జీవనస్రవంతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవనస్రవంతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

4, సెప్టెంబర్ 2010, శనివారం

రసరమ్య పుస్తకం - భండారు శ్రీనివాసరావు

రసరమ్య పుస్తకం - భండారు శ్రీనివాసరావు 


చిన్నప్పుడు అల్లరి చిల్లరగా తిరుగుతూ- పెరిగిపెద్దయిన తరవాత కూడా ఎలాటి ఎదుగూ బొదుగూ లేకుండా అలాగే మిగిలిపోతే పాతసంగతులు గుర్తుచేసుకునే చాన్సు వుండదు. ఒకవేళ గుర్తుచేసుకున్నా విన్న జనం మొహానే నవ్వుతారు. కానీ, చిన్నతనంలో ఏ తిరుగుళ్ళు తిరిగినా, పెద్దయిన తరవాత కూడా అలాగే మిగిలిపోకుండా జీవితంలో ఒక స్తాయినీ, సంఘంలో ఒక హోదాను అందుకోగలిగితే – చిన్నప్పటి చిల్లర జీవితానికి ‘ గ్లామరు’ దానంతట అదే వచ్చిపడుతుంది. అప్పటి సంగతులు చెబితే వినేవాళ్ళుంటారు. పుస్తకాలు రాసుకుంటే అచ్చువేసే వాళ్ళుంటారు. కొనేవాళ్ళ సంగతి ఎలావున్నా - రివ్యూ లు రాసేవాళ్ళు సిద్ధంగానే వుంటారు. కాకపొతే - ఈ మధ్య వీటిని కూడా “రాయించి, వేయించు కోవాల్సి” వస్తోందని కొందరు గిట్టనివాళ్ళంటున్నారు. అందుకే ఇలాటి ఆత్మకధలు లేదా జీవిత కధలూ లేదా బయోగ్రఫీలూ, ఆటోబయోగ్రఫీలు –అనబడే- కొద్దోగొప్పో ఇచ్చి రాయించుకునే ‘జీవిత చరిత్రల’కు ఈ రోజుల్లో మంచి గిరాకీ వుంది. సచ్చీలురయిన గొప్పవారి జీవితాలను కడిగి గాలించినా ముచ్చటబడే రసకందాయఘట్టాలు మచ్చుకయినా కనిపించవు కాబట్టీ , అలాటి వారి గురించి రాసినా చదివేవారు వుండరు కాబట్టీ – పైపెచ్చు రాసేవారికీ వేసేవారికీ గిట్టుబాటు కాదు కాబట్టీ – వాటి జోలికి ఎవరూ పోరు. పోతే, జీవిత చరిత్రలను వేయించుకోగలిగిన స్తాయికి చేరుకున్నారంటేనే – అటువంటి వారి ఘనమయిన గతంలో ‘ఏవో రసరమ్య ఘట్టాలు’ వుండే వుంటాయి. లేకపోయినా ‘చరిత్రలు’ రాసిపెట్టే వాళ్లకు ఆ తెలివితేటలు పుష్కలం. అవసరమైతే అలాటి ఆసక్తికర అంశాలను తమ కల్పనాచాతుర్యంతో సృష్టించగలరు. ఇంతవుంటే చాలు ఎంతో చేసి చూపగలరు. ఈ సత్తా వున్నవారినే ఇందుకోసం ఎంపిక చేసుకుంటారు. అంతే కాదు ఆ సన్నివేశాలకు తగిన మసాలాను దట్టించి చదవాలనే ఉత్సుకతను చదువరులలో పెంచగలరు. ఆ రకమైన ముఖ్యాంశాలను గ్రంధ ప్రచురణకు ముందుగానే – ఆకర్షణీయమయిన ప్రమోలుగా రూపొందించి – పత్రికల్లో రివ్యూల ద్వారా, మీడియాలో ఇంటర్వ్యూల రూపంలో జనాలమీదకు వొదలగల టక్కుటమార విద్యల్లో ప్రచురణకర్తలు ఆరితేరిపోయారు. ఈ క్రతువులన్నీ ముగిసిన తరవాత కానీ అసలు పుస్తకం మార్కెట్లోకి రాదు.

అభివృద్ధి చెందిన దేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన ఈ మార్కెటింగ్ టెక్నిక్కులు ఇటీవల మనవైపు కూడా విస్తరిస్తున్నాయి.

టోనీ బ్లెయిర్ - ప్రయాణం

బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ - తన జీవితం లోని కొన్ని ఘట్టాలతో “ప్రయాణం” పేరుతొ ఒక పుస్తకం రాసారు. ముందు చెప్పిన విధంగానే అమ్మకాలు పెంచే ప్రచార పర్వాన్ని ‘సన్’ పత్రిక ప్రారంభించింది. ఈ పుస్తకం గురించి సమీక్ష రాస్తూ అందులోని ఒక ఆసక్తికరమయిన విషయాన్ని బయట పెట్టింది.

టోనీ బ్లేర్ మహాశయులవారు- బార్లలో పనిచేస్తూ చదువుకుంటున్న రోజుల్లో – ఒక ఫ్రెంచ్ యువతితో ప్రేమలో పడ్డారుట. ఆమెపై మరులుపెంచుకున్న టోనీకి ఆ వ్యామోహంనుంచి బయటపడడం ఒక పట్టాన సాధ్యం కాలేదుట.

“ఆలోచించడం మానుకో ఆనందించడం నేర్చుకో’ అని ఆ ఫ్రెంచ్ అమ్మడు అతడికి సుద్దులు నేర్పిందట. తనంటే పడిచచ్చిపోతున్న ఆ పడుచువాడు- భవిష్యత్తులో బ్రిటన్ దేశానికి ప్రధానమంత్రి కాగలడని ఆ యువతి అప్పట్లో వూహించి వుండదు.

‘సన్’ పత్రిక లో వచ్చిన ఈ ‘వేడి వేడి కబురు’ అందరినీ ఆకట్టుకుంది. ఏమయితేనేం - మొత్తానికి ఈ ట్రిక్ పనిచేసింది.

ఇంగ్లాండ్ పుస్తక దుకాణాలలో ఈ పుస్తకాన్ని జనం హాటు కేకుల్లా ఎగరేసుకుపోయారుట. ఫ్రెంచ్ అమ్మాయితో బ్రిటన్ మాజీ ప్రధాని ప్రేమ పురాణం  కాబట్టి పనిలో పనిగా ఫ్రాంకులు కూడా మూట కట్టుకోవాలని ఈ పుస్తకాన్ని ఫ్రెంచిలో భాషలో సయితం ప్రచురించారు.

పుస్తక విక్రయాలను పెంచుకునే ప్రచారంలో భాగంగా టోనీ బ్లేర్ అమెరికన్ టెలివిజన్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రిన్సెస్ డయానాను ఆకాశానికి ఎత్తేసారు. అంతటి అందగత్తె ఈ భూప్రపంచంలో మరొకరు కానరారు అని కానరాని లోకాలకు తరలిపోయిన డయానాను వేనోళ్ళ పొగిడారు.

ఇంతకీ ఇందులో ఏముందని అనుకుంటున్నారా- – యిరవై నాలుగు పౌండ్లు మీవి కాదనుకుంటే ఆ అనుమానం తీరిపోతుంది. (03-09-2010)
NOTE: All images in the blog are copy righted to respective owners

2, సెప్టెంబర్ 2010, గురువారం

విన్నంతలో కన్నంతలో - అమెరికా - 7 - భండారు శ్రీనివాసరావు

 కలల లోకంలో కాసేపు -

“పాడు ఉద్యోగం ఎన్నాళ్ళు చేస్తాం” అని ఈసురోమనే వాళ్ళు కూడా పదవీ విరమణ ఘడియ దగ్గరపడేటప్పుడు – ‘పొడిగింపు’ కోసం నానా తంటాలు పడడం కద్దు. ఏడుపదుల వయస్సు వచ్చేవరకూ ‘ఏమి జీవితమూ దుర్భరమూ ‘ అని తత్వాలు పాడుకున్నవాళ్ళు – తరవాత్తరవాత – తత్వం మార్చుకుని - “కొద్దిగా మనుషుల్ని ఆనవాలు పట్టే చూపు దేవుడు ఇస్తే బాగుండు” అనుకుంటూ బతుకు మీద మళ్ళీ తీపి పెంచుకునేవాళ్ళు సయితం కనబడుతుంటారు. ఇప్పుడు ఆరుపదులు దాటిన తరవాత అమెరికావచ్చి- బెల్ వ్యూ లో  మా మనుమరాళ్ళు చదువుకునే ప్రభుత్వ పాఠశాల చూసిన తరవాత నాకూ అలాటి అభిలాషే ఒకటి కలిగింది.

బెల్ వ్యూ వుడ్ రిడ్జ్ ప్రాధమిక పాఠశాల

 ‘మరుసటి జన్మలో అమెరికాలో పుట్టి ఇక్కడే చదువుకుంటే యెంత బాగుంటుందో కదా!’ అన్నదే ఆ కోరిక. అలాటి స్కూల్లో చదువుకుంటున్న మా మనుమరాళ్ళని చూసి కాస్తంత అసూయ పడ్డానేమో అని కూడా అనుమానం.

మన దేశంలో కూడా ఈ మాదిరి స్కూళ్ళు లేకపోలేదు. కానీ అవి పెట్టి పుట్టిన వాళ్ళకే పరిమితం. కూలీ నాలీ చేసుకుంటూ కలో గంజో తాగి పిల్లలను మంచి స్కూళ్ళల్లో చదివించే పేదలు కూడా మన దగ్గరవున్నారు. కానీ – ఇంగ్లీష్ మీడియం కాన్వెంటు స్కూళ్ళ పేరుతొ’ పల్లెటూళ్ళల్లో సయితం కాలు  పెడుతున్న అలాటి స్కూళ్ళన్నీ డబ్బు చేసుకునేందుకు, డబ్బు దోచుకునేందుకు తప్ప అసలు సిసలు చదువుకు పనికొచ్చేవి కావు.

ఇక్కడి విద్యాలయాల్లో చదువుకన్నా వ్యక్తిత్వవికాసానికి (personality Development) ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అనిపించింది. గట్టిగా చదివించి- ట్యూషన్లు పెట్టించి – “ఎమ్సెట్” ఒక్కటీ గట్టెక్కితే చాలనుకునే ధోరణి ఇక్కడి పేరెంట్లలో కానరాదు. ఆ అవసరం కూడా వారికి లేదనుకోండి. మరో విశేషం ఏమిటంటే సర్కారు బళ్ళల్లో (ఇక్కడ పబ్లిక్ స్కూళ్ళు అంటారు.ఇవి పూర్తిగా ప్రభుత్వ ఆజమాయిషీలో నడుస్తాయి) హైస్కూలు స్థాయి వరకూ సెంట్ ఖర్చులేకుండా చదువుకునే వీలుంది.

సమాజంలో ఉన్నత స్తాయి వర్గాలవాళ్ళు కూడా తమ పిల్లలను ప్రైవేటు స్కూళ్ళలో కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చేర్పించడానికి ప్రాధాన్యం ఇస్తారు. ఎందుకంటే - వసతుల విషయంలో, నిపుణత కలిగిన అధ్యాపకుల విషయంలో కొండొకచో సర్కారు బడులే ప్రైవేటు స్కూళ్ళను తలదన్నేలా వుంటాయి.

ఫెడరల్ గవర్నమెంట్ (కేంద్ర ప్రభుత్వం), స్తానిక (రాష్ట్ర) ప్రభుత్వాలు - విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగానే ఈ అసాధ్యం సుసాధ్యం అయిందని అనుకోవచ్చు. ప్రతి స్టేట్ లోను విద్యారంగం నిర్వహణ కోసం ‘స్కూలు డిస్ట్రిక్టుల’ను ఏర్పాటు చేసారు. తమ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను ఈ వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. విద్యాప్రమాణాలను బట్టి ఆయా స్కూళ్లకు ఫెడరల్ గవర్నమెంట్ ప్రత్యెక నిధులను ‘ఇన్నోవేషన్ ఫండ్’ నుంచి గ్రాంట్ రూపంలో ఇస్తుంది.ఈ ఏడాది వంద మిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయించింది. ఉదాహరణకు – బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు కింద వున్న సమ్మాయిష్ హైస్కూలుకు ఈ నిధి నుంచి నలభై లక్షల డాలర్ల గ్రాంటు లభించింది. దేశ వ్యాప్తంగా పోటీ ప్రాతిపదికపై నిర్వహించిన ఈ ఎంపిక ప్రక్రియకు పదిహేడు వందల ధరఖాస్తులు రాగా వాటిలో ఉత్తమంగా ఎన్నిక చేసిన 49 స్కూళ్ళలో ఇది ఒకటి. ఇలాటి పోటీల వల్ల సర్కారు బడుల్లో నాణ్యతా ప్రమాణాలు నానాటికీ పెరిగిపోతూ వస్తున్నాయి. న్యూస్ వీక్ పత్రిక విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం – అమెరికా లోని వంద ఉత్తమ పాఠశాలల్లో అయిదు హైస్కూళ్ళు బెల్ వ్యూ స్కూలు డిస్ట్రిక్టు లోనే వున్నాయి.

వుడ్ రిడ్జ్ మరో  దృశ్యం

ప్రైవేటు స్కూళ్ళలో మాదిరి గానే వసతులు, చక్కటి భవనాలు, క్రీడా మైదానాలు కలిగివుండడం వల్ల ప్రభుత్వ స్కూళ్లను చిన్న చూపు చూసే పద్దతి ఇక్కడ కానరావడం లేదు. బెల్ వ్యూ లోని వుడ్ రిడ్జ్ ఎలిమెంటరీ స్కూలు ఇందుకు ఉదాహరణ. సహజ కాంతి వుండేలా తీర్చిదిద్దిన స్కూలు భవనం, వాల్ టు వాల్ కార్పెట్లు, పొందికయిన తరగతి గదులు, లైబ్రరీ, లంచ్ రూము, ఇండోర్ జిమ్, క్రీడామైదానం, కారు పార్కింగ్ ఏది చూసినా అద్భుతం అనే మాదిరిగా వున్నాయి. టాయిలెట్లు (రెస్ట్ రూములు) అయిదు నక్షత్రాల హోటళ్ళకు దీటుగా వున్నాయి.

