7, సెప్టెంబర్ 2015, సోమవారం

ఉపశమనమా ? పరిష్కారమా ?

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 10-09-2015, THURSDAY)

దేశంలో రైతుల ఆత్మహత్యల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు ఒకదానితో మరొకటి పోటీ పడుతూ అగ్రస్థానానికి ఎగబాకుతున్నాయనో, చేరుకున్నాయనో  ఓ వార్త చదివిన గుర్తు. నిజానికి ఇదేమీ భుజాలు ఎగరేసి గర్వంగా చెప్పుకునే విషయం కాదు. పైపెచ్చు సిగ్గుపడాల్సిన సంగతి.


ఈ మధ్య పత్రికల్లో మరో వార్త వచ్చింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో రెండు తెలుగు రాష్ట్రాల రైతులు నారుమళ్ళు వేసుకోవడానికి కూడా సాగునీరు లేక అల్లాడిపోతుంటే మరోపక్క ఆ సరిహద్దులకు అవతలవైపు వున్న ఆ రెండు రాష్ట్రాల పొలాలు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయని. కృష్ణా గోదావరి నదీ జలాలు సముద్రంలో కలవడానికి ముందు ఆ నదులు ప్రవహించేది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే. ఆ కారణంతో చాలా సంవత్సరాలపాటు ఎగువన వున్న రాష్ట్రాలు నీటి ప్రాజెక్టులు కట్టుకునేటప్పుడు ఆంద్రప్రదేశ్ సేద్యపు నీటి అవసరాలను గమనంలోకి తీసుకోవాల్సిన పరిస్థితి  వుండేది. ఇప్పుడా వెసులుబాటు లేదు.  మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ముందు చూపుతో ఆ రెండు నదుల మీద అనేక ప్రాజెక్టుల నిర్మాణాన్ని పూర్తిచేసుకోవడంతో రెండు తెలుగు రాష్ట్రాలకు, ప్రత్యేకించి తెలుగు రైతులకు  ఒక ఇబ్బందికరమైన పరిస్థితి తలెత్తింది.      
మహారాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యకు ఒక కొత్త పరిష్కారం దిశగా ఆలోచిస్తోంది. ఎవరయినా వ్యక్తులు ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితుల్లోకి నెట్టబడినప్పుడు, కొద్దిరోజులపాటు అసలు ఆత్మహత్య చేసుకోవాలా వద్దా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతుంటారు. సరిగ్గా ఆ దశను గుర్తించి వారికి సరయిన తీరులో నచ్చచెప్పగలిగితే వారు ఆ తీవ్రమైన చర్యకు పూనుకోకుండా నిరోధించవచ్చని  మానసిక వైద్య నిపుణులు చెబుతుంటారు. ఈ సూత్రం ఆధారంగా ఆ ప్రభుత్వం ఒక పైలట్ పధకానికి అంకురార్పణ చేసింది. ప్రస్తుతం అందుబాటులో వున్న ఆశా వర్కర్లను, వారికి తోడుగా కొందరు కౌన్సిలర్లను కాంట్రాక్టు పద్దతిపై వినియోగించి రైతులకు సరయిన సమయంలో తగు సూచనలు, సలహాలు ఇవ్వడం ద్వారా వారిని ఆత్మహత్యా ప్రయత్నం నుంచి వెనక్కు మళ్ళించాలనేది ఈ పధకం ఉద్దేశ్యం. తద్వారా ఆత్మహత్యల సంఖ్యను గణనీయంగా తగ్గించాలన్నది  అక్కడి ప్రభుత్వ సంకల్పం. ఇందుకోసం ఆర్ధిక ఇబ్బందుల్లో వున్న రైతుల జాబితాను కూడా సిద్ధం చేసింది.  సరే! ఇదొక పద్దతి. ఇది పైలట్ ప్రాజెక్టు కాబట్టి ఫలితాలు తెలియడానికి కొంత సమయం పడుతుంది.  కానీ రైతులను ఆత్మహత్య చేసుకోవాలనే దిశగా వారిని ప్రోద్బలపరుస్తున్న సమస్యల  సంగతేమిటి? వాటికి పరిష్కారం ఏమిటి?
ఒక మనిషిని ఆత్మహత్య దిశగా నెట్టడం తేలిక కావొచ్చేమో కానీ నిజానికి ఆత్మహత్య చేసుకోవడం అంత సులభం కాదు. పిరికితనంతో ఆత్మహత్యలు చేసుకోవద్దని ఉద్భోదిస్తూ వుంటారు కానీ అలా సొంత స్వయంగా తీసుకోవడానికి ఎంతో ధైర్యం కావాలి. ఒక మనిషిని హత్య చేయడానికి తాత్కాలిక భావోద్రేకం కూడా కారణం కావచ్చు కానీ రైతు ఆత్మహత్య చేసుకోవడానికి అనేక కారణాలు దోహదం చేస్తాయి. వీటిల్లో ప్రధానమైనది స్వాభిమానం. వూళ్ళో వడ్డీ వ్యాపరులనుంచో, లేదా బ్యాంకుల నుంచో తీసుకున్న ఋణం సకాలంలో ఎలా చెల్లించాలి, చెల్లించకపోతే వూళ్ళో మొహం చెల్లని పరిస్థితిని తట్టుకోవడం ఎల్లా అనే సగటు రైతు మధన పడిపోతుంటాడు. ఋణం తీరిపోతే అలాటి వారికి ప్రాణం లేచివచ్చినట్టుగా వుంటుంది.
ఇక వారికి తెలిసిన విద్య ఒక్కటే. పండినా పండకపోయినా పంటలు పండించడం. సకాలంలో వానలు కురవక సేద్యపు నీళ్ళు లేక  వేసిన  పైర్లు  తమ కళ్ళ ముందే ఎండిపోతుంటే,  వాళ్ళ కళ్ళలో నీళ్ళు  మాత్రం ఎండిపోవు. వారి కష్టాలకు సజీవ సాక్ష్యాలుగా సతతం కళ్ళల్లో వూరుతూనే వుంటాయి. ఒకవేళ సరయిన సమయంలో నాలుగు మంచి వానలు పడ్డప్పటికీ వారి కష్టాలు తీరిపోవు. నాణ్యమైన విత్తనం దొరక్కపోతే, భూమిలో విత్తిన గింజ మొలవదు. ఒకవేళ మంచి విత్తనాలు దొరికి చేను పచ్చపడ్డా అదునుకు ఎరువులు దొరకవు. ఒకవేళ అదృష్టం బాగుండి అవి దొరికి చేలో పంట ఏపుగా పెరిగినా కాలం కలిసి రాకపోతే అకాల వర్షాలతో పొట్టకొచ్చిన పైరు కృష్ణార్పణం. ఒకవేళ ఆ సమస్యలు కూడా లేకుండా  పంట ఇంటికి చేరినా అమ్మబోతే అడివి సామెత మాదిరిగా గిట్టుబాటు ధర కలికానికి కూడా దొరకదు. చేబదుళ్లు తీర్చడం కోసం ఏదో  ధరకు అమ్మినా అప్పులు పూర్తిగా తీరే  అవకాశం వుండదు. ఒకవేళ అలాటి శుభతరుణం వాళ్ళ జీవితాల్లో ప్రవేశించినా  వచ్చే ఏడు ఇదే తంతు మళ్ళీ మొదలు.
రైతులందరూ ఇలాగే ఈ విష చక్రబంధంలో వున్నారా అంటే పూర్తిగా ఔనని చెప్పలేము. కొందరు ఇటువంటి కష్టాలను తేలిగ్గా తట్టుకోగలిగిన స్థితిలో వున్న స్థితిపరులు అయివుండవచ్చు. అధిక సంఖ్యాకులు మాత్రం ఈ నిత్య బాధలు పడుతూనే వున్నారు. పంట  పండినా ఎండినా తమ ఖర్మం అనుకుంటూ బతుకుబండి లాగించేవారే ఎక్కువ. కొందరు మాత్రం ఎదురీతలో అలిసిపోయి బతుక్కు ముగింపు వాక్యం పలకాలనే నిస్పృహలోకిజారిపోతుంటారు. మనం నిత్యం పత్రికల్లో చదివే దురదృష్టకర సంఘటనలు ఇటువంటి వారిగురించే.
రైతులు ఆత్మహత్యలు అనే అంశం ప్రస్తుతం రాజకీయాల్లో ఒక ఆయుధంగా మారింది. ప్రతిపక్షంలో వున్నప్పుడు ఆయుధంగా పనిచేసిన ఇదే అంశం అధికార పీఠం ఎక్కగానే ఆత్మరక్షణ లోకి నెట్టివేస్తుంది.
నిజానికి రైతులకు అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం లేదా అది చేస్తాం, ఇది చేస్తాం అనడం వారిని చిన్నబుచ్చటమే. నిజానికి వాళ్ళే, తాము తిన్నా తినకపోయినా  సమాజానికి ఇంత భిక్ష పెడుతున్నారు. వారికి ఎవరూ ఏమీ చేయనక్కరలేదు. ప్రభుత్వాలు కొన్ని పనులు చిత్తశుద్ధితో చేస్తే చాలు.
సమయానికి నాణ్యమైన విత్తనాలు వారి ఇంటి వద్దనే అందించండి. ఎరువులు సకాలంలో సరఫరా చేయండి. సరయిన వానలు సకాలంలో కురవక పొతే ప్రత్యమ్న్నాయలు ప్రత్యామ్న్నాయాలు సూచించండి. అధిక వర్షాలు పడి పంటలు నష్టపోతే ఇబ్బందులు పెట్టని భీమా వ్యవస్థని అమల్లో పెట్టండి. పండిన పంట వారిచేతుల్లో నుండి వెళ్లి పోయిన తరువాత ఆమధ్య దళారులు ధరలను పెంచే విష సంస్కృతికి అడ్డుకట్ట వేయండి. వాళ్ళు పండించిన పైర్లకు ధరలను వాళ్ళే నిర్ణయించుకునే వెసులుబాటు కల్పించండి.
ఆర్ధిక ఇబ్బందుల్లో చిక్కుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే రైతుల కుటుంబాలకు ఆర్ధికంగా ఊతం ఇవ్వండి. ప్రచారం కోసం కాకుండా చిత్తశుద్ధితో ఈ సాయం అందిస్తే వారి ఆత్మ గౌరవం దెబ్బతినకుండా వుంటుంది. ఈ ఉపశమన సాయాలకు తోడు, శాశ్వితంగా వారి సమస్యలను పరిష్కరించే కార్యాచరణకు నడుం కట్టండి. సాయం అందించండి కానీ ఎల్లకాలం వారు ప్రభుత్వ దయాదాక్షిణ్యాలకోసం ఎదురు చూసే దుస్థితిలోకి నెట్టకండి. అన్నింటికీ మించి నలుగురికి అన్నం పెట్టే రైతుల్ని ఓటు బ్యాంకుగా మలచుకునే దుష్ట సాంప్రదాయానికి దూరంగా జరగండి.
రైతుకు అవసరమైనవి మీరు చేస్తే మీకు అవసరమైనవి రైతు తానే చేస్తాడు.
రైతును రక్షిస్తే ఆ రైతే మిమ్మల్ని రక్షిస్తాడు.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595  
NOTE: Courtesy Image Owner                            

పెద్ద గీత - చిన్న గీత

స్టేట్ బ్యాంక్ సీజీఎం గా  రిటైర్ అయి హైదరాబాదులో స్థిరపడ్డ ఓ పెద్దమనిషి బ్యాంక్ ప్రొబేషనరీ అధికారుల ఇంటర్వ్యూ బోర్డు చైర్మనుగా గత రాత్రి  ఒడిసా రాజధాని భువనేశ్వర్ కు వెళ్ళారు. మూడు  దశాబ్దాల క్రితం ఆ రాష్ట్రం  కొత్తగా ఏర్పడ్డప్పుడు కొత్తగా కట్టిన రాజధానీ నగరం అది. భువనేశ్వర్ విమానాశ్రయం పూర్వం బేగం పేట ఎయిర్ పోర్టు మాదిరిగా వుంటుంది. ఇంతవరకూ ఆ రాష్ట్రానికి అంతర్జాతీయ విమానాశ్రయం వైభోగం లేదు. హైదరాబాదు నుంచి వెళ్ళిన బ్యాంకు మాజీ అధికారి  విమానం దిగి ఎయిర్ పోర్టులో ఎస్కలేటర్ ఎక్కగానే కరెంటు పోయింది. విమానాశ్రయంలో కరెంటు పోవడం ఆయనకు తొలి అనుభవం. ఎయిర్ పోర్టు నుంచి గెస్టు హౌస్ కు వెళ్ళేవరకు దారిలో అనేక పర్యాయాలు కరెంటు పోవడం రావడం జరుగుతూ వచ్చింది. ఇక ఆ రాత్రి గెస్టు హౌస్ లో గడిపిన తరువాత  అక్కడ తరచుగా వాటిల్లే కరెంటు అంతరాయాలకు  ఆయన పూర్తిగా అలవాటు పడిపోయారు.
నవీన్ పట్నాయక్ ఒడిసా రాష్ట్రపు ముఖ్యమంత్రి. బాగా చదువుకున్నవాడు. పేరుకు తగ్గట్టే నవీన భావాలు కలిగినవాడు. అవినీతి మచ్చలు పడనివాడు. ఆయన నేతృత్వంలో బిజూ జనతా దళ్ వరసగా మూడో పర్యాయం అధికారంలో కొనసాగుతోంది. చక్కటి పరిపాలకుడు అని ప్రజలు విడవకుండా పట్టం కడుతున్న ఆ రాష్ట్రంలో కరెంటు పరిస్తితి అది.
ఆ రాష్ట్రాన్ని చూసి పరవాలేదు మనమే నయం అనుకోవాలా?         


4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

షరా మామూలు అసెంబ్లీ సమావేశాలు


‘నేడే విడుదల, రేపే ఆఖరు రోజు, ఈ రోజే చూడండి!’ అనే తరహాలో నవజాత  ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ  సమావేశాలు హైదరాబాదులో  అయిదు రోజులపాటు జరిగి ముగిసాయి. ఈ సమావేశాలు సజావుగా సాగాయా అంటే జరగాల్సినట్టు జరగలేదని చెప్పొచ్చు. జరగలేదా అంటే జరగకూడని విధంగా జరిగాయని కూడా చెప్పవచ్చు. వర్షాలు లేని ఈ వర్షాకాల సమావేశాల్లో ఉరుములు, మెరుపులకు మాత్రం కొదవ లేదు.


