కిరణ్ కుమార్ రెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కిరణ్ కుమార్ రెడ్డి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

12, మార్చి 2021, శుక్రవారం

పదేళ్లనాటి మాటే అయినా నిత్య సత్యం – భండారు శ్రీనివాసరావు

 


అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి

వార్త

ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి. (25-11-2011)

 

ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”

సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.” 

“మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం”

(2011 నవంబరులో ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)

వ్యాఖ్య

“కుఠార మాలికాం దృష్ట్యా

కంపంతతి తరోవనే!

తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్

మామకోనాస్తి కిం భయం”

ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:

“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.

“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”

(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)

 

18, జులై 2013, గురువారం

భార్య (చెప్పిన) రహస్యం


ప్రధమ కబళే మక్షికాపాతః
అంటే మొదటి ముద్దలోనే ఈగ పడింది అని అర్ధం.
ముందు అంటే పైన అనికాదు, ఈ వ్యాసం శీర్షికలో ముందు బ్రాకెట్లో రాసిన పదం ‘చెప్పిన’ అని లేదు. రాసిన తరువాత చూసుకుంటే, చూడ్డం మంచిదయింది లేకపోతే పుట్టి పూర్తిగా మునిగేది అన్న జ్ఞానోదయం అయింది.  దాంతో తెలివినపడి అర్జంటుగా ముందో  బ్రాకెట్టు పెట్టి అందులో ‘చెప్పిన’ అనే పదాన్ని కూరిపెట్టి, ‘భార్య రహస్యం’ ఏవిటి అనే దిక్కుమాలిన అనుమానాలు తలెత్తి సంసారపు పుట్టి నిండా మునగకుండా నిండుదా  జాగ్రత్త పడ్డాను.
ఇంతకీ అసలు విషయం ఏవిటంటే, మా ఆవిడ నిన్న సాయంత్రం బయట వర్షం పడుతుండగా లోపల కరెంటులేని కారణంగా  టీవీ సీరియల్ చూసే అవకాశం బొత్తిగా లేక  నాతో మాటవరసకు మాటలు కలిపి వాటి మధ్యలో ఒక తూటా పెట్టి  పేల్చింది. ఆ మాట  అన్నది మా ఆవిడ కాబట్టి, ఆ సమయంలో ఎవరు లేరు కాబట్టి సరిపోయింది. అదేవిటో ఈ భార్యామణులు  ఉన్నట్టుండి తమ తమ మొగుళ్ళను ఎవరితోనో ఒకరితో పోల్చి తమ ఈగోను చల్లార్చుకుంటూ ఉంటారని ఆడవాళ్ళంటే వోర్చుకోలేని ఒకాయన చెప్పాడు కూడా.  సాధారణంగా, పక్కింటాయనతోనో, ఎదురింటాయనతోనో పోల్చి ‘మీరూ వున్నారు ఎందుకూ...’ అని సన్నాయినొక్కులు నొక్కడం పరిపాటి. కానీ ఈసారి మా ఆవిడంబాళ్ళు నన్ను పోల్చి చెప్పింది అట్లాంటిట్లాంటి అల్లాటప్పా వాళ్ళతో కాదు.  సాక్షాత్తు  ‘ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిగారికీ  మీకూ  తేడా ఏమీ  కనబడడం లేదండీ’ అనేసింది. అమ్మ భడవఖానా. నన్నంటే ఏదో మొగుడుముండావాడ్ని సరిపుచ్చుకుంటాను కాని నన్ను ముఖ్యమంత్రితో పోల్చడం, కాదు కాదు ముఖ్యమంత్రిని నాతొ పోల్చడం  ఏవిటి అసాధ్యం కూలా అనుకున్నాను.
ఏవిటో అనుకున్నాకాని ఆమె లాజిక్కు ఆమెకు వుంది.
“కిరణ్  కుమార్ రెడ్డి గారి లాగే  నేను మొండివాడ్ని. కాదు నాలాగే ఆయన మొండివాడు. ఎవరి మాటా వినడు.
“ఎవరు ఏమైనా  పరవాలేదు తన మాటే నెగ్గాలి అనే  తరహా.
“అన్ని ధరలు పెరిగాయి కాస్త నెల బడ్జెట్ పెంచవయ్యా మగడా అంటే కుదరదంటే కుదరదని తెగేసి చెప్పేరకం.
“మీరు బయట టీవీల్లో మాట్లాడ్డం తప్పిస్తే ఇంట్లో వాళ్ళతో ఓ మాటా వుండదు ఓ ముచ్చటా వుండదు. ఆయన్ని గురించి వాళ్ళ పార్టీ వాళ్ళదీ అదే గోల”
“అందుకే మీకూ ఆయనకూ తేడాలేదనేది” అనేసింది పేపరు మడిచి పక్కనపడేస్తూ.   
ఇంకేం అనను? అనాల్సింది అంతా తానేఅనేసిన తరువాత. (18-07-2013)

25, నవంబర్ 2011, శుక్రవారం

కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు



కర్ర లేకపోతే గొడ్డలేం చేస్తుంది? - భండారు శ్రీనివాసరావు  
వార్త
ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ‘ఈనాడు-ఈటీవి’ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఒక  ప్రశ్న, దానికి సమాధానం ఇలా వున్నాయి.
ప్రశ్న: “పీసీసీ అధ్యక్షునితో ఎలాంటి సంబంధాలున్నాయి?”
సమాధానం: “బాగున్నాయి. కాంగ్రెస్ దానంతట అది వోడించుకుంటుంది తప్ప వేరే పార్టీకి కాంగ్రెస్ ని వోడించే బలం లేదు.”  మేమంతా ఐకమత్యంగా ఉంటేనే తిరిగి గెలుస్తాం.
(నవంబరు శుక్రవారం నాడు ఈనాడు దినపత్రిక లో ప్రచురించిన ముఖ్యమంత్రి  ఇంటర్వ్యూ)
వ్యాఖ్య
“కుఠార మాలికాం దృష్ట్యా
కంపంతతి తరోవనే!
తత్ర వృద్ధ తరుహ్  ప్రాహుహ్
మామకోనాస్తి కిం భయం”
ఈ సంస్కృత శ్లోకానికి  తెలుగు అనువాదం:
“ఒకడు పది గొడ్డళ్లను, వాటిని మాలగా గుచ్చి, భుజాన వేసుకుని తన వూరికి, ఒక అడవి దోవగుండా వెళ్తున్నాడు. అడవిలో కుర్ర చెట్లు ఇది చూసి హడలిపోయాయి. అది చూసి, ఒక వృద్ధ వృక్షం “ఎందుకర్రా అట్లా హడలిపోతున్నారు! ఆ గొడ్డళ్ళు  మనలనేం చేస్తయ్యి! వాటిలో మన వాడు (కర్ర) లేడు గదా!” అని అభయం ఇచ్చింది.
“అదీ కాంగ్రెస్ వాళ్లు పొందికగా కూర్చుని నేర్వవలసిన పాఠం.”
(కలం కూలీగా తనను తాను అభివర్ణించుకున్న ప్రముఖ జర్నలిస్ట్ కీర్తిశేషులు శ్రీ జి. కృష్ణ రాసిన ‘అప్పుడు –ఇప్పుడు’ గ్రంధం నుంచి)
25-11-2011                         

30, సెప్టెంబర్ 2011, శుక్రవారం

కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా! - భండారు శ్రీనివాసరావు




కిరణ్ ప్రభుత్వ వైఫల్యాలకు కారణం అధిష్టానమా! – స్వయంకృతమా!

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి
          

ముప్పయ్యేళ్ళ కిందటి మాట.

ముఖ్యమంత్రిగా వున్న మర్రి చెన్నారెడ్డిని మార్చి ఆయన స్తానంలో టి.అంజయ్యను కాంగ్రెస్ అధిష్టానం నియమించింది. అంజయ్యను ఆ పదవికి ఎంపిక చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలలో అనేకమందికి ఇష్టం లేదు. అయినా వారి ఇష్టాఇష్టాలతో నిమిత్తం లేని అధిష్టానం తన ఇష్ట ప్రకారమే నడుచుకుంది. నాటి ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి ఇందిరా గాంధీకి ఎదురు చెప్పే ధైర్యం ఎవరికి వుంటుంది కనుక. ఆ మాటకు వస్తే అధిష్టానానికి సంబంధించినంతవరకు కాంగ్రెస్ లో ఈ నాటికీ అదే పరిస్తితి.

అంజయ్య పాలన తొలిదినాల్లోనే అసమ్మతి సెగలు బయలుదేరాయి. ఈ సంగతి ఆ నోటా ఈ నోటా పడి చివరకు అధినేత్రి చెవుల్లో పడింది. అసమ్మతిని మొగ్గలోనే తుంచేయాలని భావించిన ఇందిరా గాంధి వున్నపాటున హైదరాబాద్ వచ్చారు. సంప్రదాయానికి భిన్నంగా, పార్టీ లెజిస్లేటర్ల సమావేశాన్ని ఏకంగా ముఖ్యమంత్రి అధికార నివాసం జయ ప్రజాభవన్ (గ్రీన్ లాండ్స్ అతిధి గృహం) లోనే ఏర్పాటు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ అతిరధులంతా ఆ సమావేశానికి హాజరయ్యారు. అంజయ్యకు అధిష్టానం అండగా వుందన్న సంకేతాన్ని ఆ విధంగా పార్టీ శ్రేణులకు శ్రీమతి గాంధి అందించారు. అంతే! కొన్నేళ్లవరకు అసమ్మతివాదులు కిమ్మిన్నాస్తి.

మూడు దశాబ్దాల తరవాత మళ్ళీ రాష్ట్రంలో అవే పరిస్థితులు. ముఖ్యమంత్రి పై మంత్రుల ధిక్కార ధోరణి. సాటి మంత్రులపై తోటి మంత్రులే అవినీతి ఆరోపణలు చేసే పరిస్తితి. మంత్రులతో పాటు ఎమ్మేల్యేలది కూడా అదే వరస. కానీ నాటి ఇందిరలా రాజకీయ దృఢచిత్తంతో వ్యవహరించలేని అశక్తతలో నేటి అధిష్టానం.



మూడు దశాబ్దాల కాలంలో వచ్చిన ఈ మార్పుకు అనేక కారణాలు.

హెలికాఫ్టర్ ప్రమాదంలో రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఢిల్లీ పెద్దలు, వయసులో, అనుభవంలో పెద్ద అయిన రోశయ్యకు తాత్కాలిక ప్రాతిపదికపై ప్రభుత్వ పగ్గాలు అప్పగించారు. ఆయన కూడా చాలా రోజులు ముఖ్యమంత్రి పదవి తాత్కాలికమనే భావనలోనే రోజులు వెళ్ళబుచ్చారు. భేషజానికి పోకుండా ఆయన పలు సందర్భాలలో ఈ విషయాన్ని బాహాటంగానే ఒప్పుకున్నారు.

వైఎస్సార్ దుర్మరణానికి కారణమయిన ప్రకృతి ప్రకోపం రోశయ్య పాలన తొలిరోజుల్లో కూడా కొనసాగింది. వర్షాలు, వరదలకు తోడు జగన్ రూపంలో బయటపడిన పార్టీలోని చీలికలు. ఈ చీకాకులకు అదనంగా టీ.ఆర్.ఎస్. ఆధ్వర్యంలో తెలంగాణా ఉద్యమం బాగా వూపందుకోవడం - పరిపాలనపై, పార్టీపై ప్రభావం చూపింది. వెరసి, తాత్కాలిక ప్రాతిపదికపై శాశ్వితంగా కొనసాగుతారనుకున్న రోశయ్యను అర్ధాంతరంగా మార్చే పరిస్తితులు తలెత్తాయి.

ఈ పరిణామాలు సీ.ఎం. మార్పిడి దిశగా అధిష్టానాన్ని అడుగులు వేయించాయి. తెలిసి చేశారో, తెలియక చేశారో కాని వైఎస్సార్ మంత్రివర్గంలో పనిచేసిన వారికెవ్వరికీ అవకాశం ఇవ్వకుండా అసెంబ్లీ స్పీకర్ గా వున్న కిరణ్ కుమార్ రెడ్డి ని ఇందుకు ఎంపిక చేశారు. వై.ఎస్.తో సాన్నిహిత్యం కలిగిన గాలి జనార్ధన రెడ్డి వ్యవహారం భవిష్యత్తులో చంచల్ గూడా జైలు దాకా వెడుతుందని తెలిసే వై.ఎస్. మంత్రులెవ్వరికీ రోశయ్య స్తానంలో ముఖ్యమంత్రి పదవి అప్పగించలేదని భాష్యం చెబుతున్నవాళ్ళు కూడా వున్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి కిరీటం పెట్టడం రాష్ట్ర కాంగ్రెస్ లో చర్చనీయాంశం అయినప్పటికీ అధిష్టానం సంగతి తెలిసిన వారికెవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు.

ఎందుకంటె, ఢిల్లీలో అధిష్టానదేవత చుట్టూ చుట్టుకునివుండి చిల్లర దేవుళ్లు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాలు చూడడానికి తెగ ఉత్సాహపడుతుంటారని రాజధానిలో ప్రతీతి. చూస్తూ చూస్తూ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిపై పెత్తనం చేసే మహత్తర అవకాశాన్ని వాళ్లు వొదులుకోలేరు. ఈ ఒక్క విషయంలో మాత్రం జాతీయ పార్టీలయినా, ప్రాంతీయ పార్టీలయినా వాటి అధినాయకత్వం తీరూ, తరహా ఒకే విధంగా వుంటుంది. జాతీయ పార్టీలు తమ ముఖ్య మంత్రులతో వ్యవహరించే పధ్ధతి, ప్రాంతీయ పార్టీలు తమ జిల్లా పరిషత్ అధ్యక్షులతో వ్యవహరించే విధానం ఒకే రీతిలో వుంటాయన్నది జగమెరిగిన సత్యం.

అయితే వైఎస్సార్ విషయంలో అధిష్టానం కొంత పట్టువిడుపుల ధోరణి అవలంబించింది. కేంద్రంలో సంకీర్ణ





ప్రభుత్వాన్ని నిర్వహించే క్రమంలో కాంగ్రెస్ నెత్తికెత్తుకున్న కొత్త బాధ్యతలు రాజశేఖరరెడ్డికి ఓ మేరకు

కలసివచ్చాయి. జాతీయ స్తాయిలో కుదురుకోవడానికి వారికి కూడా రాజశేఖరరెడ్డి వంటి ‘అన్నింటా సమర్ధుడయిన’ ఒక ప్రాంతీయ నాయకుడు అవసరమన్న వాస్తవాన్ని ఢిల్లీ పెద్దలు కూడా గుర్తించారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని విజయపధంలో నడిపించిన రాజశేఖరరెడ్డిని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకోలేని దైన్య స్తితి పార్టీ అధిష్టానానిది. ఆ ఎన్నికలకు ముందు చేసిన పాదయాత్రతో, టీడీపీ పాలనకు వ్యతిరేకంగా నిర్వహించిన ఆందోళనలతో ఒక రకంగా ఆయన ముఖ్యమంత్రి పదవిని ముందుగానే రిజర్వ్ చేసుకున్నారనే అనుకోవాలి. వై.ఎస్. ముఖ్యమంత్రిగా వున్న మొదటి అయిదేళ్ళ కాలంలో ఆయన్ని మార్చాలని రాష్ట్రం లోని ఆయన వ్యతిరేకులు, అసమ్మతివాదులు కలసికట్టుగా ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా అధిష్టానం ఆ సాహసానికి పూనుకోలేదు. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఇందిరాగాంధి వ్యవహార శైలికి, సోనియా గాంధి పని తీరుకు పోల్చి చూపిస్తూ జాతీయ మీడియాలో వెలువడిన సోనియా అనుకూల కధనాలు కూడా - ముఖ్యమంత్రులను మార్చే విషయంలో ఆమె కాస్త గుంజాటన పడడానికి దోహదం చేసి వుండవచ్చు. కానీ, మరోసారి అత్తెసరు మెజారిటీతో రెండో పర్యాయం కేంద్రంలో యూ.పీ.యే. ఆధ్వర్యంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత కాంగ్రెస్ అధిష్టానం వైఖరిలో కొంత మార్పువచ్చింది. కాని, వైఎస్సార్ మరణం వరకు అది బయట పడలేదు. తదనంతర పరిణామాలను తనకు అనుకూలంగా మార్చుకుంటూ రాష్ట్ర ముఖ్య మంత్రిపై వెనుకటి పట్టు బిగించాలన్న కోరిక ఢిల్లీ పెద్దలలో కలిగినట్టు వుంది. అది నెరవేర్చుకునే క్రమంలో జరిగిన పరిణామాలే ఈనాటి కాంగ్రెస్ దుస్తితికి కారణమయ్యాయి.

అనుభవశాలి అయిన రోశయ్యను తప్పించడానికి అధిష్టానం చెప్పిన కారణం ఆయన వయో భారం. ఆ కారణాన్ని కూడా ఆయన చేతనే చెప్పించారనుకోండి. అది ఢిల్లీ పెద్దల జాణతనం.

వృద్ధుడయిన రోశయ్య స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రి స్తానంలో కూర్చోబెట్టారు. ఆయన యువకుడే కాదు విద్యాధికుడు కూడా. ముఖ్యమంత్రి అయిన కొత్తలో అధికారులతో వ్యవహరించిన తీరు, మంత్రుల శాఖల పంపిణీలో సీనియర్లను సైతం స్వతంత్రించి పక్కనబెట్టడం ఇవన్నీ చూసి ఆయనకు అధిష్టానం మద్దతు పూర్తిగా వుందనీ, స్వేచ్చగా వ్యవహరించి పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలను ఒక గాడిలో పెడతారని ఆశ పడ్డవాళ్ళు వున్నారు.

కానీ, రోజులు గడుస్తున్న కొద్దీ ఈ అభిప్రాయం నీరు కారిపోవడం మొదలయింది. కొత్త ముఖ్యమంత్రి పార్టీ, ప్రభుత్వాలపై పట్టు సాధించి పదవిని పదిలం చేసుకుంటారని ఆశించిన వారికి ఆశాభంగమే మిగిలింది. అవినీతి రహిత పాలన అందించాలన్న సదుద్దేశంతో మొదలు పెట్టిన విధాన సంస్కరణలు వై.ఎస్.ఆర్. ప్రారంభించిన



సంక్షేమ పధకాలకు గొడ్డలి పెట్టుగా తయారయ్యాయి. వై.ఎస్.ఆర్. ఇప్పడు జీవించి వున్నా వీటిల్లో వున్న కొన్ని లొసుగులను సరిదిద్దాల్సిన బాధ్యత ఆయనపై కూడా పడేది. కానీ, కొందరు అధికారుల అవాంచిత, అనాలోచిత చొరవల కారణంగా ఆ పధకాలను కిరణ్ ప్రభుత్వం కావాలనే అటకెక్కిస్తున్నదన్న భావన ఆ పధకాల లబ్ధిదారుల్లో బలంగా చొచ్చుకుపోయింది. ఈ ప్రచారాన్ని అడ్డుకునే ప్రయత్నం అటు మంత్రులు కానీ, ఇటు అధికారులు కానీ సమర్ధవంతంగా చేయకపోవడం వల్ల రాజకీయ ప్రత్యర్ధులకు అది ఒక ఆయుధంగా అంది వచ్చింది. ముఖ్యమంత్రి ఒక రాజకీయ పార్టీ నాయకుడి మాదిరిగా కాకుండా ఐ.ఏ.ఎస్. అధికారి లాగా వ్యవహరిస్తున్నారన్న భావన కూడా పార్టీ వర్గాల్లో ప్రబలడానికి ఆయన వ్యవహారశైలి కొంత మేరకు దోహదం చేసింది. ఏఒక్క విషయంలోనూ తమను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న దురభిప్రాయం సీనియర్ మంత్రుల్లో ప్రతిఒక్కరికీ కలిగింది. ఖాళీగావున్న అసంఖ్యాక పదవులను పంపిణీ చేసి పార్టీ శ్రేణులను పటిష్టపరిచే చర్యలు లేకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులకు పార్టీ కార్యక్రమాలపట్ల ఆసక్తి లేకుండా పోయింది. సాధారణంగా పదవుల పంపిణీ వ్యవహారం పార్టీలో అసమ్మతికి దారితీస్తుందనే అభిప్రాయం వుంది. అయితే, ఎన్నికలు సుదూరంలో వుండి, అధిష్టానం ఆశీస్సులు పుష్కలంగా వున్నప్పుడు అసమ్మతికి భయపడాల్సిన పరిస్తితి ముఖ్యమంత్రికి వుండదు.

కిరణ్ కుమార్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడానికి అధిష్టానం పరిగణన లోకి తీసుకున్న యువకుడు, విద్యాధికుడు అన్న రెండు అంశాలను – రుజువు చేసుకోవడంలో ఆయన వైఫల్యం చెందారనే అనుకోవాలి. ఆయనకు ముందు ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి వ్యవహార శైలితో పోల్చి చూసుకుని కిరణ్ పని తీరును అంచనావేయడం సహజంగా జరుగుతుంది. రాష్ట్రంలో ఎక్కడ ఏ విపత్తు సంభవించినా, ఏ చిన్న సంఘటన జరిగినా - వారిద్దరూ తక్షణం హెలికాప్టర్ లో రెక్కలు కట్టుకుని వాలిపోయేవారు. ఇలా చేయడం వల్ల సమస్యలు పరిష్కారమవుతాయా అన్నది సందేహమే. కానీ, ఈ ఆకస్మిక పర్యటనల ద్వారా వారిరువురికీ ప్రజాదరణ అనే రాజకీయ లబ్ది లభించింది. ప్రజలకు సంబంధించిన ప్రతి అంశం పట్ల వెంటనే స్పందిస్తారన్న నమ్మకం జనంలో ఏర్పడింది. యువకుడయిన కిరణ్ కుమార్ రెడ్డి ఈ విషయంలో అధిష్టానం తన మీద వుంచిన భరోసాను నిలబెట్టుకోలేకపోయారనే చెప్పాలి. ఇటీవలి కాలాన్ని మినహాయిస్తే , ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తరవాత ఆయన ఎక్కువ సమయం సచివాలయంలో, సీ.ఎం. క్యాంప్ కార్యాలయంలోనే గడుపుతూ వచ్చారు. అధికారులతో సమీక్షా సమావేశాలు జరుపుతూ పాలన సాగిస్తున్నారని ఆయన పార్టీవారే ఎద్దేవా చేస్తుంటారు. క్షేత్ర స్తాయిలో సమాచారం తెలుసుకోవడానికి ఆయన అధికారులమీదనే ఎక్కువ ఆధారపడతారని కాంగ్రెస్ నాయకులు బాహాటంగానే చెబుతారు. చంద్రబాబు, వై.ఎస్.ఆర్. లకు



సమర్దులయిన పేషీ అధికారులు వుండేవారు. ముఖ్యమంత్రి ఆదేశాలు ఖచ్చితంగా అమలయ్యేలా వారు శ్రద్ధ తీసుకునేవారని, కిరణ్ కుమార్ రెడ్డి విషయంలో ఇది మరో ప్రధానమయిన లోటని కాంగ్రెస్ వర్గాలు చెబుతుంటాయి. సీనియర్ల నుంచి ఆశించిన రీతిలో సహకారం లభించకపోవడం, జగన్ సానుకూల ఎమ్మెల్యేలపై చర్య తీసుకునే విషయంలో అధిష్టానం తాత్సార వైఖరి అవలంబించడం, తెలంగాణా కారణంగా అన్ని పార్టీల్లో మాదిరిగానే కాంగ్రెస్ లో లుకలుకలు ఏర్పడడం – ఇవన్నీ కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వ నిష్క్రియాపరత్వానికి కారణాలుగా పేర్కొంటూ వుంటారు. కానీ ఇవి వాదనకు నిలబడే విషయాలు కావు. ఇలాటివన్నీ, ఏదో ఒక రూపంలో ప్రతి ముఖ్య మంత్రీ ఎప్పుడో ఒకప్పుడు ఎదుర్కొనక తప్పని సమస్యలే.

నిజానికి ఆయన మంచి సమయంలో ముఖ్యమంత్రి అయ్యారు. చిన్న వయస్సులో అధిష్టానం ఆయనకు పెద్ద పదవిని అయాచితంగా అప్పగించింది. ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వున్న తరుణంలో ముఖ్యమంత్రి కావడం వల్ల అనుకున్న పనులు అనుకున్న వ్యవధిలో పూర్తిచేసే అవకాశం వుంటుంది. పైగా అధిష్టానం మద్దతు పూర్తిగా వుంది. ఏ కాంగ్రెస్ ముఖ్యమంత్రికయినా ఇది గొప్ప వరం. రాజశేఖరరెడ్డి ఈ వరాన్ని సంపూర్తిగా సద్వినియోగం చేసుకున్నారు. అటు ఢిల్లీ పెద్దలను మెప్పించడంలో, ఇటు రాష్ట్రంలో రాజకీయంగానే కాక ఇతరత్రా పునాదులు గట్టి పరచుకోవడంలో ముఖ్యమంత్రి పదవిని చాలా చక్కగా వినియోగించుకున్నారు. ఎన్నెన్ని అవినీతి ఆరోపణలు వెల్లువెత్తినా సామాన్య ప్రజలను దృష్టిలో వుంచుకుని రూపకల్పన చేసిన సంక్షేమ పధకాలు వై.ఎస్.ను తిరుగులేని ప్రజాకర్షణ కలిగిన నాయకుడిగా నిలబెట్టాయి. ఈ నేపధ్యంలో సంభవించిన దురదృష్టకర మరణం వై.ఎస్.ఆర్. ను సామాన్యుల మనస్సుల్లో చిరంజీవిని చేసింది. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోకుండా, వై.ఎస్.జగన్ ను అడ్డుకునే క్రమంలో వై.ఎస్, పాలనను తప్పుబడుతూ చేసిన కాంగ్రెస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. అవి ప్రత్యర్ధికి కలసి వచ్చాయి.

మరో అయిదు వారాల్లో అంటే నవంబర్ 24 నాటికి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తవుతుంది. గత ఏడాది కాలంలో ఆయన సాధించింది పూజ్యమనే చెప్పాలి. జనాలకు పనికొచ్చే పాత పధకాలు పక్కన పెట్టడమే కాకుండా పేరుకయినా ఒక్కటంటే ఒక్క సంక్షేమ పధకం కూడా ఆయన హయాంలో శ్రీకారం చుట్టుకోలేదు. క్యాబినెట్ సమావేశం నిర్వహించడమే గగనంగా మారిన రోజులు కిరణ్ పాలనలోనే కాంగ్రెస్ కళ్ళచూస్తోంది.

ఇప్పుడిప్పుడే ఈ అంశాలనన్నింటినీ కిరణ్ కుమార్ రెడ్డి పరిగణన లోకి తీసుకుంటున్నట్టు కానవస్తోంది. నిరుద్యోగ యువతను ఆకట్టుకోవడానికి ఆర్భాటంగా చేస్తున్న పధకాల ప్రకటనలే ఇందుకు సాక్ష్యం.