పలకా బలపాలు లేవు - టచ్ స్క్రీన్లు, కంప్యూటర్లే

 బ్లాకు బోర్డులు, చాక్ పీసులకు బదులు ‘టచ్ స్క్రీన్ కంప్యూటర్లతో‘ పాఠాలు బోధించే విధానం ప్రాధమిక తరగతి నుంచే ప్రారంభం కావడం మరో విశేషం. పనిచేసే టీచర్లకు కూడా జీతభత్యాలు దండిగా వుండడం వల్ల ‘బతకలేక బడి పంతులు’ అనే నానుడుకి దూరంగావుంటూ, తమ విద్యార్ధులతో ప్రేమపూర్వకంగా మసలుకుంటూ - ‘గురు సాక్షాత్ పరబ్రహ్మ’ అనిపించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ స్కూలులో పిల్లలకు నడవడిక నేర్పే పద్ధతులు దగ్గరనుంచి గమనించిన తరవాత వారి అదృష్టాన్ని గురించి మరో సారి అసూయపడాల్సి వచ్చింది. తోటి విద్యార్ధులతో మాట్లాడడం నుంచి సభ్య సమాజంలో మెలగడం వరకు – చిన్ననాటినుంచే ఇస్తున్న తర్పీదు చూడముచ్చటగా వుంది. తమకున్న పరిమితుల్లోనే సమాజానికి ఎలా సేవ చేయవచ్చన్నది ఆచరణలో బోధిస్తారు.

చదువంటే ఆటా పాటా

 స్కూలు మొదలయ్యేటప్పుడు, తిరిగి వొదిలేటప్పుడు టీచర్లు, కొందరు ఎంపిక చేసిన విద్యార్ధులు స్కూలు ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి వాహనాల రాకపోకలను క్రమబద్ధం చేస్తారు. అలాగే పేరెంట్స్ తోడు లేకుండా స్కూలు బస్సుల్లో ఒంటరిగా వచ్చే పిల్లలను జాగ్రత్తగా దింపుకుని వారి వారి తరగతి గదులకు చేరుస్తారు. బస్సునుంచి దిగుతున్నప్పుడే పిల్లల పేర్లను రిజిస్టర్ లో రాసుకుంటారు. ఈ బస్సులకూ, మధ్యాహ్న భోజనానికీ ఎలాటి చార్జీ వుండదు.

ట్రాఫిక్ కంట్రోల్

 విద్యా సంవత్సరం ముగిసి విద్యార్ధులు పై తరగతికి మారుతున్నప్పుడు పాత సహాధ్యాయుల ఫోటోలు, వారి వివరాలతో కూడిన ఒక చిన్న ఆల్బం ఇస్తారు. వారిలో కొందరు సొంత కారణాలపై వేరే స్కూలుకు మారినప్పటికీ, వారి జ్ఞాపకాలు భద్రంగా వుంచుకునేందుకు ఈ ఆల్బంలు పనికివస్తాయి. తరగతి గదిలో ఏటిపొడుగునా విద్యార్ధులు సృజనాత్మకతను రంగరించి చేసిన పనులను, అంటే గీసిన బొమ్మలు, వేసిన చిత్రాలు, తీసిన ఫోటోలు, రాసిన కధలు, వ్యాసాలు అన్నింటినీ జాగ్రత్తగా భద్ర పరచి ఒక చక్కని ఫోల్డర్ రూపంలో ఏడాది చివరిలో అప్పగిస్తారు. తలిదండ్రులతో తరచుగా సమావేశాలు జరిపి వారి పిల్లల పురోగతిని గురించి వివరిస్తారు.

పెద్దయ్యాక ఇక ఆడుకునేదేముంటుంది?

హైదరాబాదులో వేలకొద్దీ ఫీజుల రూపంలో దండుకునే అనేక విద్యా సంస్తలు కొన్నింటిలో ఇదేమాదిరి విధానాలు,వసతులు వుండవచ్చు. కానీ ఇంతవరకు ముచ్చటించుకున్నది ఏదో కార్పొరేటు స్కూలు గురించి కాదు. అమెరికాలో ఒక సర్కారు బడిని గురించి మాత్రమె. ఈ వాస్తవం గమనంలో వుంచుకుంటే – ఈ స్కూలుని చూసి ఎందుకు ముక్కున వేలేసుకోవాల్సి వచ్చిందో అర్ధం అవుతుంది.

ఇండోర్ స్టేడియం

కలాం గారు  కోరుకున్నట్టు – మనందరం ఒక కల కనాలి. కనడమే  కాదు దాన్ని  నిజం చేసుకోవాలి.

సహజ కాంతితో పాఠశాల  


ఇలాటి స్కూళ్ళు గ్రామ గ్రామానికీ రావాలన్నదే ఆ కల. పైసా ఖర్చు లేకుండా,పేదా గొప్పా తారతమ్యం లేకుండా -  పిల్లలందరికీ ‘ఇలాటి చిన్నతనం’ వారి  సొంతం కావాలి.

భావి భారతం ‘భద్ర భారతం’ కావాలంటే, భావి తరం ‘మేధావి భారతం’ కావాలంటే – చదువు నేర్చుకోవడం అన్న ఒక్క ‘హక్కు’ ఇచ్చి వూరుకుంటే సరిపోదు- ఇంత ఆనందంగా, హాయిగా, ఆడుతూ, పాడుతూ చదువుకోగల ‘సర్కారు స్కూళ్ళు’ - చదువుకుందామనుకునే ప్రతి ఒక్కరికీ హక్కు భుక్తం కావాలి.

అయితే-

వీటన్నిటినీ ఆచరణలోకి తీసుకురావాలంటే కొన్నింటికి తప్పనిసరిగా డబ్బు కావాలి. అది ఎప్పుడూ కొరతే. మరికొన్నింటికి కేవలం చిత్త శుద్ధి వుంటే చాలు .కానీ, ఇప్పుడు బాగా కొరతగా వున్నది దీనికే. టీవీ చర్చల్లో తప్ప ఎక్కడా వినబడని ఈ "చిత్తశుద్ధి" అంత తేలిగ్గా దొరుకుతుందా?

NOTE: All images in the blog are copyrighted to the respective owners.

31, ఆగస్టు 2010, మంగళవారం

దైవం మానుష రూపేణ - భండారు శ్రీనివాసరావు

దైవం మానుష రూపేణ - భండారు శ్రీనివాసరావు


‘ఈ చరాచర ప్రపంచంలో అత్యంత ఘోరంగా, అతి హేయంగా మీరు  చీదరించుకునే ప్రాణి ఎవరు’ అని మా ఆవిడను అడిగితే సాలెపురుగు అంటుంది. మా మనుమరాలిని ఇదే ప్రశ్న అడిగితే ‘బల్లి’ అని జవాబిస్తుంది. కొన్నేళ్ళక్రితం వరకూ- ఇలాటి ప్రశ్నకు నా సమాధానం సోమమ్మగారు అనబడే సోమిదేవమ్మగారు.

బెజవాడ గవర్నర్ పేటలో లంకంతకొంపనీ ఇద్దరు ఆడపిల్లలనీ, ఆవిడకు వొదిలేసి – సోమమ్మగారి మొగుడు ఆమె చిన్నతనంలోనే కాలం చేసారు. పిల్లలను పెంచి, పెద్దచేసి, పెళ్ళిళ్ళు చేసి పెద్దరికంగా వుండాల్సిన ఆ పెద్దావిడ - ‘మడీతడీ’ అంటూ - ‘అంటూ సొంటూ’ అంటూ- అయినదానికీ, కానిదానికీ అందర్నీ ఆడిపోసుకునేది. కడవంత నోరు చేసుకుని చిన్నా పెద్దా తేడాలేకుండా శాపనార్ధాలు పెట్టేది. ఆమెను చూస్తుంటే చిన్నవాళ్లమయిన మా అందరికీ ఓ బ్రహ్మరాక్షసిలా కనిపించేది. ఇల్లు ఆవిడది కావడం మూలానా, అంత తక్కువ కిరాయికి మరో ఇల్లు దొరికే అవకాశం లేకపోవడం మూలానా - అక్కడ అద్దెకు వున్నవాళ్ళు ఎవ్వరూ – ఆమెకు ఎదురు నిలిచి మాట్లాడేవాళ్ళు కాదు. దానితో, ఇక ఆమె నోటి దురుసుకు ఎదురు లేకుండాపోయింది. మనిషేమో ఆజానుబాహువు.  ‘మడీ దడీ’ పేరుతొ అరకొరగా మడిబట్ట చుట్టుకుని, 'అసింటా అసింటా' అంటూ  అందరినీ కసురుకుంటూ అందరిళ్ళలో తిరిగేది. ఆమెని చూస్తే చిన్నతనం నుంచీ నాకు అదోకరకం అసహ్యం.  పెరిగి పెద్దయిన తరవాత కూడా అది మరింత పెరిగిపోయిందే కానీ  ఆ ఏహ్యభావం నన్ను వొదిలిపెట్టలేదు. నాతో పాటే పెరిగి పెద్దయిన ఆమె మనుమలు ఏదో ఉద్యోగాల్లో కుదురుకున్నారు. చిన్నవాడికి ఒక్కడికే ఇంకా పెళ్లి కావాల్సివుంది. అనుకోకుండా అతడికి బంగారం లాటి పెళ్లి సంబంధం వచ్చింది. ఒంట్లో ఇంట్లో బాగావున్న ఓ ఖామందు గారు పిల్లనిస్తామని ఏకంగా వాళ్ళ  ఇంటికే వచ్చారు. బాపూ గారి సినిమా పాట మాదిరిగా ‘కట్నమెంత లావో - పిల్ల అంత లావు’. డబ్బా మజాకా! ఎగిరి గంతేసి వొప్పుకున్నారు. పెళ్ళున పెళ్లయిపోయింది. కానీ మూడు ముళ్ళు పడ్డ మూన్నెళ్లకే ఆ అమ్మాయి ఆసుపత్రిలో పురుడు పోసుకుని పండంటి పిల్లాడికి తల్లయింది. అప్పుడుకానీ అంత గొప్ప సంబంధం తమని  వెతుక్కుంటూ ఎందుకు వచ్చిందన్న విషయం వాళ్లకు అర్ధం కాలేదు. సోమమ్మగారి సంగతి తెలిసిన వాళ్ళెవ్వరూ ఆ సంగతి తెలిసి ఏమాత్రం జాలిపడలేదు. పైగా అలాటి మనిషికి అలాగే కావాలని బాహాటంగానే నోళ్ళు నొక్కుకున్నారు. ఆ అమ్మాయి తలిదండ్రులు సరేసరి -కన్నె వయసులో కాలుజారిన కన్న కూతురికి పుట్టబోయే బిడ్డ - తమ బిడ్డ బంగారు భవిష్యత్తుకు అడ్డం కాకూడదని, హడావిడిగా పెళ్లి చేసి, ఆసుపత్రిలో పురుడు పోసి – ఆ పసికందుని అక్కడే వొదిలేసి కూతుర్ని తీసుకుని వెళ్లి  పోయి చేతులు కడిగేసుకున్నారు. అప్పుడేమి జరిగిందన్నదే – ఈ కధ కాని కధకు క్లైమాక్స్.

సోమమ్మగారిది నిప్పులుకడిగే మడీ ఆచారం అని చెప్పుకున్నాము కదా. మనవడి భార్యకు పుట్టిన బిడ్డకు తండ్రెవరో తెలియదు. ఇంటావంటా లేని ఘోరం జరిగిపోయింది. ఆచారాలకు  నెలవయిన ఇంట్లో అనాచారం పురుడు పోసుకుంది.  కన్న తల్లేమో నిర్ధాక్షిణ్యంగా రోజుల పిల్లవాడిని వాడిమానానికే వొదిలేసి వెళ్లి పోయింది. ఈ పరిస్తితుల్లో ఆమె మానసిక పరిస్తితి ఎలావుంటుందో తేలిగ్గా వూహించుకోవచ్చు. కానీ, అందరి వూహల్ని పటాపంచలు చేస్తూ సోమమ్మగారు సరాసరి ఆసుపత్రికి వెళ్ళింది. అంతా కళ్ళింత చేసుకుని చూస్తూ వుండగానే – ఎవరికీ అక్కరలేని ఆ అనాధ శిశువుని అబ్బారంగా  వొడిలోకి తీసుకుంది. ‘అందరూ కాదనుకుని వెళ్ళినా - నీకు నేనున్నానంటూ’ ఇంటికి తీసుకు వచ్చింది. కన్నతల్లి కాదన్నా, ఆ తల్లిని కన్నవాళ్ళు కాదనుకున్నా, కట్టుకున్నవాడు బెల్లం కొట్టిన రాయిలా మిన్నకున్నా – అమ్మమ్మ గారు – ఆవిడిక నా దృష్టిలో సోమమ్మగారు కాదెంత మాత్రం కాదు – ‘అమ్మమ్మ గారే’ - ఆ చిన్ని వయస్సులోని ఆ చిన్నారికి అమ్మయింది.
అమ్మయి లాలించింది. అమ్మమ్మయి ఆడించింది. నాన్నయి నడిపించింది. నాన్నమ్మయి నీతి కధలు చెప్పి నిద్రపుచ్చింది. తల్లీతండ్రీ లేని ఆ అనాధ శిశువుకు సర్వస్వం అయింది. సర్వం తానే అయింది. ఇప్పుడు చెప్పండి !
ఆమెను ఛీత్కరించాలా! దైవసమానురాలని భావించి నమస్కరించాలా!
మనుషుల్ని కళ్ళతో చూసి కాకుండా మనసుతో చూసి అంచనా వేసుకోగలిగేలా ఎవరిని వారు సంస్కరించు కోవాలా!
 నేను ఆమె పట్ల చేసిన పొరబాటు ఇంకెవ్వరూ చేయరనీ, చేయకూడదనీ మనసారా కోరుకుంటూ  – మనసు పొరల్లో  కదలాడుతున్న 'ఈ జ్ఞాపకాన్ని’ ఇన్నేళ్ళ తరవాత బయటకు తీస్తున్నాను. ఇందువల్ల ఎవరి మనసు అయినా బాధ పడితే క్షంతవ్యుణ్ణి. - మరణించిన తరవాత కూడా, నా మనస్సులో జీవించే వున్న ఆ ‘అమ్మమ్మగారి’ ఔన్నత్యాన్ని నలుగురికీ తెలపడమే ఒక్కటే  ఇందులోని ఉద్దేశ్యం.
అందుకే అన్నారు - ప్రార్ధించే పెదవులకన్నా - సేవ చేసే చేతులు మిన్న
 (30-08-2010)

ఇలాటి ఉన్నత మనస్కుల ఫోటోలు కడిగి గాలించినా ఎక్కడా దొరకవు. అందుకే ఈ బ్లాగులో ఫోటోలు లేవు. 

10, ఆగస్టు 2010, మంగళవారం

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు

జీవన స్రవంతి - భండారు శ్రీనివాసరావు


దంచూ దంచూ ఇంకా దంచు


ఢిల్లీ లోని వివేక్ నగర్ స్కూల్ లో మాష్టారు ఒకరు ఓ రోజు క్లాసు లోని పిల్లలని బెత్తంతో తలా నాలుగు తగిలించాడు.ఈ  సంగతి తెలుసుకున్న పేరెంట్స్ కమిటీ ప్రతినిధి - ఎంత అల్లరి చేస్తే మాత్రం ఇంతగా చావగొట్టాలా అని స్కూల్ మాష్టర్లపై ఎగిరెగిరి పడ్డాడు. కానీ, మా స్కూల్ లో ఇది మామూలే అని చాలా మామూలు విషయంగా వాళ్ళు తేల్చివేయడంతో ఆ పెద్దమనిషికి వొళ్ళు మండి యెకాయెకిన పోలీసు స్టేషన్ కి వెళ్లి , పిల్లలని కొట్టిన మాష్టారిపై కేసు పెట్టబోయారట. " పిల్లలని కొట్టినదెవరు ? ఎందుకు కొట్టారు ? ఈ కొట్లాటలో ఎంతమంది గాయపడ్డారు ? గాయాలు బాగా తగిలాయా ? " అంటూ పోలీసులాయన్ని ప్రశ్నలతో బాదడం మొదలు పెట్టి - గాయాలు తగలని 'కొట్టుడు' కేసులను నమోదు చేసుకోమని - ఆయన మొహం మీదే కొట్టినట్టు చెప్పేశారట. పోలీసు బాదుడుకన్నా టీచర్ల బెత్తమే బెటరనుకుని ఆ పెద్దమనిషి - మనసు చిన్నబుచ్చుకుని స్టేషన్ నుంచి బయటపడ్డాడట.



జీవనస్రవంతి



పెళ్ళంటే వెయ్యేళ్ళ 'వంట'


విందుకు వెళ్ళే ముందు - ముందే భోజనం చేసి పొమ్మనే ఇంగ్లీష్ సామెత ఒకటి వుంది. ఇంగ్లీష్ వాళ్ళ విందుల్లో మర్యాదలని తుచ తప్పకుండా పాటించడం రివాజు. గౌరవ క్రమంలో- ఎవరికీ ముందు పెద్ద పీట వెయ్యాలి అనే విషయంలో - అంటే వారి భాషలో చెప్పాలంటే పెద్ద కుర్చీ వెయ్యాలి అనే దగ్గర ఓ సారి పేచీ వచ్చి - విందుకు వచ్చిన వాళ్ళల్లో ఒక శిశుపాలుడు ఆ కుర్చీ తనకే దక్కాలని గొడవ పెట్టుకున్నాడట. ఈ తగవులాట తెగకుండానే తెల్లారి పోవడంతో - అతిధులు భోజనాలు చేయకుండానే ఇంటి దోవ పట్టారట. అందుకే- విందుకు వెళ్ళే ముందు భోజనం ముందస్తుగా చేసి వెళ్ళాలన్న సామెత ఆ విధంగా పుట్టిందని అంటారు.

పెళ్ళిళ్ళ సీజన్లో పెద్ద పెద్ద ఊళ్ళల్లో వీధికి రెండేసి పెళ్లి పందిళ్ళు కనిపిస్తుంటాయి. వెళ్ళాల్సిన పెళ్లిల్లు కనుక్కుని వెళ్లేలోగానే - పడాల్సిన మూడు ముళ్ళు పడిపోయి పెళ్లి తంతు ముగిసిపోవడం కద్దు. ఈ మధ్య పోరుగూరిలో పెళ్లి కెళ్ళిన ఒక పెద్ద మనిషి అడ్రసు వాకబు చేసుకుని వెళ్ళేలోగా - పెళ్లి పూర్తి కావడం - పెళ్లి వాళ్ళు డేరా ఎత్తేయడం జరిగిపోయాయి. హోటళ్లు వున్న పెద్ద వూరు కాబట్టి- ఏదో ఇంత కడుపు చలవ చేసుకుని ఇంటికి చేరాడు. ఇంతకీ చెప్పొచ్చేది ఏమిటంటే- ఇంగ్లీష్ సామెత తెలుగు పెళ్ళిళ్ళకి కూడా అన్వయించేలా వుంది.



జీవనస్రవంతి



 ఎదగడానికెందుకురా తొందరా ?  ఎదర బతుకంతా చిందరవందర

బాగా నడిచే స్కూళ్ళు , నడవని స్కూళ్ళు అని స్కూళ్ళలో లో రెండు రకాలని గీతలో కృష్ణుడు చెప్పాడనే వాళ్ళున్నారు. కొన్ని చోట్ల ఉపాధ్యాయులు - విద్యార్ధులు ఏకమై పోయి - స్కూల్ సరిగ్గా నడవకుండా తరగతులు ఎగ్గొట్టి మరీ ప్రయత్నాలు చేస్తుంటారు. జమ్మూ కాశ్మీరు సర్కారు మాత్రం ఈ గొడవ ఎందుకనుకుందో ఏమో , ఏకంగా నడిచే స్కూళ్ళనే ప్రవేశ పెట్టింది. కొండల్లో, కోనల్లో నివసించే పిల్లలకోసం బళ్ళు తెరిచినా అక్కడ పనిచేయడానికి ఉపాధ్యాయులెవరూ ముందుకు రాకపోవడంతో ఈ రకమైన స్కూళ్ళకి శ్రీకారం చుట్టింది. ఈ సంచార బళ్ళు - బళ్ళల్లో మాష్టార్లను ఎక్కించుకుని విధ్యార్దులున్న చోటికే వెళ్లి పోయి ఎంచక్కా పాఠాలు చెప్పేస్తుంటాయి. పిల్లలు కూడా ఈ తిరిగే బళ్ళల్లో తిరుగుతూ అక్షరాలు దిద్దుకుంటున్నారట. దానితో, 'తిన్నదరిగేలా తిరగకుండా బుద్దిగా చదువుకోకూడదా ? ' అని పెద్దలు పిల్లలను మందలించే ఛాన్స్ అక్కడ లేకుండాపోయింది.

(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All Images in this blog are copy righted to their respective owners

31, జులై 2010, శనివారం

అమెరికా అనుభవాలు - 20

అమెరికా అనుభవాలు - 20




సీ వరల్డ్

నీటిలో చేప - చేప నోటిపై భామ  


ఆ తరవాత మజిలీ సీ వరల్డ్ ఎడ్వెంచర్ పార్క్. ఇది శాన్ డియాగో లో వుంది. కొన్ని వందల ఎకరాల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేసారు. వేల్స్ , డాల్ఫిన్స్ ఇంకా అనేక జలచరాల అద్భుత విన్యాసాలను ఇక్కడ చూడవచ్చు.

గాలిలో వేల్   విన్యాసం

షామూ అనే వేల్ ప్రదర్శన ప్రత్యెక ఆకర్షణ. వీటిని చూపించడానికి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియాలు అనేకం వున్నాయి. ప్రేక్షకుల గేలరీకి, వేదికకూ నడుమ జలరాశి వుంటుంది. వేదికకు రెండువైపులా నీటిలో వున్న గేట్లను తెరవగానే వేల్స్, డాల్ఫిన్స్ ఎంతో వేగంగా వచ్చి రకరకాల ఫీట్లతో ప్రేక్షకులను రంజింపచేస్తాయి. సుమారు డెబ్బయి అడుగుల ఎత్తువరకు గాలిలోకి ఎగిరి మల్ళీ నీటిలోకి జంప్ చేస్తాయి.

చేపా చేపా ఎగరకే  

అప్పుడు ఎగసిపడే నీటి తుంపర్లతో గేలరీల్లో వున్నవాళ్ళు తడిసిముద్దయిపోతారు. అందుకని రైన్ కోట్లు తప్పనిసరి. వీటిని అక్కడ సప్లయి చేస్తారు. శిక్షకులు చెప్పే మాటలను, సూచనలను అర్ధం చేసుకుంటూ డాల్ఫిన్లు కడుపుబ్బ నవ్వేలా విన్యాసాలు చేస్తాయి. కోతుల్ని, పాముల్ని, గంగిరెద్దులను ఆడించే వాళ్ళని చూసాము కానీ ఇక్కడ ఎలుకలు, ఉడతలకు కూడా ట్రెయినింగ్ ఇచ్చి వాటితో అనేక విన్యాసాలు చేయించడం చూసి ఆశ్చర్య పోయాము. సర్కస్ లో బఫూన్ల మాదిరిగా ఇవి అప్పుడప్పుడు స్టేజీ మీదకు వచ్చి ట్రెయినర్లతో పోటీ పడి నటించడమే కాకుండా తమ చేష్టలతో వీక్షకులను నివ్వెరపరుస్తాయి.

మంచు వెలుగులో ఎలుగులు

 ఉత్తర ధ్రువ ప్రాంతాన్నిఅక్కడ కృత్రిమంగా సృష్టించి - ధ్రువ ప్రాంతాలలో మాత్రమే మనగలిగే తెల్లని ఎలుగుబంట్లను అక్కడ ప్రదర్శిస్తున్నారు. అలాగే పారదర్శకంగా వుండే పెద్ద గాజు ట్యూబు లో వెడుతూ చుట్టూవున్న నీటిలో - సముద్ర జలాల్లో సంచరించే జీవరాసులను చూడగలగడం మరో అనుభూతి.



NOTE: All images in this blog are copy righted to their respective owners