1, సెప్టెంబర్ 2010, బుధవారం

“Daivam maanusha roopena” The God within us – Bhandaru Srinivasrao

“Daivam maanusha roopena” The God within us – Bhandaru Srinivasrao


“What  is it that you dislike most in life?”

If this question is asked to my wife she will reply ‘I dislike spiders the most’

When the same question is posed to my granddaughter- pat comes her reply – “I hate lizards”

To me however, that question brings into my mind a person I had grown to hate, literally. Her name was “Somamma” and she was 60 years old when I was only 10 at that time. She is an orthodox lady with a big mouth and garish attitudes. Her husband left her with two kids and a desolate house in central Vijayawada – a town in the southern state of Andhra Pradesh. Even as a kid, I was terrified by Somamma’s actions and behavior. I could not bear her loud mouth. She never wore a sari covering her entire body. In the name of ‘MADI’ (a custom in orthodox Brahmin families where folks wear a wet cloth while cooking and offering prayers) she used to harass all the children by using filthy language. All this was printed in my young mind at that tender age. I used to consider her as a Brahma Raakshasi (a she-devil). Hating her came naturally to me.

Life has its funny ways to teach us and I learnt my lesson through an incident that changed my perspective on people.

As the days progressed, I grew along with her grandchildren. One day, an unexpected marriage alliance came from an affluent family for Somamma’s grandson. A huge dowry was offered and without a second thought Somamma agreed to the proposal and her grandson’s marriage was performed at short notice. Unfortunately, the newlywed girl gave birth to a child within three months of marriage – it was obvious that Somamma and her family were deceived by the offer of wealth to marry an already pregnant girl. Money talked once again and Somamma’s grandson took his wife’s side and left both Somamma and the kid at the doorstep of the hospital and left to live with his in-laws. The entire family was distraught and was in a dilemma – what should we do with the kid? Ironically, no one stepped forward and offered any solutions.

At that moment I was caught off guard with what Somamma did. Somamma, the embodiment of age old traditions and customs claimed the infant. She took the baby in her arms and provided the much needed solace. She took the child to her home and became a mother at that age to that new arrival in the world. She left everything to become everything to the child. She became a mother to the kid and nursed her. She became a father to the child and mentored her. She became a grandmother to the kid and doted her.

Seeing that transformation in her, I could not help but erase my negative perceptions on her. From an evil incarnate, she became to me an inspirational person who made clear to the World that being good is not just being nice. A good person always does the right thing irrespective of the consequence and personal sacrifice.

Today, Somamma is no more. But her reminiscences are still fresh in my mind. Whenever I recollect her greatness, I feel that some of my sins are being washed away. That is her greatness. That is the power of Humanity. “Serving hands are greater than praying lips”.

What do you say? – Bhandaru SrinivasRao (31-08-2010)

31, ఆగస్టు 2010, మంగళవారం

దైవం మానుష రూపేణ - భండారు శ్రీనివాసరావు

దైవం మానుష రూపేణ - భండారు శ్రీనివాసరావు


‘ఈ చరాచర ప్రపంచంలో అత్యంత ఘోరంగా, అతి హేయంగా మీరు  చీదరించుకునే ప్రాణి ఎవరు’ అని మా ఆవిడను అడిగితే సాలెపురుగు అంటుంది. మా మనుమరాలిని ఇదే ప్రశ్న అడిగితే ‘బల్లి’ అని జవాబిస్తుంది. కొన్నేళ్ళక్రితం వరకూ- ఇలాటి ప్రశ్నకు నా సమాధానం సోమమ్మగారు అనబడే సోమిదేవమ్మగారు.

బెజవాడ గవర్నర్ పేటలో లంకంతకొంపనీ ఇద్దరు ఆడపిల్లలనీ, ఆవిడకు వొదిలేసి – సోమమ్మగారి మొగుడు ఆమె చిన్నతనంలోనే కాలం చేసారు. పిల్లలను పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు చేసి పెద్దరికంగా వుండాల్సిన ఆ పెద్దావిడ - ‘మడీతడీ’ అంటూ - ‘అంటూ సొంటూ’ అంటూ- అయినదానికీ, కానిదానికీ అందర్నీ ఆడిపోసుకునేది. కడవంత నోరు చేసుకుని చిన్నా పెద్దా తేడాలేకుండా శాపనార్ధాలు పెట్టేది. ఆమెను చూస్తుంటే చిన్నవాళ్లమయిన మా అందరికీ ఓ బ్రహ్మరాక్షసిలా కనిపించేది. ఇల్లు ఆవిడది కావడం మూలానా, అంత తక్కువ కిరాయికి మరో ఇల్లు దొరికే అవకాశం లేకపోవడం మూలానా - అక్కడ అద్దెకు వున్నవాళ్ళు ఎవ్వరూ – ఆమెకు ఎదురు నిలిచి మాట్లాడేవాళ్ళు కాదు. దానితో, ఇక ఆమె నోటి దురుసుకు ఎదురు లేకుండాపోయింది. మనిషేమో ఆజానుబాహువు.  ‘మడీ దడీ’ పేరుతొ అరకొరగా మడిబట్ట చుట్టుకుని, 'అసింటా అసింటా' అంటూ  అందరినీ కసురుకుంటూ అందరిళ్ళలో తిరిగేది. ఆమెని చూస్తే చిన్నతనం నుంచీ నాకు అదోకరకం అసహ్యం.  పెరిగి పెద్దయిన తరవాత కూడా అది మరింత పెరిగిపోయిందే కానీ  ఆ ఏహ్యభావం నన్ను వొదిలిపెట్టలేదు. నాతో పాటే పెరిగి పెద్దయిన ఆమె మనుమలు ఏదో ఉద్యోగాల్లో కుదురుకున్నారు. చిన్నవాడికి ఒక్కడికే ఇంకా పెళ్లి కావాల్సివుంది. అనుకోకుండా అతడికి బంగారం లాటి పెళ్లి సంబంధం వచ్చింది. ఒంట్లో ఇంట్లో బాగావున్న ఓ ఖామందు గారు పిల్లనిస్తామని ఏకంగా వాళ్ళ  ఇంటికే వచ్చారు. బాపూ గారి సినిమా పాట మాదిరిగా ‘కట్నమెంత లావో - పిల్ల అంత లావు’. డబ్బా మజాకా! ఎగిరి గంతేసి వొప్పుకున్నారు. పెళ్ళున పెళ్లయిపోయింది. కానీ మూడు ముళ్ళు పడ్డ మూన్నెళ్లకే ఆ అమ్మాయి ఆసుపత్రిలో పురుడు పోసుకుని పండంటి పిల్లాడికి తల్లయింది. అప్పుడుకానీ అంత గొప్ప సంబంధం తమని  వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందన్న విషయం వాళ్లకు అర్ధం కాలేదు. సోమమ్మగారి సంగతి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ సంగతి తెలిసి ఏమాత్రం జాలిపడలేదు. పైగా అలాటి మనిషికి అలాగే కావాలని బాహాటంగానే నోళ్ళు నొక్కుకున్నారు. ఆ అమ్మాయి తలిదండ్రులు సరేసరి -కన్నె వయసులో కాలుజారిన కన్న కూతురికి పుట్టబోయే బిడ్డ - తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు అడ్డం కాకూడదని, హడావిడిగా పెళ్లి చేసి, ఆసుపత్రిలో పురుడు పోసి – ఆ పసికందుని అక్కడే వొదిలేసి కూతుర్ని తీసుకుని వెళ్లి  పోయి చేతులు కడిగేసుకున్నారు. అప్పుడేమి జరిగిందన్నదే – ఈ కధ కాని కధకు క్లైమాక్స్.

సోమమ్మగారిది నిప్పులుకడిగే మడీ ఆచారం అని చెప్పుకున్నాము కదా. మనవడి భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తెలియదు. ఇంటావంటా లేని ఘోరం జరిగిపోయింది. ఆచారాలకు  నెలవయిన ఇంట్లో అనాచారం పురుడు పోసుకుంది.  కన్న తల్లేమో నిర్ధాక్షిణ్యంగా రోజుల పిల్లవాడిని వాడిమానానికే వొదిలేసి వెళ్లి పోయింది. ఈ పరిస్తితుల్లో ఆమె మానసిక పరిస్తితి ఎలావుంటుందో తేలిగ్గా వూహించుకోవచ్చు. కానీ, అందరి వూహల్ని పటాపంచలు చేస్తూ సోమమ్మగారు సరాసరి ఆసుపత్రికి వెళ్ళింది. అంతా కళ్ళింత చేసుకుని చూస్తూ వుండగానే – ఎవరికీ అక్కరలేని ఆ అనాధ శిశువుని అబ్బారంగా  వొడిలోకి తీసుకుంది. ‘అందరూ కాదనుకుని వెళ్ళినా - నీకు నేనున్నానంటూ’ ఇంటికి తీసుకు వచ్చింది. కన్నతల్లి కాదన్నా, ఆ తల్లిని కన్నవాళ్ళు కాదనుకున్నా, కట్టుకున్నవాడు బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నా – అమ్మమ్మ గారు – ఆవిడిక నా దృష్టిలో సోమమ్మగారు కాదెంత మాత్రం కాదు – ‘అమ్మమ్మ గారే’ - ఆ చిన్ని వయస్సులోని ఆ చిన్నారికి అమ్మయింది.
అమ్మయి లాలించింది. అమ్మమ్మయి ఆడించింది. నాన్నయి నడిపించింది. నాన్నమ్మయి నీతి కధలు చెప్పి నిద్రపుచ్చింది. తల్లీతండ్రీ లేని ఆ అనాధ శిశువుకు సర్వస్వం అయింది. సర్వం తానే అయింది. ఇప్పుడు చెప్పండి !
ఆమెను ఛీత్కరించాలా! దైవసమానురాలని భావించి నమస్కరించాలా!
మనుషుల్ని కళ్ళతో చూసి కాకుండా మనసుతో చూసి అంచనా వేసుకోగలిగేలా ఎవరిని వారు సంస్కరించు కోవాలా!
 నేను ఆమె పట్ల చేసిన పొరబాటు ఇంకెవ్వరూ చేయరనీ, చేయకూడదనీ మనసారా కోరుకుంటూ  – మనసు పొరల్లో  కదలాడుతున్న 'ఈ జ్ఞాపకాన్ని’ ఇన్నేళ్ళ తరవాత బయటకు తీస్తున్నాను. ఇందువల్ల ఎవరి మనసు అయినా బాధ పడితే క్షంతవ్యుణ్ణి. - మరణించిన తరవాత కూడా, నా మనస్సులో జీవించే వున్న ఆ ‘అమ్మమ్మగారి’ ఔన్నత్యాన్ని నలుగురికీ తెలపడమే ఒక్కటే  ఇందులోని ఉద్దేశ్యం.
అందుకే అన్నారు - ప్రార్ధించే పెదవులకన్నా - సేవ చేసే చేతులు మిన్న
 (30-08-2010)

ఇలాటి ఉన్నత మనస్కుల ఫోటోలు కడిగి గాలించినా ఎక్కడా దొరకవు. అందుకే ఈ బ్లాగులో ఫోటోలు లేవు. 

విన్నంతలో- కన్నంతలో అమెరికా - 6 - భండారు శ్రీనివాసరావు

విన్నంతలో- కన్నంతలో అమెరికా - 6     - భండారు శ్రీనివాసరావు
“అంటరాని వాడు
అని నీవనుకుంటున్నవాడు
అంటుకున్నాడో
ఇక అది
ఆరని మంటే!”
వివక్ష అనేది ఏ రూపంలో ఎక్కడవున్నా అది సహించరానిది.

గాంధీ తో గోరా

అంతే కాదు వివక్షకు గురయ్యేవారు తిరగబడిన రోజున అది తిరుగులేని తిరుగుబాటే అవుతుందని –
గోరాగారి సాహచర్యంలో మసలిన మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారు చెబుతుండేవారు.
కానీ ఈ నాడు అమెరికాలో పరిణామాలను గమనిస్తూ - గతాన్నీ, వర్తమానాన్నీ  కలగలిపి ఆలోచిస్తుంటే - కులాలకూ, మతాలకూ యేవో గట్టి మూలాలే వున్నాయనిపిస్తోంది.
రష్యా కమ్యూనిష్టుల ఏలుబడిలోకి వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల పై చిలుకు కాలం ఆ దేశంలో మతమన్నది కనబడలేదు, వినబడ లేదు. అయితే, “మతం మత్తు మందు” అని నమ్మిన కమ్యూనిస్టు పాలకులు కూడా ఆ దేశంలో ఏ చర్చినీ , మసీదునీ కూలగొట్టలేదు. సరికదా -
 పైపెచ్చు వాటికీ ఏటేటా రంగులూ, సున్నాలూ కొట్టి ముస్తాబుచేసి తాళాలు వేసి వుంచేవారు. గోర్భచెవ్ కాలంలో మేము అక్కడ వున్నప్పుడయితే - విదేశాలనుంచి వచ్చే గౌరవ ప్రభుత్వ అతిధులకి వాటిని ఎంతో గౌరవంగా చూపించేవారు కూడా.

లెనిన్ స్కీ ప్రాస్పెక్త్

 ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటే మరో విషయం ముచ్చటించుకోవాలి. మాస్కోలోని లెనిన్ స్కీ ప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో - పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చు బెట్టి ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.

మాస్కో చర్చి

 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి- భూగర్భం లోనే దానికింద చక్రాల ఉక్కు పలకను ఉంచి అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చిని ఏమాత్రం దెబ్బతినకుండా వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డు పని పూర్తిచేశారని చెప్పుకునేవారు.

మాస్కో చర్చిలో పూర్వవైభవం
వారు అలా వాటిని ఎందుకు వుంచారో తెలియదుకానీ, ఇప్పుడు అవన్నీ పూర్వ వైభవంతో కళకళ లాడుతున్నాయని వింటున్నాము.

మాస్కో మసీదు

 డెబ్బయి ఎనభై సంవత్సరాలపాటు మతానికి సంబంధించిన పేర్లనుకూడా బహిష్కరించి, దాని తాలూకు సంప్రదాయాలను సమాధి చేసి, మతం గురించిన ప్రస్తావన కూడా లేకుండా చేసిన నాటి సోవియట్ యూనియన్ ముక్కలు చెక్కలయిన తరవాత, మళ్ళీ ఇన్నాళ్ళకు అక్కడ మతాలూ, మత సంప్రదాయాలు వెల్లివిరుస్తున్నాయని కూడా వింటున్నాము.

మాస్కో మసీదులో ప్రార్ధనలు

మాస్కో జనాభాలో ఇప్పుడు ప్రతి అయిదుగురిలో ఒకరు ముస్లిం అని కూడా వింటున్నాము.

“మత మన్నది మన కంటికి మసకయితే – మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు” అని ప్రవచించిన కమ్యూనిష్టుల రాజ్యమే ఆ విధంగా అంతమయిన వైనం గమనించినప్పుడు – జనంలో మతానికి వున్న గట్టి పట్టు ఎలాటిదో బోధపడుతున్నది.
 ఈ నేపధ్యంలో - వర్తమానాన్ని ఓ మారు అవలోకిస్తే -

ప్రమాణస్వీకారం చేస్తున్న ఒబామా

శ్వేత జాతీయులకు వర్ణ వివక్ష ఎక్కువ అనే అపప్రదని సమూలంగా తొలగించుకుంటూ అమెరికా దేశీయులు బరాక్ హుస్సేన్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఎంతగానో పులకించిపోయింది.

తిలకిస్తున్న అశేష జన సందోహం

వొంటి రంగు మూలంగా పాశ్చాత్య దేశాలలో అదేమాదిరి వివక్షను ఎంతోకొంత ఎదుర్కొంటున్న భారతీయులు సయితం ఒబామా విజయాన్ని తమ గెలుపుగా భావించి పండగ చేసుకున్నారు. ఒబామాను అమెరికా అధ్యక్షుడిగా ఆ దేశ ప్రజలు ఎన్నుకుని ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాలేదు. అప్పుడే టీవీల్లో ఆయన మతం గురించిన చర్చ ప్రారంభమయింది. ఒబామా ఏ మతానికి చెందినవాడో తేల్చి చెప్పడానికి అన్ని చానళ్ళు శక్తివంచనలేకుండా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి.

ఇస్తాంబుల్ మసీదులో ఒబామా

నిరుడు ఫిబ్రవరిలో అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే  ఏప్రిల్ లో టర్కీ వెళ్ళిన ఒబామా, అక్కడ ఒక మసీదుకు వెళ్లి ప్రార్ధనలు జరిపిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు.ఆయన  ఏదో ఒక మతానికి చెందినవాడయినా ప్రజలు ఆయనని ఎన్నుకున్నది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగానే.  కానీ,  గతంలో అధ్యక్షుడు బుష్  తరచుగా  చర్చికి వెళ్లినట్టు  ఒబామా వెళ్లడం లేదని, అందువల్ల ఆయన అసలు సిసలు క్రిష్టియన్ కాదనీ చర్చ మొదలయింది.  దైవ ప్రార్ధన అనేది వ్యక్తిగతమనీ, దానికోసం ప్రత్యేకంగా ప్రార్ధనాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదనే వాదన ఆయనను సమర్ధించే వారినుంచి వినబడుతోంది. ఇదంతా, నవంబర్లో జరగనున్న సెనేట్ ఎన్నికల్లో పైపట్టు సాధించడానికి ఒకరిపై మరొకరు రాజకీయంగా చల్లుకుంటున్న బురద అని కొందరు చెప్పారు.

నా బాధ అది కాదు. ఒబామా మతం పలానా అని  తేల్చగలిగినప్పుడు  - కులాల కట్టుబాట్లను కాలదన్ని, కావాల్సిన వాళ్ళను కాదనుకుని – ఎన్నో కడగండ్లనూ, కష్టాలను ఆహ్వానిస్తూ కులరహిత సమాజాన్ని కోరుకున్న అనేకమంది అభ్యుదయవాదులు  నమ్ముకున్న సిద్దాంతాల మాటేమిటి?
అప్పుడు-
కులమతాలకు అతీతంగా వాళ్ళు  ఇన్నాళ్ళుగా చేస్తూ వచ్చింది ఏమవుతుంది?
 ఏమవుతుంది?
రష్యాలో ఎనభై ఏళ్ళక్రితం ఏం జరిగిందో – తరవాత ఏం జరిగిందో అదే అవుతుంది. అంతే కదా! (30-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

30, ఆగస్టు 2010, సోమవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


రాసేవాళ్ళు చాలామంది వుంటారు. వాళ్ళల్లో మంచిగా రాసేవాళ్ళు కొద్దిమందయినా వుంటారు. కానీ వేసేవాళ్ళు వుండరు. ఇంతెందుకు- చాలా సంవత్సరాలక్రితం పురాణం గారు ఆంద్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా తన రచనకు అతీగతీ లేకపోవడంతో - ‘తన నవలను తనకు భద్రంగా ఒప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ’ అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో, పురాణం గారు - అప్పుడు అక్కడ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్నీ గాలించి, పాత కట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము. ఆ విషయం రచయితకు తెలియచేద్దామనుకుంటూనే - పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటన రూపంలో ప్రచురించడం అన్నీ చక చకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు- వడ్డెర చండీదాస్ (అసలు పేరు చెరుకూరి బ్రహ్మేశ్వర రావు గారు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న –“హిమజ్వాల”-

కీర్తిశేషులు వడ్డెర చండీదాస్

స్వయంగా రచయిత అయిన పురాణం సుబ్రమణ్య శర్మ గారు వారపత్రిక సంపాదకుడిగా మరెందరో రచయితలను వెలుగులోకి తెచ్చారు. తన సంపాదకత్వంలోని ఆంద్ర జ్యోతి వారపత్రికకు ఒక ప్రత్యేకతనూ, ప్రాముఖ్యాన్ని సమకూర్చిపెట్టారు. ఒక పక్క రచయితగా, మరో పక్క సంపాదకుడుగా రెండు భాధ్యతలను సమర్ధంగా నిర్వహించి పాఠకజనసామాన్యంచేతా, పత్రికాయాజమాన్యం చేతా సెహభాష్ అనిపించుకున్నారు.

కీర్తిశేషులు శ్రీ పురాణం


సంపాదకుడనే వాడు స్వయంగా సుప్రసిద్ధ రచయిత కావడం అనేది పత్రికకు ఎంతగానో మేలుచేస్తుందనడానికి పురాణం సుబ్రమణ్యశర్మగారే ఉదాహరణ. అయితే, కాస్తో కూస్తో అక్షరజ్ఞానం, అంతో ఇంతో భాషా పరిజ్ఞానం సంపాదకుడికి వుంటే చాలు, ఆ పత్రిక బతికి బట్టకట్టడమే కాదు అమ్మకాల్లో దిట్ట అనిపించుకోగలదని ప్రస్తుతం తెలుగు పత్రికారంగాన్ని ఏలుతున్న దినవారపత్రికలని చూస్తె తెలిసిపోతుంది. మంచి రచనలు చేసేవాడు, కొత్త రచయితలు చేసే మంచి రచనలని అంత తేలిగ్గా ఎంపిక చేసుకోలేడన్నది ఇక్కడి తాత్పర్యం. ఈగోలు, ఇతరత్రా కారణాలు పనిచేసి- తాము చేసే పనికి న్యాయం చేయలేరన్నది ఇందులోని ప్రతి పదార్ధం. (29-08-2010)

NOTE: All images in the blog are copy righted to respective owners

29, ఆగస్టు 2010, ఆదివారం

జీవనస్రవంతి – భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి – భండారు శ్రీనివాసరావు

కారు గరాజు
కారు దిగి నేరుగా ఇంట్లోకి వెళ్ళడానికి వీలుగా అమెరికాలో చాలామంది గరాజులోనుంచే ఒక ద్వారం పెట్టుకుంటారు. ఈ గరాజు తలుపులను కారులోనుంచే తెరవడానికీ, మూయడానికీ ఎలెక్ట్రానిక్ పరికరం వుంటుంది. దీనికి ప్రత్యేకమయిన కోడ్ వుంటుంది కాబట్టి ఒకరి గరాజు మరొకరు తెరవలేరు. కానీ దొంగలకు తెలివితేటలూ ఎక్కువ కదా.

గరాజును తెరిచే రిమోట్ 
 అంచేత ఓ దొంగ గారు బాగా కష్టపడి స్టడీ చేసి,ఒక ఇంటి గరాజు కోడ్ కు డీకోడ్ కనుక్కున్నాడు. ఆ తరవాత – ఆఇంటి ఆసామీ ఇంట్లో లేనప్పుడు ట్రక్కుతో సహావచ్చి గరాజు తెరిచి దర్జాగా ట్రక్కు అక్కడ పార్కు చేసుకున్నాడు. తాపీగా ఇంట్లోకి వెళ్లి అంతకంటే తాపీగా విలువైన సామానులన్నీసర్దుకుని  అలా సర్దుకున్నవన్నీ మళ్ళీ ట్రక్కులో సర్దేసుకుని దర్జాగా గరాజు తలుపులు మూసేసి మరింత దర్జాగా వెళ్లిపోయాడట. దొంగ దొంగలా కాకుండా దొరలా వచ్చి దొరలా పోవడం వల్ల చుట్టుపక్కలవాళ్ళకు కూడా ఎలాటి అనుమానం రాలేదట. కానీ ఇళ్ళల్లో  దొంగల్లా దూరేవాళ్ళని దొంగతనంగా ఫోటోలు తీసే పరికరాలు ఆ ఇంట్లో అమర్చివుండడం వల్ల ఆ దొంగని పట్టుకోవడానికి పోలీసులు ఆట్టే కష్టపడాల్సిన అవసరం లేకపోయింది.

అదిగో! ఆ వెనక- సామాను సర్దుకుంటున్న దొంగ గారు
Photo Credit:John Myers

దొంగతనం చేయడానికి ఈ హైటెక్ దొంగగారు టెక్నాలజీ వాడుకుంటే న్యూ యార్క్ లో మరో దొంగ - దొంగతనం చేసిన గంటల్లోనే అదే టెక్నాలజీ పుణ్యమా అని పోలీసులకు దొరికిపోయాడు. ఆ వూళ్ళో పెళ్ళికి వెళ్ళిన ఓ పెద్దమనిషి పెళ్ళితంతు ముగిసిన తరవాత భార్యా పిల్లలతో కలసి వూరంతా తిరుగుతూ పోటోలు దిగుతూ కాలక్షేపం చేస్తున్న సమయంలో వెంట తెచ్చుకున్న బ్యాగ్ గల్లంతయిన సంగతి కాసేపటికి కానీ గమనించలేదు. ఇప్పుడు అమెరికాలో అంతా ముచ్చట పడడమే కాకుండా గంటలకు గంటలు క్యూలలో నిలబడి కొనుక్కుంటున్నయాపిల్ ఐ ప్యాడ్ , ఖరీదయిన ఇతర వస్తువులూ గట్రా ఆ సంచీలోనే వున్నాయి. పోలీసులదగ్గరికి వెడితే – పోయినవస్తువులు పోను- ఏమన్నా మిగిలి వుంటే అవి కూడా వూడలాక్కుంటారన్న భయం ఆదేశంలో లేనందువల్ల - అతగాడు పోలీసు స్టేషన్ కు వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు. పోలీసులు కూడా ‘తీరిగ్గా విచారించి తీరిగ్గా పట్టుకుంటాం, అడ్రసిచ్చి వెళ్ళిరండి’ - అనకుండా కొంత బుర్ర పెట్టి ఆలోచించారు. ఫోటోలు తీస్తున్నప్పుడు దొంగతనం జరిగింది కాబట్టి ఆ కెమెరాతో తీసిన ఫోటోలను ఓసారి పరీక్షగా చూసారు. సంచీలో సామాను కొట్టేస్తున్న దొంగ ఓ ఫోటోలో స్పష్టంగా కనిపించాడు. పోజుపెట్టి మరీ ఫోటోలో పడ్డ ఆ దొంగ పోలీసులకు పట్టుబడడం తరవాత ఏమంత కష్టం కాలేదనుకోండి.

వృత్తి వ్యాపారం
సియాటిల్ లో ఈ మధ్య ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరూ చనిపోకపోవడం వల్ల వార్త కాదనుకున్నారేమో ఏమో మర్నాడు ‘తల్లి పత్రిక (మెయిన్ ఎడిషన్) లో కాదుకదా ‘పిల్ల పత్రిక’ (లోకల్ ఎడిషన్) లో కూడా ఏ పేపరు వాళ్ళు దాని జోలికి పోలేదు. పోలీసు వెబ్ సైట్ చూసేలోగా ఓ స్తానిక కుర్ర లాయరు గారి వెబ్ లో ఆ సంఘటన వివరాలన్నీ పూర్వాపరాలతో సహా కనిపించాయి. సమాచారం అంతా ఇచ్చిన ఆ లాయరు – ఇలాటి కేసుల్లో నష్ట పరిహారం ఇప్పించే అనుభవం తనకు పుష్కలంగా వుందనీ, అందువల్ల సంఘటనలో గాయపడ్డ వ్యక్తి తాలూకు వాళ్ళు తనని సంప్రదిస్తే తగిన ఫీజు తీసుకుని తగిన సాయం చేస్తాననీ చివర్లో ఒక ముక్తాయింపు ఇచ్చి వూరుకున్నారు. పరోపకారంలో వున్న పరమార్ధం ఇదన్న మాట.

(28-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

28, ఆగస్టు 2010, శనివారం

విన్నంతలో- కన్నంతలో అమెరికా -5 -భండారు శ్రీనివాసరావు

విన్నంతలో- కన్నంతలో అమెరికా -5         -భండారు శ్రీనివాసరావు

“చెబితే నమ్మరు కానీ - పిన్నిగారూ ఆ దేశంలో పనివాళ్ళు కూడా ఎంచక్కా ఇంగ్లీషే మాట్లాడుతారు”
కూతురు పురిటికోసం అమెరికా వెళ్ళివచ్చిన ఒకావిడ ఆ దేశపు విశేషాలు పొరుగావిడతో చెబుతూఅన్నమాటలివి.
నమ్మక పోవడానికి ఏమీ లేకపోయినా నమ్మలేని నిజం మరోటి వుంది. ఆ దేశంలో చాలామందికి ఇంగ్లీష్ అర్ధంకాదు. అంటే ఇంగ్లీష్ రాదని కాదు. మన ఇంగ్లీష్ ఉచ్చారణకు వాళ్ళు మాట్లాడేదానికీ తేడావుండడమే దీనికి కారణం. అయితే వాళ్ళు సంభాషించేటప్పుడు హావభావాలు కూడా ప్రదర్శిస్తారు కాబట్టి కాస్తో కూస్తో భావం అర్ధం అయ్యే అవకాశం వుంటుంది.

భాష సంగతి అటుంచి, అమెరికన్లు ‘అంటరానితనం’ పాటిస్తారేమోనని అనిపిస్తుంది
.

 బెల్ వ్యూ  స్క్వేర్ మాల్

 పార్కులు, సినిమా థియేటర్లు, షాపులు, మాల్స్ – ఎక్కడైనాసరే, యెంత రద్దీగా వున్న ప్రదేశాలలో అయినా సరే ఎక్కడా ఒకరిని ఒకరు తోసుకోకుండా, ఒకరిపై మరొకరు పడకుండా జాగ్రత్తపడతారు. సన్నిహితులయిన ఆడా మగా రాసుకుపూసుకు తిరగడం తప్పిస్తే, అమెరికన్లు కనీసం ఒకళ్ళనొకళ్ళు తాకను కూడా తాకరు.

