17, ఫిబ్రవరి 2019, ఆదివారం

సమరము సేయరే బలము సాలిన...... భండారు శ్రీనివాసరావు


(Published in SURYA daily on 17-02-2019, SUNDAY)
ఫిబ్రవరి పద్నాలుగో తేదీ. మధ్యాన్నం మూడు గంటలు దాటింది. ఎర్రటి కాశ్మీర్  కుంకుమ పువ్వును విస్తారంగా పండించే పుల్వామా ప్రాంతం ఉగ్రవాదదాడితో  మరింత ఎర్రబడింది. విధి నిర్వహణ కోసం రోడ్డుమార్గంలో జమ్మునుంచి కాశ్మీర్ తరలివెడుతున్న భారత సైనిక వాహన  శ్రేణిపై  పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషె మహ్మద్  కు చెందిన ఆదిల్ అనే ఉగ్రవాది ఈ ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. శక్తివంతమైన పేలుడు పదార్ధాలు కలిగిన మరో వాహనంలో వాహనశ్రేణి వెంట వేగంగా ప్రయాణిస్తూ, తన కారును  తానే పేల్చేసుకున్నాడు. ఆ పేలుడు తీవ్రతకు పక్కనే ప్రయాణిస్తున్న  మిలిటరీ కాన్వాయ్ లోని  ఒక బస్సు తునాతునకలయింది. ఇనుప ముద్దగా మారింది. ఆ బస్సులో  ప్రయాణిస్తున్న  మొత్తం నలభయ్ మంది   భారత సైనికులు ఈ సంఘటనలో  విగతజీవులయ్యారు. వారి దేహాలు వంద మీటర్ల పరిధిలో చెల్లాచెదురుగా పడ్డాయి. మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు. అనేకమంది క్షతగాత్రులు అయ్యారు. దేశం యావత్తు దిగ్భ్రాంతికి గురయింది.
ఈ దాడికి పూనుకుంది తామే అని మసూద్ ఆజాద్ నాయకత్వంలోని జైషే ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఆత్మాహుతి దాడికి పాల్పడిన ఆదిల్ అహ్మద్ అలియాస్ వకాస్ మాట్లాడిన దృశ్యాలతో కూడిన వీడియోను సంఘటన జరిగిన కొద్ది సేపటిలోనే ఈ సంస్థ విడుదల చేసింది. ‘దీన్ని జమ్మూ కాశ్మీర్ ప్రజలు చూసే సమయానికి తాను  స్వర్గం(దేవుని వద్దకు) చేరుకుంటాన’ని ఆదిల్ ఆ వీడియోలో పేర్కొన్నాడు. తన నమ్మకం పట్ల తనకున్న నమ్మకం అతడ్ని అన్నిరకాల మానవ సంబంధాలనుంచి దూరం చేసిందని ఈ వీడియోని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
‘కత్తి తిప్పేవాడు ఆ కత్తి ఒరలోనే మరణిస్తాడు’ అన్నది బైబిల్ సూక్తి. క్రైస్తవం ఒక్కటే కాదు, ఇస్లాం అయినా ఆ మాటకు వస్తే, ప్రపంచంలోని  ఏ మతమయినా హింసామార్గాన్ని ఎంతమాత్రం అనుమతించదు. ప్రబోధించదు. ఆ వాదాన్ని ఏమాత్రం ఉపేక్షించదు. కానీ, ఈ ప్రపంచంలో జరిగిన అనేక యుద్ధాలు మతం పేరిట మొదలు కావడం ఆ మతాలు చేసుకున్న దౌర్భాగ్యం.

‘మతాన్ని మీరు రక్షిస్తే, ఆ మతం మిమ్మల్ని రక్షిస్తుంది’ అనే ప్రాధమిక సూత్రం ఈ తగవులకు మూలకారణం. మతాన్ని రక్షించడం అంటే పరమతాలనుంచి దాన్ని కాపాడుకోవడం కాదనీ, ఎవరి మతాన్ని వారు గౌరవించుకుంటూ, పర మతాలను సయితం గౌరవించడమనీ మత పెద్దలు ఎంతగా మొత్తుకున్నా మత ఛాందసులు పట్టించుకోవడం లేదు. ఫలితం మతం పేరిట యుద్ధాలు, రక్త తర్పణాలు. ట్యూబ్ నుంచి పేస్ట్ బయటకు తీయగలమే కాని తిరిగి దానిని ట్యూబ్ లో పెట్టడం అసాధ్యం. అలాగే, ఉగ్రవాదం, తీవ్రవాదం ఏ పేరుతొ పిలిచినా దాన్ని పెంచడం సులభం, తుంచడం కష్టం. ఇప్పుడు మానవాళికి కావాల్సింది మానవ  హననం కాదు, కాసింత సహనం.
'సహనావవతు' అనేది వేద కాలం నుంచి వినవస్తున్న హితోక్తి. కానీ దాన్ని బోధించేవారే కానీ పాటించేవారు కరువయ్యారు.         
గురువారం నుంచి  జాతివ్యాప్తంగా  జనులు మాట్లాడుకుంటోంది కాశ్మీర్ లో జరిగిన ఘోరకలి గురించే. జాతీయ టీవీ  ఛానళ్లలో దీనిమీదనే చర్చలు జరుగుతున్నాయి. ఇరవై నాలుగు గంటలూ స్థానిక రాజకీయాలపై వార్తలు, వ్యాఖ్యలు ప్రసారం చేయడానికి అలవాటుపడిన ప్రాంతీయ టీవీలు కూడా కాశ్మీర్ సంఘటనకు ప్రాధాన్యత  ఇస్తూ వుండడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశం.
మోడీ సర్కారు ఈ సంఘటనపై తీవ్రంగా స్పందించింది. వీర సైనికుల త్యాగాలను వృధా కానివ్వం అంటూ ప్రధాని మోడీ  ట్వీట్ చేశారు. ఉగ్రవాదులకు మరచిపోలేని గుణపాఠం నేర్పుతామని కేంద్రమంత్రి జైట్లీ హెచ్చరించారు. మరో కేంద్రమంత్రి, గతంలో ఆర్మీ చీఫ్ గా పనిచేసిన వీకే సింగ్ మరో అడుగు మెందుకు వేసి, మన సైనికుల ప్రతి రక్తపు బొట్టుకు ప్రతీకారం తీర్చుకుంటామని అన్నారు.
కాంగ్రెస్ తో సహా అన్ని ప్రతిపక్షాలు ఉగ్రవాద చర్యను తీవ్రంగా గర్హించాయి. అయితే, సార్వత్రిక ఎన్నికలు మరో మూడు నెలల్లో జరగబోతుండగా, తీవ్రమైన ప్రతీకార చర్యలతో మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందే ప్రయత్నం చేస్తుందనే అనుమానం వాటిని తొలుస్తూ ఉండవచ్చు కూడా. ఎందుకంటే గతంలో ఇటువంటి దృష్టాంతం ఒకటి వుంది.
రెండేళ్ళ క్రితం కాశ్మీర్ లోని బారాముల్ల జిల్లా  ఉరీలోని భారత సైనిక శిబిరంలోకి ఉగ్రవాదులు చొరబడి పద్దెనిమిది మందిని పొట్టనబెట్టుకున్నారు. ఆ ముష్కర చర్యతో దేశం యావత్తు దిగ్భ్రాంతి చెందింది. మనమేమీ చేయలేమా అనే  ప్రశ్న తలెత్తింది. గతంలో కూడా ఆ ఉగ్రవాదులు భారత పార్లమెంటుపై దాడి జరిపారు. ఖచ్చితంగా ఆ చర్య పొరుగు దేశంపై యుద్ధం చేయడానికి సమానమే. పార్లమెంటుపై దాడికి  తెగించినవారిపై తక్షణమే  గట్టి చర్య తీసుకునివుంటే ఇప్పుడీ పరిస్తితి తలెత్తేది కాదు అనే భావన ప్రజల్లో కలిగింది. ఉరీ సంఘటన జరిగినప్పుడు కూడా మన దేశ నాయకులు ‘ఉక్కుపాదంతో ఉగ్రవాదాన్ని అణచివేస్తామనే భారీ  ప్రకటనలు చేసారు. అవి షరా మామూలు ఊకదంపుడు ప్రకటనలనే విమర్శలు వచ్చాయి. భారత ప్రభుత్వం మేకతోలు గాంభీర్యం ప్రదర్శిస్తోందని అన్నవారూ వున్నారు. అలా అన్న పక్షం రోజుల్లోనే భారత సైనికులు మెరుపు దాడి చేసి పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని అయిదు ఉగ్రవాద స్థావరాలపై దెబ్బతీసి తమ ఆధిక్యతను అద్భుతంగా ప్రదర్శించారు. దేశ గౌరవాన్నిఅంతర్జాతీయ స్థాయిలో  నిలబెట్టారు. ఉరీ సంఘటనకు ప్రతీకారం తీర్చుకున్నారు. సర్జికల్ స్ట్రయిక్స్ అనే పద ప్రయోగం కూడా అప్పుడే ప్రాచుర్యంలోకి వచ్చింది.
