18, డిసెంబర్ 2023, సోమవారం

రిటైర్ అయిన జర్నలిస్టులు ఏం చేయాలి? – భండారు శ్రీనివాసరావు

 


తమ అనుభవాలను డాక్యుమెంట్ చేయాలి

ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, ఈరోజు (15-12-2023) ఒక మంచి సందర్భంలో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ  కొందరు సీనియర్ జర్నలిస్ట్లులు  వెలిబుచ్చిన  అంతరంగ ఆవిష్కరణ కూడా.

వారందరికీ ఈ అవకాశం కల్పించింది, సీనియర్ పాత్రికేయులు, బహు గ్రంధకర్త అయిన శ్రీ గోవిందరాజు చక్రధర్. సందర్భం ఆయన రాసి, కూర్చి ప్రచురించిన ఐదు పదుల అక్షర యాత్ర అనే స్వీయ చిత్రావలోకనం. పదహారు పేజీల ఈ చిరుపొత్తంలో నిజానికి అక్షరాలు తక్కువ చక్కటి ఛాయా చిత్రాలు ఎక్కువ. అయిదు దశాబ్దాల పాత్రికేయ జీవన గమనాన్ని స్పర్శిస్తూ వెలువరించిన పుస్తకం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇటీవల స్వీకరించిన జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న తర్వాత తనలో పొటమరించిన ఆలోచనకు  చక్రధర్ గారు ఈవిధమైన రూపం కల్పించారు. ఆయన్ని తెలియనివారు, తెలుసుకోవాలని అనుకునేవారు ఈ పుస్తకాన్ని ఒకసారి తిరగేస్తే చాలు, నిమిషంలో ఆయన ఏమిటన్నది చదువరికి అర్ధం అవుతుంది. అందుకే ఈ ప్రయోగం అనేది చక్రధర్ ఆలోచన.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వజాతీయ మీడియా సలహాదారు శ్రీ దేవులపల్లి చేతుల మీదుగా ఈ కార్యక్రమం  జరిగింది. పాత్రికేయ ప్రముఖులు శ్రీయుతులు ఆర్వీ రామారావు, మందలపర్తి కిషోర్, వల్లీశ్వర్, తాడి ప్రకాష్, బుద్ధవరపు రామకృష్ణ,  శంకరనారాయణ, ఎమెస్కో సంపాదకులు శ్రీ చంద్రశేఖర రెడ్డి, శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర, వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి శ్రీ  కొండా లక్ష్మణ రావు, ఫేస్ బుక్ స్పెషల్ కరస్పాండెంట్  జాగర్లమూడి రామకృష్ణ, ఎస్. రాము, దుగ్గరాజు స్వాతి  ప్రభ్రుతులు ఇష్టాగోష్టిగా జరిగిన ముచ్చట్లలో పాలుపంచుకున్నారు.

సభాధ్యక్షుడు దేవులపల్లి అమర్ ప్రారంభంలోనే ముఖ్య అతిధులకు, అతిధులకు నడుమ ఉన్న విభజన రేఖను చెరిపేస్తూ తమ కుర్చీలను ఆహూతులకు దగ్గరగా జరిపించడంతో కార్యక్రమం యావత్తూ, కొందరు మాట్లాడడం అందరు వినడంలా కాకుండా అనదరూ మాట్లాడుతూ అందరూ వినే ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్ గా మారిపోయింది.

ముందు చెప్పినట్టు ఫేస్ బుక్ ధర్మమా అని చాలామంది జర్నలిస్టులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను అనుదినం పోస్ట్ చేస్తూనే వున్నారు. వాళ్లకు రాయడం మాత్రమే తెలుసు. అతి కొద్ది మంది మాత్రమే వాటిని పుస్తక రూపంలోకి తేగలుగుతున్నారు. పుస్తక ప్రచురణలోని కష్ట నష్టాలు తెలిసిన చంద్రశేఖర రెడ్డి గారు తలచుకుంటే ఇదేమంత పెద్ద పని కాదు. ఆ పెద్ద మనసు వారికి ఉందనే నా నమ్మకం.

15-12-2023                

2 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

-

రిటైరయిన జర్నలిస్ట్లు ఏమి చేయాలె

తోక టపాలు రాసు కోవాలె :)

లేకుంటే కంద పజ్యాలు రాసి పడేస్తో పోవాలె :)





అజ్ఞాత చెప్పారు...

చేసిన పాపం చెబితే పోతుంది అంటారు.

పాత తరం పాత్రికేయులను జర్నలిస్టులు అనేవారు. At present most of the media persons cannot be called as journalists. They are either too arrogant, biased or puppets in the hands of politically motivated media heads.