డిస్నీలాండ్ లో సందర్శకులు

 డిస్నీలాండ్ లాటి కిటకిటలాడే టూరిస్ట్ కేంద్రాలలోలో సయితం వాళ్ళది ఇదే తీరు. తోసుకు పోవడం, రాసుకు తిరగడం వాళ్ళ దృష్టిలో అనాగరికం. క్యూలలో నిలబడేటప్పుడు కూడా ఒకరినొకరు తాకకుండా ఎడం వుండేలా చూసుకుంటారు. ఇతరులు కూడా తమ పట్ల ఇలాగే మసలుకోవాలని కోరుకుంటారు.

కార్ల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళ నాగరీకం మరీ ముదిరిపోతుంది. పార్కింగ్ చేసే చోట మర్యాదలు చూసి తీరాలి. చాలాసేపు వేచివుండయినా ఎవరికీ అసౌకర్యం లేకుండా పార్క్ చేయడానికి ప్రయత్నిస్తారు.

వికలాంగుల కార్లకోసం రిజర్వ్ చేసిన పార్కింగ్

 పెద్ద పెద్ద మాల్స్ ప్రవేశ ద్వారాలకు దగ్గరగా వికలాంగుల కోసం పార్కింగ్ లాట్లు రిజర్వ్ చేసి వుంటాయి. అవి ఖాళీగా వున్నాసరే, దూరంగా వెళ్లి కారు నిలుపుకుంటారు కానీ అక్కడ పార్క్ చేయరు. ఇక, హారన్ మోగించడం అంటే అవతలవారిని అవమానించడమే అని వారి ప్రగాఢ నమ్మకం. నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు కాబట్టి, అటునుంచో ఇటునుంచో పక్కనుంచో వెనకనుంచో మరో వాహనం తెలియకుండా దూసుకు వచ్చేస్తుందన్న భయం వారికి వుండదు.

ఈ రోడ్లని గమనిస్తే అమెరికన్లని గురించి ఒకరు చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది. సుఖప్రదమయిన జీవితం గడపడం వారి లక్ష్యం. అది సజావుగా నడవడానికి అవసరమయిన కొన్ని నియమనిబంధనలు ఏర్పరచుకుని వాటిని ఖచ్చితంగా పాటిస్తున్నారు. ఈ నిబంధనల అమలు మీద సర్కారు ఆజమాయిషీ కంటే స్వచ్చందంగా పౌరులు వాటికి కట్టుబడి వ్యవహరించడం వల్లే అవి విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పవచ్చు.

నడిచే వాడిదే రోడ్డు

మరో మంచి విషయం ఏమిటంటే కార్లలో వెళ్లేవాళ్ళు - కాలినడకన వెళ్ళేవారిని చిన్నచూపు చూడరు. సరికదా, వారిపట్ల ఎంతో మర్యాదపూర్వకంగా ప్రవర్తిస్తారు. రోడ్డు దాటేవారిని చూసినప్పుడు ఈ మర్యాద కాసింత ముదిరి కూసింత భయంగా మారడం కద్దు. రోడ్డు కూడళ్ళ వద్ద – కాలినడకన వెళ్లే మనిషి కనిపిస్తే చాలు వేగంగా వెళ్లే వాహనాలు కూడా టక్కున ఆగిపోయి దారి ఇస్తాయి. ఏదన్నా జరగరానిది జరిగితే, ఆ నేరం మెడకు చుట్టుకుండేది వాహనాలు నడిపేవారికే.

NOTE:All images in the blog are copy righted to respective owners

26, ఆగస్టు 2010, గురువారం

పాఠకులు కావలెను - భండారు శ్రీనివాసరావు

పాఠకులు కావలెను - భండారు శ్రీనివాసరావు


ఇది జరిగి నలభయ్ ఏళ్ళు కావస్తున్నది.


