29, ఏప్రిల్ 2014, మంగళవారం

'ఒరేయ్ నేను శారదని....'

క్షమించాలి నేను గీసుకున్న గీతను నేనే దాటి వస్తున్నందుకు. కానీ సరయిన కారణం వుంది. ఇందులో నాకు రాజకీయం కనబడలేదు. ఈ ఫోటోలో వున్నది మా రెండో అక్కయ్య. ఆవిడకు వోటు ఖమ్మంలో వుంది. కానీ మూడు నెలల క్రితం వాళ్ల అబ్బాయి దగ్గరకు వచ్చి ఆరోగ్యకారణాల రీత్యా హైదరాబాదులోనే వుండిపోవాల్సివచ్చింది. రేపు ఇక్కడ వోట్ల రోజు అన్న సంగతి తెలుసుకుని ఈ రోజు పొద్దటి నుంచి అందర్నీ ఫోనులో పలకరించి వోటు వేసి రమ్మంటోంది. అంతే కాదు వేసి వచ్చిన తరువాత ఆ విషయం మళ్ళీ ఫోను చేసి చెప్పమని మాట తీసుకుంటోంది. తొంభయ్ ఏళ్ళ వయస్సులో ఆవిడ పడుతున్న ఆత్రుత చూసిన తరువాత ఇక దీన్ని షేర్ చేయాలన్న ఆత్రుత నాలో పెరిగిపోయింది. అందుకే వొట్టు తీసి గట్టున పెట్టేసాను.మన్నించాలి. - భండారు శ్రీనివాసరావు
మా మేనకోడలు భండారు రేణు సుధ కధనం:



(శ్రీమతి కొలిపాక శారద)

ఫోను కలపవే చిన్నమ్మాయ్!
" పొద్దున్నే లచ్చుబాబు నుంచి ఫోను. ఒక్కసారి వచ్చివెళ్ళవే అమ్మ అడుగుతోంది"
'ఆర్చుకుని తీర్చుకుని జూబిలీ హిల్స్ నుంచి బయలుదేరి వెళ్లేసరికి పదకొండు దాటింది. అమ్మ కిందటి నెలలోనే ఖమ్మం నుంచి హైదరాబాదు పటాన్ చెర్వు సమీపంలో వున్న మా చిన్నన్నయ్య ఇంటికి వచ్చింది. తొంభయ్ ఏళ్ళ మనిషిని అలా కదిలించడం నిజంగా సాహసం అనిపించింది కాని తప్పలేదు. మేముంటోంది జూబిలీ హిల్స్ లో. వారానికో పది రోజులకో వెళ్ళి చూసి వస్తుంటాను. ఎర్రటి ఎండలో పడివచ్చానని ఇంట్లో అంతా అనుకుంటుంటే అమ్మ మాత్రం తాపీగా 'ఫోను కలపవే చిన్నమ్మాయి' అంటోంది. అప్పటికే మా లచ్చుబాబు అన్నయ్య, గాయత్రి ఒదినె, వాళ్ల పిల్లల వరస అయిపోయినట్టుంది. ఆవిడ మంచం మీద కూర్చుని, హైదరాబాదులోని చుట్టపక్కాలు అందరికీ ఫోను కలిపి ఇవ్వమంటుంటే ఏమిటో అనుకున్నాను. తీరా చూస్తే. ఈ వయస్సులో ఎవరయినా అలా చేస్తారా అని అనిపించింది కూడా.
ఆవిడ పుట్టింది కాంగ్రెస్ వాదుల ఇంట్లో. మెట్టింది కాంగ్రెస్ కుటుంబాన్ని. పెళ్ళయిన కొత్తల్లోనే భర్త అంటే మా నాన్నగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారు, స్వాతంత్ర సమర యోధుడిగా, గర్భిణి అయిన అమ్మను వొదిలి పద్దెనిమిది మాసాలు జైల్లో వున్నారు. తొలి చూరు బిడ్డని పుట్టిన వెంటనే చూసుకునే అదృష్టం కూడా లేదు. జైలు నుంచి వచ్చిన ఎన్ని నెలలకో కళ్ళారా చూసుకున్నారు. స్వతంత్రం వచ్చిన దరిమిలా మొదటిసారి ఎన్నికలు జరిగినప్పటి నుంచి క్రితంసారి ఎన్నికల వరకు దేన్నీ విడిచిపెట్టకుండా ప్రతిసారీ వోటు వేసి రావడం మా అమ్మకు అలవాటు. ఈసారి తనకు వోటు లేని హైదరాబాదులో వున్నప్పుడు ఈ వోట్ల పండుగ వచ్చిపడింది. వోటు వేయాలని ప్రాణం యెంత కొట్టుకులాడిపోతున్నా చేతకాని స్తితి. వీలులేని పరిస్తితి. అందుకని కొడుకునీ, కోడల్నీ, మనుమల్నీ పక్కన కూర్చోపెట్టుని అందరికీ ఫోన్లు కలపమని చెబుతూ, 'వొరేయ్ నేను శారదని, రేపు మరిచిపోకుండా వోటు వేసి రండి. వేసి వచ్చిన తరువాత నాకు ఫోను చేసి చెప్పండి.' అంటోంది.
ఇదంతా వింటూ నాకు కళ్ళు తిరిగాయో తెలియదు కాని తెరిపిళ్ళు పడ్డాయి. - భండారు రేణు సుధ