షరా మామూలుగానే అయిదు రోజులూ ఒక్క రోజుకూడా మినహాయింపు లేకుండా అధికార పక్షం, ప్రతిపక్షం నడుమ ఏదో ఒక అంశంపై వాదాలు, ప్రతివాదాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు ఇలాగే నడిచిపోయింది. ఇక ఆఖరి రోజు ప్రత్యేకత వాయిదాల పర్వం. సభ నిరవధికంగా వాయిదా పడడానికి పూర్వం అనేకమార్లు వాయిదాలు పడ్డం,  తిరిగి సమావేశం కావడం, మళ్ళీ వాయిదా పడ్డం ఇలా గడిచి పోయింది.    
అలా అని సభలో ఏ కార్యక్రమాలు ఎజెండా ప్రకారం జరగలేదని కాదు. ఆంద్ర ప్రదేశ్ కొత్త రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. పట్టిసీమ, కరవు ఇతర అంశాలపై చర్చ జరిపింది. అక్రమ ఆస్తుల కేసుల్లో స్వాధీనం చేసుకునే ఆస్తులు  రాష్ట్ర ప్రభుత్వానికి దఖలు పడేలా వీలు కల్పించే బిల్లుతో సహా తొమ్మిది బిల్లుల్ని ఆమోదించింది. అయితే కొన్నింటిపై చర్చ అరకొరగా జరిగిందనీ, మరికొన్నింటిపై  చర్చకు ఆస్కారమే లేకుండా చేసిందనీ ప్రభుత్వంపై  ప్రతిపక్షం ఆరోపిస్తే, ప్రతిపక్షం అనవసర అంశాలు లేవనెత్తి సభాసమయాన్ని వృధా చేయడం వల్లనే ఈ పరిస్తితి తలెత్తిందని పాలక పక్షం సమర్ధించుకుంది.      
2014 లో జరిగిన ఎన్నికల తరువాత, కొత్తగా ఏర్పడ్డ ఈ తెలుగు రాష్ట్రంలో ఒక కొత్త  రాజకీయ చిత్రం ఆవిష్కృతమైంది. మొట్టమొదటిసారిగా రెండు పార్టీల వ్యవస్థ ఊపిరి పోసుకుంది. ఇంతవరకు శాసనసభల్లో అనేక రకాల పార్టీలకు కొద్దో గొప్పో,  ఎంతో కొంత ప్రాతినిధ్యం వుండేది. కానీ ఈ సారి సభలో రెండే రెండు పక్షాలు. ఒకటి పాలక పక్షం టీడీపీ. రెండోది ప్రతిపక్షం  వై.ఎస్.ఆర్.సీ.పీ.  బీజేపీకి  కొన్ని స్థానాలు లేకపోలేదు కానీ ఆ పార్టీ  పాలకపక్షానికి మిత్ర పక్షం మాత్రమే కాకుండా రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామి కూడా. పొతే వున్న ఒకేఒక్క ఇండిపెండెంటు సభ్యుడు కూడా పాలకపక్షంలో చేరిపోయారు. ఏతావాతా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో సహకరించుకున్నా, సంఘర్షించుకున్నా మిగిలిన పార్టీలు రెండే రెండు. ఆ  రెండూ ప్రాంతీయ పార్టీలు కావడంతో ఇక వాటి మధ్య సయోధ్య, సహకారం ఆశించడం వృధా.  కనీసం  రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాల్లో సయితం  ఈ రెండు పార్టీలు ఉత్తర దక్షిణ ధృవాలుగా వ్యవహరిస్తూ రావడం గత చాలా కాలంగా చూస్తూ వస్తున్నదే. ఈ అయిదు రోజులూ శాసనసభలో అవే దృశ్యాలు మళ్ళీ మళ్ళీ కనబడ్డాయి.
సాధారణంగా గతంలో ఇటువంటి పరిస్తితులు తలెత్తినప్పుడు, సంఖ్యాబలం లేకపోయినా మిగిలిన రాజకీయ పార్టీలు కల్పించుకుని ఉభయులకు సర్ది చెప్పి పరిస్తితిని తాత్కాలికంగా అయినా సర్దుబాటు చేసేవి. దురదృష్టం ఏమిటంటే ఇప్పటి సభలో అటువంటి అవకాశం కూడా లేదు.   
ఈసారి మాటల తూటాలు పెరిగాయి. వాటిల్లో ఘాటు పెరిగింది. రికార్డుల నుంచి తొలగించకపోయినా కొందరు వాడిన పద ప్రయోగాలు అసెంబ్లీ సమావేశాల ప్రత్యక్ష ప్రసారాలు చూస్తున్న వారిని కలత పెట్టాయి. మూర్ఖుడు, రౌడీ, సైకో  వంటి పదాలు వింటున్నప్పుడు మనసు చివుక్కుమనిపించింది. పైగా నోరుజారి పొరబాటున  ఆ పదాలు వాడారేమో అనే సందేహానికి ఆస్కారం ఇవ్వకుండా వాటినే ఒకటికి రెండు సార్లు రెట్టించి మరీ ప్రయోగించారు.  అలా మాట్లాడిన వారందరూ గౌరవనీయ శాసన  సభ్యులు. వారి పేరుకు ముందు ‘గౌరవనీయ’ అనే పదం విధిగా జోడించి వాడుతుంటారు. మరి ఇలా నోర్లు పారేసుకోవడం వల్ల ఆ గౌరవం భంగపడే అవకాశం ఉంటుందన్న వాస్తవాన్ని వారు గమనిస్తున్నట్టులేదు. ‘ప్రజలు గమనిస్తున్నారు’ అని వారు పదే పదే ప్రస్తావిస్తూ వుంటారు కానీ,  వాళ్ళే ఆ విషయం  పట్టించుకుంటున్న దాఖలా కానరావడం లేదు.
పాలక, ప్రతిపక్ష సభ్యులు సభలో అడుగు పెట్టడానికి ముందే అవతల పక్షాన్ని ఇరుకున పెట్టడానికి ఏం మాటలు వాడాలో అన్న విషయంలో ముందే ఒక  వ్యూహం సిద్ధం చేసుకుని వస్తున్నట్టు కనబడుతోంది. ఎదుటివారిని ఆత్మరక్షణలోకి నెట్టడం ద్వారా తమది పైచేయి అనిపించుకోవాలనే ధోరణి ప్రస్పుటంగా కనబడుతోంది. దీనివల్ల మాటకు మాట అనడంలో ఔచిత్యం లోపించి, కేవలం అసంబద్ధత మాత్రమే  కొట్టవచ్చినట్టు వ్యక్తం అవుతోంది. తమలపాకుతో తానిట్లంటే తలుపు చెక్కతో తానొకటి తగిలించానన్న చందంగా ఒకరికొకరు తీసిపోకుండా పోటాపోటీగా వ్యవహరించారు.   
గతంలో ఎన్నోసార్లు చెప్పుకున్నట్టు సభ సాఫీగా నడిస్తే అది ప్రతిపక్షానికే ప్రయోజనం. నడవక వాయిదాలు పడుతూ ముగిసిపోతే అది  పాలక పక్షానికి లాభం. సమయం లేదన్న సాకు చూపించి ఆమోదింప చేసుకోవాల్సిన బిల్లులనన్నిటినీ, ఒక్క దెబ్బతో  ఎలాటి చర్చా లేకుండా ‘గిలెటిన్’  ఆయుధం ప్రయోగించి ఒడ్డున పడవచ్చు. అయితే సభ సజావుగా నడిపించాల్సిన ప్రధాన బాధ్యత మాత్రం పాలక పక్షానిదే. ‘నడక’ గురించీ, ‘నడత’ గురించీ ఆట్టే పట్టింపులు లేకపోవడం వల్లనో  ఏమో, ఉభయులూ  ఈ విషయంలో తమ పాత్రలకు సరయిన న్యాయం చేయలేకపోతున్నారన్నది మాత్రం సుష్పష్టం. విలువైన సభాసమయాన్ని వృధా చేస్తున్నారని పాలకపక్షం సభ్యులు, ప్రజా సమస్యలపై సవివరంగా మాట్లాడే అవకాశం తమకు ఇవ్వడం లేదని, తమ గొంతు నొక్కుతున్నారనీ ప్రతిపక్షం – సభ లోపలా వెలుపలా ఇలా పరస్పరం దుమ్మెత్తి పోసుకోవడం ఈ అయిదు రోజులూ నిత్య కృత్యమైపోయింది. ప్రతి విషయానికీ పోడియంలోకి దూసుకుపోవడం ప్రతిపక్షానికి అలవాటుగా మారితే, ప్రతిపక్ష నేత ఏం మాట్లాడబోయినా దానికి స్వయంగా మంత్రులే అడ్డం పడడం ఓ కొత్త సాంప్రదాయం అయింది. ఇది చాలదన్నట్టు సభలో మాట్లాడింది మరోసారి వినిపించడానికీ, సభలో మాట్లాడలేనిది జనాలకు తెలియచెప్పడానికీ పాలక ప్రతిపక్షాలకు రెండింటికీ అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింటే ఉమ్మడి వేదికగా తయారయింది. ఈ మాత్రం దానికి అంతంత ప్రజాధనం ఖర్చు చేసి అసెంబ్లీ నడపడం ఎందుకు, మీడియా పాయింటు చాలదా  అనే ప్రశ్న సామాన్యుల నుంచి ఉత్పన్నం అయితే ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.         
గతంలో కూడా ప్రతిపక్షాలు పాలకపక్షాన్ని ఇరుకునబెట్టే ప్రయత్నాలు చేసేవి. వాటిని తిప్పికొట్టే పద ప్రయోగాలు పాలకపక్షం వాళ్ళు చేసేవాళ్ళు. సభాకార్యక్రమాలు గమనించేవారికి ఆ వాదసంవాదాలు చాలా రసవత్తరంగా అనిపించేవి. మరునాడు దినపత్రికల్లో ఆ వార్తలు  శాసన సభలో ఛలోక్తుల పేరిట ‘బాక్స్ ఐటం’ అర్హతకు  నోచుకునేవి. ఈ రోజుల్లో ఒక్కటంటే ఒక్క వార్త అటువంటిది ఆహ్లాదంగా చదువుకుని ఆనందించగలిగే అవకాశం ఉందా! లేదని బల్లగుద్ది మరీ చెప్పవచ్చు.
పూర్వం  ఇటు శాసన సభలలోను, అటు పార్ల మెంటులోను హేమాహేమీల నడుమ చాలా ఆసక్తికరమైన,  అదే సమయంలో సిద్ధాంతబద్ధమైన చర్చలు సాగుతూ ఉండేవి. అయితే, ఇవేవీ  అసలు విషయానికి అడ్డం పడకుండా, ప్రధాన చర్చనీయాంశం తప్పుదోవ పట్టకుండా ఎదుటి మనిషి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ వారిని  కిక్కురుమనకుండా చేయగలిగే విధంగా సూటిగా హాయిగా జరిగిపోయేవి.               
దశాబ్దాలక్రితం బ్రిటిష్ పార్లమెంటులో ఒక మహిళా సభ్యురాలు లేచి నాటి ప్రధాన మంత్రి చర్చిల్ ని పట్టుకుని ‘నువ్వొక తాగుబోతువి’ అని దులిపేసింది. దానికాయన నొచ్చుకోకుండా ఇలా జవాబిచ్చాడుట.  ‘నిజమే! నేను తాగుబోతునే. కాకపొతే రాత్రి యెంత తాగినా తెల్లారేసరికల్లా మళ్ళీ మామూలు మనిషిని  అవుతాను. కానీ, నీ విషయం అట్లా కాదే, నువ్వొక అనాకారివయ్యే!’.  పొద్దున్న కల్లా నా మైకం తగ్గిపోవచ్చు కానీ ఎన్నాళ్ళు గడిచినా నీ అనాకారితనం అలాగే ఉంటుందన్నది చర్చిల్ మహాశయులు సుతిమెత్తగా అంటించిన వ్యాఖ్యలో దాగున్న శ్లేష. 
తోక టపా: చాలా ఏళ్ళక్రితం  ఏదో పత్రికలో ఓ జోక్ వచ్చింది. ఒక నిర్మాత తాను   తీయబోయే సినిమా కోసం ఘాటుగా రెండర్ధాలు వచ్చే సంభాషణలు రాయమని ఓ రచయితను కోరాడట.  దానికారచయిత – ‘ఇప్పుడు సినిమా రంగంలో అలాంటి  వాళ్ళెవ్వరూ లేరు, అంతా  రాజకీయ రంగంలోకి వెళ్ళిపోయారు’ అంటాడు.
అయితే,  ప్రస్తుతం ఆ పరిస్తితి వున్నట్టు లేదు. రెండర్ధాలు వచ్చే పదాలకోసం వెతుక్కోనక్కరలేదు. నేరుగా అర్ధం ధ్వనించే వాటినే వాడేసినా  అభ్యంతర పెట్టేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడందరూ  అలాటి మాటలకే అలవాటు పడిపోయారు కాబట్టి.  (05-09-2015)   
రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner  

2, సెప్టెంబర్ 2015, బుధవారం

రాజకీయుల నాలుకకు నరం వుంటుందా!


అడ్లాయ్ స్టీవెన్సన్ పాత తరం అమెరికన్ రాజకీయవేత్త. రాజకీయాల్లో దురదృష్టం వెంటాడిన వారిలో ఆయన ఒకరు. ఇలినాయిస్ గవర్నర్ గా వున్న ఆయనకు 1952 లో అమెరికన్ అధ్యక్ష పదవికి పోటీచేయడానికి డెమొక్రాటిక్ పార్టీ నామినేషన్ లభించింది. ఆ ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి  ఐసెన్ హోవర్ చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. 1956 లో  మళ్ళీ  డెమోక్రటిక్ పార్టీ ఆయన్నే అభ్యర్ధిగా నిలబెట్టింది. కానీ ఐసెన్ హోవర్ తిరిగి గెలుపొందడంతో  వైట్ హౌస్ కు దూరమయ్యారు. 1960   అధ్యక్ష ఎన్నికలనాటికి  డెమొక్రాటిక్ పార్టీ తన అభ్యర్ధిని మార్చి జాన్ ఎఫ్ కెన్నెడీని బరిలో దించింది. ఆ ఎన్నికలో కెన్నెడీ రిపబ్లికన్ అభ్యర్ధిని ఓడించి అమెరికా అధ్యక్షుడిగా అధికారం స్వీకరించారు. కెన్నెడీ శ్వేతసౌధంలో అడుగుపెట్టగానే చేసిన మొదటి పని ఏమిటంటే – తనకు ముందు రెండు ఎన్నికల్లో తమ పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయిన అడ్లాయ్ స్టీవెన్సన్ ను ఐక్యరాజ్యసమితిలో అమెరికా రాయబారిగా నియమించడం.
అడ్లాయ్  స్టీవెన్సన్ సంభాషణా చతురుడు. హాస్యోక్తులతో కూడిన ఆయన ఎన్నికల ప్రసంగాలను ప్రజలు ఎంతో ఆసక్తిగా వినేవారు. ఎన్నికల ప్రచారంలో ఆయన ఒక విషయాన్ని పలుమార్లు చెబుతుండేవారు. తన ప్రత్యర్ధులకు సవాలుతో కూడిన ఒక అవకాశాన్ని అందిస్తూ వుండేవారు. ‘ మీరు నా గురించి అసత్యాలు చెప్పకుండా వున్న పక్షంలో మీ గురించిన వాస్తవాలు వెల్లడించకుండా వుంటాను’ అన్న స్టీవెన్సన్ వ్యాఖ్యకు ఆ రోజుల్లో విస్తృత ప్రచారం లభించింది.
రాజకీయాల్లో అసత్యాలు వల్లె వేసి జనాలను నమ్మించడానికి ప్రయత్నించే  సంప్రదాయం ఆ రోజుల నుంచే వుందనుకోవాలి.


అసత్యాలు సరే గతంలో అన్న మాటలనే మరచిపోయి స్వవచనఘాతానికి పూనుకునే ప్రబుద్ధులు ఈనాడు రాజకీయాల్లో ప్రబలిపోయారు. వర్తమాన రాష్ట్ర రాజకీయాల  తీరుతెన్నులను  గమనిస్తున్నవారికి ఇది కరతలామలకమే.
‘కండవర్  విండిలై విండవర్ కండిలై’ అని  తమిళంలో ఓ సూక్తి వుంది. అంటే చూసిన వారు చెప్పలేరు, చెప్పినవారు చూడలేరు అని అర్ధం. ‘కళ్ళు చూస్తాయి కాని మాట్లాడలేవు, నోరు మాట్లాడుతుంది కాని చూడదు’ అని ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ దాన్ని వివరించి చెప్పేవారు. ఆయన మాటల్లో చెప్పాలంటే – ఒకే విషయం గురించి చెప్పవలసినప్పుడు కూడా పదుగురు పది రకాలుగా చెబుతూ వుండడం కద్దు. ప్రతి ఒక్కరూ ప్రపంచం యెట్లా వుండాలని తాము అనుకుంటున్నారో ఆ దృక్పధంతో చూస్తూ వుండడమే దీనికి కారణం. కళ్ళ ముందు ఒక వేలును పెట్టుకుని చూడాలనుకోండి. మూడురకాలుగా చూడవచ్చు. రెండు కళ్ళతో కలసి ఒక చూపు. అలాగే ప్రతి కంటితో విడివిడిగా రెండు చూపులు. చూసే వస్తువు ఒక్కటే కనబడడంలోనే తేడాలు.
ఈ నిజం తెలుసుకోవడానికి పెద్ద కష్టపడక్కరలేదు. ఓ పదినిమిషాలు అసెంబ్లీ ప్రత్యక్ష ప్రసారం లేదా  ఏ టు జెడ్ టీవీ ఛానల్లు ప్రసారం చేసే చర్చాకార్యక్రమాలు చూస్తే చాలు. వాళ్ళ నాలుకలు ఎన్ని వంకర్లు తిరుగుతాయో అర్ధం అవుతుంది. ఇంత ఖరాఖండిగా ఎలా చెబుతున్నానంటే ఇది నా స్వానుభవం కనుక.  (02-09-2015)
రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com మొబైల్: 98491 30595  

NOTE : Courtesy Image Owner 


కపటం లేని మందహాసానికి కాపీరైట్


(సెప్టెంబర్ రెండో తేదీ  వైయస్సార్ వర్ధంతి - ఆరేళ్ళ క్రితం రాసింది) 
  
దేశవ్యాప్తంగా, మీడియాలో, పత్రికల్లో అత్యధికంగా వినపడ్డ, కనపడ్డ పదం వైఎస్సార్. ఆ పేరు వినబడుతూనే వుంటుంది కానీ, ఇక ఆ రూపం కనబడే అవకాశమే లేదు. ఒక వ్యక్తి గుణగణాలను సమాజం సంపూర్తిగా అవగాహన చేసుకోవడం జరిగేది అతడి మరణం తర్వాతనే అన్నది రాజశేఖరరెడ్డి గారి విషయంలో నూటికి నూరుపాళ్ళు నిజమైంది.