అయితే, ఉరీ ఘటనకు, భారత్ కమాండోల చర్యకూ ఒక స్థూలమైన బేధం వుంది. ఉరీ సంఘటనకు బాధ్యులైన వాళ్ళు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు. వాళ్ళు దొంగచాటుగా మన దేశంలోకి చొరబడి మన సైనికులను బలితీసుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం ఉగ్రవాదుల స్థావరాలను దెబ్బతీయడానికే వ్యూహ రచన చేసింది. మూలంపై దెబ్బ కొట్టడం ద్వారా ఉగ్రవాదులకు ముకుతాడు వేసే ప్రయత్నం చేసింది. వారికి మద్దతు ఇస్తున్న పాకీస్తాన్ కు కూడా ఈ విధంగా గట్టి హెచ్చరికతో కూడిన సంకేతం ఇచ్చింది.
పాక్ ఆక్రమిత  కాశ్మీర్  భూభాగంలోకి భారత సైనికులు చొరబడి అక్కడి ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) జరిపి తమకు అప్పగించిన పనిని విజయవంతంగా పూర్తి  చేయడం ఆ రోజుల్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కార్గిల్ యుద్ధంలో భారత్ సాధించిన విజయం ఆనాటి ప్రధాని వాజ్ పాయ్  ప్రతిష్టను ఇనుమడింపచేసిన చందంగానే, సర్జికల్ స్ట్రయిక్స్ మోడీ పలుకుబడిని దేశ ప్రజల్లో అమాంతం పెంచింది. కుల,మత, ప్రాంత, రాజకీయ విబేధాలు పక్కనబెట్టి ప్రజానీకం యావత్తూ  భారత సైనికులపై  ప్రశంసలు కురిపించింది. మోడీని ప్రజల దృష్టిలో మొనగాడిని చేసింది.
సర్జికల్ స్ట్రయిక్స్ లో ఓ ప్రత్యేకత వుంది.
ఈ మెరుపుదాడుల వల్ల అక్కడి సాధారణ పౌరులకు హాని జరగకూడదు. కేవలం లక్ష్యబేధనే గురిగా ఎంచుకోవాలి. ఇలా చేయడానికి ఎన్నో ముందస్తు చర్యలు పకడ్బందీగా తీసుకోవాలి. మెరుపు దాడులు చేయడానికి  తగిన  శిక్షణ పొందిన, అనుభవం కలిగిన  కమాండోలను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. కటిక చీకట్లో కూడా చూడగలిగిన కంటి పరికరాలను, గురి చూసి కొట్టగలిగిన ఆధునిక ఆయుధాలను వారికి సమకూర్చాలి. అన్నింటికంటే ప్రధానం లక్ష్య నిర్దేశం. శత్రువు స్థావరాన్ని ఎలాటి పొరబాటుకు అవకాశం లేకుండా ఖచ్చితంగా నిర్ధారణ చేసుకోవడం, అలాగే ఎలాంటి అనుమానాలకు తావివ్వకుండా లక్ష్యాన్ని చేరుకోవడం. ఈ విషయంలో  భారత సైన్యం ఎంతో కసరత్తు చేసింది. భారత ఉపగ్రహాల సాయం తీసుకుని ఉగ్రవాద స్థావరాల ప్రాంతాన్ని ముందుగానే గుర్తించింది. అంచేతే,  అర్ధరాత్రి తమ కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా వెళ్లి, ఒప్పగించిన బాధ్యతను నూటికి నూరు పాళ్ళు పూర్తి చేయగలిగింది.               
నిజానికి సర్జికల్ అనే పదం వైద్య శాస్త్రానికి సంబంధించినది. దేహంలో  ప్రాణాంతక వ్యాధికి  కారణమైన ‘కణం’ ఎక్కడ వున్నా, మిగిలిన శరీర  భాగాలకు ఇసుమంత  హాని కూడా  కలగకుండా, శస్త్రచికిత్స ద్వారా  ఆ కణాన్ని మాత్రమే తొలగించే లాప్రోస్కోపిక్ ప్రక్రియలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. ఈ సర్జికల్ స్ట్రయిక్స్ లక్ష్యం కూడా  అలాంటిదే.
మహాభారతం పౌస్తిక పర్వంలో కూడా ఇటువంటి అస్త్ర శస్త్రాల ప్రసక్తి కానవస్తుంది. భారత యుద్ధం ముగిసిన తరువాత, తన ప్రభువైన సుయోధనుడి పరాజయాన్ని,  పాండవుల చేతిలో తన తండ్రి ద్రోణుడి మరణాన్ని జీర్ణించుకోలేని అశ్వద్ధామ, పాండవ వంశనాశనానికి శపధం చేస్తాడు. పాండవులు లేని సమయంలో వారి శిబిరంలో ప్రవేశించి ద్రుష్టద్యుమ్నుడితో సహా ఉపపాండవులను ఊచకోత కోస్తాడు. తదనంతరం అర్జునుడు, అశ్వద్ధామ పరస్పరం తలపడతారు. ద్రోణనందనుడు ఒక గడ్డి పరకను చేతిలోకి తీసుకుని బ్రహ్మశిరోనామకాస్త్రాన్ని ఆవాహన చేసి ‘అపాండవం భవతు’ అంటూ దానికి లక్ష్య నిర్దేశనం చేసి ప్రయోగిస్తాడు. అందుకు ప్రతిగా అప్పుడు అర్జునుడు కూడా, కృష్ణుడి ప్రేరణపై అదే అస్త్రాన్ని స్మరించి, ‘గురుపుత్రుడైన  ఆశ్వద్దామకు హానిచేయకుండా, ప్రత్యర్ధి అస్త్రానికి లక్ష్యమైన మా సోదరులను రక్షించాలని తన అస్త్రాన్ని ప్రయోగిస్తాడు. ఆ మహాస్త్ర శస్త్రాల ధాటికి ముల్లోకాలు తల్లడిల్లడంతో వ్యాస, నారద మహర్షులు జోక్యం చేసుకుని అస్త్ర ఉప సంహారానికి విజ్ఞప్తులు చేస్తారు. అర్జునుడు అంగీకరించినా,  బ్రహ్మ శిరోనామకాస్త్రం ఉపసంహార ప్రక్రియ ఆశ్వద్దామకు తెలియక పోవడం వల్ల, ఆ అస్త్రలక్ష్యాన్ని పాండవ వంశీయుల గర్భ విచ్చిత్తికి మళ్ళించి లోకనాశనాన్ని తప్పించారని బొమ్మకంటి వెంకట సుబ్రమణ్య శాస్త్రి గారు తాము రచించిన శ్రీ మదాంధ్ర సంపూర్ణ మహా భారతంలో పేర్కొన్నారు. 
పొతే, భారత పాకీస్తాన్ సరిహద్దుల్లో కమ్ముకుంటున్న యుద్ధ మేఘాలు ప్రస్తుతానికి మెరుస్తున్నాయి. అవి కురుస్తాయా లేదా అనేది కాలమే చెప్పాలి.
సమరము సేయరే బలము సాలిన......అనే పద్యం తెలుగునాట చాలా ప్రాచుర్యం పొందింది. శక్తి వుంటే సంగరానికి దిగి అమీతుమీ తేల్చుకోవాలి. దొంగ దెబ్బలు తీయడం వీరుల లక్షణం కాదు.
యుద్ధం అనేది దేశరక్షణ కోసం తలపెట్టేది అయితే ఎవరికీ అభ్యంతరం ఉండరాదు. కానీ తాత్కాలిక రాజకీయ ప్రయోజనాల సాధన కోసం అయితే మాత్రం మన వీరుల త్యాగం, ఆ రక్తతర్పణం వృధా అవుతుంది.

కామెంట్‌లు లేవు: