11, సెప్టెంబర్ 2022, ఆదివారం

తలకెక్కని చరిత్ర పాఠాలు – భండారు శ్రీనివాసరావు

  

(Published in Andhra Jyothi today, 11-09-2022, SUNDAY)


9-11

తొమ్మిదో నెల, పదకొండో తేదీని సూచించే ఈ రెండంకెలు అమెరికన్ ప్రజల మనస్సులో ఎంత బలంగా నాటుకు పోయాయంటే  రెండు దశాబ్దాలు గడిచిన తరువాత కూడా 2001 సెప్టెంబర్ 11 వ తేదీన జరిగిన ఘోర సంఘటనను వారెవ్వరూ మరచి పోలేకుండా వున్నారు. న్యూయార్క్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాలు ఉగ్రవాదుల వైమానిక దాడికి గురయి పేకమేడల్లా కూలిపోతున్న దృశ్యాలు ప్రతి అమెరికన్ మదిలో కళ్ళకు కట్టినట్టు ఈనాటికీ కదలాడుతూనేవున్నాయి. 

ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన దాదాపు మూడువేలమంది తాలూకు కుటుంబసభ్యులు, ఆ దుఖం నుంచి, ఆ దిగ్భ్రమ నుంచి ఇంకా తేరుకున్నట్టు కనబడదు. అలాగే, అమెరికన్ అగ్రరాజ్య అభిజాత్య అహంకార పూరిత చర్యల ఫలితంగా ప్రపంచ వ్యాప్తంగా అనేక వేలమంది ఇన్నేళ్ళుగా ప్రాణాలు కోల్పోతూ వచ్చారు. వారి కుటుంబాల పరిస్తితి ఇదే. ఇదంతా ఎందుకోసం, ఇంత మారణ హోమం ఎవరికోసం అన్న ప్రశ్నలకు మాత్రం సమాధానం దొరకదు. మానవ జాతిని పీడిస్తున్న పెను విషాదాల్లో ఇదొకటి.

తన అధికారానికీ, తన పెత్తనానికీ ఎదురులేదని విర్రవీగే అమెరికన్ పాలకులకు 2001 దాడితో తగిలిన తొలిదెబ్బతో తల బొప్పికట్టింది. ఇన్నాళ్ళుగా తన స్వార్ధ ప్రయోజనాలకోసం పెంచి పోషిస్తూ వచ్చిన ఉగ్రవాద భూతం కోరలు సాచి, తమనే కబళించడానికి వచ్చిన తరువాత కానీ ఆ అగ్రరాజ్యానికి కళ్ళు తెరిపిళ్ళు పడలేదు. ఈ దారుణ అవమానం నుంచి బయటపడేందుకు 9/11 దాడి సృష్టికర్త ఒసామా బిన్ లాడెన్ ను, వెంటాడి, వేటాడి మట్టు పెట్టేంతవరకు అగ్ర రాజ్యానికి కంటి మీద కునుకు లేకుండా పోయింది. కానీ ప్రతీకారేచ్చలతో అట్టుడికి పోతున్న రెండు వైరి వర్గాల మధ్య పోరు మాత్రం ఇంకా కొనసాగుతూనే వుంది. ఉగ్రవాద భూతపు వికృత పోకడలు అడ్డుకట్ట లేకుండా అమాయక ప్రజల జీవితాలతో ఆడుకుంటూనే వున్నాయి. ఈ కారణంగా ప్రపంచదేశాలకు నిష్కారణంగా జరుగుతున్న కీడు గురించి ఆలోచించే తీరిక ఎవరికీ వున్నట్టు లేదు.

సెప్టెంబర్ దాడి గురించి ప్రపంచవ్యాప్తంగా మీడియాలో జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. దీనికి కారణభూతుడయిన ఒక వ్యక్తి మాత్రం చరిత్ర పుటల్లో కనుమరుగయి పోయాడు. అతడి పేరు మహమ్మద్ అత్తా.

2001, సెప్టెంబర్, 11 వ తేదీన హైజాక్ చేసిన ఓ అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని నడుపుతూ, మన్ హటన్ లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ జంట భవనాల్లో ఒకటయిన ఆకాశ హర్మ్యాన్ని తాను ప్రయాణిస్తున్న విమానంతోనే డీకొట్టి కూల్చివేసి, నేలమట్టం చేసిన ఉగ్రవాది పేరే మహమ్మద్ అత్తా.

అత్తా పుట్టింది ఈజిప్టులో. 1968 సెప్టెంబర్ లో. తనకు ముప్పయ్యేళ్ళు పైబడ్డ తరువాత, ఒక సెప్టెంబర్ మాసంలోనే, అమెరికాకు చెందిన ఒక అద్భుత కట్టడాన్ని కూల్చబోతున్నానన్న సంగతి బహుశా ఆ నెలలోనే పుట్టిన అత్తాకు తెలిసుండదు. 

అత్తా చిన్నప్పటినుంచి మితభాషి. వాళ్ల నాన్న మహమ్మద్ మాటల్లో చెప్పాలంటే జెంటిల్ మన్. తన పనేదో తనది తప్ప ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకునే తత్వం కాదు.

కెయిరో విశ్వవిద్యాలయంలో ఆర్కిటెక్చర్ కోర్సు చేశాడు. తరువాత జర్మనీ వెళ్లి హాంబర్గ్ లో అర్బన్ ప్లానింగ్ లో డిగ్రీ తీసుకున్నాడు. హాంబర్గ్ జీవితం అతని జీవన గమనాన్నే మార్చివేసింది. అక్కడ అతడికి ఇస్లాం ఉగ్రవాదులతో పరిచయాలు ఏర్పడ్డాయి. వారి వల్ల ప్రభావితుడై, వారి ప్రోద్బలంతో ఆఫ్ఘనిస్తాన్ చేరుకొని అక్కడ అల్ ఖయిదా శిక్షణా శిబిరంలో చేరాడు. చివరకి, ఒసామా బిన్ లాడెన్ తనకు ఒప్పగించిన కర్తవ్యాన్ని జయప్రదంగా ముగించి ఆ క్రమంలోనే తన జీవితానికి కూడా ముగింపు వాక్యం పలికాడు.

అత్తా మహమ్మద్ గురించిన మరో ఆసక్తికర కధనం అమెరికా మీడియాలో ప్రాచుర్యం పొందింది.

1986 లో అత్తా తనకు అప్పగించిన బాధ్యతల్లో భాగంగా ఇజ్రాయెల్ లో ఒక బస్సును పేల్చివేసి ఆ దేశపు పోలీసుల చేతికి చిక్కాడు. ఆ తరువాత, 1993 ఓస్లో ఒప్పందం ప్రకారం ఇజ్రాయెల్ తన అధీనంలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టాల్సిన పరిస్తితి వచ్చింది. అయినా, ‘రక్తపు మరకలు’ అంటిన ఉగ్రవాద ఖయిదీలను వొదిలిపెట్టడానికి ఆ దేశం ఓ పట్టాన ఒప్పుకోలేదు. ఆ రోజుల్లో బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడు. వారెన్ క్రిష్టఫర్ విదేశాంగ మంత్రి (సెక్రెటరీ ఆఫ్ స్టేట్). ఖయిదీలనందరినీ విడుదలచేయాలని వారు ఇజ్రాయెల్ పై వొత్తిడి తెచ్చారు. దానితో ఇజ్రాయెల్ జైళ్లలో వున్న రాజకీయ ఖయిదీలనందరినీ విడిచిపెట్టారు. మహమ్మద్ అత్తా కూడా వారిలో ఒకడు. విడుదల అవుతానన్న ఆశ ఏకోశానా లేకుండా ఇజ్రాయెల్ జైల్లో మగ్గుతున్న అత్తా, అమెరికా పూనిక కారణంగానే విడుదల అయ్యాడు. అలా బయట పడ్డవాడే తదనంతర కాలంలో అమెరికా కలలో ఊహించని విధ్వంసానికి కారకుడయ్యాడు. చరిత్రలో అప్పుడప్పుడూ ఇలాటి విడ్డూరాలు నమోదవుతూవుంటాయి. 

చూసే కంటిని బట్టి ప్రపంచం కనబడుతుందంటారు. అందుకే, ఉగ్రవాదుల దృష్టిలో అత్తా ఆత్మ బలిదానం చేసిన అమర వీరుడు. అమెరికా దృష్టిలో కరడుగట్టిన ఉగ్రవాది.

2001లో అమెరికాలో ఈ సంఘటన చోటుచేసుకున్నప్పుడు ఆ దేశంతో పాటు, ప్రపంచం యావత్తు నివ్వెరపోయింది. ఉగ్రవాదం ఎంత భయంకరమయినదో తెలియచెబుతూ, దాన్ని కూకటివేళ్ళతో పెకలించివేయాల్సిన ఆవశ్యకతను గురించి వివిధ దేశాల నాయకులందరూ నొక్కిచెప్పారు. ఈ కర్తవ్య దీక్షకు కట్టుబడివుంటామని వాగ్దానాలు చేశారు. కానీ, ఇన్నేళ్ళ వ్యవధిలో జరిగిందేమిటి? ఉగ్రవాదం మరింతగా జడలు విరబోసుకుని చేస్తున్న కరాళ నృత్యం పదఘట్టనల కింద విశ్వవ్యాప్తంగా అసువులు బాస్తున్న వారి సంఖ్య నానాటికీ పెరిగిపోతూనే వుంది. ముఖ్యంగా మన దేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఉగ్రవాద నిర్మూలన అనేది భరించలేని భారంగా మారింది. ప్రజాసంక్షేమానికి ఖర్చుచేయాల్సిన విలువయిన వనరులను భద్రతా చర్యలకు మళ్ళించాల్సి వస్తోంది.

గతంలో హైదరాబాదులో, ముంబైలో, ఢిల్లీలో జరిగిన పేలుళ్లు జనంలో పెచ్చరిల్లుతున్న అభద్రతా భావానికి పునాది రాళ్ళుగా మారుతున్నాయి.

ఈ హింస ప్రతి హింసలను నిలుపుచేయడానికి కావాల్సింది కేవలం డంబాలతో కూడిన ప్రకటనలు కాదు. రాజకీయ దృఢ నిశ్చయం. కానీ, ఆధిపత్యపు పోరులో కత్తులు దూసుకునేటప్పుడు విచక్షణ పక్కకు తప్పుకుంటుంది. వివక్ష రెక్కలు తొడుక్కుంటుంది. రక్తం మరిగిన పులి రక్తాన్నే కోరుకుంటుంది. ప్రతీకారంతో రగిలిపోయేవారికి శాంతి వచనాలు చెవికెక్కవు.

చరిత్ర ప్రాముఖ్యం తెలిసిన వారు చరిత్ర నుంచి గుణ పాఠాలు నేర్చుకుంటారు. చరిత్ర క్రమంలో ఎదురయ్యే సంఘటనలను గుర్తుచేసుకుని నెమరు వేసుకోవడంతోనే సరిపుచ్చుకోరు.

సెప్టెంబరు తొమ్మిదో తేదీని గుర్తుంచుకుని ఆ దుర్ఘటనను తలచుకోవడం ఒక్కటే కాదు, మళ్ళీ అలాంటి దుర్దినాలు పునరావృతం కాకుండా ఏం చేయాలో కూడా ఆలోచించుకుంటారు.

అటువంటి రాజకీయ నాయకులు ఈనాడు క్రమంగా కనుమరుగవుతున్నారు. కంటికి కన్ను, పంటికి పన్ను అంటూ తొడగొట్టేవారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇది మరో విషాదం




ఎట్టకేలకు జనం మధ్యకు రాహుల్ గాంధి

 (Published in Andhra Prabha today. 11-09-2022, Sunday)

 

‘ఈ యాత్ర వల్ల రాహుల్ గాంధీకి వ్యక్తిగతమైన లబ్ది చేకూరుతుందా?’

ఒక టీవీ విలేకరి నన్ను ఇంటర్వ్యూలో అడిగిన ఈ ప్రశ్న కొంత ఆలోచింప చేసింది. ఇలాంటి పాదయాత్రల వల్ల ఆయా పార్టీలు అధికారంలోకి వచ్చి లాభపడిన సందర్భాలు గతంలో వున్నాయి. అయితే వ్యక్తిగతంగా ఒక నాయకుడికి  లభించే లాభం ఏమిటి?

సాధారణంగా కష్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అనేది వాడుక. అయితే, ఈ రాహుల్ భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు. అంటే ఏమిటన్న మాట. కింది నుంచి పైకి.

