3, ఆగస్టు 2022, బుధవారం

తెలంగాణకి అప్పుల తిప్పలు తప్పవా తప్పవా?

కాంగ్రెస్ లో రాజగోపాల్ రెడ్డి రగడ

ఎవరి హద్దులు వాళ్ళే తెలుసుకోవాలి

భారత స్వాతంత్ర అమృతోత్సవం

 ఆకాశవాణి, హైదరాబాదు కేంద్రం

భారత స్వాతంత్రోత్సవ అమృత ఘడియల్లో శ్రోతలందరికి ఒక ప్రముఖ వ్యక్తిని పరిచయం చేయడం ఆనందంగా వుంది.
ఇప్పుడు ఆయన మన స్టుడియోలోనే వున్నారు. పేరు బ్రిగేడియర్ ఎస్. శ్రీరాములు. భారత సైన్యంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకుని ప్రస్తుతం విశ్రాంత జీవనం గడుపుతున్నారు.
బ్రిగేడియర్ శ్రీరాములు ఉమ్మడి తెలుగు రాష్ట్రంలోని కృష్ణాజిల్లాలో జన్మించారు. విజయవాడ ఎస్సారార్ కాలేజీలో చదివారు. గ్రాడ్యుయేషన్ తరువాత సైన్యంలో అధికారిగా చేరారు. బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారి తీసిన 1971 ఇండో పాక్ యుద్ధంలో భారత సైన్యం తరపున పాల్గొన్నారు. మౌంటెన్ ఆర్టిలరీ బ్రిగేడ్ కు నాయకత్వం వహిస్తూ, 2003లో పదవీ విరమణ చేశారు.
ఈ సుదీర్ఘమైన సైనిక జీవితంలో బ్రిగేడియర్ శ్రీరాములు అనేక ప్రశంసలు, సైనిక గౌరవాలు, పురస్కారాలు అందుకున్నారు.
ఆయన మిలిటరీ అనుభవాలు గురించి, సైనిక జీవితంలో ఎదురైన కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు గురించి బ్రిగేడియర్ శ్రీరాములు గారినే అడిగి తెలుసుకుందాం.
భండారు శ్రీనివాసరావు:
బ్రిగేడియర్ శ్రీరాములు గారు, తెలుగు రాష్ట్రాల నుంచి సైన్యంలో చేరేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంటుందనే అపోహ ఒకటి ప్రచారంలో వుంది. మరి ఈ నేపధ్యంలో, కాలేజి చదువు పూర్తి చేసుకోగానే వేరే ఉద్యోగాలకోసం ప్రయత్నించకుండా నేరుగా సైన్యంలో చేరాలనే ఉద్దేశ్యం ఎందుకు కలిగింది? మీ కుటుంబంలో కూడా ఎవరికీ మిలిటరీ అనుభవం వున్నట్టు లేదు.
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
మీరు అనేది నిజమే. మా కుటుంబంలోనే కాదు మా ఊరి నుంచి కూడా ఎవరూ ఆర్మీ లో చేరాలని ఆలోచించే వారు కాదు. ఐతే 1962 లో చైనా యుద్ధం జరిగే సమయానికి నేను ఉంగుటూరులో స్కూల్లో చదువుకుంటున్నాను. రక్షణనిధి చందా పోగు చేయడం కోసం స్కూలు పిల్లలని వరిపొలాల్లో కోతలకు పంపారు. మేమందరం చాల ఉత్సాహంగా కోతలు కోస్తుంటే ఓ రైతు నన్ను చూసి, 'అంత సరదాగా పని చేస్తున్నావు ఆర్మీ లో చేరి యుద్ధం చేస్తావా ?' అని సరదాగానే అడిగారు. నామనసులో ఆ మాట నాటుకుపోయింది. ఆ తరవాత 1965 లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగే సమాయానికి నేను విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజీ లో చదువుతున్నాను. ఆ సమయంలో రొజూ రేడియోలో యుద్ధం వార్తలు వింటూ ఉండేవాళ్ళం. అప్పుడు నా మనసులో ఆర్మీ లో చేరాలనే ఆలోచన మరింత బలపడింది. అదే లక్ష్యంగా పెట్టుకుని డిగ్రీ చదువుతూనే ఆర్మీ సెలెక్షన్స్ కి ప్రిపేర్ అయ్యాను. 'యద్భావం తద్భవతి' అన్నట్లు డిగ్రీ అవగానే ఆర్మీ ఇంటర్వ్యూ కి వెళ్లడం, సెలెక్ట్ అవడం జరిగిపోయాయి. ఆలా లక్ష్యం, శ్రమ, అదృష్టం అన్నీ కలిసొచ్చాయి.
భండారు శ్రీనివాసరావు:
ప్రస్తుతం భారత జాతి యావత్తు ఆజాదీగా అమృత మహోత్సవాలు జరుపుకుంటున్న తరుణం. మన స్వాతంత్రం కూడా బ్రిటిష్ వారితో యుద్ధాలు చేసి సాధించుకున్నది కాదు. మరి ఇప్పుడు జరుగుతున్న ఈ ఉత్సవాలను ఒక సైనికాధికారిగా ఎలా అన్వయించి చెబుతారు?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
అమృత మథనం కథ మనందరికీ తెలిసిందే. దేవతలూ రాక్షసులూ మేరు పర్వతాన్ని,వాసుకి అనే సర్పాన్ని తాడుగా ఉపయోగించి సుదీర్ఘ కాలం క్షీర సాగర మథనం చేసారు. ఒకదాని తరవాత ఒకటిగా మంచి వస్తువులు, చెడ్డ వస్తువులు ఉద్భవించాయి. హాలాహలాన్ని నిర్మూలించడానికి దేవతలు శివుని సహాయం కూడా తీసుకోవలసి వచ్చింది.
స్వతంత్ర భారతదేశ చరిత్ర కూడా అమృత మథనం లాగే సాగుతోంది. ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ వాసుకి మాదిరిగా తాడులాగా పని చేసి, మథనం ఆగకుండా చూస్తూ, మంచి ఫలితాలు వస్తూనే ఉండేలా, చెడ్డ వస్తువులొస్తే వాటిని నిర్మూలించడానికి పనిచేసే ప్రమథ గణాల వలె పని చేస్తున్నాయి. ఈ బ్రహ్మయజ్ఞంలో, తాడులో ఒక చిన్న పోగులా నా జీవితం సాగిపోయింది. మహాకవి శ్రీ శ్రీ గారు చెప్పినట్లు 'నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను' . అది నా అదృష్టం.
భండారు శ్రీనివాసరావు:
బ్రిగేడియర్! ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న స్వాతంత్ర అమృత మధనంలో సైనిక దళాల పాత్ర ఏమిటి అని అంటే ఏం చెబుతారు?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
ఏ యజ్ఞానికైనా రక్షణ అవసరం. విశ్వామిత్రుడంతటి మహర్షి తన యజ్ఞానికి శ్రీ రాముల వారి సహాయం తీసుకున్నారు. అలాగే స్వతంత్ర భారత అమృత మధన యజ్ఞానికి ఇండియన్ ఆర్మీ ఎల్లకాలం రక్షణ కల్పించింది, కల్పిస్తుంది కూడా.
విరోధి దేశాలే కాదు, దేశంలోపల కూడా చాలా దేశ విరోధ శక్తులు పని చేస్తున్నాయని అందరికీ తెలుసు. విరోధి దేశాలతో యుధ్ధాలే కాకుండా అంతర్విరోధ శక్తులతో కూడా సైన్యం ఎన్నోసార్లు తలపడే అవసరాలొచ్చాయి. స్వాతంత్య్రం వచ్చిన రొజు నుంచి ఈ రొజు వరకు సైన్యం చేసిన సేవలు ఒకసారి గుర్తు చేసుకుందాం.
1 . యుద్ధాలు. 1947 - 48 జమ్మూ కాశ్మీర్ యుద్ధం; 1962 - చైనా యుద్ధం; 1965 - పాకిస్తాన్ తో యుద్ధం; 1967 - సిక్కింలో చైనా తో యుద్ధం; 1971 - పాకిస్తాన్ తో యుద్ధం, 1999 - కార్గిల్ యుద్ధం.
2 . అన్యాక్రాంతమైన భారత దేశ భూభాగాల స్వతంత్రీకరణ. హైదరాబాద్ (1948) ; దాద్రా, నగర్ హవేలీ (1954 ) ; నాగాల్యాండ్ (1955 -56 ); గోవా, డియూ, డామన్ (1961)
3. తిరుగుబాటు దారులతో సంఘర్షణ. నాగాలాండ్, అస్సాం, మణిపూర్, మిజోరాం, జమ్మూ & కాశ్మీర్ . జమ్మూ & కాశ్మీర్ లో 1987 నుంచి ఈ రొజు వరకు సాగుతూనే ఉన్నాయి
4 . సరిహద్దుల రక్షణ - 365 రోజులూ, 24 గంటలూ దాదాపు 15000 కిలోమీటర్ల దేశ సరిహద్దుల నిరంతర రక్షణ బాధ్యత సైన్యానిదే. - ఇందులో 740 కిలోమీటర్ల లైన్ అఫ్ కంట్రోల్ పాకిస్తాన్ తో- అడుగడుగునా టెర్రరిస్టులు చొచ్ఛుకుని వచ్చే ప్రమాదం, 70 కిలోమీటర్ల, ప్రపంచం లోకల్లా ఎత్తైన రణభూమి సియాచిన్ లో మైనస్ 50 డిగ్రీల చలిలో ఐస్ మీద డ్యూటీ, దాదాపు 4000 కిలోమీటర్ల చైనా బోర్డర్ రక్షణ, టెర్రరిస్టులు, స్మగ్లర్లు, రెఫ్యూజీలు రాకుండా ఆపడం - ఇవన్నీ సైన్యం బాధ్యతలే కదా !
5 . శ్రీలంక 1987 - 89
6 . ఐక్య రాజ్య సమితి నియమిత శాంతి రక్షణ చర్యలు . కొరియా (1950 ) మొదలు ఈ రొజు వరకు చాలా దేశాలలో భారత సైన్యం పని చేసింది, చేస్తోంది. చాలా వరకు ఇవి కూడా యుద్ధాల వంటివే.
7 . మిత్రులైన చిన్న దేశాల రక్షణ . మాల్దీవ్స్ (1988 ) .
8 . విదేశాలలో చిక్కుకుపోయిన భారతీయులని క్షేమంగా దేశంలోకి తీసుకు రావడం . 1990 లో లక్షాయాభై వేలమందిని క్షేమం గా ఇరాక్ నుంచి తీసుకు రావడం ఒక రికార్డు. అప్పటినించి ఈ రొజు వరకు వేర్వేరు దేశాలలో చిక్కుకుపోయిన భారతీయులకు సైన్యం రక్షణ కల్పిస్తోంది . ఇటీవల యుక్రెయిన్ నుంచి మన విద్యార్థులని క్షేమంగా తీసుకు రావడం ఇంకో ఉదాహరణ
9. ఉపద్రవాలు సంభవించినప్పుడు ప్రజా రక్షణ. సునామి, భూకంపాలు, వరదలు, అంత దాకా ఎందుకు బోరు బావిలో పడినా సరే, ఆర్మీ నిస్సంకోచం గా సహాయం చేస్తుంది.
10 . దేశ నిర్మాణం. సరిహద్దు ప్రాంతాలలో రోడ్లు, వంతెనలు నిర్మించడం, చిన్న తరహా హైడెల్ ప్రాజెక్ట్స్ , టెర్రరిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో స్కూల్స్ నడిపించడం వరకు సైన్యం సంతోషం గా చేస్తున్నది.
11 . స్పోర్ట్స్ . సైన్యం బాధ్యత తీసుకున్న తరవాత మన దేశ ఆటగాళ్లు ఒలింపిక్స్ లో స్వర్ణ, రజత, కాంస్య మెడల్స్ సాధించడం మొదలైంది
భండారు శ్రీనివాసరావు:
ఆర్మీ అనగానే అదేదో మనకు సంబంధం లేని విషయం అనే భావన ఇంకా చాలామందిలో వుంది. వెనక కాశీ పోయిన వాడు, కాటికి పోయిన వాడు ఒకటే అనే నానుడి వుండేది. అలాగే సైన్యంలో చేరే వారి గురించి ఇలాగే చెప్పుకునేవారు. అందులో చేరడం అంటే ఇక ఇంటికి తిరిగిరాడు వంటి అపోహల నడుమ, మీరు సుదీర్ఘ కాలం సైన్యంలో పనిచేశారు. పిల్లను ఇవ్వడానికి కూడా సంక్షేపించే తలితండ్రుల కాలంలో మీరు ఎలా నెగ్గుకు వచ్చారు. మీ విజయాల్లో మీ శ్రీమతి గారి పాత్ర ఏమిటి? మిలిటరీ జీవితం ఎలా వుండేది! ఆ వివరాలు కొన్ని మా శ్రోతలతో పంచుకుంటారా?
బ్రిగేడియర్ శ్రీరాములు జవాబు:
ఆర్మీలో చేరడం ఎలా జరిగిందో మీకు చెప్పాను. చేరిన తరువాత ట్రైనింగ్ లో కొంత వరకు ధైర్యం, స్థైర్యం, యుద్ధ విద్యలు నేర్చుకుంటాం. నా అదృష్టమేమంటే చేరిన కొన్ని నెలలలోనే యుద్ధంలో పని చేసే అవకాశం దొరికింది. పాకిస్తాన్ విమానాల బాంబులు, గన్స్ నుంచి తూటాలు, అన్నీ అనుభవించాను . మొదట్లో కొంచెం భయం వేసిన మాట నిజమే. కానీ త్వర లోనే అలవాటై పోయింది. 'నా పేరు రాసి ఉన్న బులెట్ వచ్చే వరకు నాకేం కాదు' అన్న ధైర్యం ఈ రొజు వరకు నన్ను నిర్భయం గా ఉంచుతోంది.
నాకంటే ధైర్యం, స్థైర్యం, నా శ్రీమతి ప్రేమ కుమారి లో జన్మ సిద్ధం గా ఉన్నాయి. తణుకులో పుట్టి పెరిగిన తెలుగు మహిళకి అవి ఎలా వచ్చాయో నాకు తెలియదు. యుధ్ధాలల్లో డేంజర్ అని తెలిసీ నన్ను ఎందుకు ఎంచుకుందో అది కూడా నాకు తెలీదు. లేకపోతే 'కన్యా వరయతే రూపం' అన్నట్లు నేను స్మార్ట్ గా కనిపించానని సరదా పడిందో,నా అదృష్టం అంతే. వివాహమైన రొజు నుంచి ఈరోజు వరకు నా కర్తవ్యాన్ని సపోర్ట్ చేస్తూ వస్తోంది.
సైన్యంలో మాకు సపోర్ట్ ఉండేది కానీ సోల్జర్ ఫామిలీస్ కి, ముఖ్యం గా భర్తలు బోర్డర్ లో ఉన్నప్పుడు ఒంటరి గా ఉండే మహిళలకి ఏ రకమైన సపోర్ట్ ఉండేది కాదు. పైగా మా రోజుల్లో ఇళ్లల్లో టెలీఫోన్స్ లేవు, మొబైల్ ఫోన్ అప్పటికి రాలేదు. ఒక చిన్న అనుభవం చెపుతాను.
1988 లో నేను కాశ్మీర్ లో, భార్యా పిల్లలూ హైద్రాబాద్ లో ఉన్నాం. మా అబ్బాయి కి ఏడేళ్లు, అమ్మాయికి ఐదేళ్లు. ఒక రోజున మా అమ్మాయి లాల్ బజార్ దగ్గర స్కూటర్ కింద పడింది. బాగా దెబ్బలు తగిలాయి. నాకు ఈ ఆక్సిడెంట్ గురించి తెలిపే సౌకర్యం లేదు. ఇన్లాండ్ లెటర్ రాస్తే అది మా యూనిట్ చేరడానికి 20 రోజులు పట్టింది. నేను యూనిట్ నుంచి 200 కి మీ దూరంలో ఒక పర్వతం పైన డ్యూటీ లో ఉన్న్నాను. సో, నాకు ఆ ఉత్తరం చేరడానికి ఇంకో 15 రోజులు పట్టింది. ఆ తరవాత లీవ్ దొరకలేదు. పాపని చూడడానికి 4 నెలల వరకు రాలేక పోయాను. ఈ రొజుకి కూడా అది గుర్తొస్తే బాధగా ఉంటుంది కానీ ఏం చేస్తాం?
ఇలాంటి అనుభవాలు ప్రతి సైనికుడికి తప్పవు. అయితే 32 సంవత్సరాలు సేవ, సాధించిన విజయాలు, చేసిన సేవా కార్యాలు తలుచుకుంటే నాకే కాదు, నా భార్య, పిల్లలు కూడా గర్వంగా ఫీల్ అవుతారు. సర్వీస్ లో దాదాపు 13 సంవత్సరాలు టెర్రరిస్టులని వేటాడుతూ గడిపాను. రిటైర్ అయిన రొజు గూడా ఒక టెర్రరిస్ట్ నా మీదికి ఫైర్ చేసాడు. ఆ బులెట్ మీద నా పేరు లేదు గనక నేను మీ ముందున్నాను. ఇంత సేవచేసే అవకాశం దొరకటం అదృష్టం కాదా?
ఇది నా అమృత మంథన యాత్ర. నా ముందు, నా తరవాత భారత సైన్యం సేవ నిరంతరం సాగుతుంది, అమృతం ఉద్భవిస్తూనే ఉంటుంది
నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను ( శ్రీ శ్రీ )
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
మీరింతవరకు బ్రిగేడియర్ శ్రీరాములు గారితో ఇంటర్వ్యూ విన్నారు. భారత స్వాతంత్ర అమృతోత్సవాల సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ కార్యక్రమాన్ని సమర్పించింది.



