10, జూన్ 2011, శుక్రవారం

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు

వయసు నవ్వింది – భండారు శ్రీనివాసరావు




రామారావును నేను చిన్నప్పటినుంచీ ఎరుగుదును.


చిన్నతనంలో బొద్దుగా ముద్దుగా వుండేవాడు. వున్న వూళ్ళో స్కూలు లేక పట్నంలో బావ గారింటికి చేరాల్సివచ్చింది. వేసవి సెలవులివ్వగానే సొంతూరు మీద గాలిమళ్ళేది. అంతే. బస్సెక్కి తుర్రున వాళ్ల వూరు బయలుదేరేవాడు. ఆ రోజుల్లో బస్సు టిక్కెట్టు- అందులో అరటిక్కెట్టాయె - నాలుగణాలు పోను అక్కయ్య ఇచ్చిన రూపాయిలో ఇంకా ముప్పావలా జేబులో మిగిలేది. ఓ అణా పెట్టి కట్టె మిఠాయి, ఇంకో అణా పెట్టి జీళ్ళు కొనుక్కుని కాలవగట్టెక్కేవాడు. ఇక అక్కడినుంచి ఒకటే పాటలు, పద్యాలు. టైం తెలిసేది కాదు. మాయాబజారులో వివాహభోజనంబు పాట పదమూడోసారి ఎత్తుకునేలోపల ఊరోచ్చేసేది. మూడు మైళ్ళు మూడంగల్లో దాటి వచ్చిన ఫీలింగు. ఆహా అనుకునేవాడు. తన గొప్పే అనుకునేవాడు. చూసి నవ్వుకునేవాడిని.


పల్లెటూళ్ళో రాజభోగం. వేడి వేడి అన్నం. వెన్న కాచిన నెయ్యి.అరచేతిమందాన  మీగడ. ముద్దపప్పు. వూటలూరే కొత్తావకాయ. ఓహో ఏమి రుచి. రాళ్ళు తిని హరాయించుకునే ఆరోగ్యం తనదని మురిసి ముక్కచెక్కలయ్యేవాడు. రామారావుని చూసి జాలితో నవ్వుకునేవాడిని.


రామారావు పెరిగాడు. ఎదిగాడు. సన్న గీత గీసినట్టు మీసకట్టు. నిగనిగలాడే జుట్టు. ఎగదువ్విన క్రాఫు. ఎవరో అచ్చు నాగేశ్వర్రావులా వుంటావన్నారు. నిజమే కాబోలనుకున్నాడు. నవ్వుకోవడం నా వంతయింది.


రామారావుకు పెళ్లయింది. పిల్లలు పుట్టారు. అయినా చిన్న కుర్రాడిలానే వున్నాడు. తోటివారిలా బొజ్జ రాలేదు. బరువు పెరగలేదు. జుట్టు నెరవలేదు. బట్ట తల రాలేదు. కంటి చూపు తగ్గలేదు. ముప్పయ్యేళ్ళ క్రితం ఎలావున్నాయో ముప్పయి రెండు పళ్ళు అలాగే గట్టిగా పటిష్టంగా వున్నాయి. నాది పెగ్గుల లెక్క కాదు జగ్గుల లెక్క అంటూ మూడు సీసాలు ఆరు సోడాల మాదిరిగా సాయంకాలక్షేపాలు చేసేవాడు. చూశారా నా స్పెషాలిటీ అన్నట్టు రొమ్ము విరుచుకు తిరిగే వాడు. రామారావుని చూస్తుంటే నాకిక నవ్వు రావడం లేదు. జాలి కలుగుతోంది.


రామారావుకు మెల్లమెల్లగా వయసు మీద పడుతోంది. కొంచెం కొంచెంగా వెంట్రుకలు చెప్పాపెట్టకుండా రాలిపోతున్నాయి. వెనుకనుంచి చూసేవారికి జుట్టు మధ్యలో గచ్చకాయ మందంలో ఖాళీ కనబడుతోంది. నెలల తేడాలోనే బెల్ట్ సైజ్ పెరిగింది. ముందు పొట్ట కనబడి తరువాత రామారావు కనబడుతున్నాడు. దళసరి కళ్ళజోడు మొహం మీద చేరింది. మరీ ముదుసలిలా కాకపోయినా ముడుతలు కనబడుతున్నాయి. కానీ, ఎవరో అతికించినట్టు ఎప్పటిలాగానే పెదాలపై చెరగని చిరునవ్వు. అయితే అందులో జీవమేదీ ?


రామారావుకు క్రమంగా సృష్టి రహస్యం అర్ధం అవుతోంది. శాశ్వితం అనుకుంటున్నవేవీ నిజానికి శాశ్వితం కాదు. ఈ నిజం తెలుసుకున్న రామారావుని చూసినప్పుడు నాకు నవ్వు రాలేదు. జాలీ వెయ్యలేదు. గర్వంగా అనిపించింది.


ఎందుకంటె నా పేరు ‘వయస్సు’ కనుక. (10-06-2011)

ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు


ముఖ్యమంత్రికి బొత్స బలమా ? బల్లెమా ? – భండారు శ్రీనివాస రావు

(10-06-2011 నాటి ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)


తిరుపతి మొక్కు తీర్చుకున్న తరువాత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. అసెంబ్లీలో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సజావుగా జరిగిపోవడం, తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు నిబంధనల సాకుతో సోదిలో లేకుండా పోవడం - ఇవన్నీ ముఖ్యమంత్రికి సానుకూల పరిణామాలే. స్పీకర్ ఎన్నిక ద్వారా ‘రుజువయిన విశ్వాసం’ ఆయనలో ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది. పరిపాలనపై పట్టు పెంచుకునే దిశగా ఆయనతో అడుగులు వేయిస్తోంది. రైతు సదస్సుల పేరుతొ జిల్లాల్లో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూ, పనిలో పైగా పార్టీ కార్యకర్తల సమావేశాల్లో స్వరం పెంచి మాట్లాడేలా చేస్తోంది. దీనికి ఉదాహరణ శ్రీకాకుళంలో ఆయన చేసిన ప్రసంగం. ఆ ప్రసంగంలో జగన్ అనుకూల కాంగ్రెస్ నాయకులను గురించి ఆయన చేసిన ప్రత్యేక ప్రస్తావన. పార్టీలో జగన్ కోవర్టులుగా అభివర్ణిస్తున్న వారికి ముఖ్యమంత్రి కొత్తగా ఇంటి దొంగలని నామకరణం చేశారు. ‘ఇంటి దొంగల్ని ఈశ్వరుడయినా పట్టలేడు. పార్టీ నుంచి వెళ్లిపోవాలని అనుకుంటున్న వాళ్లు దయచేసి వెళ్ళిపొండి. లేని పక్షంలో మీ పాత స్తానాలకు మేమే పంపిస్తాం.’ అన్న రీతిలో ఆయన ప్రసంగం సాగింది. కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలి తెలిసిన వారు కూడా శ్రీకాకుళం లో ఆయన చూపిన తెగువను చూసి ఆశ్చర్య పోయివుంటారు. బహుశా, ఆయన ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తరువాత పార్టీ లోని జగన్ అనుకూల వర్గం వారిపై ఈ విధంగా విరుచుక పడడం ఇదే మొదటి సారి. పైగా శ్రీకాకుళం జిల్లాలో జగన్ వర్గం ఎమ్మెల్యేలుగా గుర్తింపు పొందిన ధర్మాన కృష్ణ దాస్, కొర్ల భారతి ముఖ్యమంత్రి ప్రసంగించిన రైతు సదస్సుకు హాజరయిన వారిలో వున్నారు. ఆ తరువాత జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశాన్ని ముఖ్యమంత్రి తన విమర్శల ప్రస్తావనకు వేదికగా చేసుకోవడం విశేషం.


అయితే, ముఖ్యమంత్రి హెచ్చరికలను ‘నిస్పృహతో చేసిన వ్యాఖ్యలు’ గా రాజకీయపరిశీలకులు పరిగణిస్తున్నారు. స్పీకర్ ఎన్నికతో తన ప్రభుత్వం పట్ల శాసన సభ ‘విశ్వాసం’ రుజువయిందని సంబరపడుతున్న ముఖ్యమంత్రి, అదే నోటితో పార్టీలో ‘ఇంటి దొంగల’ ప్రస్తావన తీసుకురావడం ఆయనలోని ద్వైదీభావానికి అద్దం పడుతోందని అంటున్నారు. అలాగే, ప్రదేశ్ కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా ఉత్తరాంధ్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ నియామకం ముఖ్యమంత్రి అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిందని గాంధీభవన్ వర్గాలంటున్నాయి. పైపెచ్చు అధిష్టానం ఎంపిక చేసిన బొత్స సత్యనారాయణ సాదా సీదాగా కనబడే అసాధారణ రాజకీయ నాయకుడు. సామాజిక కోణం నుంచి చూసినా లేక ఈనాటి రాజకీయాలకు అవసరమయిన ఇతర కోణాలనుంచి చూసినా బొత్స సత్యనారాయణ అన్ని విధాల ముఖ్యమంత్రికి సమ ఉజ్జీ అనే చెప్పాలి. జగన్ మోహన రెడ్డిని దీటుగా ఎదుర్కొనగల సత్తా వున్న మనిషిగా పార్టీ అధిష్టానం బొత్సను గుర్తించి పీసీసీ పీఠం అప్పగించింది. అందర్నీ కలుపుకుపోయే బొత్స తత్వం పార్టీ పటిష్టానికి ఉపయోగపడవచ్చు. ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు పట్ల ఆయన గతంలో వెల్లడించిన సానుకూల భావాలే పార్టీ కొత్త అధ్యక్షుడు కావడానికి సానుకూలంగా మారాయని చెప్పవచ్చు. ఒక్క వి.హనుమంతరావును మినహాయిస్తే తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ నాయకులెవ్వరు ఆయన ఎంపిక పట్ల అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అలాగే టీ ఆర్ ఎస్ కూడా. ఇవన్నీ ముందు ముందు బొత్సకు కలిసొచ్చే అంశాలే. దానికి తోడు, పదవి రాగానే, ఢిల్లీ నుంచి తిరిగొస్తూనే, అస్వస్తత నుంచి కోలుకుంటున్న కాకా మొదలుకుని సొంత పార్టీ – ప్రజారాజ్యాన్ని కాంగ్రెస్ లో కలిపేసి కొంగొత్త భ్రమలతో ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్న చిరంజీవిని కూడా ఇంటికి వెళ్లి కలిసి తనతో కలుపుకోగల కలుపుగోలుతనం బొత్స సొంతం.


సంప్రదాయానికి భిన్నంగా ఈ సారి ఉత్తరాంధ్రకు చెందిన బొత్సకు అధిష్టానం పీ సీ సీ అధ్యక్ష పీఠం అప్పగించడానికి ఇతరత్రా కారణాలు కూడా వున్నాయి. రాష్ట్రానికి సంబంధించినంతవరకు ఢిల్లీలోని పార్టీ పెద్దలను కలవరపెడుతున్న అంశాలలో తెలంగాణాతో పాటు అంతటి ప్రాధాన్యం కలిగింది జగన్ మోహన రెడ్డి స్తాపించిన కొత్త పార్టీ. ఈ పార్టీవల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ భవితవ్యానికి ఎదురుకాగల ముప్పు ఎలాటిదన్నది కడప ఉప ఎన్నికలలో ఎదురయిన ఘోర పరాజయంతో దానికి అర్ధం అయింది. పైకి ఎన్ని బీరాలు పలుకుతున్నా రాష్ట్రంలో ఆ పార్టీని ఎదుర్కోవడం రాజకీయంగా కాంగ్రెస్ కు పెనుసవాలే అన్నది ఆ పార్టీ నాయకులే ఆంతరంగిక సంభాషణల్లో అంగీకరిస్తున్న సత్యం. అందుకే, కడప ప్రభావాన్ని కనీసం ఉత్తరాంధ్రలోనయినా నిలువరించగలిగితే రానున్న ఎన్నికల నాటికి కాంగ్రెస్ పడవను వొడ్డు ఎక్కించవచ్చన్నది ఆ పార్టీ వ్యూహంగా కానవస్తోంది. ఉత్తరాంధ్రలో ఒక ప్రధాన సామాజిక వర్గానికి నాయకత్వం వహిస్తున్న బొత్స ద్వారా కొంత మేరకయినా నష్టాన్ని పూడ్చుకోవడం అన్నది ఆ పార్టీ వ్యూహకర్తల ఆలోచనగా తోస్తోంది. వై ఎస్ జగన్ హవాకు అడ్డుకట్ట వేయడం ప్రధాన కర్తవ్యంగా మారిన కాంగ్రెస్ అధిష్టానం కంటికి బొత్స అవసరానికి పనికి వచ్చే తురుపు ముక్కగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు.


రాజశేఖర రెడ్డి ఆకస్మిక మరణం తరువాత ఆయన కుమారుడు జగన్ పట్ల బొత్స అనుసరిస్తున్న వైఖరి కూడా బొత్సకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి దోహదపడి వుంటుంది. రాజశేఖరరెడ్డికి అనుంగు శిష్యుడయిన బొత్స- తన విధేయతను కానీ, విశ్వాసాన్ని కానీ ఆయనవరకే పరిమితం చేసి, ఆయన అనంతరం జగన్ మోహన్ రెడ్డిని ఎడంగా వుంచి వ్యవహరించడం అప్పట్లో వై ఎస్ అభిమానులకు కొరుకుడు పడలేదు కూడా. కానీ, ఇప్పుడదే అధిష్టానం వద్ద మార్కులు సంపాదించడానికి బొత్సకు ఉపయోగపడిందని అనుకోవాలి.


అయితే, ఆయనలోని చొరవా చురుకుదనం ఎలాటి ముఖ్యమంత్రికయినా ఇబ్బంది కలిగించే లక్షణాలే. క్రమంగా బలపడుతున్నానన్న ఆశలు కదలాడుతున్న తరుణంలో జరిగిన బొత్స నియామకం కిరణ్ కుమార్ రెడ్డికి ఏ విధమయిన బలమిస్తుందన్నది అనుమానమే. ఎందుకంటె, సహజంగా మాటకారి అయిన బొత్సను, ముభావంగా ముక్తసరిగా మాట్లాడే ముఖ్యమంత్రితో పోల్చిచూసుకోవడం మొదలవుతుంది. పైపెచ్చు, రాజకీయ పరమపద సోపానపఠంలో నిచ్చెనలన్నీ త్వరత్వరగా ఎక్కేసి మరెన్నో ఎత్తులకు ఎదగాలన్న కాంక్ష బలంగా వున్న బొత్స తదనుగుణంగానే రాజకీయ ఎత్తులకు పూనుకుంటే ఆశ్చర పడాల్సింది ఏమీ వుండదు. పీ సీ సీ పదవితో పాటు మంత్రి పదవి కూడా వుండాలని బొత్స పట్టుబట్టడం వెనుక ఏదయినా ముందు చూపు కూడా వుండివుండవచ్చు. సీ ఎం కావాలన్న కోరికను కూడా దాచుకోని నైజం ఆయనది.


మామూలు పరిస్థితుల్లో అయితే పీసీసీ అధ్యక్ష పీఠం అన్నది అలంకారప్రాయమే. ఎన్నికల సమయంలో మాత్రం ఈ పదవికి ఎంతో కొంత ప్రాధాన్యత వుంటుంది. పార్టీ అభ్యర్ధుల ఎంపిక సమయంలో కొందరి విషయంలో నయినా పీసీసీ అధినేత మాట చెల్లుబాటు అయ్యే అవకాశం వుంటుంది. ప్రస్తుతం సాధారణ ఎన్నికలకు ఇంకా మూడేళ్ళ వ్యవధానం వుంది. పోనీ, స్తానిక సంస్తల ఎన్నికలయినా కనుచూపు మేరలో వున్నాయనుకుంటే, ఆ ఆశ కూడా కనబడడం లేదు. కడప ఉప ఎన్నికల ఫలితాల నేపధ్యంలో స్తానిక సంస్తల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూనుకుంటుందనే ఆశలు ఆవిరవుతున్నాయి. పాలక వర్గాలు రద్దయిన స్తానిక సంస్తలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించే ఆర్డినెన్స్ ఇవ్వాళో రేపో జారీ అయ్యే అవకాశాలే మెండుగా కనిపిస్తున్నాయి.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక సమయంలో అనుభవంలోకి వచ్చిన ఉద్రిక్త క్షణాలు ముఖ్యమంత్రిని ఇంకా కలవరపెడుతూనే వుండి వుండవచ్చు. ఆ ఎన్నికలో సాధించిన విజయం కేవలం సాంకేతిక మైనదే అన్న విషయం ఆయనకు తెలియంది కాదు. ప్రజారాజ్యం విలీనంతో పెరిగిన బలం, మజ్లిస్ పార్టీ మద్దతు, అనర్హత వేటు పడుతుందన్న భయంతో జగన్ అనుకూల వర్గీయులయిన ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా వత్తాసు పలకడం – అధికార పార్టీ అభ్యర్ధుల గెలుపుకు దోహదం చేసాయి. అయినా కూడా రావాల్సిన వోట్లకన్న అత్తెసరు వోట్ల ఆధిక్యం మాత్రమే లభించడం ఆ పార్టీ నేతలను ఇబ్బందికి గురిచేసింది. ప్రస్తుతానికి బయటపడినా ముందు ముందు మరోసారి ఇదే పరీక్ష ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. అవిశ్వాసం అనే కత్తి ముఖ్యమంత్రి నెత్తిమీద వేలాడుతూనే వుంటుంది. మరో అగ్ని పరీక్ష తెలంగాణా రూపంలో తయారుగా వుంది. (09-06-2011)


7, జూన్ 2011, మంగళవారం

Cong's "Chanakya neeti" on T-issue - Bhandaru Srinivas Rao (I.I.S.)

Cong's "Chanakya neeti" on T-issue - Bhandaru Srinivas Rao (I.I.S.)


During last one week two major political developments took place. One

is the ‘no confidence’ motion moved by Telugu Desam in the Assembly

convened to elect Speaker and Deputy Speaker, while the second being

the Congress high command’s decision to appoint one of their senior

member hailing from north coastal Andhra (Vizianagaram), Botsa

Satyanarayana, as APCC Chief. Added to these two is the state party

in-charge and Union Minister Ghulam Nabi Azad’s statement on

pot-boiling Telangana issue, generated enough heat.

First, let us look at the no-confidence motion moved by the main

Opposition Telugu Desam. The way it has been moved, in fact, raised

many eyebrows. Aware of the legislature rules, the TDP made light of

the issue, by handing over the letter two days in advance, only to

face Opposition wrath. Perhaps, my media colleague and MLC, Prof

Nageshwar, was right saying it was for media conception. While

finding fault with technicalities, he said in the same breadth that

the TDP may as well handover another ‘no-confidence’ letter an hour

before the session begins to the Secretary. As expected, the TDP has

given on the day when Speaker and Deputy Speaker of the Assembly being

convened last Saturday.


As expected the government conveniently ‘ignored’ it by the Speaker

adjourning the House sine die. But as per Rules, Prof Nageshwar,

argues that the ‘no-confidence motion’ should have been entertained by

even the Pro-tem Speaker. The main Opposition had also come under

fire for not pressing for it, though its leader, Nara Chandrababu

Naidu, got opportunities twice. However, the TDP realizing the fact

that they got exposed, rushed to Raj Bhavan to lodge a complain as

well request the Governor ESL Narasimhan to reconvene the assembly.


Meanwhile, the newly-elected Speaker Nadendla Manohar’s tacit denial

that the ‘no confidence’ motion moved by the TDP had not come to his

notice, not only sounds ridiculous, but absurd. On Speaker’s remarks,

Prof Nageshwar, also made it clear ruling out legal remedy to it. As

per rules, the Speaker cannot shirk his responsibility, but if he does

by quoting earlier parliament precedents or practices, none can help.


Whether Speaker acted on government’s directions or not, the message

is clear and loud – neither the ruling Congress nor Telugu Desam – are

willing to face electorate as of today. They fear, total rout and

lack confidence. The Congress and Telugu Desam combine, in fact, yet

again succeeded to restrain their common enemy “Jagan” at bay for some

more time.

Coming to PCC chief election, optimists of separate Telangana see the

Congress high command’s move to appoint Botsa Satyanarayana as APCC

chief, as yet another major step closer to consider the state

bifurcation favorably. Whether this argument holds any water, one has

to wait and see. But, pessimists look at it, adding Azad’s remarks, as

a move to further dilute the T-issue.

To me it appears, the Centre reluctant to spell out its decision

either way, as it wanted to further consolidate lost ground,

especially after the sudden demise of its most popular leader YS

Rajasekhara Reddy, two years ago. The Congress high command treading

cautiously, giving ‘hope’ to optimists as well pessimists and willing

to drag on still it completely come to grips with its own problems at

the Centre, especially the scams that almost wreck the UPA boat.


For Congress, the Telangana issue is certainly not in its priority

list, as it had to protect government’s survival with coalition

partners like DMK holding out threats on either 2G scam or ‘war

against corruption’ unleashed by the civic society leaders like Anna

Hazare and Baba Ramdev.


As I argued in my last article “T-issue: Is it fizzling out”, the

Congress bound to find some excuse or the other to drag on the issue,

till its MPs and MLAs dare to resign en masse, which is more unlikely,

than to become a realty. (07-06-2011)

3, జూన్ 2011, శుక్రవారం

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు

జరగని పెళ్ళికి బాజాల మోత - భండారు శ్రీనివాసరావు


(04-06-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


ప్రజలు గమనిస్తున్నారు అన్నది రాజకీయనాయకులు తరచుగా వాడే ఊతపదం.


ఇప్పుడు రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని వారు భావిస్తున్నట్టు లేదు. బహుశా ఆ అవసరం వారికి లేదేమో కూడా. ఎందుకంటె మన దేశంలో రూపొందించుకున్న పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థ అలాటిది మరి.


ఈ వ్యవస్థకు మూలస్తంభం ఎన్నికలు. రాజ్యాంగం ధర్మమా అని కుల,మత,వర్ణ,లింగ,వయో వివక్ష లేకుండా ప్రజలందరూ ఈ ఎన్నికల్లో పాల్గొని తమకు నచ్చిన ప్రజాప్రతినిధిని ఎన్నుకునే అవకాశం వుంది. కానీ, దురదృష్టం ఏమిటంటే వోటు హక్కు వినియోగించుకోవడంతో పౌరుల ప్రజాస్వామ్య ధర్మం పూర్తవుతుంది. అంతటితో వారి పని సరి. మళ్ళీ ఎన్నికలొచ్చేదాకా ప్రజలతో పని లేదన్న సంగతి రాజకీయులందరికీ తెలుసు. పోతే, ఇక అక్కడనుంచి ప్రజాస్వామ్య రధం ఎన్నికయిన ప్రజాప్రతినిధుల దయాదాక్షిణ్యాలతో నడుస్తుంది. సంఖ్యలు, అంకెలు లెక్కలోకి వస్తాయి. పార్టీ ఫిరాయింపుల చట్టం కోరలనుంచి తప్పించుకునే వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయం సాగుతుంది. అంకెల గారడీలు, టక్కు టమార విద్యలు రంగప్రవేశం చేస్తాయి. ప్రజల విశ్వాసంతో ఎవరికీ నిమిత్తం వుండదు. ప్రజాప్రతినిధుల విశ్వాసం వుంటే చాలు, ప్రజాస్వామ్య ప్రభుత్వాల నడక నల్లేరుపై బండిలా సాగిపోతుంది.


గత ఇరవై నాలుగ్గంటల్లో రాష్ట్ర రాజకీయాలు అనూహ్యమయిన మలుపులు తిరుగుతున్నాయి. రాజ్యాంగంలోని సాంకేతికతలను అడ్డం పెట్టుకుని తమదే పై చేయి అనిపించుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఈ విషయంలో ఆరితేరిన కాంగ్రెస్ ఈ పాచికలాటలో ఇంతవరకు ముందంజలో వుంది.


దాదాపు రెండేళ్లుగా నిష్క్రియాపియత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలచిన పాలక పక్షం లోని వ్యూహకర్తలు, తాము పదిలంగా దాచిపెట్టిన అస్త్రశస్త్రాలను ఒక్కొక్కటిగా బయటకు తీస్తున్నారు. వైరి పక్షం వూహలకు అందని వేగంతో పావులు కదుపుతున్నారు. ఎన్నాళ్ళబట్టో అటకెక్కించి వుంచిన పదవుల పందేరానికి వున్నట్టుండి తెర తీసారు. అదీ ఎంతో వ్యూహాత్మకంగా. స్పీకర్ ఎన్నిక పేరుతొ హడావిడిగా శాసన సభ సమావేశాలను ఏర్పాటుచేసారు. డిప్యూటీ స్ప్పీకర్ నాదెండ్ల మనోహర్ తో ఒక రోజు ముందుగానే రాజీనామా చేయించారు. దానితో స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఇద్దరు లేని పరిస్తితి ఏర్పడింది. గవర్నర్ తో ప్రమేయం లేని రీతిలో, గత శాసన సభ సమావేశాలను ప్రోరోగ్ చేయకుండా జాగ్రత్త పడడాన్ని బట్టి చూస్తే చాలా ముందుగానే కాంగ్రెస్ తన వ్యూహరచన చేసుకున్నట్టు అర్ధం అవుతోంది. ఈ సమయంలోనే, తెలుగుదేశం పార్టీ మహానాడు ముగింపులో చేసిన ప్రకటనకు అనుగుణంగా కిరణ్ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చింది. కానీ అలా ఇచ్చే సమయానికి దాన్ని తీసుకోవాల్సిన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ రెండు పదవులు ఖాళీ. నోటీసు ఇవ్వడానికి అసెంబ్లీకి వెళ్ళిన తెలుగుదేశం శాసన సభ్యులు చాలాసేపు వేచి చూసి, ఇక చేసేదేమీ లేక అసెంబ్లీ కార్యదర్శికి ఇచ్చి వెనుదిరగాల్సివచ్చింది. దానితో ఆ నోటీసు సాంకేతికంగా చెల్లుబాటు కాదన్న వాదన బయలుదేరింది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నప్పుడు స్పీకర్ కు ఇచ్చిన నోటీసునే పరిగణనలోకి తీసుకుంటారు కాబట్టి మళ్ళీ తెలుగుదేశం పార్టీ స్పీకర్ ఎన్నిక అనంతరం తిరిగి అదే నోటీసు ఇవ్వాల్సి వుంటుంది. దానిని పరిశీలించి అనుమతించడానికి కొత్త స్పీకర్ పది రోజులు వ్యవధి తీసుకోవచ్చని మరో సాంకేతిక అంశాన్ని తెరపైకి తెచ్చారు. అంటే శాసన సభ మరో సారి సమావేశం అయ్యేదాకా టీడీపీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీసు అసెంబ్లీ అలమరా లోనే వుండిపోయే అవకాశం వుంది.


స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక తంతు ముగిసిన తరువాత వారిద్దరినీ శాసన సభ అభినందించే కార్యక్రమం మొదలవుతుంది. సభావ్యవహారాల సలహా సంఘం సమావేశమై అవిశ్వాస తీర్మానం నోటీసును పరిశీలించి నిర్ణయం తీసుకోవాల్సి వుంటుంది. స్పీకర్ ఎన్నిక కోసం ఏర్పాటుచేసిన ఒకరోజు సమావేశంలో అవిశ్వాస తీర్మానం చర్చకు వచ్చే అవకాశాలు మృగ్యంగా కనబడుతున్నాయి. ఈ విషయం పూర్తిగా కొత్త స్పీకర్ విచక్షనాధికారానికి లోబడి వుంటుందన్నది నిపుణుల అభిప్రాయం. అయితే, జగన్ బలం ఎంతో లెక్కలు తేల్చుకోవాలని గట్టిగా కోరుకుంటున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి స్వయంగా కోరుకున్న పక్షంలో కొత్త స్పీకర్ అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టే అవకాశం వుంటుంది. అలా జరగని పక్షంలో అవిశ్వాస తీర్మానం నోటీసు ఇవ్వడానికి వున్న ప్రస్తుత నిబంధనలను అడ్డం పెట్టుకుని శనివారం సభ ముగిసిన అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేసి ప్రోరోగ్ చేస్తే మళ్ళీ అవకాశం లభించేది వర్షాకాల సమావేశాల్లోనే. బీరాలు పలికిన పార్టీలన్నీ అప్పటిదాకా వేచిచూడాల్సిందే.


రెండు రోజులుగా నిబంధనల పేరుతొ నడుస్తున్న ఈ తంతును పరికిస్తున్నవారికి ఒక విషయం ఇట్టే అర్ధం అవుతుంది. ఇదంతా జగన్ పార్టీని ఇరుకున పెట్టడానికి కాంగ్రెస్ పన్నిన పధకంగా తెలిసిపోతుంది. తెలుగుదేశం పార్టీ అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చినట్టూ అవుతుంది. సాంకేతిక కారణాలతో దాన్ని అనుమతించనట్టు అవుతుంది. రోగి కోరిందే వైద్యుడు ఇవ్వడం అంటే ఇదే కాబోలు.


మహానాడుతో కొత్త జవసత్వాలు పుంజుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు - కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని, చాలినంత బలం లేకపోయినా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవులకు పోటీ పెట్టాలని రెండు కీలక నిర్ణయాలను ప్రకటించి రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించారు. అనుకున్నదే తడవుగా స్పీకర్ పదవికి మాజీ మంత్రి కేఈ కృష్ణ మూర్తినీ, డిప్యూటీ స్పీకర్ పదవికి మరో మాజీ మంత్రి సుద్దాల దేవయ్యను
అభ్యర్ధులుగా ప్రకటించి ఆటలో తానూ వెనకబడిలేనన్న సంకేతాలను ఇచ్చారు. బీసీ, ఎస్సీలపట్ల తమ పార్టీకి వున్న చిత్తశుద్ధిని ఈ విధంగా వెల్లడించుకున్నారు. ఈ పరిణామం సహజంగానే కాంగ్రెస్ పార్టీని కలవరపెట్టింది. పాలక పక్షం తన ధోరణి మార్చుకోకుండా సీమాంధ్ర వారికే పదవుల పందేరంలో పెద్ద పీట వేస్తోందని తెలంగాణా రాష్ట్ర సమితి నాయకులు ఆరోపణలకు దిగారు కూడా. పార్టీలోని సొంత శాసన సభ్యులు కొందరు సయితం ఈ ఆరోపణలతో గొంతుకలిపారు. వీటికి తోడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ తరపున ఇటీవల పులివెందుల నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో శాసన సభకు ఎన్నికయిన వైఎస్ సతీమణి విజయమ్మ అసెంబ్లీ సభ్యురాలిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసినప్పుడు పదమూడు మంది కాంగ్రెస్ శాసన సభ్యులు ఆవిడ వెంట తరలి రావడం కూడా పాలకవర్గం లొ చర్చనీయాంశం అయింది. పార్టీ ఆదేశాలను బేఖాతరు చేయడం కొత్త కాకపోయినా, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం నేపధ్యంలో, అంతమంది శాసన సభ్యులు కట్టగట్టుకుని బాహాటంగా వైరి పక్షం నేత వెంట నడవడాన్ని ఆ పార్టీ నాయకత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికలను ఏకగ్రీవం చేయడానికి అందరూ కలసి రావాలని పాలక పక్షం తరపున ఇతర పార్టీలకు విజ్ఞప్తులు చేయడం జరిగింది.


తగినంత బలం వున్నప్పటికీ, ఒకేసారి, స్పీకర్ ఎన్నిక, అవిశ్వాస తీర్మానం ఎడుర్కొవాల్సిరావడంతో, చేతిలో వున్న ఏ చిన్న అవకాశాన్ని కూడా వొదులుకునే స్తితిలో ఆ పార్టీ వున్నట్టు కనబడడం లేదు. కాంగ్రెస్ శాసన సభ్యులలో వున్న జగన్ సానుభూతిపరులతో కలసి మరికొందరు చేయి కలిపి అనర్హత వేటుకు సిద్ధపడితే, పరిస్థితులు మరోరకంగా మారే అవకాశాలు వుంటాయన్న భయం దాన్ని వేధిస్తూ వుండవచ్చు.


పోతే, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ నిలబెట్టే అభ్యర్ధులకు జగన్ పార్టీ లేదా ఆయనతో వున్న శాసన సభ్యులు మద్దతు ఇవ్వాలనేది కూడా వ్యూహాత్మక ప్రతిపాదనే. ఎందుకంటె ఓడిపోతే జగన్ వర్గంపై అనర్హత వేటు పడుతుంది. తెలుగుదేశానికి ఓడిపోయామన్న నామర్దా తప్ప వేరే నష్టం లేదు. జగన్ ఇంతవరకు తనకుందని చెప్పుకుంటున్న బలం ఏపాటిదో జనాలకు తెలిసిపోతుంది. గెలిస్తే మాత్రం పాలక పక్షం సభావిశ్వాసం కోల్పోయినట్టు అవుతుంది. ప్రభుత్వం కూలిపోవచ్చు. కానీ వెనువెంటనే మధ్యంతర ఎన్నికలు వచ్చే వీలు లేదు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు మెజారిటీ సభ్యుల మద్దతు వుందని ముందుకు వచ్చే నాయకుడికి గవర్నర్ అవకాశం ఇవ్వవచ్చు. కానీ, దరిమిలా శాసన సభ రద్దయినా, దానిని సుప్తచేతనావస్థలో వుంచినా – తెలుగు దేశం తరపున గెలిచిన వ్యక్తే శాసన సభ స్పీకర్ పదవిలో కొనసాగుతారు. బహుశా ఇదే కారణంతో వైఎస్ఆర్ పార్టీ ఈ ప్రతిపాదనను నిర్ద్వందంగా తిరస్కరిస్తోందని భావించాలి.


కడప ఉప ఎన్నికల్లో పోగొట్టుకున్న పరువు ప్రతిష్టలను మళ్ళీ ఏదో ఒక మేరకు పూరించుకునే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ నిబంధనలను అడ్డం పెట్టుకుని ఆడే ఈ ‘నెంబర్ గేమ్’ కు తెర తీసిందని అనుకోవాలి.

అసలు అవిశ్వాస తీర్మానం చర్చకు వస్తుందో రాదో తెలియని స్తితిలో సభలో పార్టీల బలాబలాలనుగురించీ, తీర్మానం గెలుపోటములు గురించీ చర్చించుకోవడం - జరగని పెళ్ళికి బాజాలు వాయించిన చందమే కాగలదు. (03-06-2011)


 

28, మే 2011, శనివారం

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

కూడలిలో రాష్ట్ర రాజకీయాలు – భండారు శ్రీనివాసరావు

(28-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం) 

రాష్ట్ర రాజకీయాలు దశాదిశా తెలియని స్తితిలో నాలుగు రోడ్ల కూడలిలో చతికిలపడి వున్నాయి.

ప్రధాన పార్టీల్లో పాలక పక్షం కాంగ్రెస్ ది ఒక విచిత్రమయిన స్తితి. అధికారంలో వున్నామా లేదా అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన పరిస్తితి. ప్రజలు పగ్గాలు ‘చేతి’కిచ్చి రెండేళ్లు గడిచిపోయాయి. మామూలుగా అయితే మన్నూ మిన్నూ ఏకమయ్యేలా సంబరాలు చేసుకోవాల్సిన సందర్భం. రెండేళ్ళ పాలనలో సాధించిన విజయాలు గురించి గొప్పలు చెప్పుకోవాల్సిన తరుణం. పత్రికలనిండా ప్రకటనలతో హోరెత్తించాల్సిన సమయం. కానీ అంతా గుప్ చుప్. అంతటా నీరవ నిశ్శబ్ధం. దీనికి కారణాలు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. మొన్నటికి మొన్న కడప గడపలో మాడు బొప్పికట్టేలా తగిలిన దెబ్బ. దెబ్బ తగులుతుందని తెలిసినా కాచుకోలేని దుస్తితి. ఇంత గట్టిగా తగులుతుందని ఊహించలేని నిస్సహాయ స్తితి. ఏదయితేనేం దెబ్బకు ఢిల్లీ దిగివచ్చింది. కేంద్రంలో ఆరోగ్య శాఖ చూస్తున్న రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ పార్టీకి సోకిన అనారోగ్యాన్ని సరిచేయడానికి హుటాహుటిన హైదరాబాద్ వచ్చారు. ఆ రెండ్రోజులు రాష్ట్ర రాజధానిలో సందడే సందడి. గొంతెమ్మ కోర్కెలతో కొందరు, గొంతువరకు దిగమింగుకున్న ఆగ్రహంతో మరికొందరు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో, చిన్నాచితకా నాయకులతో ఆజాద్ మంతనాలు ఏకధాటిగా సాగాయి. ఏదో జరగబోతోందన్న భ్రమలు కల్పించాయి. కానీ ఆయన చేతిలో మాత్రం ఏముంది. అసలు మంత్ర దండం హస్తినలో వుంది. రోగ నిర్ధారణ చేయగలరేమోకానీ, రోగనిదానం తన చేతులో లేదన్న విషయం ఆయనకూ తెలుసు. అందుకే చెప్పాల్సిన నాలుగు ముక్కలు పర్యటన చివర్లో ముక్తసరిగా మీడియాకు చెప్పేసి ఢిల్లీ విమానం ఎక్కేసారు. కాంగ్రెస్ కధ తెలిసిన వారికి ఇక చెప్పే కధ ఏముంటుంది. షరా మామూలు ప్రకటనలు. షరా మామూలు ఊహాగానాలు. ముఖ్యమంత్రికి క్లాసు తీసుకున్నారనీ, సహచర మంత్రులతో వ్యవహార శైలిని మార్చుకోవాలంటూ సలహా ఇచ్చారనీ రకరకాల కధనాలు. అసలు ముఖ్యమంత్రినే మారుస్తున్నారంటూ పలురకాల ప్రచారాలు. ఇంతాచేసి ఆజాద్ వచ్చి సాదించింది ఏమిటంటే సున్నకు సున్న హళ్లికి హళ్లి. ఆయన పరిస్తితీ అంతంత మాత్రమే. ఆజాద్ ఇంచార్జ్ గా వున్న తమిళనాడు ఎన్నికల్లో ఏమిజరిగిందో ఎవరికి తెలియంది కనుక.



ఇక తెలంగాణా వ్యవహారం కాంగ్రెస్ పార్టీకి వొదలని మరో తలనొప్పి. అయితే ఇది కాంగ్రెస్ కు ఒకరకంగా శాపం. ఒకరకంగా వరం. ప్రధాన ప్రత్యర్ధి తెలుగుదేశం పార్టీని మరింత ఇరుకున పెట్టడానికి రాష్ట్ర విభజన వ్యవహారం ఆ పార్టీకి కొంతమేరకు కలసివస్తోంది. తెలంగాణాను కోరుకుంటున్న టీఆర్ఎస్ కూడా ఈ విషయం లో టీడీపీ పైనే ఎక్కువగా బాణాలు ఎక్కుపెడుతోంది. ఇది ఒకరకంగా కాంగ్రెస్ కు ఊరటే. కానీ సొంత పార్టీ నాయకులు కలిగిస్తున్న ఇబ్బందులే కాంగ్రెస్ ను ఎక్కువగా ఇరకాటం లోకి నెడుతున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాలో ఇద్దరు మంత్రుల మధ్య రగిలిన రగడే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. ఈ సచివుల సమరానికి ఇంకా తెర పడక ముందే కేంద్రం లో మరో ఇద్దరు మంత్రులు- కపిల్ సిబాల్, జై రాం రమేష్ ల నడుమ కీచులాట తెరపైకి వచ్చింది. ఇక చెప్పేదేముంది. ఆవు చేలో మేస్తుంటే దూడ గట్టున మేస్తుందా? కల్ల.

స్తానిక సంస్తల ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్న మరో అగ్ని పరీక్ష. ఎన్నికలు వాయిదా వేయడానికి వీలులేకుండా సుప్రీం ఆంక్షలు. మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల్లో గెలుపు మీద సన్నగిల్లుతున్న ఆశలు. ఏమిచేయాలో పాలుబోని స్తితి. మధ్యేమార్గంగా పార్టీ గుర్తులు లేకుండా ఎన్నికలు జరిపితే పోలా అన్న ఆలోచనలు. గెలిచినవాడే మనవాడు అనుకుంటే చిక్కేలేదు. వోడినా వోడిపోయామన్న బాధా వుండదు. వోటమికి బాధ్యతా వుండదు.


ఇక, సొంత పార్టీలో లుకలుకలా కాంగ్రెస్ కు కొత్తేమీ కాదు. పోతే, తెలంగాణా పార్టీ ప్రజాప్రతినిధుల వ్యవహారం, వాళ్లు పెడుతున్న డెడ్ లైన్లు. వాటి విషయం అధిష్టానమే చూసుకుంటుందన్న ధీమా. ఏ పార్టీకి లేని అదనపు సౌలభ్యం కాంగ్రెస్ కు మరోటి వుంది. మరో మూడేళ్లదాకా అధికారం చేతిలో వుంటుంది, చేజేతులా చేజార్చుకుంటే తప్ప. అందుకే, ప్రజా సమస్యలను గాలికి వొదిలేసి రోడ్డు కూడలిలో మరో మూడేళ్ళు నిశ్చింతగా వేచి వుండొచ్చు.

పోతే తెలుగు దేశం. తెలంగాణా ప్రాంతంలో జరిగిన ఉపఎన్నికల్లో ఎదురయిన పరాభవం నుంచి పూర్తిగా తేరుకోకముందే కడప ఉప ఎన్నికల్లో డిపాజిట్లు కూడా దక్కని వైనం ఆ పార్టీని మరింత కుంగ తీసింది. ప్రధాన ప్రతిపక్షంగా వుంటూ ప్రజా సమస్యలను పట్టించుకుంటున్న పార్టీగా గుర్తింపు తెచ్చుకోవడానికి ఎంత ప్రయత్నిస్తున్నా అవన్నీ నీరు కారిపోతున్నాయన్న బాధ ఆ పార్టీది. ముందొచ్చిన చెవులకన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్న చందంగా కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఆ గుర్తింపును ఎగరేసుకుపోతున్నతీరును టీడీపీ ఓ పట్టాన జీర్ణం చేసుకోలేకపోతోంది. దీనికి తోడు పులి మీది పుట్రలా సొంత పార్టీలో తెలంగాణ రగిల్చిన చిచ్చు. రాష్ట్రం చీలకముందే దాదాపు అన్ని పార్టీలు నిట్టనిలువుగా ఈ అంశంపై చీలిపోయాయి. రెండు కళ్ళ సిద్ధాంతంతో నెట్టుకొస్తున్న తెలుగుదేశం కూడా మినహాయింపు కాదు. నాగం ఉదంతమే దీనికి ఉదాహరణ. గండిపేట తెలుగు విజయం ఆవరణలో అట్టహాసంగా ప్రారంభమయిన ముప్పయ్యో మహానాడు లో కూడా తెలంగాణా చిచ్చు రాజుకోకతప్పేట్టు లేదు. ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన స్తితి. తేల్చుకోలేని పరిస్తితి. నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ తెలుగుదేశం ఎదుర్కుంటున్న అవస్త ఇది. దీనికి తోడు వారసత్వ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకిస్తూ పురుడుపోసుకున్న తెలుగుదేశం పార్టీలో వారసత్వ రాజకీయాలను గురించి వార్తా కధనాలు వెలువడుతూ వుండడం మరో విచిత్రమయిన పరిస్తితి. నిజమే, తెలుగు దేశం పార్టీ వయస్సులో చిన్నదేమీ కాదు. యువకులుగా వుంటూ ప్రారంభంలోనే పార్టీలో చేరిన వారు ఇప్పటికి షష్టిపూర్తి చేసుకుని వుంటారు. కొత్త రక్తం ఎక్కించాల్సిన అవసరం ఆసన్న మయింది. అలాగని, ఈ ‘వార్’సత్వం వ్యవహారాన్ని మరింత ముదరనివ్వడం అసలే పీకల్లోతు కష్టాల్లో వున్న ఆ పార్టీకి మేలు చేయదు. మహానాడు లోనయినా దీనికి ముగింపు పలికితే ఆ పార్టీని ఆదినుంచీ అభిమానిస్తున్నవాళ్ళు సంతోషిస్తారు. ఎవరో అన్నట్టు రాజకీయం అంటే వారసత్వం కాదు, పౌరసత్వం. పార్టీని పునరుజ్జీవింప చేయాలనుకునే వాళ్లు ఈ విషయాన్ని గమనం లో పెట్టుకోవాలి.

క్రాస్ రోడ్డులో వున్న మరో పార్టీ టీ ఆర్ ఎస్. నిజానికి ఉద్యమ పార్టీ అయిన టీ ఆర్ ఎస్ కు కూడలిలో నిలబడి ఎదురుచూపులు చూడాల్సిన పని లేదు. తెలంగాణా ఒక్కటే లక్ష్యం కనుక పక్క దారి పట్టాల్సిన అవసరమూ లేదు. కానీ, కలుపుకుపోతేనే తప్ప విడిపోవాలన్న ప్రధాన ధ్యేయం నెరవేరని స్తితి దానిది. ఎప్పటికప్పుడు గమ్యానికి దగ్గరగా వస్తూ దూరం జరిగిపోతున్న అనుభవాలు ఈ పార్టీ సొంతం. బలమూ, బలహీనతలు తెలిసిన నాయకత్వం కనుక విజయాలను తన ఖాతాలో వేసుకుంటూ, వైఫల్యాలకు ఇతర పార్టీలను బాధ్యులను చేయడం టీ ఆర్ ఎస్ ప్రధానమయిన ఎత్తుగడగా చేసుకుంది. కిందపడ్డా పైచేయి అనిపించుకోవడంలో ఈ పార్టీకి ఎవ్వరూ సాటి కాదు. పోటీ కాదు. నిర్దేశించిన గడువులను పెంచుకుంటూ పోగల వెసులుబాటు ఈ పార్టీకి వున్నట్టుగా మరొకరికి లేదు. ప్రజల భావోద్వేగాలే పునాది కాబట్టి నాలుగు రోడ్ల కూడలిలో ఎన్నాళ్ళయినా వేచివుండగల అవకాశం వుంది.

అన్న ప్రాసన రోజునే ఆవకాయ తిని అరిగించుకోగల పుష్టి పుష్కలంగా వున్నట్టు రుజువు చేసుకుంది వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వం లోని వై ఎస్ ఆర్ పార్టీ. కడప ఉప ఎన్నికల్లో లభించిన అపూర్వ విజయం ఆ పార్టీలో అనూహ్యమయిన ఆత్మ స్తయిర్యాన్ని నింపితే, ఇతర పార్టీలలో న్యూనతా భావాన్ని పెంచి పోషించింది. తనది వాపు కాదు బలుపు అని నిరూపించుకోవాలనో ఏమో వై ఎస్ జగన్ స్వరం పెంచి మరీ సవాళ్లు విసురుతున్నారు. తన విజయం కడప గడప వరకే పరిమితం కాదని నిరూపించుకునే ప్రయత్నాలను ప్రారంభించారు. పాలక పక్షాన్ని ఎదుర్కొంటూ ప్రజా సమస్యలపై పోరాడే ప్రధాన ప్రతిపక్ష పాత్రను తనకు తానుగా భుజానికెత్తుకున్నట్టు కనిపిస్తోంది. కడప సమరంలో కకావికలయిన కాంగ్రెస్, తెలుగు దేశం పార్టీలను మరింత ఉక్కిరిబిక్కిరి చేసే క్రమంలో తన రాజకీయ ఎత్తుగడలకు రూపకల్పన చేసుకుంటున్న తీరు స్పష్టం అవుతోంది. ఏనాటికయినా జగన్ కాంగ్రెస్ పంచన చెరక తప్పదని కాంగ్రెస్ అధినాయకత్వం స్తాయిలో వెలువడుతున్న సంకేతాలను, ప్రచారాన్ని తిప్పికొట్టడాని కేమోనన్నట్టుగా జగన్ అప్పటికప్పుడు పార్టీ రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన తీరు గమనార్హం. కాపురం చేసే కళ కాలిమెట్టెలు చెబుతాయన్నట్టుగా నూతన కార్యవర్గం లో తనదయిన బలమయిన సామాజిక వర్గానికే జగన్ పెద్దపీట వేసి, బడుగు బలహీన వర్గాలను చిన్న చూపు చూసారన్న సణుగుళ్ళు, సన్నాయి నొక్కులు అప్పుడే మొదలయ్యాయి. పార్టీ పదవుల పంపకం అంటే అంత ఆషామాషీ వ్యవహారం కాదు. ఎన్నో ధక్కామొక్కీలు తిన్న పార్తీలే ఈ విషయంలో తల బొప్పిళ్ళు కట్టించుకున్న దాఖలాలు అనేకం. అయినా అనుభవం నేర్పే పాఠాల ముందు మరొకరు నేర్పే నీతి బోధలు బలాదూరే. అయితే, జనాన్ని నమ్ముకుని నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డ వై ఎస్ జగన్ కు లక్ష్యం కడు దూరం లో వుంది. మధ్యలో కాడి వొదిలేయ్యకుండా ముందుకు సాగాల్సిన బరువయిన బాధ్యత కూడా ఆయన భుజస్కందాలపై వుంది. జారిపోతే, పార్టీనే జావకారిపోతుంది.

సామాజిక న్యాయం నినాదంతో ప్రజల ముందుకు వచ్చి, ప్రజా తీర్పుకు కట్టుబడివుండే ఓరిమి లేకుండా కాంగ్రెస్ లో విలీనం కావడానికి సిద్ధపడిన చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ దశా దిశా కోల్పోయి నాలుగు రోడ్ల నడుమ దిక్కులు చూస్తోంది. నిర్దేశించుకున్న గమ్యం వైపు ప్రయాణం కొనసాగించడానికి వీలులేకుండా ఇంజను పాడయి, ఇంధనం కరువయిన స్తితిలో ఆ పార్టీ అయోమయావస్తలో వుంది.

పోతే, వామపక్షాలు - పశ్చిమ బెంగాల్ లో ఎదురయిన ఘోర పరాభవంతో దిక్కు తోచని స్తితిలో వున్నాయి. రాష్ట్రం లో మారిపోతున్న రాజకీయ సమీకరణాల్లో తమను ఇముడ్చుకోగల రాజకీయ ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తున్నాయి. ఏదో ఆసరాతో కూడలి దాటినా ఎక్కబోయే అధికార పీఠం అంటూ ఏమీ లేదు కనుక వేచిచూసే సహజ వైఖరిని కొనసాగిస్తున్నాయి.

రాష్ట్రం లోని రాజకీయ పక్షాలన్నీ మొత్తం మీద దిశా నిర్దేశనం దొరకని స్తితిలో వున్నాయనే చెప్పాలి. కానీ, దీనివల్ల వాటికి వాటిల్లే తక్షణ ప్రమాదం ఏమీ లేదు. కానీ, జనం మాటేమిటి? వాళ్ళిలా ఎన్నాళ్ళు ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూడాలి? (27-05-2011)
























21, మే 2011, శనివారం

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు

మూడో కృష్ణుడు రానున్నారా ? – భండారు శ్రీనివాసరావు


(21-05-2011 తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)

కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం అనంతరం రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ అజాద్ హైదరాబాద్ రానున్నారని వార్తలు వచ్చినప్పుడు ఆయన ఎజెండాలో ‘జగన్- తెలంగాణా’ అనే రెండే రెండు అంశాలు వున్నాయని అంతా అనుకున్నారు.



అయితే, రాష్ట్ర రాజధానిలో రెండు రోజులు మకాం వేసిన ఆజాద్ - చిన్నా పెద్దా అనే తేడా లేకుండా కాంగ్రెస్ నాయకులను విడివిడిగా కలివిడిగా కలుసుకుని అభిప్రాయాలు సేకరిస్తున్నప్పుడే స్తానిక మీడియా ఆయన ఎజెండాలో ‘ముఖ్యమంత్రి మార్పు’ అనే మరో విషయాన్ని తనకు తానుగా చేర్చింది. ఆజాద్ ని కలిసి వచ్చిన వాళ్ళలో అనేకులు ముఖ్యంగా ముఖ్యమంత్రి సొంత జిల్లాకు చెందినవాళ్ళే మీడియా ముందు మాట్లాడుతూ కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలిపై ఆజాద్ కు ఫిర్యాదు చేసినట్టు బహిరంగంగా చెప్పడం ఈ ఊహాగానాలకు మరింత ఊపిరి పోసింది.

ఆజాద్ హైదరాబాదులో వున్న సమయంలోనే, పార్టీ నాయకులతో, సహచర మంత్రులతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అనుసరిస్తున్న తీరు గురించి, కడప ఉప ఎన్నికల్లో రాష్ట్ర అధినాయకత్వం వైఫల్యం గురించి ఢిల్లీ నాయకులకు పెద్దయెత్తున ఫిర్యాదులు అందినట్టు మీడియాలో వార్తలు వెలువడ్డాయి. కార్యకర్తలు కోరుతున్నది సీ ఎం మార్పా లేక సీ ఎం లో మార్పా అని ఆజాద్ వాకబు చేసినట్టు కూడా సమాచారం. బహుశా దీన్ని దృష్టిలో వుంచుకునే కాబోలు ఆజాద్ వెంట హైదరాబాదు వచ్చిన మరో ఏ ఐ సీ సీ ప్రతినిధి కృష్ణమూర్తి ఢిల్లీ తిరిగి వెడుతూనే ఒక తెలుగు దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఈ వార్తలను ఖండించారు. కిరణ్ కుమార్ రెడ్డి పై ఎలాటి ఫిర్యాదులు రాలేదని, తమను కలుసుకున్న రాష్ట్ర నాయకుల్లో ముఖ్యమంత్రిని ప్రశంసించిన వారే ఎక్కువనీ వివరణ ఇచ్చుకున్నారు.

నిజానికి ముఖ్యమంత్రి మార్పు అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నష్ట నివారణకు దోహదం చేస్తుందని అనుకోవడానికి లేదు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ సమయంలో జరిగిన కాంగ్రెస్ ముఖ్య మంత్రుల మార్పు పార్టీకి ఎంత చేటు తెచ్చిందో అందరికీ తెలుసు. అయినా అనుభవాలనుంచి గుణపాఠాలు నేర్చుకునే సంస్కృతి ఆ పార్టీలో లేదు. అందువల్లనే మళ్ళీ అదే పొరబాటు మళ్ళీ చేసి 1989 లో ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని తదుపరి ఎన్నికల్లో బంగారు పళ్ళెంలో పెట్టి తెలుగుదేశానికి అందించిన ఘనమయిన గతం కూడా కాంగ్రెస్ పార్టీ సొంతం.

అయితే, ఆజాద్ పర్యటన లక్ష్యం ముఖ్యమంత్రి మార్పు కాదన్నది ఆయన మాటల్లోనే తేలిపోయింది. అలాగని మూడేళ్లలో ఎదురయ్యే ఎన్నికలను ప్రస్తుత ముఖ్యమంత్రి నేతృత్వం లోనే నిర్వహిస్తారా అంటే అనుమానమే. ఎవరిని ఎంతవరకు వాడుకోవాలి? ఎవరిని ఎప్పుడు విసిరి కొట్టాలి? అన్నది కాంగ్రెస్ అధిష్టానానికి వెన్నతో పెట్టిన విద్య.



మొత్తం పదిహేడు గంటల్లో రెండువేలమందిని కలుసుకున్నానని గులాం నబీ ఆజాదే పర్యటన ముగింపులో మీడియాతో చెప్పారు. అంటే తనను కలుసుకున్నవాళ్ళల్లో ఒక్కొక్కరికీ ఆయన ఇచ్చిన సమయం యాభయ్ సెకన్లకు మించదు. అయినా చాలామంది బయట మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ దూతలకు తమ మనసులోని భావాలను పూసగుచ్చి చెప్పుకోగలిగామన్న సంతృప్తిని వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఈ రకమయిన భేషజాలు అతి సహజమే. మహిళా కాంగ్రెస్ నేత గంగాభవాని ఒక అడుగు ముందుకు వేసి – మరో మూడేళ్లపాటు కిరణ్ కుమార్ రెడ్డే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆజాద్ తనకు హామీ ఇచ్చినట్టు మీడియాతో చెప్పడం ఈ భేషజాలకు పరాకాష్టగా భావించాలి లేదా ఆవిడ స్వామి భక్తికి దీన్నొక మచ్చుతునకగా పరిగణించి వొదిలివేయాలి.

ఒక పక్క గుంటూరులో వేలసంఖ్యలో జనం పాల్గొన్న జగన్ రైతు దీక్ష ముగింపు సభకు జగన్ అనుకూల కాంగ్రెస్ శాసన సభ్యులు, శాసనమండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు అనేకమంది హాజరవుతున్న సమయంలోనే మరోపక్క హైదరాబాదులో గులాం నబీ ఆజాద్ ని కలవడానికి తిరునాళ్ళ మాదిరిగా కాంగ్రెస్ శ్రేణులు కదిలివచ్చాయి. వినదగునెవ్వరు చెప్పిన తరహాలో అభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఆజాద్ కొనసాగిస్తూనే తన అజెండాలోని అంశాలు అంటే – జగన్ గురించీ, తెలంగాణా గురించీ ఆరా తీసారని బుల్లితెరలపై స్క్రోలింగులు పరుగులు తీసాయి. ఆయన్ని కలవడానికి వచ్చినవాళ్ళు కూడా తమ మనసులోని అజెండాని మరిచిపోయినట్టులేదు. గాడితప్పిందని అనుకుంటున్న రాష్ట్ర పార్టీ పరిస్తితులను చక్కదిద్దేందుకు అధిష్టానం పనుపున వచ్చిన ఆజాద్ ని దాదాపు అందరూ కోరిన ఒకే విషయం పదవుల పంపిణీ వ్యవహారం. పార్టీ పదవులు, నామినేటేడ్ పదవులు గురించి వేచి చూస్తూనే విలువయిన రెండేళ్ళ కాలం ఇట్టే గడిచిపోయిందని, ఇంకా ఇలానే రోజులువెళ్ళదీస్తే వచ్చేఎన్నికలనాటికి పార్టీ తరపున నిలబడే కార్యకర్తలను కూడా వెతుక్కోవాల్సివుంటుందని తమ గోడు వెళ్ళబోసుకున్నారు. ఈ రకమయిన నాన్చుడు ధోరణి వల్ల నిస్పృహ చెందే పార్టీ శ్రేణులు అందుబాటులోకి వచ్చిన ప్రత్యామ్నాయం వైపు దృష్టి సారించే అవకాశం వుంది కాబట్టి వెంటనే ఈ అంశానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం గురించి నొక్కిచెప్పారు.



ఆజాద్ తో భేటీని రవ్వంత బాగానే ఉపయోగించుకున్నామన్న సంకేతాలను మీడియాలోకి వొదలడంలో తెలంగాణా ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సఫలమయ్యారనే చెప్పాలి. వారికి తీసిపోని రీతిలో సీమాంధ్ర ఎంపీలు సయితం తమ వాణిని, వాదాన్ని బలంగానే వినిపించారు. మధ్యే మార్గంగా అమలాపురం కాంగ్రెస్ ఎంపీ హర్షకుమార్ - హైదరాబాదును ఉమ్మడి రాజధానిని చేసి తెలంగాణా ఇచ్చినా సమ్మతమేనన్న ధోరణిలో ఏకంగా ఒక లిఖితపూర్వక మెమోరాండాన్నే ఆజాద్ కు అందచేసినట్టు భోగట్టా. ఇక ఈసారి తెలంగాణా కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, గతంలో డిసెంబర్ తొమ్మిది చిదంబరం ప్రకటన అనంతరం సీమాంధ్ర సహచరులు తమకు కొట్టిన గండిని గుర్తుపెట్టుకుని కాస్తంత గొంతు పెంచి మరీ తమ వాదాన్ని వినిపించారు. అంతే కాకుండా ప్రత్యేక తెలంగాణా ఏర్పాటు మినహా తమకు ఏదీ సమ్మతం కాదన్న హెచ్చరికను ఆజాద్ కోర్టులో వుంచారు. తెలంగాణాకు అనుకూలంగా కేంద్రం అతి తొందరగా ప్రకటన చేయని పక్షంలో అసలు సిసలు అస్త్రం తమ జేబులోనే వుందని పీ సీ సీ మాజీ నేత కేశవరావు కుండ బద్దలు కొట్టారు. తన అజెండాలో తెలంగాణా అంశం వుండడంవల్లనో ఏమో ఆజాద్ కూడా ఇరుపక్షాల వాదనను శ్రద్ధగా విన్నారు.

కడప ఉప ఎన్నికల ప్రభావం పార్టీపై , ప్రభుత్వంపై ఏమాత్రం వుండదంటూ చేస్తున్న ప్రకటనలకు అనుగుణంగా వైఎస్సార్ పార్టీ గురించి పైకి పట్టనట్టు కనిపించినా, ఢిల్లీ నాయకులు మాత్రం పార్టీ శ్రేణులనుంచి తగిన సమాచారాన్నే రాబట్టినట్టు భోగట్టా.

జగన్ మోహన్ రెడ్డిని ఆదినుంచి వ్యతిరేకిస్తున్నవారు ఆజాద్ తో జరిపిన భేటీలో తమ పాత పల్లవినే మరోమారు వినిపించారు. సకాలంలో తగిన చర్యలు తీసుకోకపోతే ముందు ముందు దిద్దుబాటుకు కూడా వీలులేకుండా పార్టీ దెబ్బతినిపోతుందని అధిష్టానాన్ని హెచ్చరించారు. పార్టీలో వున్న జగన్ కోవర్టులపై వెంటనే వేటు వేయాలని,

ప్రభుత్వం వద్ద వున్న అధికారాలతో విచారణలు ప్రారంభించి జగన్ దూకుడుకు కళ్ళెం వేయాలని కూడా సలహా ఇచ్చారు.

మంత్రివర్గంలోనే జగన్ కోవర్టులు వున్నారంటూ మరో కలకలం చెలరేగింది. నలుగురు మంత్రులు జగన్ కు అనుకూలంగా పనిచేస్తున్నారని, వారిని మంత్రివర్గం నుంచి తొలగించాలని సాక్షాత్తు ముఖ్యమంత్రే గులాం నబీ ఆజాద్ ని కోరినట్టు పత్రికల్లో వార్తలు గుప్పుమన్నాయి. పార్టీ సీనియర్ నేత పాల్వాయి గోవర్ధనరెడ్డి, ఎంపీ మధు యాష్కీ, మంత్రి శంకర్ రావు, మాజీ మంత్రి జే సీ దివాకర్ రెడ్డి బాహాటంగా చేసిన ఆరోపణలు ఈ వార్తలకు బలం చేకూరుస్తున్నాయి. కొందరు మంత్రులు లోపాయికారీగా జగన్ కు సహకరిస్తున్నారన్నది వారి ఆరోపణల సారాంశం.



రెండు రోజులపాటు హైదరాబాదులో మకాం వేసి గులాం నబీ ఆజాద్ పార్టీ పరిస్తితి గురించి కొత్తగా తెలుసుకున్న విషయాలేమిటి అన్నది ఎవ్వరికీ అర్ధం కాని సంగతి. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలూ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహార శైలీ ఆయనకు కొత్తేమీ కాదు. అలాగే, ఆజాద్ కూడా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు కొత్త కాదు. గతంలో సైతం ఆంధ్ర ప్రదేశ్ కు సంబంధించి ఇప్పటి పాత్రనే పోషించి – రాజకీయ జాదూ అన్న కీర్తిని మూటగట్టుకున్నారు. కాకపొతే, రాజశేఖరరెడ్డి ఆకస్మిక మరణానంతరం ఏర్పడిన నూతన రాజకీయ వాతావరణానికి మాత్రం ఆజాద్ కొత్తే అని చెప్పాలి. అలాగే, వై ఎస్ జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి, కొత్త పార్టీ పెట్టి, ఇటీవలి కడప ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మట్టి కరిపించిన తరువాత ఆంధ్ర ప్రదేశ్ లో పార్టీ భవిష్యత్ పై ముసురుకుంటున్న నీలి నీడల నేపధ్యంలో రూపుదిద్దుకుంటున్న నూతన రాజకీయ చిత్రం మాత్రం ఆయనకు మరీ కొత్త అని చెప్పుకోవాలి.

అందుకే ఆయన అవసరం అయినదానికన్నా ఎక్కువ సమయమే పార్టీ వారికి కేటాయించారని అనుకోవాలి. పరిమితులు తెలిసిన అనుభవశాలి కనుక పార్టీ శ్రేణులు చెప్పిన విషయాలను ఓపిగ్గా వినడం ద్వారా వారి మనస్సులో గూడుకట్టుకుని వున్న ఆందోళనలు సమసిపోవడానికి ఒక వెంటిలేటర్ మాదిరిగా సాయపడ్డారనుకోవాలి. సమస్య తీర్చడం సాధ్యం కానప్పుడు సమస్యను వినడం ద్వారా దాని తీవ్రతను తగ్గించ వచ్చన్న సూత్రాన్ని ఆజాద్ తన హైదరాబాద్ పర్యటనలో బాగా ఉపయోగించుకున్నారు. ఆయన్ని కలిసిన ఏ ఒక్కరిని ఆయన నిరుత్సాహ పరచకపోవడమే ఇందుకు నిదర్శనం.

మొత్తం మీద ఆజాద్ హైదరాబాద్ పర్యటన పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపిందని కొందరు రాష్ట్ర నాయకులు సంతృప్తి పడుతున్నారు. విషయాలన్నీ అర్ధం చేసుకున్న ఢిల్లీ పెద్దలు తమ పీఠాలను ఎప్పుడు కదిలిస్తారో అని మరికొందరు కలత పడుతున్నారు.

కానీ ఒక విషయం.

వచ్చారు – విన్నారు – వెళ్లారు అనికాకుండా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకు ఆయన దిశా నిర్దేశం ఇచ్చినట్టయితే బాగుండేదని పార్టీ అభిమానులే పెదవి విరుస్తున్నారు. రైతు సమస్యలతో విపక్షాలు రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్న సమయంలో జరిగిన ఈ పర్యటనలో పార్టీ సమస్యలు తప్ప ప్రజల సమస్యలు కాంగ్రెస్ పట్టించుకోవడం లేదన్న విమర్శలను వాళ్లు ఉదహరిస్తున్నారు.

ఇక నుంచయినా రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ‘జగన్నామ స్మరణ’కు స్వస్తిచెప్పి జనాలను పట్టించుకునేలా చేయగలిగితే ఆజాద్ హైదరాబాద్ పర్యటన ఫలవంతమైనదని సంతోషించవచ్చు. (21-05-2011)



13, మే 2011, శుక్రవారం

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు

ఇది నిజం. నిజంగా నిజం – భండారు శ్రీనివాసరావు




‘నేను చదువుకున్నవాడినన్న మాటే కాని నీకున్న ప్రపంచ జ్ఞానం నాకు లేదు’ అని ఈ మధ్య టీవీలో చూసిన ఓ సినిమాలో నిజాయితీగా వొప్పుకుంటుందొక మగ పాత్ర తన భార్యతో మాట్లాడుతూ.

క్షేత్రస్తాయి సమాచారం తెలుసుకోకుండా టీవీ చర్చల్లో పాల్గొనే కుహనా మేధావులనుంచి కూడా ఈ మాదిరి నిజాయితీని ఆశించడంలో తప్పులేదేమో. ఇప్పటికయినా వారి కళ్లు తెరిపిళ్లు పడివుంటాయేమో.

వీళ్ళతో వచ్చిన చిక్కేమిటంటే - వీళ్ళు తమ వాదమే వేదమనుకుంటారు. దాన్నే జనమంతా నమ్మాలనుకుంటారు.

కొన్నేళ్ళ క్రితం జరిగిన సంఘటన ఇది. ఓ పెళ్ళిలో బాగా ఎరిగున్న ఓ ముసలావిడ కనిపించింది. ఎప్పుడు తారసపడ్డా ‘దేవుడికి నామీద దయకలగడంలేదల్లే వుంది. ఇంకెన్నాళ్లిలా బతకాలని రాసిపెట్టాడో!’ అని నిర్వేదంగా మాట్లాడుతుండేది. అలాటిది ఆరోజు ‘మరో నాలుగేళ్ళు బతికితే బాగుండు’ అనడం ఎంతో వింతగా అనిపించింది. ‘ఎందుకవ్వా?’ అనడిగితే ‘మరొక్కసారి ఆఖరుసారి వోటు వేసి చనిపోవాలనివుంద’న్నది. అదేమీ ఆశ్చర్యం కలిగించేది కాదు. ఎందుకంటే, స్వతంత్రం వచ్చినప్పటినుంచి ఆవిడ వోటు వెయ్యకుండా వున్న సందర్భం లేదు. ఆవిడది కాంగ్రెస్ కుటుంబం. ఆమె వొంట్లో పారేది కాంగ్రెస్ రక్తం. జనతా పార్టీ ప్రభంజనం, ఎన్టీయార్ సుడిగాలి వీస్తున్న రోజుల్లో కూడా ఆవిడ వోటు కాంగ్రెస్ కే. అభ్యర్ధి ఎవరన్నది అనవసరం. కాడి జోడెడ్ల గుర్తు నుంచి ఆవు దూడా గుర్తుకు, అక్కడినుంచి చేతి గుర్తుకు- ఆ పార్టీ గుర్తు మారిపోవడం గుర్తు పెట్టుకుని మరీ వోటు వేసేది. ఆమె గురించి తెలిసిన వాళ్ళందరికీ తెలిసిన విషయమే ఇది.

కానీ, ఆమె గురించి పూర్తిగా తెలియదన్న సంగతి మాత్రం ఆరోజు మాటల్లో బయట పడింది. ఈ మూడేళ్ళు ఎట్టాగో బతికి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు వోటు ‘వెయ్యకుండా’ చనిపోవాలన్నది తన ఆఖరు కోరిక అని చెప్పినప్పుడు అక్కడ వున్న వాళ్ళందరం ఆశ్చర్యపోయాము. రాజశేఖరరెడ్డి చనిపోయినప్పటినుంచి కాంగ్రెస్ పార్టీ కుక్కలు చింపిన విస్తరిలా తయారయిందని, ఇక చస్తే ఆ పార్టీకి వోటు వెయ్యననీ ఖరాఖండిగా తేల్చిచెప్పింది. అప్పటికి వై ఎస్ జగన్ మోహన రెడ్డి కాంగ్రెస్ పార్టీని వొదిలి పెట్టనూ లేదు. కొత్త పార్టీ పెట్టనూ లేదు. కాకపొతే, ఆయన తలపెట్టిన ఓదార్పు యాత్ర గురించి పార్టీలో నానా రభస సాగుతున్న రోజులవి.

కాంగ్రెస్ కు వోటు వెయ్యకుండా చనిపోవాలనివుందని ఆ ముసలావిడ చెప్పిన మాట రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్తితికి అద్దం పడుతోంది. కానీ, దురదృష్టం, సాధారణ జనంలో, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని కారణరహితంగా అభిమానించే వారిలో వచ్చిన ఈ మార్పుని గమనించకుండా ఇటు రాష్ట్ర స్తాయిలోనూ, అటు కేంద్రంలోనూ వున్న ఆ పార్టీ నాయకులు ఒంటెత్తు పోకడలకు పోయారు. దరిమిలా పార్టీ పట్ల ప్రజల్లో ఏర్పడ్డ ఏహ్యతే కడప ఉప ఎన్నికల ఫలితాల్లో ప్రతిఫలించింది.(13-05-2011)