16, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రోతలు కోరిన పాటలు


పూర్వం రేడియో సిలోన్ లో మీనాక్షి పొన్నుదొరై ఘంటసాల వోం, సుశీలా వోం అని తెలుగులో ముద్దుముద్దుగా మాట్లాడుతుంటుంటే  మా బామ్మగారు ఆమె తెలుగును  ఆటపట్టించేది. కానీ ఆమె వేసే తెలుగు పాటల్ని కోరుతూ వందల సంఖ్యలో శ్రోతలు ఉత్తరాలు రాసేవాళ్ళు.
ఆ తరువాత చాలా ఏళ్ళకు నేను హైదరాబాదు రేడియోలో చేరిన తరువాత శ్రోతలు రాసే కార్డుల్ని బట్వాడా చేయడానికి తపాలా బంట్రోతులు (అనవచ్చా) కిందామీదా పడడం కళ్ళారా చూసాను.
“అమలాపురం నుంచి అరుంధతి ఆమె కుటుంబసభ్యులు, ఆదిలాబాదు నుంచి యాదగిరి ఆయన కుటుంబ సభ్యులు, అనంతపురం నుంచి వీరారెడ్డి, రంగారెడ్డి, వెంకటరెడ్డి వారి కుటుంబ సభ్యులు, శ్రీకాకుళం నుంచి అప్పల నాయుడు ఘంటసాల సుశీల పాడిన యుగళగీతం ప్రసారం చేయమని కోరుతున్నారు.”
ఇలా వచ్చిపడ్డ  వందలాది ఉత్తరాల గుట్టలోనుంచి శ్రోతలు కోరిన పాటల్ని ఎంపిక చేసుకోవడానికి అనౌన్సర్లు చాలా ప్రయాస పడేవాళ్ళు.  
అలాగే, స్కూలు అడ్మిషన్ సీజను వచ్చింది అంటే తెలిసిన వాళ్ళు తమ పిల్లలకోసం విలేకరుల వెంట పడడం ఒక విలేకరిగా నాకు తెలుసు. రిటైర్ అయి పుష్కర కాలం దాటిన తరువాత కూడా వస్తున్న ఎస్సెమ్మెస్ అభ్యర్ధనలు చూస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు.
అలాంటిది, తలచుకుంటే ఏదైనా చేయగలిగిన అధికారాలు కలిగిన ముఖ్యమంత్రికి రోజూ ఎన్ని విజ్ఞప్తులు వస్తుంటాయో అర్ధం చేసుకోవడానికి కష్టపడనక్కర లేదు.
మరి ఏపీ సీఎమ్ కనెక్ట్ యాప్ అంటున్నారు.
ఆయన్ని ఉడ్డుకుడుచుకోనిస్తారా! అనుమానమే!
ఉపశృతి: లోగడ ఆంధ్రప్రదేశ్ అనే ఉమ్మడి రాష్ట్రం వున్న కాలంలో ఒక ముఖ్యమంత్రి ప్రజారంజక పాలన అందివ్వడానికి అహరహం శ్రమించేవారు. ఒక కార్డు ముక్క తనకు రాస్తే చాలు సమస్యలను చిటికెలో పరిష్కరిస్తానని ఓ ప్రకటన చేసారు. అంతే! పోస్టాఫీసుల్లో కార్డులు దొరకని పరిస్తితి ఏర్పడింది. ప్రజల సమస్యలు కనిపించకుండా పోయాయి, కొత్త సమస్యల మరుగున పడి.   

కామెంట్‌లు లేవు: