20, డిసెంబర్ 2023, బుధవారం

తండ్రి స్వప్నాన్ని నెరవేర్చిన తనయుడు – భండారు శ్రీనివాసరావు

(PUBLISHED IN SAKSHI DAILY ON 20-12-2023, WEDNESDAY)  

వై.ఎస్ రాజశేఖర రెడ్డి పేదల ఆరోగ్యం గురించి ఒక బృహత్తరమైన కలకంటూ అది పూర్తిగా నెరవేరక ముందే అర్ధంతరంగా నిష్క్రమించారు. దాన్ని ఆయన కుమారుడు, ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహనరెడ్డి నెరవేర్చారు.

ఇంతకీ వై.ఎస్. కన్నకల ఏమిటి?

ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి సామాన్య ప్రజలకోసం ఆరోగ్య శ్రీ పేరుతొ ఒక బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేశారు.  సామాన్యులకు అందని ద్రాక్షగా ఉన్న కార్పొరేట్ స్థాయి వైద్యం వారికి అందుబాటులోకి తెచ్చిన పధకమే ఆరోగ్య శ్రీ. అందులో భాగంగానే అత్యవసర సమయాల్లో, పిలుపు అందగానే రయ్యిమని వచ్చి ప్రమాదాల్లో చిక్కుకున్నవారిని సకాలంలో ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలు కాపాడడానికి ఉద్దేశించిన 108 అంబులెన్స్ సర్వీసు, ప్రజల వద్దకే వెళ్లి రోగనిర్ధారణ పరీక్షలు చేసి అవసరమైన మందులు అక్కడికక్కడే ఉచితంగా ఇచ్చే 104 సర్వీసు. వీటిని వైఎస్ చాలా ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తూ వచ్చి ఈ పధకాల ద్వారా ఎలాంటి పరిపూర్ణ ఫలితాలు రాబట్టాలని ఆశించారో ఆ స్వప్నం సాకారం కాకుండానే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసారు. ఆయన కన్నకలను నిజం చేసే మహత్తర అవకాశం, వైఎస్ మరణించిన పదేళ్ల తర్వాత 2019 లో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు జగన్ మోహన రెడ్డికి లభించింది.

ముందు వైఎస్ కన్న కల ఎలాంటిదో చెప్పుకుందాం.

రోడ్లు విశాలంగా ఆధునికంగా తయారవుతున్నప్పుడు వాటిపై ప్రయాణించే వాహనాలు ప్రమాదాలకు గురయ్యే అవకాశాలు కూడా  పెరుగుతాయి. జాతీయ, రాష్ట్ర రహదారులపై ప్రమాదాలకు గురయి కొసప్రాణంతో కొట్టుమిట్టాడుతూ, అమృత ఘడియల్లో (వైద్య పరిభాషలో గోల్డెన్ అవర్స్) అవసరమైన  వైద్యసాయానికి నోచుకోకుండా ఏటా వందల వేల సంఖ్యలో, కలిగినవారు లేనివారు అనే తేడాలేకుండా మృత్యువాత పడుతున్నారు. ఇలాంటి వారికి ప్రాణభిక్ష పెట్టేదే 108 అంబులెన్స్ సర్వీసు. 

ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలకు మూడు మైళ్ళ దూరంలో నివసించే పేదవారికి  కార్పొరేట్ వైద్యం సంగతి సరే, సాధారణ వైద్యం కూడా అందని మావే. షుగర్ బీపీ వంటి రోగాలు వారి శరీరంలో దూరిన సంగతి కూడా వారికి తెలియదు. ఎందుకంటే వారు తమ జీవితంలో ఎన్నడూ ఆరోగ్య పరిక్షలు చేయించుకుని ఎరుగరు. అవి ముదిరి పక్షవాతం, గుండెజబ్బులకు దారితీసినప్పుడు కానీ పరిస్థితి తమ చేయిదాటి పోయిందనే ఎరుక వారికి కలగదు. ఈ నేపధ్యంలో కలిగిన ఆలోచన  104 సర్వీసు.

జబ్బులు, రోగాలు చెప్పిరావు. వచ్చిపడిన తరువాత తల తాకట్టు పెట్టయినా వైద్యం చేయించాల్సిన పరిస్థితి. చాలీచాలని ఆదాయాలతో రోజులు గడిపేవారికి ఆసుపత్రులు, ఖరీదైన  వైద్యం అంటే మాటలు కాదు. అందుకే వైఎస్, ఆరోగ్య శ్రీ అనే పధకానికి రూపకల్పన  చేసి అమల్లో పెట్టారు. గుండె జబ్బుల వంటి పెద్ద జబ్బులకు కూడా ఉచితంగా ఆపరేషన్లు చేయించుకోగలిగే అద్భుత అవకాశం పేదప్రజలకు అందుబాటులోకి తెచ్చారు.

ఇంతటితో సరిపోలేదని వైఎస్ మరిన్ని ఆలోచనలను జత చేస్తూ ఆరోగ్యశ్రీని మరింత  మెరుగుపరచి, విస్తరించాలని తలపోశారు.

104 వాహనం ప్రతినెలా ఒక నిర్దిష్ట దినంనాడు ప్రతిగ్రామానికీ వెళ్లి బాలింతలు, చూలింతలు, వృద్ధులు, బాలబాలికలకు వైద్య పరీక్షలు చేసి తగిన మందులు ఇస్తుంది. వారి ఆరోగ్య రికార్డులను కంప్యూటర్లలో భద్రపరచి, ఇతర ప్రదేశాలకు వెళ్ళినప్పుడు కూడా ఆ రికార్డుల ద్వారా వైద్య సాయం, చికిత్స పొందడానికి వీలైన ఏర్పాట్లు ఈ పధకంలో పొందుపరిచారు.  గర్భిణులకు  క్రమబద్ధంగా పరీక్షలు చేసి, గర్భస్త శిశువు పెరుగుదల గమనించి,  తదనుగుణంగా  వారికి  పోషకాహారం అందించడమే కాకుండా పురుడు వచ్చే రోజును నిర్ధారించి, 108 అంబులెన్స్ కు కబురుచేసి, వారికి సకాలంలో ఆసుపత్రులలో పురుడుపోసుకునే వీలుకల్పించాలని అనుకున్నారు. అలాగే ప్రసవానంతరం ఆ తల్లీ బిడ్డలను క్షేమంగా  ప్రభుత్వ  అంబులెన్స్ లోనే ఇంటికి చేర్చాలనేది కూడా వైఎస్ తలంపు.

వైఎస్ కన్నకలలో పూర్తికాని, అమలుకు నోచుకోని   ఆయన ఆలోచనలకు వైఎస్ జగన్ తన హయాంలో పూర్తి స్వరూపం కల్పించారని ఆరోగ్య శ్రీ గురించి ఆయన ఈరోజు  చేసిన ప్రకటన చెప్పకనే చెబుతోంది. వైఎస్ స్వప్నం నేరవేర్చడానికి ఆయన ప్రస్తుతం లభ్యం అవుతున్న అధునాతన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం హర్షణీయం.

విశాలమైన రహదారులు, రమ్య హర్మ్య భవనాలు అభివృద్ధికి కొలమానాలు కావచ్చు. అయితే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం  కూడా కళ్ళకు కనిపించని పురోగతే.                  

తోక టపా:

సీనియర్ జర్నలిస్ట్ దారా గోపి తన అనుభవం గురించి ఓసారి చెప్పారు. ఆ ముచ్చట ఆయన మాటల్లోనే:       

“రాజశేఖర్ రెడ్డి ముఖ్యంత్రిగా ఉండగా ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టారు.

చాలామంది డబ్బున్నోళ్ళు కూడా ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకుని వైద్యం చేయించుకుంటున్నారు.

అప్పుడు ఓ సారి ఆయన విజయవాడ వచ్చినప్పుడు నేను ఇదే ప్రస్తావన చెప్పా.

ఆయన నాకు రెండు ఉదాహరణలు చెప్పారు.

1. వరద వచ్చినప్పుడు ముందుగా చెత్తా చెదారం వస్తుంది. మంచినీళ్ళు ఆ తర్వాతే వస్తాయి. ఈ స్కీం ఇప్పుడే పెట్టాం కాబట్టి చెత్తా చెదారం ఉంటుంది.

2. నేను పేదలకు అన్నదానం అని ప్రకటించా. ఓ పెద్దాయన ప్లేట్ పట్టుకుని వరసలో నుంచుంటే, ఆ ప్లేట్ లో అన్నం పెట్టకుండా ఎలా ఉంటాను?



(20-12-2023)

 

6 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ఇలా ఎంతమంది ప్రచారం చేసినా, పాపం ముక్కు గారు ముక్క విరిగి తొంగున్నారు.. జగ్గు గారి దోవ కూడా అదే.. కర్మ గురించి ఎవరూ ఆలోచించరు, పండిత పుత్ర పరమ శుంఠ, మీరు ఎడిగింటి సందుల గురించి పెద్దగా ఆలోచించ కుండా ఉండండి.. విధి లిఖితం... పాపం...

Zilebi చెప్పారు...

చైంచిక్ :)

జగనన్నే మన ప్రభువోయ్
ప్రగతిపథమున మనల నడుపగలడతండే
మొగదల ఆరోగ్యశ్రీ
దిగులన్నదె లేదు! మరల దేవర యతడే!


జిలేబి

అజ్ఞాత చెప్పారు...

జై చంద్ర సేన

అజ్ఞాత చెప్పారు...

ఏ పత్రికకు సరిపోయే వ్యాసం వారికి వ్రాసి అందించడం భండారు గారి శైలి.

ఎప్పటి కెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి యన్యుల మనముల్‌
నొప్పింపక, తానొవ్వక, వ్యాసము వ్రాసి ఇచ్చు ధన్యుడు సుమతీ!

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.