జాతీయ పార్టీ  కాంగ్రెస్ పరిస్థితి ప్రస్తుతం చాలా దిగజారివుంది.  ఆ పార్టీ నాయకుడిగా రాహుల్ గాంధి ప్రతిష్ఠ కూడా అధమాధమంగానే  వుందని వాళ్ళ పార్టీ వాళ్ళే అంటున్నారు. అనడమే కాదు, గులాం నబి ఆజాద్ వంటి సీనియర్లు కూడా పార్టీ విడిచి వెడుతూ కొంత  బురదను రాహుల్ గాంధీపై చల్లి వెడుతున్నారు. అందుకే కాబోలు అడుగంటుతున్న వ్యక్తిగత ప్రతిష్టను అట్టడుగునుంచి పైకి తెచ్చుకుంటున్నసంగతి తెలియచెప్పే సంకేతంలా కన్యాకుమారి నుంచి కష్మీర్ వరకు ఈ యాత్ర తలపెట్టారని అనుకోవాలి. యాత్రాఫలం సిద్ధిస్తే అది రాహుల్ కు వ్యక్తిగత లబ్ది కిందికే వస్తుంది కదా!  యాత్రాఫలం అంటే కేంద్రంలో అధికార అందలం దక్కడం అనే అర్ధం కాదు. ఒక నాయకుడిగా తన ప్రతిష్టను పెంచుకోవడం, సమర్థతను నిరూపించుకోవడం.  

కాంగ్రెస్ పార్టీలో మేధావులకు కొరత లేదు. వాళ్ళ మేధాశక్తి పట్ల సందేహాలు పెట్టుకోనక్కరలేదు కానీ వారికి  అట్టడుగు గ్రామ స్థాయిలో పరిస్థితులు, వాస్తవాలు తెలియవన్న సంగతి ఇప్పటికే అనేకసార్లు రుజువయింది. అయితే ఈ భారత్ జోడో యాత్ర అనే ఆయుధాన్ని రాహుల్ చేతిలో పెట్ట్డడం మాత్రం వారి మేధస్సుకు మచ్చుతునక అనే  చెప్పాలి.

ఈ యాత్ర సందర్భంగా రాహుల్ 3570 కిలోమీటర్లు నడుస్తారు. పన్నెండు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లో  రాహుల్ కాలినడకన తిరుగుతారు. పార్టీ కార్యకర్తలతో పాటు సాధారణ ప్రజలని కలుసుకుంటారు. ఈ నెల ఏడో తేదీన కన్యాకుమారి నుంచి మొదలైన ఈ యాత్ర   సుమారు అయిదు మాసాలు కొనసాగుతుందని చెబుతున్నారు. అన్ని రోజులు దేశంలోని ఆయా ప్రాంతాల్లో రాహుల్ వార్తల లోని వ్యక్తిగా వుంటారు. ఒక జాతీయ పార్టీ నాయకుడికి  ఒక రకంగా ఇది రాజకీయంగా లాభదాయకమే.

కాంగ్రెస్ పార్టీది అనువంశిక పాలన అనేది ప్రత్యర్థులు చేసే ప్రధాన అభియోగం. అలాగే నెహ్రూ గాంధి వారసులుగా దేశాన్ని తమ గుప్పెట్లో ఉంచుకోవడానికి  ఆ కుటుంబం కాంగ్రెస్ పార్టీని ఒక పావులా వాడుకుంటోందని అంటుంటారు. అయితే సోనియా, రాహుల్ వీరిద్దరికీ తీరని అధికారదాహం ఉందనే  ఆరోపణలు నిజానికి నిజం కావు. అవకాశం వచ్చినప్పుడు ప్రధాని పదవిని సోనియా వదులుకున్నారు. అవకాశం రాకపోయినా, అవకాశం కల్పించుకుని  ప్రధాని పదవి చేపట్టడానికి అన్ని అవకాశాలు సిద్ధాన్నంలా ఎదురుగా ఉన్నప్పటికీ  రాహుల్ అప్పట్లో అందుకు సుముఖత చూపలేదు. అలాగే కాంగ్రెస్ అధ్యక్ష పదవి విషయంలో కూడా ఆయనది అదే తీరు. వచ్చే అక్టోబరులో కాంగ్రెస్ అధక్ష ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆయన సుదీర్ఘంగా సాగే ఈ యాత్ర తలపెట్టడం ద్వారా, పార్టీ అధ్యక్ష పదవిపై తనకు మక్కువ లేదని  మరోసారి పరోక్షంగా చెప్పదలచుకున్నారేమో తెలియదు. లేదా సమర్ధత నిరూపించుకున్న తర్వాతనే పదవిని కోరుకోవాలనే బలమైన పట్టుదల ఆయన చేత ఈ యాత్ర చేయిస్తున్నదేమో తెలియదు.      

సాధారణంగా రాజకీయ నాయకులు పాద యాత్రలు ప్రారంభించాలి అంటే అందుకు కొన్ని కారణాలు వుండి తీరాలి. ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం అంటూ వాళ్లు పైకి యెంత బింకంగా చెప్పినా దాని వెనుక రాజకీయ కోణం ఖచ్చితంగా దాగే వుంటుంది. అయితే,  చేసేది రాజకీయమే అయినప్పుడు ఇక ఆ యాత్రల కోణాలను దుర్భిణి పెట్టి శోధించాల్సిన అవసరం ఏముంటుంది అనే ప్రశ్న వారివద్ద సిద్ధంగానే వుంటుంది. 


ఇంతటి సుదీర్ఘ పాదయాత్ర అంత తేలికయిన విషయమేమీ కాదు. శారీరక శ్రమతో పాటు ఎన్నో వ్యయ ప్రయాసలు ఇందులో ఇమిడి వున్నాయి. ఒక రోజు యాత్రకు కొన్ని లక్షల రూపాయలు ఖర్చవుతాయని అంచనా. యువకుడు కాబట్టి కాలి నడకలో ఎదురయ్యే శారీరక శ్రమను ఆయన కొంత మేర అధిగమించగలుగుతారని భావించవచ్చు. 

ఈ పాదయాత్రల వల్ల రాజకీయ పార్టీలకు వొనగూడే తక్షణ రాజకీయ లాభాలు ఏమీ వుండకపోవచ్చు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికలకు ఇంకా బోలెడు వ్యవధానం వుంది. అయితే, రాజకీయాల్లో నాలుగు కాలాలు మనగలగాలంటే ప్రజలతో మమేకం కావడం ఒక్కటే సరయిన దారి. తమ నడుమ వుండేవారికే జనం ఈ నడుమ పట్టం కడుతున్నారు. ఏసీ గదుల్లో వుంటూ అప్పుడప్పుడూ చుట్టపు చూపుగా పలకరించి వెళ్ళేవారిని ఎడం పెడుతున్నారు. 

ప్రజల ఇబ్బందులను, కడగండ్లను దగ్గరనుంచి కళ్ళారా చూడగలిగే అరుదైన  అవకాశం ఈ పాదయాత్రల వల్ల రాజకీయ నాయకులకు లభిస్తుంది. భవిష్యత్తులో అధికారం దక్కినప్పుడు వాటిల్లో కొన్నింటిని అయినా పరిష్కరించ గలిగితే యాత్రా ఫలసిద్ధి కూడా ప్రాప్తిస్తుంది. 

2003 లో రాజశేఖరరెడ్డి జరిపిన ‘ప్రజా ప్రస్తానం’ పాదయాత్ర రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో మొదలై 1500 కిలోమీటర్లు సాగి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ముగిసింది. 2014 సార్వత్రిక ఎన్నికలకు పూర్వం చంద్రబాబు ‘వస్తున్నా ..మీకోసం’ పాదయాత్ర అనంతపురం జిల్లా హిందూపూర్ నుంచి మొదలై, పదమూడు జిల్లాలమీదుగా 2340 కిలోమీటర్లు సాగి శ్ర్రీకాకుళం జిల్లా ‘ఇచ్చాపురం’లోనే ముగిసింది. ఆ ఊరు పేరుకు తగ్గట్టే, మనోవాంఛాఫలసిధ్యర్ధం ఈ ఇద్దరు నాయకులు తమ తమ యాత్రలకు తుది మజిలీగా ‘ఇచ్చాపురాన్ని ఎంపిక చేసుకున్నారేమో అనిపిస్తుంది. వారు తలపోసినట్టుగానే ఇద్దరికీ కోరిక నెరవేరింది. దానితో రాజకీయ నాయకుల్లో పాదయాత్రల సెంటిమెంటు ఇబ్బడిముబ్బడిగా పెరిగింది. ఏదయితేనేం,  ఏ పేరుతొ అయితేనేం, నాయకులు తమ  రమ్య హర్మ్య భవనాలు  ఒదిలి, కొద్ది కాలం అయినా సాధారణ ప్రజలతో మమేకం అయ్యే వీలు వీటితో  ఏర్పడింది.

రోగి కోరిందీ, వైద్యుడు ఇచ్చిందీ ఒకటే అని జనాలు సంతోషించాలి. ప్రజలు అల్పసంతోషులు కదా!


ఉపశృతి:

‘పులి పులే. మేక మేకే. అయితే..’ ఆగాడు  ఏకాంబరం.

‘ఈ మాట చెప్పడానికి,  అయితే అంటూ ఆ సన్నాయినొక్కులు ఎందుకు? పులి పులే కదా!’ అన్నాడు పీతాంబరం. 

‘తొందరపడకు పీతాంబరం. కొన్ని సందర్భాలలో ఇలా అంటే కుదరదు. పులి మేకలకు నాయకత్వం వహించాలి అంటే మేకలకు ముందు నడవాలి. మేకలను ఎత్తుకుపోదామని చూసేవాళ్ళు పులిని చూసి బెదిరి పారిపోతారు. అదే పులి మేకలకు వెనక నడిస్తే, ఆ మేకల మందను చూసి ఎవరూ భయపడరు. కాబట్టి నాయకుడు అన్నవాడు పులి మాదిరిగా అనుచరులకు ముందు నడవాలి. ముందుండి నడపాలి.  వెనక వుంటానంటే కుదరదు. వెనక వుంటే పులి కూడా మేక మాదిరే.’




10, సెప్టెంబర్ 2022, శనివారం

భిన్నత్వంలో ఏకత్వం నీటి మూటేనా – భండారు శ్రీనివాసరావు

మూడేళ్ళ క్రితం వరకు నేను అనేక టీవీ చర్చలకు  వెడుతూ ఉండేవాడిని. మా ఆవిడ చనిపోయిన తర్వాత మానేశాను. వారానికి ఏడు రోజులు ఏదో ఒక ఛానల్. దాంతో వారాల అబ్బాయిలాగా రోజుకు ఓ ఛానల్ అనే నిబంధన పెట్టుకున్నాను. అంటే ఆదివారం ఓ ఛానల్ కు వెడితే మళ్ళీ ఆదివారం నాడే ఆ ఛానల్.

ఆ రోజుల్లో ఉప్పూ నిప్పూ వంటి ఛానల్స్ నన్ను పిలిచేవి. ఒక ఛానల్ లోగో వున్న కారులో మరో ఛానల్ కు వెళ్ళే వాడిని, ఆ రెండూ ఉత్తరం ధృవం దక్షిణ ధృవం అయినా కూడా.

ఇలా ఉంచితే,

అన్ని భావజాలాలు వున్న విభిన్న దిన పత్రికలు నా వ్యాసాలు  దశాబ్ద కాలానికి పైగా ప్రచురిస్తున్నాయి.

అదేమిటో దురదృష్టం! ఈ సాంఘిక మాధ్యమంలో అలా  స్వేచ్చగా రాయగలిగే వీలుందా అనే బాధ అప్పుడప్పుడూ మనసును తొలుస్తూ వుంటుంది.

ఈ నేపధ్యంలో కొన్ని రకాల (రాజకీయేతర)  పోస్టులకే పరిమితం అవ్వాల్సిన పరిస్తితి ఒక జర్నలిస్టుగా నన్ను కలవర పెడుతోంది. దీన్ని దృఢ పరచుకోవడానికి అనేకసార్లు  చాలా పాత రాజకీయ  పోస్టులు రిపీట్ చేస్తూ వచ్చాను. ఆ రోజుల్లో వాటిని సాదరంగా స్వీకరించి సానుకూలమైన వ్యాఖ్యలు పెట్టేవాళ్ళు.  ఇప్పుడు అవే పోస్టులకు వస్తున్న కామెంట్లు చూసి ఈ నిర్ధారణకు రావాల్సి వస్తోంది.

