9, జనవరి 2014, గురువారం

చీమ చెప్పే భగవద్గీత



ఒకానొక మానవాధముడికి జీవితం భారమై, సమస్యలు సమాహారమై, మనశ్శాంతి దూరమై దేవుడిని గూర్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. చివరాఖరుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనవాడు కళ్ళు తెరిచి తనను ఎదుర్కుంటున్న కష్టనష్టాల జాబితా ఏకరువుపెట్టి విజయసాధనకు మార్గం చూపెట్టమని మోకరిల్లాడు. దేవుడు విలాసంగా ఓ చిరునవ్వు విసిరి దీనికోసం నన్ను పనికట్టుకుని పిలవాలా! అటు చూడు! అదిగో. అటుగావెడుతున్న ఆ అల్పజీవిని చూడు. దాన్ని చూసి నేర్చుకో అనేసి చక్కాపోయాడు. ఇతగాడటు చూస్తే నెమ్మదిగా కదిలి వెడుతున్న ఒక చిన్న చీమ కనిపించింది.

అంత పెద్ద దేవుడు ఇంత చిన్న చీమ నుంచి జీవితం గురించిన పాఠాలు నేర్చుకోమని అంటున్నాడు ఇతడేమి దేవుడు అని అనుకోకండి.

దారీ తెన్నూ తెలియని స్తితిలో వున్న మనుషులకు ఒక మంచి మార్గాన్ని చూపించి వారిని కార్యోన్ముఖుల్ని చేయడంలో మోటివేషన్ గురుఅని విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'జిన్  రాన్' కూడా  చీమల నుంచే తన విజయ సూత్రాలకుస్పూర్తిని పొంది ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. దాని పేరు యాం ట్స్' ఫిలాసఫిఅంటే చీమలు బోధించే తత్వశాస్త్రంఅని దగ్గరి అర్ధం.

చీమల జీవన సరళిని బాగా అధ్యయనం చేసిన జిన్ రాన్ మహాశయులవారు  జీవితంలో విజయాలు సాధించడానికి  కొన్ని  సూత్రాలను వాటినుంచి నేర్చుకోవాల్సి వుంటుందని సెలవిచ్చారు.



ఈ సారి సమయం దొరికినప్పుడు మీ చేతివేలును చీమ వెళ్ళే దారిలో అడ్డంగా వుంచి గమనించండి. ఆ చీమ మీ వేలును దాటివెళ్ళడానికయినా ప్రయత్నిస్తుంది లేదా మీ వేలి చుట్టూ తిరిగి వెళ్ళడానికయినా చూస్తుంది. అంతేకాని అక్కడే ఆగిపోయి బిత్తర చూపులు చూడదు. ఎందుకంటె మడమ తిప్పడం వెన్ను చూపడం దాని ఇంటా వంటా లేదు. ఓటమిని అంగీకరించడం దాని రక్తంలో లేదు.(చీమ వొంట్లో రక్తం వుంటుందా? వుంటే అది ఏ గ్రూపు అని చర్చిస్తూ కాలక్షేపం చేయడం మనుషులకే చెల్లు) అంటే ఏమిటన్న మాట. జీవితం అన్నాక మనం చేసే పనులకు అవరోధాలు ఎదురవడం సహజం. అడ్డంకులను అడ్డం పెట్టుకుని కాడి కింద పారేసి సారో సాంగులు సోలో సాంగులుమొదలు పెట్టకూడదు. ఎన్ని సవాళ్లు ఎదురయితే మనం మనస్సును అంత దృఢపరచుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు వచ్చి వొళ్ళో వాలతాయి. లేదంటే చక్కా ఎగిరిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విన్ స్టన్ చర్చిల్ ఏమన్నాడు. సాధించేదాకా సాధన మానకండి. ప్రయత్నం వొదిలిపెట్టకండిఅని తన సైన్యాలను ఉత్తేజపరిచాడు. బహుశా చీమలనుంచే ఆయన ఈ స్పూర్తిని గ్రహించి వుంటాడు.
(09-01-2014)
NOTE: Courtesy Image Owner

8, జనవరి 2014, బుధవారం

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది?



చదివి చెప్పండి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమన్నా వుందా!
( 24-09-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

‘విధులకు గైర్హాజరు అవుతే తెలంగాణా వస్తుందా?’ అని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కోర్టు సిబ్బందిని ప్రశ్నించినట్టు పేపర్లలో వచ్చింది.

సకల జనుల సమ్మె జరుగుతున్నా రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మరో పక్క కితాబు ఇచ్చారు. ఇంకో అడుగు ముందుకు వేసి, వొత్తిళ్ళ ద్వారా కేసీఆర్ తాననుకున్నది సాధించాలనుకుంటే అదెలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు. పరిస్థితులు ప్రశాంతంగా వుండి తమకు అనుకూలంగా వున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటామని అన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. 

రాష్ట్రంలో తెలంగాణా సాధనకోసం దాదాపు వారం రోజులనుంచి దశలవారీగా సకల జనుల సమ్మె సాగుతున్న నేపధ్యంలో వెలువడిన ఈ రకమయిన వ్యాఖ్యానాలకు ఎవరికి వారు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు పార్టీ ప్రతినిధిగా కాకుండా వ్యక్తిగత హోదాలో చేశామని మరో రోజు సమర్ధించుకోవచ్చు. ఆ సంస్కృతి ఈ నాటి రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ, సకలజనుల సమ్మె ఓ పక్క ఉధృతంగా సాగుతున్న సమయంలో, భావోద్వేగాలు బాగా పెచ్చరిల్లి వున్న తరుణంలో - ఈ రకమయిన వ్యాఖ్యలు వెలువడ్డాయంటే కొద్దో గొప్పో అధిష్టానం మద్దతు లేకుండా ఆమె తన మనసులోని భావాలు బయట పెట్టి వుంటారని అనుకోవడానికి లేదు.

సకల జనుల సమ్మె అనుకోకుండా మొదలయింది కాదు. దీనిని గురించి కడు వివరంగా ఉద్యమకారులు చాలా ముందస్తు సమాచారం ఇచ్చే దాన్ని మొదలు పెట్టారు. అయితే, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తమ రివాజు ప్రకారం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టులేదు. కానీ రాష్ట్రంలోని తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడుపడని వ్యవహారంగా తయారయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇతమిద్ధంగా తన విధానాన్ని స్పష్టం చేయకపోయినా, అంత సానుకూలంగా వెంటనే స్పందించే అవకాశాలు మృగ్యమని అప్పడప్పుడు ఢిల్లీ నుంచి వెలువడే ఈ మాదిరి ప్రకటనలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు మధ్య మధ్య వారి నాయకులు చేసే ప్రకటనలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. సకల జనుల సమ్మె విజయవంతంగా, ఉధృతంగా సాగుతోందని బాజా భజాయించి చెప్పగల పరిస్థితులు వున్న నేపధ్యంలో మరోసారి కేసీఆర్ నిరాహారదీక్షకు పూనుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ నెలాఖరులో హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చి ఇక్కడి పరిస్తితులను అంచనావేసి పార్టీ అధినాయకురాలికి ఇచ్చే నివేదికే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఆజాద్ కు కొట్టిన పిండి. ఆయన హైదరాబాద్ పర్యటనలో కొత్తగా తెలుసుకుని నాయకురాలికి నివేదించే అంశాలు కొత్తగా ఏముంటాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. సీమాంధ్ర నాయకులతో ఆయన ఇప్పటికే అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. తెలంగాణాకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.

‘ఇలా’ చేయడంవల్ల తెలంగాణా వస్తుందా? అని ఎద్దేవాగా అడగడంలో బహుశా అంతరార్ధం ఇదేనేమో.

వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. ‘ఊ’ కొడుతూ కధ వింటున్న పిల్లలు ‘ఊ’ అంటారు. ‘ఊ’ అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న. అది అర్ధం కాని పిల్లలు ‘ఆ!’ అంటారు. ‘ఆ!’ అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (20-09-2011)

జీవితం నేర్పే పాఠాలు


ఆసక్తి వుండాలే కాని జీవితం నుంచి ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకోవచ్చు. వయస్సు దీనికి ఎంతమాత్రం అడ్డంకి కాదు.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో పనిచేసేరోజుల్లో ప్రైవేటు టీవీ చానళ్ళ చర్చాకార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ చేసిన అనంతరం మాత్రం గత కొద్దేళ్లుగా అనేక చానళ్ళు నిర్వహించే చర్చల్లో పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్నిరోజులు తెల్లవారుఝామునే లేచి తయారు కావాల్సివస్తోంది. నేనయితే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నాకాని, నన్ను స్టూడియోలకు తీసుకు వెళ్లడానికి వచ్చే ఛానల్ కారు డ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి అలా పొద్దున్నే వచ్చే డ్రైవర్లకు కొంత టిప్పుఇవ్వడం అలవాటు చేసుకున్నాను. ఈ డ్రైవర్లలో రకరకాల వయస్సులవాళ్ళు వుంటారు.  పొరుగుజిల్లాలనుంచి హైదరాబాదు వచ్చి స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని బతుకు బండి లాగించే వాళ్ళే వీళ్ళల్లో ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీ గా నేను ఏనాడు అనుకోలేదు. వాళ్లు కూడా అపార్ధం చేసుకోలేదు. కొందరు యెందుకు సార్ మా డ్యూటీ మేం చేస్తున్నాంఅంటూనే మృదువుగా అనేవారు.
నిన్ననో మొన్ననో అనుకుంటా టీవీ స్టూడియో నుంచి తిరిగొస్తూ ఓ కూడలివద్ద సిగ్నల్ పడ్డప్పుడు నేను పర్సు తీసి డ్రైవర్ కు ఓ పది  నోటు తీసి ఇచ్చాను. అతగాడు  ఆ నోటు తీసుకుని జేబులో పెట్టుకోకుండా అదే చేత్తో స్టీరింగు పట్టుకుని  నడుపుతూ ఒక చోట కారు వేగం తగ్గించి రోడ్డుపక్కన ఒక ముసలి బిచ్చగత్తె చేతిలో ఆ నోటు పెట్టాడు. అతని ప్రవర్తన చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా అతడు మాఫ్ కీజియే సాబ్అంటూ తన మనసులో మాట చెప్పాడు.
ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచయినా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు వుంటే నీకంటే అవసరం ఎక్కువ వున్నవాళ్ళకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడం అనేదే కొద్దిగా కష్టం.  అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకోకండిఅన్నాడు.

అనుకోవడానికి ఏముంది.  ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను.             

"ఇ" లో "ఇంత" విషయం వుందా!


(ఇది మెయిల్ చేసిన పెద్ద మనిషికి ధన్యవాదాలు)


6, జనవరి 2014, సోమవారం

మౌనమె నాభాష

   
“I get intoxication while talking” అన్నాట్ట వెనుకటికి నాలాటి వాడు. మద్యం సేవించినప్పటికంటే కంటే కూడా మాట్లాడుతుంటే నాకు బాగా ‘కిక్కు’ వస్తుందన్నది మా ఆవిడ వువాచ. ‘అది’ కూడా తోడయితే పట్టేవాళ్ళు వుండరన్నది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం.   అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా  నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా పెగులుతుందని ‘వసకారుడు’ ఏనాడో చెప్పాడు.


చదువుకునే రోజులనుంచి నాకీ మాటల పిచ్చి వుందనీ అందుకే చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు ‘మాటల ఆటలు’ అంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు వున్న అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ వాళ్ల నోట్సులు రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా ‘మంచిది వెళ్ళి రండి’ అనేసేవాళ్ళు. అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే  గొప్ప  అభిప్రాయానికి వెంటనే  రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్ లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. నిలుచుని కాసేపు కూర్చున్న వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి  ‘అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు వచ్చి ఇలా కూర్చోండి’ అని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి  పోవడమే గగనం కాని వెళ్ళానంటే చాలు న్యూస్ యూనిట్ చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.  
అలాటి ఘన చరిత్ర కలిగిన  నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు  తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానిస్తోంది. ‘వున్నట్టుండి ఈ వయస్సులో అంటే అరవై  ఎనిమిది దాటిన  తరువాత మా  ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ  రాలేదు కదా’ అని బోలెడు బోలెడు సంతోషం కూడా  పడిపోతోందష. తెలుగు  సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని నా అనుమానం.
నిజమే. టీవీ చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు  దూషణలతో కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలతో నాకు మాట పడిపోతోందన్న మాట మాత్రం నిజమే. 
అంతయు మన మేలునకే.  (06-01-2014)
NOTE: Courtesy Image Owner

5, జనవరి 2014, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన – అది ఇంగ్లీషోడయినా సరే!


TIME HEALS ALL PAINS – BUT GIVE SOME TIME TO TIME

DREAM MORE WHILE YOU AWAKE

WHAT OTHERS THINK OF YOU, IS NONE OF YOUR BUSINESS

NO ONE IS IN CHARGE OF YOUR HAPPINESS EXCEPT YOU


LIFE IS TOO SHORT TO WASTE TIME HATING ANY ONE 

కరివేపాకు కధ



అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. నా బాబే! నా తండ్రే!అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మాఅనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.



ఈ నీతికధ అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.

వార్తకు, వ్యాఖ్యకు నడుమ వున్న సన్నటి విభజనరేఖను చెరిపేసి, తాము అచ్చేసిందే సరయిన వార్త అంటూ కొన్ని పత్రికలు నిస్సిగ్గుగా సాగిస్తున్న పరోక్ష యుద్ధాలు పతాక స్తాయికి చేరుకుంటున్నప్పుడు


ఇంటి నాలుగ్గోడల నడుమ గుంభనగా వుండాల్సిన భార్యాభర్తల గొడవలు గడప దాటి ఛానళ్ళ రూపంలో ఇంటింటికీ ప్రవేశించి ప్రశాంతతను భగ్నం చేస్తున్నప్పుడు -

ఏడాదిక్రితం దాకా భజన చేసిన నోటితోనే విమర్శల జడివాన కురిపిస్తున్న రాజకీయ చద్మవేష ధారులను చూస్తున్నప్పుడు -

అమ్మను ఒసే’ - నాన్నను ఒరేఅనే దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తూ తెలుగునాట వీరవిహారం చేస్తున్న సినిమాలను విధిలేక భరిస్తున్నప్పుడు

ఇవన్నీ కంటూ, వింటూ

వొళ్ళుమండుతున్నా నిలదీయలేని నిస్సహాయులను గమనిస్తుంటే

నీతికధమనసు మూలల్లో కదలాడుతుంది. కరివేపాకునాడే చెప్పవయితివేమమ్మా!అనే అన్న దొంగ మాటే వినబడుతుంది.

సమాజంలో నేడున్న సమస్త సమస్యలకు, నాయకుల మానసిక వైకల్యాలకు, మీడియా చిత్త చాంచల్యాలకు, ఆదిలోనే కళ్ళెం వేయగలిగిన శక్తివుండీ ఆ పని చేయలేకపోయిన జనాలకు
అదేమిటి అని ప్రశ్నించలేకపోయిన ప్రజలకు

ఇప్పుడు అడిగే హక్కు ఎక్కడిదంటే - చేయగలిగిందేమిటి?
(Courtesy Image Owner)