26, డిసెంబర్ 2023, మంగళవారం

ఆకాశ దర్శన్ అను తల్లి కోరిక తీర్చిన తనయుడు – భండారు శ్రీనివాసరావు

 ప్రతి తల్లీ  కోరుకునేదే ఆ తల్లీ కోరుకున్నది. తన కుమారుడు బాగా చదువుకుని జీవితంలో ఎన్నో ఎత్తులకి ఎదగాలని. ఆ మహా తల్లి పేరు పాలకుర్తి ఇందిరమ్మగారు. ఆమె మనసులో కోరుకున్నట్టే ఆ కుమారుడు పాలకుర్తి మధుసూదన రావు చాలా ఎత్తులకు ఎదిగాడు. పెద్దలు వద్దంటున్నా  కష్టపడుతూ తాను బాగా  ఇష్టపడిన చదువే (ఎమ్మే తెలుగు) చదువుకున్నాడు. ఆ ధైర్యమే ఆయన్ని పై ఎత్తులకు చేర్చింది. మనసుపడిన ఉద్యోగాలు చేయించింది. అలా అలా ఎక్కడయితే ఒక చిన్నస్థాయి ఉద్యోగంలో చేరాడో, అదే సంస్థకు ఉత్తరాధికారి కాగలిగాడు. రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్ గా చేరి స్టేషన్ డైరెక్టర్ అయ్యాడు. అందరికీ ఇలా ప్రమోషన్లు వచ్చే అవకాశం వుండదు. అందుకే కష్టపడి దోవలో ఎదురయిన ప్రతి పోటీ పరీక్షలో నెగ్గి, అతి త్వరగా నిచ్చెన మెట్లు ఎక్కగలిగాడు. దూరదర్సన్ లో అలాగే ఒక స్థాయి హోదానుంచి ఏకంగా  హైదరాబాదు  స్టేషన్ డైరెక్టర్ గా  సుదీర్ఘ కాలం పదవీ బాధ్యతలు నిర్వహించి, రిటైర్ అయిన పిదప టీటీడీ వారి ఆధ్యాత్మిక ఛానల్  శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సీ.ఈ.ఓ. గా పనిచేశారు. ఈ మహత్తర అవకాశం  తన పూర్వజన్మ సుకృతంగా భావించే పాలకుర్తి మధుసూదనరావు, తన జీవిత అనుభవాలను, రేడియో, దూరదర్సన్ లలో తన ఉద్యోగ పర్వాలతో కూడిన,  “నేను – నా ఆకాశ దర్సన్” అనే పేరుతొ దాదాపు 250 పేజీల గ్రంధం రాశారు. రేడియో, దూరదర్సన్ లు ఉచ్చస్తితిలో ఉన్నప్పుడు పనిచేసిన అధికారిగా, వాటిలోని అన్ని విభాగాల్లో అనుభవం గడించిన ఉద్యోగిగా రాసిన ఈ పుస్తకంలో,  ఒకప్పటి ఆ సంస్థల శ్రోతలను, వీక్షకులను  అలరించే అనేక సంగతులు ఈ పుస్తకంలో వున్నాయి.  

ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. ఇన్ని మెట్లు ఎక్కినా, తన మొదటి మెట్టు ఆంధ్రభూమిలో సబ్ ఎడిటర్ గా పనిచేసిన రోజులను మరచిపోలేదు. ఆయన్ని ఆ ఉద్యోగానికి రికమండ్ చేసిన ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ యాదగిరి రెడ్డి గారు చెప్పిన హితవాక్యాన్ని మధుసూదనరావు ఇన్నేళ్ళ తర్వాత కూడా గుర్తు పెట్టుకుని  ఇందులో ప్రస్తావించడం విశేషం.

“ మధూ! జీవితంలో ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకో. జీవితంలో పైకి  రావాలి అంటే వినమ్రత ముఖ్యం. దాన్ని విస్మరించకు. అది సంజీవని లాంటిది.”

ఈ మాటలు బాగా గుర్తు పెట్టుకున్నట్టుంది. తన సర్వీసులో ఎదురైన  పెద్దలపట్ల, చిన్నల పట్లకూడా అదే వినమ్రత, అదే గౌరవం. ఇవే  ఆయన్ని పెద్దవాడిని చేసాయి. పెద్దలను  దగ్గర చేసాయి. చిన్నలను  దూరం జరగకుండా చేసాయి.

సాధారణంగా  జీవిత చరిత్రలలో సకృత్తుగానైనా ఆత్మస్తుతి, పరనింద పంటికిందరాళ్లులా తగులుతుంటాయి. ఈ పుస్తకంలో ఆ రెండూ మృగ్యం. బహుశా  గురువు బోధించిన ఈ వినమ్రతే కారణం కావచ్చు.  

ఈ పుస్తకం ఇలా వెలుగు చూడడానికి ప్రధాన కారణం అయిన ఇద్దర్ని స్మరించడం నా కర్తవ్యమ్.

సరే! రాసింది పాలకుర్తి. ప్రచురించింది కిన్నెర పబ్లికేషన్స్ తరపున శ్రీ మద్దాళి రఘురాం. పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోయినా కూడా శ్రీరఘురాం పెద్ద మనసుతో ఈ పుస్తకం నా చేతిలో పెట్టారు.

పెట్టే ముందు మధుసూదన రావు ఇంకొంచెం పెద్ద మనసు చేసుకుని  ఆటోగ్రాఫ్ పెడుతూ నా గురించి కొన్ని మంచి మాటలు రాయడం నా అదృష్టం.

ఇప్పుడే వినమ్రత గురించి రాసి, వెంటనే ఆ వాక్యాలు రాయడం నాకు ఇష్టం లేదు. అంత గొప్పగా రాసారు.

నిజానికి నాకొక టెస్ట్ మోనియల్.



(డాక్టర్ పాలకుర్తి మధుసూదన రావు)


(26-12-2023)               

4 కామెంట్‌లు:

Zilebi చెప్పారు...

వారేమని కితాబు మీకిచ్చారో చెబ్దురూ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@Zilebi : మీరు ఒక్కరే చూడగలిగే సులువు ఏమైనా ఉందా టెక్నికల్ గా చెబుదురూ

Zilebi చెప్పారు...

ఉందండి
మా బ్లాగులో కామింటుగా వేస్తే
మాకు మాత్రమే కనబడును.


Zilebi చెప్పారు...

-
మీ కామింటును వేయం
డీ కనిపించదహొయెవ్వరికి నా బ్లాగ్లోన్
మాకాడ రహస్యముగా
స్వీకృత మై బుట్టలోకి చేరు హళహళిన్