24, అక్టోబర్ 2010, ఆదివారం

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ......... భండారు శ్రీనివాసరావు

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ......... భండారు శ్రీనివాసరావు


ముప్పయ్యేళ్ళక్రితం రేడియోలో వార్తలు చదివే న్యూస్ రీడర్లను ఎంపిక చేసేందుకు రాత పరీక్ష, ఇంటర్వ్యూలు నిర్వహించారు. పరీక్షలో నెగ్గినవారికి స్టూడియోలోనే కొన్ని నమూనా వార్తలు ఇచ్చి రికార్డ్ చేయించడం జరిగింది. అభ్యర్ధుల ఎంపిక కోసం వచ్చిన ఓ పెద్దమనిషి – వచ్చినవాళ్ళల్లో ఓ అమ్మాయి చదివిన వార్తల రికార్డింగ్ ని పదికాలాలపాటు భద్రపరచమని సూచించారు. అంత బాగా చదివిందా అని మేము ఆశ్చర్య పోతుంటే ఆయన అసలు విషయం చల్లగా చెప్పారు. వార్తలు ఎలా చదవకూడదో అన్నదానిని బోధపరచడానికి ముందు ముందు అది పనికొస్తుందన్నది ఆయన భావన.

రేడియో వార్తలను ఏర్చి కూర్చడం ఒక వంతయితే, వాటిని చదివే తీరుతెన్నులే శ్రోతల ఆసక్తిలో హెచ్చుతగ్గులను నిర్ధారిస్తాయి.

‘పది నిమిషాలేనా! ఇంకావుంటే బాగుండు’ అనుకోవడానికీ-
‘పది నిమిషాలేగా! వింటే ఓ పనయిపోతుంది’ అని సరిపెట్టుకోవడానికీ ఎంతో తేడా వుంది.

సమర్దుడయిన న్యూస్ రీడర్ తనదయిన శైలితో శ్రోతలను ఆకట్టుకుంటాడు. రేడియో కట్టేయాలని కసితో వున్న శ్రోతను కూడా రేడియోకి కట్టిపడేయగలుగుతాడు.

నోటికీ, చెవికీ మధ్యవున్నది నిజానికి బెత్తెడు దూరమే. అయితే, రాసింది చదవడానికీ, చదివేది వినడానికీ నడుమ కాసింత తేడా వచ్చినా సరే అందులోనే స్వారస్వం దెబ్బతింటుంది. ఈ చదవడం వినడం అన్న ప్రక్రియ రేడియో వార్తలకు ఎక్కువగా వర్తిస్తుంది కాబట్టి – ఈ తేడాని పట్టుకోగలగడం లోనే రేడియోవారి ప్రతిభ బయట పడుతుంది. వెనుకటి తరం రేడియో న్యూస్ రీడర్లు వార్తలను మనసు పెట్టి చదవడం వల్లనే వారి పేర్లు ఈనాటి తరానికి కూడా గుర్తుండిపోయాయి.

కాలం వేగంగా మారుతోంది. వేగంగా వార్తలను అందించే క్రమంలో విలేకర్లు కూడా వార్తాప్రసారంలో తమ వంతు పాత్ర పోషించాల్సి వస్తోంది. స్టుడియోలో కూర్చుని వార్తలు చదివే వారికి దీటుగా – బయటనుండి వార్తలు అందించే విలేకరులు సయితం ఎలాటి తడబాటు లేకుండా అప్పటిఅకప్పుడు తాజా వార్తని వివరించాల్సి రావడం ఇప్పుడు ఆనవాయితీగా మారింది. ఈ విషయంలో న్యూస్ రీడర్లకు కొంత వెసులుబాటు ఉంది. ఎందుకంటె- వారు చదవాల్సిన వార్తల స్క్రిప్ట్ వారివద్దనే సిద్ధంగా వుంటుంది. స్పాట్ నుంచి వార్తలు అందించే విలేకరి పరిస్తితి ఇందుకు భిన్నం. అంతేకాకుండా విలేకరులు వార్తలు చదవకూడదు. వార్తని చెప్పగలగాలి. పైగా అంతకుముందు పంపిన వార్తకు తాజా సమాచారాన్ని జోడించి తడుముకోకుండా చెప్పాల్సివుంటుంది. ఏకకాలంలో న్యూస్ రీడర్ పాత్రనీ, న్యూస్ రిపోర్టర్ పాత్రనీ పోషించగలగాలి. అప్పుడే – వార్తలు వింటున్న శ్రోతకు ‘కంటిన్యుటీ’ వున్న భావన కలుగుతుంది.

రేడియోకి వార్తలు పంపేటప్పుడు – సూటిగా, స్పష్టంగా, సరళంగా – అనే మూడు పదాలు గుర్తుంచుకోవాలి. అంటే చెప్పదలచుకున్న వార్త, డొంకతిరుగుడులు లేకుండా సూటిగా వుండాలి. స్పష్టంగా చెప్పడం వల్ల వార్త లోని నిబద్ధత పెరుగుతుంది. సామాన్య శ్రోతకు సయితం అర్ధం అవడానికి సరళత తోడ్పడుతుంది. వీటికి తోడు సాధికారత తోడయితే ఆ వార్తకు ఇక అడ్డే వుండదు.


(చాలా సంవత్సరాలక్రితం ఆంద్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ – రేడియో విలేకరులకోసం నిర్వహించిన శిక్షణా తరగతులకు హాజరయిన అభ్యర్ధుల నిమిత్తం తయారు చేసుకున్న ప్రసంగ వ్యాసం నుంచి – రచయిత)

22, అక్టోబర్ 2010, శుక్రవారం

కామన్ వెల్త్ గేమ్స్ – భండారు శ్రీనివాసరావు

కామన్ వెల్త్ గేమ్స్ – భండారు శ్రీనివాసరావు

న్యూఢిల్లీ లో కామన్ వెల్త్ గేమ్స్ ప్రారంభం కాకమునుపే -

అనుమానపు మబ్బులు పట్టాయి.

ఆ మబ్బుల నడుమే పూజల్లులు కురిశాయి.

ఆ పూజల్లుల మధ్యనే హరివిల్లులు విరిశాయి.

ఆ హరివిల్లుల వెలుగులో బంగరు బిళ్లలు మెరిశాయి.

ఆ పుత్తడి కాంతుల జిలుగులో చిచ్చర పిడుగులు రాలాయి.

ఈ క్రీడలు మొదలు కావడానికి రెండు రోజులు ముందువరకు కూడా అందరి మనసుల్లో నూటొక్క సందేహాలు. నిర్వాహకుల నిర్వాకంపై వేయిన్నొక్క అనుమానాలు.

అవినీతి పునాదులపై స్టేడియాల నిర్మాణం జరిగిందనీ,
అతిధులకూ, జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులకూ సరయిన వసతులు కల్పించడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారనీ,
భద్రతా ఏర్పాట్ల పట్ల శ్రద్ధ కరువయిందనీ,
ఉగ్రవాదులనుంచి పెను ముప్పు పొంచివుందనీ,
ఇలా ఎన్నో ఆరోపణలు.
ఎన్నెన్నో విమర్శలు.

ఈ నేపధ్యంలో –
దేశ ప్రతిష్ట మసకబారబోతోందనే దశలో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. చక చకా చర్యలకు ఉపక్రమించింది. ఆరోపణలకు కేంద్ర బిందువయిన క్రీడల కమిటీ చైర్మన్ సురేష్ కల్మాడీ అనుదిన జోక్యంపై అంట కత్తెర వేసింది. కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి నేతృత్వంలో ఉన్నతాధికార బృందాన్ని ఏర్పాటు చేసి ప్రధాన బాధ్యతలన్నీ అప్పగించింది. ప్రారంభ సంరంభానికి పట్టుమని పది రోజుల వ్యవధి కూడా లేని స్తితిలో – పరిస్తితులను చక్కదిద్దే భారాన్ని ఆ బృందం భుజస్కందాలపై మోపింది.
పనులు ఓ గాడిన పడుతున్నాయని అనుకుంటున్న తరుణంలో క్రీడోత్సవ నిర్వహణలో భాగంగా నిర్మిస్తున్న ఒక వంతెన హటాత్తుగా కూలిపోవడంతో విమర్శల జడివాన మళ్ళీ మొదలయింది. అయితే, జైపాల్ రెడ్డి పూనికతో ప్రధాని కల్పించుకుని సైన్యాన్ని రంగం లోకి దింపి, వంతెన నిర్మాణాన్ని ఆరు రోజుల్లో పూర్తి చేయించడంతో ఆరోపణల కారు మేఘాలు తాత్కాలికంగా పక్కకు తప్పుకున్నాయి.

ఎట్టకేలకు పూర్తయిన ఏర్పాట్ల నడుమ, ఆతిధ్య దేశం భారత్ ఆధ్వర్యంలో పోటీల్లో పాల్గొంటున్న డెబ్భయ్ ఒక్క దేశాల జట్లు - ప్రారంభోత్సవానికి సంసిద్ధమయిన మందిరంలో క్రీడా స్పూర్తితో కాలుమోపాయి. కామన్ వెల్త్ కు ఆధ్య దేశమయిన ఇంగ్లాండ్ యువరాజు ప్రిన్స్ చార్లెస్ కామన్ వెల్త్ క్రీడలను లాంచనగా ప్రారంభించడంతో క్రీడా సంరంభం – ప్రతిష్టాత్మకంగా, కన్నుల పండుగగా, అందరి దృష్టిని ఆకట్టుకునేవిధంగా అట్టహాసంగా మొదలయింది. దాన్ని మరిపించేలా ముగింపు వేడుక మరింత శోభాయమానంగా కళ్ళు చెదిరే విధంగా జరిగింది.

అంతర్జాతీయ క్రీడల నిర్వహణలో భారత్ శక్తి సామర్ధ్యాలను ఇంటా బయటా శంకించడంతో మొదలయిన కధ, క్రీడల ప్రారంభ సంరంభాలలోనే సమసిపోయింది. సాధించిన పతకాలతో మన క్రీడాకారుల సామర్ధ్యం, పొందిన మెచ్చుకోళ్ళతో మన నిర్వాహక ప్రతిభ – క్రీడల ప్రారంభానికి ముందు చెలరేగిన విమర్శలను దూదిపింజల్లా చెదరగొట్టాయి.

2014 లో జరిగే కామన్ వెల్త్ క్రీడోత్సవాలకు ఆతిధ్యదేశంగా ఎంపికయిన స్కాట్లాండ్ –భారత్ నిర్వహణ సామర్ధ్యాన్ని కీర్తించడం ఇందుకు చక్కని ఉదాహరణ. ‘న్యూఢిల్లీ ఒరవడిలో నిర్వహించడం ఇప్పుడు మా ముందున్న పెను సవాల్’ అని ఆ దేశం పేర్కొనడం, అలాగే కామన్ వెల్త్ క్రీడా సమాఖ్య అధ్యక్షుడు మైఖేల్ ఫెన్నల్ – ‘భారత్ నిర్వహించిన తీరు అనితర సాధ్యం’ అని ప్రకటించడం మనకు దక్కిన చక్కని కితాబులు.

కామన్ వెల్త్ క్రీడల్లో భారత క్రీడాకారులు పసిడి పతకాల పంట పండించారు. ‘భారత్ కు మరో స్వర్ణం’ అంటూ అనుదినం వెలువడిన టీవీ స్క్రోలింగ్ లు యావత్ జాతినీ ఉర్రూతలూగించాయి. మన వాళ్ళు రికార్డ్ స్తాయిలో మొత్తం నూటొక్క పతకాలను కైవసం చేసుకున్నారు. ముప్పయ్ ఎనిమిది స్వర్ణ పతకాలను, ఇరవై ఏడు రజిత పతకాలను, ముప్పయ్ ఆరు కాంస్య పతకాలను తమ ఖాతాలో వేసుకుని పతకాల పట్టికలో భారత్ ను రెండో స్తానంలో నిలబెట్టారు. గతంలో జరిగిన అంతర్జాతీయ క్రీడోత్సవాలతో పోలిస్తే ఈసారి భారత్ క్రీడాకారులు అంచనాలకు మించిన ఫలితాలను రాబట్టారనే చెప్పవచ్చు. ఇందులో మన రాష్ట్ర క్రీడాకారుల పాత్ర మరువలేనిది. పదిహేనుమందితో క్రీడల్లో పాల్గొన్న రాష్ట్ర జట్టు ఆరు స్వర్ణాలు సాధించి మొత్తం పదిహేను పతకాలు గెలుచుకుంది. స్వర్ణాలు సాధించిన వారిలో కొందరి నేపధ్యం మట్టిలో దాగున్న మాణిక్యాలను తలపించింది. ఆర్ధిక,సాంఘిక అసమానతలను అధిగమించి వారు సాధిస్తున్న విజయాలు నిజంగా నిరుపమానం. పతకాల పంట పండించిన మన క్రీడాకారుల పంట సయితం పండింది. వారి శ్రమనూ, దీక్షా దక్షతలను గుర్తిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నగదు నజరానాలతో వారిని ముంచెత్తుతున్నాయి. మరిన్ని విజయాల సాధన దిశగా వారిని ప్రోత్సహిస్తున్నాయి.
విజయ దశమి పండుగకు ముందే పన్నెండు రోజుల ఆటల పండుగ ముగిసింది. భారతీయ ఆతిధ్య వైభవాన్ని మనసుల్లో పదిలం చేసుకుంటూ విదేశీ జట్లు ఇంటి దారి పట్టాయి.

కామన్ వెల్త్ గేమ్స్ విజయోత్సాహపు ఉద్విగ్న క్షణాలు నిమిషాలుగా, గంటలుగా మారుతుండగానే, కేంద్ర ప్రభుత్వం అసలు ఆటకు తెర తీసింది.

క్రీడోత్సవాలు ముగిసేవరకూ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం, నిమిషం ఆలస్యం చేయకుండా నిర్వహణ కమిటీపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తుకు ఆదేశించింది. ఈ ఉత్తర్వులను కూడా స్వయానా ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి వెలువడడం విశేషం.

ప్రతిపక్షాలు ఈ విషయంలో యాగీ చేయడం మొదలు పెట్టేలోగానే ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఈ కీలక నిర్ణయం తీసుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురి చేసింది. బహుశా క్రీడోత్సవాలకు ముందే ఈ నిర్ణయానికి వచ్చి, దేశం పరువు ప్రతిష్టల దృష్ట్యా అంతా సలక్షణంగా ముగిసిన తరువాత ప్రకటించివుండవచ్చని భావిస్తున్నారు.

కళ్ళు తిరిగే ఖర్చు

ఈ క్రీడలకు అయిన ఖర్చు వివరాలు ఇంకా పూర్తిగా అందాల్సివుంది. అయినా ప్రాధమిక అంచనాల ప్రకారం యిరవై ఎనిమిది వేలకోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యాయని సమాచారం. ఇంత డబ్బు పోసి సాధించింది ఏమిటన్న ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది. క్రీడా ప్రపంచంలో భారత దేశం తలెత్తుకు తిరగడానికి ఇటువంటి క్రీడోత్సవాల నిర్వహణ దోహదపడు తుందని, క్రీడాకారులకు అవసరమయిన దన్నూ ధీమా ఇవి కలిగిస్తాయని అనుకుంటే ఈ ఖర్చుని లెక్కలోకి తీసుకోకూడదనే వాళ్ళూ వున్నారు. ఇతర దేశాల్లో క్రీడలపై పెడుతున్న ఇబ్బడి ముబ్బడి పెట్టుబడులను ఈ ఈసందర్భంగా ఉదహరిస్తున్నారు. అభివృద్ధిచెందిన దేశాలలో ‘ఆడుకుంటూ చదువుకో, చదువుకుంటూ ఆడుకో’ అనే తరహాలో అనుసరిస్తున్న విధానాలను పేర్కొంటున్నారు.

శారీరక,మానసిక వికాసానికి క్రీడలు ఉపకరిస్తాయనే నమ్మకంతో అక్కడి విద్యావిధానాలు రూపుదిద్దుకుంటూ వుండడం కూడా వారికి కలసి వస్తోంది. అయితే, విద్య వ్యాపారంగా మారిన మన దేశంలో మాత్రం ఆటలకు లభిస్తున్న ప్రాధాన్యం శూన్యం అనే చెప్పాలి. కోట్లు వెచ్చించి క్రీడోత్సవాలు నిర్వహించి అందరితో సెహభాష్ అనిపించుకుంటున్న మన ఏలికలు – క్రీడలను ప్రోత్సహించే పధకాలపై కూడా దృష్టి సారించాలనే అభిప్రాయం ఇప్పుడు బలపడుతోంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో మరుగున పడివున్న క్రీడా ప్రావీణ్యాన్ని గుర్తించి ఆసరా అందివ్వాలి. అభిరుచి వున్నా అవసరాలు అడ్డం వచ్చి ఆటలకు దూరం అవుతున్న పేద యువతను వెతికి పట్టుకోవాలి. వారికి అవసరమయిన శిక్షణ ఇచ్చి వారి ప్రతిభకు పదును పెట్టాలి. ఆశ్రిత పక్షపాతానికి, అవినీతికి కూపాలుగా మారుతున్న క్రీడా సంఘాలకు ముకుతాడు వేసి అదుపులో పెట్టాలి. జాతీయ స్తాయిలోనే కాకుండా, గ్రామ స్తాయినుంచి క్రీడలను ప్రోత్సహించే సమగ్ర క్రీడా విధానానికి రూపకల్పన చేయాలి. ఇరవై ఏళ్ళ క్రితం ఒలింపిక్స్ లో అట్టడుగున వున్న చైనా ఈనాడు అగ్రస్తానానికి ఎలా చేరుకుందో అధ్యయనం చేయాలి.

కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన పతకాలతో పాటు ఆ క్రీడోత్సవాలు బోధించిన పాఠాలను కూడా ఎప్పటికీ గమనంలో వుంచుకోవాలి. చైనాలోని గువాన్జ్ నగరంలో ఈ ఏడాది నవంబర్లో జరగనున్న ఆసియా క్రీడోత్సవాలను ఇందుకు సవాలుగా తీసుకోవాలి. ఢిల్లీలో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో సాధించిన అపూర్వ విజయాలు స్తానబలిమితో కాదన్న విషయాన్ని అక్కడ నిరూపించుకోవాలి.

ఈ దిశగా ఆలోచించినప్పుడు ప్రభుత్వం చేయాల్సింది కొండంత కనబడుతుంది. దేశంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులకు కొదవ లేదు. కొరత వున్నదల్లా లక్ష్యాల సాధనకు అవసరమయిన చిత్తశుద్ధి మాత్రమే.

కొసవిరుపులు

“మహాత్మా గాంధీ జీవించివున్నట్టయితే, కామన్వెల్త్ క్రీడలను వ్యతిరేకించి వుండేవారు. దేశంలో నలభయ్ ఏడు శాతం బాలబాలికలు సరయిన పౌష్టికాహారం లేక రోగాలబారిన పడుతున్నారు. పది శాతం పేద గర్భిణులు రక్త హీనతతో కాలం గడుపుతున్నారు. అన్నార్తుల దేశంలో ఈ ఆటల పోటీలేమిటి?” – మాజీ కేంద్ర మంత్రి మణిశంకర్ అయ్యర్

“దళితుల నిధులతో ఆటలా! కామన్వెల్త్ క్రీడల సన్నాహాల కోసం ఢిల్లీ సర్కారు, షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఏడువందల నలభయ్ కోట్ల రూపాయలు దారి మళ్ళించిందన్న వార్తలను తీవ్రంగా పరిగణిస్తున్నాము. ఒకవేళ అలా బదిలీ చేసుంటే తక్షణం వాటిని వెనక్కు ఇవ్వాలి” – జాతీయ ఎస్సీ కమిషన్ చైర్మన్ పీ ఎల్ పునియా

“కామన్వెల్త్ క్రీడోత్సవాల ప్రారంభానికీ, ముగింపు వేడుకలకు మాజీ అథ్లెట్లకు ఆహ్వానాలు పంపకుండా అవమానపరిచారు. కామన్వెల్త్ క్రీడల చరిత్రలో మన దేశానికి తొట్టతొలి పతకం అందించింది నేను. అయినా నిర్వాహకులు నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే నిన్నటి తరం క్రీడా దిగ్గజాలు - పీటీ ఉష, గురుబచన్ సింగ్ రణధవా, శ్రీ రాం కుమార్, అశోక్ కుమార్ వంటి వారిని కూడా నిర్వాహక సంఘం చిన్నచూపు చూసింది. ఇది అత్యంత శోచనీయం.” - ఫ్లయింగ్ సిఖ్ మిల్ఖా సింగ్

కొసమెరుపు

పన్నెండు రోజులపాటు జరిగిన ఈ కామన్వెల్త్ క్రీడోత్సవాలలలో ఫోటోగ్రాఫర్ల కన్ను ఎవరిపై ఎక్కువ పడిందో తెలుసా? సాధారణ ప్రేక్షకుల మాదిరిగా వచ్చి హాకీ మాచ్ చూసి వెళ్లిన సోనియా,రాహుల్ గాంధీలు అనుకుంటే తప్పులో కాలు వేసినట్టే. ఈ గౌరవం దక్కింది ఒక మామూలు వృద్ధ వాలంటీర్ కు. “కామన్వెల్త్ గేమ్స్ 2010 విజయవంతం” అని ప్లకార్డ్ చేత ధరించి స్టేడియం నలుమూలల తిరుగుతున్న ఆ వృద్ధుడిని ఫోటో తీయడానికి ప్రెస్ ఫోటో గ్రాఫర్లు అదే పనిగా వెంబడి పడ్డారు.

 

Who got the mileage? Naidu or Dr.Singh? - Bhandaru Srinivas Rao (I.I.S.)

Who got the mileage? Naidu or Dr.Singh? - Bhandaru Srinivas Rao (I.I.S.)


Telugu Desam party chief and former chief minister Nara Chandrababu Naidu’s alleged remarks against none other than Prime Minister Dr Manmohan Singh is reprehensible.

That too a person, who held highest office (Chief Minister) and played a key role in installing as many as two to three non-Congress Prime Ministers at the Centre, indulging in passing such uncharitable remarks against Dr Manmohan Singh, indeed uncalled for.

I for one, for a second wondered how come Naidu can make such a remark like ‘sadist’. Does Naidu aware of meaning of the word ‘sadist’? A ‘sadist’ is a person who tries to derive pleasure from causing physical or mental pain to people or animals.

Naidu’s grouse against Dr Singh was that the latter had not given him appointment. As an Opposition leader he had every reason to feel hurt for not getting audience from a Prime Minister. It is understandable. But, had Naidu followed the protocols to get appointment with the Prime Minister during his whirlwind visit to the state?

If one has to believe the septuagenarian Chief Minister K Rosaiah, Naidu had only sent a letter drafted by his secretary seeking appointment, that too in the last minute. Rosaiah, who had been maintaining his ‘cool’ ever since he took over the reins in trying times, in spite of provocation from the Opposition leader calling him ‘incompetent’ and ‘inefficient’ Chief Minister, appears lost ‘patience’ and burst out his ire against Naidu. Yet with greater restrain! . “I never reacted to Naidu’s provocative statements in the past against me. Simply, because I accept I am old, inefficient and incompetent CM,” he said and added; “What about Naidu, who claims to have held office for nine long years and gained notoriety as “king maker’ at the Centre, besides meticulously lobbying to play host for none other than American President Bill Clinton. Doesn’t he aware of protocols? If Naidu had intention to meet Prime Minister and submit a memorandum, he could have as well accepted our invite and attended to ceremonial see off of Prime Minister.”

Naidu’s every political act, in the recent past, ironically getting misfired. If the ‘maha dharna’ in Maharashtra over construction of projects illegally over river Krishna on the eve of bypolls in 12 constituencies of Telangana, drew a flak as his party lost miserably, then his latest near the Begumpet airport, protesting against the PMO’s refusal to give him time during PM’s recent Hyderabad visit, also ended in yet another fiasco with Naidu’s slip of tongue ‘language’.

Undoubtedly, Naidu and his party’s ‘think tank’ running out of ideas and hence many feel deliberately indulging in cheap political gimmicks to derive some political mileage of it. It may be true every political party today look for political mileage and the word ‘mileage’ no more confines to ‘automobile industry’ to boast off. Every political party in the country strives for this ‘political mileage’ and Naidu’s recent act during Prime Minister is one such. And finally, who got the ‘mileage’? Naidu or Dr Singh?

హక్కులకు కూడా హద్దులుండాలి - భండారు శ్రీనివాసరావు

హక్కులకు కూడా హద్దులుండాలి - భండారు శ్రీనివాసరావు

“పత్రికలు చదవను. టీవీ చూడను. ఇదే నా ఆరోగ్య రహస్యం” అన్నారు మాజీ ప్రధాని, కీర్తిశేషులు చరణ్ సింగ్.

భారత ప్రజాస్వామ్య సౌధానికి మూల స్తంభాలయిన వ్యవస్తల ప్రతినిధుల నిర్వాకాలు గమనిస్తుంటే చరణ్ సింగ్ మాటలు గుర్తుకొస్తున్నాయి.

‘చేతులు బార్లా జాపుకునే స్వేచ్చ ప్రతి ఒక్కరికీ వుంటుంది. అయితే చేతి కొస భాగం పక్కవాడి ముక్కునో, కంటినో తాకనంత వరకే ఈ స్వేచ్చ’ అని ఓ ఆంగ్ల సామెత వుంది. అంటే స్వేచ్చకు సయితం హద్దులు వున్నాయని చెప్పడం ఈ నానుడి తాత్పర్యం.

పైకి చెప్పుకునే కారణాలు ఏమైనప్పటికీ, ఎన్ని వున్నప్పటికీ, ప్రజాస్వామ్య మూలసౌధాలన్నీ పత్రికా స్వేచ్చకు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నాయి. ప్రజాస్వామ్యానికి అసలు సిసలు పునాది రాయి వంటి సామాన్య వోటరుతో నిమిత్తం లేకుండా, అతడి ప్రమేయం లేకుండా ఈ రభస సాగుతూ వుండడమే ఇందులోని విషాదం.

మన దేశ ప్రజాస్వామ్యం ఇంత బలంగా వేళ్ళూనుకుని వుండడానికి కారణం మేమంటే మేమని ఎందరు బడాయిలకు పోయినా ఈ ఘనత సాధారణ వోటరుదని ఒప్పుకుని తీరాలి. అత్యధిక శాతం నిరక్షురాస్యులయిన వోటర్లు – పత్రికలూ చదవకుండానే, మీడియా విశ్లేషణలతో నిమిత్తం లేకుండానే – గతంలో జరిగిన ఎన్నో ఎన్నికలలో తమ పరిణతిని ప్రపంచానికి చాటి చూపారు. భారత దేశంతో పాటు స్వాతంత్ర్యం పొందిన ఇరుగు పొరుగు దేశాల్లోని ప్రజాస్వామ్య వ్యవస్తలు కుప్పకూలిపోయి, సైన్యం సాయంతో నియంతలు రాజ్యం చేయాల్సిన దుస్తితి దాపురిస్తుంటే, మన వోటర్లు మాత్రం కేవలం వోటు హక్కుతో ప్రభుత్వాలను మారుస్తున్నారు. గిట్టని పార్టీలకు బుద్ధి చెప్పి, తాము మెచ్చిన పార్టీలను గద్దెనెక్కిస్తున్నారు.

మేధావులమని అనుకుంటున్నవాళ్ళు గమనించాల్సిన విషయం మరోటుంది. ప్రజాస్వామ్యానికి ఆయువుపట్టులయిన వ్యవస్తలన్నీ ఈ ఆరుదశాబ్దాల పై చిలుకు కాలంలో చెదలు పట్టిపోయాయి. ఒకదానికి మరొకటి దన్నుగా వుండాల్సిన ఈ వ్యవస్తలన్నీ ఆధిపత్య పోరులో కూరుకుపోయి తమని తాము నిర్వీర్యం చేసుకుంటున్నాయి. మీడియాలో, పత్రికల్లో, రాజకీయుల ప్రకటనల్లో, న్యాయస్తానాల్లో , చట్ట సభల్లో చోటుచేసుకుంటున్న వార్తలు, వ్యాఖ్యలు, విమర్శలు ప్రతి విమర్శలు, వాదోపవాదాలు,నీలాపనిందలు ఈ అంశాన్నే స్పష్టం చేస్తున్నాయి.

ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే-
పరిపాలన పేరుతొ పార్టీలు-
పారదర్శకత ముసుగులో ప్రచార వూడిగం చేస్తూ పత్రికలూ-
వ్యాపార కళలో ఆరితేరి బలవత్తర శక్తులుగా రూపాంతరం చెందాయి. పరస్పరాధీనంగా పెరుగుతూ వచ్చిన ఈ వ్యవస్తలు – కాలక్రమేణా ప్రత్యర్ధిపై పైచేయికోసం కత్తులు దూస్తున్నాయి.

అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలు సాగించే అక్రమాలతో పోలిస్తే-
పత్రికలను అడ్డం పెట్టుకుని ప్రభుత్వాలను లొంగదీసుకోవాలనుకుని చేసే ప్రయత్నాలవల్ల ప్రజాస్వామ్యానికి వాటిల్లే ముప్పు తక్కువేమీ కాదు.

తాము ప్రాతినిధ్యం వహించే సంస్తల వల్ల సంక్రమించే ప్రత్యేక హక్కుల పేరుతొ లేని హోదాలని అనుభవిస్తూ –
తమ రాతలతో, చేతలతో –సమాజానికి సంకటంగా తయారయిన వారు –
వారు ఎవరయినా సరే-

ఆ వ్యక్తి,

గ్రామస్తాయిలో చిన్న ఉద్యోగి కావచ్చు-
బాధ్యత కలిగిన పెద్ద అధికారి కావచ్చు-
ఏదయినా పార్టీ కార్యకర్త కావచ్చు-
రాష్ట్రాన్ని పాలించే అధినేత కావచ్చు-
పార్ట్ టైం విలేకరి కావచ్చు-
ప్రధాన సంపాదకుడు కావచ్చు-
ఏ స్తాయిలో వున్నా, ఏ హోదాలో వున్నా – ఖండనకు అర్హులే.

ఏదో ఒక పేరుతొ – ఏదో ఒక సాకుతో
అలాటివారిని కాపాడాలని అనుకోవడం –
కూర్చున్న కొమ్మని చేజేతులా నరుక్కోవడమే అవుతుంది.

20, అక్టోబర్ 2010, బుధవారం

కరివేపాకు కధ - భండారు శ్రీనివాసరావు

కరివేపాకు కధ - భండారు శ్రీనివాసరావు

అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో – చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ – పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని – బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. ‘నా బాబే! నా తండ్రే!’ అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.’ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ ‘ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా’ అనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.

ఈ నీతికధ అందరికీ తెలిసిందే. గత కొద్ది రోజులుగా జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.

వార్తకు, వ్యాఖ్యకు నడుమ వున్న సన్నటి విభజనరేఖను చెరిపేసి, తాము అచ్చేసిందే సరయిన వార్త అంటూ కొన్ని పత్రికలు నిస్సిగ్గుగా సాగిస్తున్న పరోక్ష యుద్ధాలు పతాక స్తాయికి చేరుకుంటున్నప్పుడు –

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం ‘బూతుమయం’ అంటూ బుల్లితెరలపై అభూత ఆరోపణలు చేస్తున్నప్పుడు-

ఇంటి నాలుగ్గోడల నడుమ గుంభనగా వుండాల్సిన భార్యాభర్తల గొడవలు గడప దాటి ఛానళ్ళ రూపంలో ఇంటింటికీ ప్రవేశించి ప్రశాంతతను భగ్నం చేస్తున్నప్పుడు -

ఏడాదిక్రితం దాకా భజన చేసిన నోటితోనే విమర్శల జడివాన కురిపిస్తున్న రాజకీయ చద్మవేష ధారులను చూస్తున్నప్పుడు -

అమ్మను ‘ఒసే’ - నాన్నను ‘ఒరే’ అనే దుష్ట సంస్కృతిని పెంచి పోషిస్తూ తెలుగునాట వీరవిహారం చేస్తున్న సినిమాలను విధిలేక భరిస్తున్నప్పుడు –

ఇవన్నీ కంటూ, వింటూ –

వొళ్ళుమండుతున్నా నిలదీయలేని నిస్సహాయులను గమనిస్తుంటే –

ఈ ‘నీతికధ’ మనసు మూలల్లో కదలాడుతుంది. ‘కరివేపాకునాడే చెప్పవయితివేమమ్మా!’ అనే అన్న దొంగ మాటే వినబడుతుంది.

సమాజంలో నేడున్న సమస్త సమస్యలకు, నాయకుల మానసిక వైకల్యాలకు, మీడియా చిత్త చాంచల్యాలకు, ఆదిలోనే కళ్ళెం వేయగలిగిన శక్తివుండీ ఆ పని చేయలేకపోయిన జనాలకు –
అదేమిటి అని ప్రశ్నించలేకపోయిన ప్రజలకు –

ఇప్పుడు అడిగే హక్కు ఎక్కడిదంటే - చేయగలిగిందేమిటి?

పత్రికల తలరాతలు - భండారు శ్రీనివాసరావు

పత్రికల తలరాతలు - భండారు శ్రీనివాసరావు


పూర్వం సోవియట్ యూనియన్ కమ్యూనిష్టుల ఏలుబడిలో వున్న కాలంలో – ఇజ్వెస్తియా, ప్రావ్దా అనే రెండు రష్యన్ పత్రికలు రాజ్యం చేస్తూ వుండేవి. ఇజ్వెస్తియా ఆనాటి సోవియట్ ప్రభుత్వ అధికార పత్రిక. (ఇజ్వెస్తి అంటే ‘వార్త ’ అని అర్ధం). పొతే, ప్రావ్దా. ఇది కమ్యూనిస్ట్ పార్టీ పత్రిక. (ప్రావ్దా అంటే ‘నిజం’) వీటి సర్క్యులేషన్ కోట్లలో వుండేదంటే నమ్మడం కష్టం. కానీ నిజం. ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో నేను ‘రేడియో మాస్కో’ లో ఉద్యోగం చేస్తున్నప్పుడు – మాస్కోలో ప్రతి రష్యన్ పౌరుడి చేతిలో ఈ రెండింటిలో ఏదో ఒక పత్రిక విధిగా దర్శనమిచ్చేది. గోర్భచెవ్ - ‘గ్లాస్నోస్త్’ పుణ్యమా అని భావ వ్యక్తీకరణ స్వేచ్చ లభించిన రష్యన్లు – ‘ఇజ్వెస్తియా లో ప్రావ్దా లేదు – ప్రావ్దా లో ఇజ్వెస్తియా లేదు’ అని చెప్పుకుని నవ్వుకునేవాళ్ళు. ‘వార్తలో నిజం లేదు- నిజంలో వార్త లేదు’ అన్నమాట.

ప్రభుత్వాలు కానీ, పార్టీలు కానీ నడిపే పత్రికల్లో విశ్వసనీయత మాట అటుంచి – ఆ పత్రికలు వాటి కరపత్రాలుగానో, ప్రచార పత్రాలుగానో మిగిలిపోతాయి తప్ప – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించగల పటిష్ట పునాదులుగా పనికిరావన్న థియరీ ఒకటుంది. ప్రభుత్వ ఆధ్వర్యంలో వుండడం వల్లనే ఆకాశవాణి, దూరదర్శన్ వార్తలకు విశ్వసనీయత ప్రశ్నార్థకమయిందని చెప్పేవారు కూడా లేకపోలేదు.

ఇప్పుడు జరుగుతున్న చరిత్ర గమనిస్తుంటే – ఈ సిద్ధాంతానికి కూడా కాలం చెల్లిపోతున్నదన్న సూచనలు కానవస్తున్నాయి. పార్టీలు, ప్రభుత్వాలే కాదు – ప్రైవేటు రంగంలో ప్రచురితమవుతున్న పత్రికల పరిస్తితి సయితం ఇందుకు భిన్నంగా లేదన్న భావన ఊపిరి పోసుకుంటోంది. పార్టీలనూ, ప్రభుత్వాలనూ తామే శాసించగలమన్న ధీమా ప్రబలడమే దీనికి కారణం. పైపెచ్చు, ఏదయినా విషయం ప్రజలకు చేరాలంటే ఈనాడు మీడియాను మించిన మార్గం లేకపోవడం కూడా ఈ ధీమాకు దన్ను ఇచ్చింది. అందుకే సమాజంలో మీడియా వారంటే అన్ని వర్గాల్లో అంత మన్ననా మర్యాదా. అలాగే అంత భయం బెరుకు కూడా.

గతంలో, ఒక ముఖ్యమంత్రి దగ్గర పీఆర్వో గా పనిచేసిన అధికారి, ఏదయినా పనిపై ముఖ్యమంత్రిని కలవాలని వచ్చిన వారికి ఒక మార్గం చెబుతుండేవారు. విజ్ఞప్తి పత్రాలు ఇచ్చేబదులు, యే జర్నలిష్టునయినా పట్టుకుని ‘ఆ విషయం’ పత్రికలో వచ్చేలా చూసుకోమని సలహా ఇచ్చేవారు. అలా వచ్చిన వార్తపై ముఖ్యమంత్రి స్పందించి ‘తక్షణచర్య’ తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు ప్రెస్ రిలీజ్ ఇచ్చేవారు. పత్రికల్లో పడే వార్తలకు గౌరవం ఇస్తారనే మంచి పేరు ముఖ్యమంత్రికి రావడం తో పాటు , ఆ వార్తలు రాసే జర్నలిష్టులకు ‘పలుకుబడి’ కూడా పెరిగింది. ఈ ‘ఉభయతారక విధానం’ ఆ పీఆర్వోకి ‘అత్యంత సమర్ధుడైన అధికారి’ అనే కితాబుని కట్టబెట్టింది.

ఒక పెద్ద పత్రికలో వార్త పడ్డప్పుడు జనం దాన్ని గురించి మాట్లాడుకుంటారు. చదివిన వాళ్ళు దానిపై మరింత చర్చించుకుంటారు. నిరక్షురాస్యులయిన వారు ఆ వార్త విని ‘ఔనా’ అనుకుంటారు. అధికారులు స్పందిస్తారు. అనధికారులు వీలునుబట్టి ఖండిస్తారు లేదా హర్షిస్తారు. సాధారణంగా జరిగే తంతు ఇది. నిజాయితీ, నిబద్ధత, విశ్వసనీయత వార్తకు ప్రాణం పోస్తాయి. ఇవి లేని వార్తకు ప్రాణం వుండదు. ప్రామాణికం వుండదు. కానీ, ఈనాడు ఈ మూడింటికీ ఏమాత్రం విలువ ఇస్తున్నారో తెలియని విషయం కాదు.

వార్తకు ప్రాణం పొయ్యడం కంటే పత్రికల మనుగడే ముఖ్యం అనుకున్నప్పుడు –పత్రికల ద్వారా సాధించాల్సిందీ, సంపాదించాల్సిందీ ఇంకేదో వుందనుకున్నప్పుడు – పత్రికా స్వేచ్చకు అర్ధమే మారిపోతుంది.

‘కలం కూలీ’గా తనను తాను సగర్వంగా చెప్పుకున్న సుప్రసిద్ధ పాత్రికేయులు, కీర్తిశేషులు జి. కృష్ణ గారన్నట్టు – ‘పత్రికల రాతలే వాటి ‘తలరాతలను’ మారుస్తాయి.

19, అక్టోబర్ 2010, మంగళవారం

ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు

ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం! - భండారు శ్రీనివాసరావు

దృశ్యం ఒక్కటే.

చూసేవారికి రెండు రకాలుగా కనిపిస్తుంది.

వైద్య పరిభాషలో ఈ జబ్బుని ఏమంటారో జనాలకు తెలవదు.

కానీ, ఒకే వార్త వివిధ పత్రికల్లో వేర్వేరు రూపాల్లో వస్తే మాత్రం – అందుకు కారణాలేమిటో ఇప్పుడు ప్రజలు అర్ధం చేసుకోగలుగుతున్నారు.

ఒక సభ కానివ్వండి, ఒక సంఘటన కానివ్వండి, ఒక రాజకీయ ప్రకటన కానివ్వండి లేదా విలేకరుల సమావేశం కానివ్వండి – వేర్వేరు పత్రికలు వేర్వేరు కోణాల్లో - వార్తలు వండి వారుస్తున్న తీరు ఇటీవలి కాలంలో ప్రస్పుటంగా కానవస్తోంది. అలాగే మీడియా. యే ఛానల్ మార్చి చూసినా ఇదే వరస.

తాము చదివే పత్రిక, తాము చూసే ఛానల్ వైవిధ్య భరితంగా వుండాలని ఎవరయినా కోరుకుంటారు. అందుకే, ప్రభత్వ ఆజమాయిషీ లోని దూరదర్శన్ కు పోటీగా ప్రైవేట్ ఛానల్ల శకం ప్రారంభమయినప్పుడు జనం ఆ మార్పుని సాదరంగా ఆహ్వానించారు. కానీ కోరుకున్న మార్పు కోరిన విధంగా కాకుండా గాడి తప్పుతున్నదేమో అన్న పరిణామాన్ని వారు జీర్ణం చేసుకోలేకపోతున్నారు.

ఇరవై నాలుగ్గంటల వార్తా ఛానళ్ళ పుణ్యమా అని ఈనాడు సమాచారం టన్నుల లెక్కల్లో జనాలకు చేరుతోంది. ఇందులో అవసరమయినదెంత? అన్నది ప్రశ్నార్ధకమే! ఇంతంత సమాచారాన్ని మనిషి మెదడు యే మేరకు హరాయించుకోగలదన్నది ఛానళ్ళ వాళ్ళే చెప్పాలి. ఎన్ని విన్నా మెదడు తనకు చేతనయినంతవరకే తనలో నిక్షిప్తం చేసుకుని మిగిలినవి వొదిలేస్తుందని అంటారు. ఇదే నిజమయితే – టీవీ ఛానళ్ళ ద్వారా ప్రజలకు చేరుతున్న సమాచారంలో సింహభాగం వృధా అవుతున్నదనే అనుకోవాలి. విన్నదానికంటే చదివిందీ, చదివినదానికంటే రాసిందీ, రాసిన దానికంటే చూసిందీ ఎక్కువకాలం గుర్తు వుంటుందని ఓ సూత్రం. కానీ ఈ సిద్ధాంతానికి సయితం ఈ సమాచార విస్పోటనం చిల్లులు పొడుస్తోంది. ‘పీపుల్స్ మెమోరి షార్ట్’ – అంటే ప్రజలకు చిరకాలం ఏదీ గుర్తు వుండదు అనే ధీమాతోనే రాజకీయనాయకులు స్వవచన ఘాతానికి పూనుకుంటూ వుంటారు. బహుశా ఈ సూత్రాన్నే ఛానల్స్ పాటిస్తున్నాయని అనుకోవాలి.

ఇంతకీ విషయం ఏమిటంటే- సృష్టికర్త జనాలకు ‘మరపు’ అనే అద్భుతమైన వరాన్ని ప్రసాదించి ఎంతో మేలు చేసాడు. లేకపోతె, ఒకే రోజు ఒకే వార్తను భిన్న కోణాల్లో చదివి చదివి – ఒకే ప్రకటనలోని సారాంశాన్ని వేర్వేరు రకాలుగా చూసి చూసి – ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతుండేవారు.

వెనుకటి రోజుల్లో పత్రికల్లో ‘ఘాటుగా విమర్శించారు’ అని రాస్తే అక్కడికి అదే గొప్ప. ఇక ఇప్పుడో- ‘నిలదీశారు. నిప్పులు చెరిగారు. మండిపడ్డారు’ ఇలాటి విశేషణాలు కోకొల్లలు.

పోతే, టీవీ చర్చల్లో పాల్గొనే వారిని పరిచయం చేయగానే వారు ఏం మాట్లాడబోతున్నారో ఇట్టే తెలిసిపోవడం మరో దౌర్భాగ్యం. ఒక అంశాన్నివిశ్లేషించాల్సివచ్చినప్పుడు అందులోని వివిధ పార్శ్వాలను ప్రస్తావించడం సహజం. కానీ సంబంధలేని విషయాలను ఎత్తుకుంటూ, చర్చను పక్క దోవ పట్టించేవారిని కట్టడి చేయలేకపోవడాన్నే వీక్షకులు ప్రశ్నిస్తున్నారు.

వీటికి జవాబు దొరకదు. అయితే, ఇష్టం లేకపోతే ‘కట్’ చేయడానికి ‘ఇప్పుడొక బ్రేక్ తీసుకుందాం’ అనే పడికట్టు పదం మాత్రం సదా సిద్ధం.