28, డిసెంబర్ 2012, శుక్రవారం

వచ్చిండన్నా, వచ్చాడన్నా


వచ్చిండన్నా, వచ్చాడన్నా- వరాల తెలుగు ఒకటేనన్నా భండారు శ్రీనివాసరావు
(తిరుపతి తెలుగు సభలను పురస్కరించుకుని మరోమారు పునశ్చరణ)
ఈ మధ్య కాలంలో కొన్ని కొత్తరకమయిన ఉద్యమాలు, ఆందోళనలు రూపం దిద్దుకుంటున్నాయి. కొన్ని కులాలు, వర్గాలకు చెందిన వారి ఆచారవ్యవహారాలు, కట్టూబొట్టూ, మాటా యాసా ఇవన్నీకొన్ని సినిమాల్లో  వివాదాస్పదమవుతున్నాయి. సినిమాను సినిమాగా చూడాలని కొందరు అంటుంటే, శ్రుతిమించినప్పుడే సమస్యగా మారుతోందని ఇంకొందరు వాదిస్తున్నారు.
ఇందులో తప్పొప్పులను నిర్ధారించడానికి ఆయా వ్యవస్థలు వున్నాయి కాబట్టి  వివరాల్లోకి పోవడం లేదు.
ఈ నేపధ్యంలో భాషకు, యాసకు సంబంధించిన వివాదాలు చిక్కుముడులుగా మారకుండా చూడాల్సిన అవసరం వుంది.
ఒక ప్రాంతం వారి భాషను, యాసను మరో ప్రాంతం వారు అణగదొక్కుతూ,  తమ ప్రాబల్యాన్ని భాషపై కూడా విస్తరిస్తూ పోతున్నారన్న ఆవేదనను కొందరు వ్యక్తం చేస్తున్నారు. బిడ్డ పోయి అమ్మాయి, కొడుకు పోయి అబ్బాయి, కక్కయ్య పోయి బాబాయి, చిన్నమ్మ పోయి పిన్నమ్మ - ఇలా ఒక ప్రాంతానికి చెందిన పదాలు క్రమక్రమంగా కనుమరుగయి పోతున్నాయని   సింగిడి తెలంగాణా రచయితల సంఘం కన్వీనర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి వెల్లడించిన   అభిప్రాయంతో కొంతవరకు ఏకీభవించక తప్పదు. ప్రాంతీయపరమయిన ఉద్యమం నడుస్తున్న నేపధ్యంలో ఇలాటి అభిప్రాయాలు మరింత బలంగా వేళ్ళూనుకోవడం సహజమే. ఇందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. అయితే, పరిణామక్రమాన్ని కూడా కొంత పరిశీలించుకోవాల్సిన అవసరం వుంది.

నలభయ్ యాభయ్ ఏళ్ళక్రితం హైదరాబాదులో దుకాణాల పేర్లు, వీధుల పేర్లు తెలుగులో ఎలారాసేవారో చాలామందికి గుర్తుండేవుంటుంది. అప్పట్లో కూడా అనేకమంది తెలుగు భాషకు పట్టిన దుర్గతిని చూసి ఇలాగే మధనపడేవారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల పేరుతొ దేశంలో తొట్ట తొలిసారి ఏర్పడ్డ తెలుగు రాష్ట్రంలో తెలుగుకు ఈ దుస్తితి  ఏమిటని బాధపడేవారు. సబ్బులు, తలనొప్పి గోళీల గురించి సినిమా హాళ్ళలో వేసే స్లయిడ్లలో, పత్రికల్లో వచ్చే వాణిజ్య ప్రకటనల్లో  కూడా తెలుగు పరిస్తితి అదే విధంగా వుండేది. ఎందుకంటె ఆరోజుల్లో ఇలాటి ప్రకటనలన్నీ బొంబాయిలో తయారయ్యేవి. హిందీ లిపిలో తెలుగు రాయించి, తెలుగు కొద్దిగా తెలిసివాళ్ళచేత రాయించడం వల్ల,చదివించడంవల్ల వచ్చిన అపభ్రంశపు తెలుగునే తెలుగువారిపై రుద్దేవారు. ఈనాడు అరవై ఏళ్ళు దాటిన ప్రతిఒక్కరికీ ఇది  తెలిసిన విషయమే.

వెనుకటి రోజుల్లో, నిజాం పాలిత ప్రాంతాలలో  చాలామంది తెలుగు మాతృభాషగా  వున్న కుటుంబాలనుంచి వచ్చినవాళ్లు సైతం ఉర్దూ మీడియంలో చదువుకున్నవాళ్ళే వుండేవారు. చాలా   గ్రామాల్లో రాతకోతలన్నీ ఆ భాషలోనే జరగడంవల్ల ఉర్దూ మాట్లాడగలిగినవారికి అయాచిత గౌరవం లభించేదని  కూడా చెప్పుకునేవారు.

ఆ రోజుల్లో బెజవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలంటే ఒకేఒక్క రైలు నైజాం పాసింజర్. కుంటుకుంటూ నడిచే ఆ రైలు బొగ్గుకోసం, నీళ్ళ కోసం మధ్య మధ్యలో ఆగుతూ, పడుతూ లేస్తూ ఎప్పటికో హైదరాబాద్ చేరేది. ప్రయాణ సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఇతర ప్రాంతాల నుంచి హైదరాబాద్ కు రాకపోకలు తక్కువ. పైగా భాష తెలియకపోవడం మరో ఇబ్బంది. అయినా, పై చదువులకోసం హైదరాబాద్ తప్పనిసరిగా రావాల్సిన పరిస్తితి. మరోవైపు, రాష్ట్ర రాజధాని కావడం వల్ల ఏదో ఒక పనిపై రాకుండా వుండలేని స్తితి. ఈ క్రమంలో అన్ని ప్రాంతాలనుంచి  హైదరాబాదుకు రాకపోకలు పెరిగాయి. ఉద్యోగాలకోసం, ఉపాధుల కోసం వలసలు పెరిగాయి. వ్యాపార అవకాశాలు వెతుక్కుంటూ వచ్చే వారి సంఖ్యా పెరిగింది.

ఫలితంగా గత యాభయ్ ఏళ్లలో పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రవాణా సౌకర్యాలు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. రోజుకొక పాసింజర్ బస్సు స్తానంలో గంటగంటకూ నడిచే ఎక్స్ ప్రెస్ బస్సులు వచ్చాయి. నలుమూలలనుంచి హైదరాబాదుకు రైళ్ల సౌకర్యం ఏర్పడింది. రాష్ట్ర రాజధానికి ఉపాధి నిమిత్తం వివిధ ప్రాంతాలనుంచి లక్షలాదిమంది జనం హైదరాబాదుకు వచ్చి స్తిరనివాసాలు ఏర్పరచుకోవడం మొదలయింది. ఆ రోజుల్లో ఆయా ప్రాంతాలలో  అతితక్కువగా వున్న అక్షరాస్యత శాతాన్ని  బట్టి చూస్తె బయట నుంచి వచ్చే ఇలాటివారి సంఖ్య గణనీయంగా వుండడం ఆశర్యకరమేమీ కాదు.
వలసలు వచ్చిన వాళ్ళు  సాధారణంగా   వారితో పాటే తమ సంస్కృతిని, ఆచారవ్యవహారాలను, భాషలో తమదయిన నుడికారాలను వెంటబెట్టుకువస్తారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతోంది ఇదే. ఉదరపోషణార్ధం ఇతరదేశాలకు ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తెలుగువాళ్ళు చేస్తున్నదీ ఇదే. ఇదంతా సహజ సిద్దంగా జరిగేదే కానీ ఒక దాడి ప్రకారం, ఒక పధకం ప్రకారం జరుగుతోందని అనుకోవడం అంత సబబు కాదు. వ్యాపార, వాణిజ్య ప్రయోజనాలకోసం వచ్చేవారు, స్తానికులకు చేసే అన్యాయాలతో ముడిపెట్టి, ఈ అంశాన్ని చూడడం కూడా సరికాదనిపిస్తుంది. పట్టణీకరణ (అర్బనైజేషన్) వల్ల వచ్చిపడే అనర్థాలలో ఇదొకటి కాబట్టి సర్దుకుపోవాలని చెప్పడం కాదు కానీ, ఈవిధమయిన పరిణామాలు అనివార్యం అన్న వాస్తవాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో వారి వారి భాషలు, యాసలు పదిలంగా వుండడాన్నిబట్టి చూస్తె, వలసలు ఎక్కువగా వుండే పట్టణ ప్రాంతాలలోనే ఈ రకమయిన మార్పులు చోటు చేసుకుంటున్నాయని కూడా అనుకోవాలి.

భాష పట్ల మమకారం లేని వాడు వుండదు. అది కన్న తల్లితో సమానం. పరాయి భాషల వాళ్ళు మన భాషలో తడిపొడిగా యేవో రెండుముక్కలు మాట్లాడితే మురిసి ముక్కచెక్కలయ్యేది అందుకే.

మాండలికాలు ఎన్ని వున్నా తల్లి వేరు ఒక్కటే. భాషకు యాస ప్రాణం. పలికే తీరులోనే వుంటుంది మాధుర్యమంతా.  హిందీ, ఉర్దూ తెలియని ప్రాంతాల్లో కూడా ఆ భాషల చలన  చిత్రాలను ప్రజలు ఆదరించడం తెలిసిందే.  ఎవరయినా ఉర్దూ భాషలో  మాట్లాడుతుంటేనో, ముషాయిరాలు వినిపిస్తుంటేనో  ఆ భాషలోని మాధుర్యానికి అది ఏమాత్రం తెలియని వాళ్లు కూడా తలలూపుతూ ఇంకా వినాలని ఉత్సాహం చూపడం కద్దు. అదీ భాషలోని సౌందర్యం. అదీ భాషలోని గొప్పదనం.

మన రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అనేక తెలుగు మాండలికాలు వున్నాయి. ఒక్కొక్కదానిదీ ఒక్కొక్క తరహా. దేనికదే గొప్ప. కొన్ని పదాలు అర్ధం కాకపోయినా చెవికి ఇంపుగా వుంటాయి. ప్రతి భాషలో వుండే ఈ యాసలు ఒకదానికొకటి పోటీ కాదు. ఒకదానికొకటి ప్రత్యామ్నాయమూ కాదు. కాకపోతే భాషను సుసంపన్నం చేయడంలో వీటి పాత్ర అమోఘం.

భాషలో తమవిఅనుకున్న పదాలు తమవి కాకుండా పోవడమే కాకుండా మాయమయిపోతూవుండడం పట్ల ఎవరయినా బాధపడితే వారి ఆవేదన అర్ధం చేసుకోతగ్గది.

ఐతే, భాషాభిమానులు  బాధ పడాల్సిన అంశాలు మరికొన్ని  వున్నాయి. నాన్నను ఒరేఅనడం అమ్మను ఒసేఅనడం వంటి వికృత ప్రయోగాలు తెలుగునాట, ముఖ్యంగా తెలుగు సినిమాలలో నానాటికీ ముదిరిపోతున్నాయి. తెలుగు భాషకు, సంస్కృతికి చీడపురుగుల్లా మారుతున్న ఈ ధోరణులకు  అడ్డుకట్ట వేయాల్సిన అవసరం వుంది.

ఎన్ని కొమ్మలు వేసినా తల్లి వేరు ఒక్కటే. కలివిడిగా తల్లిని ప్రేమించడానికి ఏమయినా ఇబ్బందులు వుంటే విడివిడిగా తల్లిని ఆరాధించడమే బిడ్డలు చేయాల్సిన పని. 

8 కామెంట్‌లు:

Jai Gottimukkala చెప్పారు...

రాష్ట్రానికి భాషకు ముడి పెట్టడం మూర్ఖత్వం. ఈ రాష్ట్రంలో (లేదా ఏ రాష్ట్రమయినా సరే) అన్ని భాషలు మాట్లాడే వారు ఉండొచ్చు. అలాగే తెలుగు వారు (లేదా ఇతర భాషలు మాట్లాడే వారు) దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడయినా ఉండొచ్చు.

బొంబాయిలో ఉండే వాళ్ళందరూ మరాఠీలోనే మాట్లాడాలని లేదా హైదరాబాదులో ఉండే వాళ్ళందరూ తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలనే ఫాసిస్టు ధోరణలు దేశానికి ప్రమాదకరం. ఒక రాష్ట్రానికి రాజధాని అయినంత మాత్రాన ఆ రాష్ట్ర అధికార భాషను నగరానిపై రుద్దే ప్రయత్నం బెడిసి కొట్టక మానదు.

నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడి భాషను, యాసను, సంస్కృతిని గౌరవిస్తాను అనే ఆలోచన ఉన్నవారికి అన్ని ఊళ్లు ఒక్కటే. ఇది నా రాష్ట్రం కాబట్టి, ఇక్కడ ఉండే ప్రతి ఒక్కడూ నా భాష, యాస, సంస్కృతినే నెత్తి కెత్తుకొవాలని విర్రవీగే అహంకారులు ఎక్కడా నెగ్గలెరు.

PS1: రాష్ట్రంలో తెలుగు ఒక్కటే అధికార భాష కాదు. ఉరుదూకు హైదరాబాదుతో సహా అనేక జిల్లాలలో అధికార భాష హోదా ఉంది.

PS2: అధికార భాష "జాతీయ భాష" లేదా "రాష్ట్ర భాష" కాదు. ఈ పదాలకు భారత సంవిధానంలో చోటు లేదు. అధికార భాష అనేది కేవలం ప్రభుత్వానికి, పాలనా విషయాలకు సంబందించిన అంశం మాత్రమె.

PS3: బంజారా, గోండీ, ఎరుకల, కోయ తదితర భాషలకు అధికార హోదా ఇవ్వడం అటుంచి వాటిని క్రూరంగా కాలరాసే ప్రయత్నం అనాదిగా వస్తున్నదే. చివరికి కోయల తిరుగుబాటును కూడా వారికి కాకుండా చేసే ప్రయత్నంలో "తెలుగు వీర లేవరా" అంటూ గొంతెత్తారు మన తెలుగు దురభిమానులు.

అజ్ఞాత చెప్పారు...

చాలా బాగా చెప్పారు. యాసలు ఎన్నైనా భాష ఒకటే. ఏ రాష్ట్ర రాజధాని అయినా ఆ రాష్ట్రభాష, సంస్కృతులు ప్రతిబింబాలి. 'వొఇచ్చు, ఒత్తాచులే' కాదు 'అదే, అంతే' అన్నా అర్థంజేసుకునేలా వుండాలి.
హైదరాబాద్‌లో అంతా చైనీసో, మరే పింజారీ భాషనో తప్ప తెలుగు కనీసం అర్థంకాని జనాలు వుంటే ఎంతో వింతగా విపరీతంగా వుంటుంది. మీరన్నట్టు హైదరాబాద్ ఈ మధ్య కాలంలో భాషా పరంగా బాగా అభివృద్ధి జరిగింది, అని నా చిన్నతనం అనుభవాలవల్ల తెలుస్తోంది. ఇంకా జరగాల్సి ఎంతో వుంది. ఏం ఫికర్ చేయకున్రి, 'కలిసుందాంరా' అనే గట్టి సందేశం ద్వారా ఇంకా, ఇంకా అభివృద్ధి చేస్తాం అని ఆశాభావంతో మనవి చేసుకుంటున్నాను.
సింగిడి రోదనలు వుండేవే, ఊక్కసారైనా చిరునవ్వుకు నోచుకోని కొన్ని బ్రతుకులు అంతే వాళ్ళెపుడైనా ఆనదంగా తవికలు రాస్తే ఆశ్చర్యపోయే భాగ్యం కోసం ఎదురు చూసే వాళ్ళు ఎందరో.
వుర్దూ ఎంతో అందమైన భాష అంటూ వుర్దూ తెలిసిన వాళ్ళు వాహ్ వాహ్ కాని నాకైతే అంత ప్రత్యేకమైంగా అనిపించదు. అర్బిక్, పర్షియన్ భాషా పంచకల్యాణిలకు పుట్టిన 'కంచెరగాడిద' అని ఓ ఉర్దూ మిత్రుడు తాదాత్మంగా అనేవాడు, వొత్తాచంటూ వంతపాడేవాడిని, 'వహ్వా వహ్వా' అని అప్పుడప్పుడు అనార్కలి సినిమాలో SVR లాగా అనేవాడిని :P

Snkr

అజ్ఞాత చెప్పారు...

కోస్తా ప్రాంతపు మాటలు కూడా తెలంగాణ పదాల ఆధిపత్యానికి లోనవుతున్నాయి. అలానే యాస కూడా. ఒకప్పుడు కుళాయి కట్టెయ్యి అనే వాళ్ళు ఇప్పుడు టాప్ "బంద్" చెయ్యి అంటున్నారు.
ఒకప్పుడు శాంతి అనే వారు. ఇప్పుడు బడి పిల్లలు "షాంతి" అంటున్నారు.

Jai Gottimukkala చెప్పారు...

పింజారీ భాష మాట్లాడే ఊరికి మీరు రావడం ఎందుకు? మీ పుణ్యభూమి లోనే "ఉండొచ్చు" కదా?

మా ఊరికొచ్చి మా సంస్కృతిని ఎగతాళి చేయమని మిమ్మల్ని బొట్టు పెట్టి పిలిచినమా థాకరే గారూ?

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అజ్ఞాత చెప్పారు...

" ఏల సలిలంబు పారు?
గాడ్పేల విసరు?
ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? "

" కదలిరాద తనే వసంతం
తన దరికి రాని మృగాలకోసం " గట్లన్న మాట. అర్థం చేసుకోరూ... ;)

అజ్ఞాత చెప్పారు...

Hindi basha lo Ankara mandalikamulu vunnadi. I they pramanika basha antoo. Voka Rupam vadukaloki vachindi, Telugu kuda anthe

Sesha Thalpa Sai చెప్పారు...

Visthrutha prantham lo prachuryamlo vunna basha pramanikatwam santharinchukuntundi. Kalanugunamga padala vadukaloki Maruthu vuntundi