3, ఆగస్టు 2014, ఆదివారం

వివాదాస్పద ఆత్మ కధలు - కొన్ని జ్ఞాపకాలు


మాజీ ముఖ్యమంత్రి కీర్తిశేషులు జలగం వెంగళరావు 'నా జీవిత కధ' అనే పేరుతొ ఒక ఆత్మకధ వెలువరించారు. ఆ పుస్తకంలో కొన్ని అంశాలు మాజీ ప్రధాని పీవీ నరసింహారావు వ్యక్తిగత జీవితానికి సంబంధించినవి కావడంతో అది వివాదాస్పదం అయింది. "పీవీ నరసింహారావు ఒక తెలుగు మహిళా ఎంపీ తో వివాహేతర సంబంధం పెట్టుకుని కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఎదిగిన పిల్లల్ని  ఇంట్లో పెట్టుకుని  ఇలా ప్రవర్తించడం బాధ్యతా రాహిత్యం కదా!"  అని శ్రీమతి ఇందిరా గాంధీ తనతో చెప్పారని ఆయన తన పుస్తకంలో పేర్కొన్నారు.
పీవీ నరసింహారావు గురించి  శ్రీమతి గాంధీ తనతో ఇలా చెప్పారంటూ  వెంగళరావు ఆ పుస్తకంలో ఉదాహరించిన విషయాలు దిగ్భ్రాంతి గొలిపేవిగా వున్నాయి.
"నేనింతవరకు అలాటి (పీవీ) అసమర్ధ నాయకుడ్ని చూడలేదు. కందూ భాయ్ దేశాయ్, త్రిపాఠీ, ఉమా శంకర్ దీక్షిత్ వంటి సీనియర్ అన్న నమ్మకంతో ఆయన్ని ముఖ్యమంత్రిని చేసాను. వివాహేతర సంబంధం పెట్టుకుని తిరగడం తప్ప ఆయన ఉద్దరించిది ఏమీ లేదు. ఎదిగిన పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని అంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించడం నాకెంతో బాధ కలిగిస్తోందని" ఇందిరాగాంధి తనతో చెప్పుకున్నట్టు వెంగళరావు పేర్కొన్నారు. శ్రీమతి గాంధీ పీవీ గురించి కొన్ని విషయాలు తనతో చెప్పి, అందువల్లే ఆయన్ని మార్చి నిన్ను (వెంగళరావును) ముఖ్యమంత్రిగా పంపాలని నిర్ణయానికి వచ్చినట్టు తనతో చెప్పారని వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.(ఆ  విషయాలు మరీ దారుణంగా వుండడంవల్ల ఈ వ్యాసంలో పొందు పరచడం లేదు - భండారు శ్రీనివాసరావు)
అలాగే మర్రి చెన్నారెడ్డి గురించి వెంగళరావు వెలిబుచ్చిన కధనాలు:
"సంజయ్ గాంధీ విమాన ప్రమాదంలో మరణించడానికి నాలుగు రోజులు ముందు ప్రధాని తనయుడు చెన్నారెడ్డి స్థానంలో అంజయ్యను ముఖ్యమంత్రి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సంజయ్ మరణ వార్త చెన్నారెడ్డిని సంతోషంలో ముంచివేసింది. సంతాపం వెలిబుచ్చడానికి బదులుగా చెన్నారెడ్డి సంబరాలు చేఉకున్నారనీ, మిఠాయిలు పంచిపెట్టారనీ, కృష్ణాజిల్లాకు చెందిన ఒక లెజిస్లేటర్ తనతో చెప్పినట్టు  వెంగళరావు తన పుస్తకంలో పేర్కొన్నారు.
అయితే, అసలా పుస్తకం తాను తన చేతుల్తో రాయలేదనీ, ఎప్పటి జ్ఞాపకాలో  గుర్తు తెచ్చుకుని చెబుతుంటే వాటిని తన కోడలు అక్షరబద్ధం చేసారని, పుస్తకం పూర్తయిన తరువాత దాన్ని సమాచార శాఖ ఉన్నతాధికారి, అనేకమంది ముఖ్యమంత్రులవద్ద పీ ఆర్ వొ గా పనిచేసిన భండారు పర్వతాలరావు 'ఎడిట్' చేసారని ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో  చెప్పుకొచ్చారు.  