా  తన దీక్షాదక్షతలపై  ప్రజలు పెట్టుకున్న నమ్మకం వమ్ము కాకుండా చూసుకోవాలి.
పొతే తెలంగాణా.   
తెలంగాణాలో కేసీఆర్ ప్రభుత్వం నల్లేరు మీది బండి నడకలా సాగిపోతోంది. కేసీఆర్ మాట అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో సుగ్రీవాజ్ఞగా చెల్లుబడి అవుతోంది. ఎదురులేదన్న నమ్మకంతో వేస్తున్న కొన్ని అడుగులు ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్నాయన్న సంగతిని ఆ పార్టీ అధినేత గమనించడం లేదేమో అనిపిస్తోంది. అనేక మంచి పనులు చేస్తున్నప్పుడు అనవసరమైన విమర్శలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటున్నారేమో తెలియదు.
సమస్యలు అన్నింటికీ తెలంగాణా ఏర్పాటు ఒక్కటే సర్వరోగనివారిణి అనీతెలంగాణా రాగానే ఏళ్ళతరబడి పేరుకునివున్ననీళ్ళూ, నిధులూ, నియామకాల వంటి ఈ ప్రాంతపు  సమస్యలన్నీ  మంత్రం వేసినట్టు  మాయం అయిపోతాయని ప్రత్యేక రాష్ట్రం కోరుకున్నవారు అనుకున్నారు. అయితేవారనుకున్నట్టూ ఏమీ జరగలేదు. రాత్రికి రాత్రే  సమస్యలు అన్నీ పరిష్కారం అయిపోలేదు.
అయినా కేసీఆర్ పైన ప్రజల అభిమానం చెక్కు చెదరలేదు. రాష్ట్రం ఏర్పాటయిన తరువాత జరిగిన అన్ని ప్రధాన ఎన్నికల్లో టీఆర్ఎస్  నే గెలిపిస్తూ వచ్చారు. కేసీఆర్ తమ కళ్ళ ముందు ఆవిష్కరిస్తున్న బంగారు తెలంగాణా స్వప్నం పట్ల వాళ్ళ నమ్మకం చెక్కుచెదరలేదు. మొన్నీ మధ్య ఆయన ప్రారంభించిన రెండు పడక గదుల ఇల్లు అనే పధకంతో ఆయన పట్ల నమ్మకం మరింత పెరిగి వుంటుంది కూడా.    
అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ చెప్పిన మాటలు ఏమిటి? చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అసలు ఇంతకాలంగా చేసింది ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కేసేఆర్ నేతృత్వం వహిస్తున్న పార్టీలోను, ప్రభుత్వంలోను ప్రజాస్వామ్య విలువలు పడిపోతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ ప్రచార కోశంలో వీటన్నిటికీ జవాబులు సిద్ధంగా వుండొచ్చు. ప్రచారమే ప్రధానం అనుకుంటే, వాస్తవానికి చరిత్రలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రికీ దొరకనంతగా విస్తృత, సానుకూల  ప్రచారం కేసీఆర్ కు లభిస్తోంది. పత్రికలవారితో పన్నెత్తి మాట్లాడడమే అపురూపం. అయినా మీడియాలో ఆయనకు వస్తున్న ప్రచారం అపూర్వం.   
అయితే ఇంతటితో సరా! సరే అని  ఇవ్వాళ ప్రజలు సరిపుచ్చుకోవచ్చు.  రేపూ ఇలాగే వుంటుందనే గ్యారంటీ వుందా?
ఈ కొత్త సంవత్సరం శుభ సందర్భంలో కేసీఆర్ ఒక సంకల్పం చెప్పుకోవాలి. ప్రజలు అప్పగించిన పుణ్య కాలంలో మిగిలిన రెండేళ్ళు, ( చివరి ఆరునెలలు ఎన్నికల హడావిడే సరిపోతుంది) రాజకీయ భేషజాలకు స్వస్తి చెప్పి తనను నమ్ముకున్న ప్రజలను ఓ కంట కనిపెట్టి చూడాలి. ఏ విషయంలో ఎవరయినా ఏదైనా   ప్రశ్నిస్తే అందులోని నిజాయితీని కనిపెట్టగలగాలి. రాజహంస పాలనూ, నీళ్ళనూ వేరు చేసినట్టు, రాజకీయ ఆరోపణలను, నిజాయితీగా చేసే విమర్శలను వేర్వేరుగా చూడగలగాలి.