'రాజశేఖరా!నీపై మోజు తీరలేదురా!' అని తెలుగు ప్రజానీకం రెండోపర్యాయం ఆయనకు అధికార పగ్గాలు అప్పగించి వంద రోజులు నిండీనిండకుండానే, రాజశేఖరుడికి నూరేళ్ళు నిండిపోవడం అత్యంత విషాదకరం.

'రాజసాన ఏలరా!' అని మనసారా కోరుకున్న ప్రజలకు ఆయన ఆకస్మిక మరణం విధి విధించిన శాపం.

అర్థవంతమైన జీవితాలెప్పుడూ అర్ధంతరంగానే ముగిసిపోతుంటాయి. మాట తప్పని మనిషిగా, మడమ తిప్పని వీరుడిగా పేరు తెచ్చుకున్న వైఎస్సార్-అరవై యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతానన్న మాటని నిలబెట్టుకుంటూ, జీవితం నుంచే రిటైర్ కావడం అన్నది-ఆయన పధకాల ద్వారా బతుకులు పండించుకుంటున్న బడుగు జీవుల దురదృష్టం.

1978 నుంచి ఇప్పటివరకూ ఒక జర్నలిష్టుగా ఆయన్ని కలుసుకున్న సందర్భాలు అనేకం వున్నాయి. విలేకరులను విందు సమావేశాలకు ఆహ్వానించినప్పుడు ఆయన తరహానే వేరుగా వుండేది. బిగుసుకుపోయినట్టు వుండడం, మర్యాద కోసం మొహాన నవ్వు పులుముకోవడం ఆయన స్వభావానికే విరుధ్ధం. నవ్వులో స్వచ్చత, పిలుపులో అత్మీయత వుట్టిపడేవి. నమ్మినవాళ్ళని నట్టేట ముంచకపోవడం, నమ్ముకున్నవాళ్ళకోసం యెంతకైనా తెగించడం జన్మతః అబ్బిన గుణాలు. వీటివల్ల, రాజకీయ జీవితంలో మేలు కన్న కీడే ఎక్కువ జరిగిన సందర్భాలు వున్నా, ఆయన లెక్కపెట్టింది లేదు. తీరు మార్చుకున్నదీ లేదు. ఈ విలక్షణ లక్షణమే వైఎస్సార్ కు రాష్త్రవ్యాపితంగా అభిమానులను తయారుచేసిపెట్టింది. ఎన్నికలు వచ్చినప్పుడు కేవలం తన నియోజకవర్గానికే పరిమితం కాకుండా, రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో పార్టీ తరపున ప్రచారం చేయగల ఖలేజాను ఆయనకు కట్టబెట్టింది.
1975 లో నేను రేడియో విలేకరిగా హైదరాబాదులో అడుగుపెట్టిన మూడేళ్ళ తరవాత రాజశేఖరరెడ్డి గారు తొలిసారి శాసన సభకి ఎన్నిక కావడం, మంత్రి పదవి చేపట్టడం జరిగింది. వయస్సు మళ్ళినవాళ్ళే రాజకీయాల్లోకి వస్తారనే అభిప్రాయానికి భిన్నంగా యువరక్తం రాజకీయ రంగంలోకి రావడం అప్పుడే మొదలయింది.


కొంచెం అటు ఇటుగా రాష్త్ర రాజకీయాల్లో అడుగిడిన రాజశేఖరరెడ్డి గారు, చంద్రబాబు నాయుడుగారు  ప్రాణ స్నేహితులుగా మసలిన రోజులకు నేను కూడా సాక్షిని కావడం యాదృచ్చికం. మంత్రి పదవి తనను ముందు వరించినప్పటికీ- చంద్రబాబు నాయుడు గారు సైతం మంత్రి అయ్యేంత వరకూ ఆయన పడ్డ ఆరాటం, ఆనాటి జర్నలిష్టులందరికీ తెలుసు.

రాజశేఖర రెడ్డిగారిని నేను మొదటిసారి చూసింది, ఆ రోజుల్లొ సచివాలయానికి కూతవేటు దూరంలో వున్న సరోవర్ హోటల్ (ఇప్పుడు మెడిసిటి హాస్పిటల్) టెర్రేస్ మీద. సచివాలయంలో జరిగిన ఒక సంఘటన దరిమిలా వివరణ ఇచ్చేందుకు విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన సందర్భం అది. అప్పట్లో ఆయన ఒక తరహా మీసకట్టులో కనిపించే వారు. కానీ, కపటం లేని మందహాసానికి మాత్రం అప్పటికీ, ఇప్పటికీ ఆయనదే కాపీ రైట్.

ఇటు హైదరాబాదులోనూ, అటు ఢిల్లీలోనూ వైఎస్సార్ నివాసాలు జర్నలిష్టులతో కళకళలాడుతూవుండేవి. వేళాపాళాతో నిమిత్తంలేకుండా ఆ ఇళ్ళకి వెళ్ళివచ్చే చనువు వుండేది. సుదీర్ఘకాలం రాజకీయరంగంలో కొనసాగడం వల్ల, పేరుతో పిలిచి పలకరించగల జర్నలిష్టు స్నేహితులు ఆయనకు రాష్త్రంలోని అన్ని ప్రాంతాల్లో వుండడం సహజమే.

2004 లో ఆయన తొలిసారి ముఖ్యమంత్రి కాగానే, ఆయనతోవున్న సాన్నిహిత్యాన్ని ఉపయోగించుకుని, కేవీపీ గారి ద్వారా నా మనసులోని మాటని ఆయన చెవిన వేశాను. అప్పటికే కొన్ని ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసినందువల్ల, రేడియో కేంద్రానికి వచ్చి తొలి సందేశం రికార్డు చేయడం అన్నది కొత్త ముఖ్యమంత్రికి  కొద్దిగా ఇబ్బందే. అయినా, ఆయన నా మాట మన్నించి, నేరుగా ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు. అలాగే, హైదరాబాదు దూరదర్శన్ లో నేను రిటైర్ కావడానికి ముందు కూడా ఆయన స్టూడియోకి వచ్చి ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు.


వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన రెండేళ్ళకే నా విలేకరిత్వానికి తెరపడింది. అయినా, ఆ తర్వాత కూడా, వార్షికంగా నిర్వహించే విందు సమావేశాలకు నాకు ఆహ్వానం అందుతూనే వుండేది. రిటైర్ అయిన తర్వాత చాలా రోజులకు జరిగిన, నా  రెండో కుమారుడి వివాహానికి, ముఖ్యమంత్రిగా యెన్నో పని వొత్తిళ్ళు వున్నప్పటికీ హాజరై ఆశీర్వదించి వెళ్ళడం, నా పట్ల వారికున్న వాత్సల్యానికి మచ్చుతునకగా భావిస్తాను.

ఆయన ప్రతిపక్షనాయకుడిగా వున్నరోజుల్లో ఎప్పుడైనా కాలక్షేపంగా కలుసుకున్న సందర్భాల్లో రాజకీయాల ప్రస్తావన వచ్చినప్పటికీ, ఆయన నాతో సరదా కబుర్లనే ఇష్టపడేవారు. రేడియో విలేకరిగా నాకున్న పరిమితులను ఆకళింపు చేసుకోవడమే కాకుండా, 'శ్రీనివాసరావుని ఇబ్బంది పెట్టకండయ్యా!' అని తోటి జర్నలిష్టులకి సర్దిచెప్పేవారు.

ఒక విలేకరికి, ఒక రాజకీయనాయకుడికి నడుమ సహజంగావుండే సాధారణ సంబంధాన్ని మహోన్నతంగా పెంచి పెద్ద చేసిన పెద్దమనసు ఆయనది.

రాజశేఖరరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా వారికి నా కైమోడ్పులు. 