పుస్తకంలోని అంశాలను ఒక పద్దతిలో కూర్చడంలో సూచనలు చేయడం తప్ప,  ఎవరినైనా కించబరిచే ఎలాటి ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రం  లేదని వెంగళరావు సమర్ధించుకున్నారు. అయితే పుస్తకంలో కొన్ని అంశాలు కొందరు  వ్యక్తులను బాధపెట్టేవిగా  వున్నాయని, వాటిని తొలగించడం మంచిదనీ అంటూ తాను ముందుగానే వెంగళరావు దృష్టికి తీసుకువచ్చినట్టు పర్వతాలరావు వివరణ ఇచ్చారు.  అయినా ఆయన తన సహజ శైలిలోనే,  'ఏం పర్వాలేదంటూ'  తన సలహాను  పట్టించుకోలేదని,  అంచేత ఆ పుస్తకంలో తన పేరు ఎక్కడా ప్రస్తావించవద్దని కోరినట్టు పర్వతాలరావు  చెప్పారు.
వెంగళరావు పేరుతొ వెలువడిన ఆ పుస్తకంలో పేర్కొన్న మరికొన్ని విషయాలు కూడా సంచలనాత్మకంగా తయారయ్యాయి. దేశంలో అత్యవసర పరిస్తితి (ఎమర్జెన్సీ) విధించాలనే నిర్ణయం తీసుకోబోయేముందు ఇందిరాగాంధి ఆ విషయాన్ని మొట్టమొదట తనతోనే చెప్పారని  వెంగళరావు పేర్కొన్నారు. జీవించిలేని వ్యక్తుల గురించి ఈ విధంగా రాయడం సబబు కాదని అప్పట్లో చాలా విమర్శలు వచ్చాయి.
1975 లో అలహాబాదు హైకోర్టు శ్రీమతి గాంధీ ఎన్నిక చెల్లదని తీర్పుఇచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ జగ్  మోహన్  సిన్హా, తన తీర్పు యెలా వుండబోతోందో రెండు నెలలకు ముందే  (కీర్తిశేషులు) జయప్రకాష్ నారాయణ్ కు తెలియచేసినట్టు తనతో చెప్పారని వెంగళరావు రాయడం మరింత వివాదాన్ని రేకెత్తించింది. ఆ ఆరోపణను  జస్టిస్ సిన్హా తీవ్రంగా తప్పుపట్టారు. 'ఇంతకంటే దారుణమైన పచ్చి అబద్ధం మరోటి వుండదు' అని  ఆయన వ్యాఖ్యానించారు.  
వెంగళరావు సొంత పార్తీవారిపైనే ఎక్కువ విమర్శలు చేశారు. ఏ.ఐ.సీ.సీ. అధ్యక్షుడుగా, కేంద్రమంత్రిగా పనిచేసిన కాసు బ్రహ్మానందరెడ్డి,  బియ్యపు మిల్లర్ల నుంచి భారీ మొత్తాల్లో డబ్బులు వసూలు చేశారనీ, ఆ విషయం శ్రీమతి గాంధీ దృష్టికి వెళ్లినట్టు తెలియగానే అందులో  కొంత డబ్బు పార్టీ ఫండ్ కు జమచేసారనీ ఆ పుస్తకంలో రాశారు. ఆయన చాలావరకు ఇలాటి సంగతులు, తాను విన్నవి, ఇతరులద్వారా తెలియవచ్చినవీ రాసారు. ఆ ఆరోపణలకు నిర్దిష్టమైన ఆధారాలు లేకుండానే రాసుకుంటూ వెళ్లారు.
ఈ కోవలోకి వచ్చేదే  మరో ఆత్మకధ మల్లెమాల పేరుతొ ప్రసిద్ధ చలనచిత్ర నిర్మాత  ఎం.ఎస్.రెడ్డి రాసిన 'ఇదీ నా కధ'. ఆ పుస్తకంలో సినిమారంగానికి చెందిన అనేకమంది ప్రముఖుల ప్రస్తావనలు వివాదాస్పదం అయ్యాయి. ఎన్టీ రామారావు, జమున, డైరెక్టర్ గుణశేఖర్, యువ హీరో జూనియర్ ఎన్టీయార్ మొదలయినవారిని కించబరిచే వ్యాఖ్యానాలు వున్నాయని విమర్శలు వెల్లువెత్తడంతో ఆ పుస్తకం ప్రతులను విక్రేతలనుంచి వెనక్కి తెప్పించుకోవాల్సిన పరిస్తితి ఏర్పడింది.
నాటి మేటి నటుడు ఎస్వీ రంగారావుతో  ఎన్టీ రామారావుకు పొసిగేది కాదని, అందువల్ల ఎస్వీయార్తో కలిసి నటించడానికి ఎన్టీ రామారావు నిరాకరించిన సందర్భాలు వున్నాయని మల్లెమాల రాశారు.'శ్రీ కృష్ణ రాయబారం' సినిమా సెట్టుపై తమిళనాడు ముఖ్యమంత్రి, నాటి నటి జయలిత, జమునల మధ్య తలెత్తిన మాటల యుద్ధం ప్రస్తావన కూడా ఈ పుస్తకంలో వుంది.

