10, అక్టోబర్ 2011, సోమవారం

అయితే ఒకే!

అయితే ఒకే!





ఏకాంబరం కొడుకును పిల్చి చెప్పాడు.


‘నాకు నచ్చిన పిల్లనే నువ్వు పెళ్లి చేసుకోవాలి.’


‘అది కుదిరే పని కాదు.’ కొడుకు ఖరాఖండిగా జవాబిచ్చాడు.


‘నేను ఎంపిక చేసే అమ్మాయి ఎవరనుకున్నావు. బిల్ గేట్స్ కూతురు.’


‘అలా అయితే నాకు ఓకే!’


కొడుకు టక్కున ఒప్పేసుకున్నాడు.


ఏకాంబరం బిల్ గేట్స్ దగ్గరకు వెళ్లి తన కొడుక్కు ఆయన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయమన్నాడు.


బిల్ మహాశయుడు కుదరదు కాక కుదరదు పో! అన్నాడు.


‘నా కొడుకు వరల్డ్ బ్యాంక్ సీఈఓ’ చెప్పాడు ఏకాంబరం.


‘అయితే నాకు ఓకె’ అన్నాడు బిల్ గేట్స్.


ఏకాంబరం నేరుగా వరల్డ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దగ్గరకు వెళ్లాడు.


వెళ్లి తన కొడుక్కు వరల్డ్ బ్యాంక్ సీ.ఈ.ఓ. గా ఉద్యోగం ఇమ్మన్నాడు.


అది అయ్యేపని కాదని ఆయన తేల్చి చెప్పాడు.


‘నా కొడుకంటే ఎవరనుకున్నావు? వాడు సాక్షాత్తు బిల్ గేట్స్ కు కాబోయే అల్లుడు.’ బదులిచ్చాడు ఏకాంబరం.


‘అయితే నాకూ ఓకే!’


ఎగిరి గంతేసి ఒప్పుకున్నాడు వరల్డ్ బ్యాక్ ప్రెసిడెంట్.


ఇలా వుంటాయిట పెద్దోళ్ల బిజినెస్ వ్యవహారాలు.

నెట్లో అందిన ఇంగిలీసు జోక్కి- మక్కికి మక్కి కాని తెలుగు అనువాదం – భండారు శ్రీనివాసరావు
(10-10-2011)

3, అక్టోబర్ 2011, సోమవారం

సేకరించిన ‘శ్రీ’ సూక్తాలు – భండారు శ్రీనివాసరావు





‘శ్రీకరా! అంటే ఒట్టు – సూకరా అంటే తిట్టు – అన్నాడు మహాకవి’


‘తొక్కితే రాయి – మొక్కితే సాయి’


‘శాస్త్రం – చట్టం ఒప్పుకుంటే దొంగే దొర’


‘రాజకీయం అంటే వారసత్వం కాదు పౌరసత్వం’


‘పిసినారిని మించిన దాత లేడు’


‘కొత్త తరాన్ని కొత్త రక్తాన్ని ఆహ్వానించ లేనివాళ్ళు పాత మోడల్ కారు మాదిరిగా మిగిలిపోతారు.’


‘భక్తులందు వీ.ఐ.పీ. భక్తులు వేరయా అన్నాడు వేమన్న’


‘ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు - కానీ, ఎక్కిన రైలు గమ్యం చేరుతుందా అనే డౌటు.


‘కాలమే అన్ని సమస్యలకు పరిష్కారం చూపెడుతుంది. నిజమే! కానీ టైం కు కూడా టైం ఇవ్వకపోతే పాపం టైం మాత్రం ఏం చేస్తుంది?’


‘చిన్న దొంగలు జిల్లాలో జైళ్ళలో మగ్గుతుంటారు. పెద్ద దొంగలు జనం మధ్యే దొరల్లా తిరుగుతుంటారు’


‘విన్నది మరచిపోతాము. చూసింది గుర్తుంటుంది. చెయ్యడం వల్ల విషయం బోధపడుతుంది.’


‘నాలికతో ఎలా మాట్లాడాలో తెలియడానికి మనిషికి మూడేళ్ళు పడుతుంది. కానీ దాన్ని ఎక్కడ, ఎప్పుడు, ఎలా సరిగ్గా వాడుకోవాలో తెలియడానికి జేవితకాలం కూడా సరిపోకపోవచ్చు’

(03-10-2011)





1, అక్టోబర్ 2011, శనివారం

సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

సంచీడు సంసారం అను ఓ సీతమ్మ కధ - భండారు శ్రీనివాసరావు

చరాస్తి అనండి చిరాస్తి అనండి ఆమెకు వున్నది ఆ సంచీ ఒక్కటే. దాంతోనే సీతమ్మ గంపెడు సంసారాన్ని ఈదుకుంటూ వచ్చింది. కూలీ నాలీ చేస్తూ సంసారం లాగిస్తున్న మొగుడు రోడ్డుప్రమాదంలో కన్ను మూశాక మొత్తం భారాన్ని తన భుజాల మీదకు ఎత్తుకుంది. పిల్లల్ని పెద్దచేసి పెళ్ళిళ్ళు చేసి సాగనంపింది. వొంటి చేత్తో కుటుంబం బరువు బాధ్యతల్ని నెట్టుకొచ్చిన సీతమ్మ చివరికి బతుకు బాటలో వొంటరి ప్రయాణం సాగిస్తోంది. కంప్యూటర్ పుణ్యమా అని నాకు ఈ పుణ్యమూర్తి పరిచయ భాగ్యం కలిగింది. అదెలాగో తెలుసుకోవాలంటే- కొద్దిగా వెనక్కు వెళ్ళాలి.

2005 డిసెంబర్లో హైదరాబాద్ దూరదర్శన్ నుంచి రిటైర్ అయిన తరువాత ఎల్లారెడ్డి గూడాలో ఒక అపార్ట్ మెంట్ లో ఫ్లాటు అద్దెకు తీసుకుని వుంటున్నాము. దానిపక్కనే ఓ చిన్న గుడి. బ్లాగు లోకంలో సంచరిస్తూ కంప్యూటర్ దగ్గర కూచుని కూచుని పట్టిన మెడ నొప్పికోసం డాక్టర్ దగ్గరకు వెడితే ఆయన ఉదయం సాయంత్రం వీలు చూసుకుని ఓ గంట నడవమని సలహా ఇచ్చాడు. మెడ నొప్పికి, కాలినడకకు సంబంధం ఏమిటనే చచ్చు ప్రశ్నలు వేయకుండా డాక్టర్ సలహా పాటించడానికి నిర్ణయించుకున్న వాడినై, ఓ మంచి ముహూర్తం చూసుకుని, మార్నింగ్ టీవీ చర్చలకు అడ్డురాని సమయాన్ని ఎంచుకుని ఇంటికి దగ్గర్లో వున్న మునిసిపల్ పార్కులో మాణింగ్ వాక్ మొదలు పెట్టాను. ఈ క్రమంలోనే నాకు సీతమ్మ పరిచయం అయింది. తెల్లవారకముందే లేచి గుడిముందు వూడ్చి ముగ్గులు పెట్టే సీతమ్మను చూస్తూ నా వాకింగ్ మొదలయ్యేది.


'ఆ మహాతల్లిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకే ఆమె బొమ్మ పెట్టడం లేదు'

అంత వయస్సులో ఇంత కష్ట పడుతున్న ఆమెను చూసి మనసు కష్టపడేది. కానీ ముక్కూ మొహం తెలియకుండా ఏదయినా సాయం చేయడానికి తెలియని సంకోచం. వాకింగ్ నుంచి తిరిగి వచ్చేటప్పుడు చూస్తే గుడి ముందు చిన్న పట్టా పరచుకుని భక్తులు వొదిలే పాదరక్షలు కనిపెట్టి చూస్తూ వారిచ్చే చిల్లర పైసలు తీసుకుంటువుండేది. ఇది సర్వసాధారణంగా కానవచ్చే దృశ్యమే. పెద్ద ప్రత్యేకత వున్న విషయం కాదు.

అయితే, రోజులు గడుస్తున్న కొద్దీ , వస్తూనో పోతూనో కాసేపు ఆగి ఆమెతో మాటలు కలిపేవాడిని. అన్ని విషయాలు ఒక్కసారే చెప్పకపోయినా కొద్ది కొద్దిగా ఆమె తన గురించిన అన్ని విషయాలు పూసగుచ్చినట్టు చెప్పడం మొదలుపెట్టింది.

సీతమ్మది సూర్యాపేట దగ్గరవున్న జగ్గయ్యపేట. పొరుగూరు సంబంధమని సూర్యాపేటలో రోజుకూలీ చేసుకునే సుబ్బయ్యకిచ్చి చిన్న తనంలోనే పెళ్ళిచేశారు. తర్వాత పొట్టచేతబట్టుకుని హైదరాబాద్ వలస వచ్చారు. తేదీలు, సంవత్సరాలు సరిగా గుర్తులేవుకానీ, ఆమె చెప్పిన వివరాలప్రకారం వాళ్లు హైదరాబాద్ వచ్చి యాభయ్ ఏళ్ళు దాటిందనే అనుకోవాలి. అప్పటికి ఎల్లారెడ్డిగూడాలో ఇళ్లు విసిరేసినట్టు అక్కడొకటి ఇక్కడొకటి వుండేవట.

ఆ రోజుల్లో కూలీ పనులు ఓ పట్టాన దొరికేవి కావు. పొట్టగడవడం సంగతి దేముడెరుగు కట్టుకున్నవాడు లారీ కిందపడి చనిపోయాడు. నాలుగిళ్ళ ల్లో పాచిపనులు చేసుకుంటూ పిల్లల్ని సాకింది. పెళ్ళిళ్ళు అయి ఎక్కడి వాళ్లు అక్కడికి రెక్కలొచ్చి ఎగిరిపోయారు. తమ దగ్గరకు వచ్చి వుండమని పిల్లలు ఎంత బతిమాలినా సీతమ్మ రాముడి గుడిని వొదిలిపెట్టి వెళ్ళడానికి వొ ప్పుకోలేదు. వుండడానికి ఇల్లంటూ లేదు. గుడికి నాలుగిళ్ళ అవతల ఓ అపార్ట్ మెంట్ లో వాచ్ మన్ కుటుంబంతో కలసి వుంటుంది. పగలంతా గుడి దగ్గరే మకాం. ఇలాటివాళ్ళ కోసమే అన్నట్టు ఓ చిన్న కుర్రాడు ఓ పెద్ద ఫ్లాస్క్ లో టీ తెచ్చి అమ్ముతుంటాడు. దేవుడి ప్రసాదమే పగటి పూట సాదం. రాత్రి వాచ్ మన్ కుటుంబం పెట్టే తిండికి ఎంతో కొంత ముట్టచెబుతుంది.

సీతమ్మ లెక్క ప్రకారం జనంలో భక్తి పెరిగింది. గుళ్ళకు వచ్చేవాళ్ళు పెరిగారు. వెనక చెప్పులు కనిపెట్టి చూసినవారికి పావలా అర్ధ ఇస్తే ఘనం. ఇప్పడు పది రూపాయలనోటు కూడా వెనకాముందు చూడకుండా ఇచ్చేవాళ్ళు ఎక్కువయ్యారు. దానా దీనా ఆదాయం పెరిగింది. ఖర్చులు తగ్గాయి. బ్యాంకులో ఖాతా తెరిచింది. కూడబెట్టిన డబ్బులోనుంచి అప్పుడప్పుడు పిల్లలకు ఎంతో కొంత పంపుతుంటుంది. దేవుడి దయ వల్ల రోగం రొష్టు లేవు. ఏ బాధా లేదు. బాధపెట్టేవాళ్ళూ లేరు.

బండెడు కష్టాలతో మొదలయిన గంపెడు సంసారం కాస్తా సంచీడు సంసారంగా మారింది. రోజులు వెళ్ళమార్చే స్తితి నుంచి రోజులు గడిచే స్తితికి చేరుకుంది. ఒకళ్ళమీద ఆధారపడకుండా జీవిస్తోంది.

‘ఇంతకంటే ఇంకేం కావాలి ?’ అనే సీతమ్మ నుంచి ‘ఇంకా ఇంకా కావాలి’ అని ఆరాటపడే జీవులు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తుంది.

(01 - 10 - 2011)


30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా! - భండారు శ్రీనివాసరావు




కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా!

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
          

ముప్పయ్యేళ్ళ కిందటి మాట.

ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.

అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలని భావించిన ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అతిరధులంతా ఆ సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కిమ్మిన్నాస్తి.

మూడు దశాబ్దాల తరవాత మళ్ళీ రాష్ట్రంలో అవే పరిస్థితులు. ముఖ్యమంత్రి పై మంత్రుల ధిక్కార ధోరణి. సాటి మంత్రులపై తోటి మంత్రులే అవినీతి ఆరోపణలు చేసే పరిస్తితి. మంత్రులతో పాటు ఎమ్మేల్యేలది కూడా అదే వరస. కానీ నాటి ఇందిరలా రాజకీయ దృఢచిత్తంతో వ్యవహరించలేని అశక్తతలో నేటి అధిష్టానం.



మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ మార్పుకు అనేక కారణాలు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఢిల్లీ పెద్దలు, వయసులో, అనుభవంలో పెద్ద అయిన రోశయ్యకు తాత్కాలిక ప్రాతిపదికపై ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. ఆయన కూడా చాలా రోజులు ముఖ్యమంత్రి పదవి తాత్కాలికమనే భావనలోనే రోజులు వెళ్ళబుచ్చారు. భేషజానికి పోకుండా ఆయన పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నారు.

వైఎస్సార్ దుర్మరణానికి కారణమయిన ప్రకృతి ప్రకోపం రోశయ్య పాలన తొలిరోజుల్లో కూడా కొనసాగింది. వర్షాలు, వరదలకు తోడు జగన్ రూపంలో బయటపడిన పార్టీలోని చీలికలు. ఈ చీకాకులకు అదనంగా టీ.ఆర్.ఎస్. ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమం బాగా వూపందుకోవడం - పరిపాలనపై, పార్టీపై ప్రభావం చూపింది. వెరసి, తాత్కాలిక ప్రాతిపదికపై శాశ్వితంగా కొనసాగుతారనుకున్న రోశయ్యను అర్ధాంతరంగా మార్చే పరిస్తితులు తలెత్తాయి.

ఈ పరిణామాలు సీ.ఎం. మార్పిడి దిశగా అధిష్టానాన్ని అడుగులు వేయించాయి. తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ని ఇందుకు ఎంపిక చేశారు. వై.ఎస్.తో సాన్నిహిత్యం కలిగిన గాలి జనార్ధన రెడ్డి వ్యవహారం భవిష్యత్తులో చంచల్ గూడా జైలు దాకా వెడుతుందని తెలిసే వై.ఎస్. మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరీటం పెట్టడం రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయినప్పటికీ అధిష్టానం సంగతి తెలిసిన వారికెవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఎందుకంటె, ఢిల్లీలో అధిష్టానదేవత చుట్టూ చుట్టుకునివుండి చిల్లర దేవుళ్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూడడానికి తెగ ఉత్సాహపడుతుంటారని రాజధానిలో ప్రతీతి. చూస్తూ చూస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెత్తనం చేసే మహత్తర అవకాశాన్ని వాళ్లు వొదులుకోలేరు. ఈ ఒక్క విషయంలో మాత్రం జాతీయ పార్టీలయినా, ప్రాంతీయ పార్టీలయినా వాటి అధినాయకత్వం తీరూ, తరహా ఒకే విధంగా వుంటుంది. జాతీయ పార్టీలు తమ ముఖ్య మంత్రులతో వ్యవహరించే పధ్ధతి, ప్రాంతీయ పార్టీలు తమ జిల్లా పరిషత్ అధ్యక్షులతో వ్యవహరించే విధానం ఒకే రీతిలో వుంటాయన్నది జగమెరిగిన సత్యం.

అయితే వైఎస్సార్ విషయంలో అధిష్టానం కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించింది. కేంద్రంలో సంకీర్ణ





ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ నెత్తికెత్తుకున్న కొత్త బాధ్యతలు రాజశేఖరరెడ్డికి ఓ మేరకు

కలసివచ్చాయి. జాతీయ స్తాయిలో కుదురుకోవడానికి వారికి కూడా రాజశేఖరరెడ్డి వంటి ‘అన్నింటా సమర్ధుడయిన’ ఒక ప్రాంతీయ నాయకుడు అవసరమన్న వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు కూడా గుర్తించారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించిన రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేని దైన్య స్తితి పార్టీ అధిష్టానానిది. ఆ ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రతో, టీడీపీ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలతో ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని ముందుగానే రిజర్వ్ చేసుకున్నారనే అనుకోవాలి. వై.ఎస్. ముఖ్యమంత్రిగా వున్న మొదటి అయిదేళ్ళ కాలంలో ఆయన్ని మార్చాలని రాష్ట్రం లోని ఆయన వ్యతిరేకులు, అసమ్మతివాదులు కలసికట్టుగా ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆ సాహసానికి పూనుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిరాగాంధి వ్యవహార శైలికి, సోనియా గాంధి పని తీరుకు పోల్చి చూపిస్తూ జాతీయ మీడియాలో వెలువడిన సోనియా అనుకూల కధనాలు కూడా - ముఖ్యమంత్రులను మార్చే విషయంలో ఆమె కాస్త గుంజాటన పడడానికి దోహదం చేసి వుండవచ్చు. కానీ, మరోసారి అత్తెసరు మెజారిటీతో రెండో పర్యాయం కేంద్రంలో యూ.పీ.యే. ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో కొంత మార్పువచ్చింది. కాని, వైఎస్సార్ మరణం వరకు అది బయట పడలేదు. తదనంతర పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్ర ముఖ్య మంత్రిపై వెనుకటి పట్టు బిగించాలన్న కోరిక ఢిల్లీ పెద్దలలో కలిగినట్టు వుంది. అది నెరవేర్చుకునే క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాటి కాంగ్రెస్ దుస్తితికి కారణమయ్యాయి.

అనుభవశాలి అయిన రోశయ్యను తప్పించడానికి అధిష్టానం చెప్పిన కారణం ఆయన వయో భారం. ఆ కారణాన్ని కూడా ఆయన చేతనే చెప్పించారనుకోండి. అది ఢిల్లీ పెద్దల జాణతనం.

వృద్ధుడయిన రోశయ్య స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టారు. ఆయన యువకుడే కాదు విద్యాధికుడు కూడా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అధికారులతో వ్యవహరించిన తీరు, మంత్రుల శాఖల పంపిణీలో సీనియర్లను సైతం స్వతంత్రించి పక్కనబెట్టడం ఇవన్నీ చూసి ఆయనకు అధిష్టానం మద్దతు పూర్తిగా వుందనీ, స్వేచ్చగా వ్యవహరించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఒక గాడిలో పెడతారని ఆశ పడ్డవాళ్ళు వున్నారు.

కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అభిప్రాయం నీరు కారిపోవడం మొదలయింది. కొత్త ముఖ్యమంత్రి పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించి పదవిని పదిలం చేసుకుంటారని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. అవినీతి రహిత పాలన అందించాలన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన విధాన సంస్కరణలు వై.ఎస్.ఆర్. ప్రారంభించిన



సంక్షేమ పధకాలకు గొడ్డలి పెట్టుగా తయారయ్యాయి. వై.ఎస్.ఆర్. ఇప్పడు జీవించి వున్నా వీటిల్లో వున్న కొన్ని లొసుగులను సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై కూడా పడేది. కానీ, కొందరు అధికారుల అవాంచిత, అనాలోచిత చొరవల కారణంగా ఆ పధకాలను కిరణ్ ప్రభుత్వం కావాలనే అటకెక్కిస్తున్నదన్న భావన ఆ పధకాల లబ్ధిదారుల్లో బలంగా చొచ్చుకుపోయింది. ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం అటు మంత్రులు కానీ, ఇటు అధికారులు కానీ సమర్ధవంతంగా చేయకపోవడం వల్ల రాజకీయ ప్రత్యర్ధులకు అది ఒక ఆయుధంగా అంది వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా కాకుండా ఐ.ఏ.ఎస్. అధికారి లాగా వ్యవహరిస్తున్నారన్న భావన కూడా పార్టీ వర్గాల్లో ప్రబలడానికి ఆయన వ్యవహారశైలి కొంత మేరకు దోహదం చేసింది. ఏఒక్క విషయంలోనూ తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న దురభిప్రాయం సీనియర్ మంత్రుల్లో ప్రతిఒక్కరికీ కలిగింది. ఖాళీగావున్న అసంఖ్యాక పదవులను పంపిణీ చేసి పార్టీ శ్రేణులను పటిష్టపరిచే చర్యలు లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ కార్యక్రమాలపట్ల ఆసక్తి లేకుండా పోయింది. సాధారణంగా పదవుల పంపిణీ వ్యవహారం పార్టీలో అసమ్మతికి దారితీస్తుందనే అభిప్రాయం వుంది. అయితే, ఎన్నికలు సుదూరంలో వుండి, అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నప్పుడు అసమ్మతికి భయపడాల్సిన పరిస్తితి ముఖ్యమంత్రికి వుండదు.

కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన వైఫల్యం చెందారనే అనుకోవాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ తక్షణం హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు



సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. సీనియర్ల నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించకపోవడం, జగన్ సానుకూల ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో అధిష్టానం తాత్సార వైఖరి అవలంబించడం, తెలంగాణా కారణంగా అన్ని పార్టీల్లో మాదిరిగానే కాంగ్రెస్ లో లుకలుకలు ఏర్పడడం – ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కారణాలుగా పేర్కొంటూ వుంటారు. కానీ ఇవి వాదనకు నిలబడే విషయాలు కావు. ఇలాటివన్నీ, ఏదో ఒక రూపంలో ప్రతి ముఖ్య మంత్రీ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనక తప్పని సమస్యలే.

నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నెన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి. ఈ నేపధ్యంలో సంభవించిన దురదృష్టకర మరణం వై.ఎస్.ఆర్. ను సామాన్యుల మనస్సుల్లో చిరంజీవిని చేసింది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోకుండా, వై.ఎస్.జగన్ ను అడ్డుకునే క్రమంలో వై.ఎస్, పాలనను తప్పుబడుతూ చేసిన కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అవి ప్రత్యర్ధికి కలసి వచ్చాయి.

మరో అయిదు వారాల్లో అంటే నవంబర్ 24 నాటికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది కాలంలో ఆయన సాధించింది పూజ్యమనే చెప్పాలి. జనాలకు పనికొచ్చే పాత పధకాలు పక్కన పెట్టడమే కాకుండా పేరుకయినా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పధకం కూడా ఆయన హయాంలో శ్రీకారం చుట్టుకోలేదు. క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే గగనంగా మారిన రోజులు కిరణ్ పాలనలోనే కాంగ్రెస్ కళ్ళచూస్తోంది.

ఇప్పుడిప్పుడే ఈ అంశాలనన్నింటినీ కిరణ్ కుమార్ రెడ్డి పరిగణన లోకి తీసుకుంటున్నట్టు కానవస్తోంది. నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడానికి ఆర్భాటంగా చేస్తున్న పధకాల ప్రకటనలే ఇందుకు సాక్ష్యం.

అయితే, ఇంకా మించిపోయిందేమీ లేదు. నిండా రెండేళ్ళ వ్యవధానం వుంది. మరో విషయం ఆలోచించకుండా పరిపాలనపై పట్టు బిగించగలిగితే చాలు అద్భుతాలు సృష్టించలేకపోయినా మీద పడ్డ విమర్శలను కొంత మేరకయినా తొలగించుకోవచ్చు. నిజమే. ఇప్పడు ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం.

పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.

ఇది గమనంలో పెట్టుకునే పాలకులకు సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (29-09-2011)

29, సెప్టెంబర్ 2011, గురువారం

బొద్దింక నేర్పిన బ్రహ్మ రహస్యం – భండారు శ్రీనివాసరావు

బొద్దింక నేర్పిన బ్రహ్మ రహస్యం – భండారు శ్రీనివాసరావు


ఆనంద రావుకు చికాగ్గా వుంది.

తెల్లారకముందే ఇంట్లో తండ్రి పెట్టిన చివాట్లు ఓ పక్కన, ఆఫీసులో బాసు విసిరిన వ్యంగాస్త్రాలు మరో పక్కన గుర్తుకొచ్చి మనసును ముల్లుతో గుచ్చుతున్నాయి. ఆ గందరగోళంలో ఏం చెయ్యాలో తోచక కాఫీ తాగుదామని హోటల్లోకి అడుగుపెట్టాడు.

వేళ కాని వేళేమో ఖాళీగావుంది. ఓ మూల బల్ల దగ్గర కూర్చుని కాఫీ ఆర్డర్ చేసాడు. ఇంతలో ఎక్కడినుంచో వూడిపడ్డట్టు అయిదారుగురు అమ్మాయిలు పక్క టేబుల్ వద్దకు చేరారు.

అసలే ఆడపిల్లలు. ఉద్యోగాలు చేస్తూ సొంతంగా సంపాదించు కుంటున్న వాళ్లు. లోకం పోకడ తెలిసిన వాళ్లు. ఇక కబుర్లకేం తక్కువ. ఎక్కడలేని విషయాలు వాళ్ల నోళ్ల నుంచి గలగలా తన్నుకువస్తున్నాయి.

ఏమయిందో యేమో వారిలో ఒకమ్మాయి దిగ్గున లేచి కెవ్వున కేక పెట్టింది. ఆనందరావు కూడా అటు చూశాడు.

చూడరానిదేదో చూసినట్టు ఆమె మొహంలో భయం తాండవిస్తోంది. తాకరానిదేదో తాకినట్టు ఆమె వొళ్ళు కంపిస్తోంది. సాయం చేయండంటూ స్నేహితురాళ్ల ని కంటి చూపుతోనే బేలగా అర్ధిస్తోంది.

తీరా చూస్తే ఆమె చున్నీ మీద ఓ బొద్దింక విలాసంగా వాలి తమాషా చూస్తోంది.

బొద్దింక ను చూడగానే వాళ్ళందరికీ మతులు పోయాయి. అది లేచి వచ్చి తమ మీద ఎక్కడ దాడి చేస్తుందేమో అన్నట్టుగా వాళ్ళంతా హడలి పోతున్నారు.

వాళ్లు అనుకున్నంతా అయింది. బొద్దింక మొదటి అమ్మాయిని వొదిలేసి మరో అమ్మడి భుజం మీద వాలింది. అంతే! ఇక ఏడుపులు మొత్తుకోళ్ళు ఆ రెండో అమ్మాయి వంతయ్యాయి.

ఇదంతా చూసి ఓ వెయిటర్ ముందుకు వచ్చాడు. రిలే జంపింగ్ లో భాగంగా బొద్దింక అమాంతం యెగిరి అతడి చొక్కాపై వాలింది.

కానీ, అతడు కంగారు పడలేదు. ఇతరులను కంగారు పెట్టలేదు. కదలకుండా నిలబడి దానివైపు కాసేపు కళ్ళార్పకుండా చూశాడు. తనని తాను కుదుట పరచుకున్నాడు. సుతారంగా చేయి చాపి బొద్దింకను వేళ్ళతో పట్టి విలాసంగా బయటకు విసిరేసాడు.

కాఫీ చప్పరిస్తూ ఇదంతా గమనిస్తున్న ఆనంద రావులో కొత్త ఆలోచనలు సుళ్ళు తిరిగాయి. ‘ఆ ఆడపిల్లలు అలా భయం భయంగా ప్రవర్తించడానికి కారణం ఆ బొద్దింక అయివుంటుందా ?

‘పోనీ అలానే అనుకున్న పక్షంలో అదే బొద్దింక ను చూసి వెయిటర్ ఎందుకు కంగారు పడలేదు? కంగారు పడకపోగా ఎలాటి గందరగోళానికి తావివ్వకుండా , ఎటువంటి నాటకీయతకు అవకాశం ఇవ్వకుండా ఆ బొద్దింక ను ఎలా వొదుల్చుకోగలిగాడు?

వేర్వేరు వ్యక్తులు ఒకేరకమయిన పరిస్థితుల్లో విభిన్నంగా ప్రవర్తించడానికి కారణం ఏమయి వుంటుంది?’

అంటే ఏమిటన్న మాట.

అమ్మాయిలు అలా గాభరా పడడానికి కారణం బొద్దింక కానే కాదు. అనుకోకుండా ఎదురయిన పరిస్తితిని ఎదుర్కోవడానికి వాళ్ల శక్తి యుక్తులు, సామర్ధ్యం సమయానికి అక్కరకు రాలేదని అనుకోవాలి.

ఆనందరావు ఆలోచనలు మరింత వెనక్కు సాగాయి.

‘నాన్న తనపై కేకలు వేసినప్పుడు, బాసు ఆఫీసులో అకారణంగా ఇంతెత్తున యెగిరి పడ్డప్పుడు తన మనసు బాధ పడింది. నిజానికి ఇంత గందరగోళపడడానికి వాళ్ల ప్రవర్తన ఎంత మాత్రం కారణం కాదన్నమాట. ఆ సమయంలో ఆ పరిస్తితిని తట్టుకోవడంలో తన మానసిక సామర్ధ్యం కొరవడడమే కారణం అన్నమాట.’

మనసు కలత పడడానికి, బాధ పడడానికి మనసు కారణం కాదు. తగిన మానసిక ధైర్యంతో పరిస్తితులను వాటికి తగ్గట్టుగా ఎదుర్కోలేకపోవడమే మానసిక వొడిదుడుకులకు కారణం.

రోడ్డుమీద వెడుతుంటా ము. ట్రాఫిక్ జాం లో చిక్కుకోగానే మనసు గందరగోళంలో పడుతుంది. దీనికి కారణం ట్రాఫిక్ జాం అని విసుక్కుంటాము. అంతేకాని ట్రాఫిక్ జాం చూడగానే మనసులో ఏర్పడ్డ గందర గోళాన్ని ఎదుర్కోవడంలో మన వైఫల్యం అని అనుకోము.

సమస్య కంటే కూడా ఆ సమస్యవల్ల కలిగే మానసిక వొత్తిడే మనుషుల్ని ఎక్కువ బాధ పెడుతోంది.

అందుకే, బొద్దింక ను చూడగానే అమ్మాయిలు గాభరా పడ్డారు. వెయిటర్ మాత్రం కుదురుగా ఆ పరిస్తితిని ఎదుర్కున్నాడు.

జీవితంలో ఎదురయ్యే సంఘటనలను చూసి గందరగోళానికి గురికాకూడదు. వాటిని ఎదుర్కోవడం పైనే దృష్టి పెట్టగలగాలి.

క్రియ ప్రతిక్రియ అతి సహజంగా అప్పటికప్పుడు జరిగేవి.

స్పందన ప్రతిస్పందన బుద్ధి సూక్ష్మత వల్ల కలిగేవి.

సమస్య పట్ల రియాక్ట్ కావడం కాదు దాని విషయంలో సరిగా రెస్పాండ్ కావలి. అప్పుడే పరిష్కారం లభిస్తుంది.

బోధి వృక్షం అవసరం లేకుండానే ఆనందరావుకు జ్ఞానోదయం అయింది. (29-09-2011)

NOTE: Image in this blog belongs to owners

28, సెప్టెంబర్ 2011, బుధవారం

వాదించి వగచిన ఏమి ఫలము ? - భండారు శ్రీనివాసరావు



వాదించి వగచిన ఏమి ఫలము ?   - భండారు శ్రీనివాసరావు



తమలపాకుతో నేనిట్లంటే తలుపుచెక్కతో తానిట్లనే



ప్రతి విషయంలో మన వాదనే నెగ్గాలనుకోవడం అవివేకం. కొన్ని కొన్ని విషయాలు మనకు నచ్చకపోవచ్చు. మనకు నచ్చినవి ఎదుటివారికి నచ్చకపోవచ్చు. వాటిని అంగీకరించనంతమాత్రాన పుట్టేమీ మునిగిపోదు.అంగీకరించినంత మాత్రాన నట్టేటిలో కొట్టుకుపోము.  సాటివారితో సర్దుకుపోవడం, సిద్ధాంతాలతో రాజీపడకపోవడం అన్నదే ప్రధానం.

ONE CAN COMPROMISE WITH PERSONS BUT NOT WITH PRINCIPLES.

మొండి వాదనల వల్ల వచ్చేదేమీ  వుండదు - మొండి మనిషన్న  చెడ్డ పేరు రావడం తప్పిస్తే.

(28-09-2011)

(ఇమేజ్ సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత)   

26, సెప్టెంబర్ 2011, సోమవారం

ఆటో నెంబర్ – MH 02 Z 8508 - భండారు శ్రీనివాసరావు





ఎక్కగానే తెలిసిపోయింది మాకు అది అలాటిలాటి అల్లాటప్పా ఆటో కాదని.





మేము కూర్చున్న సీటు ఎదురుగా విమానంలో అమర్చినట్టు ఓ సంచీలో కొన్ని పత్రికలు కనిపించాయి. మాముందు ఓ చిన్న టీవీ సెట్టు వుంది. అందులో కేవలం దూరదర్శన్ కార్యక్రమాలు మాత్రమే పెడతానని డ్రైవర్ చెప్పాడు.


ఆటో ఎక్కిన నాకూ నా భార్యకూ కాసేపు ఆశ్చర్యంతో మాటలు పెగల్లేదు, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, డెట్టాల్, దూది కొన్ని మందులు అందులో చూసిన తరువాత.


అంతే కాదు. టీవీ తో పాటు రేడియో, వాల్ క్లాక్, చిన్నపాటి మంటలను అదుపు చేసే పరికరం, కేలండర్, ఇలా చాలా కనిపించాయి. వివిధ మతాలకు చెందిన సింబల్స్ తో పాటు ముంబై ఉగ్రవాదుల దాడిలో హీరోలు గా పేరుతెచ్చుకున్న కామ్టే, కర్కరే, సలాస్కర్, ఉన్నికృష్ణన్ ల ఫోటోలు వున్నాయి.



మేమెక్కిన ఆటోనే కాదు దాని డ్రైవర్ కూడా కొన్ని ప్రత్యేక లక్షణాలున్నవాడని కొద్ది సేపటిలోనే మాకు తెలిసివచ్చింది.


దారిలో మెల్లగా అతడితో మాటలు కలిపాను. ముందు నా మాటల్లో ధ్వనించిన వ్యంగాన్ని నేను గుర్తించక పోలేదు. కానీ ఆ వెటకారం కాసేపటిలోనే ఆవిరై పోయింది. దాని స్తానంలో అతడిపట్ల తెలియని గౌరవభావం చోటుచేసుకుంది.



హీరోలకే హీరో సందీప్ బచ్చే


ఆ ఆటో రిక్షా డ్రైవర్ పేరు సందీప్ బచ్చే. పెద్దగా చదువుకోలేదు. అందుకే ఓ చిన్న ప్లాస్టిక్ ఫాక్టరీ లో చిన్న ఉద్యోగంలో కుదిరాడు. దురదృష్టం. ఆ ఫాక్టరీ ఎన్నో రోజులు నడవలేదు. అది మూతపడడంతో సందీప్ రోడ్డున పడ్డాడు. కాకపొతే కిరాయి ఆటోతో. ఆటో నడుపుతుండగానే పదేళ్లు గడిచిపోయాయి. ఈ క్రమంలో కిరాయి ఆటో బదులు సొంత ఆటో నడుపుకునే స్తితికి చేరాడు. ఇద్దరు పిల్లల్నీ స్కూల్లో చేర్చాడు. బతుకు బండి ఓ గాటన పడింది. కానీ అతడు బాట తప్పలేదు. కష్టపడడం మానలేదు. ఉదయం ఎనిమిది గంటలకు ఆటో ఎక్కితే మళ్ళీ ఇంటికి చేరేది రాత్రి పది తర్వాతనే.

“ఇంట్లో వుండి చేసేది ఏమిటి సార్ టీవీ చూడడం తప్పితే. అదే ఆటో పని చేసుకుంటూ నాలుగు డబ్బులు సంపాదిస్తే ముందు ముందు పనికొస్తాయి కదా!” అంటాడు అతగాడు.

నిజమే పనికొస్తాయి. తన కోసం కాదు సమాజంలో తనకంటే ఆర్ధికంగా వెనకబడ్డ వాళ్ళ కోసం. ఎంత చక్కటి ఆలోచన.


మాకర్ధమయింది మాకు పరిచయం అయిన వ్యక్తి మామూలు మనిషి కాదని. పని విలువ, జీవితం విలువ తెలిసిన ముంబై నగరానికి అసలు సిసలు ప్రతినిధి అని.

తేనెటీగ లాగా పనిచేసే అతడికి తీరుబాటు సమయం అంటూ ఏమయినా వుందా? వుంటుందా? అదే అడిగాను.

కాస్త మొహమాట పడుతూనే జవాబు చెప్పాడు.

వారానికోసారి అంధేరీలోని వృద్ధ మహిళల ఆశ్రమానికి వెడతాడు. అదనంగా ఏదయినా ఆదాయం లభిస్తే వారికి అవసరమయిన టూత్ బ్రష్ లు, సబ్బులు, తలనూనెలు మొదలయినవి కొనుక్కుని తీసుకువెడతాడు.

ఆటో దిగుతుంటే కళ్ళబడింది.


 


ఆటో మీటర్ కింద ఇలా రాసి వుంది.

“వికలాంగులకు మీటర్ చార్జి లో పాతిక శాతం రాయితీ. యాభయి రూపాయల వరకు అంధులకు ఆటో ప్రయాణం ఉచితం.”

నాకూ మా ఆవిడకు అతడు ఆటో డ్రైవర్ లాగా కనిపించలేదు. నిజంగా అతడొక హీరో.

మా ప్రయాణం ముగిసింది. ఆ నలభై అయిదు నిమిషాల్లో జీవితం గురించిన కొత్త కోణం మాముందు ఆవిష్కృతమైంది. హీరోలు సినిమాతెరలపైనే కాదు నిజ జీవితాల్లోనూ తారసపడతారు. నిజానికి నిజమయిన హీరోలు సందీప్ బచ్చే లాటి వాళ్ళే.

ఈసారి ఎప్పుడయినా ముంబై వెడితే ఆ ఆటో నెంబర్ గుర్తు పెట్టుకోండి.

-MH 02 Z 8508-


“లక్ష మంది మొహాల్లో నవ్వులు పూయడానికి కారణం కండి. ఒక్కరి వేదనకు కూడా కారణభూతులు కాకండి.” సందీప్ వల్ల మేము నేర్చుకున్న జీవిత సత్యం ఇదే.


(నెట్లో సంచరిస్తున్న ఒక ఆంగ్ల వ్యాసానికి స్వేఛ్చానువాదం – భండారు శ్రీనివాసరావు ) 

ఇందులో ఉపయోగించిన ఫోటోల సొంతదారులకు కృతజ్ఞతలు - రచయిత