ఉరిశిక్షలు, ఆత్మహత్యలు, స్వచ్చంద మరణాలు

(Published in 'SURYA' telugu daily on 03-09-2015, Thursday)

http://epaper.suryaa.com/579326/Surya-Telugu-Daily/Thursday,-Sep-03,-2015#page/4/2

ప్రాణం తీసుకోవడం మహా పాపం అనే భావం సాధారణ  ప్రజల్లో వుంది. ఆత్మహత్యకు ప్రయత్నించడం శిక్షార్హమైన నేరంగా చట్టం పేర్కొంటోంది. ఇక ఏదైనా నేరంలో ఉరిశిక్ష పడ్డప్పుడు రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పొందడం ద్వారా దాన్ని రద్దు చేసుకోవడానికి కూడా ఓ వెసులుబాటు వుంది. అసలు మరణ శిక్షలు విధించే పద్దతికే స్వస్తి చెప్పాలనే వాదన కూడా వుంది. ఈ నేపధ్యంలో ఉరిశిక్షవిధించే విధానానికి స్వస్తి చెప్పాలని కేంద్ర లా కమిషన్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ఉగ్రవాద సంబంధమైన కేసులు మినహా మిగిలిన సందర్భాల్లో మరణ శిక్షను వెంటనే రద్దు చేయాలని కమిషన్ కోరింది. అత్యంత అరుదయిన కేసుల్లోను ఉరిశిక్ష రద్దు చేయాలన్నది కమిషన్ అభిప్రాయం. ఉరిశిక్ష అనేది రాజ్యాంగపరంగా చూసినప్పుడు నిలబడదని స్పష్టం చేసింది.  ఉరిశిక్ష రద్దు విషయంలో ప్రస్తుతం వున్న  విచక్షణాధికారాలు వినియోగిస్తున్న తీరు సరిగా లేదన్నది కమిషన్ అభిప్రాయంగా వుంది. మరణ దండన విధించిన కేసుల్లో ఏదైనా న్యాయ పరమైన తప్పిదాలు జరిగితే వాటిని సరిదిద్దే రక్షణ కవచంగా పొందుపరచిన రాజ్యాంగ అధికరణాలు సరిగా అమలు కావడం లేదని కూడా పేర్కొన్నది.
సరే! ఇది కేవలం సిఫారసు మాత్రమె కాబట్టి ఇది చట్ట రూపం దాల్చి, మరణ దండనకు నూకలు చెల్లడానికి మరి కొంత కాలం పట్టే అవకాశం వుంది.


ఇదిలా ఉండగానే  దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు మరో కేసులో ఒక సంచలన నిర్ణయం  వెలువరించింది. తమ మతాచారం ప్రకారం ప్రాయోపవేశ దీక్ష స్వీకరించి ఎటువంటి ఆహారం తీసుకోకుండా మరణం కోసం నిరీక్షించే పద్దతి, ఖచ్చితంగా ఆత్మహత్య కిందికే వస్తుందని గత నెలలో  రాజస్థాన్ హైకోర్టు నిర్ధారించడాన్ని సవాలు చేస్తూకొందరు జైన మత విశ్వాసులు సుప్రీం కోర్టు తలుపు తట్టారు. హైకోర్టు తీర్పు తమ మత విశ్వాసుల ప్రాధమిక హక్కులను  ఉల్లంఘించేదిగా వుందని, రాజ్యాంగంలో పొందుపరచిన లౌకిక సూత్రాలకు విరుద్ధంగా వుందని పిటీషనర్లు పేర్కొన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయ మూర్తి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం వాదనలు విని రాజస్థాన్ హై కోర్టు తీర్పు అమలు కాకుండా నిలుపు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.            
ఉరిశిక్ష పడ్డ నేరస్తులు కూడా ఏదో ఒకవిధంగా ఆ శిక్ష నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అలాటిది జైన మతస్తులు తమ మతాచారం ప్రకారం స్వచ్చంద మరణం కోరుకోవడమే కాకుండా దాన్ని ఒక హక్కుగా భావించడం ఆ మతం గురించి అవగాహన లేనివారికి కొంత విడ్డూరంగానే అనిపిస్తుంది. జైనుల జీవన విధానంలో అహింసను పరమ ధర్మంగా భావిస్తారు. ఉపవాస దీక్ష ద్వారా మరణం పొందడం జైన మతంలో ఒక సాంప్రదాయం. దాన్ని ‘సంథారా’ అంటారు.  రాజస్థాన్ హై కోర్టు ఈ సాంప్రదాయాన్ని నేరపూరిత చర్యగా  పరిగణించడం సరికాదన్న అభిప్రాయాన్ని సుప్రీం ధర్మాసనం వ్యక్తం చేసింది. ఈ నిర్ధారణకు వచ్చేముందు జైన మత గురువులు, మత పెద్దల అభిప్రాయం తీసుకుని వుండాల్సిందని పేర్కొన్నది. ఒక మతాచారం కనుక సర్వోన్నత న్యాయ స్థానం ఈ విషయంలో ఇటువంటి నిర్ణయానికి వచ్చి ఉండవచ్చు. ఒక పక్క లా కమిషన్ మరణ శిక్షను రద్దు చేయాలని సిఫారసు చేస్తే మరోపక్క స్వచ్చంద మరణాలకు మతాచారం ప్రాతిపదికగా సుప్రీం పచ్చ జెండా ఊపడం ఒకే రోజున జరగడం కాకతాళీయం కావచ్చు.
ఈ స్వచ్చంద మరణాలు మనకు  భీష్ముడి కాలంనుంచి ఎరుకే. పూర్వం యుద్ధాల్లో రాజపుత్ర సంతతికి చెందిన రాజులు వీరమరణం చెందినప్పుడు, రాణీవాసపు స్త్రీలు పరాయి మూకల చెరలో చిక్కకుండా చితి పేర్పించుకుని ఆత్మాహుతి చేసుకున్న సందర్భాలు చరిత్ర పుటల్లో కానవస్తాయి. ఆత్మగౌరవం నిలుపుకోవడం కోసం ప్రాణ త్యాగాలు చేసిన సంఘటనలు రోమన్ చరిత్రలో కూడా వున్నాయి. యుద్ధంలో మరణం అనివార్యం అని భావించినప్పుడు రోమన్ సైనికులు తమకు తాముగా ప్రాణాలు తీసుకునే వాళ్ళు.    
జపాన్ లో ఓ సాంప్రదాయం వుండేది. దాన్ని ‘హరకిరి’ అంటారు. ‘హరాకిరీ’ అనేవాళ్ళు కూడా వున్నారు. సమాజంలో కులీన కుటుంబాలకు చెందిన వాళ్ళు రాజాగ్రహానికి  గురై,  మరణశిక్ష పడ్డప్పుడు, ఆ  అవమాన భారం భరించ లేక, తమకు తామే ఈ శిక్ష విధించుకుని ప్రాణాలు తీసుకునేవారు. జపానీయుల భాషలో ’హర’ అంటే ‘పొట్ట’. ‘కిరి’ అంటే కోసుకోవడం. పేగులు చీల్చుకునేలా పొట్టను కోసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘హర కిరి’ అంటారు. కాలక్రమంలో ఈ పదాలకు అర్ధం మారిపోయింది. ఆత్మహననాలకు, ఆత్మ హత్యలకు ఇప్పుడిది పర్యాయపదం అయింది.
విదేశాల్లో కొన్ని క్రైస్తవ మఠాలకు సంబంధించిన సన్యాసులు నేల మాళిగల్లో వుండిపోయి సమాధి స్తితికి చేరుకునేవారు.  
ఈ రకంగా ప్రాణాలు తీసుకోవడం అనేది మన దేశంలో పూర్వం నుంచి మహా పాపంగా పురాణాలు, ఇతిహాసాలు పేర్కొంటున్నాయి. అకాల మృత్యువు కూడా అనేది కూడా కలలో కూడా ఊహించరాని విషయం. అకాల మరణం లేని దీర్ఘాయువు కోరుకోవడం ‘చమకం’ లో వుంది. ‘జీవంతు శరదాం శతం’ అంటే వందేళ్ళు బతకాలని కోరుకునే వారు. ఆశీర్వచనాల్లో కూడా ‘ ఆయురారోగ్య ఐశ్వర్య సిద్ధిరస్తు’ అంటూ ఆయువుకే మొదటి పీట.
బలవంతంగా ప్రాణం తీసుకున్న సంఘటనలు విన్నప్పుడు మనస్సు చివుక్కు మంటుంది. ప్రాణం ఉన్నంతవరకు జీవించాలి కాని ప్రాణం తీసుకుని ఉసురు తీసుకోవడం ఏరకంగా చూసినా సమర్ధనీయం కాదనిపిస్తుంది.
నిజానికి ప్రాణ త్యాగం అనేది మామూలు విషయం కాదు. అందుకే శత్రువులనుచి రహస్యాలు రాబట్టేవారు అంతిమంగా ‘ప్రాణాలు దక్కవంటూ’ హెచ్చరించడం అనేక సినిమాల్లో  సాధారణం.
లక్ష్యం యెంత ఉన్నతమైనదైనా దాన్ని సాధించి తీరడానికి బతికి వుండాలి కాని ఆ క్రమంలో నిండు ప్రాణాలు తీసుకోవడం వల్ల ఆ లక్ష్య సాధనను కళ్ళారా చూసే మహత్తర అవకాశాన్ని చేజేతులా కోల్పోతారు.
కాబట్టి ఆత్మహత్య అనేది తుట్టతుది మార్గం కూడా కాదు. అసలది మార్గమే కాదు.