మొదట్లో నన్ను పట్టించుకోలేదు అనుకోవాలా! లేక ప్రస్తుతం ఆయా పార్టీల సోషల్ మీడియా విభాగాలు బాగా  యాక్టివ్ అయ్యాయని అనుకోవాలా!

హేళన, వేళాకోళం, వ్యక్తిత్వ హననం  ఎవరూ భరించలేరు.

నిష్పాక్షిక పాత్రికేయ విమర్శ కూడా ఈ కోవలోకే వస్తుందా!  

(10-09-2022)

 

 

8, సెప్టెంబర్ 2022, గురువారం

కాళోజీ గర్వభంగం - భండారు శ్రీనివాసరావు

(సెప్టెంబరు తొమ్మిది ప్రజాకవి కాళోజీ జయంతి)

కాళోజీ నారాయణ రావు ‘ఇదీ నా గొడవ’ అనే పేరుతొ తన ఆత్మకధ రాసుకున్నారు. స్నేహసాహితి వారు ప్రచురించిన ఈ పుస్తకం 1995 సెప్టెంబరు నెలలో విడుదల అయింది. తెలుగు భాష గురించీ, తెలంగాణా యాస గురించీ ఆయనకున్న మక్కువను ఆయన తన ఈ రచనలో వ్యక్తం చేసారు. అలాగే కొన్ని సందర్భాల్లో తనకు జరిగిన ‘గర్వ భంగాలను’ కూడా ఆయన చాలా హృద్యంగా తన శైలిలోనే నిజాయితీగా  ఈ పుస్తకంలో ప్రస్తావించారు. కాళోజీ స్వయంగా రాసుకున్న ఆ జ్ఞాపకాల్లో కొన్ని ఆయన మాటల్లోనే :

కులాల్లో ఎన్నో తరతమ భేదాలు పాటిస్తున్నాం. అది గ్రామ్యం, ఇది గ్రాంధికం అంటూ భాషలో కూడా తేడాలు పాటిస్తున్నాం.

భాషకి సంబంధించి రెండే రెండు. ఒకటి మాట, రెండు రాత. అంటే ఉచ్చారణ, దస్తూరి. అదే ‘అ’ అదే ‘ఇ’,

అదే ‘ఉ’ అదే ‘క’, అదే ‘య’. అక్షరమైతే ఒకటే. ‘క’ అని ఒక్కొక్కరు ఒక్కో విధంగా రాస్తారు. ఎట్ట రాసినా అది ‘క’ అనే అంటం కాని ‘హ’ అని ఎవడూ అనుకోడు.

దస్తూరి విషయంలో వుండే ఈ ఉదారత, సహృదయత ఉచ్చారణ విషయంలో ఎందుకు లేవు ? ఏ ఇద్దరి దస్తూరి ఒక రకంగా వుండనట్టు ఏ ఇద్దరి ఉచ్చారణా ఒక రకంగా వుండది. ఉచ్చారణ ఏ యాసలో వున్నా అర్ధం చేసుకోవడానికి ఇబ్బంది వుండకూడదు. మాండలికాలు లేని భాష చచ్చి వూరుకుంటది. మాండలికంలో తేడాలు, యాసలో వ్యత్యాసాలు వుండడమే భాషకి జీవ లక్షణాలు.

“‘అన్య భాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు సకిలించు ఆంధ్రుడా చావవెందుకురా’ అన్నాను. అన్ని భాషలు నేర్చుకో కానీ నీ మాతృభాషని మాత్రం తప్పకుండా నేర్చుకో.

రావిశాస్త్రి విశాఖ భాష, తెలుగు కాదని మేమూ, నల్గొండ వాళ్ళది వేరే యాస కాబట్టి అది తెలుగు కాదని వరంగలోడు, వరంగల్ వానిది తెలుగు కాదని బెజవాడవాడు, బెజవాడ వానిది తెలుగే కాదని రాయలసీమ వాడు – ఇట్లా అనుకుంటపొతే మన మధ్య సుహృద్భావం ఎట్టవస్తది. మనందరం తెలుగు వాండ్లం అనే ఎమోషనల్ ఇంటిగ్రేషన్ – ఆత్మీయత ఏముంటది . ఒకని భాష విషయంలో, యాస విషయంలో తిండి విషయంలో ఎగతాళి చేస్తే అతని ఆత్మాభిమానం దెబ్బ తింటది. దానికి వెల కట్టలేం.

హైద్రాబాదు రేడియోలో బాలల కార్యక్రమం వచ్చేది. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడిన (1956) నాటినుంచి ఈనాటి (1985) దాకా అంటే దాదాపు ముప్పయ్ ఏండ్లపాటు బాలల కార్యక్రమాలు వందలు వేలు జరిగివుండాలె. వీటిల్లో తెలంగాణా పిల్లలు ఎందరు పాల్గొన్నరు. వాండ్ల వాడుక భాష ఏది. వాండ్లు కనబడరు. వాండ్ల భాష వినబడదు. బిరుదు రామరాజు పిల్లలు, పల్లా దుర్గయ్య పిల్లలు, సినారె పిల్లలు ఎన్నడయినా బాలానందంలో పాల్గొన్నరా. రేడియో అన్నయ్య, అక్కయ్యల పాటా, మాటా, యాసా ఏదీ తెలంగాణది కాదు.

ప్రతి విషయంలో ఈ తేడాలు వుంటుంటే మరి మనమంతా కలిసి తెలుగోళ్ళమనుకుండేదెట్ట. ఆ భాష బాంధవ్యం కానీ, ఆ సామరస్యం కానీ ఎట్ట రావలె. ఏడనుంచి ఒస్తది. ఇది మనం తీవ్రంగా ఆలోచించాల్సిన విషయం”

పొతే కాళోజీ తన ఆత్మ కధలో తన గర్వం అణిగిన సందర్భం ఒకటి ఉదహరించారు ఇలా.

వరంగల్లు రాజరాజనరేంద్ర గ్రంధాలయంల ఆంజనేయులు అనే ఒకవిద్యార్ది సాయంకాలాలు పనిచేసేటోడు. ఐదో ఆరో (రూపాయలు) ఇచ్చేటిది. ఆ లైబ్రరీకి బెజవాడ నుంచి ఓ ఉత్తరం వచ్చిందట. పై కవరు మీద ఆంజనేయులు అడ్రెసు, లోపల మాత్రం రావి నారాయణరెడ్డి నాకు రాసిన ఉత్తరం. మరి సీ.ఐ.డీలు ఎట్ల పసికట్టిన్రో ఏమో, అది పట్టుకుని నన్నూ ఆంజనేయుల్నీ అరెస్టు చేసిన్రు. నన్నొక లాకప్ లోను, ఆంజనేయుల్ని మరో లాకప్ లోను పెట్టిన్రు. ఆ లాకప్ లో నాతో పాటు ఓ దొమ్మరాయన వున్నడు. .....నేను సత్యాగ్రహిని. ఈ నేరస్థునితో సమానం చేస్తరా. నా ప్రిస్టేజికి భంగం వచ్చినట్టు అనిపించింది. దొమ్మరతని చెవిలో సగం కాలిన ఆకు చుట్ట వుంది. అది తీసి, కొరికి, అక్కడే ఉమ్మి వేసి నా వైపు చూస్తూ ‘అగ్గిపుల్ల ఉందా’ అని అడిగాడు. నేను చీదరించుకున్నట్టు ‘హట్! నన్నడుగుతవా’ అన్న. అతడు సెంట్రీ నడిగి చుట్ట ముట్టించుకుని నా ముంగిట కూర్చుని అడిగిండు నన్ను ఏ నేరంలో పోలీసులు పట్టుకొచ్చారని. రాజకీయ సత్యాగ్రహం, బాధ్యతాయుత ప్రభుత్వం ఇవన్నీ నేను చెప్తె వానికేమి తెలస్తది.

చూడండి మనిషి స్వభావం యెంత విచిత్రమో. కులమతాల పట్టింపులు లేనివాడిని. ఆర్య సమాజపు మనిషిని. ఇలాటోడిని లాకప్పులో తోటి మనిషి పట్ల ఇట్లుండడం.

చోరీ చేస్తివా ?”

ఎవుడి తలన్నా పగలగొట్టి వస్తివా ?”

ఎవుడి పెళ్ళాన్నన్నా ఎత్తుకు వస్తివా ?”

ఇలా నేరాలన్నీ ఏకరువు పెట్టి అడుగుతున్నాడు.

ఛీ ఛీ అంటూ అన్నిటికీ కాదు కాదనే చెబుతున్న. ఈ ప్రశ్నలన్నీ అయినంక ఒక నిమిషం ఆలోచించి ఒక్క ప్రశ్న వేసిండు.

అతనాలోచించి అడిగిన ప్రశ్న. ‘గాంధీ మహారాజ్ కిన్నీ, హుజూర్ నైజాంకీ లడాయ్ జరుగుతుందట. దాంటోగిన రాలేదు కద నువ్వు?’

దొంగతనాలు, దోపిడీలు కాకుండా వేరే రకంగా ఓ పోరాటం జరుగుతున్నదనే ఒక పిక్చర్ అతని లోపల కట్టి వున్నదన్నమాట. దాంతో నేను విచిత్రపడిపోయి, దగ్గరకి జరిగి కౌగలించుకుని ‘అవున్నాయనా ఆ లడాయిలోనే వచ్చిన’ అని కళ్ళనీళ్ళు పెట్టుకున్న.

'నా జీవితంలో ఇది మరపురాని ఘట్టం’ అని కాళోజీ తన ఆత్మకధలో రాసుకున్నారు.

ఈ కాలంలో వచ్చే ఆత్మకధల్లో ఇలాటి నిజాయితీని ఊహించగలమా!

 


6, సెప్టెంబర్ 2022, మంగళవారం

చింతించి వగచిన ఏమి ఫలము? - భండారు శ్రీనివాసరావు

 

“ ఆ రోజులే వేరు. వొంట్లో యువ రక్తం సలసలా మరుగుతుండేది. మొత్తం ప్రపంచాన్ని ఒక్కమారుగా మార్చేసి నాకు నచ్చిన లోకాన్ని సృష్టించాలని తహతహ లాడుతుండేవాడిని. కానీ ఏమయింది. ప్రపంచాన్ని మార్చడం నా వల్ల కాదని తేలిపోయింది. పోనీ, ప్రపంచం సంగతి అక్కడితో వొదిలేసి నా దేశాన్ని సంస్కరించుకుంటే సరిపోలా అని అనుకున్నాను.
“ఆ ప్రయత్నం కూడా వృధా అని త్వరలోనే తెలిసిపోయింది. దాంతో దేశం గొడవ పక్కనబెట్టి మా వూరిని బాగుచేద్దామని పూనుకున్నాను.
“అయితే వూరును బాగుచేయడం అన్నది నా ఒక్కడివల్లా అయ్యే పని కాదని తెలిసిరావడానికి కూడా ఎక్కువ కాలం పట్టలేదు.
“ఇక అప్పుడు కానీ నాకు నా కుటుంబం గుర్తుకు రాలేదు. ముందు కుటుంబం బాగోగులు చూడాలనిపించింది. కానీ అప్పటికే వయసు మీద పడింది. వెనుకటి సత్తువా లేదు. మునుపటి ఓపికా లేదు.
“బోధివృక్షం లేకుండానే నాకు జ్ఞానోదయం అయింది. కళ్ళు తెరిపిళ్ళు పడ్డాయి. ముందు నన్ను నేను మార్చుకుంటే యెలా వుంటుంది అన్న ఆలోచన మొదలయింది. మొదటే ఈ పని చేసివుంటే ఎంత బాగుండేదో కదా!
“క్రమంగా నా ఆలోచనలు కొత్త రూపం తీసుకున్నాయి.
“మార్పు అనేది ముందు నాతో మొదలయివుంటే ఆ ప్రభావం నా కుటుంబం పైన పడేది. నేనూ నా కుటుంబం కలిసి మా వూరిని మార్చేవాళ్ళం. మా వూరు బాగుపడితే దానివల్ల నా దేశం బాగుపడివుండేది. మొత్తం ప్రపంచాన్ని మార్చాలని చిన్నతనంనుంచి కంటున్న నా కల ఆ క్రమంలో ఫలించి వుండేది. కానీ ఏంలాభం? శక్తియుక్తులన్నీ ఉడిగిపోయిన తరవాత కానీ తత్వం బోధపడలేదు.

5, సెప్టెంబర్ 2022, సోమవారం

ముగ్గురు గురువులు - భండారు శ్రీనివాసరావు

 (సెప్టెంబరు అయిదు- ఉపాధ్యాయ దినోత్సవం)

‘సంతః సదాభిగంతవ్యా యది నోపదిశం త్యపి

యాస్తు స్వైర కధాస్తేషాం ఉపదేశా భవంతి తాః’

మనకు పాఠాలు బోధించే గురువులు వుంటారు. చెప్పని గురుదేవులూ వుంటారు. ఇటువంటివారు ప్రత్యేకించి ఏవిధమయిన ఉపదేశాలు ఇవ్వకపోయినా వాళ్లు ఏం చెబితే అదే ఉపదేశం అవుతుందని ఈ శ్లోక తాత్పర్యం.

ఏ మంచి గురువయినా తన శిష్యుల ఎదుగుదలను కోరుకుంటాడు. ఈ క్రమంలో శిష్యుడు ఎవరయినా తనని దాటి పెరిగిపోతున్నా అసూయ  పడనివాడే ఉత్తమ గురువు. ‘నేను  పలానా అయ్యగారిదగ్గర పాఠాలు నేర్చుకున్నాను’ అని చెప్పుకోవడం శిష్యులకు గౌరవంగా  వుంటుంది. అలాగే ‘పలానా వాడున్నాడే వాడు నా దగ్గరే చదువుకున్నాడు’ అని గుర్తుచేసుకోవడం గురువుకు ఆనందంగా వుంటుంది.

గురు శిష్యుల గురించి  చెప్పుకునేటప్పుడు ఆకాశవాణి మాజీ డైరెక్టర్ డాక్టర్  పీ.ఎస్. గోపాలకృష్ణ చెప్పిన ఒక చిన్న వృత్తాంతం గుర్తుకువస్తోంది.

“ఆయన ఆ అబ్బాయికి పాఠాలు చెప్పాడు. కొన్నాళ్ళకు ఆ అబ్బాయి ఢిల్లీ సింహాసనం అధిష్టించి చక్రవర్తి అయ్యాడు. ఢిల్లీకి పాదుషా అయినా అయ్యవారికి  విద్యార్థే కదా అని ఆ అబ్బాయికి ఒక ఉత్తరం రాశారు. అందులో తాము శ్రీవారికి చిన్నతనంలో చదువు  చెప్పిన వివరాలు రాశారు. ఆ అబ్బాయి నుంచి అయ్యవారికి సమాధానం వచ్చింది.

“తమరు నాకు పనికి వచ్చే చదువు  చెప్పలేదు. అక్కరలేనివన్నీ నా తలకెక్కించారు”

ఆ అయ్యవారి పేరు ఇక్కడ అప్రస్తుతం. కానీ ఆ అబ్బాయి పేరు ఔరంగజేబు.”

మరో అయ్యవారిని గురించి చెప్పుకుందాం.

1921 వ  సంవత్సరం. అంటే వందేళ్ళ కిందటి మాట. మైసూరు విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న ఒక అయ్యవారికి కలకత్తాకు బదిలీ అయింది. ఆయనగారు మైసూరు నుంచి బయలుదేరుతుంటే ఆయన ఇంటినుంచి రైల్వే స్టేషన్ కు పెద్ద వూరేగింపు బయలుదేరింది. ఆయన ఎక్కిన బండికి గుర్రాన్ని కట్టకుండా విద్యార్ధులే రధాన్ని లాగినట్టు స్టేషను దాకా లాక్కువెళ్ళారట. ఆయన గారు ఎక్కిన రైలు బోగీని విద్యార్ధులు ఒక అందమయిన దేవాలయం మాదిరి పూలతో అలంకరించారు.”

పంతుళ్ళ చెవులకు శిష్యులు  తాటాకులు కట్టే ఈ రోజుల్లో అటువంటి సంఘటన విడ్డూరమే.

ఇంతకీ ఆ అయ్యవారు ఎవరనుకున్నారు? తదనంతర కాలంలో భారత రాష్ట్రపతి పదవిని అలంకరించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు.

ఈ రోజు సెప్టెంబర్ ఐదో తేదీ. ఆ మహానుభావుడి పేరుతొ గురువులను సంస్మరించుకుంటూ ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకునే రోజు.

అక్షరబిక్ష పెట్టి జీవితంలో ఈ స్తాయికి చేర్చిన తొలి గురువులను గుర్తుచేసుకునే రోజు.

నా చిన్నతనంలో మా ఊరిలో షెడ్యూల్ కులాలకోసం ఉసిగెవాగు అవతల ఒక కాలనీ వుండేది. అక్కడ ఒక మిషనరీ స్కూలు వుండేది.  ఊళ్ళో మరో బడి వుండేది. అందులోనే మా చదువు. స్కూలు మొత్తానికి కలిపి ఇద్దరు టీచర్లు, అప్పయ్య మాస్టారు, భద్రయ్య పంతులు గారు.  బ్లాకు బోర్డులు లేవు. విద్యార్ధులలో చాలామందికి పలకా బలపాలు ఉండేవి కావు. చుట్టూ ఫ్రేం ఉన్న బొందు పలక, బలపం, అవి పెట్టుకునే గుడ్డ సంచీ, ఇవి వుంటే వాడు అందరి దృష్టిలో స్పెషల్.

అప్పయ్య మాస్టారు నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకుని అక్షరాలు దిద్దించేవారు. అంతసేపు నాకు ఒంట్లో వణుకు. అసలు ఆయన్ని చూస్తూనే భయం. కానీ అప్పయ్య మాస్టారు కొట్టో, తిట్టో నేర్పించిన నాలుగు అక్షరాలే నాకు జీవితంలో ఒక మార్గం చూపాయి. వీడికి పొట్ట కొస్తే అక్షరం ముక్క రాదు అనే మాటలు పడకుండా కాపాడాయి. 