ఇది కేసీఆర్ చెప్పుకోవాల్సిన సంకల్పం.
ప్రధాని నరేంద్ర మోడీ, తెలంగాణా ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ముగ్గురినీ కేవలం అనుభవం, సమర్ధత  కారణంగానే ప్రజలు వారు కోరుకున్న గద్దెలు ఎక్కించారు. అనుభవంలో కాని, రాజకీయ చాణక్యంలో కాని ఈ మువ్వురు  ఒకరికొకరు ఏమాత్రం  తీసిపోరు. వీరికి వున్న ఈ సానుకూల లక్షణాలన్నీ జనరంజకమైన పాలనకు దోహదం చేసి తీరాలి. మరి అయిదేళ్ళ విలువైన కాలంలో ఇంత కాలం గడచిపోయింది కానీ జనాలు కోరుకున్నది ఏమన్నా జరిగిందా?
వీరిలో పోలిక కలిగిన లక్షణం కూడా  ఒకటుంది.
ఏదైనా  మంచిపని  చేసినప్పుడు ఆ విషయాన్ని వారంతట వారే బయటకు చెప్పుకుంటున్నట్టే, చేయలేని విషయాన్ని ఎవరయినా ప్రస్తావిస్తే చాలు అగ్గిమీద గుగ్గిలం అయిపోతారు. ‘అభివృద్ధికి అడ్డు తగులుతున్నారనే’ అభాండం వేస్తున్నారు. లేదా తమ వైఫల్యాలకు మునుపటి  పరిపాలకుల నిర్వాకం కారణం అని  కొట్టి పారేస్తున్నారు. గతంలో  జరిగిన పొరబాట్లను లేదా తప్పులను  చక్కదిద్దే దక్షత వుందన్న కారణంతోనే ప్రజలుతమకు  పట్టం కట్టారన్న సంగతి మరిచి పోతున్నారు.
“మీ సమర్ధతకు మెచ్చి ప్రజలు  ఇచ్చిన నజరానా మీ పదవులు. అందుకు బదులుగా వారికి ఏదైనా చేయండి. సమయం తగ్గిపోతోంది. ప్రతిపక్షాలను పక్కన పెట్టి ప్రజలను అక్కున చేర్చుకోండి.”
నూతన సంవత్సరం సందర్భంగా జనశ్రేయోభిలాషులు వారిని కోరుకునేది ఇదొక్కటే.
ఇలాటి వారందర్నీ రాజకీయ ప్రతికక్షులుల గాటన కట్టి తేలిగ్గా  కొట్టిపారేయడం తగదు. ఎన్నికలకు  ముందు చెప్పిన మాటలను గుర్తుకు తెచ్చుకుంటూ, చేసిన పనులను మననం చేసుకుంటూ, అడగాలని అనుకుని అడగలేని బడుగులు కూడా తమను ఎన్నుకున్న జనాల్లో  ఉంటారని ఏలికలు గుర్తు పెట్టుకోవాలి. వీరికి జవాబు చెప్పనక్కరలేదు. గుర్తుపెట్టుకుంటే చాలు. గుర్తుపెట్టుకున్నట్టు కనిపిస్తే మాత్రం  కుదరదు. ఎందుకంటే అయిదేళ్ళు కాగానే అన్నీ గుర్తు పెట్టుకునే గొప్ప ప్రజాస్వామిక లక్షణం ప్రజల్లో  నిండుగా  వుంది.
చరిత్ర రుజువు చేసిన సత్యం ఇది.
సర్వజన హితాన్ని గమనంలో వుంచుకుని రాస్తున్న ఆప్తవాక్యం ఇది.  
(31-12-2016)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595 

27, డిసెంబర్ 2016, మంగళవారం

తెలియనివాడజ్ఞుండగు


తెలిసినవాళ్ళు, తెలియనివాళ్ళు అని మనుషులు  రెండు రకాలు.
తెలిసిన వాళ్ళు తమకు అన్నీ తెలుసనుకుంటారు. దానివల్ల లాభమయినా నష్టమయినా వారికే.
తమకు అన్నీ తెలిసినట్టే అందరికీ అన్నీ తెలుసని కూడా  అనుకుంటారు. దానివల్ల కూడా ఇతరులకు ఇబ్బంది తక్కువే.
అందరికీ అన్నీ తెలిసివుండాలి అని అనుకోవడం వుంది చూశారు అందువల్లే ఇబ్బంది.
పైగా ‘ఈ మాత్రం కూడా తెలియదా!’ అనే వెక్కిరింపులు, కొక్కిరింపులు మరీ బాధాకరం.

అన్నీ తెలుసనుకునే వారికి ఈ వాస్తవం తెలియక పోవడం మరింత బాధాకరం