ప్రతి ఊళ్ళో, ప్రతి గుళ్ళో నాదస్వరం

 (ఆగస్టు మూడు పినాకపాణిగారి జయంతి)

డాక్టర్లకే పాఠాలు చెప్పే డాక్టర్. కర్నాటక సంగీతాన్ని ఆపోసన పట్టిన ఘనాపాఠీలకే గుగ్గురువు. బాడీ బిల్డర్. వెయిట్ లిఫ్టర్. ఇలా ఒక్కొక్క రంగంలో నిష్ణాతులయిన వాళ్లు కానవస్తూనే వుంటారు. అయితే వీటన్నింటినీ పుణికి పుచ్చుకుని అందరిచేతా ఔరా అనిపించుకుంటూ నిండు నూరేళ్ళ జీవితాన్ని గడిపిన అరుదయిన వ్యక్తే డాక్టర్ శ్రీపాద పినాకపాణి. బహుముఖ ప్రజ్ఞాశాలి. తెలుగుగడ్డ గర్వించదగిన పదహారణాల తెలుగుబిడ్డ.

చాలా ఏళ్ళ క్రితం సంగతులు.

జంటనగరాలలో రెండు సంగీత కళాశాలలు వున్నాయి. ఒకటి సికింద్రాబాద్ లో, రెండోది హైదరాబాద్ లో. సికింద్రాబాద్ కాలేజీకి నూకల చిన్న సత్యనారాయణ ప్రిన్సిపాల్ అయితే, హైదరాబాద్ కాలేజీకి హిందుస్తానీ విద్వాంసులు దంతాలే ప్రిన్సిపాల్. అప్పట్లో రెండు కాలేజీలు కలసి రవీంద్రభారతిలో త్యాగరాజ స్వామి ఉత్సవాలు నిర్వహించేవారు. ఉదయం నుంచి ప్రసిద్ధ విద్వాంసుల కచేరీలు మొదలయ్యేవి. ఇక రోజంతా అక్కడే గడపడం. పక్కనే వున్న గోపి హోటల్లో టిఫినూ, భోజనమున్నూ.

ఈ ఉత్సవాల్లో ఓ రోజు సంక్రాంతి వచ్చింది. ఆవేళ ఉదయం పదకొండు గంటలకు కోటి శ్రీ కృష్ణదేవరాయ ఆడిటోరియం లో పినాకపాణి గారి సోదాహరణ ప్రసంగం, కర్ణాటక సంగీతంలో నెరవు (అరవంలో నెరవల్) స్వరకల్పన ఈ రెండింటిపై.  ఆ రోజు హాజరు కాని సంగీత అభిమానులది దురదృష్టమనే చెప్పాలి. నాలుగు గంటలకు పైగా పాణి గారు అద్భుతమైన ప్రసంగం చేసారు. కళ్యాణి రాగంలో ‘మది దేహి’ అనే కీర్తనలో ‘పతిత పావన’ అనే చోట నెరవు, స్వరకల్పన గురించి. నిజంగా అమ్మవారు ప్రత్యక్షమైన అనుభూతి కలిగింది అందరికి. పండగ విందు అక్కడే దొరికింది. ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ పినాక పాణి మీద కవర్ పేజి కధనం ప్రచురించింది. జి ఎన్ ఎస్ రాఘవన్ గారు రాసారు. ఆయన ఆకాశవాణి వార్తా విభాగానికి డైరెక్టర్ గా పని చేసారు.  రాఘవన్ కు పినాకపాణి సంగీతం అంటే అమిత ఇష్టం.