అయితే, ఇంకా మించిపోయిందేమీ లేదు. నిండా రెండేళ్ళ వ్యవధానం వుంది. మరో విషయం ఆలోచించకుండా పరిపాలనపై పట్టు బిగించగలిగితే చాలు అద్భుతాలు సృష్టించలేకపోయినా మీద పడ్డ విమర్శలను కొంత మేరకయినా తొలగించుకోవచ్చు. నిజమే. ఇప్పడు ఆయన ఎదుర్కుంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. కానీ, నమ్మి అధికారం వొప్పగించిన ప్రజల సమస్యల మాటేమిటి? ప్రజలకు సమస్యలను దూరం చేస్తే వారు పాలకులకు దగ్గరవుతారు. ఇది చరిత్ర చెప్పే సత్యం.

పదవి తాత్కాలికం అనుకున్నప్పుడు పదిమందికి శాశ్వితంగా పనికొచ్చేపనులు పదవిని లెక్కచేయకుండా ధైర్యంగా చేయడానికి వీలుంటుంది. పదవినే శాశ్వితం చేసుకోవాలనుకున్నప్పుడు నలుగురికీ పనికొచ్చే పనులు చేయడానికి అవసరమయిన సంకల్పం కొరవడుతుంది.

ఇది గమనంలో పెట్టుకునే పాలకులకు సమర్ధవంతమయిన పాలన సాగించేందుకు మార్గం సులువవుతుంది. (29-09-2011)

11, మార్చి 2011, శుక్రవారం

వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు

వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ!– భండారు శ్రీనివాసరావు


‘అసలేంజరుగుతోంది?’ - ఒక కేసుకు సంబంధించి, దేశంలో పరిస్తితులపై అత్యున్నత న్యాయస్తానం సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్య ఇది.

గత కొద్దిమాసాల పాత పేపర్లు తిరగేసినా, టీవీ చర్చలు పునశ్చరణ చేసుకున్నా – సామాన్య జనానికి సయితం మనసులో మెదిలే ప్రశ్న ఇదే.

ఎంత చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండుమార్లు సరయిన సమయం చూపిస్తుంది. అలాగే ఎంత చెడిపోయిన రాజకీయపార్టీకయినా ఏవోకొన్ని సిద్ధాంత మూలాలుంటాయి. కొన్ని స్తిరమయిన భావజాలాలుంటాయి.కానీ ఈనాడు దాదాపు అన్ని రాజకీయపార్టీలు తమ సిద్ధాంతాలకు చెల్లు చీటీ రాసినట్టే కానవస్తోంది.

అలాగే అన్ని రాజకీయ పార్టీలకు, పేరు ఏదయినా అధిష్టానం అంటూ ఒకటుంటుంది. ‘అంతర్గత ప్రజాస్వామ్యం మా పార్టీలో ఎక్కువ’ అని గొప్పలు చెప్పుకునే పార్టీలలో కూడా ఎవరూ నోరెత్తి అధిష్టానాన్ని బాహాటంగా ఎగర్తించే సాహసం చెయ్యరు. కానీ ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చోటామోటా నాయకులు సయితం తమ పార్టీ అధినాయకులను విలేఖరుల ముందే పూచికపుల్లలుగా తీసివేస్తున్నారు. ‘ఔరా! వీరికెంత ధైర్యం!’ అని నలుగురూ అనుకునేలా నలుగురిముందే తమ నాయకులను చెరిగి పారేస్తున్నారు.

నాయకురాలి జాతీయతను ప్రశ్నించినా, నాయకుడి రెండు కళ్ళ విధానాన్ని విమర్శించినా ఇదేరకమయిన తెగింపు. ఏం చేస్తారులే అనే ధైర్యం.

ఏకంగా పార్లమెంటును, శాసన సభను వేదికగా చేసుకుని తిరుగుబాటు బావుటాను ఎగురవేస్తూ, సొంత పార్టీనే నగుబాటు చేసినా ఏం కాదన్న ధీమా.

అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ ధిక్కార స్వరాన్ని బాహాటంగా వినిపించినా పోయేదేమీలేదన్న మొండితనం.

రాష్ట్రం రెండు ముక్కలవుతుందా మూడు చెక్కలవుతుందా తేలే రోజు ఎప్పుడో తేలకముందే పార్టీలన్నీ రెండుముక్కలుగా పైనుంచి కిందవరకూ చీలిపోయాయి. ప్రాంతాల విషయం వచ్చేసరికి ఎవరికీ పార్టీల సంగతి పట్టడం లేదు. విధానాల సంగతి గుర్తు రావడం లేదు. పార్టీలు వేరయినా మాట్లాడేది ఒక్కటిగానే వుంటోంది. ఎదుటి వారిని చీల్చి చెండాడడానికి నాలుకలన్నీ ఒక్కటవుతున్నాయి. విద్వేషాగ్నులు రగల్చడానికి, నిందారోపణలు చేయడానికి సొంత పార్టీ వారు, పరాయి పక్షం వారు అన్న తేడా లేకుండా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకుంటున్న పరిస్తితిని గమనించేవారికి ఎవరు యే పార్టీ వారో చప్పున ఒక పట్టాన చెప్పడం కష్టమవుతోంది. పైపెచ్చు వీరిలో అనేకమంది  ఏదో ఒక పార్టీని నిజాయితీగా అంటిపెట్టుకుని నిష్కళంక రాజకీయాలు చేస్తున్నవారు కాకపోవడం వల్లకూడా అయోమయం పెచ్చుపెరుగుతోంది. మొన్న మొన్నటి వరకూ వేరే పార్టీలో వుండి ఆ గూటి పలుకులు పలికి ఇప్పుడు మళ్ళీ అదే నోటితో వేరే పలుకులు వల్లె వేయడం చూసి విస్తుబోవడం వీక్షకుల వంతు అవుతోంది. కళ్ళకు గంతలు కట్టి - ‘వీరీ వీరీ గుమ్మడి పండూ వీరీ పేరేమీ’ అని అడిగినట్టు అడిగితె ఎవరు ఎవరో చెప్పలేని దుస్తితి.

గతంలో పార్టీ విధానాలను మీడియాకు వివరించడానికి ప్రతి పార్టీకి అధికార ప్రతినిధులు వుండేవారు. ఇప్పటికీ లేకపోలేదు. కానీ పార్టీ పేరుపెట్టుకుని ప్రతిఒక్కరూ మీడియాతో మాట్లాడేస్తున్నారు. దానికి పార్టీ అనుమతి వుందా లేదా అన్నది వారికి అప్రస్తుతం. వారు చెప్పేది పార్టీ విధానమా కాదా అన్నది మీడియాకు అప్రస్తుతం. ఇలా - ఎప్పటికెయ్యది ప్రస్తుతమన్నట్టుగా అప్పటికామాటలాడేవారితోనే మరింత గందరగోళం ఏర్పడుతోంది.

ఒక పార్టీ వారు చెప్పిన దానిని మరో పార్టీ వారు ఖండించే పద్దతి పోయి ఎవరి పార్టీవారిని వారే దుయ్యపట్టే కొత్త సంస్కృతి తాజాగా రూపుదిద్దుకుని వున్న అయోమయాన్ని మరింత పెంచింది. అలాగే ఒక పార్టీని మరో పార్టీ సమర్ధించే విధానం కూడా పరిస్తితిని మరింతగా గందరగోళపరుస్తోంది. అవసరాన్నిబట్టి అవలంబిస్తున్న ఈ రెండు నాల్కల ధోరణి రాజకీయపార్టీల దివాళాకోరుతనాన్ని ఎత్తి చూపుతోంది. ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేకుండా అన్ని పార్టీలదీ ఇదే వరస కావడం మరో విషాదం.

వీటన్నిటికీ తోడు, క్రికెట్ పరిభాష లోని ‘మ్యాచ్ ఫిక్సింగ్’ పదం రాజకీయాల్లోకి దూసుకువచ్చింది. వీరు వారితో ఫిక్సయ్యారని ఒకరంటే, వారు వీరితో కుమ్మక్కయ్యారని మరొకరంటున్నారు. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే – ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, స్తానిక సంస్తల నుంచి జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో – ‘మ్యాచ్ ఫిక్సింగ్’ చేసుకున్నారని కూడా ఆరోపణలు వెల్లువెత్తాయి. బహుశా ఈ అపవాదును తప్పించుకోవడానికే శాసన సభలో వారిద్దరూ రైతుల సమస్యను అడ్డం పెట్టుకుని పోటాపోటీగా మాటల యుద్ధం సాగించాల్సివచ్చిందనే వారు కూడా లేకపోలేదు. కాకపొతే, ముఖ్యమంత్రి అయిన నాటినుంచి అనేక రకాల సమస్యల వలయంలో చిక్కుకుని మనసారా నవ్వుకునే అవకాశం కోల్పోయిన కిరణ్ కుమార్ రెడ్డికి – నిండు సభలో చిరునవ్వులు చిందించే అవకాశాన్ని కల్పించిన చంద్రబాబు నాయుడిని అభినందించాలి. (11-03-2011)



15, డిసెంబర్ 2010, బుధవారం

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు

ముళ్ళ బాటలో ముఖ్యమంత్రి - భండారు శ్రీనివాసరావు

అద్దంలో మొహం ఎలా కనబడుతుంది?

ఉన్నది ఉన్నట్టుగానే కనబడుతుంది. ఎందుకంటె అద్దం అబద్దం చెప్పదు కనుక.

మరోలా కనబడాలంటే ఏమి చెయ్యాలి? ఊహించుకోవడం ఒక్కటే మిగిలినదారి.

అదే ఇప్పుడు జరుగుతోంది ఆంద్ర ప్రదేశ్ లో.

పత్రికల్లో, మీడియాలో ఎక్కడ చూసినా ఊహాగానాలే! ఏమిజరుగుతుందో విశ్లేషించి వివరించేవారికన్నా ఏమి జరగాలని తమ అంతరాంతరాల్లో అభిలషిస్తున్నారో దాన్నే ప్రస్తుత పరిస్తితులకు అన్వయించి భాష్యం చెప్పేవారు ఎక్కువయ్యారు. రాజకీయనాయకులకే కాదు రాజకీయ విశ్లేషకులకు కూడా మినహాయింపు లేకపోవడమే ఇందులోని విషాదం.

నిన్న మొన్నటివరకు ప్రాంతీయ సమస్య ప్రధాన భూమిక పోషించిన రాష్ట్రంలో ఈనాడు రాజకీయమంతా ఒక వ్యక్తి చుట్టూ పరిభ్రమిస్తోంది. నిజానికి నిండా నాలుగు పదుల వయస్సు లేదు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగుపెట్టి ఏన్నర్ధం కూడా కాలేదు. చూడగానే ఆకట్టుకునే విగ్రహం కాదు. పట్టుమని పది నిమిషాలపాటయినా తన ప్రసంగాలతో ప్రజలను కట్టిపడేసే చాతుర్యం ఏమయినా వుందా అంటే అదీ లేదు.

అయినా వై ఎస్ జగన్ మోహన రెడ్డి సభలకు వేలం వెర్రిగా జనం ఎందుకలా వస్తున్నారు?

ఈ ఒక్క ప్రశ్నే అందర్నీ కలవరపెడుతోంది. అయితే, ఇది సమాధానం లేని ప్రశ్న కాదు. పైపెచ్చు అనేక సమాధానాలున్న ప్రశ్న. ముందు చెప్పినట్టు ఎవరి ఉద్దేశ్యాలకు తగ్గట్టుగా వారు ఊహించుకుంటూ జవాబులు వెతుక్కుంటూ వుండడంవల్ల ఎన్నెన్నో రకాల ఊహాగానాలు ఊపిరి పోసుకుంటున్నాయి. ఏమి జరగబోతున్నదన్న దానిపై మరెన్నో రకాల వదంతులు చెలరేగుతున్నాయి. జగన్ అనుకూల, ప్రతికూల కధనాలతో మీడియా వీటికి మరింత ఊతం ఇస్తోంది.

నూటపాతికేళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి ఇలాటి వొడిదుడుకులు కొత్తేమీ కాదన్నది ఆ పార్టీలోని జగన్ వ్యతిరేకుల భావం. ఈరకమయిన తిరుగుబాటుదార్లు లోగడ ఎంతోమంది పార్టీని వొదిలిపెట్టి వెళ్లి, ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో తమది బలుపుకాదు వాపు అని తెలుసుకుని మళ్ళీ పార్టీలో బుద్ధిగా చేరిపోయిన గతాన్ని గుర్తుచేయడం వారి వాదం లోని భాగం. కొత్తొక వింత అన్న చందాన జనం జగన్ ని చూడడానికి వెడుతున్నారని కొందరూ, గత ఎన్నికల్లో చిరంజీవి, జూనియర్ ఎన్టీయార్ సభలకు వచ్చిన జనాలను గుర్తుచేస్తూ – అప్పుడేమి జరిగిందో ఇప్పుడూ అదే జరగబోతోందని మరికొందరూ, డబ్బులు వెదజల్లే స్తోమత వుండాలే కానీ ఈ మాత్రం జనం తమ సభలకూ వస్తారని ఇంకొందరూ తమ వాదనలకు పదును పెట్టుకుంటున్నారు. ఇప్పుడున్న వాడినీ వేడినీ
మరో మూడేళ్ళు పైబడి కొనసాగించడం అంత ఆషామాషీ వ్యవహారం కాదని, ఈనాడు జగన్ కు వున్న ధన వనరులు, జన వనరులు వచ్చే ఎన్నికలకల్లా కళ్ళ ఎదుటే కరిగిపోవడం ఖాయమన్నది వారి నిశ్చితాభిప్రాయం. అధికారం వున్నప్పుడు అంటిపెట్టుకు తిరిగే వీరవిధేయులు అది దూరం కాగానే అంత త్వరగానే దూరం జరుగుతారనే రాజకీయ ధర్మసూక్ష్మాలను జగన్ వ్యతిరేకులు గుర్తు చేస్తున్నారు. ప్రజాసేవమీద కన్నా జగన్ కు ముఖ్యమంత్రి గద్దెపై యావ ఎక్కువన్నది వారు ఎక్కుబెడుతున్న విమర్శనాస్త్రాలలో ప్రధానమైనది. వైఎస్ రాజశేఖరరెడ్డి నిరుడు హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తరవాత వారసత్వంగా లభించాల్సిన ముఖ్యమంత్రి పదవిని తనకు దక్కనివ్వ లేదన్న అక్కసుతో, పార్టీ అధిష్టానంపై కక్ష కట్టి కొత్త పార్టీ పెట్టేందుకు జగన్ సిద్ధపడ్దాడన్నది ఆ బోంట్ల మరో ఆరోపణ. అవినీతి మార్గాలలో సంపాదించిన డబ్బును పెట్టుబడిగా పెట్టి మరో మార్గంలో అధికార పీఠం అధిరోహించడం అతడి ఏకైక లక్ష్యమని గత ఏడాది పైగా సాగుతూ వస్తున్న జగన్ వ్యతిరేక ప్రచారం లోని మరో పార్శ్వం. ఓదార్పు యాత్ర పేరుతొ రాష్ట్రమంతటా కలయ తిరగడం వెనుక, పైకి కనబడని రాజకీయ ఉద్దేశ్యాలున్నాయన్నది జగన్ వ్యతిరేకులు పార్టీ అధిష్టానానికి చేరవేసిన ఆంతరంగిక సమాచారం.