 ఇప్పుడు నవ్య వారపత్రిక (ఆంధ్రజ్యోతి) లో ఉద్యోగ విజయాలు వారం వారం ఆసక్తికరంగా రాస్తూవస్తున్న రావులపాటి సీతారామారావు గారు, తన ఉద్యోగ జీవితం తొలినాళ్ళలో విజయవాడకు రూరల్ డీఎస్పీ గా వచ్చారు. అప్పుడు నేను ఆంద్ర జ్యోతిలో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నాను. వృత్తిరీత్యా సీనియర్ పోలీసు అధికారి అయినా ప్రవృత్తి రీత్యా రచయిత కావడంవల్ల సాటి రచయితలను కలుసుకోవాలనే ఆసక్తి వుండేది. విజయవాడ రచయితలకూ, ప్రచురణకర్తలకూ పుట్టినిల్లు కావడం మూలాన ఈ చిరు కోరిక తీర్చుకోవడం కష్టమేమీకాలేదు. ఇలా చిన్నా పెద్దా రచయితలను కలుసుకునే చక్రభ్రమణంలో ఒకరోజు మాకు అప్పటికే బాగా చేయి తిరిగిన బోలెడు పెద్ద నవలాకారుడు తారసపడ్డారు. ఉభయకుశలోపరి - పరస్పర పరిచయాలనంతరం సీతారామారావు గారు- ఆంద్ర పత్రిక వారపత్రికలో రాసిన కొన్ని కధలు గురించి నేను ప్రస్తావించాను.
‘నేను ఇతరులు రాసిన కధలు చదవనండీ” అని ఆయన కుండబద్దలుకొట్టినట్టు మొహం మీదే అనేశారు. ‘అలా చదవడం వల్ల వారి రచనల ప్రభావంతో మనం రాసేవాటిలో క్వాలిటీ తగ్గిపోయే ప్రమాదం వుంది’ అని ఒక ధర్మ సూక్ష్మం కూడా బోధించారు.
ఇది జ్ఞాపకం రావడానికి ఒక నేపధ్యం వుంది. చదివేవాళ్ళు బొత్తిగా తగ్గిపోతున్నారని ఒక సంపాదక మిత్రుడు ఈ మధ్య మాటల సందర్భంలో అన్నారు. ఆయన ఆందోళన చెందడానికి వేరే కారణాలు వుండవచ్చు. ఇంతమంది ఇలా రెండు చేతుల్తో పుంఖానుపుంఖాలుగా రాసేస్తూ వాటిని ప్రచురణార్ధం పంపించేస్తూ (ఈరోజుల్లో పోస్ట్ ఖర్చుల బెడద కూడా లేదు – నెట్లో రాసేసి క్లిక్ చేస్తే చాలు - బంతి ఎడిటర్ కోర్టులో పడేసి చేతులు దులిపేసుకోవచ్చు) మా ప్రాణాలు తోడే బదులు వీరిలో కొంతమందయినా చదివే సద్బుద్ధిని అలవరచుకుంటే తమ పత్రిక సర్క్యులేషన్ పెరగకపోతుందా అన్నది ఆయన బాధలోని మరోకోణం కావచ్చు.
‘ఇలా రాసేసి అలా పంపేసి నా కధ వచ్చేవారం వీక్లీలో అచ్చేస్తారా’ అని వేధించుకు తినేవాళ్ళతోనే కాలం చెల్లిపోతోంది. ఇక మంచి కధల ఎంపికకు సమయం ఎక్కడ?’ అని కూడా సంపాదక మిత్రుడు బాధపడ్డాడు. నిజమే ఎవరి ఇబ్బందులు వారివి. పీత కష్టాలు పీతవి.
ఒక వర్ధమాన రచయిత అభిప్రాయం వేరేలావుంది. “ఎన్నాళ్ళు ఇలా చదువుతూ గడుపుతాం గురూగారూ! ఆ మాత్రం మనం రాయలేమా అని ఓ మంచిరోజు చూసి కలం పట్టేసాను” అన్నాడతగాడు.
“మనం రాసింది మనం చదువుకోవడానికే ఎక్కడి సమయం సరిపోవడం లేదు, ఇక వేరేవారి రచనలు చదివే వ్యవధి ఎక్కడుంది మాస్టారూ!” అని ఓ ముక్తాయింపు కూడా ఇచ్చాడు. ఏ పత్రికలో రాస్తుంటాడని మరీ హైరాన పడకండి. స్వయంగా రాసినవాటిని సొంతంగా చదువుకోవడానికి స్వయానా ఒక బ్లాగు పెట్టుకున్నాడు. రాసినవారికి రాసినంత – చదివేవారికి చదివినంత.
ఓ పాతికేళ్ళ క్రితం రేడియోలో తాత్కాలిక ప్రాతిపదికపై వార్తలు చదివేవారిని సెలక్ట్ చేయడానికి ఇంటర్వ్యూ లు జరిగాయి. ఇసక వేస్తె రాలనంతగా అభ్యర్ధులు హాజరయ్యారు. వారిలో చాలామంది ‘లక్ష వొత్తుల నోము’ నోచుకోవాల్సినవారే వున్నారు. వొత్తులు పలకవు. ‘వార్తలు చదవాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగిందని ఒక అమ్మాయిని అడిగితే ‘ రోజూ రేడియోలో వార్తలు వింటున్నాను, ఆ మాత్రం నువ్వూ చదవగలవులే చిన్నా అని మా నాన్న పట్టుబట్టి పంపించాడు’ అన్నది ఆ చిన్నది. ఎవరు చేసిన ఖర్మ వారనుభవించక తప్పదు కదా.
దీనికి కొసమెరుపుగా ఆ రోజు న్యాయనిర్ణేతగా వచ్చిన ఒక పెద్దమనిషి – ఆ అమ్మడు చదివిన ‘న్యూస్ బులెటిన్ ను భద్రపరచమని’ చెప్పాడు. ‘అంతబాగా చదివిందా’ అని అడిగితే – ‘కాదు. బులెటిన్ ఎలా చదవకూడదో భవిష్యత్ తరాల న్యూస్ రీడర్లకు తెలియచెప్పడానికి పనికివస్తుంద’ని ఆయనగారు వాకృచ్చారు.

 (25-08-2010)