29, అక్టోబర్ 2013, మంగళవారం

అంజయ్య గారితో నా అనుభవాలు - 6


ఆనాడు మా ఇంటికి వచ్చిన వాళ్ళలో ఇద్దరు ఆ తరువాత మన రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు.
ఆ సాయంత్రం రేడియో వార్తలు ముగిసిన అనంతరం బస్సుపట్టుకుని హిమాయత్ నగర్ లో దిగి చిక్కడపల్లి (వివేక్ నగర్  అనాలా?)లో  ఇంటికి వస్తుంటే త్యాగరాయ గానసభ ముందు ముఖ్యమంత్రి పైలట్ కారు కనిపించింది. అప్పుడే గానసభలో ఏదో కార్యక్రమం ముగించుకుని ముఖ్యమంత్రి అంజయ్య గారు బయటకు వచ్చి కారెక్కుతూ అక్కడ గుమికూడిన జనంతో ముచ్చటిస్తూ నన్ను చూసి శ్రీనివాస్ ఈ పక్కనే కదా నీ ఇల్లు పోదాం పదఅన్నారు. నాకు ఒక్క క్షణం ఏం జవాబు చెప్పాలో తోచలేదు. ఇల్లు ఏ పరిస్తితిలో  తెలవదు. ఎందుకంటే పగలల్లా మా ఆవిడ ఇంట్లో అమ్మవొడిపేరుతొ చైల్డ్ కేర్ సెంటర్ నడుపుతుంది. కొంతమంది తల్లులు చాలా పొద్దుపోయిందాకా పిల్లల్ని తీసుకు వెళ్లరు. అలా ఆలోచించే లోపలే అక్కడినుంచి మూడో ఇల్లే మాది మా ఇంటికి నడుచుకుంటూ వచ్చేసాము. అప్పుడే వర్షం పడి రోడ్డంతా చిత్తడిగా వుంది. అందులో మేము వుండే వాటా ఇంట్లో  బాగా వెనగ్గా  వుంటుంది. గేటు తీసుకుని కొంతదూరం వెళ్ళాలి. వాన నీళ్ళు నిలవడంతో  ఎక్కడ గుంటవుందో ఎక్కడ చదునుగా వుందో తెలవడం లేదు. పైగా బయట లైటు లేకపోవడంతో వెలుతురు కూడా  లేదు. అలాగే ఇంట్లోకి వచ్చాము. అదృష్టం. కేర్ సెంటర్ పిల్లలందరూ వెళ్ళిపోయారు. మా ఆవిడ అప్పుడే ఇల్లు తుడిచి బాగుచేసినట్టుంది. ఒక్క పెట్టున వచ్చిన అంతమందిని  చూసి ముందు కంగారు పడినా వెంటనే సంభాలించుకుంది. గోడకు ఆనించి  పెట్టిన ఇనుప కుర్చీలు మూడు వేసినా అవి ఎవరికీ  సరిపోయేలా లేవు. ఒక కుర్చీలో ముఖ్యమంత్రి కూర్చుంటే మిగిలిన రెండింటిలో మరో ఇద్దరు సర్దుకున్నారు. వాళ్ళే తరువాత కాలంలో రాష్ట్రానికి ముఖ్యమంత్రులు అయ్యారు. ఒకరు  భవనం వెంకట్రాం కాగా రెండవవారు కోట్ల విజయభాస్కరరెడ్డి గారు. మిగిలినవారందరూ నిలబడేవుండాల్సిన పరిస్తితి. వారిలో ఇద్దరు ముగ్గురు ఆనాటి మంత్రులు కూడా వున్నారు. మా ఆవిడ హడావిడిగా టీ కలిపి తెచ్చింది. కొందరికి కప్పుల్లో. మరికొందరికి స్టీలు గ్లాసుల్లో. సాసర్లు లేవు. వచ్చిన పెద్దలు కూడా పెద్ద మనసు చేసుకుని ఇచ్చిన ఆతిధ్యం(?) స్వీకరించి, మా పిల్లల్ని పలకరించి బయటకు వచ్చారు. మళ్ళీ కారెక్కేటప్పుడు అదే జనం. అసలు అంజయ్య గారంటేనే జనం. జనమే ఆయనకు ఆక్సిజన్. అయితే, ముఖ్యమంత్రిని అలా చెప్పాపెట్టకుండా ఇంటికి తీసుకువెళ్లడం భద్రతాదికారికి నచ్చినట్టులేదు. కార్లో కూర్చుంటూ ఇదేం పద్ధతిగా లేదుఅన్నాడు.
నాకు కోపం చర్రున లేచింది. ఆయన్నేమన్నా బొట్టుపెట్టి  పిలిచానా?’ అనేశాను. ఆ వయసు అలాటిది. ఇప్పుడు తలచుకుంటే చిన్నతనం అనిపిస్తుంది.

ఏవయినా అవి బంగారు రోజులు.                     

28, అక్టోబర్ 2013, సోమవారం

రెండే నిమిషాల్లో 'ట్రీ ప్లాంటేషన్'

మొక్కలు నాటడాన్ని ట్రీ ప్లాంటేషన్ అని యెందుకు అంటారో తెలియదు కాని ఈ రెండు నిమిషాల నిడివి కలిగిన షార్ట్ ఫిలిం చూస్తే తెలుస్తుంది.


కోపం


చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది తీర్చుకోవాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు. కోపంలో నన్ను మించిన వాడు లేడు అని ఇన్నాళ్ళుగా అనుకుంటూ వచ్చిన నేను రంగనాధం కధ వినగానే నేనెంత శాంత మూర్తినో అర్ధం అయింది.    
రంగనాధం నాకు బాగా తెలిసిన వాడే. కోపిష్టి వాడే. సందేహం లేదు. కానీ మరీ ఇంతా. ఛా ఛా!. అతడి  సంగతి విన్నప్పుడు  కోపం యెంత అనర్ధ కారణమో లక్షా ముప్పయ్ ఒకటో సారి తెలిసివచ్చింది. ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే-
అతడో ఆదివారం నాడు ఇంటి ముందు కారాపుకుని దాన్ని కడిగే పని పెట్టుకున్నాడు. పనిలో పనిగా కారుకు చిన్న చిన్న రిపేర్లు చేయడం కూడా అతడికో హాబీ. రెంచీలు గట్రా  దగ్గర పెట్టుకుని ఏదో పనిచేసుకుంటూ వుంటే అతగాడి ఏకైక ముద్దుల కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి పనిలో నిండా మునిగివున్నప్పుడు ఆ పిల్లవాడు ఓ స్క్రూ డ్రైవర్ తీసుకుని కారు డోరు మీద గీయడం మొదలు పెట్టాడు. అది చూసిన రంగానాధానికి చర్రున కోపం వచ్చింది. అదీ వొళ్ళూ పై తెలియని కోపం. చేతిలో వున్న రెంచ్ తీసుకుని పిల్లవాడి చేతిపైన గట్టిగా కొట్టాడు. యెంత గట్టిగా అంటే ఆ కోపంలో అతడికి తాను పిల్లవాడి చేతి వేళ్ళపై కొడుతున్నది ఇనుప రెంచీతో  అన్న సోయలేదు. ఫలితం పిల్లాడి వేళ్ళు చితికి పోయాయి. రక్తం బొటబొటా కారసాగింది. అతడి ఏడుపుకు ఇంటిల్లిపాదీ అక్కడికి చేరారు. జరిగిన ఘోరం చూసి నిర్ఘాంత పోయారు. అప్పుడు కానీ తాను చేసినదేమిటో రంగనాధానికి తెలిసిరాలేదు. కానీ ఏం లాభం. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఒక వేలు పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి తీసేసారు. ఆ సాయంత్రం అంతా ఇంటికి వచ్చారు. రంగానాధానికి తలకొట్టేసినట్టుగా వుంది. తన కోపం మీద తనకే పిచ్చి కోపం వచ్చింది. దీనికంతటికీ కారణమైన కారు  ఇంటి ముందు  అలాగే వుంది. కొడుకుని  కొట్టిన రెంచీ చేతిలోకి తీసుకుని దూరంగా విసిరివేయబోతుంటే  కారు డోరు మీద అడ్డదిడ్డంగా రాసిన  అక్షరాలు కనిపించాయి.
“ మా నాన్నంటే నాకిష్టం”

ఆ రోజు ఉదయం స్క్రూ డ్రైవరుతో రంగనాధం కొడుకు  గీసిన  అక్షరాలవి.
(పుస్తక ప్రియులు దేవినేని మధుసూదనరావు గారు పంపిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం) 

అంజయ్య గారితో నా అనుభవాలు – 5



ఏమయినా చెప్పు! రెడ్డి సాబ్ టేస్టే టేస్టు! ఈ కుర్చీ చూడు ఎంత గొప్పగావుందో!” - అన్నారు ముఖ్యమంత్రి ఆ కుర్చీలో అటూ ఇటూ కదులుతూ.

అంజయ్య గారిది పిల్లవాడి మనస్తత్వం. ఇందిరాగాంధీ దయవల్ల తాను ముఖ్యమంత్రిని అయ్యానన్న భావం ఆయనలో వుండేది. దాన్ని దాచుకోవడానికి కానీ, లేనిపోని భేషజం ప్రదర్శించడానికి కానీ ఎప్పుడూ ప్రయత్నించేవారు కాదు. ప్రతి సందర్భంలో అమ్మ అమ్మఅంటూ ఆమెని హమేషా తలచుకుంటూనే వుండేవారు.



ఎందుకో ఏమో కారణం తెలియదు కాని, నా పట్ల ఆయన అపారమయిన వాత్సల్యం చూపేవారు. ఒక్కోసారి ఈ ప్రవర్తన ఇరకాటంగా వుండేది. ముఖ్యమంత్రిని కలవడానికి ఎవరెవరో వస్తుంటారు. ఏదయినా చెప్పుకోవాలనుకుంటారు. అక్కడ నాలాటి బయటవారువుంటే ఇబ్బంది. పైగా విలేకరిని. కానీ ఆయన నన్ను తన చాంబర్ నుంచి అంత తేలిగ్గా కదలనిచ్చేవారు కాదు. వెడుదుగానిలే! కాసేపు కూర్చో!అనేవారు నేను లేవగానే. ఇబ్బంది పడుతూనే కూర్చుండిపోయేవాడిని పనేమీ లేకపోయినా.

నేనెందుకు పత్రికల్లో రాయడం లేదు?


నా బ్లాగులో రాసేవాటిని చదివే పాఠకులు చాలామంది మీరు యెందుకు పత్రికల్లో రాయరు? అని ఈ మెయిల్స్ పంపుతుంటారు. దానికి కారణం నా వయస్సే. ఓ పదేళ్లు పెద్దవాడిని అయినా లేదా ఓ పదేళ్లు చిన్నవాడిని అయినా నాకు ఈ సమస్య వచ్చి వుండేది కాదేమో. ఈనాడు పత్రికలకు ఎడిటర్లుగా వుంటున్నవారు చాలామంది నాకన్నా ‘వయస్సులో’ చిన్నవాళ్ళు. అలా అని మరీ చిన్నవాళ్ళేమీ కాదు. అంచేత రాయమని వాళ్లు నన్ను అడగలేరు. రాస్తానని నేను వాళ్ళతో చెప్పలేను. జర్నలిష్టులనే వాళ్లకి ఏమున్నా లేకపోయినా ఈ ‘గోరోజనానికి’ మాత్రం ఏం తక్కువ వుండదు. ప్రత్యేకించి నాలాటి వాళ్లకు. కొన్నాళ్ళు ఓ దినపత్రిక వాళ్లు వారం వారం వెంటబడి మరీ అడిగి రాయించుకున్నారు. రాయడం తప్ప ‘ఇచ్చిపుచ్చుకునే’ వొప్పందం ఏమీ లేదు. పైగా రాసిన దానికి ఇంత అని లెక్క కట్టి టీసుకుంటే ఆ రచనకు విలువ అంతటితో సరి – అమరావతి లింగం మీద మేకు కొట్టినట్టే – అని  నమ్మేవాడిని నేను. కొన్నాళ్ళు బాగానే నడిచింది. ఓసారి ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా రాసిన ఓ  వ్యాఖ్య వారి యజమానికి నచ్చలేదు. ‘అందువల్ల వేయడం లేదు’ అని ఫోను చేసి మరీ  చెప్పారు. ‘అంచేతే నేనూ  ఇకనుంచి  మీకు రాయను గాక రాయను’  అని చెప్పేశాను. ఆ తరువాత ఎన్నిసార్లు అడిగినా నా పాలసీ అదే. దాంతో వాళ్లు కూడా అడగడం మానుకున్నారు. నిజానికి మార్కెట్లో రాసేవాళ్ళ కొరత ఏమీ లేదు కదా!
పోతే ఈ ఉపోద్ఘాతానికి కారణం లేకపోలేదు. మీ అందరి అభిమానం వల్ల నా బ్లాగు వీక్షకుల సంఖ్య నేటికి రెండు లక్షలు దాటింది. పత్రికలమీద ఆధారపడే పనేవుంది చెప్పండి.

నిజంగా నేనిప్పుడు అక్షరాలా  ‘లక్షాధికారి’ని.’ నన్ను ఇలా ఇన్ని  లక్షలకు అధిపతిని చేసిన అందరికీ మరోమారు మనః పూర్వక కృతజ్ఞతలు.


 భండారు శ్రీనివాసరావు
 (28-10-2013)

   


27, అక్టోబర్ 2013, ఆదివారం

అంజయ్య గారితో నా అనుభవాలు - 4


ముప్పయ్యేళ్ళ కిందటి మాట.
ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు  కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.

అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి  ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే  తుంచేయాలని భావించిన  ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్  అతిరధులంతా ఆ సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కుయ్ కయ్ అంటే వొట్టు.    

అంజయ్య గారితో నా అనుభవాలు - 3


ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్‌కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్‌ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.


(కీర్తిశేషులు శ్రీ టంగుటూరి అంజయ్య)

ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్‌ ! (మొయినుద్దీన్‌ - ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్‌ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. (ఇప్పటిమాదిరిగా ఇన్ని టీవీలూ, టీవీ స్క్రోలింగులు లేవు. వార్త తెలుసుకోవాలంటే రోజుకు మూడుసార్లు వచ్చే రేడియో వార్తలు కానీ, లేదా ఉదయం వెలువడే పత్రికలు కానీ ఆధారం ఆరోజుల్లో) కానీ అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్‌ అవుతోందని చెప్పేసి- ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది - మంత్రులందరూ (రాజీనామాలు) ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్‌ మంటూ బయటకు పరుగెత్తి - ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్‌ చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను. అందులో జరిగిన పొరబాటు ఏమిటంటే అరవై మంది మంత్రుల రాజీనామా అని రేడియోలో చెప్పేసాం. నిజానికి ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గ సభ్యుల సంఖ్య అరవై. సాయంత్రం వార్తల్లో తప్పు దిద్దుకుని చెంపలేసుకున్నాను.   

ఇదంతా ఎందుకు చెప్పాల్సివస్తోందంటే - విలేకరులు వార్తలను అందించే తొందర్లో ఎలా తప్పుల్ని తొక్కుతారో అన్నది తెలియ చెప్పడానికే.