ఎనభై తొమ్మిది నిండి తొంభయ్యో పడిలో పడి,  ఏ రోగం రొష్టు బారినపడకుండా అనాయాస మరణానికి నోచుకున్నారు. నలుగురికి విద్యాదానం చేసిన పుణ్యం ఆయనకు ఆవిధంగా అక్కరకు వచ్చింది.  మాకు ఇంత అక్షరభిక్ష పెట్టిన మహానుభావుడు కనుకే మహానుభావులకు మాత్రమే లభించే సునాయాస మరణం ఆయనకు దక్కింది.

మరో యాదృచ్చికం. అప్పయ్యగారి మరణ వార్త గురించిన ఫోను వచ్చినప్పుడు నేను ‘రేడియో రోజులు’ మరో భాగం మొదలు పెడుతున్నాను. ఇందులో కాకతాళీయం ఏమిటంటే అప్పయ్య గారు నాకు తెలిసిన మొట్టమొదటి న్యూస్ రీడర్ అనే విషయం రాస్తున్నాను.   అదేమిటంటారా!

మాచిన్నప్పుడు గూడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారనే పంచాంగ రచయిత ఒక్కరే చందా కట్టి ఆంద్రపత్రిక దినపత్రికను  పోస్టులో తెప్పించేవారు. ఆ పేపరు  మరునాడు సాయంత్రానికి కాని మా వూరు చేరేది కాదు. అప్పయ్య మాస్టారు వూరి నడిబొడ్డున నిలబడి ఆ పత్రికలోని వార్తలను అన్నింటినీ తన కంచు కంఠంతో చదివి వినిపించేవారు. ‘అమెరికా అధ్యక్షుడిగా జాన్ ఎఫ్. కెనడీ ఎన్నిక. ఓటమి అంగీకరిస్తూ రిచర్డ్ నిక్సన్  ప్రకటన’ అంటూ ఆయన చదివే వార్తలు వింటుంటే, అచ్చు రేడియోలో వార్తలు విన్నట్టే వుండేది.

ఉపాధ్యాయ దినోత్సవంనాడు ఆయన్ని సంస్మరించుకుంటూ -    

గురుద్దేవో నమః

కింది ఫోటో: కీర్తిశేషులు శివరాజు అప్పయ్య పంతులు గారు




అడగ్గానే ఇళ్ళు ఇచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రులు


ఇంటి అద్దెలు భరించలేకపోతున్నాను, ఒక ఇల్లు ఇప్పించండి” అని అడిగాను ముఖ్యమంత్రిని. ఒకరిని కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులను. వాళ్ళూ ఇలా అడగ్గానే అలా ఇచ్చేసారు.

1975 లో బెజవాడ ఆంధ్రజ్యోతి వదిలి హైదరాబాద్ ఆలిండియా రేడియోలో చేరాను అన్నమాటే కానీ, రాజధాని నగరంలో ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే, రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి ధరఖాస్తు పెట్టుకుని, ఆ కాపీ నాటి  ముఖ్యమంత్రి జలగం వెంగళ రావు గారికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి, పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి మేముంటున్న చిక్కడపల్లి నుంచి రిక్షాలో  ఎగురుకుంటూ వెళ్ళాము. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద భవంతి. కిరాయి మాత్రం మేము చెల్లించే దానిలో నాలుగోవంతు కూడా లేదు. ‘ఆహా ఏమి అదృష్టం’ అనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తే అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తే ఇంటివాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ‘ముఖ్యమంత్రి పేషీతో వ్యవహారం కుదరదంటే కుదరద’న్నారు. నేను గట్టిగా చెప్పడంతో, ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావు గారు  అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ‘ఇల్లు వసతిగా వుంది కదా!’ అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. మొదటి ఇంటి కధ ఆ విధంగా ముగిసింది.

చంద్రబాబు నాయుడు ఉమ్మడి రాష్ట్రానికి రెండో పర్యాయం ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మనసులో

ఇంటి పురుగు తొలిచింది. ఆయన్ని కలిసి, అద్దెలు భరించడం కష్టంగా వుంది ఓ ఇల్లు ఇప్పించండి అని అడిగేశాను. ఆయన చిన్నగా నవ్వి, అదెంత భాగ్యం అన్నట్టు చూసి ఓ అధికారికి నన్నూ, నా పనీ ఒప్పచెప్పారు. ఇల్లు అంటే నా ఉద్దేశ్యం గవర్నమెంటు క్వార్టర్ అని. అదయితే ఎంచక్కా  తక్కువ అద్దె కట్టుకుంటూ కాలక్షేపం చేయొచ్చని నా ఆలోచన.  ఆ అధికారికి నా తరహా నచ్చలేదు. క్వార్టర్ అయితే రేపు రిటైర్ కాగానే ఖాళీ చేసిపోవాలి అన్నాడు. నేనన్నాను. 'అదే మంచిది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఈ ఒక్క మినహాయింపు ఇచ్చి క్వార్టర్ అలాట్ చేస్తే నాకూ ఇబ్బంది వుండదు, ముఖ్యమంత్రి గారికి కూడా మాట రాదు. నాకు క్వార్టరే కావాలి అన్నాను. పిచ్చి బ్రాహ్మడిలాగున్నావే అన్నారాయన వెక్కిరింతగా. వాతావరణం చల్లబరచడానికి, ‘నిజమే, క్వార్టర్ సరిపోదు, ఫుల్లు కావాలి’ అన్నాను. ఆయన పెద్దగా నవ్వేశాడు.

ఎర్రమంజిల్ కాలనీలో ఐ.జే. 2 క్వార్టర్ నా పేరు మీద అలాట్ చేస్తూ మర్నాటికల్లా  ఆర్డర్ వచ్చింది.

2005 డిసెంబరులో దూరదర్సన్ నుంచి  రిటైర్ అయ్యేదాకా తక్కువ అద్దె కట్టుకుంటూ, అటూ ఇటూ ఐ.ఏ.ఎస్. అధికారులు, ఐ.పి.ఎస్. అధికారులు వుండే ఆ  కాలనీలో, సెకండ్ క్లాస్ టిక్కెట్టుతో ఫస్ట్ క్లాస్ బోగీలో ప్రయాణం చేస్తున్న ఫీలింగుతో సందేహిస్తూ కాలం  గడిపాము.

మొత్తం కాలనీలో అధికారిక వాహనం కానీ, సొంత కారు కానీ లేని ఇల్లు మాదే. కారు షెడ్డు ఖాళీగా వుండేది.

(05-09-2022)