18, డిసెంబర్ 2023, సోమవారం

రిటైర్ అయిన జర్నలిస్టులు ఏం చేయాలి? – భండారు శ్రీనివాసరావు

 


తమ అనుభవాలను డాక్యుమెంట్ చేయాలి

ఇది నా ఒక్కడి అభిప్రాయమే కాదు, ఈరోజు (15-12-2023) ఒక మంచి సందర్భంలో కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ  కొందరు సీనియర్ జర్నలిస్ట్లులు  వెలిబుచ్చిన  అంతరంగ ఆవిష్కరణ కూడా.

వారందరికీ ఈ అవకాశం కల్పించింది, సీనియర్ పాత్రికేయులు, బహు గ్రంధకర్త అయిన శ్రీ గోవిందరాజు చక్రధర్. సందర్భం ఆయన రాసి, కూర్చి ప్రచురించిన ఐదు పదుల అక్షర యాత్ర అనే స్వీయ చిత్రావలోకనం. పదహారు పేజీల ఈ చిరుపొత్తంలో నిజానికి అక్షరాలు తక్కువ చక్కటి ఛాయా చిత్రాలు ఎక్కువ. అయిదు దశాబ్దాల పాత్రికేయ జీవన గమనాన్ని స్పర్శిస్తూ వెలువరించిన పుస్తకం ఇది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇటీవల స్వీకరించిన జీవన సాఫల్య పురస్కారాన్ని అందుకున్న తర్వాత తనలో పొటమరించిన ఆలోచనకు  చక్రధర్ గారు ఈవిధమైన రూపం కల్పించారు. ఆయన్ని తెలియనివారు, తెలుసుకోవాలని అనుకునేవారు ఈ పుస్తకాన్ని ఒకసారి తిరగేస్తే చాలు, నిమిషంలో ఆయన ఏమిటన్నది చదువరికి అర్ధం అవుతుంది. అందుకే ఈ ప్రయోగం అనేది చక్రధర్ ఆలోచన.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వజాతీయ మీడియా సలహాదారు శ్రీ దేవులపల్లి చేతుల మీదుగా ఈ కార్యక్రమం  జరిగింది. పాత్రికేయ ప్రముఖులు శ్రీయుతులు ఆర్వీ రామారావు, మందలపర్తి కిషోర్, వల్లీశ్వర్, తాడి ప్రకాష్, బుద్ధవరపు రామకృష్ణ,  శంకరనారాయణ, ఎమెస్కో సంపాదకులు శ్రీ చంద్రశేఖర రెడ్డి, శ్రీ ఆకెళ్ళ రాఘవేంద్ర, వయోధిక పాత్రికేయ సంఘం కార్యదర్శి శ్రీ  కొండా లక్ష్మణ రావు, ఫేస్ బుక్ స్పెషల్ కరస్పాండెంట్  జాగర్లమూడి రామకృష్ణ, ఎస్. రాము, దుగ్గరాజు స్వాతి  ప్రభ్రుతులు ఇష్టాగోష్టిగా జరిగిన ముచ్చట్లలో పాలుపంచుకున్నారు.

సభాధ్యక్షుడు దేవులపల్లి అమర్ ప్రారంభంలోనే ముఖ్య అతిధులకు, అతిధులకు నడుమ ఉన్న విభజన రేఖను చెరిపేస్తూ తమ కుర్చీలను ఆహూతులకు దగ్గరగా జరిపించడంతో కార్యక్రమం యావత్తూ, కొందరు మాట్లాడడం అందరు వినడంలా కాకుండా అనదరూ మాట్లాడుతూ అందరూ వినే ఇన్ఫార్మల్ గెట్ టుగెదర్ గా మారిపోయింది.

ముందు చెప్పినట్టు ఫేస్ బుక్ ధర్మమా అని చాలామంది జర్నలిస్టులు తమ అనుభవాలను, జ్ఞాపకాలను అనుదినం పోస్ట్ చేస్తూనే వున్నారు. వాళ్లకు రాయడం మాత్రమే తెలుసు. అతి కొద్ది మంది మాత్రమే వాటిని పుస్తక రూపంలోకి తేగలుగుతున్నారు. పుస్తక ప్రచురణలోని కష్ట నష్టాలు తెలిసిన చంద్రశేఖర రెడ్డి గారు తలచుకుంటే ఇదేమంత పెద్ద పని కాదు. ఆ పెద్ద మనసు వారికి ఉందనే నా నమ్మకం.

15-12-2023                

చార్లీ మైక్ రెడీ టు స్టార్ట్ - భండారు శ్రీనివాసరావు

 “నాకోసం ట్రాఫిక్ ఆపొద్దు” అంటూ తెలంగాణా కొత్త ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన సంచలనం సృష్టిస్తోంది. గొప్ప నిర్ణయం అని సామాన్యులు చాలామంది హర్షం వెలిబుచ్చుతుంటే ఈ ముచ్చట ఎన్నాళ్ళు? బుద్ధి బుధవారం దాకా వుంటే బూరెలు వండి పెడతాను అందట ఒక ఇల్లాలు అంటూ మరికొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. గతంలో ఇలా ప్రకటనలు చేసి నిలబెట్టుకోలేని ఉదంతాలను ఉదహరిస్తున్నారు. ముఖ్యమంత్రి సమయం చాలా విలువైనది,  అంచేత ఆయన రాకపోకల కోసం ట్రాఫిక్ ని కొంతసేపు నిలిపితే తప్పేమిటి అనేవారు కూడా వున్నారు.

సరే! రాజకీయాలు అన్న తర్వాత ప్రతిదీ రాజకీయమే. అంచేత వాదప్రతివాదాలు ఎలాగూ తప్పవు. వీటిని అలా వుంచి గతాన్ని గుర్తు చేసుకోవడమే వ్యాసకర్త ఉద్దేశ్యం.

సమైక్య రాష్ట్రంలో  ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట,  ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు,  గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడంతిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. నగరంలో జనాలు ఆయన కారణంగా ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కున్న దాఖలాలు తక్కువ.  తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీఆ మాట  నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా వెంగళరావు ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడంతిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు.

తరువాత ముఖ్యమంత్రి అయిన శ్రీ మర్రి చెన్నారెడ్డి సమయం విలువ తెలిసిన వారే అయినా సమయ పాలనకు తగిన ప్రాధాన్యత ఇచ్చిన దాఖలాలు లేవు.  ఇంటి నుంచి సచివాలయానికీ మళ్ళీ ఇంటికీ బయలుదేరే సమయంలో భద్రతా సిబ్బంది పోలీసు కమ్యూనికేషన్ రేడియోలో చార్లీ మైక్ ( సీఎం కాన్వాయ్ కి గుప్తనామం) రెడీ టు స్టార్ట్ అని  వర్తమానం పంపేవారు. దానితో ట్రాఫిక్ పోలీసులు అప్రమత్తమై వాహనాల రాకపోకలు నిలిపివేసేవారు. అయితే ముఖ్యమంత్రి మంత్రులతో, అధికారులతో మాట్లాడుతూ ఉండడంతో మళ్ళీ ఆ విషయం ట్రాఫిక్ సిబ్బందికి రేడియో సెట్లలో చెప్పేవారు. దాంతో ఆపిన ట్రాఫిక్ ని వదిలేసేవారు. ఇలా చాలా సార్లు ఆపడం వదలడం ఆయన హయాములో జరుగుతూ వుండేది.  అయితే ఇలా జరుగుతున్న విషయాన్ని చెన్నారెడ్డి దృష్టికి తీసుకు వెళ్ళే ధైర్యం ఎవరికీ వుండేది కాదు.

తదుపరి ముఖ్యమంత్రి శ్రీ అంజయ్య అధికారులు చెప్పిన టైముకే లిఫ్టులో కిందికి దిగేవారు. కానీ ఆయన బలహీనత జనం. దిగి కారు దగ్గరికి వచ్చిఎక్కబోయే లోపు చుట్టూ జనం గుమికూడేవారు.  దానితో కాన్వాయ్ బయలుదేరడం ఆలస్యం అయ్యేది. ట్రాఫిక్ చిక్కులు తప్పేవి కావు. అయితే ఆ రోజుల్లో ముఖ్యమంత్రి కాన్వాయ్ అంటే మూడే మూడు వాహనాలు. ముందు పైలట్ జీపు, వెనక ముఖ్యమంత్రి అంబాసిడర్ కారు, తరువాత మరో పోలీసు జీపు. అంతే! అంచేత ప్రజలకు, వాహనదారులకు కలిగే అసౌకర్యం కూడా అదే స్థాయిలో తక్కువగా వుండేది.

అంజయ్య తరువాత ముఖ్యమంత్రులు అయిన శ్రీయుతులు భవనం వెంకట్రాం, విజయ భాస్కరరెడ్డి హయాంలో  కూడా ట్రాఫిక్ ఇబ్బందులు పరిమితంగానే ఉండేవి. శ్రీయుతులు ఎన్టీ రామారావు, నాదెండ్ల భాస్కరరావు లకు కూడా పరిమిత సంఖ్యలో వాహనాలు కలిగిన  కాన్వాయ్ వుండేది.        నక్సల్  ముప్పు కారణంగా నేదురుమల్లి జనార్ధన రెడ్డి కాన్వాయ్ లో కొత్త భద్రతా వాహనాలు చేరాయి. శ్రీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు బాంబు దాడి తట్టుకునే బుల్లెట్ ప్రూఫ్ అంబాసిడర్ కారు వాడేవారు. తిరుమల ఘాట్ రోడ్డులో అలిపిరి వద్ద నక్సల్స్ పేల్చిన బాంబు దాడిలో ఆ వాహనం తుక్కు తుక్కు అయినా అదృష్టవశాత్తు చంద్రబాబు తీవ్ర గాయాలతో బయట పడ్డారు. తదుపరి పోలీసు శాఖ ముఖ్యమంత్రి భద్రత కోసం యాంటీ బాంబు స్క్వాడ్ వంటి అధునాతన వాహన శ్రేణి, అంబులెన్స్ కాన్వాయ్ లో చేరాయి. రాజశేఖర రెడ్డి హయాములో భద్రతా వాహనాల సంఖ్య అలాగే వుంది. రాష్ట్ర విభజన తరువాత, అంతకు ముందు ముఖ్యమంత్రులు అయిన శ్రీ రోశయ్య, శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి, కేసీఆర్, చంద్రబాబు, జగన్ మోహన్ రెడ్డి ప్రభ్రుతుల కాన్వాయ్ లు మరింత మెరుగైన భద్రతా సౌకర్యాలను సమకూర్చుకున్నాయి.  ప్రజలకు అదే దామాషాలో ఇబ్బందులు పెరిగాయి. దానికి ప్రధాన కారణం నాకు అనిపిస్తోంది ఏమిటంటే సమయపాలన పట్ల సరైన శ్రద్ధ లేకపోవడం.

అనుకున్న సమయానికి బయలుదేరి అనుకున్న సమయానికి చేరగలిగే వీలుసాళ్ళు ఉన్న  వీవీఐపీలు, నిర్దేశిత సమయంలో రాకపోకలకు సిద్ధంగా వున్న పక్షంలో ప్రజల ట్రాఫిక్ ఇబ్బందులు కొంతవరకు తగ్గే అవకాశం వుంది. 

తోకటపా :

ఒక గవర్నర్, ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఇద్దరు డీజీపీలు ఇలా ఒకే నగరం హైదరాబాదులో వున్న రోజులు రాష్ట్ర విభజన అనంతరం అనుభవంలోకి వచ్చాయి. ఆ రోజుల్లో ట్రాఫిక్ పోలీసు అధికారులు, సిబ్బంది ఆ వీవీఐపీల రాకపోకల సమయాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు. వాహనదారుల్ని ఇబ్బందులు పెట్టారు. 

(16-12-2023)

13, డిసెంబర్ 2023, బుధవారం

మనిషి నిజంగా బతికేది మరణం తర్వాతనే – భండారు శ్రీనివాసరావు

 

ఆయన ఐ.పి.ఎస్. అధికారి కాదు, అసలు సాధారణ పోలీసు అధికారి కూడా కాదు. అయినా ఉమ్మడి రాష్ట్రంలో పోలీసు శాఖలో  సుదీర్ఘ కాలం పనిచేశారు. ఆయన చనిపోయి ఏడాది గడిచింది. ఈరోజు హైదరాబాదులో జరిగిన ఆయన ప్రధమ వర్ధంతికి గతంలో పోలీసు  డైరెక్టర్ జనరల్స్ గా పనిచేసిన హెచ్.జే. దొరవంటి  ఉన్నతాధికారులతో సహా చిన్నా పెద్దా పోలీసు  అధికారులు ఎంతో మంది హాజరై ఆయన చిత్రపఠానికి పుష్పాంజలి ఘటించి పోలీసు శాఖకు ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.  మా అన్నయ్య రామచంద్ర రావు గారితో కలిసి, ఆయన కుమారుడు శంకర ప్రసాద్ ని కలవడానికి వారి ఇంటికి వెళ్ళాము. పుష్కర కాలం క్రితం ముగిసిన నా ఉద్యోగపర్వంలో భాగంగా పరిచయం అయిన అనేకమంది రిటైర్డ్ అధికారులు, ముఖ్యంగా వరుసగా పలువురు డీజీపీ లకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసిన కామేశ్వర రావు వంటి వారిని కలవగలిగాను. దశాబ్దాల తరువాత కలిసినా కూడా  చాలామంది నన్ను నా పేరుతొ సహా గుర్తువుంచుకుని పలకరించారు.   

ఆయన పేరు మాదిరాజు రామకిషన్ రావు గారు. మాకు దూరపు చుట్టం. వ్యక్తిగతంగా అత్యంత ఆత్మీయులు.   ఖమ్మం జిల్లా పుట్టకోట గ్రామ వాస్తవ్యులు. పోలీసు డైరెక్టర్ జనరల్ కు ప్రధాన న్యాయ సలహాదారుడిగా సుదీర్ఘకాలం చాలామంది పోలీసు డైరెక్టర్ జనరల్స్ దగ్గర పనిచేసిన అనుభవం ఆయనది. వయసు రీత్యా 1999 లోనే రిటైర్ అయినప్పటికీ, ఉద్యోగబాధ్యతల్లో ఆయన చూపిన నిబద్దత, అంకితభావం కారణంగా తరువాత  అనేక సంవత్సరాలు ఉద్యోగాన్ని పొడిగిస్తూ పోయారు. చివరికి ఆయనే 2008 లో నాకీ కొలువు చాలనుకుని  స్వచ్చందంగా ఉద్యోగబాధ్యతల నుంచి తప్పుకుని తనకిష్టమైన శృంగేరి పీఠం అప్పగించిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మునిగిపోయారు. ఖమ్మంలో అతిపురాతన రామాలయాన్ని పునరుద్ధరించారు. ఖమ్మం సమీపంలో గోశాలతో కూడిన దేవాలయ ప్రాంగణాన్ని నిర్మించారు. ఉత్తమ ధర్మాధికారిగా శృంగేరి పీఠాధిపతి జగద్గురు శంకరాచార్య నుంచి సత్కారం అందుకున్నారు.


(మాదిరాజు రామకిషన్ రావు)


13-12-2023

 

 

అయోధ్య రెడ్డి


 నాకు ముప్పై ఏళ్లుగా లేదా అంతకంటే ఎక్కువగా తెలుసు. పాత సచివాలయంలో, లేదా బయట ఎక్కడ కలిసినా కూడా నవ్వుల రెడ్డి అని పిలిచే వాడిని. హాయిగా నవ్వేవాడు. వున్నట్టుండి జర్నలిజం వదిలి రాజకీయ రంగప్రవేశం చేసాడు. నాకు ఆశ్చర్యంతో పాటు ఎందుకిలా చేశాడు అనే అనుమానం కూడా కలిగింది. తర్వాత తెలిసింది నవ్వడం ఒక్కటే కాదు తనకు ఒక ధ్యేయం వుందని, అది సాధించే వరకు విశ్రమించడని.
ఈరోజు తెలిసింది అది నెరవేరిందని. తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి CPRO గా నియమితులయ్యారు అని.
అభినందనలు అయోధ్య రెడ్డి. కాదు నవ్వుల రెడ్డి

12, డిసెంబర్ 2023, మంగళవారం

మంత్రి అయినా మారని మాట తీరు

ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి శ్రీ జూపల్లి కృష్ణారావు గారిని ఈరోజు సచివాలయంలోని ఆయన ఛాంబర్ లో కలిసి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపాము. డాక్టర్ నాగభూషణం, డాక్టర్ భరత్, డాక్టర్ ఏపీ మనోహర్ రావు, నేను, డాక్టర్ బాలాజీ ఈ బృందంలో వున్నాము. జూపల్లి గారు రాజకీయ రంగప్రవేశం చేయక ముందు నుంచి వారితో చక్కటి స్నేహ సంబంధాలు ఉన్నాయి. వారితో కలిసి అక్కడే వర్కింగ్ లంచ్ చేసాము. అనేక పాత సంగతులు నెమరువేసుకుంటూ చాలాసేపు వారితో గడిపి తిరిగి వచ్చేసాము. బయట నుంచే తప్ప కొత్త సచివాలయం చూడడం ఇదే మొదటిసారి. కృష్ణారావు గారిని కలిసి కూడా చాలా కాలం అయింది. కానీ ఆయన  ప్రేమాభిమానాలలో ఎలాంటి తేడా లేదు.  
సచివాలయం నాకు కొత్తకాదు. నా విలేకరి జీవితంలో సింహభాగం అక్కడే గడిచింది. నాకు మరింత సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే నేను రిటైర్ అయి పద్దెనిమిది ఏళ్ళు గడిచిన తర్వాత కూడా లిఫ్ట్ బాయ్ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు గుర్తు పట్టి పలకరించడం.

తోక టపా: మంత్రిగారికి పుష్పగుచ్చం ఇచ్చింది డాక్టర్ నాగభూషణం గారు. ఫోటో తీసిన కెమెరాలో పేరలాక్స్ దోషం కారణంగా కాబోలు, అది నేను ఇస్తున్నట్టుగా అనిపిస్తుంది. నిజానికి నేను కాదు.

9, డిసెంబర్ 2023, శనివారం

పరిధి దాటి చూడండి - భండారు శ్రీనివాసరావు

 మా ఇంట్లో పనిచేసే వలలి (వంటావిడ) ఎంతో సంతోషంగా వుంది. ఆమె ఎల్లారెడ్డి గూడాలో వుండే మా ఇంటితో పాటు మాధా పూర్ లో ఓ డాక్టర్ దంపతుల ఇంట్లో కూడా పనిచేస్తుంది. పొద్దున్నే బయలుదేరి, నేరుగా వెళ్ళే బస్సు దొరకనప్పుడు  రెండు బస్సులు మారి మాదాపూర్ వెళ్లి పని చక్కబెట్టుకుని, మా ఇంటికి వచ్చి బ్రేక్ ఫాస్ట్, వంటపని చేసి వెడుతుంది.  దేనికీ తొందరలేని ఇల్లు కనుక ఆవిడ ఏ టైముకు వచ్చినా మాకు ఇబ్బంది లేదు. అయితే ఈ తిరుగుళ్లకే సంపాదనలో ఎక్కువ భాగం ఖర్చు అవుతోంది అని బాధ పడేది. కొత్త ప్రభుత్వం ప్రకటించిన ఈ కొత్త పథకం (మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం) తనకు ఎంతో వెసులుబాటు అని చెబుతోంది.