మ్యూజిక్ అకాడెమి పినాక పాణి గారిని ‘సంగీత కళానిధి’ బిరుదుతో సత్కరించింది. భారత ప్రభుత్వం ‘పద్మ విభూషణ్’ పురస్కారంతో గౌరవించింది. పినాక పాణి గారికి రావలసిన సత్కారాలన్నీ వచ్చాయి. దీనితో పాటు భగవదనుగ్రహం కూడా. నూరేళ్ళు పూర్ణాయుర్దాయం లభించింది. నేదునూరి, నూకల, వోలేటి, గోపాలరత్నం వంటి శిష్యులు, మల్లాది సూరిబాబు, శ్రీరామ్, రవి కుమార్ వంటి ప్రశిష్యులు ఆయన బాణీ సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఇంతకన్న కావల్సినదేముంటుంది ? 1990 లో ఆయనకు తొంభయి ఏళ్ళు పూర్తయిన సందర్భంలో కర్నూలులో కొంత మంది విద్వాంసులు వెళ్లి ఆయనకు పాదపూజ చేసారు. ఆయన పాడిన ఓ కచేరి సీడీగా తెచ్చారు.

పినాకపాణి గారికి కొన్ని నిర్దిష్టమయిన ప్రమాణాలు వున్నాయని సంగీత ప్రియుడు, రేడియో, దూరదర్సన్ లలో  న్యూస్ డైరెక్టర్ గా పనిచేసిన  ఆర్వీవీ కృష్ణారావు చెప్పారు. వాటితో రాజీపడేవారు కారు అనడానికి ఓ ఉదాహరణ జోడించారు.

‘బెజవాడలో మా త్యాగరాజ సంగీత కళా సమితి తరఫున ఆయన్ని 1986 లో ఘనంగా సత్కరించాము. అప్పుడు ఆయన ధర్మపురి రామమూర్తితో కలసి కర్నూలు నుంచి బస్సులో వచ్చారు. సన్మానం అయిన తర్వాత సుధారఘునాథన్ కచేరి పెట్టాము. చివరివరకు కూర్చున్నారు. మర్నాడు కూడా వున్నారు. ఆ రోజు మరో ప్రసిద్ధ విద్వాంసులు మహారాజపురం సంతానం కచేరి. కచేరీకి రమ్మనమని పిలిచాం. రానని మొండి కేసారు. ఎందుకని అడుగుతే ‘వాడు డబ్బు మనిషి. విద్వత్తుని నిర్మొహమాటంగా అమ్ముకుంటున్నాడు. వాడు ఎంత గొప్పగా పాడినా అనవసరం’ అని కృష్ణారావు  అన్నారు.

ఇక సంగీతానికి వస్తే ‘అసలయిన సంగీతం కావేరి నది వొడ్డున వుంది’ అనేది పినాక పాణి గారి అభిప్రాయం. అందుకనే కాబోలు ‘పాణి గారిది తంజావూరు బాణీ’ అంటారు. ‘మీ గురువు ఎవర’ని అడిగితే ‘నా తల్లి’ అని చెపుతూ వుంటారు. చిన్నప్పుడు తల్లి పాడే తరంగాలు, ఆధ్యాత్మ రామాయణ కీర్తనలే, డాక్టర్ అయిన తనని సంగీతం వయిపు లాక్కుని వెళ్లాయని పాణి గారు చెపుతూ వుంటారు. సంగీతం ఆంధ్రదేశంలో వ్యాప్తి చెందాలంటే ఒకే ఒక సూత్రం ఉందంటారు పాణిగారు. ప్రతి వూళ్ళోని  దేవాలయంలో ప్రాతః కాలంలో నాదస్వర  వాయిద్యం వినిపించాలన్నది ఆయన కోరిక. నాదస్వరానికి మించింది మరోటి లేదన్నది ఆయన విశ్వాసం. ఉదయం పూట నాదస్వరం వింటే సంగీతంపై అభిమానం కలుగుతుందని,  అప్పుడే తెలుగునాట కర్నాటక సంగీతం వైభవంగా పరిఢవిల్లుతుందని అనేవారు.

శతాయుష్మాన్ భవ’ అని దీవిస్తారు. కోటికి వొకరికి  కూడా లభ్యంకాని ఆ అదృష్టం పినాకపాణి గారికి భగవంతుడు ప్రసాదించాడు. దానితో పాటే మనందరికీ మరో వరం అనుగ్రహించాడు. అదేమిటంటే ఆయనకు సమకాలికులుగా కొన్నేళ్ళు మనగలిగిన మహద్భాగ్యం.



(03-08-2022)

 

 

విందామయా నరుడ విందామయా - భండారు శ్రీనివాస రావు

 

చిన్నప్పుడు చదివిన ముళ్ళపూడి వారి జోక్ గుర్తొస్తోంది.

"పెళ్ళయిన కొత్తల్లో పెళ్ళాం మాట మొగుడు వింటాడట.

తరవాత్తరవాత - మొగుడి మాట పెళ్ళాం వింటుందట.

పొతే, ఆ తరవాత మాత్రం - ఆ ఇద్దరి మాటలు ఇరుగూ పొరుగూ వింటారట."

ఈ వినడం అన్నది చెవికి సంబంధించిన విషయం. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తే పోలా - అనే చెవలాయిలు- వినదగునెవ్వరు చెప్పిన అని- ఎవరేది చెప్పినా చెవులు రెండూ వొగ్గించి, రిక్కించి మరీ వింటారు.

కొందరు భార్యలు - " నా (మా) మొగుడు నా (మా) మాట వింటాడు " అన్న తృప్తిలో అన్ని అసంతృప్తులు మరచిపోతుంటారు. మగవాళ్ళు ఒక అడుగు ముందుకు వేసి, మాట వినే పెళ్ళాం దొరికిందని బయట చెప్పుకుంటూ, మురిసి ముక్కచెక్కలవుతూ మగధీరులమని మీసం మెలేస్తుంటారు.

వినికిడి సమస్య అంటూ లేకపోతె, ఈ వినకపోవడం అన్న ప్రసక్తే వుండదు. ఆ సమస్య వుంటే ఈ వినే సమస్యకు తావుండదు. ఎంచక్కా, ఎవరేం చెబుతున్నా వింటున్న ఫోజు పెట్టి- చెప్పేవాళ్ళ నోటి దురద వొదిలించవచ్చు.

విని, తలాడించే అలవాటు మగవాళ్ళలో ముఖ్యంగా పెళ్ళయిన వాళ్లలో ఎక్కువన్న థియరీ ఒకటుంది. ఈ బాపతు మగాళ్ళు ఆ బాపతు అపప్రధ వొదిలించుకోవడానికి ఆదర్శ పురుషుల అవతారం ఎత్తుతుంటారు. " భార్య మాట వింటే తప్పేమిటి? ఆవిడా మనలాంటి మనిషే కదా." అంటూ తమకి తాము సర్ది చెప్పుకుంటారు.

కాగా మరో రకం మగాళ్ళు- తమ మగాడితనాన్ని - వేరే రకంగా ప్రదర్శిస్తుంటారు.

" నన్నడిగితే అసలు మగాళ్ళ మాటల్ని ఆడవాళ్ళు వినకపోవడమే కాదు, ఎదిరించమని కూడా చెబుతాను. నా విషయమే తీసుకోండి. మామూలుగా మొగుళ్ళు రాగానే భార్యలు లేచినిలబడడం ఆనవాయితీ కదా. మా ఇంట్లో అలా కాదు. నేను బయట నుంచి రాగానే మా ఆవిడ లేచి నిలబడబోతుంది. పరవాలేదు కూర్చో అంటాను. నా మాట వినొద్దన్నది మా ఇంట్లో నా రూలు కాబట్టి లేచి నిలబడుతుంది. చూసారా! అదీ నేను నా భార్య కిస్తున్న స్వేఛ్చ." అంటుంటారు ఈ కోవలోకి వచ్చే మొగుళ్ళు.

బొత్తిగా మాట వినని జనం -జనాభాలో ఎక్కువ. వీళ్ళని 'సీతయ్యలు' అంటారని కూడా ఈ మధ్యనే తెలిసింది - ఓ సినిమా పుణ్యమా అని.

పొతే,వినడం వినకపోవడం అన్న రూట్లో ముందుకుపోయే పని కాసేపు పక్కనపెడదాం.

హైదరాబాద్ ఆలిండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసిన శ్రీ పీ ఎస్ గోపాల కృష్ణ -'విన్నవింత' అనే శీర్షికతో రేడియో లో ఒక కార్యక్రమం కొన్నాళ్ళు నడిపారు. విన్న వింతలను శ్రోతలతో పంచుకోవడం రచయిత ఉద్దేశ్యం. అయితే వినేవారికి పెద్దపీట వేసే పెద్ద మనసు వున్నవాడు కనుక, విన్నవించుకోవడం అనే అర్థంతో దానికి "విన్నవింత" అని పేరు పెట్టారు.

మా బోటి రేడియోలో పనిచేసిన వాళ్లకి వినే వాళ్ళే 'దేవుళ్ళు' కాబట్టి , పొద్దునపూట వచ్చే ఆ ప్రోగ్రాం వాళ్ళకో 'నివేదన' గా భావించే వాళ్ళం. ఆయన చెప్పే వన్నీ మంచి విషయాలే కాబట్టి , ఆ రోజుల్లో శ్రోతలు కూడా మంచి సంగతులు వినే బాపతు కాబట్టి- ఆయన కూడా రకరకాల పనికొచ్చే కబుర్లతో దాన్ని తీర్చిదిద్దేవారు.(ఇన్ని కా'బట్టీలు' అవసరమా అంటే- ఒకటికి రెండుసార్లు నొక్కి చెప్పకపోతే రేడియో వాళ్లకి తెలుగు రాదు అని అపోహపడే ప్రమాదం సయితం లేకపోనూ లేదు) . శ్రోతలు కూడా 'రేడియోలోచెప్పడమేమిటి? మనం వినడమేమిటి?' అని భేషజాలకు పోకుండా బుద్దిగా వినేవారు. ఆ విధంగా చెప్పేవారికి వినేవారు, వినేవారికి చెప్పేవారు లేరనే కరువు లేకుండా పోయింది. ఆ మాటకు వస్తే ఆ రోజుల్లో రేడియోలో ఇలాంటి చక్కటి కార్యక్రమాలు ఎన్నో వినేవాళ్ళం అని గుర్తు చేసుకునే ఆనాటి శ్రోతలు ఈ రోజుల్లో కూడా తారసపడడం కద్దు.

మళ్ళీ అసలు సంగతికొస్తే-

'వినంగానే సరిపోదు- విన్నది ఆచరించాలనీ - అప్పుడే విన్నదానికి సార్ధకత' అనే వాళ్ళున్నారు.

'ఒరేయ్ కన్నా! మోటార్ సైకిల్ పై అంత స్పీడ్ గా వెళ్లకురా!' అని తండ్రి అంటే- పిల్లాడు విన్నట్టుగా తలాడిస్తే - నిజానికి అది వినడం కిందికి లెక్క రాదు.

విని పాటించినప్పుడే - 'రాముడు మంచి బాలుడు, తలిదండ్రుల మాట జవదాటడు' అని కన్నవాళ్ళు - వినే వాళ్లకు చెప్పుకునే వీలుంటుంది.

వినడంలో ఇంత విషయం వుంది కాబట్టే- నోములు, వ్రతాలు చేసేటప్పుడు వ్రత కధలు విన్నవాళ్ళకు కూడా 'వ్రత ఫలం' లో భాగం కల్పించారని - సూతుడు శౌనకాది మునులకు చెప్పగా-అది విన్నవాళ్ళలో ఒకడు తెలియచేయడమైనదని సర్వజనులకు ఇందుమూలముగా తెలియపరచడమైనది.

NOTE: Courtesy Image Owner