7, ఏప్రిల్ 2014, సోమవారం

మనవాడే అయ్యుంటాడు

అంజయ్య గారి భోలాతనం గురించి ఆ రోజుల్లో ఓ కధ చెప్పేవాళ్ళు. నిజంగా ఇది కధే. నిజంగా నిజం కాదు. ఆయన ఓ సారి మంత్రివర్గాన్ని భారిగా విస్తరించారు. జంబో క్యాబినెట్ అనేవాళ్ళు. ఇప్పుడంటే అవి మామూలయిపోయాయి. ఒకరోజు కొత్తమంత్రి ఒకరు ముఖ్యమంత్రి అంజయ్య గారిని కలవడానికి వచ్చారు. ఆయన్ని చూడగానే అంజయ్య గారు నొచ్చుకుంటూ - ఈ సారి నిన్ను తీసుకోవడం కుదరలేదు. మళ్ళీ ఎప్పుడయినా మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు నిన్ను తప్పకుండా చేర్చుకునే పూచీ నాది'అన్నారు. మంత్రివర్గంలో ఎవరెవరు వున్నారో ఆయనకే తెలియదని ఆ రోజుల్లో హాస్యోక్తిగా అనుకునేవారు. ఇప్పుడు మళ్ళీ అలాగే వుంది. ఎన్నికలముందు ఎవరు ఏ పార్టీలోకి వెడుతున్నారో తెలవదు. వెళ్ళిన వాళ్లు అక్కడ ఎన్నాళ్ళు వుంటారో తెలవదు. ఏ పార్టీనుంచి ఏ గుర్తుమీద పోటీ చేస్తున్నారో తెలవదు. ప్రచారానికి పోయినప్పుడు పాత పార్టీని తిట్టాలో తెలియదు. కొత్త పార్టీని పొగడాలో తెలియదు. ఫలితాలు వెల్లడయిన తరువాత కూడా గెలిచినవాడు మనవాడేనా కాదో తెలియదు. ఇన్ని అయోమయాల మధ్య జరుగుతున్న ఎన్నికల్ని మనం చూడబోతున్నాం.

ఈ ప్రశ్నకు బదులిది


వోటేసి రావడానికి వాళ్ల వూరు వెళ్ళిన పనిమనిషి కుటుంబం తిరిగొచ్చింది.
'కొత్త రాజధాని ఎక్కడ అనుకుంటున్నారు' యాదాలాపంగానే అడిగాను.
'బిల్దింగులూ, రోడ్లు, మెట్రో రైళ్ళూ అన్నీ కలిగినోళ్ళకి. మాకిట్లా నాలుగువేళ్ళు నోట్లోకి పోతే చాలు'

'?' 

5, ఏప్రిల్ 2014, శనివారం

వినదగునెవ్వరు చెప్పిన.....


మన వైఖరిలో లేదా నడతలో ఏదైనా బలహీనత వుంటే అది మన వ్యక్తిత్వంలో కూడా ప్రస్పుటమవుతుంది.  
కొందరు మంచి జరిగినప్పుడు ఆనందంతో మందహాసం చేస్తారు. తామ్ము నవ్వినప్పుడే మంచి జరుగుతుందని మరికొందరు విశ్వసిస్తారు.
చక్కటి మానవ సంబంధాలను దెబ్బతీయడానికి కావలసిన ఏకైక వనరు ఒక్కటే. అదే అహంకారం.
రాత్రికి రాత్రే లక్ష్యాలను మార్చుకుంటూ పోవడం సమర్ధనీయం కాదు. కానీ ఆ లక్ష్యసాధనకోసం అనుసరించాల్సిన మార్గాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ పోవచ్చు.
అసంబద్ధం అయిన విషయాలు చెప్పి మిమ్మల్ని నమ్మించేవాళ్ళు మీచేత అకృత్యాలు చేయించినా ఆశ్చర్యపోనక్కరలేదు.  
విజయం సాధించినప్పుడు అది మీకు స్వాభావికం అనుకోవాలి. వోటమి ఎదురయినప్పుడు మార్పుకోసం దాన్ని ఆస్వాదించగలగాలి.
నిరాశావాది ఎదురుగాలి గురించి ఆందోళన చెందుతాడు. ఆశావాది ఆ వ్యతిరేక పవనాలను  తనకు సానుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు.
అద్భుతం అంటే అదేదో అరుదుగా జరిగే అద్భుతం  అనుకోకండి. చూడకలిగే  కళ్ళు వుంటే మన చుట్టూ కనబడే ప్రతిదీ ఒక పరమాద్భుతమే.   
ప్రతిదీ భగవంతుడి మీద భారం వేసి ప్రార్ధన చేయండి. కానీ పని చేసేటప్పుడు మాత్రం అన్నీ మీమీదే, మీ కృషి మీదే ఆధారపడివున్నాయన్న విశ్వాసంతో మొదలుపెట్టండి.  
మీ చుట్టు వున్న లోకాన్ని మార్చడానికి చాలా కాలం పడుతుంది. కానీ ముందు మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. దానికి కావాల్సింది సమయం కాదు, పట్టుదల, నిబద్ధత.   

మీకు మంచి నైపుణ్యం వుంది అనుకున్న రంగంలో మరింత మెరుగయిన కృషి చేయక పోతే మీ ఎదుగుదల అసాధ్యం  
జీవితం, సమయం మనకు మంచి ఆచార్యులు. సమయాన్ని యెలా వాడుకోవాలో జీవితం నేర్పితే, జీవితపు విలువ ఏమిటో సమయం బోధిస్తుంది.
పొద్దున్న నిద్ర లేవడం అన్నది ఒక మంచి ఆలోచనతో మొదలయితే చాలు, ఇక ఆ రోజంతా మీకు చాలా ఆనందంగా ఆహ్లాదంగా  గడిచిపోవడం ఖాయం.
పనిచేయడం, ప్రయత్నించడం రెండు వేర్వేరు విషయాలు. ప్రయత్నించడం  అంటే జరుగుతుందని  ఆశ పడడం. పని పూర్తి చేయడం అంటే ఫలితాన్ని సాధించడం.
ఏదో సాధించాలి అన్న తపనే మీరు  ఈరోజున్న స్థానానికి మిమ్మల్ని  చేర్చింది అన్న విషయం ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి.  
ఈ క్షణంలో ఏదయినా బాగా చేయగలిగితేనే అది మరు క్షణంలో మిమ్మల్ని మరో మంచి స్థానంలోకి చేరుస్తుంది.
ఆశావాది మరచిపోవడానికి నవ్వుతాడు. నిరాశావాది నవ్వడమే మరచిపోతాడు.
ఇంట్లో ఆహ్లాదకరమైన  వాతావరణం కావాలంటే కావాల్సినవి ఎయిర్ కండిషనర్లు కాదు. మంచి మనసులు,  మంచి  మనుషులు.
ఆకాశంలో అంత ఎత్తున ఎగిరే బెలూన్లు కూడా  మంచి పాఠం బోధిస్తాయి. జీవితంలో అలా  పైపైకి ఎదుగుతూ పోవాలంటే 'సరుకు' వుండాల్సింది బయట కాదు, లోపల  అని.

4, ఏప్రిల్ 2014, శుక్రవారం

రంగులు కడుక్కుంటున్నారా!


ఒక్కోసారి ఎంతో అనుభవం వున్న రాజకీయ నాయకులు కూడా పొంతనలేని, హేతువుకు నిలవని ప్రకటనలు చేస్తుంటారా అనిపిస్తుంది.
సీ.ఎన్.ఎన్. ఐ.బి.ఎన్., సర్వే ఫలితాలు అనుకూలంగా రాకపోయేసరికి వైసీపీ నాయకుడు డాక్టర్ మైసూరారెడ్డి గారు అవన్నీ తప్పులతడక అన్నట్టుగా వార్తలు వచ్చాయి. అంతకు ఇరవై రోజులక్రితం అదే సంస్థ వైసీపీకి పరిస్తితి అనుకూలంగా వుందని చెబుతూ సర్వే ఫలితాలు ఇచ్చినప్పుడు డబ్బులిచ్చి రాయించుకున్నారని ఓ టీడీపీ అగ్రనాయకుడు చేసిన ఆరోపణను గుర్తుకు తెచ్చి, ఇప్పుడు అనుకూలంగా రాయించుకోవడానికి తామెన్ని  డబ్బులిచ్చారో చెప్పమని రిటార్ట్ ఇచ్చి వున్నట్టయితే హుందాగా వుండేది, టిట్ ఫర్ టాట్ లెక్కన జనం లెక్కవేసేవాళ్ళు. అలా కాకుండా వాదనకు నిలవని వాదన వినిపించినట్టుగా అనిపించింది.
అలాగే టీడీపీ బలం పెరుగుతోందని ఆ సంస్థ తాజాగా జరిపిన సర్వే వివరాలు ప్రకటిస్తూ ఓ ప్రధాన పత్రిక, 'వైసీపీ గ్రాప్ పడిపోతోంది, టీడీపీ పుంజుకుంటోంది' అని మొదటి పుటలో ప్రచురించింది. అంటే అర్ధం, వైసీపీ గ్రాఫ్ ఒకప్పుడు పైన వున్నట్టే కదా! పైగా వాపు చూసి బలుపని భ్రమిస్తున్నారని కూడా అదే పత్రిక గతంలో ఎన్నో సార్లు రాసింది. ఇలాటి వ్యాఖ్యలు స్వవచన ఘాతుకమని ఆ పత్రిక వారికి అనిపించలేదా!
ఇక రాష్ట్రాన్ని రికార్డు కాలం పాలించిన చంద్రబాబు నాయడు గారు ఏకంగా 'సీ'అంటే 'జగన్' అని భాష్యం చెప్పారు. 'ఏ' ఫర్ యాపిల్' అని చదువుకున్న చిన్న  పిల్లలు కూడా 'సీ' అంటే 'జగన్'  యెలా అవుతుందని  ప్రశ్నిస్తున్నారు. అలా కాకుండా టైటానియం కుంభకోణంలో  జగన్ కు ప్రమేయం వుందని ఆరోపించి వుంటే కొంత సబబుగా వుండేది. పైగా 'సీ' అంటే 'చంద్రబాబు' అని ఎవరైనా ప్రత్యారోపణ చేయడానికి  ఆస్కారం వున్న వ్యాఖ్యానం అది.
'పైగా అమెరికా ఎఫ్.బీ.ఐ. అంటే మన దగ్గర సీ.బీ.ఐ. కాదు, అధికారంలో వున్నవాళ్ళు చెప్పినట్టు ఆడడానికి' అంటూ కొందరు తెలుగు దేశం నాయకులు మరో ఆడుగు ముందుకు వేసి మాట్లాడారు. జగన్ అక్రమ ఆస్తుల కేసులో రాజకీయాలు లేవనీ, సీబీఐ నిష్పక్షపాతంగా దర్యాప్తు చేస్తోందని లోగడ వీరే అన్న మాటలు వీరికే గుర్తు లేవని  అనిపిస్తోంది ఈ విమర్శలు విన్నాక.  
ఎన్నికల వేడిలో మరీ జాగ్రత్తగా మాట్లాడడానికి వీలుండక పోవచ్చు కానీ వీలున్నంత వరకు చేసే వ్యాఖ్యలు, విమర్శలు, ఆరోపణలు కొంత హేతుబద్ధంగా వుండేట్టు చూసుకోవడం అవసరం.

3, ఏప్రిల్ 2014, గురువారం

కడుపు కోత


పత్రికలు, మీడియాకు సంబంధించి ఎవరైనా వ్యాఖ్యానాలు చేసినప్పుడు ఇష్టం లేకపోయినా, ఒక్కోసారి ఆ రంగానికి ఒకప్పుడు చెందిన మనిషిగా కల్పించుకోవాల్సి వస్తోంది.
చాలామంది పలానా పత్రిక చదవం, పలానా మీడియా చూడం అంటుంటారు. ఎందుకంటే అవి పాక్షికంగా ఏదో ఒక పార్టీకి వెన్ను కాస్తున్నాయి అనేది ప్రధాన ఆరోపణ. చదవం, చూడం అని అంటూనే వాటిల్లో వచ్చిన వార్తలని గురించి ప్రస్తావిస్తుంటారు.
నా వరకు నేను నలభై ఏళ్లనుంచి రోజూ మూడు నాలుగు పత్రికలు ఇంటికి తెప్పించుకుని చదువుతుంటాను. అవి ఏం రాస్తున్నాయి అనే దానికంటే వార్త ఇచ్చే విధానంలోని వైవిధ్యాన్ని గమనిస్తుంటాను. పత్రిక నడుమ వృత్తి పరమైన పోటీ వుండడం తప్పేమీ కాదు. పై చేయి అనిపించుకోవడానికి ప్రయత్నించడం తప్పుపట్టేదేమీ కాదు. కానీ క్రమంగా ఈ పోటీ పాత్రికేయుల చేతుల్లోనుంచి ఆ పత్రికల యజమానుల చేతుల్లోకి పోతోంది. దానితో ఏ పత్రికకు ఆ పత్రికకు ఓ రంగూ రుచీ వాసనా ఏర్పడుతున్నాయి. కొంచెం అటూ ఇటూగా ఈ దోషం అంటుకోని తెలుగు పత్రికంటూ కలికానికి కూడా కనిపించడం లేదు. మునుపటి మాదిరిగా మడి కట్టుకుని పత్రిక నడపడం సులభం కాని పరిస్తితి. ఎంతో కొంత రాజీ పడే ధోరణి కాస్తా అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోయి అన్ని రంగాల్లో వుండే అవలక్షణాలు అన్నీ కట్ట గట్టుకుని  ఈ రంగంలో ప్రవేశించాయి. నిన్న మహా టీవీ ఎడిటర్స్ టైం లో ఐ వెంకట రావు గారు ఇదే చెప్పారు. ఈ రంగానికి వున్న అపరిమితమైన 'రీచింగ్' వల్ల, యేది చెప్పాలన్నా, ప్రజలకు క్షణాల మీద  యేది చేరాలన్నా మీడియాను మించిన మార్గం లేకపోవడంతో రాజకీయుల కళ్ళు ఈ రంగం మీద పడ్డాయి.. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా కొందరు తమ పెట్టుబళ్లను  ఈ రంగంలోకి మళ్ళిస్తున్నారు. నేరుగా 'రిటర్న్స్' వెంటనే రాకపోయినా మరో మార్గంలో అందుతున్న ప్రయోజనాలు వారిని ఇందుకు ఆకర్షిస్తున్నాయి. డబ్బు పోయినా అంతకు మించిన గౌరవం, తద్వారా సామాజికంగా, రాజకీయంగా వొనగూడుతున్న లాభాలు వారిని ఇందుకు పురిగొల్పుతున్నాయి. అందుకే తెలుగునాట దేశంలో ఎక్కడా లేనన్ని టీవీ ఛానళ్ళు పురుడు పోసుకుంటున్నాయి.  పెట్టుబళ్ల వరకు అయితే పరవాలేదు. రాజకీయాల్లో వుండే కల్మషం, కుళ్ళూ, ఒకళ్ళను మరొకళ్ళు నరుక్కునే సంస్కృతి - కాఫీ డికాషన్ మాదిరిగా ఇందులోకి దిగుమతి అవుతున్నాయి. ఆ పత్రిక ఏం చెప్పింది అని గతంలో మరో పత్రిక గమనించేది. కానీ ఇప్పుడో. ఒక పత్రిక ఏదైనా రాస్తే దాన్ని ఖండఖండాలుగా ఖండించడం ఎల్లా అన్నదొక్కటే యావ.    
ఫలితం ఈ పత్రిక అలాగే రాస్తుంది, ఈ టీవీ  అలాగే చూపిస్తుంది అని జనం తేలిగ్గా మాట్లాడుకునే పరిస్తితి. ఇది జర్నలిజానికి మంచిదా అంటే అంత ఆలోచించే తీరిక ఎవ్వరికీ లేకుండా పోతోంది.
ఇందులో ఒకర్ని నిందించే పరిస్తితి ఎప్పుడో దాటిపోయింది. అందరూ అందరే. ఎవరికీ మినహాయింపు ఇవ్వలేని స్తితి.
పత్రికలు, టీవీల్లో పనిచేసే సిబ్బంది, వాటి యజమానులు, వారికి ప్రత్యక్షంగా పరోక్షంగా తోడ్పడే పార్టీలు సొంత ఎజెండాలతో ముందుకు పోవడాన్ని కొంత అర్ధం చేసుకోవచ్చు. అసలు విషాదం ఏమిటంటే ఆయా పార్టీల అభిమానులైన పాఠకులు సైతం వేర్వేరు పారావారాలుగా విడిపోయి తగువులు పడడం. సోషల్ మీడియాలో కూడా ఆ రంగుల్ని చల్లడం.
ఎవరు ఏమైనా అనుకోండి కానీ, ఈ రంగంలో దశాబ్దాల తరబడి పనిచేసిన వాడిగా ఇది నా నిశ్చితాభిప్రాయం.
ఇష్టం వున్న వాటిని చదవండి. ఇష్టం వున్నవాటిని చూడండి. అలా యెందుకు రాశారు, ఇలా యెందుకు చూపారు అని ప్రశ్నిస్తే అవే ప్రశ్నలు మీకు ఎదురవుతాయి.
ఎందుకంటే గొంగట్లో అన్నం తింటున్నాం కనుక.

అంతయు మన మేలునకే....

రవి తాళ్ళూరి వారు ఇంగ్లీషులో ఓ జోకు పోస్ట్ చేశారు. చిన్నదే. తెనిగిస్తే...


"అదేమిట్రా బుడుగూ. మీ అమ్మ పొద్దట్నించి నోరు తెరవడం లేదు. ఏంటి కధ?"
"అమ్మ బజారుకు వెడుతుంటే లిప్ స్టిక్ తెమ్మంది. పొరబాటున ఫెవి స్టిక్ తెచ్చిచ్చా!"

2, ఏప్రిల్ 2014, బుధవారం

ఇలా చేసి మాడండి!


"ఇలా చేసి చూడండి అని కిందటి వారం ప్రసారం చేసిన కార్యక్రమంపై శ్రోతల స్పందన ఇప్పుడు తెలుసుకుందాం.
"ముందుగా మంగళవారప్పేట నుంచి మంగళగౌరీదేవి గారు రాసిన ఉత్తరం చూద్దాం.
"మీరు చెప్పినట్టే స్టవ్ మీద బాణలి పెట్టాను. నూనె పోసాను. పోపు గింజలు మీరు చెప్పినట్టే కొలిచి మరీ పోసాను. ఆ తరువాత మీరు చెప్పిన దానిని అక్షరం పొల్లుపోకుండా చెప్పింది చెప్పినట్టే చేసాను. రవ్వ ఉప్మా కాదు కదా రవ్వ జావ  కూడా తయారుకాలేదు,  అని మంగళగౌరీదేవి గారు రాశారు.



"చాలా సంతోషం మంగళగౌరీదేవిగారు,  మీరు మా కార్యక్రమాన్ని శ్రద్ధగా వినడం  మాత్రమే కాకుండా ఆచరించి చూస్తున్నందుకు. కాకపొతే ఓ సందేహం. అదేమిటంటే,  మీరు స్టౌ వెలిగించడం మరచిపోయారని. యెంత రేడియో విని వంటచేసేవారికయినా ఈ కనీస  ప్రాధమిక సూత్రం తెలిసే వుంటుందన్న ఉద్దేశ్యంతో స్టౌ వెలిగించడం గురించి ప్రత్యేకంగా చెప్పలేదు. నిజంగా అది మా పొరపాటే!"

(కార్టూనిష్ట్ లేపాక్షి గారికి కృతజ్ఞతలతో)