18, జూన్ 2015, గురువారం

లండనింగ్లీష్ !


(Courtesy PVVG Swamy)



Spotted in a toilet of a London office: 
TOILET OUT OF ORDER. PLEASE USE FLOOR BELOW. 

In a London Laundromat:
AUTOMATIC WASHING MACHINES: PLEASE REMOVE ALL YOUR CLOTHES WHEN THE LIGHT GOES OUT 

Outside a London second-hand shop: 
WE EXCHANGE ANYTHING - BICYCLES, WASHING MACHINES, ETC. WHY NOT BRING YOUR WIFE ALONG AND GET A WONDERFUL BARGAIN? 

Spotted in a safari park: 
ELEPHANTS PLEASE STAY IN YOUR CAR 

Seen during a London conference: 
FOR ANYONE WHO HAS CHILDREN AND DOESN'T KNOW IT, THERE IS A DAY CARE ON THE 1ST FLOOR 

Notice in a field: 
THE FARMER ALLOWS WALKERS TO CROSS THE FIELD FOR FREE, BUT THE BULL CHARGES

On a repair shop door: 
WE CAN REPAIR ANYTHING (PLEASE KNOCK HARD ON THE DOOR, THE BELL DOESN'T WORK) 

NOTE: Courtesy Image Owner


17, జూన్ 2015, బుధవారం

రాజకీయాల్లో విలువలు

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-06-2015, THURSDAY)

"ఇదొక యుద్ధం. ఒక యుద్ధాన్ని గెలవడానికి ఓ పోరాటంలో ఓడిపోయినా పరవాలేదన్నది నా సిద్ధాంతం.  నేను చెబుతున్నాను.  మళ్ళీ నేను నిలబడతాను. నిలబడి పోరాడతాను. టీవీ పెట్టి చూడండి. ఆట మొదలయింది"
"మరో అందమయిన ప్రదేశం చేరుకోవడానికి విమానం ఎక్కాను" అని చెప్పడానికి ముందు లలిత్  మోడీ ట్విట్టర్ లో రాసిన వాక్యాలు ఇవి. ఇంగ్లీష్ లో ఆయన ట్వీట్ చేసిన దానికి కాస్త అటూ ఇటూగా తెలుగు అనువాదం ఇది.
ఎవరీ లలిత్  మోడీ అని వేరే చెప్పక్కర లేదు. గతంలో కంటే ఈ మధ్య మీడియాలో ప్రత్యేకించి జాతీయ మీడియాలో అనుదినం నలుగుతున్న పేరిది. పేరులో మోడీ అని వున్నా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఈ లలిత్ మోడీకి ఎలాటి సంబంధ బాంధవ్యాలు లేవు. అయినా ప్రస్తుతం లలిత్ మోడీ చిక్కుకున్న వివాదంలో ప్రధాని మోడీ పేరు కూడా అక్కడక్కడా వినబడుతోంది. వినబడ్డమే కాదు ప్రధాని మోడీ తన పదవికి రాజీనామా చేయాలని  డిమాండు చేసేవరకు కొందరు ఈ వివాదాన్ని సాగదీస్తున్నారు.
ముందు లలిత్ మోడీ వ్యవహారం చూద్దాం. అది చూడాలంటే కాసేపు క్రికెట్ మైదానంలోకి అడుగుపెట్టాలి.
పూర్వం క్రికెట్ పోటీలు రెండు జట్ల నడుమ అయిదు రోజులపాటు జరిగేవి. రెండు జట్లు దాదాపు ఒకే మోస్తరు తెల్లని దుస్తులు ధరించి ఆడేవారు. కాలం  గడుస్తున్న కొద్దీ, జీవన వేగం పెరుగుతున్న కొద్దీ, దశాబ్దాల తరబడి ఆడుతున్న ఈ దొరల ఆటలో కూడా కొన్ని మార్పులు అనివార్యం అయ్యాయి. ఫలితంగా అయిదు రోజుల ఆటకు  పూర్తిగా భరత వాక్యం పలకకుండా, యాభయ్ పరిమిత ఓవర్ల ఒకరోజు క్రికెట్ పోటీలు వూపందుకున్నాయి. క్రమేణా  ఈ వన్ డే మ్యాచులకు ప్రజల్లో ఆదరణ పెరగడం మొదలయింది. ఆటగాళ్ళ దుస్తుల్లో, ఆట మైదానం రూపురేఖల్లో, ఆటని బుల్లి తెరలపై అద్భుతంగా చూపించే తీరులో అనేక మార్పులు వచ్చాయి. అంతర్జాతీయ క్రికెట్ పోటీ ఒక్కదానిలో అడుగుపెడితే చాలు ఆ ఆటగాడి భవిష్యత్తే పూర్తిగా మారిపోయే వాణిజ్య ధోరణులు క్రికెట్ ఆటలో చోటు చేసుకోవడం కూడా మొదలయింది. దానాదీనా ఈ ఆటలో విలువలు దిగజారి, డబ్బుకు పెద్దపీట వేసే పెడధోరణి పీఠం వేసుకుని కూర్చుంది. అలా అలా జరిగి పోతున్న క్రికెట్ కధ వున్నట్టుండి పెద్ద మలుపు తిరిగింది. యాభయ్ ఓవర్ల వన్ డే మ్యాచ్ ని మించిన 'ట్వంటీ ట్వంటీ' మ్యాచ్ రూపుదిద్దుకుంది. దానితో,  క్రికెట్ ఆట రంగూ రుచీ ఒక్కసారిగా మారిపోవడంతో పాటు, హంగులు, హొయలు కూడా రంగప్రవేశం చేసాయి. 'చీర్  గాళ్స్' పేరుతో,  అర్ధ నగ్న సుందరీమణులు అటు ఆటగాళ్లను, ఇటు ప్రేక్షకులను రంజింప చేయడానికి బహిరంగ మైదానాల్లో అరంగ్రేట్రం చేశారు. దాంతో డబ్బు వెదజల్లి టిక్కెట్లు కొనే ప్రేక్షకులు పెరిగారు. నిర్వాహకులకు రాబడి పెరిగింది. ఇక ఆటగాళ్ల సంగతి చెప్పక్కర లేదు, అనతికాలంలోనే కోట్లకు పడగెత్తే  సువర్ణావకాశం వారి వొళ్ళో పడింది. అందర్నీ అన్ని రకాలుగా సంతోషపెట్టి సంతోషపడే కొత్త క్రికెట్ కు ఆద్యుడు ఎవరయ్యా అంటే, ఇదిగో మనం ముందు చెప్పుకున్న లలిత్ మోడీ.  ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనే పేరుతో 2008 లో లలిత్ మోడీ ఏర్పాటు చేసిన ఒక వ్యవస్థ అతి కొద్ది కాలంలోనే పెరిగి పెద్ద వట వృక్షంగా తయారయింది. అందులో అతితేలిగ్గా ప్రవేశించిన వాణిజ్య ధోరణులు సయితం అలాగే పెరిగి పెద్దవవుతూ కాలక్రమంలో వెర్రితలలు వేయడం మొదలెట్టాయి. త్వరగా సులభంగా డబ్బు సంపాదించడం ఎట్లాఅని ఆలోచించేవాళ్ళు, ఆ వేగంలో, వురవడిలో  కాలుజారడం కూడా అంతే తేలిక. లలిత్ మోడీ దీనికి భిన్నం ఏమీ కాదు. అలాగే జరిగింది కూడా. ఎదుగుదల యెంత వేగంగా జరిగిందో పతనం కూడా దానికి రెట్టింపు వేగంతో సాగింది. ఫలితం స్వదేశంలో మీద పడ్డ కేసులను ఎదుర్కోలేక పరాయి దేశంలో రోజులు వెళ్ళ దీయాల్సిన దుస్తితి దాపురించింది. ఈ కధ ఇంతటితో ఆగితే ఇలాటివాళ్ళను గురించి ఈ నాడు ఇంతగా తలచుకోవాల్సిన పరిస్తితి వుండేది కాదు. ఈరకమైన వ్యక్తులు తమకు తాము అపకారం చేసుకోవడం మాత్రమే కాదు, తమను గుడ్డిగా నమ్మిన వారికి కూడా కీడు కలిగిస్తారు. ఈ క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాడు జాతీయ మీడియాలో చర్చోపచర్చలకు, జాతీయ పార్టీలయిన బీజేపీ, కాంగ్రెస్ ల నడుమ రచ్చరచ్చకు దారి తీస్తున్నాయి.
ఈ లలిత్ మోడీ విషయం కాసేపు పక్కన పెడదాం.
నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నేతృత్వంలో ఎన్డీయే కూటమి కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీయే కూటమిని మట్టి కరిపించి కేంద్రంలో అధికార పీఠం ఎక్కింది. భారత రాజకీయాల్లో మోడీ సాధించింది అద్వితీయ విజయమని అందరూ వేనోళ్ళ పొగిడారు.  ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంలో కూడా మోడీ ప్రభుత్వం సాధించిన ఘన విజయాల జాబితాలో ఘనంగా పేర్కొన్నది కూడా గత ఏడాది కాలంలో తమ ప్రభుత్వం ఎలాటి మచ్చలేని స్వచ్ఛ పాలనను ప్రజలకు అందించిందన్న విషయాన్నే. ప్రత్యర్ధి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని నిలదీయలేని నిస్సహాయ స్తితి.
సరిగ్గా ఇదే సమయంలో  లలిత్ మోడీ వ్యవహారం తెర మీదకు వచ్చింది.
ఇంగ్లండులో తలదాచుకుంటున్న లలిత్ మోడీకి అత్యవసరంగా పోర్చుగల్ ప్రయాణం పడింది. అనారోగ్యంతో వున్న ఆయన భార్యకు అవసరమయిన వైద్యసాయం అక్కడ లభిస్తుందని ఆయన భావించారు. అందులో తప్పుపట్టడానికి ఏమీ లేదు. వచ్చిన చిక్కల్లా ఇంగ్లండు నుంచి పోర్చుగల్ వెళ్ళాలంటే తగిన అనుమతి పత్రాలు అక్కడి ప్రభుత్వం ఇవ్వాలి. అలా ఇస్తే రెండు దేశాల నడుమ సంబంధాలు దెబ్బతింటాయని బ్రిటిష్ ప్రభుత్వం సంకోచించింది. ఈ సమయంలో లలిత్ మోడీ తరపున భారత విదేశాంగ మంత్రిగా వ్యవహరిస్తున్న సుష్మా స్వరాజ్ కు అభ్యర్ధన వచ్చింది. రాజకీయాల్లో వున్నవాళ్ళకు ఇలాటి సిఫారసు లేఖల గొడవ తప్పనిసరి తలనొప్పి. ఇష్టం వున్నా లేకపోయినా, సిఫారసు చేసే వ్యక్తులతో ముఖ పరిచయం వున్నా లేకపోయినా రాజకీయ నాయకులు సిఫారసు చేయక తప్పని ఒత్తిడి వారిపై వుంటుంది. అందుకే సుష్మా స్వరాజ్ కూడా ఆ ఒత్తిడికి  లొంగి లలిత్ మోడీ విషయంలో ఒక సిఫారసు చేశారు. 'మీకున్న నియమ నిబంధనల పరిధిలోనే అనుమతి పత్రాలు ఇవ్వండి' అని ఆమె సిఫారసు చేసినట్టు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇందులో ఆక్షేపించడానికి ఏమీ లేదు. కానీ ఆ మంత్రి తమ సిఫారసు లేఖలో మరో పేరా జోడించారు. 'మీరు తీసుకునే నిర్ణయం ఉభయ దేశాల సంబంధాలపై ఏమాత్రం ప్రభావం చూపదు' అని. ఇలా రాయడం ద్వారా, 'లలిత్ మోడీకి సాయం చేయండి' అని నిర్ద్వందంగా చెప్పినట్టయింది. మోడీకి పరోక్షంగా సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది.
సరే. ఆ తరువాత లలిత్ మోడీకి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆయన పోర్చుగల్ వెళ్ళి తన పని పూర్తి చేసుకుని ఇంగ్లండు కూడా తిరిగి వచ్చేసారు. దాంతో కధ కంచికి పోవాలి. అలా జరిగితే కధ యెలా అవుతుంది. అందుకే సామాజిక మాధ్యమాల పుణ్యమా అని మళ్ళీ వెలుగులోకి వచ్చి, 'అనేక కేసుల్లో చిక్కుకున్న లలిత్ మోడీకి ఎలా అలా  సిఫారసు లేఖ ఇస్తారు' అనే ప్రశ్నతో మొదలయి ఇప్పుడది మోడీ ప్రభుత్వం మెడకు చుట్టుకుంది.
కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు లేఖ ఇచ్చిన సుష్మా స్వరాజ్ ని రాజీనామా చేయాలని షరామామూలుగా పట్టుబడుతున్నాయి. అలా చేసేది లేదని బీజేపీ అగ్ర నాయకులు అంతే షరా మామూలుగా   తెగేసి చెబుతున్నారు.


(చుట్టరికం లేకుండా చిక్కుల్లో పడ్డ ఇద్దరు మోడీలు)


మామూలుగా అయితే ఇదంతా వడ్ల గింజలో బియ్యపు గింజ మాదిరి తేలిపోవాల్సిన వివాదం. కానీ మోడీ ప్రభుత్వం నైతిక విలువలు గురించి ఘనంగా చెప్పుకుంటోంది కనుక సమాధానం ఇచ్చుకోవాల్సిన పరిస్తితి.
ఇక్కడే రాజకీయాల్లో నైతిక విలువలు అనే ప్రశ్న ఉత్పన్నం అవుతోంది. రాజీనామా చేయాలని  డిమాండు చేయడం యెలా మోతాదుకు మించిన సంగతో, అలానే 'చేయను గాక చేయను' అని భీష్మించుకు కూర్చోవడం కూడా అదే వరస.
రాజీనామా చేయాలని కాంగ్రెస్ కోరనక్కరలేదు. రాజీనామా చేయమని ప్రధాని మోడీ తన మంత్రివర్గ సహచరురాలికి సూచించనక్కరలేదు. రాజకీయాల్లో విలువలు గురించి మాట్లాడేవాళ్లందరూ ఎవరికి వాళ్లు తమకు తాముగా తీసుకోవాల్సిన నిర్ణయం. అలా చేయడం వల్ల ఇప్పటికే మసకబారుతున్న ప్రజాస్వామ్య విలువలకు కాస్త వూపిరి వూదినట్టవుతుంది.
ఈ సూత్రం సుష్మా స్వరాజ్ ఒక్కరికే కాదు రాజకీయాల్లో వున్న ప్రతిఒక్కరికీ వర్తిస్తుంది. (17-06-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner

15, జూన్ 2015, సోమవారం

బామ్మగారి సాక్ష్యం


కోర్టులో కేసు విచారణ జరుగుతోంది.
సాక్షిగా ఓ వయస్సుమళ్ళిన సూరేకాంతం గారిని బోనులో నిలబెట్టారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ గొంతు సవరించుకుని బామ్మగారిని మర్యాదగా పలకరించాడు.
'చూడండి బామ్మగారు. నేను ఏకాంబరాన్ని. ఇక్కడ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ని. తెలుసనుకుంటాను'
'నువ్వు తెలియకపోవడం ఏమిట్రా సన్నాసి. చిన్నప్పుడు మా పక్కింట్లోనే వుండేవాళ్లు కదా మీరు మీ నాన్న. వొంట్లో ప్రాణం లేనట్టు పీలగా ఏబ్రాసి మొహం వేసుకుని వుండేవాడివి. పైకి నోట్లో వేలు పెడితే కొరకలేనట్టు, బోడి అమాయకం ఒకటి. కాని వున్నాడు కదా మీ నాన్న. వాడి పిదప బుద్ధులే నీకూ వచ్చాయి. ఆయనా అంతే. పందిరి గుంజకు చీరె చుడితే చాలు  దాని  కొంగు పట్టుకునే రకం. నీ వొంట్లో వాడి రక్తమేకదా! అందుకే బంగారం లాంటి పెళ్ళాన్ని ఇంట్లో పెట్టుకుని, ఏం పోయేకాలం వచ్చిందని  పక్కింటి ఆడదాన్ని లేపుకుపోయి పక్క వీధిలో కాపురం పెట్టావు.  కట్టుకున్న ఇల్లాలి కన్నీళ్ళు  పట్టించుకోకుండా ఇరుగింటి పొరుగింటి ఆడవాళ్ళ వెంట తిరగడానికి సిగ్గు లేదట్రా. అడిగేవాడు లేక ఈ పోరంబోకు వేషాలు వేస్తున్నావు.ఈ పాపం కట్టికుడుపుతుంది ఏమనుకుంటున్నావో, యేమో!  ' సూరేకాంతం మాటలు ఆగడం లేదు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ నోట మాట లేదు. నిలువు  గుడ్లేసుకుని నిలబడిపోయాడు.
ఇదంతా చూస్తూ వింటూ డిఫెన్స్ లాయర్ ముసిముసి నవ్వులు నవ్వాడు. బోను దగ్గర నిలబడి చిరునవ్వు చిందిస్తూ అన్నాడు. 'ఆయన సరేనండీ బామ్మగారు, నేనిక్కడ డిఫెన్స్ లాయర్ని. పేరు చిదంబరం. మీరుండేది అరండల్ పేటలోనే కదా! మూడో లేను నాలుగో ఇల్లు'
'హోర్నీ నువ్వట్రా చిదంబరం. యెంత ఎదిగి  పోయావు. సూటూ బూటూ వేసావు సరే బుద్దులు నిక్కర్ల నాటివేనా. పక్క దొడ్లో జామకాయలు కోసుకొచ్చి నువ్వూ మీ అమ్మా ఉప్పూ కారం రాసుకుని లొట్టలేసుకుంటూ తినేవారు. నాకు గుర్తు లేకపోవడం ఏమిటి.  పక్కింట్లో ఎత్తుకెళ్ళిన సైకిల్ వాళ్లకు ఇచ్చావా లేక పదో పరక్కో అమ్మి జీడీలు కొనుక్కు తిన్నావా?  అన్నట్టు మీ రెండో అమ్మాయినే కదా ఆ నల్లకోటు ఏకాంబరం తీసుకుపోయి భార్యకు తెలియకుండా వేరు కాపురం పెట్టింది. యెలా వుందా పిల్ల, ఇంకా వీడి మాయలోనే వుందా! నువ్వన్నా సరిగ్గా కాపురం ఏడుస్తున్నావా? వాడిలాగే పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావా? ఈ విషయాల్లో నువ్వు మాత్రం తక్కువ తిన్నావా ఏమిటి? వాడిలాగా పైకి తేలవు కానీ నువ్వూ గోపాలకృష్ణుడివే, నాకు తెలవదా నీ సంగతి' బామ్మగారి మాటల ధాటికి చిదంబరం మరో మాట లేకుండా మ్రాన్పడిపోయాడు.
జడ్జీ గారు ఇదంతా చూస్తున్నాడు. పొరబాటున వీళ్ళిద్దర్లో ఎవరయినా తొందరపడి 'ఆయనెవరో తెలుసా' అని తనని చూపిస్తూ బోనులో  బామ్మగారిని అడిగారంటే కోర్టు కొల్లేరయి పోతుందని గ్రహించాడు. ఇక  ఒక్క క్షణం కూడా ఆలశ్యం చెయ్యకుండా కేసును మూడు నెలలకు వాయిదావేసాడు.

(Based on english version posted by Shree PVVG Swamy)
NOTE ; Courtesy Image Owner

13, జూన్ 2015, శనివారం

ఈ ప్రపంచం ఓ మాయా దర్పణం


ఓ కుక్క దారి తప్పి దారి పక్కన కనబడ్డ ఓ మ్యూజియం లోకి ప్రవేశించింది. ఆ హాల్లో ఎటు చూసినా అద్దాలే. బ్రూస్ లీ సినిమాలో మాదిరిగా కిందా, పైన, పక్కనా, నలువైపులా నిలువెత్తు అద్దాలు. అందులో చేరిన కుక్కకు మతి పోయింది. ఎటు చూసినా తనను బోలిన శునకాలే. నిజమో కాదో తేల్చుకోవడానికి ఆ కుక్క పళ్ళు బయటపెట్టి భయపెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపిస్తూవున్నవి దాని ప్రతిబింబాలే. అవికూడా పళ్ళు బయటపెట్టి భయపెట్టినట్టు కనిపించడంతో ఓ  కుక్కల గుంపు నడుమ తాను నిష్కారణంగా చిక్కుకు పోయాననుకుని ఆ కుక్కకు పెద్ద భయం పట్టుకుంది.  వాటిని మరింత భయపెట్టి తప్పించుకుందామన్న ఆలోచనతో మొరగడం మొదలు పెట్టింది. చుట్టూ అద్దాల్లో కనిపించే ఆ కుక్క ప్రతిబింబాలు సయితం అదేమాదిరిగా మొరగడం మొదలు పెట్టాయి. కుక్క గొంతు పెంచి గట్టిగా మొరుగుతూ అటూ ఇటూ దూకడం మొదలెట్టింది. చుట్టూ అడ్డాల్లోని  వందలాది కుక్కలు కూడా అంతే మెరుపు వేగంతో గెంతడం మొదలయింది. ప్రాణ భయంతో కుక్క ప్రాణాలు ఠావులు తప్పాయి. ఆరోజు సెలవు దినం కావడం వల్ల మ్యూజియం సిబ్బంది మరునాడు వచ్చి తలుపు తీసేసరికి ఆ అద్దాల మహల్ లోని  అద్దాలు అన్నీ పగిలిపోయి చిందరవందరగా  పడివున్నాయి. వాటి మధ్యలో విగతజీవిగా పడున్న ఓ కుక్క శరీరం.


నిజానికి ఆ హాల్లో కుక్కకు హాని తలపెట్టే వాళ్లు ఎవ్వళ్ళూ లేరు. అద్దాల్లో తన ప్రతిబింబాలను తానే చూసుకుని గాభరా పడిపోయి, అందువల్ల కలిగిన భయంతో తన చావును తానే కొనితెచ్చుకుంది.
ఈ ప్రపంచం తనకు తానుగా ప్రజలకు ఏ అపకారం తలపెట్టదు. మన మనస్సుల్లోని ఆలోచనలే మనకు  మేలయినా, కీడయినా కలిగిస్తాయి. మనకు  మంచి జరిగినా, చెడు జరిగినా  దానికి కారణం మన భావాలే. మన కోరికలే. మన నిర్ణయాలే. మనం చేసే పనులే.
ఎందుకంటే మన చుట్టూ వున్న లోకమే ఓ పెద్ద దర్పణం.

 (శ్రీనివాస్ వూటుకూరు పోస్ట్ ఆధారంగా)
13-06-2015

NOTE: Courtesy Image Owner 

ప్రమాదం అంచుల్లో ప్రజాస్వామ్యం

(PUBLISHED BY 'SURYA' TELUGU DAILY ON 14-06-2015, SUNDAY)
ప్రజాస్వామ్య ప్రాతిపదికగా ఏర్పాటు చేసుకున్న భారత రాజ్యాంగం ప్రకారం సింపిల్ మెజారిటీతో ప్రజలెన్నుకున్న పార్టీలు అధికారంలోకి వస్తాయి. సాధారణంగా ఏ  ఎన్నికల్లో కూడా నూటికి నూరు శాతం ఓటర్లు పోలింగులో పాల్గొనరు. సగటున ముప్పయి శాతం మంది ఈ విధంగా ఓటు హక్కు వినియోగించుకోకుండా నిర్లిప్తంగా వుండిపోయిన సందర్భాలు అనేకం వున్నాయి. అంటే అర్ధం వారెవ్వరికీ ఎన్నికల్లో పోటీపడుతున్న పార్టీల పట్ల, వాటి విధానాల పట్ల  మక్కువ లేదనుకోవాలి. ఇంకా మిగిలిన డెబ్బయి శాతం వోటర్లు వేసే ఓట్లనే ఆయా పార్టీలు పంచుకుంటాయి. వీటిల్లో తమ సమీప ప్రత్యర్ధి కన్నా ఒక్క ఓటు ఎక్కువ తెచ్చుకున్న వారే విజేతలుగా ప్రకటించబడతారు. ఒక్కోసారి, పోటీపడ్డ పార్టీల నడుమ ఓట్లు భారీగా చీలిపోవడం కద్దు. ఇలాటి సందర్భాలలో  విజేతలుగా నిలిచినవారికి పడ్డ ఓట్లు, పోలింగులో పాల్గొనకుండా నిరాసక్తత ప్రదర్శించిన ముప్పయి శాతం కంటే కూడా తక్కువ కావచ్చు. కానీ రాజ్యాంగంలో పొందుపరచుకున్న నియమ నిబంధనల ప్రకారం వారే అధికార పీఠం అధిస్టిస్తారు. మరో విషయం ఏమిటంటే విజేతలుగా నిలిచిన వారికి పడిన ఓట్లు కూడా గుంపగుత్తగా  ఆయా పార్టీల వీరాభిమానులు వేసినవి కావు. తటస్తులయిన వాళ్లు, ఎవరికో ఒకరికి వేయాలి కనుక వేసి చేతులు దులుపుకునే వాళ్లు కూడా వుంటారు. యెలా అయితేనేం, ఒక్క ఓటు అధికంగా తెచ్చుకున్నా వాళ్ళే విజేతలు. రాజ్యాంగం ప్రకారం మొత్తం ఆ నియోజక వర్గానికి వాళ్ళే ప్రజాప్రతినిధులు. ఆ నియోజకవర్గంలోని ఓటర్లలో చాలామంది వ్యతిరేకించినా కూడా అయిదేళ్ళ కాలానికి వాళ్ళే చట్టసభల్లో  ప్రాతినిధ్యం వహిస్తారు.


ఈ నేపధ్యంలో చూసినప్పుడు ఇటు తెలంగాణాలో కేసీఆర్, అటు ఆంధ్ర ప్రదేశ్ లో చంద్రబాబు ప్రజలు ఎన్నిక చేసిన ప్రభుత్వాలకు నేతృత్వం వహిస్తున్నారు. అంచేత యావత్ రాష్ట్ర ప్రజానీకానికి తాము ప్రతినిధులమని చెప్పుకోవడంలో అభ్యంతర పెట్టాల్సిన అవసరం లేదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా అన్ని రకాల గౌరవాలకు వాళ్లు అర్హులు. వాళ్లని అదే స్థాయిలో గౌరవించి తీరాలి. అది ప్రజాస్వామ్య స్పూర్తి కూడా. అయితే ఇక్కడ ఒక విషయం గమనంలో వుంచుకోవాలి.  యావత్ రాష్ట్రానికి పనికివచ్చే పనుల విషయంలో, లేదా సమస్యల పరిష్కారం విషయంలో తమ విధానాలకు మొత్తం ప్రజానీకం మద్దతు వుందని చెప్పుకోవడంలో తప్పు లేదు. కానీ ప్రజాస్వామ్య విరుద్ధమైన లేదా పజాస్వామ్య విలువలను పట్టించుకోకుండా చేసే పనులకు, తమ తమ పార్టీల రాజకీయ ప్రయోజనాలకు మాత్రమే పనికి వచ్చే పనుల విషయంలో ఈ సూత్రం వర్తించదు. ఈ సందర్భాలలో  ప్రజలను అడ్డం పెట్టుకోవడం క్షంతవ్యం కాదు. అదే జరిగితే ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడ్డట్టే.
ప్రస్తుతం ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా వున్న హైదరాబాదులో పరిస్తితులను వివరిస్తూ, తమ వాదనకు అనుకూలమైన అంశాలను జోడిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓ సవివరమైన లేఖను ఇచ్చినట్టు మీడియాలో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. తెలంగాణా ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని చర్యల కారణంగా రాజ్యాంగమే ప్రమాదంలో పడిపోయిందని అర్ధం వచ్చేలా కధనాలు వెలువడ్డాయి. ఉమ్మడి రాజధానిలో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తన పని తాను సక్రమంగా చేసుకుపోవడానికి వీలులేకుండా తెలంగాణా ప్రభుత్వం తన యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. తమ పార్టీ టిక్కెట్టుపై గెలిచిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించకుండా మంత్రివర్గంలో స్థానం కల్పించారని ఆయన కేసీఆర్ పై మరో ఆరోపణ కూడా చేశారు. ఉమ్మడి రాజధానిలో  తమ ప్రభుత్వం సజావుగా పాలన సాగించడానికి వీలుగా  రాష్ట్ర విభజన చట్టం లోని సెక్షన్ ఎనిమిది ప్రకారం గవర్నర్ చర్యలు తీసుకోవాల్సివుందని కూడా ఆయన కోరారు. తమ మంత్రులు, అధికారుల ఫోన్లను నిబంధనలకు విరుద్ధంగా ట్యాప్ చేస్తున్నారనీ, దీనిపై ఉన్నత స్థాయిలో విచారణ జరపాలని చంద్రబాబు ప్రధానిని అభ్యర్ధించారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నేరుగా ప్రధానికి ఈ విధమైన విజ్ఞప్తి చేసారంటే దాన్ని తీవ్రంగా పరిగణించి వెంటనే చర్యలకు ఉపక్రమించడం కేంద్రం ధర్మం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ మేరకు మాత్రమే పరిమితం అయివుంటే ఏమాత్రం ఆక్షేపించాల్సిన అవసరం వుండదు. తనకున్న  భయాందోళనలను ప్రజలకు కూడా ఆపాదించారు. ఆవిధంగా ఒక చక్కని సమస్యను లేవనెత్తి కూడా దానికి రాజకీయం రంగు పులమడం వల్ల మొత్తం అంశం నీరుకారిపోయే అవకాశం ఏర్పడింది. దీనికి తోడు కొన్ని సమర్ధించుకోలేని చర్యలు కూడా తెలుగు దేశం పార్టీ అధినేత వాదనను బలహీనపరచిన మాట కూడా వాస్తవం. ఆ కారణం వల్లె, మొత్తం ప్రజల దృష్టిని కొన్ని అనైతిక సంఘటనలనుంచి మళ్లించేందుకే చంద్రబాబు ఏడాది కాలంగా పట్టించుకోని సెక్షన్ ఎనిమిది అంశాన్ని తెరపైకి తెస్తున్నారని టీఆర్ ఎస్ నాయకులు ఎదురు దాడికి దిగారు. ఈ క్రమంలో, ప్రజాస్వామ్య స్పూర్తికి విఘాతంగా పరిణమించిన కొన్ని అనైతిక చర్యలు, కేసులు,  న్యాయస్థానాల  విచారణకు, తీర్పులకు నోచుకోకుండానే రెండు పార్టీల  రాజకీయ వికృత క్రీడలకు మైదానంగా మారిపోతున్నాయి. పార్టీల నడుమ వ్యవహారం ప్రభుత్వాల మధ్య వివాదంగా మారిపోయి, ప్రస్తుతం రాజకీయ నాయకుల పుణ్యమా అని ప్రజలనడుమ లేనిపోని అనుమానాలు రేకెత్తడానికి కారణం అవుతున్నాయి. ఇదొక విషాదం. ఇరు ప్రాంతాలలోని ప్రజలు దీన్ని జాగ్రత్తగా గమనించాల్సి వుంది. లేని పక్షంలో రెండు రాష్ట్రాలకు  ఈ  పరిణామాలు పెనువిషాదాన్నే  మిగిలిస్తాయి.   
ఈ వివాదాలు సరిపోవన్నట్టు  సరికొత్తగా కృష్ణా నదీ జలాల వివాదం తోడయింది. ఉభయ రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. నదీ జలాల్లో వాటాలు, లెక్కలు తేల్చాలని ఒకళ్ళు, తెల్చేదేమీ లేదని మరొకళ్ళు మాటల తూటాలు విసురుకుంటున్నారు. బజారు నల్లాల దగ్గర  అనునిత్యం జనాలకు కానవచ్చే పోట్లాటలను పోలే  దృశ్యాలను టీవీ ఛానళ్ళలో ఉచితంగా చూపిస్తున్నారు. తాడు తెగకుండా తెగలాగడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య.  
దశాబ్దంన్నర  క్రితం ఇస్మాయిల్ సెరగెల్దిన్ అనే ఈజిప్టు దేశస్తుడు ఒక  జోస్యం చెప్పారు. 

ఇరవై ఒకటో శతాబ్దంలో ప్రపంచంలో జరిగే యుద్ధాలు దేశాలను  ఆక్రమించుకోవడం కోసమో, ముడి చమురు  వనరులకోసమో జరగవు. ముందు ముందు దేశాల నడుమ జరగబోయే యుద్ధాలకన్నింటికీ  ఒకే ఒక కారణం నీళ్ళు’.  నీటి కోసం జరిగే యుద్ధాలనే భవిష్యత్తులో జనం చూడబోతారు. అనేది అప్పట్లో అయన చెప్పిన మాట. ఆయన జోస్యం కొంత నిజం అవుతోంది. అదే భయం.
కృష్ణా జలాలపై ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా మంత్రుల నడుమ రాజుకుంటున్న వివాదం చినికి చినికి గాలివానగా కాదు ఏకంగా సునామీగా   మారుతున్న నేపధ్యం ఇందుకు ఉదాహరణ.
పారే నీటికి ప్రాంతం లేదు. ఎక్కడో పుట్టి, ఎక్కడెక్కడో ప్రవహించి సముద్రంలో కలిసే నదులకు ఒక రాష్ట్రం అంటూ లేదు. ఒక ప్రాంతం అంటూ లేదు. తాము పారుతూ తమ పక్కన వుండే నేలను, ఆ నేలలో వుండే  పంట పొలాలను పచ్చగా చేయడం తప్ప వాటికి ఏ స్వార్ధం తెలియదు. వచ్చిన చిక్కల్లా నీటితో రాజకీయాలు చేసే వారితోనే. వాటిని  తమ స్వార్ధానికి వాడుకోవాలని చూసే రాజకీయులతోనే. (13-06-2015)


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595   

10, జూన్ 2015, బుధవారం

సలాం రేడియో!


చిన్నప్పుడు పొద్దున్న పొద్దున్నే ఇది వింటుంటే రోజంతా హాయిగా గడిచినట్టు వుండేది. ఇప్పుడూ వినబడుతోంది. వినేవాళ్ళు తక్కువయిపోతున్నారు. వినాలనుకుంటే ఈ  లింకు ప్రయత్నించండి..
https://soundcloud.com/vjdilip/air