ఏతావాతా ఏమయితేనేమి – ఏడాది గడవకముందే ఈ ప్రచారం పనిచేసింది. జగన్ కూ, ఢిల్లీ లోని పార్టీ పెద్దలకు నడుమ దూరం పెరిగింది. వైఎస్సార్ జీవించి వున్నంతవరకు ఢిల్లీ నాయకులవద్ద ఆటలు సాగని వైఎస్ వ్యతిరేకులకూ, వైఎస్ హయాములో రాష్ట్ర వ్యవహారాలపై పట్టు కోల్పోయిన అధిష్టాన దేవతలకూ- వైఎస్ ఆకస్మిక మరణం ఒక మహత్తర అవకాశంగా దొరికింది. స్వతంత్ర భావాలుకలిగి, పిన్న వయస్సులోవున్న జగన్ కు ముఖ్యమంత్రి పదవి అప్పగిస్తే మరో నాలుగేళ్ళు రాష్ట్రం వంక కన్నెత్తి చూసే అవకాశం, పెత్తనం చేసే సావకాశం వుండదనే వైఎస్ వ్యతిరేకుల మంత్రం అధిష్టానం పై పనిచేసింది. ఫలితం- అధికార పగ్గాలను రోశయ్యగారికి అప్పగించడం. తాత్కాలిక ఏర్పాటు అన్నది శాశ్వితంగా కొనసాగే సూచనలు కానరావడంతో జగన్ వర్గం లో అలజడి మొదలయింది. పార్టీలో, ప్రభుత్వంలో నామమాత్రపు గుర్తింపు లేకపోవడం ఆ వర్గాన్ని అసహనానికి గురిచేసింది. ప్రజలకిచ్చిన మాట పేరుతొ ఓదార్పు యాత్ర ప్రారంభించడం ఒక్కటే జగన్ వర్గానికి ప్రత్యామ్నాయంగా మిగిలింది. రాష్ట్ర కాంగ్రెస్ లోని వైఎస్ వ్యతిరేకులు- ఈ యాత్రకు రాజకీయ రంగు పులమడం జగన్ వర్గానికి బాగా కలిసొచ్చింది. వైఎస్ హఠాన్మరణంతో గుండె పగిలిన వారి కుటుంబాలకు సొంత డబ్బుతో ఆర్ధిక సాయం అందించేందుకు జగన్ తలపెట్టిన ఓదార్పు యాత్రకు అడ్డంకులు కల్పించడం జగన్ పట్ల సానుభూతిని పెంచింది. ఈ క్రమంలో జగన్ సానుకూల, ప్రతికూల వర్గాల నడుమ సాగిన వాదప్రతివాదాలు ముదిరి పాకానపడి జగన్ కు జనం లో హీరో స్తాయిని కట్టబెట్టాయి. పార్టీలో పెద్దలంతా ఒకవైపు, జగన్ ఒక్కడూ ఒకవైపూ వుండి నడిపిన ‘రాజకీయం’ సాధారణ జనంలో జగన్ పట్ల సానుభూతి మరింత పెరిగేలా చేసింది. జగన్ అంశాన్ని పిల్ల కాకి వ్యవహారంగా పరిగణిస్తూ వచ్చిన పార్టీ అధిష్టానం – రోశయ్యను ముఖ్యమంత్రిగా తొలగించి ఆ స్తానంలో కిరణ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టి రాష్ట్ర పార్టీపై తన పట్టును మరో మారు ప్రదర్శించింది.

ఇటు జగన్ కూడా ఈ రాజకీయ క్రీడలో ఏమాత్రం వెనుకబడకుండా మరో అడుగు ముందుకు వేసి పార్లమెంట్ సభ్యత్వాన్నీ, పార్టీ ప్రాధమిక సభ్యత్వాన్నీ వొదులుకుని, తల్లి విజయమ్మతో అసెంబ్లీకి రాజీనామా చేయించి అధిష్టానంపై తొలి యుద్ధభేరి మోగించాడు. అటు పార్టీ పెద్దలు కూడా త్వరత్వరగా పావులు కదిపి జగన్ వర్గాన్ని దెబ్బతీసేందుకు వైఎస్ సోదరుడు వివేకానందరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టి ఎదురు దెబ్బతీసారు. గత్యంతరం లేని స్తితిలో జగన్ కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించి రాష్ట్ర కాంగ్రెస్ రాజకీయాలను కొత్త మలుపు తిప్పారు. తమిళనాడు తరహాలో ప్రాంతీయ పార్టీల ఆవిర్భావానికీ, భవిష్యత్తులో వాటి ప్రాబల్యానికి నాంది పలికారు.

కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే అనుసరించిన వ్యవహార శైలి సీనియర్ సహచరులకు మనస్తాపం కలిగించినప్పటికీ – స్వతంత్రంగా వ్యవహరించగల ముఖ్యమంత్రి మళ్ళీ లభించాడని సాధారణ జనం సంతోషించారు. యువకుడు, విద్యాధికుడు స్వయంగా క్రీడాకారుడు అయిన కొత్త ముఖ్యమంత్రి, సమధికోత్సాహంతో పనిచేసి రాజశేఖరరెడ్డి మాదిరిగా కాంగ్రెస్ ముఖ్యమంత్రుల్లో మంచి పేరు తెచ్చుకోగలడని చాలామంది ఆశించారు. కానీ మంత్రుల శాఖల పంపిణీలో తలెత్తిన విభేదాలు, వాటిని సర్దుబాటు చేయడానికి ముఖ్యమంత్రి చేసిన ఢిల్లీ యాత్రలు - ఈ ఆశలపై నీళ్ళు చల్లాయి. అలాగే ముఖ్యమంత్రి గద్దెపై కూర్చున్నమొదటి రోజునుంచీ సొంత పార్టీలో చెలరేగిన లుకలుకలు ఆయన ప్రతిష్టను పెంచకపోగా కొంతమేరకు మసకబార్చాయనే చెప్పాలి. మంత్రివర్గ కూర్పులో సొంత సామాజిక వర్గానికి పెద్ద పీట వేసి, బలహీనవర్గాలను చిన్న చూపు చూసారన్న విమర్శ కొత్త ముఖ్యమంత్రికి తగిలిన తొలి దెబ్బ.

భారీ వర్షాలకు దెబ్బతిన్న ప్రాంతాలను పరిశీలించే సమయంలో కూడా తన వయస్సుకు తగ్గ వ్యవహారశైలిని ఆయన ప్రదర్శించ లేకపోయారన్నది ఆయన ఎదుర్కుంటున్న మరో విమర్శ. గతంలో ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖరరెడ్డి కానీ ఇటువంటి సందర్భాలను సద్వినియోగం చేసుకున్న దాఖలాలను పరిశీలకులు ప్రస్తావిస్తున్నారు. రాజీవ్ గాంధీ ప్రధాన మంత్రిగా వున్నప్పుడు ఖమ్మం జిల్లాలో వరద తాకిడికి గురయిన ప్రాంతాలలో పర్యటించినప్పుడు, మండుటెండలో  ఇసుక మేట వేసిన పొలాల్లో చెమటలు కక్కుతూ తిరుగుతూ - ప్రభుత్వం ప్రజల వెంటే వుందన్న భరోసా కలిగించిన సంఘటనలను గుర్తు చేస్తున్నారు. మరోపక్క, అదేసమయంలో - జగన్, చంద్రబాబు, చిరంజీవి - బాధిత ప్రాంతాల్లో కలయ తిరిగి తమ పర్యటనల నుంచి రాజకీయ ప్రయోజనం రాబట్టుకునే ప్రయత్నం చేసిన విషయాలను ఉదహరిస్తున్నారు.

అలాగే, రైతు సంక్షేమ రాజ్యం తెస్తామన్న రాజశేఖరరెడ్డి ప్రభుత్వానికి వారసుడిగా వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి –శాసనసభలో ప్రతిపక్షాలు, రైతుల దుస్తితిపై లేవనెత్తిన వివాదాలను సమర్ధంగా ఎదుర్కోవడంలో విఫలమయ్యారనే విమర్శలను మూట గట్టుకోవాల్సిన పరిస్తితిలో పడిపోవడం మరో విషాదం. అలాగే విద్యార్ధుల అరెస్ట్ వ్యవహారం –అసెంబ్లీ స్పీకర్ గా విశేష అనుభవం గడించిన కిరణ్ కుమార్ రెడ్డికి గొంతులో వెలక్కాయ మాదిరిగా తయారయింది. గోటితో పోయేదాన్ని గొడ్డలి వరకు తెచ్చుకున్నారనే అపవాదును అంటగట్టింది. శాసన సభ జరుగుతున్న సమయంలోనే కొందరు పార్టీ శాసన సభ్యులు జగన్ అనుకూల వైఖరిని బాహాటంగా ప్రదర్శించడం నూతన ముఖ్యమంత్రికి అదనపు తలనొప్పిగా మారింది.

తెలంగాణా ప్రాంతానికి ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వడం జరుగుతుందని బాధ్యతలు స్వీకరించగానే ఆర్భాటంగా ప్రకటించి ఇంతవరకు మళ్ళీ ఆ ఊసు ఎత్తకపోవడం, స్పీకర్ పదవిని భర్తీ చేయకుండానే డిప్యూటీ స్పీకర్ తోనే శాసన సభ సమావేశాలను ముగించాలని చూడడం – ముఖ్యమంత్రి స్వతంత్ర వ్యవహార శైలికి అద్దం పట్టేవిగా లేని విషయాన్ని కూడా పరిశీలకులు ఎత్తి చూపుతున్నారు.

అధిష్టానం ఆశీస్సులతో ముఖ్యమంత్రి పీఠం ఎక్కిన కిరణ్ కుమార్ రెడ్డికి ఆ పదవి ముళ్ళ కిరీటం వంటిదని ఈపాటికే అర్ధం అయివుండాలి. ఒక్క కిరీటం మాత్రమె కాదు ముందున్న దారి కూడా ముళ్ళ బాట మాదిరిగానే కానవస్తోంది. అన్నింటికంటే పెద్ద సమస్య ఈ నెలాఖరులో ఎదురవబోతోంది. యావదాంధ్రలోకం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న శ్రీ కృష్ణ కమిషన్ నివేదిక ఆలోపునే వెలువడబోతోంది. ఈ లోపున రైతు సమస్యలపై తాడో పేడో తేల్చుకోవడానికి అటు జగన్, ఇటు చంద్రబాబు సంధించిన నిరాహార దీక్షల తూటాలు పేలబోతున్నాయి. కేసుల ఎత్తివేత గురించి విద్యార్ధుల ఆందోళన, వాళ్ల పక్షాన నిలబడుతున్న టీ ఆర్ ఎస్ తాకిడినీ ప్రభుత్వం ఏకకాలంలో ఎదుర్కోవాల్సి వుంది. ఈ మధ్యలో సందట్లో సడేమియా లాగా సొంత పార్టీలో రాజుకుంటున్న ‘కుంపట్ల’ విషయం సరేసరి.

బహుశా ఇన్ని రకాల వొత్తిళ్లకు ఏకైక ఉపశమనం ‘ఆటలు’ మాత్రమె అనే నిర్ణయానికి వచ్చి- స్వయంగా క్రీడాకారుడయిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ‘ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ బాడ్మింటన్ టోర్నమెంట్’ ప్రారంభోత్సవం సందర్భాన్ని అనువుగా తీసుకుని కోట్ల విజయభాస్కరరెడ్డి ఇండోర్ స్టేడియంలో కాసేపు బాడ్మింటన్ ఆడి సేదదీరే ప్రయత్నం చేసి వుంటారని అనుకోవాలి. (15-12-2010)

వినదగునెవ్వరు చెప్పిన:  'నిన్న మొన్నటివరకు తెలివిలవాడినన్నఅహంకారంతో ఈ ప్రపంచాన్నే మార్చాలనుకున్నాను. కానీ ఈ రోజు తెలివినపడ్డాను. అందుకే నన్ను నేనే మార్చుకుందామనే నిర్ణయానికి వచ్చాను.'