కోపం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కోపం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

28, అక్టోబర్ 2013, సోమవారం

కోపం


చిన్నప్పటి నుంచే నాకు ముక్కు మీద కోపం. ‘కోపం వచ్చినప్పుడు వంద వొంట్లు చదవరా తగ్గిపోతుంది’ అని మా బామ్మ ఒకటే పోరుపెట్టేది. పిచ్చి బామ్మ. కోపం వచ్చినప్పుడు అది తీర్చుకోవాలని అనుకుంటారు కానీ వొంట్లు, ఎక్కాలు లెక్కబెడుతూ కూర్చుంటారా ఎవ్వరయినా. అందులో కోపం ముందు పుట్టి తరువాత పుట్టిన నా బోటివారు. కోపంలో నన్ను మించిన వాడు లేడు అని ఇన్నాళ్ళుగా అనుకుంటూ వచ్చిన నేను రంగనాధం కధ వినగానే నేనెంత శాంత మూర్తినో అర్ధం అయింది.    
రంగనాధం నాకు బాగా తెలిసిన వాడే. కోపిష్టి వాడే. సందేహం లేదు. కానీ మరీ ఇంతా. ఛా ఛా!. అతడి  సంగతి విన్నప్పుడు  కోపం యెంత అనర్ధ కారణమో లక్షా ముప్పయ్ ఒకటో సారి తెలిసివచ్చింది. ఇంతకీ జరిగిన విషయం ఏమిటంటే-
అతడో ఆదివారం నాడు ఇంటి ముందు కారాపుకుని దాన్ని కడిగే పని పెట్టుకున్నాడు. పనిలో పనిగా కారుకు చిన్న చిన్న రిపేర్లు చేయడం కూడా అతడికో హాబీ. రెంచీలు గట్రా  దగ్గర పెట్టుకుని ఏదో పనిచేసుకుంటూ వుంటే అతగాడి ఏకైక ముద్దుల కుమారుడు తండ్రి దగ్గరకు వచ్చాడు. తండ్రి పనిలో నిండా మునిగివున్నప్పుడు ఆ పిల్లవాడు ఓ స్క్రూ డ్రైవర్ తీసుకుని కారు డోరు మీద గీయడం మొదలు పెట్టాడు. అది చూసిన రంగానాధానికి చర్రున కోపం వచ్చింది. అదీ వొళ్ళూ పై తెలియని కోపం. చేతిలో వున్న రెంచ్ తీసుకుని పిల్లవాడి చేతిపైన గట్టిగా కొట్టాడు. యెంత గట్టిగా అంటే ఆ కోపంలో అతడికి తాను పిల్లవాడి చేతి వేళ్ళపై కొడుతున్నది ఇనుప రెంచీతో  అన్న సోయలేదు. ఫలితం పిల్లాడి వేళ్ళు చితికి పోయాయి. రక్తం బొటబొటా కారసాగింది. అతడి ఏడుపుకు ఇంటిల్లిపాదీ అక్కడికి చేరారు. జరిగిన ఘోరం చూసి నిర్ఘాంత పోయారు. అప్పుడు కానీ తాను చేసినదేమిటో రంగనాధానికి తెలిసిరాలేదు. కానీ ఏం లాభం. ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. ఒక వేలు పూర్తిగా దెబ్బతిన్నదని చెప్పి తీసేసారు. ఆ సాయంత్రం అంతా ఇంటికి వచ్చారు. రంగానాధానికి తలకొట్టేసినట్టుగా వుంది. తన కోపం మీద తనకే పిచ్చి కోపం వచ్చింది. దీనికంతటికీ కారణమైన కారు  ఇంటి ముందు  అలాగే వుంది. కొడుకుని  కొట్టిన రెంచీ చేతిలోకి తీసుకుని దూరంగా విసిరివేయబోతుంటే  కారు డోరు మీద అడ్డదిడ్డంగా రాసిన  అక్షరాలు కనిపించాయి.
“ మా నాన్నంటే నాకిష్టం”

ఆ రోజు ఉదయం స్క్రూ డ్రైవరుతో రంగనాధం కొడుకు  గీసిన  అక్షరాలవి.
(పుస్తక ప్రియులు దేవినేని మధుసూదనరావు గారు పంపిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం) 

15, సెప్టెంబర్ 2013, ఆదివారం

కోపం వచ్చినప్పుడు గొంతు యెందుకు పెరుగుతుంది?



గురువు గారు శిష్యులతో ముచ్చటిస్తున్నారు. పనిలో పనిగా జ్ఞానబోధ చేస్తున్నారు.
గురువు అడిగారు “ కోపం వచ్చినప్పుడు స్వరం యెందుకు పెరుగుతుంది? పక్కన వున్నవాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా గొంతు పెంచాల్సిన అవసరం యేముంటుంది?”
శిష్యులు ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు ఏం జవాబు చెప్పాలో తెలియక.
గురువుగారే చివరకు వివరించారు.
“ఇద్దరు వ్యక్తులకు ఒకరి మీద మరొకరికి పట్టరాని కోపం వచ్చినప్పుడు వారి హృదయాల నడుమ దూరం పెరుగుతుంది. ఆ దూరం కారణంగా  తాము చెప్పేది ఎదుటివాడికి వినబడదేమో అన్న అనుమానంతో  స్వరం పెంచుతారు. కోపం పెరిగిన కొద్దీ దూరం పెరుగుతుంది. దూరం పెరిగిన కొద్దీ మాటల్లో తీవ్రత పెరుగుతుంది”
గురువు గారు తాను చెప్పదలచుకున్నదాన్ని కొనసాగించారు. శిష్యులు మనసు పెట్టి వింటున్నారు.
“ఎప్పుడన్నా ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకునే తరహా గమనించారా! చాలా నెమ్మదిగా, మృదువుగా వారి సంభాషణ సాగుతుంది. ఎందుకంటే వారు మానసికంగా దగ్గరగా వుంటారు. అందువల్ల పెద్దగా అరిచినట్టు మాట్లాడుకోవాల్సిన అవసరం వారికి వుండదు.
“వారి నడుమ ప్రేమ మరింత బలపడిందనుకోండి. వారి నడుమ సాన్నిహిత్యం కూడా  మరింతగా పెరుగుతుంది. హృదయాలు మరింత దగ్గరవుతాయి. దాంతో వారి మధ్య మాటలు గుసగుసలాడుకున్నట్టుగా సాగుతాయి.
“అంటే  ఏమిటన్న మాట. కోపం లేకపోతే స్వరం పెరగదు. కోపం లేని వ్యక్తుల నడుమ సంభాషణ మాట్లాడుకున్నట్టుగా  వుంటుంది. పోట్లాడుకున్నట్టు వుండదు.
“వాదనలు చేసుకునేటప్పుడు దీన్ని మరింత గమనంలో పెట్టుకోవాలి. మీ మాటల్లో ప్రేమ తొణికిసలాడితే ఎదుటివాడి పలుకుల్లో కూడా పదును తగ్గుతుంది.
“వాదనల్లో వాడే పదాలతో హృదయాలను దూరం చేసుకోకుండా జాగ్రత్త పడితే మీకు కోపం అనేదే రాదు. వచ్చినా ఎదుటి వ్యక్తిని శాశ్వితంగా దూరం చేసుకునేంతగా మీ  స్వరం పెరగదు”

గురువుగారు ఆనాటికి పాఠం ముగించారు. శిష్యులు తమ జీవితాలకు ఉపయోగపడే కొత్త పాఠం ఒకటి ఆనాడు  నేర్చుకున్నారు. (15-09-2013)