20, మార్చి 2011, ఆదివారం

కోతిచేష్ట – భండారు శ్రీనివాసరావు


కోతిచేష్ట – భండారు శ్రీనివాసరావు


విమానం కూలిపోయింది. పైలట్లు, ఎయిర్ హోస్టెస్ లతో సహా అందులో ప్రయాణిస్తున్నవారందరూ ఈ దుర్ఘటనలో మరణించారు, ఒక్క ఒక కోతి తప్ప. (విమానంలో కోతియేమిటంటే ఇక కధే లేదు)  


దాన్ని ఆసుపత్రిలో చేర్చారు. కాస్త కోలుకున్న తరవాత దుర్ఘటన కారణాలు తెలుసుకునేందుకు అధికారులు ఆ కోతిని విచారించడం ప్రారంభించారు. ఈ కధలో కొత్తదనం ఏమిటంటే ఆ కోతికి మనిషి భాష తెలుసు.


దర్యాప్తు ఇలా సాగింది.


అధికారి: “విమానం బయలుదేరినదగ్గరినుంచి అన్ని విషయాలు చెప్పు. అసలేం జరిగింది.”


కోతి: “ఏముంది ఎయిర్ హోస్టెస్ నాకు పళ్ళూ బిస్కెట్లు పెట్టింది. అవి తింటూ కూర్చున్నాను.”


“నీ సంగతి సరే! మిగిలినవారు ఏం చేస్తున్నారు?”


“సీటు బెల్టులు పెట్టుకున్నారు. మందు కొడుతూ కూర్చున్నారు”


“పైలట్లు ఏం చేస్తున్నారు?


“ కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు”


“తరవాత?”


“తరవాత ఏముంది ? ప్రయాణీకులందరూ ఫుల్లుగా మందు కొట్టి, ఎయిర్ హోస్టెస్ లు పెట్టింది తిని నిద్రలోకి జారుకున్నారు”


“మరి ఎయిర్ హోస్టెస్ లు ఏం చేస్తున్నారు?”


“ తీరిగ్గా కూర్చుని లిప్ స్టిక్ దిద్దుకుంటూ, మేకప్ సరిచేసుకుంటున్నారు.”


“పైలట్లు?”


“యధామాదిరి కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నారు.”


“అది సరే! ప్రమాదం జరగడానికి ముందు ఎవరేం చేస్తున్నారు ?”


“ఎయిర్ హోస్టెస్ లు పైలట్లకు ముద్దు పెడుతున్నారు.”


“మరి. పైలట్లు ?”


“ ఎయిర్ హోస్టెస్ లకు తిరిగి ముద్దు పెడుతున్నారు”


“నువ్వేం చేస్తున్నావు?”


“ఏం చేస్తాను. కాక్ పిట్లో కూర్చుని విమానం నడుపుతున్నాను.”


(నెట్ లో చక్కర్లుకొడుతున్న చిన్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్చానువాదం)

19, మార్చి 2011, శనివారం

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు

రైల్లో అమెరికా ప్రయాణం - రేడియో రోజులు - భండారు శ్రీనివాసరావు


రైల్లో అమెరికా ప్రయాణం

కొందరు తాము నవ్వుతూ ఇతరులను నవ్వించాలని చూస్తారు. మరికొందరు తాము మాత్రం నవ్వుతూ పక్కవారిని ఏడిపించాలని చూస్తారు. ఇంకొందరు తాము నవ్వరు. కానీ, తమ మాటలతో అందరినీ కడుపుబ్బ నవ్విస్తుంటారు. ఇదిగో ఈ కోవలోని వారే ఈనాటి నా వ్యాసుల వారు. అంటే వ్యాస మహర్షులు కాదు. ఈ వ్యాసానికి ప్రేరకులని కవి హృదయం. ఆయనే తురగా కృష్ణ మోహనరావుగారు. బోలెడంత ఘన కీర్తిని తన వెంటబెట్టుకుని, బోలెడు బోలెడు జ్ఞాపకాలను మనందరికీ వొదిలిపెట్టి స్వర్గానికి వెళ్లిపోయి రమారమి ముప్పయ్యారేళ్ళు అవుతోంది. ఈ రోజు పోతే రేపటికి మూడు అని తేలిగ్గా తీసుకునే రోజుల్లో – ఫిబ్రవరి పదో తేదీన (ఫిబ్రవరి 21 ఆయన జయంతి – అక్టోబర్ రెండో తేదీ వర్ధంతి. ఆరోజు కృష్ణా ఎక్స్ ప్రెస్ ప్రారంభోత్సవాన్ని కవర్ చేయడానికి వెళ్లి, తప్పిపోయిన రైలును అందుకోవడానికి రైల్వే అధికారులు ఏర్పాటు చేసిన వాహనంలో వెడుతూ నక్రేకల్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో మరణించి ఎవరికీ అందనంత దూరాలకు వెళ్లి పోయారు) హైదరాబాదు సిటీ సెంట్రల్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన ఆయన సంస్మరణ సభకు ఎక్కడెక్కడినుంచో వచ్చిన ఆత్మీయులను చూస్తుంటే మంచి మనిషికీ, మంచి జ్ఞాపకాలకూ ఏనాటికీ మరణం లేదనిపించింది.


కృష్ణమోహనరావు గారు రేడియో మనిషి. ఆ మీడియాన్ని ఆయన ఆపోసన పట్టారు. ఈ ప్రజా మాధ్యమం పూర్తిగా సర్కారు చేతుల్లో వున్నప్పుడు ఆయన రేడియో కొలువుని అటు ఉద్యోగ ధర్మానికి మాట రాకుండా, ఇటు సామాజిక బాధ్యతకు లోటు రాకుండా నెగ్గుకొచ్చిన తీరును ఈ సమావేశంలో ఆనాటి ఆయన సహోద్యోగులు మరోసారి గుర్తు చేసుకున్నారు. అక్షరాలను అందమయిన చిత్రాలుగా గీస్తూ వాటితో వెన్నెట్లో, చీకట్లో సయితం సతతం ఆడుకునే  'రేడియో'  సుధామ - కృష్ణమోహన రావు గారితో రేడియో గడిపిన రోజులను గుర్తు చేసుకుంటే, దూరదర్శన్ డైరెక్టర్ శైలజా సుమన్ - జానకీరాణి గారి కుటుంబంతొ తన సాన్నిహిత్యాన్ని నెమరువేసుకున్నారు.


ఆయన పేరిట నెలకొల్పిన అవార్డును అందుకున్నది దూరదర్శన్ కరస్పాండెంటు ఈమని కృష్ణారావు. రేడియో జర్నలిజంలో తనకు అక్షరాభ్యాసం చేసింది తురగా కృష్ణ మోహనరావుగారే అని అప్పటి రోజులను మననం చేసుకుంటూ, విధి నిర్వహణలో తురగావారి అంకితభావమే తనకు మార్గదర్శిగా నిలుస్తూవచ్చిందని పేర్కొన్నారు. కాజువల్ సిబ్బందిని కూడా ‘నా సహోద్యోగి’ (మై కొలీగ్) అంటూ బయటవారికి పరిచయం చేసే ఔన్నత్యం కృష్ణమోహన రావుగారి రక్తంలో వుందన్నారు.


కార్యక్రమానికి అధ్యక్షత వహించిన సీనియర్ ఐ .ఏ. ఎస్. అధికారి శ్రీ రమణాచారి మాట్లాడుతూ- ‘వీలయితే నాలుగు మాటలు, కుదిరితే కప్పుకాఫీ అనుకునే రోజుల్లో ఇంతమంది ఆత్మీయులు హాజరు కావడం కృష్ణమోహన రావు గారి గొప్పదనానికి అద్దంపడుతోంద’న్నారు.


కర్నాటక మాజీ గవర్నర్ శ్రీమతి వీ.ఎస్. రమాదేవి తమ ప్రసంగంలో వినిపించిన – కృష్ణమోహనరావు, జానకీ రాణిల ‘పెళ్ళికి ముందు ప్రేమ కధను’ శ్రోతలు ఆసక్తితో విన్నారు. ‘గుంభనగా, నిదానంగా వుండే కృష్ణమోహనరావు, చెంగు చెంగునా గంతులువేసే జానకీ రాణి- యాదగిరిగుట్టలో చేసుకున్న ప్రేమపెళ్లికి తానే ప్రత్యక్ష సాక్షిన’ని అంటూ వారి కుటుంబంతో తనకున్న చనువును కళ్ళు చెమర్చేలా చెప్పుకొచ్చారు. భర్త ప్రాణం కోసం యముడిని వెంటాడిన సతీ సావిత్రిలా – జానకీరాణి – ఇన్నేళ్ళ తరవాత కూడా భర్తను సజీవంగా వుంచే ఇలాటి కార్యక్రమాలను– పైపెచ్చు వొంట్లో బాగాలేకపోయినా లేని సత్తువను తెచ్చుకుని నిర్వహిస్తూ వుండడం చూస్తూ – ఒకనాటి సహోద్యోగిగా గర్వపడుతున్నానని చెప్పారు.


ఇలాటి సభల్లో వక్తలు దారితప్పి అనవసర ప్రసంగాలతో చీకాకు పెడతారన్న అపోహను తొలగించడానికా అన్నట్టు కార్యక్రమం ఆసాంతం ఆసక్తిగా సాగిపోవడం కృష్ణ మోహనరావు గారి అభిమానులను మరింత అలరించింది. స్వతహాగా హాస్యప్రియుడయిన తురగా వారికి నిజమయిన శ్రద్ధాంజలి రీతిలో ప్రసిద్ధ రచయిత్రి  సోమరాజు సుశీలాదేవి – కధా ప్రసంగం పేరుతొ చదివిన కధ – సభా ప్రాంగణాన్ని నవ్వులతో కదిలించింది. అమెరికాలో వున్న పిల్లల దగ్గరకు ప్రయాణమై వెడుతున్నప్పుడు ఒక గృహిణికి  ఎదురయిన అనుభవాలను హాస్యంతో రంగరించి శ్రోతలను అలరించారు. కధలు రాయడంలో చేయి తిరిగిన సుశీలా దేవి గారు కధను చదివి వినిపించడంలో కూడా అందెవేసిన చేయి అనిపించారు. ఆరోజుల్లో అమెరికా వెళ్ళాలంటే రైల్లో మద్రాసు వెళ్లి అక్కడినుంచి విమానంలో ఆ దేశానికి వెళ్ళేవారు. అమెరికాకు రైల్లో బయలుదేరామంటూ ప్రారంభించి హాస్యం తొణికించారు.


తురగా దంపతుల ముద్దుల కుమార్తెలు ఉషారమణి (ఆకాశవాణి న్యూస్ రీడర్ ) శోభ, జర్నలిస్ట్ కేబీ లక్ష్మి  - ముగ్గురూ  కార్యక్రమాన్ని ముందునుంచి, వెనుకనుంచి దన్నుగా నిలబడి  విజయవంతంగా నిర్వహించారు.


ఇక, నాకు తెలిసి తురగా కృష్ణ మోహనరావు గారు ఒక అద్భుతమయిన హాస్య రచయిత. సునిశితమయిన వ్యంగ్యానికి ప్రతీక. ‘ప్రవీణ్’ పేరుతొ ఆంధ్ర పత్రిక వార పత్రికలో వారం వారం వారు రాసిన ‘రాజధాని కబుర్లు’ నా బోటి పాఠకులకు అక్షరామృతం. వారి అకాల మరణం తరవాత ఆయన  వొదిలి వెళ్ళిన రేడియో విలేకరి  ఉద్యోగంలో నేను ప్రవేశించడం కేవలం నా సుకృతం.(10-02-2011)









జపాన్ ఉపద్రవమే ఇక్కడ జరిగివుంటే? – భండారు శ్రీనివాసరావు

జపాన్ ఉపద్రవమే ఇక్కడ జరిగివుంటే? – భండారు శ్రీనివాసరావు


ఉవ్వెత్తున లేచిన సముద్రపు అలలు చెలియలికట్టదాటి అంతెత్తున ఎగసిపడి మిన్నూ మన్నూ ఏకం చేస్తూ తమ ఉగ్రరూపాన్ని ప్రదర్శించినప్పుడు –

ప్రకృతి ప్రకోపానికి గురయి, మానవ నిర్మిత కట్టడాలన్నీ పేకమేడల్లా కూలిపోతున్నప్పుడు,

పొంగి పొరలిన సంద్రపు నీటిలో పెద్ద పెద్ద కార్లూ, విమానాలు కాగితపు పడవల్లా కొట్టుకుపోతున్నప్పుడు-

ఈ వార్తా చిత్రాలనన్నింటినీ టీవీ తెరలపై చూస్తున్న ప్రతి ఒక్కరూ – జపాన్ లో జరిగిన ఘోరకలి ఇక్కడ జరిగుంటే ఏమయ్యేదని ఒక్క క్షణమయినా కలవరపాటుకు గురయివుంటారు.

‘యుగాంతం’ వంటి హాలీవుడ్ సినిమాల్లో చూపించిన గ్రాఫిక్ దృశ్యాలను తలదన్నే విధంగా ప్రకృతి ప్రదర్శించిన విలయతాండవం ముందు – మనిషి మరుగుజ్జుతనం మరోసారి ప్రపంచానికి వెల్లడయింది.

మూడింట రెండువంతులు నీరు ఆవరించివున్న ఈ భూమండలంలో – జపాన్ అనేది అనేకానేక చిన్న చిన్న దీవుల సమూహం. ఈ దీవుల్లో – హోన్షూ, షికోకు, హూక్కై దో, క్యుషూ అనేవి ప్రధానమైనవి.

అయితే బయట ప్రపంచానికి తెలిసిన జపాన్ అంటే హోన్షూ నే. ఎందుకంటె, జపాన్ అనగానే అందరికీ తటాలున గుర్తొచ్చే టోకియో, ఒసాకా,నగాయో,క్యోటో నగరాలు హోన్షూ అనే ఈ ప్రధాన భూభాగం లోనే వున్నాయి. జపాన్ జనాభాలో అత్యధిక భాగం హోన్షూ లోనే నివసిస్తూవుండడం కూడా మరో కారణం. పైగా, దేశ ఆర్ధిక వ్యవస్తకు ఇది గుండెకాయ లాటిది. విస్తీర్ణం దృష్ట్యా పెద్దదే అయినా, ప్రపంచపఠంలో చూస్తే మాత్రం హోన్షూ దీవి ఒక అరటి పండు మాదిరిగా కనిపిస్తుంది. పసిపిక్ మహా సముద్రం మధ్య వున్న ఈ దీవి, యావత్ ప్రపంచంలో ఒక సంపన్నదేశంగా జపాన్ ఆవిర్భావానికి దోహదం చేసింది. ఎలెక్ట్రానిక్, మోటారు పరిశ్రమలతో మొత్తం ప్రపంచ దేశాలలోనే పేరుపొందిన జపాన్ – సునామీలు, భూకంపాలకు కూడా పెట్టింది పేరు.

జపాన్ ఆర్ధిక,రాజకీయ,సాంఘికాభివృద్ధికి టోకియో నగరం నిర్వహించిన పాత్రను బట్టి, ఈ దేశం గురించి ఇతర దేశాల వారు అంచనాలు వేసుకుంటూ వుండడం కద్దు. అలాగే, అవసరం అయినదానికంటే ఎక్కువ ప్రచారం ప్రపంచ మీడియా జపాన్ కు ఇస్తూవస్తోంది. అందువల్లనే, ఇటీవలి ప్రకృతి భీభత్సంలో జరిగిన నష్టం గురించిన అంచనాలు కూడా ఆ కోవలోనే సాగాయని ఆ దేశానికి చెందిన నిపుణులు అంటున్నారు. దీనికి వారు చెప్పే కారణం ఇలాటి ఉపద్రవాలపట్ల ఆ దేశం సాధించిన సంసిద్ధత. ఈ విషయంలో జపాన్ కు సరితూగగల మరో దేశం ప్రపంచంలో లేదనడం అతిశయోక్తికాదు. ఎందుకంటె సునామీలు, భూకంపాలు ఈ దేశానికి కొత్తకాదు. అక్కడి ప్రజలు వాటితో సహజీవనం చేయాల్సిన పరిస్తితి. నిజానికి సునామీ, (త్సునామీ ) టైఫూన్ అనే పదాలు జపాన్ భాషకు చెందినవేనంటారు. ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు ఏమి చేయాలన్నది పైనుంచి కింద దాకా అన్ని స్తాయిల్లోని వారికి కరతలామలకం.

ప్రజలందరికీ ఈ విషయంలో చక్కని అవగాహన వుంటుంది. మిన్ను విరిగి మీద పడే సందర్భాలలో సయితం నిర్వర్తించాల్సిన కర్తవ్యాలను గురించి అతి తక్కువ స్తాయిలోని ఉద్యోగికి కూడా తెలిసివుంటుంది. ముఖ్యంగా గత పది సంవత్సరాల కాలంలో అక్కడి నిపుణులు ప్రకృతి వైపరీత్యాల సందర్భంలో తక్షణం స్పందించాల్సిన తీరు గురించి శాస్త్రీయ పద్ధతుల్లో ఒక నిర్దిష్టమయిన విధానాన్ని రూపొందించుకున్నారు. మొన్నటి దుర్ఘటనలో జన నష్టం నివారణకు అది బాగా ఉపయోగపడిందని అక్కడి నిపుణులు చెబుతున్నారు. ఈ విషయంలో వారు అధునాతన కంప్యూటర్ వ్యవస్తను కూడా చక్కగా వాడుకుంటున్నారు.ఈ కోణం దృష్ట్యా ఆలోచిస్తే, ఆ దేశం నుంచి ఇతర దేశాలు నేర్చుకోవాల్సింది ఎంతో వుందనిపిస్తోంది.

భూకంపాలవంటి విపత్తులు ముంచుకొచ్చినప్పుడు ప్రతి పౌరుడు ఎలాటి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి అనే అంశంపై ప్రతిఒక్కరికీ అవగాహన కల్పించడం వల్ల – ఒకరినుంచి ఆదేశాలు కానీ, సూచనలు కానీ అందుకోవాల్సిన అవసరం లేకుండా అందరూ ఎవరికివారు పరిస్తితికి తగ్గట్టుగా వెంటనే స్పందించగలిగారని ఒక ప్రత్యక్ష సాక్షి కధనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ప్రకృతి  వైపరీత్యం గురించిన అనుమానం తలెత్తగానే ఎవరికి వారు ముందు తమ వ్యక్తిగత భద్రతకు ప్రాధాన్యం  ఇవ్వాలనేది శిక్షణ లో నేర్పే తొలి పాఠం. ఆ జాగ్రత్త తీసుకున్న తరువాత ఆ సమాచారాన్ని ఇతరులకు తక్షణం తెలియచెప్పాలన్నది రెండో పాఠం. అదేసమయంలో తోటి వారి భద్రతకు ఏం చెయ్యాలని ఆలోచించాలి. మిన్నువిరిగి మీదపడే సందర్భాలలో సయితం ఇలా స్తితప్రజ్ఞతతో ఆలోచించగల నైపుణ్యాన్ని జనాలకు కలిగించడం ఈ శిక్షణ లక్ష్యం.

ఉదాహరణకు ఒగాకీ నగరాన్ని తీసుకుందాము. అక్కడి జనాభా లక్షా యాభయ్ వేలు. ఇంగ్లీషు మాట్లాడే దేశాలనుంచి వచ్చిన వాళ్ళు అక్కడ పట్టుమని పాతికమంది కూడా వుండరు. అయినా ఇంగ్లీష్ అనువాదకుల జాబితా అధికారుల వద్ద సిద్ధంగా వుంటుంది. విపత్కర పరిస్తితులను ఎదుర్కోవడానికి ఈ రకమయిన సంసిద్ధత చాలా అవసరమని జపానీయులు నమ్ముతారు.

అలాగే, ఇంటర్ నెట్ ను ఇలాటి సందర్భాలలో వినియోగించుకుంటున్న తీరు కూడా అమోఘం. సాధారణంగా ఈ సదుపాయాన్ని వాడుకునే వారి సంఖ్య ఆ దేశంలో చాలా అధికం. విద్యార్ధి దశ నుంచే అక్కడి వారు దీన్ని బాగా ఉపయోగిస్తారు. అక్కడి విద్యాసంస్తలు విద్యార్ధులతో అనుసంధానం కావడానికి ప్రత్యేక పోర్టల్ ఉపయోగిస్తాయి. విద్యార్ధులు తమ మొబైల్ ఫోన్ల ద్వారా తరగతి షెడ్యూల్ సరి చూసుకోవడానికి ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రకృతి వైపరీత్యాల సమాచారాన్ని వెనువెంటనే తెలియచేయడానికి ఇది వారికి బాగా అక్కరకు వస్తోంది. ఈ పోర్టల్ లో ముందు కానవచ్చేదే ఎర్రటి పెద్ద అక్షరాలతో కూడిన హెచ్చరిక. ఈ రోజు తరగతిలో ఏ ఏ పాఠాలు బోధించబోతున్నారనే విషయం తెలుసుకోవడానికి ఆతృతతతో పోర్టల్ తెరిచిన విద్యార్ధులకు ఆ దుర్ఘటన జరిగిన రోజు కనబడిన

హెచ్చరిక ఏమిటో తెలుసా? “తరగతి సంగతి మరచిపోండి. సునామీ విరుచుక పడబోతోంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపొండి”

ఈ విధమయిన ఏర్పాట్లు అన్ని కార్యాలయాలలో, సంస్త లలో వుండే విధంగా ఆ దేశంలో అనేక చర్యలు తీసుకున్నారు. అందుకే, సెకన్ల వ్యవధిలోనే సమాచారం దేశంలోని నలుమూలలకు చేరిపోయింది. జనాలను గాభరా పెట్టేందుకు కాక అప్రమత్తం చేసే ఉద్దేశ్యంతో చేసిన ఈ హెచ్చరికలు సత్ఫలితాలను ఇచ్చాయని అక్కడివారు చెబుతున్నారు.

పాట్రిక్ అనే సిస్టం ఇంజినీర్ తన అనుభవం గురించి చెప్పిన వివరాలు వింటే ‘యుద్ధ ప్రాతిపదిక’ అని తరచుగా వినబడే మాటకు అసలుసిసలు అర్ధం బోధపడుతుంది.

భూకంప ప్రకంపనలకు సంబంధించిన తొట్టతొలి సూచనను గమనించిన ఆ ఇంజినీర్ పంపిన సమాచారం రెండు సెకన్ల వ్యవధిలోనే చేరాల్సిన చోటికి చేరిపోయింది. తూర్పు జపాన్ తీరానికి దగ్గరలో తీవ్రమయిన భూకంపం సంభవించిందన్న ప్రభుత్వ సమాచారం వేలమైళ్ళ దూరంలో వున్నవారికి సయితం చేరడానికి మరో రెండు సెకన్ల కంటే ఎక్కువ వ్యవధి పట్టలేదు. మరో రెండు సెకన్లలో భూకంపం సంభవించిన ప్రాంతాలతో టెలిఫోన్ సంబంధాలు తెగిపోయిన సమాచారం అందింది. అయితే, వెనువెంటనే రిమోట్ ద్వారా ఎమర్జెన్సీ కాంటాక్ట్ సదుపాయాన్ని పునరుద్ధరించిన కబురు అందింది. ఇదంతా జరగడానికి పట్టిన సమయం కేవలం తొంభయ్ సెకన్లు. మరోపక్క సహోద్యోగులు, ఇరుగుపొరుగువారి రక్షణ బాధ్యతను ఎవరికివారు స్వచ్చందంగా భుజాన వేసుకున్నారు. ఎవరు ఎక్కడ వున్నారు అన్న సమాచారాన్ని క్షణాల మీద తెప్పించుకుని వారిని అప్రమత్తం చేసారు.

ఇదేమాదిరి సన్నివేశాలు ఆ రోజు జపాన్ దేశమంతటా కానవచ్చాయంటే ఇలాటి సందర్భాలలో ఆ దేశ సంసిద్ధత ఎలావున్నదన్నది వూహించుకోవచ్చు.

ఆ ఇంజినీర్ మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలియచేసారు.

“నేనున్న చోట ఆ రోజు భూమి కంపించడం మొదలయింది. బాగా గాలి వీస్తోంది కాబట్టి భవనం వూగుతోందని ముందు భ్రమ పడ్డాను. మా దేశం భూకంపాలకు నిలయం కనుక వాటిని తట్టుకునేలా భవనాలను నిర్మించుకోవడం ఇక్కడి పధ్ధతి. అందుకోసం ప్రచండమయిన గాలులు వీచినప్పుడు భవనాలు కదిలిపోయేలా వాటిని నిర్మిస్తారు.భూకంపాలు సంభవించినప్పుడు ప్రాణ నష్టం వీలయినంత తగ్గించడానికి ఈ విధమయిన నిర్మాణ పద్ధతులను అనుసరిస్తున్నారు.

“ఆ రోజు నేను వున్న భవనం వూగిపోవడం మొదలుకాగానే, కిటికీ నుంచి బయటకు చూసాను. దాపున వున్న రైల్వే స్టేషన్ నుంచి ఓ రైలు బయటకు వస్తోంది. వున్నట్టుండి ఆ రైలుకు బ్రేకులు పడ్డాయి. కీచుమని శబ్దంచేస్తూ పట్టాలపై ఆగిపోయింది. బహుశా, భూకంపం గురించిన సమాచారం తెలిసినవారెవ్వరో రైలు డ్రయివర్ కు ఇంటర్నెట్ ద్వారా ఆ కబురు చేరవేసివుంటారు. అందువల్లనే

రైలును వెంటనే నిలిపివేసారు. ఎందుకు ఆపాల్సి వచ్చిందో ప్రయాణీకులకు లౌడ్ స్పీకర్ల ద్వారా తెలియచేసివుంటారు. అది వేరే విషయం. ఈ దేశంలో ఇవన్నీ సర్వ సాధారణం.

“గంటకు నూట యాభయ్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తున్న రైళ్ళు కూడా, ముందస్తు సమాచారం అందుకున్న కారణంగా ఎక్కడికక్కడ నిలచిపోయాయి. వాటిల్లో వున్న ప్రయాణీకులందరూ క్షేమంగా వున్నారు. ఇలాటి ఏర్పాట్లు సమగ్రంగా వున్నందువల్ల ఎక్కడా రైళ్ళు పట్టాలు తప్పలేదు. సునామీ సమయంలో జపాన్ రైల్వే వ్యవస్థ పనిచేసిన తీరు అమోఘం. మొత్తం మీద హోన్షూదీవిలో ప్రతిచోటా ఇదే సీను. విమానాలు గాలిలో ఎగిరాయి. భవనాలు కూలకుండా నిలిచాయి. ప్రజాజీవనం అస్తవ్యస్తం కాలేదు.

“ఒగాకీ నుంచి రైల్లో నగోవా వెడుతున్నప్పుడు అనేక కర్మాగారాలు కానవస్తాయి. వీటిల్లో చెప్పుకోదగింది బీరు తయారుచేసే ఓ కర్మాగారం. పైకి పెద్ద పెద్ద బీరు సీసాల మాదిరిగా కానవచ్చే ట్యాంకుల్లో విపరీతమయిన వొత్తిడి మధ్య బీరు నిలవచేస్తారు. ఈ ఫాక్టరీలలో ప్రమాదకరమయిన రసాయనాలు వుంటాయి. నిజానికి ట్రిగ్గర్ లేని దారుణమయిన ఆయుధాల వంటివి ఈ కర్మాగారాలు. కానీ, వీటిల్లో ఏ ఒక్కటీ పేలిపోలేదు. ఎందుకంటె,సునామీలు, భూకంపాల వంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు తట్టుకోవడానికి వీలయిన వ్యవస్తలను జపాన్ సిద్ధంచేసి పెట్టుకుంది. సమయానికి ఆ వ్యవస్తలు అనుకున్నవిధంగా పనిచేశాయి. కనీవినీ ఎరుగని విపత్తు వాటిల్లినప్పుడుకూడా లక్షలాదిమంది ప్రాణాలు నిలబడ్డాయంటే, ముందే పకడ్బందీగా నిర్మించుకున్నఈ వ్యవస్తలన్నీ అనుకున్నవిధంగా పనిచేయడమే కారణం. ఇందులో అతిశయోక్తి ఏమీలేదు. నిజంగా వ్యవస్థ పనిచేసింది. ఇది మానవ నాగరిక సమాజం సాధించిన విజయం. జపాన్ లోని ప్రతి ఇంజినీరు ఈ విపత్కర సమయంలో తన దేశం కోసం, తన తోటివారికోసం కష్టించి పనిచేసాడు. అయితే, ఇది అప్పుడే గట్టిగా పైకి చెప్పుకోలేని పరిస్తితి. ఎందుకంటే జరగాల్సినంత స్తాయిలో దారుణం జరగకుండా నిరోధించగలిగినామన్న సంతోషం మాకెవరికీ మిగలలేదు. జరగకూడనిది జరిగిపోయింది. అనేకమంది మరణించారు. ఇంకా అనేకమంది జాడ తెలియడం లేదు. వారి కుటుంబాలు రోదిస్తున్నాయి. మిగిలిన మేమందరం వారందరికీ బాసటగా నిలవాల్సిన తరుణం ఇది” అని ఆ ఇంజినీర్ తన భావాలను పంచుకున్నాడు.

అంత నిబ్బరంగా కర్తవ్యాలను నిర్వర్తించిన జపాన్ ప్రజలు సర్వదా అభినందనీయులు.

పోతే, పులిమీది పుట్రలా విరుచుకు పడిన అణు ప్రమాదం నుంచి కూడా సామాజిక బాధ్యతకు కట్టుబడిన వారి పౌర ధర్మమే వారిని కాపాడగలదని ఆశిద్దాం. (19-03-2011)

జపాన్ సునామీని కళ్ళారా చూడాలనుకుంటే ఈ కింది లింకు ను నొక్కండి. ఓ కారులో అమర్చిన ఆటోమాటిక్ వీడియో కెమెరా ఆ భీభత్సాన్ని కనులకు కట్టినట్టు చూపించింది. ఆ కారు యజమాని ఏమయినాడో ఆ సునామీకే ఎరుక. - రచయిత

http://www.wimp.com/japanesetsunami/



17, మార్చి 2011, గురువారం

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు

నీటిలా సాగిపోవాలి! - భండారు శ్రీనివాసరావు


వియత్నాం వీరుడు హోచిమిన్ తన జ్ఞాపకాలలో ఇలా రాసుకున్నారు.


“నాకప్పుడు తొమ్మిదేళ్ళు. స్కూలు పరీక్ష తప్పాను. నాకొచ్చిన మార్కులు చూసుకుని ఎంతో బాధ పడ్డాను. జీవితం వృధా అనిపించింది. యావత్ ప్రపంచం నన్నో పనికిమాలినవాడిగా చూస్తున్న భావన కలిగింది. ఆ మానసిక వేదనతో వున్ననేను ఒకానొక సమయంలో ఆత్మహత్య చేసుకోవాలని కూడా నిర్ణయించుకున్నాను. ఐతే, మా నాన్నగారు నామానసిక స్తితిని కనిపెట్టారు. తండ్రిగా దగ్గరకు తీసి లాలించారు. పరీక్ష పాసవడం ఒక్కటే జీవితంలో ప్రధానం కాదన్నారు. మా అమ్మ మరీను. ఎంతో ఆప్యాయంగా మృదువయిన మాటలతో నాకు సర్దిచెప్పింది. నా మనోవేదనను చేత్తో తీసివేసినట్టు మాయం చేయడానికి ఆమె చేయని ప్రయత్నం లేదు. మా కుటుంబానికి ఎల్లవేళలా దన్నుగావుండే మాఇంటి ఆధ్యాత్మిక గురువు గారు నాకు మరింత ధైర్యాన్ని నూరిపోశారు. ఆ సమయంలో వారినుంచి నాకు లభించిన భరోసా నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసిందనే అనుకున్నాను. అయినా, నాలో గూడుకట్టుకుపోయిన దైన్యం తొలగిపోలేదు. అధైర్యం మాసిపోలేదు. వారి మాటలతో, చేతలతో తెచ్చిపెట్టుకున్నకూసింత ధైర్యం కాస్తా మరునాటికే జావకారిపోయేది. నిరాశ ,నిస్పృహ రోజురోజుకూ పెరిగిపోవడంతో ఇక తట్టుకోలేక ఓ రాత్రి ఇంటి నుంచి పారిపోయాను.


“అలా దిక్కుతోచకుండా తిరుగుతూ ఒక బౌద్ద ఆరామం చెంతకు చేరుకున్నాను. బౌద్ద బిక్షువు ఒకరు సుమధురంగా ఆలపిస్తున్న ప్రార్ధనా గీతం నా చెవిన పడింది. అతడు పాడుతూనే వున్నాడు. నేను వింటూనే వున్నాను.


“నీరు స్వచ్చంగా ఎలావుంటుంది? ఎందుకంటె అది నిరంతరం పారుతూనే వుంటుంది. అలా పారే నీటికి అడ్డంకులు వుండవా? వుంటేనేం నీటికి వున్న పారే గుణం ఆ అడ్డంకులను అధిగమించేలా చేస్తుంది. ఒక నీటి బొట్టు ఓ పెద్ద జలపాతంలా ఎలా మారుతుంది ? ఎందుకంటె దానికున్న పారే గుణమే దానికా శక్తి నిచ్చింది. ఆ జలపాతం ఒక వాగులా, ఆ వాగు ఓ నదిలా ఎలా రూపం మార్చుకుని సముద్రం లో కలుస్తుంది ? ఎందుకంటె ఒకే జవాబు. నీటికి వున్న పారే ఆ లక్షణమే దానికి కారణం.


అందుకని ఓ నా జీవితమా! ఎక్కడా ఆగిపోకు. నిరంతరం సాగిపోతూవుండు. పారుతూనేవుండు. అలా అలా సాగిపోతూనే వుండు.”


“ఆ గీతం వింటూ చాలాసేపు నన్ను నేను మరచిపోయాను. ఎంత గొప్ప భావం. ఎంత చక్కని సందేశం. చలనం లేని ప్రపంచం ఎంత నిరర్ధకం.


“ఆ బౌద్ద బిక్షువు ప్రార్ధన నాలో కొత్త మనిషిని తట్టిలేపింది. అంతే! అప్పటినుంచి నేను నిరంతరం పారే నీటిలా మారిపోయాను. నాటినుంచి ఇప్పటివరకు సదా ప్రవహిస్తూనే వున్నాను. ఎక్కడా ఆగిపోలేదు. అన్నిచోట్లకూ వెళ్ళ గలుగుతున్నాను. అందరినీ చేరగలుగుతున్నాను. ఎందుకంటె సతతం పారే నీటి గుణాన్ని నేను కూడా అలవరచుకున్నాను కనుక. కనుకే, ఎక్కడా ఆగకుండా ముందుకు సాగిపోతున్నాను.” అని తన స్మృతుల్లో రాసుకున్నారు- మహా నాయకుడు, అశేష జనాలకు పద నిర్దేశకుడు అయిన హోచిమిన్.






నీతి: విజయాన్ని చూసుకుని పొంగిపోవద్దు. అపజయంతో కుంగి పోవద్దు. ఎలాటి ప్రతికూల తలపుల ప్రభావం మనసుపై పడకుండా చూసుకోవాలి. మరో మంచి లక్ష్యం నిర్దేశించుకుని ఆ దిక్కుగా సాగిపోవాలి. అడుగు ముందుకే పడాలి. ఆగిపోయామా ఇక జీవితం ఆగిపోయినట్టే. ఎందుకటే చలనం లేని జీవితం మృత్యువుతో సమానం. (17-03-2011)

వినదగునెవ్వరు చెప్పిన –భండారు శ్రీనివాసరావు



వినదగునెవ్వరు చెప్పిన –భండారు శ్రీనివాసరావు

రహదారులన్నీ నున్నగా ఎలాటి ఎగుడుదిగుళ్ళూ లేకుండా వుంటే చూడడానికి చాలా బాగా వుంటాయి. కానీ, వాటిపై వాహనాలు నడిపే వారు మంచి డ్రైవర్లుగా రూపుదిద్దుకోవడం కష్టం. అలాగే ఆకాశం ప్రశాంతంగా నిర్మలంగా వున్నప్పుడు విమానాలు నడిపే పైలట్లు చక్కని నైపుణ్యం కలిగిన విమాన చోదకులుగా తయారు కాలేరు. సమస్యలు లేని జీవితం కూడా అలాటిదే. ఆవిధమయిన జీవితం గడిపేవారు శక్తి వంతమయిన వ్యక్తిత్వం కలిగిన వారు కాలేరు. సమస్య వున్న చోటే అవకాశం వుంటుంది. దాన్ని వొడిసి పట్టుకోగలిగిన వారే విజయాలు సాధించగలుగుతారు.


జీవితంలో అన్నింటికన్నా పెద్ద భ్రమ ఏమిటంటే- ఇవాల్టి కంటే రేపు ఇంకా ఎక్కువ తీరుబడి వుంటుందని అనుకోవడం. చేతిలోవున్న ఐస్ క్రీం - కరిగి పోవడానికి ముందు తిన్నవాడే ఉత్తముడు.


మరుగుతున్న నీళ్ళల్లో మన ప్రతిబింబాన్ని చూడలేం. ఆలాగే, ఆగ్రహంతో వూగిపోయే వ్యక్తి వాస్తవాన్ని గ్రహించే పరిస్తితిలో వుండడు.


ఎవరో మెచ్చుకుంటారనో చప్పట్లు కొడతారనో ఏపనీ చేయవద్దు. జీవితం అన్నది జీవించడానికి కానీ మరెవరి మెహర్బానీకో కాదు. నలుగురిలో వునికిని చాటుకోవాలని అనుకోకూడదు. నలుగురిలో లేకపోయినా ఆ నలుగురూ మనం లేని విషయాన్ని గుర్తెరిగేలా మన వ్యక్తిత్వం వుండాలి.


జీవితంలో కెల్లా అత్యంత గొప్ప రోజు ఏదో తెలుసా! ఈ జీవితం నాదే అని ఎవరికి వారు నిర్ణయించుకున్న రోజే అతి మంచి రోజు. అంతేకాదు. నాది అనుకున్న జీవితాన్ని అతి గొప్పగా తీర్చిదిద్దుకునే బాధ్యత కూడా నాదే అని గట్టిగా నిశ్చయించుకున్న రోజే భలే మంచి రోజు.


అభద్రతాభావం నుంచి పుట్టేదే అసూయ. సత్తా వున్న మనిషి దాన్ని దరిచేరనివ్వడు.


ప్రతి రోజూ మంచి రోజని అనుకున్నట్టయితే, ‘రేపు’ అనే రోజుని భగవంతుడనేవాడు అసలు సృష్టించేవాడు కాదేమో. అందువల్ల, ఆశించిన విధంగా ఈ రోజు గడవకపోతే పుట్టి మునిగేదేమీ వుండదు. రేపనేది వుందన్న ఆసతో ఆశ తో ఈ రోజును గడిపేయాలి.


గెలుపు వైపు ప్రయాణించే మార్గంలో రెండే రెండు అడ్డంకులు తగులుతాయి. ఒకటి నిరుత్సాహం. రెండోది అపజయం గురించిన భయం. ఈ రెంటినీ అధిగమిస్తే విజయం వచ్చి వొళ్ళో వాలుతుంది. (17-03-2011)

15, మార్చి 2011, మంగళవారం

బడుగులకు బడాబాబులకు ఒకే పీటా! – భండారు శ్రీనివాసరావు

(మార్చ్ 15వ తేదీ సూర్య దినపత్రికలో ప్రచురితం)


బడుగులకు బడాబాబులకు ఒకే పీటా! – భండారు శ్రీనివాసరావు

బ్రిటన్ మాజీ ప్రధాని జేమ్స్ కేలహాన్ ఒకసారి భారత దేశాన్ని సందర్శిస్తూ అందులో భాగంగా హైదరాబాదు వచ్చారు. ఆయన గౌరవార్ధం రాష్ట్ర ప్రభుత్వం జూబిలీ హాలులో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ నాడు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వున్నది కీర్తిశేషులు శ్రీ టి. అంజయ్య.


రాష్ట్రం వివిధ రంగాల్లో సాధించిన విజయాలను గురించి ముందుగా అధికారులు తయారు చేసి ఇచ్చిన ఇంగ్లీష్ ప్రసంగ పాఠం ద్వారా ముఖ్యమంత్రి అంజయ్య విదేశీ అతిధికి వివరించడం ప్రారంభించారు. పేద, బలహీన వర్గాలకు ప్రభుత్వం ఏడాది కాలంలో కొన్ని వేల పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చిందని చెబుతున్నప్పుడు బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకుడయిన జేమ్స్ కేలహన్ ఒకింత విస్మయంగా విన్నారు. పక్కా ఇల్లు అంటే శాశ్విత గృహం (పర్మనెంట్ హౌస్) అనే అర్ధంలో అధికారులు అనువదించి చెప్పిన వివరణ ఆయన్ను మరింత దిగ్భ్రాంతికి గురిచేసింది. అంత తక్కువ వ్యవధిలో అన్ని వేల ఇళ్లు నిర్మించడం సాధ్యమా అన్న సందేహం ఆయన ప్రశ్నల్లో వ్యక్తం అయింది. బ్రిటన్ దేశపు ప్రమాణాల ప్రకారం శాశ్విత గృహానికి ఎన్నో హంగులు, సదుపాయాలూ అవసరం అవుతాయి. ఆ దృష్టితో ఆలోచించే విదేశీ అతిధులకు ‘మన పక్కా ఇళ్ళ ప్రణాళికలు’ అచ్చెరువు గొలపడంలో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు.


పేదల ఓట్లను ఆకర్షించడానికి మన రాజకీయ పార్టీలు అనుసరించే విధానాలలో నివేశన స్తలాల పంపిణీ ప్రధానమయినది. భూములకు, స్తలాలకు ఈనాడు వున్న ధరలు లేని ఆ రోజుల్లో కూడా పేదలకు ఇళ్ళ స్తలాలు అనేవి గగన కుసుమంగానే వుండేవి. అందుకని, గ్రామాల్లో ఖాళీగా వున్న పోరంబోకు స్తలాలను పేదవారికి ఇళ్ళ స్తలాలుగా ప్రభుత్వాలు ఇస్తూ రావడం అన్నది ఆనవాయితీగా మారింది. వూళ్ళల్లో వుండే రాజకీయ పెద్దలకు ఈ ఇళ్ళ స్తలాల కేటాయింపు అనేది ‘అదనపు పెద్దరికాన్ని’ కట్టబెట్టింది. కేటాయించిన స్తలాల్లో లబ్దిదారులు పక్కా ఇళ్లు కట్టుకునేందుకు ఎంతో కొంత డబ్బును సబ్సిడీ రూపంలో ఇవ్వడం కూడా మొదలయింది. తదనంతర కాలంలో ఎన్టీ రామారావు ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ పక్కా ఇళ్ళ నిర్మాణాన్ని మరింత ‘పక్కాగా’ అమలు చేసే పధకాలను ప్రారంభించారు. కాల క్రమంలో, కాంగ్రెస్ - తెలుగు దేశం పార్టీల నడుమ సాగుతూ వచ్చిన ఎన్నికల సంగ్రామాల్లో ‘పక్కా ఇళ్ళ పధకం’ అనేక రంగులూ, రూపులూ, పేర్లూ మార్చుకుని అధికార పీఠం ఎక్కేందుకు అవసరమయిన సోపానాల్లో ప్రదానమయినదిగా మారింది. ఒకనాడు పేదలకు అవసరమయినది ఈ నాడు పార్టీలకు అత్యవసరమయినదిగా తయారయింది. యధా రాజా తధా ప్రజా అన్నట్టు – లబ్దిదార్లు కూడా బినామీ పేర్లతో ఇళ్లు సంపాదించుకునే క్రమంలో, అవినీతి భాగోతంలో ఓ భాగంగా మారి విలక్షణమయిన ఈ పధకానికి తూట్లు పొడుస్తూ దాన్ని ఒక ప్రహసనంగా మార్చివేసే దుష్ట సంస్కృతి ఓ పధకం


ప్రకారం రూపుదిద్దుకుంది. దానికితోడు, గత పదేళ్లుగా సాదా సీదా భూముల ధరలకు కూడా రెక్కలు విచ్చుకోవడంతో ఈ సంస్కృతి మరింతగా పడగలు విప్పుకుని పేదరికాన్నే అపహాస్యం చేసే స్తితికి చేరుకుంది. దీనికి కారణం పాలకులా! పాలితులా! అన్న మీమాంసను పక్కన బెట్టి ‘తిలాపాపం తలా పిడికెడు’ చందంగా, ఇందులో అందరికీ అంతో ఇంతో భాగం వుందనుకోవడమే సబబు. ఏతావాతా జరిగిందేమిటి? అర్హులను పక్కనబెట్టి అనర్హులకు తాయిలాలు పంచిపెట్టారనే అపవాదును పాలక పక్షాలు మూటగట్టుకుంటే, పేదసాదలకోసం తలపెట్టే సంక్షేమ పధకాల స్పూర్తినే సమూలంగా శంకించే అవకాశాన్ని విమర్శకుల చేతికి అందించినట్టయింది. పేదల పేరుపెట్టి గ్రామాల్లో వుండే సంపన్నులే ఈ అవకాశాలను దండుకుంటున్నారని, అధికారంలో వున్న ఆయా పార్టీల కార్యకర్తలకు వారి ఆర్ధిక పరిస్తితులతో సంబంధం లేకుండా పక్కా ఇళ్లను పంచిపెడుతున్నారనీ ఆరోపణలు వెల్లువెత్తడానికి ఆస్కారం ఇచ్చినట్టయింది.


సరే! ఆరోపణలంటే గిట్టని వారు చేస్తారని కొట్టిపారవేయవచ్చు. కానీ, సాక్షాత్తూ శాసన సభకు సమర్పించిన ప్రభుత్వ నివేదికలోనే కళ్ళు చెదిరే కొన్ని వాస్తవాలు వెలుగు చూస్తున్నప్పుడు కాదనడం ఎలా! రాష్ట్రంలో పేద కుటుంబాలకోసం ప్రభుత్వం – అది యే పార్టీ అయినా కానీ - 1982 నుంచి ఇప్పటివరకు నిర్మించి ఇచ్చిన ఇళ్ళ వివరాలు ఈ నివేదికలో పొందుపరిచారు. పేద వారికి ఇళ్లు కట్టించి ఇచ్చే మహత్తర కార్యక్రమం తమ హయాం లోనే బాగా ఊపందుకుందని గొప్పలు చెప్పుకోవాలన్న తాపత్రయంతోనో ఏమో కానీ – సంబంధిత మంత్రిగారు తమ నివేదికలో సంవత్సరాలవారీగా లెక్కలు ఉదహరిస్తూ – రాష్ట్రంలో ఇంతవరకూ అక్షరాలా ‘తొంభయి తొమ్మిది లక్షల పందొమ్మిదివేల నూట నలభయ్ తొమ్మిది’ ఇళ్ళ నిర్మాణాన్ని ఈ ఏడాది జనవరి ఆఖరు నాటికి పూర్తి చేసినట్టు వెల్లడించారు. ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం, రాష్ట్రంలో పేదకుటుంబాల సంఖ్య కొంచెం అటూఇటూగా రెండు కోట్లు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం వారికి కట్టించి ఇచ్చిన ఇళ్లు ఇంచుమించు ఒక కోటి. ఈ నెలాఖరుకల్లా మరో ఎనభయ్ వేలు పూర్తికాగలవని అంచనా. రెండుకోట్ల పేద కుటుంబాలలో దాదాపు సగానికి తలదాచుకునే గూడు అమరిందని ఈ లెక్కలు చెబుతున్నాయి. ఇవికాక ఇందిరమ్మ పధకం కింద మరో 30 లక్షల కుటుంబాలకు ఇళ్లు కట్టించి ఇస్తామన్న ప్రభుత్వ హామీనీ, మొన్నటికి మొన్న రచ్చబండ కార్యక్రమంలో ప్రభుత్వానికి అందిన అర్జీలను కూడా కలుపుకుంటే మరో పదిహేను లక్షల ఇళ్లూ – అన్నీ కూడుకుంటే రాష్ట్ర జనాభాలో మూడింట రెండువంతుల కుటుంబాలకు ఏదో ఒకవిధమయిన గూడు అమరుతున్నట్టే అనుకోవాలి. అయినా ప్రభుత్వం ద్వారా అందే పేదల ఇళ్లకు ఏటేటా గిరాకీ పెరుగుతున్నదే కానీ తగ్గడం లేదని సర్కారు గణాంకాలే చెబుతున్నాయి. అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నామని ఓ పక్క గొప్పలు చెప్పుకుంటూ, మరో పక్క పేదల సంఖ్య యే ఏటి కాయేడు పెరిగిపోతున్నదని వెల్లడించే ఈ అంకెలు, సంఖ్యలు ప్రభుత్వాలకు యే మాత్రం శోభనివ్వవు.





అదేసమయంలో మరో మాట కూడా చెప్పుకోవాలి. పారిశ్రామిక వర్గాలకు పెద్దపీట వేసే క్రమంలో వేల, లక్షల ఎకరాల భూపంపిణీ ఓపక్క నిరాఘాటంగా, నిర్లజ్జగా సాగిస్తున్నప్పుడు, కేవలం పేదలకు ఇళ్లు కట్టించి ఇచ్చే పధకాన్ని ‘భూ భాగోతంగా’ ముద్రవేసి వారి కడుపులపై కొట్టడం కూడా మంచిది కాదు. దుర్వినియోగాన్ని సమర్ధించడం కాదు కానీ, సంపన్న  పారిశ్రామిక వేత్తలకు  'సెజ్' ల పేరుతో ధారాదత్తం చేస్తున్న భూములతో పోలిస్తే, బడుగులకో గూడు కల్పించే ఈలాటి పధకాలపై పెడుతున్న ఖర్చు ఏపాటి? అని ప్రశ్నించుకోవడం కూడా సబబే అవుతుంది. బడాబాబులకో రూలు, బడుగులకో రూలు అన్నప్పుడే కడుపు నిండిన వాడు, కడుపు మండిన వాడు అనే రెండు వర్గాలు సమాజంలో రూపుదిద్దుకుంటాయి. దీన్ని అడ్డుకోవడమే నిజమయిన పాలకుల అసలయిన కర్తవ్యం. (14-03-2011)



13, మార్చి 2011, ఆదివారం

Jagan’s party - threat to whom? – Bhandaru Srinivasrao

Jagan’s party - threat to whom? – Bhandaru Srinivasrao




At last, the former Congress MP from Kadapa and son of former chief minister Y S Rajasekhara Reddy, has launched his much trumpeted YSR Congress Party and unveiled the flag.
The timing of the launch and unveiling flag at Idupalapaya, the family estate, where YSR, who died in chopper crash, was laid to rest, looks perfect as it happens to be on eve of elections to state legislative council. Though the young scion had to drop addressing a public meeting after the formal unveils of the party flag along with his politician mother due to election code, he did drop enough hints to his supporters to start training their guns against Kiran Kumar Reddy-led Congress government.
For Kiran Kumar Reddy, the council polls will prove first litmus test, especially when rumors are rife that rebels all set to cause embarrassment in his native Chittoor district. Apart from CM's native Chittoor and his bete noir Jagan's Kadapa, the other districts where the ruling party nominees are placed vulnerably are the two Godavari districts (East and West), besides politically most volatile Krishna and Guntur. The party polls prospects also too precariously hanging in other parts of coastal Andhra Rayalaseema districts. Any upsets bound to have its bearing on the political future of Kirankumar as chief minster.
After the polls to Council, the immediate challenge that is staring at the Chief Minister is the two bypolls to Kadapa parliament and Pulivendla assembly. Both these are considered to be the strongholds of YSR family. But, the Congress, which succeeded in dividing the family by weaning away YSR brother Vivekananda Reddy and inducting him in Kiran's cabinet. The Congress party expects Viveka to spring a surprise by ensuring the defeat of his nephew and sister-in law in bypolls. But, the ground realities look quite opposite. At the most Viveka's candidature may reduce the victory margins of Jagan and his mother Vijayamma, but cannot prevent their victory march. Except for the three ministers from the district, the rank and file of the ruling Congress already crossed over to Jagan's camp. If the party faces electoral reversals in Council polls, then Viveka may as well opt out from the fight against his nephew and sister-in law in bypolls which are likely to be held after five state elections.
Back to Jagan's camp, analysts feel that support to the young scion seen dwindling. Only 12, including two of PRP legislators, took attending the flag unveiling function at Idupulapaya. What does it mean? Does Jagan enjoy support of only 10-12 legislators and two MPs? Why those who attended his earlier 'deekshas' or 'dharnas' on public issues choose to keep away now? Are they scared of party high command cracking the whip against them now as Jagan officially launched the party?
Or was it due to their inability to take a decision either way in the wake of stalemate on Telangana issue in the state?
However, Jagan appears to be unperturbed over how many legislators will join his bandwagon as he is depending solely on mass support, rather than number games. He determined to take the support of the people who will ultimately decide the future of his party, since his his crowd pulling ability is proved beyond doubt many a times on earlier occassions.
That apart, to whom the new party likely to pose serious threat – to ruling Congress? Or, main Opposition Telugu Desam? Or, to both? Or will vanish in thin air like yesteryear ‘mega star’ Chiranjeevi’s Praja Rajyam Party?
People of the state find answers themselves as results start unfolding with Council polls, followed by bypolls and thereafter. Till that time, he and his party will be a nightmare for all other parties.(13-03-2011)