28, ఏప్రిల్ 2014, సోమవారం

తాత్కాలిక విరామం



బ్లాగర్, ట్విట్టర్,  ఫేస్ బుక్ సయితం ప్రభావవంతమైన సోషల్ మీడియా అయినందువల్ల  ఈరోజు సాయంత్రం ఆరుగంటల నుంచి ఎల్లుండి ముప్పయ్యవతేదీ సాయంత్రం పోలింగు ముగిసేవరకు రాజకీయ సంబంధమైన వార్తలు, వాటిపై వ్యాఖ్యలు, లేదా రాజకీయ కార్టూన్లు షేర్ చేయడం, లేదా వాటికి వ్యాఖ్యానాలు జత చేయడం, ఇతరులు పోస్ట్ చేసిన రాజకీయ  అంశాలపై స్పందించడం మొదలయిన వాటన్నిటికీ దూరంగా వుండాలని నిర్ణయించుకున్నాను.ఇది నాకు నేనుగా స్వచ్చందంగా తీసుకున్న నిర్ణయం.- భండారు శ్రీనివాసరావు       

27, ఏప్రిల్ 2014, ఆదివారం

ఏ నిమిషానికి ఏమిజరుగునో ........


మంథా భానుమతి గారు 'హ్యాపీ మూమెంట్స్' రాయడం మొదలు పెట్టిన తరువాత అలా అందరూ తలా ఓ చేయివేస్తే అంతా హాయిగా చదువుకోవచ్చు కదా అనిపించింది. కానీ మళ్ళీ ఆవిడే రాశారు తెలిసిన వాళ్ళెవరో పోయారు, విషాద వార్తను పంచుకోవాల్సివచ్చిందని. పోతే, మా కధ.
ఆదివారం అన్నీ లేటే! కాఫీలు టిఫిన్లు.
వంటావిడ వచ్చి చేసిన ఇడ్లీలు తిని, పొద్దున్న (ఛానళ్ళ కోసం) చదివిన పత్రికల్నే మళ్ళీ తీరిగ్గా  చదవడానికి గదిలోకి వెళ్లాను. మా ఆవిడ పూల కుండీల్లో నీళ్ళు పోశారో లేదో చూడడానికని బయటకు వెళ్ళింది. మావాడు సంతోష్  పెట్టిన టిఫిన్ చల్లారిపోతున్నా పట్టించుకోకుండా 'వాట్సప్' లో మునిగితేలుతున్నాడు.
ఇంతలో భళ్ళున చప్పుడు. తలుపులు విరిగి విసురుగా దూరాన పడ్డ శబ్దం. బయటకు వచ్చి చూస్తే వంటిల్లు రణరంగంలా వుంది. కిచెన్ ప్లాట్ ఫారం కింద గ్యాస్ క్యాబిన్ తలుపులు దూరంగా పడివున్నాయి. సిలిండర్ రెగ్యులెటర్ నుంచి మంటలు వస్తున్నాయి. మావాడు మంచినీళ్ళబాటిళ్లలోని నీళ్ళతో ఆ మంటలపై చల్లుతున్నాడు.    
అవి ఓ పట్టాన కంట్రోల్ కావడం లేదు. ఎలారా అని అనుకుంటున్న సమయంలో 'లక్కు' అనేది మాకూ , జరగబోయే బీభత్సానికి నడుమ అడ్డుగోడలా నిలిచింది. మంటలు ఆరిపోయాయి. సిలిండర్ తీసి బయట పడేశాము.
ప్రస్తుతం మా ఆవిడ పర్యవేక్షణలో సంప్రోక్షణ జరుగుతోంది.
మావాడు కిచెన్ కు సెలవు ప్రకటించాడు. బహుశా ఈ పూట మధ్యాహ్నభోజనం బయట హోటల్లోనేమో!
కధ సుఖాంతం 


26, ఏప్రిల్ 2014, శనివారం

?????????


ఈ రెండు నెలలు అసెంబ్లీని యెందుకు వుంచినట్టు. యెందుకు రద్దుచేసినట్టు. కారణం తెలియదని కాదు ఈ ప్రశ్న వేయడం. రాష్ట్రపతి పాలన విధించినప్పుడే రద్దు చేసి వుంటే ఎమ్మెల్యేల జీత భత్యాల భారం తప్పేది కదా అని.



పల్లెకు పోదాం


"Back to village"

'పల్లెకు పోదాం పదండి' అని నేను 2005 లో  రిటైర్ కావడానికి ముందే రాశాను. ఒక్క దేవినేని మధుసూదనరావు గారనే పెద్ద మనిషి వారి భార్య శ్రీమతి జయశ్రీ గారు  మాత్రమే ఈ పని చేసి చూపించారు.  హైదరాబాదులో ఉద్యోగ బాధ్యతలు పూర్తికాగానే వాళ్ల స్వగ్రామం వెళ్ళిపోయారు. పెరట్లోనే కూరగాయలు పండించుకుంటూ,   పుస్తకాలతో సాహితీ సేద్యం చేస్తూ హాయిగా వుంటున్నారు.  చదువులకోసమో, ఉద్యోగాలకోసమో బస్తీలకు వచ్చినవాళ్ళు ఇళ్లు కట్టుకుని అక్కడే సెటిలై పోకుండా,  స్వగ్రామాలకు తిరిగి వెళ్ళిపోతే బస్తీలమీద ఇంత భారం ( జనాభా, నీళ్ళు, వాహనాలు, విద్యుచ్చక్తి వగయిరా రూపంలో) పడదని నా వాదన. కానీ ఏం లాభం జీవితంలో ఎన్నో అనుకుంటాం కొన్నే చేయగలుగుతాం.


(మా స్వగ్రామంలో మా ఇల్లు)


25, ఏప్రిల్ 2014, శుక్రవారం

ఏకంగా నా పోటీ జంధ్యాల మీదే!