 జనాకర్షక పథకాలు అని తీరుబాటు వున్న వాళ్ళు ఎద్దేవా చేసే కొన్ని పథకాలు నిజంగా అవసరంలో వున్నవారికి చాలా ఊరట కలిగిస్తాయి. ఈ నిజం అర్థం కావాలి అంటే తమ చుట్టూ తామే గీసుకున్న పరిధి నుంచి బయటకు వచ్చి చూడాలి.

5, డిసెంబర్ 2023, మంగళవారం

తిరుపతి మనదేనా! – భండారు శ్రీనివాసరావు

 హరి సర్వోపగతుడు, సర్వవ్యాపితుడు. ఇందుగలడు  అందులేడు అనే సందేహము లేని వాడు.

భగవంతుడు అనేవాడు  అన్ని ప్రాంతాలకు చెందినవాడు. భగవంతుడు అందరికీ భగవంతుడే. అలాంటివాడిని ఒక నగరానికో, ఒక రాష్ట్రానికో పరిమితం చేసి మాట్లాడడం సంకుచితమే అవుతుంది.

అయినా కానీ, కొన్ని సందర్భాలలో  భాషాభిమానం ఈ వాదాన్ని ఒప్పుకోనివ్వదు.

ఉదాహరణకు సప్తగిరి నవంబరు సంచిక. తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రతి నెలా ప్రచురించే ఆధ్యాత్మిక పత్రిక. ఈ పత్రికను లక్షలాది మంది చదువుతుంటారు. తిరుమలకు సంబంధించిన అనేక అరుదైన విషయాలు, విలువైన  వ్యాసాలు ఈ పత్రికలో వస్తుంటాయి.

సరే అసలు విషయానికి వస్తాను.

నవంబరు సంచిక అంటే కిందటి నెల సంచిక 50 వ పుటలో బాల వినోదం విభాగంలో “మీకు తెలుసా?”  అనే శీర్షిక కింద కొన్ని ప్రశ్నలు వేసి అదే సంచికలో కింద సమాధానాలు కూడా ఇచ్చారు. జవాబులను ప్రశ్న పక్కనే బ్రాకెట్లో ఇచ్చాను.

అవేమిటంటే :

తిరుమల స్వామికి గర్భగుడిలో పై కప్పుకు కట్టే పట్టు వస్త్రం పేరు?  (కురాళం)

కోయిలాళ్వార్ తిరుమంజనం నాడు స్వామికి తొడిగే వస్త్రం పేరు?  (మలై గుడారం)

స్వామి నుదిటి నామం పేరు?  (తిరుమణి కాపు)

పట్టు విసనకర్ర పేరు?  (ఆలవట్టం)

పచ్చ కర్పూరం పేరు?  (గంబూరా)

కుంకుమ పూవు పేరు? (జాప్రా)

రాత్రి నిద్రించిన హుండీకి గల పేరు?  (తోక ముల్లె)

దేవస్థానానికి చలానాల రూపంలో చెల్లించే నగదుకు గల పేరు?  (ఇరసాల్ నామా)

దేవుని వస్తువులు ఉంచే గది పేరు?  (సభరసబేరా)

ఆలయ బీగాల గుత్తి పేరు?  (లచ్చెన)

బాలపాఠకుల విభాగంలో సంధించిన ఈ ప్రశ్నలకు సంపాదక వర్గం వాళ్ళు ఇచ్చిన సమాధానాలు చాలామంది పెద్దలకు కూడా తెలిసివుండే  అవకాశం వుందని నేను అనుకోవడం లేదు.

అసలీ పేర్లు ఏమిటి? అలాంటి అన్యభాషా పదాలను ఇప్పటికీ ఉపయోగించాల్సిన అవసరం ఏముంది?

వాళ్ళు పెట్టిన శీర్షికనే చివర్లో  నేనూ ఉపయోగిస్తాను.

“మీకు తెలుసా?

(05-12-2023)