17, డిసెంబర్ 2013, మంగళవారం

దేవతలు - వ్యక్తిత్వ వికాసం


భక్తి టీవీ ఛానల్ లో పరిపూర్ణానంద స్వామి మాట్లాడుతూ చక్కని ముక్కలు చెప్పారు.


(పరిపూర్ణానందస్వామి)

"శ్రీ దేవి అంటే లక్ష్మీదేవి. సకల సంపదలు అనుగ్రహించే దేవత. భూదేవి అంటే భూమాత. చరాస్తికి ప్రతిరూపం శ్రీదేవి. స్తిరాస్తికి సంకేతం భూదేవి. శ్రీ వేంకటేశ్వర స్వామి ఈ ఇద్దరు దేవేరులను తన వక్షస్థలంపై కుడి ఎడమల  ప్రతిష్టించుకున్నాడు. తనను దర్సించ వచ్చే భక్తులకు   భౌతిక సుఖాలకు నెలవయిన ఈ ఇద్దరినీ కాకుండా   వామ హస్తంతో తన  పాదాలను చూపిస్తుంటాడు. చరాస్తులు, స్తిరాస్తులు ప్రధానం కాదు మనిషి అనేవాడు తన సొంత ప్రతిభతో  సొంత కాళ్ళపై నిలబడాలని  వ్యక్తిత్వ వికాస బోధకులు ప్రబోధించే సూత్రాన్ని స్వామి ఆ విధంగా భక్తులకు బోధిస్తున్నాడన్న మాట.
"ఇక పరమేశ్వరుడిని తీసుకుంటే ఆయన వొంటిపై అన్నీ పాములే. ఒక సర్పాన్ని చూస్తేనే వొళ్ళు జలదరిస్తూ వుంటుంది. అలాటిది అన్ని నాగుపాములను ధరించి కూడా శాంత మనస్కుడిగా వుండగలగడానికి కారణం ఆయన సిగలో నెలవయిన గంగమ్మ తల్లి. అన్నిరకాల ఉద్రికతలను ఉపశమింపచేయడానికి మెదడును ఎల్లప్పుడు చల్లగా, ప్రశాంతంగా  వుంచుకోవాలని చెప్పడమే శివతత్వం.
"పోతే కృష్ణుడు. గోవులను కాచే గోపాలకుడు. గోవర్ధన గిరిధారి. హిందీలో గోవర్  అంటే గోమయము. (ఆవు పేడ) ధన్ అంటే ధనము. ఒక్క ఆవుపేడతో కొన్ని ఎకరాల భూమిని సారవంతం చేయడానికి వీలుపడుతుంది. సారవంతమయిన పొలంలో పంటలు బాగా పండుతాయి. దిగుబడి ఇబ్బడిముబ్బడిగా వుంటుంది. ఆహారానికి కొరత వుండదు. అలా  సస్యశ్యామలమయిన పల్లెటూళ్ళే దేశానికి ఆయువుపట్లు."
ఇలా హిందూ దేవతలనుంచి వ్యక్తిత్వ వికాసానికి పనికొచ్చే మంచి విషయాలను నేర్చుకోవచ్చని పరిపూర్ణానందస్వామివారు వాకృచ్చారు.

ఎవరు చెప్పినా మంచి మాటలు నాలుగు చెవిన వేసుకోవడం మంచిదే కదా!

16, డిసెంబర్ 2013, సోమవారం

పసిడి పలుకులు



ఒకడు ఏకంగా జీవితాన్నే అడిగాడు యెందుకు ఇన్ని ఇబ్బందులు పెడతావని.
జీవితం నవ్వి బదులు చెప్పింది.
‘అదేమరి. ఇన్ని ఇబ్బందులు పెడుతుంటూవుంటేనే  మీ మనుషులు  ఇంతగా ఎగిరెగిరి పడుతున్నారు. అవి కూడా లేకపోతే మిమ్మల్ని పట్టేవారెవరుంటారు?’  

‘ఇతరులు మిమ్మల్ని ఇబ్బందులు పెడుతుంటే వాళ్లని క్షమించి వొదిలేయండి. వాళ్లు క్షమార్హులని కాదు చెప్పేది. మీకు కూడా మనశ్శాంతి అవసరం కదా!’

‘ఒక నమ్మలేని నిజం చెప్పమంటారా!
‘మన శరీరంలో మూడొంతులు పైగా నీరే వుంటుందని అంటారు. కాని డెబ్బ తగిలితే నీరు రాదు రక్తం స్రవిస్తుంది. గుండె నిండా నెత్తురు వుంటుంది. కానీ హృదయానికి  బాధ కలిగితే నెత్తురు రాదు. కంటి వెంట నీరు కారుతుంది’   

‘పూలుపరచిన పక్క మీద పడుకుంటే అది మొదటి రాత్రి

అవే పూలు మనమీద పరచుకుంటే అది జీవితానికి చివరి రాత్రి’

అద్వైతం


తెలుగులో నాకున్న కొద్దిపాటి  పాండిత్యం నలుగురిలో నాకొక పెద్ద  గుర్తింపు తెచ్చిపెట్టింది. నిజానికి నా తెలుగు అంతంత మాత్రమే. కానీ ఏమీ లేనిచోట ఆముదపు మొక్క మాదిరిగా అమెరికాలో నేనొక తెలుగు పండితుడన్న పేరు తెచ్చుకోవడానికి అది అడ్డం కాలేదు. చిన్నప్పుడు అప్పయ్య మాస్టారు బట్టీ వేయించిన తెలుగు పద్యాలనే కాస్త అటూ ఇటూ తిప్పి సందర్భం అసందర్భం అని చూసుకోకుండా అందరి నడుమ   ప్రయోగించే నా తెంపరితనాన్ని  నలుగురు నాలుగు రకాలుగా మెచ్చుకుంటూ వుండడంతో తెలుగు పండితుడన్న బిరుదు, దేశం కాని దేశంలో నాకు  స్తిరపడిపోయింది. దానితో ఆటా, తానా సభల్లో నేను ఆడింది ఆట పాడింది పద్యం అయిపోయింది.
అసలే ఎన్.ఆర్.ఐ. అనే మూడక్షరాలే  నా వొంట్లో పొగరును బాగా పెంచాయి. వీటికి తోడు ఈ మధ్య గ్రీన్ కార్డుఅనేది మరొకటి జత కలిసింది. ఇంకేముంది అసలే కోతి, కల్లు తాగింది కధలో మాదిరిరిగా పొగరుకు విగర్తోడయింది. ఇండియా వచ్చినప్పుడల్లా తెలుగు పుస్తకాలు భారీగా కొనుక్కుని వెళ్లి  అమెరికాలో తెలుగువారికి  పంచి పెడుతూ నా పేరును సార్ధకం చేసుకునే కొత్త భారాన్ని నెత్తికెత్తుకునేలాచేసింది.
ఈ సొంత గోల ఆపి అసలు విషయానికి వస్తాను.
ఈ మధ్య ఇండియా వచ్చి తిరిగివెళ్ళబోయేముందు తెలుగు పుస్తకాలు కొందామని వెళ్లాను. నేను అంతకు ముందు ఆ షాపుకు వెళ్ళలేదు. చాలా పెద్ద దుకాణం. కొనేవారికి సాయపడేందుకు సహాయకులను కూడా పెట్టారు. నాకు సాయంగా వచ్చిన అమ్మాయికి ఇరవై లోపే వయసు.  అందవికారంగా వుంది. వేసుకున్న దుస్తులు కూడా ఆమెకు నప్పలేదు. అసలే చింపిరి జుట్టు,  సరిగా దువ్వుకోకుండా ముడేసుకుంది.
మీరు ఏరకమైన పుస్తకాలు ఇష్టపడతారని మామూలుగా  అడిగింది. ఆమె ముందు నా పాండిత్యం వొలకబోయాలన్న దుర్బుద్ధి కలగడంతో  అద్వైతం గురించిన గ్రంధాలేమయినా వున్నాయా వుంటే చూపించుఅన్నాను, నిజానికి ద్వైతాద్వైతాలగురించి నాకు ఎలాటి  అవగాహన లేకపోయినా. అడిగినదే తడవుగా ఆ అమ్మాయి కొన్ని గ్రంధాలు తీసి చూపించింది.
నా తెలివిని మరింత ప్రదర్శించడానికి అద్వైతం అంటే నీకు ఏమాత్రం తెలుసు. పురాణ వాజ్మయంలో నీకున్న అవగాహన ఏపాటిది?’ అని అడిగాను.
ఆ ఆమ్మాయి చెప్పిన జవాబుతో నా కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. నా అజ్ఞానం ఏస్థాయిలో వున్నదో  అర్ధం అయింది.
తిరుమల తిరుపతి దేవస్థానం వారు  అద్వైతాక్షర మాలిక అనే అనువాద గ్రంధాన్ని 2003 లో  ప్రచురించారు. భాగవతుల కుటుంబరావు గారు అనువాదం చేశారు. గ్రంధ సంపాదకులు పుల్లెల రామచంద్రుడు గారు. చూస్తుంటే  అద్వైతం పట్ల మీకు ఆసక్తి వున్నట్టుంది. వ్యవధానం వున్నట్టయితే  కొన్ని విషయాలు చెబుతాను.
చాలా సంవత్సరాలకిందట కొందరు పండితులు సంస్కృతంలో 51  వ్యాసాలు   రాశారు.  1945 లో   కుంభకోణంలో జరిగిన అద్వైత సభ సందర్భంగా కంచి కామకోటి పీఠాధిపతి శ్రీ చంద్రశేఖర స్వామి వారి ఆశీస్సులతో ఈ గ్రంధాన్ని ప్రచురించారు.  
పోతే, పురాణ వాజ్మయం గురించి అడిగారు కదా. వేదవ్యాసులవారు తొలుత బ్రహ్మ నుంచి వేదాలను గ్రహించారు. వాటిని నాలుగు భాగాలుగా విభజించి తన శిష్యులయిన పైల, వైశంపాయన, జైమిని, సుమంతులకు ఉపదేశించారు. వారు వారి శిష్యులకు, వారు తమ అనుయాయులకు పరంపరగా అందించారు.
ఇక వేదాల విషయంలో కూడా మన తెలుగు పండితులు విశేష కృషి చేశారు. సంస్కృతంలో వ్యాస విరచిత వేద వాజ్మయాన్ని దాశరధి రంగాచార్య గారు 70 ఏళ్ళ వయస్సులో అయిదు వేల  పేజీల్లో  తెలుగులోకి అనువదించారు.  ఇందులో ఒక భాగమయిన శుక్ల యజుర్వేదాన్ని ఎమెస్కో ఆర్షభారతి వారు రెండువేల సంవత్సరంలో ఆవిష్కరించారు.  
వేద వాజ్మయాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు సాయణాచార్యుడి ప్రసక్తి అనివార్యం. ఎందుకంటే ఆయన అచ్చ తెలుగువాడు. భారద్వాజగోత్రుడు. అనేక ప్రకాండులను సమకూర్చుకుని అనేకమయిన వేద వ్యాఖ్యానాలు రచించాడు.
సాయణాచార్యులవారు మరికొన్నింటికి కూడా వ్యాఖ్యలు రాశారు.
తైత్తిరేయ బ్రాహ్మణము,  ఆర్షేయ బ్రాహ్మణము, దేవాధ్యాయ బ్రాహ్మణము, ఉపనిషద్ బ్రాహ్మణము, సంహితోపనిషద్ బ్రాహ్మణము  వీటిల్లో ముఖ్యమయినవి.
ఈ గ్రంధాల్లో కొన్ని దొరుకుతున్నాయి. కొన్ని లభ్యం కావడం లేదు. ఆదరించేవారు తక్కువ కావడం ప్రధాన కారణం. అమెరికాలో వుంటూ కూడా ఇలాటి ప్రాచీన భారతీయ  సాహిత్యం  పట్ల మీవంటి వారు చూపుతున్న ఆసక్తే, చనిపోతున్న ఈ సాహిత్యాన్ని  బతికించాలి.
అప్పటికే సిగ్గుతో సగం చచ్చిపోయి వున్నానేమో ఆ అమ్మాయి మాటలకు ఏం జవాబు చెప్పగలనో మీరే చెప్పండి.


గమనిక: పుస్తక ప్రేమికులు శ్రీ దేవినేని మధుసూదనరావు గారు ఇంగ్లీష్ లో వాషింగ్టన్ పోస్ట్ విలేఖరి రాసిన ఓ అద్భుత వ్యాసాన్ని నాకు మెయిల్లో పంపారు. తమిళనాడు నేపధ్యంలో సాగిన రూపొందిన రచన అది. తెలుగు వాతావరణానికి అనుగుణంగా కొన్ని మార్పులను చేసి ఆ వ్యాస భావం చెడకుండా రాయడానికి చేసిన ప్రయత్నం ఇది. భండారు శ్రీనివాసరావు 

15, డిసెంబర్ 2013, ఆదివారం

ఇలా కూడా జరుగుతుందా?



(శ్రీమతి పింగిలి ప్రేమ కుమారి)

పది  రోజులక్రితం హైదరాబాదులో ఇల్లిల్లూ తిరిగి చుట్టపక్కాలను పలకరించింది. మూడు వారాలక్రితం పుణే నుంచి  హైదరాబాదులో విమానంలో దిగి నేరుగా ఆసుపత్రికి వచ్చి మా ఆవిడను చూసివెళ్ళింది. ఆమె ఈరోజు లేదు.

చివరి శ్వాస వరకు అందరితో పాటే ప్రేమక్కయ్య వున్న  ఆసుపత్రిలో వున్నాను.  అందరితోపాటే ఈ రోజు ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నాను. కానీ ఇంట్లో చెప్పలేని పరిస్తితి. చెప్పుకోలేని పరిస్తితి. ‘ప్రేమ వొదినె గారు ఎలావున్నారు’ అని నిన్నగాక మొన్న ఆసుపత్రి నుంచి డిస్చార్జ్ అయిన మా ఆవిడ అడుగుతుంటే ‘బాగానే వుంది’ అని అబద్ధం చెప్పాల్సివస్తోంది. నిజంగా ఈ అబద్ధం నిజం అయితే యెంత బాగుంటుందో కదా!

14, డిసెంబర్ 2013, శనివారం

అచ్చంగా నా గొడవ

    
దాదాపు మూడువారాల తరువాత మా ఆవిడకు బెయిల్ దొరికింది. అదీ షరతులతో కూడిన బెయిల్.
ఇన్నాళ్ళు ఆసుపత్రిలో వున్నది చాల లేదట. రెండు మూడు రోజులకోమారయినా వచ్చివెడుతుండాలట. ఇంట్లో కూడా చాలా చాలా జాగ్రత్తగా వుండాలట. వైద్యమా మజాకా మరి.
మా ఆవిడ గుండె మంచిదని తెలిసిన వాళ్లందరూ అంటుంటారు. మంచిదే కాదు గట్టిది కూడా అని ఆ గుండెకు  రెండుసార్లు ఆపరేషన్లు చేసిన డాక్టర్లు చెబుతుంటారు. పాతికేళ్ళ వయస్సులో ఓ ఆపరేషన్ మళ్ళీ మరో పాతిక ముప్పయ్యేళ్ళు  గడిచిన తరువాత మళ్ళీ అదే గుండెకు  ఇంకో ఆపరేషన్. ఇంతెందుకు మొన్నటికి మొన్న ఆసుపత్రిలో మా గోలలో మేముంటే – 1989లో అదే ఆసుపత్రిలో  ఆమెకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేసిన డాక్టరు సీతారామారెడ్డి గారు వచ్చి చూసి వెళ్ళడమే కాదు మిగిలిన డాక్టర్లకు  చూపించి ‘ఈవిడకే  నేను ఆ రోజుల్లో గుండె ఆపరేషన్ చేసాను. గుండెకు ఆపరేషన్ అంటే గుండె ఆగిపోయే రోజుల్లో ఈవిడ ధైర్యంగా చేయించుకుంది. అది సక్సెస్ కావడానికి ఈవిడ గుండె ధైర్యం కూడా కొంత కారణం’ అని చెప్పుకుంటుంటే పెద్ద కష్టం నుంచి బయటపడిన నాటి సంగతులు గుర్తుకు తెచ్చుకుని సంబరపడాలో, లేక నేటి గడ్డు పరిస్తితి  గురించి బాధపడాలో అర్ధం కాలేదు.       
ఈ ఇరవై  రోజులు నిజానికి మా జీవితాల్లో కఠిన పరీక్షాకాలం. పరీక్షల్లో నెగ్గడం మాట అటుంచినా కాస్తోకూస్తో  నిగ్గుదేలడానికి అవకాశం వుంటుంది. ఇన్ని రకాల వైద్య పరీక్షలు వుంటాయా అన్నట్టు అన్ని రకాల పరీక్షలు ఎన్నో రకాలుగా  చేశారు. వొంట్లో రక్తం పరీక్షలకే అన్నట్టు గుచ్చి గుచ్చి తీశారు. యాభయ్ ఏళ్ళ పైచిలుకు జీవితంలో సొంత  సంతానాన్ని సాకినట్టే షుగరు, బీపీ, గుండె జబ్బుల్ని జాగ్రత్తగా పోషించుకుంటూ వస్తోందేమో అవి కూడా ‘గుడి పదిలం’ అన్న పద్ధతిలో వొంట్లో  సెటిల్ అయిపోయాయి. ఇన్నింటిని సంభాలించుకుంటూ డాక్టర్లు వైద్యం చేయాల్సిన పరిస్తితి. ఈ స్తితికి రావడానికి ఆమె యెంత బాధ్యురాలో తెలియదు కాని నా బాధ్యతారాహిత్యం మాత్రం కొండంత వుంది. బాధ్యతల్నీ బరువుల్నీ ఆమెకు వొదిలేసి నా మానాన నేను టీవీలు చర్చలు అంటూ తిరగడం పరిస్తితి ఇలా దిగజారడానికి కారణం అని ఏ భేషజం లేకుండా వొప్పుకోవాల్సిన వాస్తవం. అందుకే జరిగినది తలచుకుంటూ, జరుగుతున్నది చూస్తూ  ఈ క్రమంలో నన్ను నేను ఎన్నోసార్లు  తిట్టుకున్నాను. గింజుకున్నాను. గుంజుకున్నాను. అన్నీ అయిపోయి  ఇదిగో ఇప్పుడిలా బెయిళ్లు, షరతులు అంటూ  అడ్డమయిన జోకులు పేలుస్తున్నాను. నన్ను నేను సముదాయించుకోవడానికి నాకు దొరికిన సులభ మార్గం ఇదేనేమో!
పద్దెనిమిది రోజులక్రితం షుగర్  పరీక్ష చేయించుకుని అటునుంచి అటే హోటల్లో టిఫిన్లు చేసి ఇంటికి వద్దామని ఆస్పత్రికి ఉదయాన్నే వెళ్ళిన వాళ్ళం – అటునుంచి అటే ఆమెను  ఐ.సీ.యూ.కి తీసుకువెడుతుంటే కలో నిజమో తెలియక  కళ్ళప్పగించి చూసిన వాళ్ళం – మొత్తానికి ఇంటికి చేరాం. ఇక్కడా మార్పే. అమ్మకు బాగాలేదని తెలిసి  అమెరికానుంచి వచ్చిన మా పెద్దవాడు సందీప్, రెండోవాడు సంతోష్ కలిసి ఈ మూడు వారాల్లోపే  కావూరి హిల్స్ లో కొత్త అపార్ట్ మెంట్ అద్దెకు తీసుకుకోవడం, సామాను మార్చడం, సదరడం అన్నీ కలలోలాగా జరిగిపోయాయి.
ఆసుపత్రి నుంచి నేరుగా కొత్త ఇంట్లో ‘గృహ ప్రవేశం’. 1975లో హైదరాబాదులో ఆకాశవాణిలో చేరినప్పుడు చిక్కడపల్లి, అశోక్ నగర్, ఆ పిమ్మట మాస్కో, తరువాత పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రమంజిల్, ఎల్లారెడ్డి గూడాల మీదుగా ఇదిగో ఇప్పుడు కావూరి హిల్స్ ఇలా కదులుకుంటూ వస్తున్నాం.  
నిజమే కదా!  చలనం లేకపోతే జీవితమే లేదు.

(14-12-2013)

12, డిసెంబర్ 2013, గురువారం

అసెంబ్లీ అప్పుడూ ఇప్పుడూ


శాసన సభ సమావేశాలు రిపోర్ట్ చేయడానికి రేడియో విలేకరిగా తొలిసారి అసెంబ్లీ ప్రెస్ గ్యాలరీలోకి అడుగుపెట్టి 38 సంవత్సరాలు గడిచిపోయాయి. అప్పుడు అసెంబ్లీ పాత భవనంలో వుండేది. అందులోని  ప్రెస్ గ్యాలరీ చాలా చిన్నది. చెక్క మెట్లెక్కి అందులోకి వెళ్ళే వాళ్ళం. సర్దుకుని కూర్చుంటే ఓ పాతిక మందికి సరిపోతుంది. సభా భవనంలో సభ్యుల సీట్లు సినిమా హాళ్ళలో మాదిరిగా కింద నుంచి పైకి అంచెలంచెలుగా వుండేవి కాబట్టి వారు కూర్చునే చివరి వరుసకూ, మా గ్యాలరీకి నడుమ ఒక చెక్క గోడ మాత్రమే అడ్డుగా వుండేది. కొండొకచో – వెనుక వరుస సభ్యులు తలలు వెనక్కి తిప్పి జర్నలిష్టులతో గుసగుసలాడడం – సభాపతి గమనిస్తున్నారని తెలియగానే బుద్దిమంతుల మాదిరిగా సర్దుకోవడం- నిజంగా అవో తమాషా రోజులు.
ఆ రోజుల్లో వార్తాపత్రికల్లో పేజీల సంఖ్య తక్కువ. ఒకటి రెండు మినహాయిస్తే – మిగిలిన అన్ని దిన పత్రికలు విజయవాడ నుంచే వెలువడేవి. తెలుగు పత్రికల రాజధానిగా బెజవాడకు పేరుండేది.
అసెంబ్లీ వార్తలయినా, మరో వార్త అయినా హైదరాబాదు నుంచి బెజవాడ పంపాలంటే టెలెక్స్, టెలి ప్రింటర్ లే శరణ్యం. డెడ్ లైన్ దాటిన తరువాత వార్త   పంపాలంటే విలేకరులు ట్రంకాల్ బుక్ చేసి చెప్పాల్సిందే. అంతకు కొన్నేళ్ళ క్రితం నేను విజయవాడ ఆంధ్రజ్యోతిలో సబ్  ఎడిటర్ గా పనిచేసేటప్పుడు హైదరాబాదు నుంచి జ్యోతి విలేకరులు శ్రీ జి. రామారావు, శ్రీ ఆదిరాజు వేంకటేశ్వరరావు, శ్రీ ఎన్. ఇన్నయ్య ప్రభ్రుతులు ఫోనులో చెప్పే వార్తలు రాసుకున్న అనుభవం నాకుంది. ఎడిషన్ గడువు లోగా వార్త పంపితేనే మర్నాడు పేపర్లో వచ్చేది. లేకపోతే మరో రోజు వరకు దానికి మోక్షం దొరికేది కాదు. అలాగే రేడియో వార్తలకు కూడా సమయ పరిమితులు వుండేవి.
సభలో ఏం జరిగిందో సవివరంగా అదేరోజు తెలుసుకోవాలంటే వున్న ఏకైక వెసులుబాటు రేడియోలో ప్రసారం అయ్యే అసెంబ్లీ సమీక్ష. సమావేశాలు జరిగే రోజుల్లో రాత్రి 7.45 గంటలకు ఈ కార్యక్రమం పదిహేను  నిమిషాల పాటు సాగేది. పల్లెటూళ్ళలో పంచాయతీ రేడియోల ద్వారా వినడానికి జనాలు గుమికూడేవారు. హైదరాబాదు లోని న్యూ ఎం.ఎల్. యే. క్వార్టర్స్ లో మైకులు ఏర్పాటుచేసి వినిపించేవారు. ఆ సమీక్షలు రాసే బాధ్యతను కూడా పత్రికల్లో పనిచేసే సీనియర్ జర్నలిష్టులకు ఒప్పగించేవారు. ఇప్పుడు ప్రధాన పత్రికలకు ఎడిటర్లుగా వున్న వారిలో చాలా మంది ఆ రోజుల్లో రేడియోకోసం అసెంబ్లీ సమీక్షలు రాసేవారు. ఏమాత్రం తభావతు వచ్చినా సభా హక్కుల ఉల్లంఘన కిందకు వచ్చే ప్రమాదం వున్నందున – ఆ  సమీక్షలను ఒకటికి రెండు సార్లు పరిశీలించి కానీ రికార్డింగు కు  అనుమతించడం జరిగేది కాదు.  సభలో చర్చల సందర్భంలో వాడిన వ్యంగాస్త్రాలు రేడియో సమీక్షలో వచ్చాయో లేదో తెలుసుకోవడానికి సీనియర్ శాసన సభ్యులు అనేకమంది ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా వినేవారు.
మరునాడు కలిసినప్పుడు చెప్పేవారు. శాసన సభ వ్యవహారాలను గురించి వార్తలు రాసే పత్రికల వారు కూడా ముందు తమలో తాము చర్చించుకుని కానీ వార్త రాసేవారు కాదు. యేది రాయాలో యేది రాయకూడదో ఆలోచించుకుని రాసేవారు. అసెంబ్లీ  రిపోర్టింగ్ ను విలేకరులు గొప్ప విషయంగా భావించేవారు. సహజంగా ఇలాటి భావన బాధ్యతని పెంచుతుంది. వక్రీకరణలకు అవకాశం తగ్గుతుంది.
ఏళ్ళు గడుస్తున్న కొద్దీ పత్రికా రంగంలో ‘కదలిక’ మొదలయింది. విజయవాడ కేంద్రంగా వెలువడుతున్న పత్రికలన్నీ క్రమేపీ  తమ ప్రధాన కార్యాలయాలను హైదరాబాదుకు మార్చుకున్నాయి. అప్పట్లో చిన్న చిన్న గదుల్లో న్యూస్ బ్యూరోలు నిర్వహించిన పత్రికలు రాజధానిలో ఏకంగా సొంత భవనాలనే ఏర్పాటు చేసుకున్నాయి. ఆంధ్ర జ్యోతి బ్యూరో సచివాలయం పాత గేటుకు ఎదురుగా వున్న మేడ మీద వుండేది. హిందూ పత్రిక బ్యూరో హిమాయత్ నగర్ లో చిన్న వాటాలో పనిచేసేది. అలాగే  మిగిలిన పత్రికల వాళ్లు.
కొన్నాళ్ళకు ఆంధ్రపత్రిక కార్యాలయాన్ని బషీర్ బాగ్ లో ప్రస్తుతం  లోకాయుక్త కార్యాలయం వున్న పెద్ద  భవనానికి తరలించారు. పత్రిక బ్యూరోలో శ్రీయుతులు ముక్కు శర్మ, ఎం ఎస్.శర్మ, పాపయ్య శాస్త్రి, రత్నం, కె.వేణుగోపాల్, విద్యారణ్య ప్రభ్రుతులు పనిచేసేవారు. నాదెండ్ల భాస్కరరావు ఎపిసోడు లో ఆయన్ని సమర్ధిస్తూ వార్తలు రాసారన్న అనుమానంతో తెలుగుదేశం ప్రభుత్వం ఆ భవనం నుంచి ఆంధ్ర పత్రిక కార్యాలయాన్ని ఖాళీ చేయించిందని ఆ రోజుల్లో చెప్పుకునే వారు. కారణాలు ఏమయినా ఆ తరువాతి కాలంలో యాజమాన్యాలు మారి ఒకప్పుడు తెలుగు పత్రికల్లో తలమానికంగా వెలుగొందిన ఆంధ్ర పత్రిక కాలగర్భంలో కలిసిపోయింది.
ఇక శాసన సభ విషయానికి వస్తే, ఈ మధ్య కాలంలో అనేక కొత్త పత్రికలు పురుడుపోసుకున్నాయి. పాతపత్రికల యాజమాన్యాలు మారిపోయాయి. ప్రైవేటు టీవీ ఛానళ్ళు రంగప్రవేశం చేసాయి. అసెంబ్లీ ప్రత్యక్ష  ప్రసారాలు మొదలయ్యాయి. దానితో రికార్డులనుంచి తొలగించడం అన్న నిబంధన కాగితాలకే పరిమితమయిపోయింది. హక్కుల ఉల్లంఘన గురించి  పట్టించుకునే వ్యవధానం లేకుండా పోయింది. సభలో కంటే సభ బయట అసెంబ్లీ ఆవరణలోని మీడియా పాయింట్ వద్ద సభ్యుల హడావిడి పెరిగింది. అర్ధవంతమయిన చర్చలు సరే అసలు సభ సజావుగా కొద్ది గంటల పాటు నడిచినా ఒక వార్తగా చెప్పుకునే రోజులు వచ్చాయి.


(కొత్త అసెంబ్లీ హాలు) 

అసెంబ్లీ పాత భవనం నుంచి కొత్త భవనానికి మారింది. ఆ కొత్త భవనానికి కూడా కొత్తగా మరిన్ని రంగులు హంగులు సమకూర్చారు. కొత్త కుర్చీలు, కొత్త తివాసీలు, పూలకుండీలతో భవనం రూపురేఖావిలాసాలు మారాయి. కానీ, సభ జరిగే తీరులో మార్పులేదు. మరోసారి వాయిదా వేయడం కోసం సభ మళ్ళీ మళ్ళీ వాయిదా పడుతోంది. ఈ వాయిదాల సమావేశాలు చూసేవారికి విరక్తి పుడుతోంది. ప్రజాస్వామ్యం పట్ల అనురక్తి తగ్గుతోంది. ఇది నిష్టుర నిజం. శాసనకర్తలే ఈ మంచి చెడులకు కర్తలుగా మిగులుతారు. (21-02-2012)

అసెంబ్లీ అప్పుడు – ఇప్పుడు


1976
ఉదయం ఎనిమిదిన్నర.
ఆనరబుల్ స్పీకర్అనే ప్రకటనతో పాటు స్పీకర్ ఆసనం వెనుక తలుపు తెరుచుకునేది. ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో సహా నిండు సభలో వున్నవారందరూ గౌరవపురస్సరంగా లేచి నిలబడి అభివాదం చేస్తుండగా, స్పీకర్ ప్రవేశించి సభకు నమస్కారం చేసి  తన స్థానంలో ఆసీనులయ్యేవారు.
వెనువెంటనే ప్రశ్నోత్తరాల కార్యక్రమం మొదలయ్యేది. సుమారు గంట సేపు సాగాల్సిన ఈ కార్యక్రమం కొండొకచో కాస్త ఆలశ్యం అయ్యేది. ఆ మాత్రానికే స్పీకర్ అసహనం తెలియచేస్తూ నిర్దేశిత ఎజెండా ప్రకారం కార్యక్రమం జరిగేలా చూడడానికి తాపత్రయపడేవారు. ఆ తరువాత జీరో అవర్. ఈ సమయంలో సభ్యులు ఎవరయినా సరే,  ముందుగా సభాపతికి తెలియచేయకుండానే తాము అత్యవసరం అనుకున్న  అంశాలను సభ దృష్టికి తేవడానికి అవకాశం వుంటుంది. సంబంధిత మంత్రి సమాధానం చెప్పాల్సిన అవసరం వుండదు. అయినా కాని, కొందరు మంత్రులు అప్పటికప్పుడే జవాబులు చెప్పే ప్రయత్నం చేస్తుండేవారు. ఆ తరువాత కొన్ని నిబంధలకింద సభ్యులు ఇచ్చిన నోటీసులపై చర్చ, వాటికి సంబంధిత మంత్రుల సమాధానాలు, అప్పుడప్పుడు ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని మంత్రులకు మద్దతుగా ఇచ్చే మరికొన్ని వివరణలు ఇలా సాగిపోయేది. మధ్యలో టీ విరామసమయం. మళ్ళీ సభ సమావేశమై ఎజెండాలోని ఇతర కార్యక్రమాలను చేపట్టడం, మధ్యాహ్నం ఒకటిన్నర కాగానే సభను మరునాటికి వాయిదా వేయడం అంతా నియమానుసారంగా జరిగిపోయేది. సభాకార్యక్రమాలను కవర్ చేయడానికి ఆయా పత్రికల వాళ్లు తమ విలేఖరులకు తగిన సమయాలను కేటాయించడానికి కూడా వీలుండేది. అంటే ప్రశ్నోత్తరాలు, జీరో అవర్ ఒకరికి, మిగిలిన కార్యక్రమాలు వేరే విలేఖరులకు అప్పగించేవారు. వీరుకాకుండా లాబీల్లో జరిగే వ్యవహారాలను ఓ కంట గమనించడానికి విడిగా బ్యూరో చీఫ్ లు వచ్చేవాళ్ళు. అప్పట్లో టీవీ ఛానళ్ళు లేకపోవడం వల్ల మీడియా పాయింటు అంటూ వుండేది కాదు. పత్రికలకు అన్ని అంశాలు వివరంగా ఇవ్వాల్సిన అవసరం వుండడం వల్ల ఇద్దరు ముగ్గురు ఒక్కో పత్రిక నుంచి వచ్చేవాళ్ళు. రేడియోకి అంత సమాచారం అవసరం లేదు కాని ఇచ్చిన సమాచారంలో ఏమాత్రం తభావతు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత చాలా ఎక్కువ. ఏమాత్రం తేడా పాళా వచ్చినా పరిణామాలు చాలా తీవ్రంగా వుండేవి.


(అసెంబ్లీ పాత భవనం)

ఇక ఇప్పుడో అంతా ఇళ్ళల్లో కూర్చుని చూస్తూనే వున్నారు.

స్పీకర్ గంట  కొట్టినట్టు సమయానికి సభలో ప్రవేశిస్తారు. ముందు వాక్యంలో రాసినట్టే అంతా యధావిధిగా జరుగుతుంది, ఒక్క సభలో హాజరు మినహా. తరువాత స్పీకర్ వివిధ పార్టీల వాళ్లు ఇచ్చిన వాయిదా తీర్మానాలను వరసపెట్టి చదువుతారు. ఒక్కో పార్టీ ఒక్కో అంశంపై తీర్మానం నోటీసు ఇస్తుంది. అవన్నీ చదివి, వాటిని తిరస్కరిస్తున్నట్టు ప్రకటిస్తారు. అంతే!  అన్ని పార్టీల వాళ్లు ఈ ఒక్క విషయంలో ఏకమవుతారు. పోడియం చుట్టుముట్టి నినాదాలు మొదలు పెడతారు. సభలో అంతంత మాత్రంగా వున్న మంత్రులు, ఇతర సభ్యులు చోద్యం చూస్తుంటారు. సభ్యులను తమ స్థానాలకు వెళ్ళాల్సిందని స్పీకర్ పదేపదే విజ్ఞప్తి చేస్తారు. ఎవ్వరూ పట్టించుకున్న దాఖలా కనబడదు. దాంతో స్పీకర్ విధి లేక ఓ పదినిమిషాలు వాయిదా వేస్తున్నట్టు ప్రకటించి తన చాంబర్ కు వెళ్ళిపోతారు. పేరుకు పదినిమిషాలే అయినా, ఓ గంటకో, మరో గంటకో సభ మళ్ళీ సమావేశం అవుతుంది. సీన్ రిపీట్.
ఈ లోగా సభ వెలుపల వున్న మీడియా పాయింటు వద్ద వివిధ పార్టీల నాయకులు వరసలు కట్టి వరస వెంబడి తమ వాదనలు వినిపిస్తారు. అన్ని చానళ్ళు తమ వీలునుబట్టి వాటిని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంటాయి.
ఇదే  వరస, ఇదే కధ మరునాడు, ఆ మర్నాడు.

అడిగేవాడు లేకపోవడం అంటే ఇదేనేమో!