తెలుగు సినిమా పరిశ్రమ మొత్తంలో జూనియర్ ఎన్టీయార్ వంటి గర్విష్టి మరొకడు లేడంటూ చేసిన ఆరోపణ ఆ యువ నటుడి అభిమానుల ఆగ్రహానికి  కారణం అయింది. ఈ విమర్శలు, ఆగ్రహ ప్రకటనలు మొత్తం మీద మార్కెట్ నుంచి తన పుస్తకాలను మల్లెమాల ఉపసంహరించుకునేలా చేసాయి.  

ఇద్దరు మిత్రులు వైఎస్ఆర్ - చంద్రబాబు


(ఈరోజు స్నేహితుల దినోత్సవం)
సరిగ్గా   ముప్పయ్యారేళ్ళ క్రితం, మార్చి 15వ తేదిన - 'ఇద్దరు మిత్రులు ' రాష్ట్ర శాసనసభలో కొత్త సభ్యులుగా అడుగుపెట్టారు. ఆ ఇద్దరు - భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రులు కాగలరని ఆనాడు ఎవ్వరూ వూహించి ఉండరు. రాష్ట్ర స్థాయి రాజకీయాల్లో తొలి అడుగులు కలిసి వేసిన ఆ ఇద్దరి దారులు అనతికాలంలోనే  వేరైపోతాయని కానీ, ఆ ఇరువురి మధ్య వెల్లి విరిసిన స్నేహం అంత త్వరగా ఆవిరి కాగలదని కానీ,  ఏమాత్రం అనుకోవడానికి అవకాశం లేని రోజులవి. ఆ ఇద్దరూ ఎవరన్నది పెద్ద ప్రశ్నా కాదు - సమాధానం చెప్పలేనంత క్లిష్టమైనది కాదు. కాకపోతే, ఒకప్పటి ప్రాణస్నేహితులయిన రాజశేఖరరెడ్డి - చంద్రబాబు నాయుడుకొన్ని విషయాలలో చాలా అదృష్టవంతులయిన రాజకీయ నాయకులనే చెప్పాలి. ఎందుకంటే...


(ఒకనాటి ప్రాణ మిత్రులు వైఎస్ఆర్ - చంద్రబాబు)

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు - ఆయన పార్టీకి ఆయనే  అధినేత - కేంద్రంలో సయితం ఆయిన కనుసన్నల్లో పనిచేసే ప్రభుత్వాలే కొనసాగాయి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడైన ఎన్ టి రామారావుగారికి కూడా ఈ వైభోగం లేదు. ఆయన అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఎప్పుడూ చుక్కెదురే. ఇక రాజశేఖరరెడ్డి విషయం తీసుకుంటే - ఆయన ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించేనాటికి - కాంగ్రెస్ పార్టి అధిష్టానం తీరుతెన్నులే పూర్తిగా మారిపోయాయి. తరచుగా ముఖ్యమంత్రులను మార్చే విధానానికి సోనియాగాంధి నాయకత్వంలోని ఆ పార్టీ  అధిష్టానం తిలోదకాలు ఇచ్చింది.
అలాగే, రెండో టరం చివరాఖరి దశలని మినహాయిస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబుది కూడా  మరింత కలిసివచ్చిన కాలం. ఇంటా - బయటా ఆయన పేరు మారుమ్రోగిపోయింది. ప్రపంచపఠంలో   ఆంధ్రప్రదేశ్‌కి చోటు దక్కింది. ఎన్నారైలకి  రాష్ట్రంలో ఓటు హక్కు ఇస్తే - ఆయన మరికొన్ని దశాబ్దాలవరుకు ముఖ్యమంత్రిగా కొనసాగగలరన్న స్థాయిలో వూహాగానాలు ఊపిరి పోసుకున్నాయి.  ఆయన హయాంలోనే  ఆకాశానికి నిచ్చెనలు వేసి - అంధ్ర ప్రదేశ్‌ని పైకెక్కించే పధకాల రచనకు కంప్యూటర్  వేగంతో శ్రీకారం చుట్టారు. 
ఇక రాజశేఖరెడ్డి విషయానికి వస్తే - ఆయన సరైన సమయంలో రాష్ట్రానికి  ముఖ్యమంత్రి అయ్యారనే చెప్పాలి.  2004లో కాంగ్రెస్ గెలిచి వుండని పక్షంలో - భవిష్యత్తులో ఆయనకి   ఈ అవకాశం లభించే పరిస్థితి వుండేదికాదు.  గతంలో కూడా ముఖ్యమంత్రి రేసులో ఆయన లేకపోలేదు. అప్పుడే ఈ పదవి ఆయనికి లభించి ఉంటే, బహుశా, ఏ  రెండేళ్ళో, మూడేళ్ళో ముఖ్యమంత్రి పదవిని నిర్వహించిన కాంగ్రెస్ మాజీల జాబితాలో ఆయన చేరిపోయివుండేవారేమో.  సరైన తరుణంలో ముఖ్యమంత్రి కాగలిగారు  కనుకనే అయిదేళ్ళ పదవీకాలాన్ని జయప్రదంగా పూర్తిచేసుకోవడమే కాకుండా  పూర్తి టర్మ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఒక రికార్డ్ ను  సృష్టించారు.

ఒకప్పటి వారి స్నేహానికి ప్రత్యక్ష సాక్షిని నేనే. అందుకే, రాజకీయంగా విడిపోయిన ఈ రాజకీయ మిత్రులు ఇద్దరు  చివరికి భౌతికంగా కూడా విడిపోవడం చాలా విషాదం అనిపిస్తుంది.

మనసు చేసే అల్లరి


మనసు పదిలం తమ్ముడూ! అన్నాడో కవి.
ఎందుకంటే మనసు చేసే గందరగోళం ఇంతా అంతా కాదు. లేని దాన్ని సృష్టిస్తుంది. వున్నదానిని కానరాకుండా చేస్తుంది. మనసు చేసే మాయనుంచి బయటపడలేకపోతే ఇక ఆ మనిషి గతి ఇంతే!
చైనా లో ఓ నీతి కధ వుంది.
ఓ వయసు మళ్ళిన పెద్దమనిషికి రాత్రిళ్ళు నిద్ర పట్టడం లేదు. దానికి కారణం ఇంటి పక్క మడుగులో వున్న కప్పలు రాత్రి వేళల్లో చేసే గోల.


మండూక సంతానం చేసే బెకబెకల శబ్దాలు ఆ పెద్దమనిషికి చిన్నపాటి కునుకు కూడా పట్టకుండా చేస్తున్నాయి. వాటి బెడద వొదిలించుకోవాలని నిర్ణయించుకున్న ఆ ఆసామీ పొరుగున బస్తీలో హోటల్ నడుపుతున్న మరో పెద్ద మనిషిని సంప్రదించాడు.
నా దగ్గర ఓ లక్ష కప్పలు వున్నాయి. మీరు కొంటానంటే రోజూ ఓ వేయి కప్పలయినా సప్లయి చేస్తాను
బస్తీ పెద్దమనిషి సంతోషంతో కప్పలా గెంతబోయి వెంటనే తమాయించుకుని, రోజూ ఓ వెయ్యి చొప్పున  కొనడానికి  పల్లెటూరి పెద్దమనిషితో కప్పల బేరం కుదుర్చుకున్నాడు.
వూరికెళ్లిన పెద్దమనిషి మర్నాడే తిరిగొచ్చాడు. ఆయన చేతిలో రెండే రెండు కప్పలు వున్నాయి.
మిగిలినవేవి?’ అని బస్తీ మనిషి అడిగాడు.
రాత్రిళ్ళు  అవి చేసే బెకబెకల ధ్వనులు విని ఆ మడుగులో కనీసం ఓ లక్ష కప్పలయినా వుంటాయని భ్రమ పడ్డాను. తీరా చూస్తే అంత గోల చేస్తున్నవి ఈ రెండే! పల్లెటూరి మనిషి బదులు చెప్పాడు.
అంటే ఏమిటన్న మాట!
చుట్టూ జగమంతా నిద్రిస్తున్నప్పుడు, వొంటరితనం వేధిస్తున్నప్పుడు మనసు చేసే అల్లరి ఇది. చిన్న సమస్య కూడా పెద్దగా అనిపిస్తుంది. 


(ఆంగ్ల కధనానికి అనువాదం - Courtesy Image Owner)

2, ఆగస్టు 2014, శనివారం

తెలంగాణా ఖజానాకు మొదటి చెల్లింపు


సీసా మూతపై తళతళలాడుతూ కనిపించింది ఓ స్టిక్కర్.  షాపువాడు  ముక్కు పిండకుండానే వసూలు చేసింది అక్షరాలా పద్నాలుగు వందల ఎనభై రూపాయలు.  స్టిక్కర్ అంటించిన సర్కారుకు ఇందులో యెంత ముడుతుందో లెక్కలు తెలవ్వు. అయినా ఎంతో కొంత చేరడం ఖాయం. కాబట్టి నేను సైతం ........




చేతులు కలిసిన శుభవేళ ..

ఈ ఇద్దరు కలవాలంటే దేవుడే దిగిరావాలి అనుకున్నారు. కానీ రాష్ట్రపతి ప్రణబ్ హైదరాబాదు రాక ఈ ఇద్దరు చంద్రులను కలిపింది.  ఈ కలయిక మరిన్ని మంచి పరిణామాలకు పునాది కావాలి.

   

దిల్ మాంగే మోర్


రాజుగారు ఉద్యానవనంలో వాహ్యాళి ముగించుకుని తిరిగి రాజప్రాసాదంలో అడుగిడే ముందు అతడు వున్నట్టుండి ఎదురుపడ్డాడు. చూడబోతే బిక్షగాడి మాదిరిగా వున్నాడు. బాగా  ఉల్లాసంగా వున్న రాజుగారికి అతగాడికి ఏదయినా  సాయం చేయాలని అనిపించింది.
ఏం కావాలి నీకు ? కోరుకో! ఏదయినా సరే ఇస్తానుఅన్నాడు రాజుగారు రాజసం వొలక బోస్తూ.
రాజా! తొందరపడి అలా అనకు. అనేముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకో
అలా ధైర్యంగా నిలదీసే మనిషి రాజుగారికి ఇంతవరకు తారసపడలేదు. అతడు అల్లాటప్పా రాజు కాదు. అనేక యుద్ధాల్లో ఆరితేరిన వాడు. అరివీరభయంకరులయిన శత్రురాజులను మట్టికరిపించి సువిశాల సామ్రాజ్యం నిర్మించుకున్న మహా చక్రవర్తి. అలాటి వాడు,  ‘కోరుకో ఇస్తాను అంటే ఆలోచించుకో అనే మనిషి మామూలువాడు అయివుండడు
అలా ఆలోచించుకున్న రాజు అన్నాడు అతడితో.
పరవాలేదు అడుగు. సంశయించాల్సిన పనిలేదు. ఇచ్చిన మాట తప్పే అలవాటు మా ఇంటావంటా లేదు.
సరే! రాజా! చూసారుగా నా చేతిలోని ఈ బిక్షాపాత్ర. ఇందులో ఏం వేస్తారో వేయండి. దీన్ని నింపండి. నాకంతే చాలు. అయితే మళ్ళీ చెబుతున్నాను మళ్ళీ ఒకసారి ఆలోచించుకోండి
రాజు విలాసంగా నవ్వాడు. నవ్వి అన్నాడు.
ఈ పాత్ర నింపడానికి అంతగా ఆలోచించుకోవాల్సిన అవసరం వుందనుకోను
రాజు అతడిని వెంటబెట్టుకుని రాజ ప్రాసాదంలోకి తీసుకువెళ్ళాడు. పరివారాన్ని పిలిచి అత్యంత విలువైన మణి మాణిక్యాలతో ఆ పాత్రను నింపమని ఆదేశించాడు.   
కృష్ణ తులాభారం  మాదిరిగా సన్నివేశం  మారిపోయింది. ఒకటికి రెండుసార్లు యెందుకు ఆలోచించుకోమన్నాడో రాజుకు క్రమంగా అవగతమవుతోంది. ఆ పాత్రలో ఏమి వేసినా, ఎన్ని వేసినా ఇట్టే అదృశ్యం అయిపోతున్నాయి. ఆ బిక్షాపాత్ర తిరిగి ఖాళీ అవుతూనే వుంది.
రాజదర్బారులో జరుగుతున్న ఈ వింత గురించి తెలిసి జనం తండోపతండాలుగా అక్కడికి చేరుకున్నారు.
ఖజానాలోని సమస్త ధనరాసులు, స్వర్ణాభరణాలను  భటులు గంపలకొద్దీ  తెచ్చి ఆ బిక్షాపాత్రలో వేస్తున్నారు. చిత్రం! వేసినవి వేసినట్టే మాయం అవుతున్నాయి. పాత్ర ఖాళీ అవుతూనే వుంది.
రాజుగారిలో పట్టుదల పెరిగింది. ముందూ వెనకా చూడకుండా తనకున్న సమస్తాన్ని ధారపోశాడు. ఫలితం శూన్యం.
చివరకి జరిగినదేమిటంటే సాయంత్రానికల్లా రాజ దర్బారులో ఇద్దరు బిక్షగాళ్ళు మిగిలారు.
ఒకడు ఆ వచ్చినవాడు. రెండోవాడు రాజుగారు.
సర్వం పోగొట్టుకున్న తరువాతగాని రాజుకు గర్వం దిగిరాలేదు. ఆగంతకుడి ముందు సాగిలపడి అన్నాడు.
మహానుభావా! నా అహంకారాన్ని మన్నించండి. నేను మీమాట పెడచెవిన పెట్టాను. ఇంతకీ ఈ బిక్షాపాత్ర సంగతి చెప్పండి. ఇందులోని మర్మం ఏమిటో సెలవివ్వండి
ఆగంతకుడు రాజును మించిన విలాసం ప్రదర్శిస్తూ మందహాసం చేసాడు.
రాజా! నిజానికి ఇది బిక్షాపాత్ర కాదు. మానవ కపాలం. నేను దాన్ని మెరుగు పెట్టి పాత్ర మాదిరిగా కనబడేట్టు చేసాను. ఇందులో ఎన్ని వేసినా, ఏం వేసినా అంతే! ఏమీ మిగలదు.  అధికారం, సిరి సంపదలు ఎన్ని వున్నా ఇది ఇంకా ఇంకా కావాలని కోరుకుంటుంది. దీని ఆశకు అంతు లేదు. ఎన్ని ఇచ్చినా వద్దనదు. యెంత ఇచ్చినా కాదనదు. మనుషులకు, ఈ ఆశ అనండి, అత్యాశ అనండి కాటికి పోయినదాకా అది వాళ్ల వెంటే వుంటుంది. ఆ వాస్తవం బోధపరచడానికే ఇదంతా
మాయమయిన ధనరాసులు, సిరి సంపదలు రాజుకు మళ్ళీ దక్కాయి. వాటితో పాటు అదనంగా ఒక  జీవిత సత్యం కూడా ఆయన ఖాతాలో చేరింది.
దిల్ మాంగే మోర్’  




(ఇంగ్లీష్ కధకు స్వేచ్చానువాదం & Courtesy Image Owner)

ఓ! మై గాడ్!

దేవుడా నువ్వే దిక్కు
మా ఇంట్లో అందరూ దేవుడి పార్టీ.
నేనూ దేవుడూ ఒక పార్టీ.
'దేవుడు వేరూ తాము వేరు' అనుకుని వాళ్లు దేవుడుకి దూరం అవుతున్నారని నా ఘోష.
'దేవుడితో ఫ్రెండ్ షిప్ చేయాలనే అత్యాశ పెంచుకోవడం వల్ల నాకు దేవుడు దూరం అవుతున్నాడ'ని వాళ్ల బాధ.
కారణం ఏమైతేనేం నాకు మా ఇంట్లోనే కాదు మా చుట్టపక్కాల్లో కూడా 'వీడొట్టి నాస్తికుడు' అనే ముద్ర పడిపోయింది.  
'చిన్నప్పుడు గోరాగారితో తిరిగాడు. అలానే మాట్లాడుతాడు' అనేవాళ్ళు పైగా.
ఆయన ఎప్పుడూ దేవుడు లేడు అనేవారు కాదు, అసలు లేనివాడు ఆడో మగో అనవసరం అనేది గోరాగారి సిద్దాంతం, అందుకే 'దేవుడు లేదు' అంటుండేవారు. అలా అన్న గోరాగారే,  చనిపోయిన తరువాత వాళ్ల కుటుంబానికి దేవుడుగా మారిపోయాడని కొందరు అంటుంటారు. అసలు దేవుళ్ళు పుట్టిందే ఇలాగా అని మరి  కొందరు సనాయి నొక్కులు నొక్కుతుంటారు. శిష్యులకు, అభిమానులకు చెప్పింది తలకెక్కదు, అంచేతే 'విగ్రహారాధన కాదుకూడదు' అన్న బుద్ధుడికి దేశదేశాల్లో ఇన్నేసి విగ్రహాలు వేశారని ఇంకొందరు ఉవాచిస్తుంటారు (గ్రామరు తప్పయితే గోడ కుర్చీకి రెడీ)
నిజం చెప్పాలంటే నాకు దేవుడితో, దేవుడికి నాతొ ఏ పేచీ లేదు. వున్న పేచీ అల్లా ఆ దేవుడి పేరుతొ నానా యాగీ చేసేవాళ్ళతో. (ఇక్కడ తప్పకుండా చెప్పుకోవాల్సింది ఏమిటంటే - 'ఈ బాపతు వాళ్ళల్లో' దేవుడ్ని నమ్మేవాళ్ళు, నమ్మని వాళ్ళూ వున్నారు)
అసలు విషయానికి వస్తాను. మా మేనల్లుడు రామచంద్రం నిన్న ఒక ఫంక్షన్ లో కలిసాడు.  వాళ్ల నాన్నగారిలాగే ఆధ్యాత్మిక మార్గం. చెప్పేవి పెద్ద పెద్ద విషయాలు  కాబట్టి నాకంటే వయస్సులో చిన్నవాడయినా వాడికి పెద్దరికం బాగానే  అబ్బింది. ముచ్చట్లలో దేవుడి విషయం వచ్చింది. 'దేవుడు వేరు, దైవం వేరు' అన్నాడు. 'దేవుళ్ళు అనేకమంది. దైవం మాత్రం ఒక్కడే' అని కూడా అన్నాడు.  'దేవుడు ఎవ్వరో కాదు, నువ్వే. ఎక్కడో లేడు, నీలోనే వున్నాడు' అని కూడా  తేల్చేసాడు.  'ముందు నువ్వు 'నేను' అనే విషయం మరవగలిగితే నువ్వే దేవుడివి' అని చెప్పాడు. విన్నప్పుడు కాస్త గందరగోళం అనిపించింది. అందుకే వేదాంతం అన్నారేమో! ఆలోచించి చూస్తే 'ఆహా!' అనిపించింది మనసులో. కానీ పైకే అన్నానేమో.
'యెందుకు అనిపించదు, ఇన్నేళ్లబట్టీ మీరూ అదేకదా చెబుతోంది. అందుకే ఆ ఆహాలు, ఒహోలు' అంది మా శ్రీమతి హఠాత్తుగా ప్రత్యక్షమై.
'ఓ మై గాడ్!' అని పైకి మాత్రం అనలేదు.


( నిన్న మేము వెళ్ళిన మా దగ్గరి దూరపు చుట్టం 'పెనుగంచిప్రోలు రవి' ఇంట్లో -  వాళ్లు ముచ్చటపడి, ఎంతో శ్రద్ధతో  చేయించుకున్న పూజా మంటపం)