పురుషులలో పుణ్య పురుషుల మాదిరిగా కార్లలో రోల్స్
రాయిస్ రాయసమే వేరు. గొప్ప గొప్ప వాళ్లు కొనుక్కుని గొప్పగా చెప్పుకునే ఆ గొప్ప
కారును ‘చెత్త బండీ’గా వాడిన ఘనత ఒక భారతీయుడిది. నమ్మి తీరమంటోంది ఓ ‘నెట్ కధనం.’
1940 కి పూర్వం
ఆనాటి మైసూరు మహారాజా గారు ఇంగ్లాండ్ కి విహార యాత్రకి వెళ్లారు. లండన్ లో రోల్స్
రాయిస్ కార్ల షో రూమ్ కి వెళ్ళి అక్కడ కొత్త మోడల్ కారును చూసి ముచ్చటపడ్డారు. కానీ
ఆ షో రూమ్ వారికి ఈయన ఎవరో తెలియదు. అది అందరికీ అమ్మే అల్లాటప్పా కారు కాదన్నట్టు
చెప్పి తిప్పి పంపించారు.
రాజావారికి రోషం పొడుచుకు
వచ్చింది. స్వదేశానికి వచ్చిన వెంటనే బ్రిటిష్ ప్రభుత్వంలో తనకున్న సంబంధాలను
వాడుకుని ఇంగ్లాండ్ నుంచి ఒక రోల్స్ రాయిస్ కారును ఆఘమేఘాల మీద దిగుమతి చేయించుకున్నారు.
లండన్ లో జరిగిన అవమానానికి బదులు తీర్చుకోవాలని అనిపించింది. వెంటనే ఆ కొత్త
రోల్స్ రాయిస్ కారును రాజప్రాసాదంలో చెత్త రవాణా చేసే వాహనంగా ఉపయోగించాలని ఆదేశాలు జారీ చేశారు.
దేశదేశాల్లో జనాల మన్ననలు
అందుకుంటున్న తమ కారుకు మైసూరు రాజభవనంలో పట్టిన దుస్తితి రోల్స్ రాయిస్ కంపెనీ
దృష్టికి వచ్చింది. ఆ కంపెనీ ప్రతినిధులు లబోదిబోమంటూ మైసూరుకు వచ్చి తమ కారు
ప్రతిష్టకు భంగం కలిగించవద్దని మొర పెట్టుకున్నారు. అంతగా కావాలంటే కారు ధరకు
ఎక్కువ మొత్తం చెల్లించి తమ కారును తాము తీసుకుపోతామని విన్నపం చేసుకున్నారు.
అంతా విని మైసూరు రాజా గారు
మీసాలు సవరించుకుంటూ వారితో ఇలా అన్నారు.
“ ఆ మాటయితే ఓ పని చేయండి. రాజప్రాసాదంలో
చెత్త రోజుజుకూ పెరిగి పోతోంది. మరో రెండు రోల్స్ రాయిస్ కార్లు వెంటనే
పంపించండి. ధర ఎంతయినా పరవాలేదు.”
అప్పటినుంచి లండన్ లో రోల్స్
రాయిస్ షో రూమ్ కు భారతీయులు ఎవ్వరు
వెళ్ళినా వారిని మహారాజుల మాదిరిగా చూడడం
మొదలయింది.
‘యేమో ఏ పుట్టలో ఏ పాముందో’
అనే భయం అక్కడివారిని పట్టుకున్నట్టుంది.