డెబ్బయ్యవ దశకానికి ముందు మా అన్నయ్య పర్వతాలరావు గారికి ఖమ్మం నుంచి బెజవాడ బదిలీ కావడం వల్ల నేను ఎస్సారార్  కాలేజీలో,  బీ కామ్ మొదటి సంవత్సరంలో చేరాను. చేరిన కొత్తల్లోనే విద్యార్ధి సంఘం ఎన్నికల్లో భాగంగా లాంగ్వేజ్ అసోసియేషన్ ఎన్నిక జరిగింది. మా క్లాసులో శతమానం భవతి అన్నట్టు వంద మంది. అదే కాలేజీలో బీ ఎస్సీ చదువుతున్న నా మేనల్లుడు తుర్లపాటి సాంబశివరావు పూనికపై నేను కూడా పోటీ చేస్తున్నట్టు పేరు ఇచ్చాను. మాచవరం నుంచి ఇద్దరం రిక్షాలో కాంగ్రెస్ ఆఫీసు రోడ్డులోని తెలిసిన సైక్లోస్టైల్ షాపుకు వెళ్ళి తెలుగులో అక్కడికక్కడే ఒక గేయం రాసి టైపు చేయించి కాలేజీకి  తిరిగి వచ్చి వాటిని క్లాసులో పంచిపెడుతుండగానే గంట మోగింది. వందలో నాకు పదిహేడు ఓట్లు వచ్చినట్టు జ్ఞాపకం. దండిగా ఓట్లు తెచ్చుకుని గెలిచినదెవరంటే జేవీడీఎస్ శాస్త్రి. అంటే ఎవరో కాదు మనందరి అభిమాన ఆహ్లాద సినీ రచయిత, దర్శకుడు జంధ్యాల.


ఆ 'ఒక్కక్షణం' అనే  గేయం ఇలా సాగుతుంది.
"ఒక్క క్షణం తొందరపడి ఓటు వృధా చేయకు - నిప్పుకణికెలాంటిదది నిర్లక్ష్యము చేయకు - మాటలాడబోవుముందు ఒక్కసారి యోచించు - ఓటు వేయబోవుముందు కొద్దిగ ఆలోచించు - స్నేహితునకు ఇవ్వదగిన బహుమానము కాదు ఓటు - శత్రువైన సరే నీకు! అర్హతున్నవానికేయి - చేతులు కాలిన పిమ్మట ఆకులకై  వెదుకకు - మంచికైన చెడుకైన నీదే బాధ్యత మరువకు -  అర్హుడైన వాని గెలుపు నిజము సుమ్ము నీ గెలుపే"

ఎందుకో మా తరగతిలో చాలామంది నా మాట మన్నించారు. చివరి పాదంలో చెప్పినట్టు జంధ్యాలను గెలిపించారు.               

1973 లో అగ్గిపెట్టె పదిపైసలు

మా పాత డైరీల్లో రాసుకున్న పాత విషయాలు
న్యూ ఇయర్  గిఫ్ట్ లకింద జర్బలిష్టులకు యెంత ఖరీదయిన డైరీలు వచ్చినా వాటిల్లో చాలామంది (వారి భార్యలు) రాసుకునేవి కిరాణా పద్దులే. ఎందుకంటే రాసేదంతా ఆఫీసులోనే రాసి వస్తారు కాబట్టి ఇక సొంత గోల రాసుకోవడానికి ఓపికా వుండదు. రాయడానికి విషయాలు వుండవు.
అలా 1973 లో మార్చి నెల 31  వ తేదీన మా ఆవిడ డైరీలో రాసిన ఒక రోజు ఖర్చు చిట్టా ఇది. (అంటే సుమారుగా నలభయ్ ఏళ్ళకిందటి మాట)
నూనె : Rs.3-25
నెయ్యి:Rs. 2-75
పెరుగు: Rs.0-20
టమాటాలు:Rs. 0.55
అగ్గిపెట్టె: Rs. 0.10
సబ్బు: Rs.1-00
రిక్షా: Rs. 0-50
వక్కపొడి పొట్లం: Rs. 0-10
(NOTE: నూనె, నెయ్యి కూడా రోజువారీగా కొని సంసారం నడిపిందేమో తెలవదు. ఎందుకంటే జర్నలిష్టులకు ఇల్లు పట్టదు. అంతా ఐ నో సీ ఎం - ఐ నో పీఎం బాపతు)