తోక టపా: ఎల్లాగు ఇందులో జైనుల ప్రసక్తి వచ్చింది కాబట్టి వారికి సంబంధించిన ఒక అంశంతో దీన్ని ముగిస్తాను.
పూర్వం కార్డులు, కవర్లు రాజ్యమేలే రోజుల్లో రాసుకునే ప్రతి ఉత్తరం  తప్పులున్న క్షమించగలరు అనే అభ్యర్ధనతో ముగిసేది.
సంఘజీవనంలో తెలిసో, తెలియకో, మాటలతోనో, చేతలతోనో సాటివారిని నొప్పించడానికి అవకాశాలెక్కువ. అందుకే, నాగరీకం బాగా ముదిరిన ఇంగ్లీష్ మాట్లాడేవాళ్ళు , రోజువారీగా అనేక పర్యాయాలు  సారీ అనే పదాన్ని  ఉదారంగా  వాడుతుంటారు. అలాగే రష్యన్లు కూడా మాట మాట్లాడితే ఇజ్వెనీచ్ పజాలుస్త’ (సారీ ప్లీజ్) అంటారు.  అసలు క్షమించమని కోరడం, క్షమాగుణం  కలిగివుండడం  భారతీయ సంప్రదాయాల్లో భాగం. కానీ అన్ని సంప్రదాయాల్లాగే ఇదీ కాలక్రమేణా కనుమరుగు అవుతోంది. కాకపోతే,  కాలు తొక్కి సారీ చెప్పేవాళ్ళ సంఖ్య మాత్రం  పెరుగుతోంది.
చర్చికి వెళ్లి కన్ఫెషన్ బాక్స్ లో నిలబడి,  చేసిన తప్పులను దేవుడికి నివేదింఛి,  క్షమాపణలు కోరే సంప్రదాయం క్రైస్తవుల్లో వుంది.  జైనులు  పాటించే ఈ తరహా  విధానం ఒకటి ఇంటర్ నెట్ పుణ్యమా అని ప్రచారం లోకి వచ్చింది. దీని వాళ్లు మిచ్చామి దుఖఃడం అని పిలుస్తారు. భాద్రపద మాసం నాలుగో రోజు అంటే వినాయక చవితి రోజున జైన మత విశ్వాసులు దీన్ని పాటిస్తారు. ‘మిచ్చామి దుఖఃడం’ అనేది ప్రాకృతంలో ఒక పదబంధం.
'మిచ్చామి' అంటే మరచిపోవడం, మన్నించడం అని అర్ధం.
'దుఖఃడం' అంటే  దుష్కృత్యాలు.  చేసిన చెడ్డ పనులు అని తాత్పర్యం.
జైనులు ప్రాయూషణ పర్వ కాలంలో ఎనిమిదో రోజున  భాద్రపద శుద్ద చవితి నాడు ఒకరికొకరు  ‘నేను చేసిన తప్పులను మన్నించండి అని మనవి చేసుకుంటారు. అంతకు ముందు ఏడాది కాలంలో తాము ఇతరులపట్ల చేసిన అపరాధాలకు క్షమాపణలు అర్ధిస్తారు. ఫోన్ల ద్వారా, ఉత్తరాల ద్వారా ఈ తంతు కొనసాగుతుంది.
మంచి ఆచారం కదా!

 (02-09-2015)

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:   98491 30595                                

1, సెప్టెంబర్ 2015, మంగళవారం

చంద్రబాబు నాయుడు అభిమానులకోసం – ఒక వివరణ మాత్రమే, సంజాయిషీ కాదు

  
ఆరోగ్యశ్రీ గురించి రాస్తూ నేను రాజశేఖర రెడ్డిని అమాంతం ఆకాశానికి ఎత్తేసానని నా మిత్రులే కొందరు అభిప్రాయ పడ్డారు. ఆ పధకం ఎలా పురుడు పోసుకున్నదీ, ఆ నేపధ్యం ఏమిటన్నది చెప్పడం ఉద్దేశ్యం అయితే అది చివరికి వైఎస్సార్ సీపీ, టీడీపీ అభిమానుల నడుమ ఘర్షణ వ్యాఖ్యలకు దారితీయడం విషాదం. అసలు ఈ కాలపు చాలా మందికి, ఆ మాటకు వస్తే ఈనాడు బాబు గారి పక్కన వున్నవాళ్ళకు, లేదా జగన్ బాబు చుట్టూరా ఉండేవాళ్లకు తెలియని విషయం ఏమిటంటే,  ఒకానొక కాలంలో రేడియో విలేకరిగా, నేను ఈ ఇద్దరితొను చాలా చనువుగా మసలుతూ వుండేవాడినన్న సంగతి.  మొదట్లో, అంటే డెబ్బయ్యవ దశకం చివర్లో కాస్త అటూ ఇటూగా వారిద్దరూ రాజకీయరంగ ప్రవేశం చేసి ప్యాంటూ చొక్కాలతో అసెంబ్లీలో కుడి కాలు పెట్టినప్పుడు, వాళ్ళ మాదిరిగానే ప్యాంటూ చొక్కాలు వేసుకుని తిరిగే నా బోటి విలేకరుల సంఖ్య  నాడు హైదరాబాదులో చాలా తక్కువగా వుండేది. అటు రాజకీయ నాయకులు, ఇటు సీనియర్ పాత్రికేయులు పంచ లాల్చీల తరహా కావడం, అంతటి సీనియర్లతో ఎందుకనుకునేవాళ్ళేమో కాని, వైఎస్సార్, బాబు వంటి ఎమ్మెల్యేలు   మా బోటి జూనియర్ రిపోర్టర్లతోనే  చనువుగా వుండేవాళ్ళు, అన్ని విషయాలు పంచుకునేవారు.  ఈక్రమంలోనే కాకుండా ఆ రోజుల్లో ఆకాశవాణి వార్తలకు ఇప్పటి ప్రీమియం న్యూస్ ఛానళ్ళ స్థాయిలో ‘గిరాకీ’  వుండడం నాకు రేడియో విలేకరిగా కొంత కలిసి వచ్చింది. వచ్చిన చిక్కల్లా ఎక్కడంటే తెలుగుదేశం పార్టీ రంగప్రవేశంతో వారిద్దరి దారులూ వేరయిపోయాయి. దాంతో ఇద్దరితో చనువు పెంచుకున్న మా  బోంట్లకు కొంత  ఇబ్బందిగా వుండేది. దానికి తోడు చంద్రబాబు నాయుడు అధికార పదవి ఏమీ లేకపోయినా అధికార కేంద్రానికి దగ్గరగా వుండడం, వైఎస్సార్ ప్రతిపక్ష కాంగ్రెస్ లో ‘తస్మదీయుడిగా’ ఎక్కువ కాలం వుండడం, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు కూడా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అసమ్మతి నేతగా ఆయనకు  ముద్ర పడడం, ఇవన్నీ సదా అధికార పక్షానికి ‘భజన’ చేస్తామనే ముద్ర వున్న రెడియో విలేకరిగా నన్ను చంద్రబాబుకు లేదా ఆయన ప్రభుత్వ కేంద్రానికి దగ్గరగా మసలేలా చేశాయి. పైగా ఆయన ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నేను అడగాలే కానీ ఏదయినా చేయడానికి సిద్ధంగా వుండేవారు. ఇందులో దాపరికం ఏమీ లేదు. మా పెద్ద పిల్లవాడికి ఉద్యోగం కోసం  అడగడానికి ధైర్యం చాలకపోతే ఆయనే అర్ధం చేసుకుని సత్యం రామలింగ రాజుగారితో  ఫోనులో నా ముందే మాట్లాడి ‘నాకు బాగా కావాల్సిన శ్రీనివాసరావు కుమారుడు, మీరు  సాయం చేస్తే అది నాకే అని భావిస్తాను’ అన్నారు. సరే! ఆ ఉద్యోగం రాలేదు కాని ఆయన నా పట్ల ఆ క్షణంలో చూపించిన అభిమానాన్ని నేను ఎన్నడూ మరచిపోలేను. ఇప్పటికీ బాబుగారు  ‘మా వాడు అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు’ అని అనుకుంటూ ఉండవచ్చు కూడా.  ఎందుకంటె ఉద్యోగం రాని  సంగతి నేను మళ్ళీ ఆయనకు చెప్పలేదు.


(చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నాతో ఓ ఆసుపత్రిలో) 

నేను ఒక ప్రమాదంలో కాలు విరిగి ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వున్నప్పుడు ఎన్నికల ప్రచారంలో క్షణం తీరిక లేకుండా వుండి  కూడా చంద్రబాబు నేనున్న  ఆసుపత్రికి వచ్చి చాలాసేపు గడిపి వెళ్ళారు. అల్లాగే నాకు ప్రభుత్వ క్వార్టర్ కేటాయింపు విషయంలో కూడా చంద్రబాబు ఎంతో పెద్ద సాయం  చేసారు. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని కావడం, అప్పటికే అనేకమంది ఐ ఏ ఎస్ అధికారులు ఇంటి కేటాయింపు కోసం వేచి వుండడం వల్ల ఆయన జారీ చేసిన ఉత్తర్వులు వెంటనే అమలు కాలేదు. కానీ ఆయన, ముఖ్యమంత్రిగా తనకున్న విచక్షణాధికారాలను ఉపయోగించి  ఫైలు తెప్పించుకుని,   నాకు సీనియర్ ఐ ఏ ఎస్ అధికారులకు ఇచ్చే ప్రభుత్వ క్వార్టర్ కేటాయిస్తూ స్వయంగా ఉత్తర్వులు జారీ చేసారు.  2005 లో  ఉద్యోగ విరమణ చేసేవరకు నేను ఎర్రమంజిల్ లోని ఆ క్వార్టర్ లోనే వున్నాను. రిటైర్ అయిన తరువాత ఒక అద్దె ఇంటికి మారాను. ఇప్పటికీ అనేక ఇళ్ళు మారుతూనే వున్నాను. ఇలా చెప్పుకుంటూ  పొతే చంద్రబాబు నాయుడుతో నాకెన్నోఅనేక మరపురాని, మరచిపోలేని జ్ఞాపకాలు,   అనుభవాలు వున్నాయి. కాకినాడలో రేడియో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ భూమి కావాల్సివచ్చి ఆయన్ని అడిగితె గంటల వ్యవధిలో జీవో ఇప్పించారు. చంద్రబాబు దాదాపు పదేళ్ళపాటు ముఖ్యమంత్రిగా వుండడం వల్ల రేడియో విలేకరిగా ఎక్కువ కాలం ఆయన వార్తలు కవర్ చేస్తూ ఉండేవాడిని. ఇప్పుడు నా రాతలు చూసి చంద్రబాబు అభిమానులు చీకాకు పడుతున్నట్టే ఆ రోజుల్లో వైఎస్సార్ అభిమానులు లేదా ఆయన అనుయాయుల దృష్టిలో నేను చంద్రబాబు మనిషిగా ముద్రపడ్డాను. కానీ వారిద్దరికీ నాపట్ల ఇటువంటి అభిప్రాయం వున్న  దాఖలా నాకెన్నడూ కానరాలేదు. నా పెద్ద పిల్ల వాడి వివాహం అప్పుడు ఒకరు ముఖ్యమంత్రి, మరొకరు ప్రతిపక్ష నాయకులూ, రెండో పిల్లవాడి పెళ్లికల్లా పాత్రలు మారిపోయాయి. అయినా రెండు పెళ్లిళ్లకు ఇద్దరూ వచ్చి నా మీద వారికున్న అభిమానం వ్యక్తం చేసారు.  తదనంతర కాలంలో వై ఎస్ ముఖ్యమంత్రి కావడంతో రేడియో విలేకరిగా నా రాకపోకలు అటు పెరిగాయి. నా ఉద్యోగ ధర్మంగా నేను దగ్గర కావడం, దూరం కావడం వారిద్దరూ సరిగా అర్ధం చేసుకున్నారు కానీ భజన బృందాలతోనే చిక్కంతా. మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యేనాటికి నాకు ఆ విలేకరి ఉద్యోగం కూడలేదు. వై ఎస్సార్ ఎలాగూ లేరు. విలేకరి ఉద్యోగమూ లేదు.  అందుకే నేను ఇప్పుడు అంశాన్ని బట్టి టీవీల్లో నా అభిప్రాయం చెబుతూ వస్తున్నాను. బ్లాగులో రాస్తూవున్నాను. కొందరికి అవి రుచించకపోవచ్చు. కానీ  నేను చేయగలిగింది ఏమీ లేదు. ఒక దణ్ణం పెట్టి ఊరుకోవడం తప్ప.
సుదీర్ఘ కాలం రాజకీయ నాయకులతో కలసి మెలసి వుండే అవకాశం కలిగిన కొందరు జర్నలిష్టులకు కొందరు నాయకులతో సన్నిహిత అనుబంధం ఏర్పడే వీలుంటుంది. ఇది రాజకీయాలకు అతీతం. గతంలో ఎందరో సీనియర్ జర్నలిష్టులు కొందరు ముఖ్యమంత్రులకు సన్నిహితంగా వుండేవారు. కాకపోతే ఆ సాన్నిహిత్యం నీడలు  వృత్తి ధర్మంపై పడకుండా జాగ్రత్త పడేవారు. నేనూ కొన్ని సందర్భాలలో సగటు మనిషి మాదిరి గానే ఆలోచిస్తూ, పదవులు కలిగిన వారితో నాకున్న పరిచయాలను నా సన్నిహితులకోసం, స్నేహితుల కోసం, చుట్ట పక్కాలకోసం, నిజం చెప్పాలంటే నా కుటుంబ అవసరాలకోసం సద్వినియోగమో, దుర్వినియోగమో చేసి ఉండవచ్చు. కానీ అందుకోసం ఒక విలేకరిగా నా విలువలను తాకట్టు పెట్టలేదు. ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నా బోంట్లకు చేసిన సాయాలు చంద్రబాబు గుర్తు పెట్టుకోకపోవచ్చు. కానీ సాయం పొందినవారు మరచిపోతారని అనుకోను. చంద్రబాబుకు నేను గుర్తున్నానా లేదా అన్నది ప్రశ్న కాదు. ఆయన మాత్రం నాకు సదా గుర్తుంటారు. టీడీపీ అధ్యక్షుడిగా కాదు, చంద్రబాబు నాయుడిగా.

ఆయన మూడో సారి ముఖ్యమంత్రి అయిన తరువాత నేనెన్నడూ ఆయన్ని కలుసుకునే ప్రయత్నం చేయలేదు. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన రోజున మా కుటుంబానికి చెందిన ఆడవాళ్ళు చాలామంది ఆయన్ని చూడాలంటే నేను వెంటబెట్టుకుని ఆయన ఇంటికి తీసుకువెళ్లాను. అంతమంది వెళ్ళడంతో ఆయన చాలా సంతోష పడ్డట్టు  కనిపించారు. అందర్నీ ఆదరంగా పలకరించారు. అలాగే కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నికయిన రాజశేఖర రెడ్డిని ఇంటర్వ్యూ చేయడానికి, ఎన్నో ప్రైవేట్ టీవీ ఛానల్స్ ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన నా మాట మన్నించి ఆకాశవాణి కేంద్రానికి వచ్చారు.


(1980 లో వైఎస్ మంత్రిగా వున్నప్పుడు, నాతో ఓ పార్టీలో) 

ఆ ఇద్దరితో నాకున్న సంబంధం లేదా అనుబంధం రాజకీయాలకు అతీతం. నన్ను అంచనా వేసేవారు ఈ విషయం గుర్తు పెట్టుకోవాలని మనవి చేస్తున్నాను. ధన్యవాదాలతో – భండారు శ్రీనివాసరావు  (01-09-2015)