7, జనవరి 2013, సోమవారం

ఎవరి గోల వారిదే అను ముఖ్యమంత్రి చిట్కా




ఎవరి గోల వారిదే అను ముఖ్యమంత్రి చిట్కా


గతంలో అంటే దాదాపు నలభై ఏళ్ళక్రితం అనుకుంటాను ముళ్లపూడి వెంకరమణ గారు సంభాషణలు గురించి చక్కని హాస్య గుళిక రాశారు. కొన్ని ఏకపక్షంగా అంటే ఎదుటివాడు చెప్పేది పట్టించుకోకుండా మాట్లాడుకుంటూ పోవడం అయితే మరికొన్ని రైలు పట్టాల మాదిరిగా ఎక్కడా కలవకుండా ఎవరి గోల  వారిదే అన్నట్టు సాగుతుతుంటాయని కడుపుబ్బ  నవ్వించే కొన్ని ఉదాహరణలు పేర్కొన్నారు.
ఈ రోజు (07-01-2013) ఆంధ్ర జ్యోతి మొదటి పుటలో ప్రచురించిన ఒక వార్త అలనాటి ముళ్లపూడి వారి రచనను గుర్తుకు తెచ్చింది. చిత్తగించండి.
తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలు లో జరిగిన ‘నగదు బదిలీ పధకం’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, సభకు హాజరయిన కొందరు మహిళలకు నడుమ సాగిన రైలుపట్టాల సంభాషణను ఆ పత్రిక ఇలా ప్రచురించింది.
“నగదు బదిలీ చేస్తున్నాం. ఇకపై బ్యాంకులే మీ ఇంటికి వస్తాయి”
“ఆరు సిలిండర్లతో పొయ్యిలో పిల్లి లేవడం లేదు. విద్యుత్ చార్జీలు భరించలేకపోతున్నాం”
“నిత్యావసర సరుకులు ఒకే ప్యాకెట్ గా అందజేస్తాం. బియ్యం, పసుపు, కారం, కందిపప్పు, చింతపండు, ఉప్పు, పంచదార  అందులో వుంటాయి. “
“నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఏదో కొద్దిగా బియ్యం, కిలో చొప్పున సరుకులు ఇస్తే సరిపోతుందా? విద్యుత్ చార్జీలతో పాటు సర్ చార్జీలు విధించడంతో ఇబ్బందులు పడుతున్నాం.”
“మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టండి”
యెంత బాగుందో కదా ఈ టెక్నిక్.
ఇక నుంచి బహిరంగ సభల్లో నాయకులను నిలదీసే జనాలను చెదరగొట్టడానికి పోలీసుల లాఠీలు అక్కరలేదు, భాష్పవాయు తూటాలు ప్రయోగించనక్కరలేదు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కనిపెట్టిన ఈ చిట్కా చాలు.
(07-01-2013)  

కామెంట్‌లు లేవు: