8, ఫిబ్రవరి 2019, శుక్రవారం

ఈ దేశం ఏమైపోతోంది? – భండారు శ్రీనివాసరావు


(ఈనాటి 08-02-2019 ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితం)
ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్ళు తలుపులు మూసుకున్నారు.
వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్ కు పలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.
ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత అసలు విషయం చెప్పారు, ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. వాళ్ళ మాటలో ఏమాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించక పోయినా ఏకాంబరం మాత్రం బతుకు జీవుడా అని బయట పడ్డాడు.
అదే రాజకీయ రక్ష రేకు వుంటే... మొత్తం కధే వేరుగా వుండేది.
ఈ దేశంలో చట్టాలు సామాన్యులపట్ల ఒక రకంగా  అసామాన్యుల పట్ల మరోరకంగా అమలవుతాయి.
ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు.  
ఒక కేసు విషయంలో కోల్ కతా పోలీసు కమీషనర్ ను విచారించడానికి సీబీఐ అధికారుల బృందం వెళ్ళింది. స్థానిక పోలీసులు వారిని అడ్డుకున్నారు. బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హుటాహుటిన అక్కడికి వెళ్ళారు. తమ ప్రభుత్వంలో పనిచేసే అధికారులను ప్రధానమంత్రి మోడీ సీబీఐని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని ధర్నాకు దిగారు. దర్యాప్తులో సహకరించేలా ఆ అధికారిని ఆదేశించాలని కోరుతూ సీబీఐ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయుడుతో సహా దేశవ్యాప్తంగా అనేకమంది బీజేపీ వ్యతిరేకులు కోల్ కతా దీదీకి సంఘీభావం తెలిపారు. ఈలోగా అత్యున్నత న్యాయస్థానం కోల్ కతా పోలీసు కమీషనర్ ని విచారించడానికి సీబీఐని అనుమతించింది.
ఇవే పరిస్తితులు సామాన్యులకు ఎదురయితే ఇన్ని వ్యవస్థలు అంత వడిగా స్పందించడం జరిగే విషయమేనా!
ఒక్కసారి ఓ ఎనిమిదేళ్ళు వెనక్కి వెడదాం.
నరేంద్ర మోడీ అప్పుడు గుజరాత్ ముఖ్యమంత్రి. అంతకు ఎనిమిదేళ్ళ క్రితం జరిగిన గుజరాత్ అల్లర్లను పురస్కరించుకుని మోడీని విచారించడానికి సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం ఏర్పాటయిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మోడీని తన ఎదుట హాజరు కావాలని కోరింది. గుజరాత్ రాజధాని గాంధినగర్ లోని సిట్ కార్యాలయానికి వెళ్ళారు. ఆ రోజు సిట్ అధికారులు రెండు తడవలుగా మొత్తం పదిగంటల పాటు విచారించారు.  మధ్యాన్నం పన్నడు గంటలనుంచి సాయంత్రం అయిదు వరకు, మళ్ళీ రాత్రి తొమ్మిది నుంచి అర్ధరాత్రి  ఒంటి గంట దాటేవరకూ సిట్ అధికారులు నరేంద్ర మోడీని ప్రశ్నిస్తూ, సమాధానాలు రాబడుతూ పోయారు.
‘నామీద దుష్ప్రచారం చేస్తూ, నా గురించి అసత్యాలు ప్రచారం చేస్తున్న వాళ్లకు  ఈనాటితో అయినా కళ్ళు తెరిపిళ్ళు పడతాయని నేను ఆశిస్తున్నాను’ అన్నారాయన తనను కలుసుకున్న విలేకరులతో.
‘మిమ్మల్ని ఏమని ప్రశ్నించారు ?’ విలేకరుల ఆరా!
‘ఆ సంగతులు మీతో పంచుకోలేను. ఎందుకంటే సిట్ తన నివేదికను నేరుగా సుప్రీం కోర్టుకు సమర్పిస్తుంది’
ఆ నరేంద్రమోడీ ఇప్పుడు ప్రధాన మంత్రి. సీబీఐ వంటి ప్రముఖ దర్యాప్తు సంస్థలు ఆయన కనుసన్నల్లో పనిచేస్తుంటాయి అని విపక్షాలు ఆరోపిస్తుంటాయి. నిజానికి గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మోడీ మహాశయులకు కూడా సీబీఐ పట్ల అచ్చు అలాంటి అభిప్రాయమే వుండేది.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించి అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వం సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినప్పుడు అహమ్మదాబాదు లో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ మోడీ ఏమన్నారో చూడండి.
‘సీబీఐ అంటే ఏమిటో తెలుసునా ! కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. ఈ సీబీఐ తమ ఢిల్లీ బాసులను మెప్పించడం కోసం మా ప్రభుత్వాన్ని వేధిస్తున్నారు. మా మంత్రులను, అధికారులను టార్గెట్ చేస్తున్నారు. అయితే ఈ అధికారులు ఒక విషయం మరచిపోవద్దు. ఏదో ఒకరోజున మీరు జవాబు చెప్పుకోవాల్సివస్తుంది సుమా!’
మళ్ళీ ఓసారి ఆరేళ్ళు వెనక్కి వెడదాం!
2013. సుప్రీం కోర్టు. కోర్టు హాలు సూదిపడితే వినబడేంత నిశ్శబ్దంగా వుంది.
జస్టిస్ ఆర్. ఎం. లోధా  గొంతు పెంచి తీవ్ర స్వరంతో అన్నారు.
‘సీబీఐ. ప్రభుత్వ పంజరంలోని చిలుక’
కోర్టు హాలులో వున్నవాళ్ళందరూ నివ్వెర పోయారు న్యాయమూర్తి చేసిన ఈ బహిరంగ వ్యాఖ్యతో.
సుప్రీం న్యాయమూర్తి చేసిన ఈ వ్యాఖ్యతో, అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రైవేట్ కంపెనీలకు బొగ్గు కేటాయింపులలో జరిగిన అవకతవకలను కప్పిపుచ్చుకోవడానికి  సీబీఐని ఓ పావులా వాడుకుంటోందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు మంచి  ఊతం చిక్కినట్టయింది. ‘కోల్ గేట్’ కుంభకోణంగా మీడియా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన  సంగతి తెలిసిందే.
రెండేళ్ళ క్రితం సీబీఐ గురించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ఏమన్నారో చూద్దాం.
ఉత్తర ప్రదేశ్ లోని సిధౌలిలో ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, ‘సమాజ్ వాది, బిఎస్ పిలను అదుపు చేయడానికి, తన గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వద్ద ఒక తాళం చెవి వుంది. అదే సీబీఐ’ అని అన్నారు.  
ఓ అయిదేళ్ళు వెనక్కి వెడదాం
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం దేశాన్ని పాలిస్తోంది. రంజిత్ సిన్హా సీబీఐ డైరెక్టర్. ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనను ఇకనామిక్ టైమ్స్ పత్రిక ప్రచురించింది.
ఇష్రత్ జెహాన్   కేసులో అమిత్ షాను ఇరికించడానికి సీబీఐ వద్ద ఎలాంటి సాక్ష్యాధారాలు లేవనీ, అయినా అమిత్ షా పేరు చార్జ్ షీటులో చేరిస్తే యూపీఏ ప్రభుత్వం సంతోషించి ఉండేదనీ సిన్హా ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఆ ప్రకటన ప్రభుత్వాన్ని ఇబ్బందులలోకి నెడుతుందని భావించిన రంజిత్ సిన్హా తాను  అలా చెప్పలేదని అంటూ సమర్ధించుకోలేని విధంగా మరో వివరణ ఇచ్చారు.
జోగీందర్ సింగ్
1996 లో కేవలం పదకొండు మాసాల పాటు సీబీఐ డైరెక్టర్ గా పనిచేశారు.
పదవీ విరమణ అనంతరం ఒక సమావేశంలో మాట్లాడుతూ తన అనుభవాలు తెలియచేశారు.
“సీబీఐ అంటే ప్రతిష్టాత్మక దర్యాప్తు సంస్థ అనే అభిప్రాయం వుంది. కానీ  అది నిజం కాదు. ప్రభుత్వం ఎలా ఆడిస్తే అలా ఆడే కీలుబొమ్మ మాత్రమే’
“ఐకే గుజ్రాల్ ప్రభుత్వం నుంచి అనేక ఒత్తిళ్ళు ఉండేవి. చార్జ్ షీట్ వేయడంలో ఆలస్యం చేయాలనీ, అలాగే కొన్ని కేసుల విషయంలో ఉదారంగా వ్యవహరించాలనీ పైనుంచి ఆదేశాలు వస్తుండేవి. పశువుల దాణా కుంభకోణం కేసులో ఇలాగే ఒత్తిళ్ళు వచ్చాయి. లిఖిత పూర్వకంగా ఆదేశాలు ఇవ్వండని ఖరాఖండీగా చెప్పాను. ఎవరి ఒత్తిడికీ లొంగకుండా  అనుకున్న విధంగానే చార్జ్ షీట్ దాఖలు చేశాను” అని చెప్పారు జోగీందర్.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి  ఆదిత్యనాథ్ యోగి గత ఆదివారం బంగాల్ రాష్ట్రంలో రెండు బహిరంగ సభల్లో ప్రసంగించాల్సి వుంది.  పర్యటనకు కార్యక్రమం సిద్ధం చేసుకున్నారు. ఆయన హెలికాప్టర్ తమ భూభాగంలో దిగడానికి వీల్లేదని దీదీ ఆంక్షలు విధించింది. చేసేదేమీ లేక యూపీ ముఖ్యమంత్రి వాయిస్ మెయిల్ (ఫోన్) ద్వారా తన ప్రసంగపాఠాన్ని సభికులకు చదివి వినిపించారు. యూపీ ముఖ్యమంత్రి ఆదిత్య నాథ్, బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇద్దరూ నివసించేది ఈ పవిత్ర భారత దేశంలోనే. ఇంకా చెప్పాలంటే పైన పేర్కొన్న వింతలూ, విడ్డూరాలు జరిగేది కూడా ఈ భారత దేశంలోనే.
సీబీఐ. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. దేశం మొత్తంలో ప్రముఖ దర్యాప్తు సంస్థ.
పాలక పక్షం చేతిలో కీలుబొమ్మ అని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తుంటాయి. కానీ  ఎక్కడ ఏదైనా సంఘటన జరిగితే,  సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని ముందుగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది కూడా ఆ పార్టీలే. కాకపొతే, కాలక్రమంలో అన్ని వ్యవస్థల మాదిరిగానే  నిప్పు లాంటి ఈ సంస్థకు కూడా ఏనాడో చెదలు పట్టాయి. అయినా ప్రజలకు ఈ వ్యవస్థ పట్ల ఇంకా ఎంతో కొంత గౌరవం, నమ్మకం మిగిలే వున్నాయి. రాజకీయంకోసం ఈ సంస్థను వాడుకుంటున్నారని పాలక పక్షాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి.   అధికారం తమ చేతిలోకి రాగానే తిరిగి అదే పని అవి చేస్తుంటాయి. ప్రతిపక్షంగా మారిన ఒకనాటి పాలక పక్షం నోటి వెంట ఇవే చిలుక పలుకులు మళ్ళీ వినీ వినీ జనాలకు విసుగు పుడుతోంది. కానీ సీబీఐ పట్ల ప్రజలకున్న అమితమైన  విశ్వాసం పూర్తిగా ఆవిరి కాలేదు.
చట్టబద్ధ వ్యవస్థల నడుమ, ప్రజాస్వామికంగా ఎన్నికయిన వివిధ రాజకీయ పార్టీలు ఏర్పాటుచేసే  ప్రభుత్వాల నడుమ ఘర్షణలు సహజం కావచ్చు కానీ అవి యుద్ధాల స్థాయికి పెరగడం వాంఛనీయం కాదు.
మనం నివసిస్తున్న ఈ భూగోళం కంటే అనేక వేల రెట్లు పెద్దవి అయిన వేలాది గ్రహాలు అనంత విశ్వంలో సెకనుకు కొన్ని వేల  మైళ్ళ వేగంతో పరిభ్రమిస్తున్నాయి.  ఈ అనంత విశ్వ  పరిభ్రమణంలో లెక్కకు మిక్కిలిగా వున్నఆ గ్రహాలు, మిల్లిమీటరులో వెయ్యో వంతు తేడా వచ్చినా పరస్పరం డీకొనడం తధ్యం. అయినా కానీ, అనేక వందల వేల సంవత్సరాల నుంచీ ఆ గ్రహరాశులు అన్నీ కూడా  తమ పరిధులు అతిక్రమించకుండా తమ తమ కక్ష్యల్లోనే పరిభ్రమిస్తున్నాయి.
అలాంటిది ఒక్క కేంద్ర ప్రభుత్వం, ఇరవై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధులకు, పరిమితులకు లోబడి రాజ్యాంగబద్ధంగా వ్యవహరించలేని పరిస్తితులు తలెత్తితే ఆ తప్పెవరిది?
ఆ తప్పు ఖచ్చితంగా ప్రజలది మాత్రం కాదు.
ప్రజాస్వామ్యం పేరుతొ, ప్రజల పేరుతొ తమ భవిష్యత్తును పదిలపరచుకోవడానికి అనుక్షణం ఆరాటపడుతున్న రాజకీయ పార్టీలదంటారా! ఏమో కావచ్చు.  

2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

'ఏమో కావచ్చు.' Lol.��. కర్ర విరగదు పాము చావడు. అసలు మీరేమి చెప్పదలచుకున్నారో అసలే తెలియదు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: కావొచ్చు