23, జులై 2022, శనివారం

“ట” మాయమైపోయింది – భండారు శ్రీనివాసరావు


నాలుగేళ్ల క్రితం ఒక రోజు.
AP 24 X 7 తెలుగు న్యూస్ ఛానల్ లో ఓ సోమవారం ఉదయం Morning Debate With Venkata Krishna చర్చాకార్యక్రమంలో, రాజకీయ నాయకులు మాట మార్చడాలు, ప్రత్యేక హోదా తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. గుర్తున్నంతవరకు నేను చెప్పిన విషయాల్లో కొన్ని: (సరిగ్గా ఇలాగే అని కాదు, ఓ మోస్తరుగా ఇలాగే)

“తెలుగు అక్షరమాలలో ‘ట’ అనే అక్షరం మాయమయిపోయినట్టుంది. అదివరకు ఏవైనా విన్నవి, అనుమానం వున్నవి చెప్పేటప్పుడు ‘అన్నాడుట’, ‘చెప్పాడుట’ అని అనేవారు. ఇప్పుడు అలాకాదు, ఎదురుగా వుండి తన చెవులతో విన్నట్టు, ‘అలా అన్నాడు, ఇలా చెప్పాడు’ అనేస్తున్నారు. ‘వెనక ఎన్టీ రామారావు గారు, కాంగ్రెస్ వాళ్ళు రాజ్యసభ సీటు అడిగితే కాదన్నారన్న కినుకతో ఏకంగా తెలుగుదేశం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టాడుట తెలుసా’ అని చెప్పుకునేవారు. ఇప్పుడు అలా కాదు, ‘ట’ తీసేసి మాట్లాడుతున్నారు. దీనివల్ల మీడియా పని కూడా తేలిక అయింది. ప్రయాస పడి, సోర్సులను పట్టుకుని వార్తను కన్ఫర్మ్ చేసుకోవాల్సిన పని లేదు. అసలు వాళ్ళే నేరుగా మీడియాకు, అదీ కెమెరాల ముందు నిలబడిమరీ చెప్పేస్తున్నారు. ‘హోదా కావాలని చెప్పగలరు, అదే నోటితో హోదా కావాలని ఎప్పుడు అన్నామో చెప్పండి’ అంటూ మీడియానే ఎదురు ప్రశ్న వేయగలరు. రాజ్యసభ సీటు ఇస్తానని మోసం చేశారని ఎవరో అన్నట్టు ఇంకెవరో చెప్పడం కాదాయె. స్వయంగా నాయకులే చెబుతున్నారు. టీవీ చర్చల్లో తమ నాయకుల వ్యాఖ్యలని సమర్ధించలేక ఇబ్బంది పడే పార్టీ ప్రతినిధులను మనం రోజూ చూస్తూనే వున్నాం.
“నేను మూడేళ్ళ నుంచీ మీడియా చర్చల్లో ఒకటే చెబుతూ వస్తున్నాను. హోదా విషయంలో వైఖరులు మార్చి మాట్లాడకండి. ఇప్పటివరకు అది భావోద్వేగ అంశం కాలేదు. ఒకసారి అలా రూపం మార్చుకుంటే దాన్ని ఆపడం ఎవరి తరమూ కాదు. ఉదాహరణ తెలంగాణా ఉద్యమం. లక్ష కోట్ల ప్యాకేజీ ఇస్తానన్నా ఒప్పుకోలేదు. తెలంగాణా తెచ్చుకున్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడి కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో బాబు ప్రభ వెలిగిపోతున్నరోజుల్లోనే, అంటే మొదట్లోనే ‘హోదా అనేది మారిన పరిస్తితుల్లో సాధ్యం కాదు, ప్రత్యామ్న్నాయం చూస్తాము’ అని వుంటే ప్రజలు ఎవరెన్ని చెప్పినా వారి మాటనే నమ్మేవారు. అప్పుడేమో ప్రతివారూ హోదా తధ్యం అన్నట్టు మాట్లాడారు. తరువాత కుదరదన్నారు. హోదా అనేది ఇంకా భావోద్యోగ అంశంగా రూపాంతరం చెందలేదు కానీ, ఆయా పార్టీల వైఖరి ఈ అంశంపై రూపాంతరం చెందుతూ వుండడం ప్రజలు గమనిస్తున్నారు. ప్రస్తుతానికి నాయకులు మాత్రం ఈ అంశాన్నే నమ్ముకుని ముందుకు సాగుతున్నారు.
“వెనక బ్లాక్ అండ్ వైట్ రోజుల్లో పట్టుకుంటే లక్ష అనో పదివేలనో ఒక సినిమా వచ్చింది. ఒక చిన్న పాప ఆడుకునే బొమ్మలో లక్షలు ఖరీదు చేసే వజ్రాలు దాస్తారు. అది చేతులు మారుతుంటుంది. కానీ విషయం తెలియక ఎవరూ ఆ బొమ్మను సీరియస్ గా తీసుకోరు. ఒకసారి వజ్రాలు ఎక్కడ వున్నాయో తెలియగానే అందరూ ఆ బొమ్మ వేటలో పడతారు. ఇప్పడు హోదా వ్యవహారం కూడా ఆ బొమ్మ మాదిరిగానే తయారయింది. ఎన్నికల వైతరణి దాటాలంటే హోదా అస్త్రం ఒక్కటే శరణ్యం అని అనుకుని అన్ని పార్టీలు హోదా మంత్రం మొదలు పెట్టాయి”
“చెడిపోయిన గడియారం కూడా రోజుకు రెండు సార్లు కరక్టు టైము చూపిస్తుంది. ఆ మాదిరిగా రాజకీయం కోసం రాజకీయం చేయండి. పార్టీలుగా మీకు ఎలాగూ మాటలు మార్చక తప్పదు. అయితే కనీసం కొంతయినా ప్రజలకోసం మాట్లాడండి. అన్ని పార్టీలకి నా విజ్ఞప్తి ఇదే”

నాలుగేళ్ల క్రితం కాబట్టి ఇన్ని మాటలు మాట్లాడే చాన్స్ ఇచ్చారు.
ఇప్పుడా! నో చాన్స్! నో వే!

తోకటపా: తన తల్లి ఇందిరాగాంధి మరణ వార్తని ధ్రువ పరచుకోవడానికి రాజీవ్ గాంధి బీబీసీ వార్తలు విన్నారు. ఈ రోజుల్లో ఏదైనా వార్తని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఏ ఛానల్ చూడాలి?

22, జులై 2022, శుక్రవారం

ముఖ్యమంత్రి ఎన్టీఆర్ తో కొన్ని అనుభవాలు




ఎన్టీఆర్ సినీ రంగంలో మేరుశిఖర సమానుడు.

హైదరాబాదు ఆలిండియా రేడియోలో పనిచేస్తున్న నాకు ఆయన్ని పలుసార్లు కలవగలిగే అవకాశం కలుగుతుందని నేను ఏనాడు ఊహించలేదు. ఆయన రాజకీయాల్లో చేరి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత అలాంటి అపూర్వ సందర్భాలు రేడియో విలేకరిగా తటస్థపడ్డాయి. అది కేవలం కాకతాళీయం.

ఆ అనుభవాలను చెప్పే అవకాశాన్ని సుమన్ టీవీ నాకు కల్పించింది.

వారికి కృతజ్ఞతలు. 







ఏవి తల్లీ! నాడు కురిసిన హిమసమూహములు!

ఎప్పుడో తొమ్మిదేళ్ళ నాటి ముచ్చట. తవ్వకాల్లో బయట పడింది. ఇలాంటి కార్యక్రమాలు ఈ టీవీ (TV 5)లోనే కాదు, ఇంకా ఏదైనా టీవీలో ఈరోజుల్లో ప్రసారం అయ్యే అవకాశం ఉంటుందా!




LINK:

https://youtu.be/l8OCnepAzGY

చెప్పులూ, గొడుగూ – భండారు శ్రీనివాసరావు


"ఇదిగో బాణం విడిచిపెడుతున్నా! " శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు.

"ఊ"

"చాలా దూరం వెడుతుంది సుమా!"

"ఎంత దూరం వెళ్లినా తేగలను."

"అలాగేం? సరే! చూడు మరి."

జమదగ్ని బాణం విడిచాడు. రేణుకాదేవి పరుగెత్తింది.

ఒకరోజు వాళ్లిద్దరికి సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలూ, విల్లూ తీసుకుని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరుబయలు ప్రదేశం చేరుకున్నారు.

జమదగ్ని బాణాలు వేయడం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కుని తెచ్చి ఇవ్వడం .. ఇదీ ఆట.

ఆ ఆట ఇద్దరికీ నచ్చింది.. కాని జమదగ్నికి జాలేసింది తన భార్య కనుక్కోగలదో లేదో అని.

"ఇదిగో బాణం తెచ్చాను!" అని నవ్వుతూ అందించింది రేణుకాదేవి.

అలా జమదగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఆమె కనుక్కుని తెస్తూనే ఉంది. కాని ఒకసారి అలా వెళ్లిన రేణుకాదేవి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. జమదగ్ని చాలాసేపు ఎదురు చూశాడు. చివరికి నీరసంగా , మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది.

"రేణుకా! ఏమైంది ఈసారి ఆలస్యం చేసావు?"

" అదిగో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కి ఆయాసంగా ఉంటే కాస్సేపు ఒక చెట్టు కింద కూర్చుని వస్తున్నాను."

అలిసిపోయి ముఖం మీది చెమటను చీరచెరుగుతో తుడుచుకుంటున్న రేణుకాదేవిని చూసి జమదగ్ని బాధపడి " ఈ సూర్యుడు నిన్ను ఇంతగా బాధపెట్టాడా? అతని పని చెప్తానుండు " అంటూ కోపంతో సూర్యుడివైపు అస్త్రం సంధించాడు.

ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి ఆయన చేతిని పట్టుకున్నాడు.

"మహర్షీ! శాంతించు. సూర్యుడు లేకుండా ముల్లోకాలు నిలుస్తాయా? ఆలోచించు."

"నాకు అదంతా తెలీదు. సూర్యుడు నా భార్యను బాధపెట్టాడు. అతను శిక్ష అనుభవించి తీరాలి" అని గర్జించాడు.

మరుక్షణమే ఆ బ్రాహ్మణుడు "అయ్యా! నన్ను క్షమించు. నేనే సూర్యున్ని. దయ చూపుము" అని ప్రార్ధించాడు.

ఆ వెంటనే చెప్పులు, గొడుగూ సృష్టించి " ఇవిగో! ఈ పాదరక్షలు ధరించి, ఈ చత్రముతో శిరస్సుకు నీడపడితే నా వేడి సోకదు. ఇవి తల్లి రేణుకాదేవికి ఇవ్వండి" అని జమదగ్ని మహర్షికి సమర్పించుకున్నాడు.

అది చూసి జమదగ్ని శాంతించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు.

ఆ గొడుగును , చెప్పులనూ చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. తాపసుల కోపం కూడా లోకకళ్యాణానికే దారితీస్తుందనే నానుడిని నిజం చేస్తూ రకరకాలుగా గొడుగులూ, చెప్పులనూ తయారు చేసి వినియోగించడం ప్రారంభించారు.


సూర్యుడి చేత సృష్టించబడినవి గనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి చాలా పవిత్రమైనవి కాబట్టి పెళ్ళిళ్ళలో, పితృకార్యాలలో కూడ వినియోగిస్తారు.

21, జులై 2022, గురువారం

బ్రిటన్ అధికార పీఠంపై భారత రిషి ?

తెలంగాణ బియ్యం సేకరణలో తప్పెవరిది?

మీడియాకు మరో పనేమీ లేదా!


‘మళ్ళీ ఎప్పుడు రమ్మంటారు  రికార్డింగ్ కి’ 
కెమెరా మాన్ తో కలిసి పరికరాలు సర్దుకుంటూ అడిగాడు అనీంద్ర అనే ఆ రెడ్ టీవీ జర్నలిస్ట్.
‘ఇదిగో ఈరోజు చేసారు కదా! ఈ ఇంటర్వ్యూని ఎడిట్ చేయకుండా అప్ లోడ్ చేసిన తర్వాత తప్పకుండా కలుద్దాం. ఆరోజు మీరు మా ఇంటికి రావాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని, ఇంత ధైర్యంగా చూపించిన మీ యాజమాన్యాన్ని అభినందించడానికి  నేనే మీ స్టూడియోకి వస్తాను’
అనీంద్ర నా మాటలు సీరియస్ గా తీసుకున్నాడు. కానీ అతడు పనిచేసేది ఓ ప్రైవేట్ ఛానల్ లో. అతడి ఇబ్బందులు అతడికి వుంటాయి. సవాళ్లు విసిరే వయసు నాది కాదు, వాటిని స్వీకరించే వృత్తి వయసు అతడిది కాదు.
అంచేత ఆ విషయం అంతటితో మరచిపోయాను.
మళ్ళీ ఈ ఉదయం ఫోన్ అతడి నుండి.
‘రేపు రమ్మంటారా! ఏ టైముకు రాను?’
నేను జవాబు చెప్పీ లోగా అతడే అన్నాడు.
‘మీరు చెప్పిన వీడియో లింక్ పంపుతున్నాను. ఎడిట్ చేయకుండా మా వాళ్ళు దాన్ని అప్ లోడ్ చేశారు. ఒకసారి చూడండి”
అన్నట్టే కొద్దిసేపటి తర్వాత లింక్ పంపాడు.
చూశాను. వెంటనే ఫోన్ చేసి చెప్పాను.
‘నేనే వస్తున్నాను మీ స్టూడియోకి. లొకేషన్ పంపండి. ఎప్పుడు ఏ రోజు అనేది మీకే వదిలేస్తున్నాను’
ఇంతకీ ఆ వీడియోలో ఏమి వుందంటే.
ఈ వెబ్ ఛానల్స్ గురించి, మీడియా గురించి నా మనసులో, కాదు కాదు, చాలామంది మనసుల్లో వున్న మాటే ఆరోజు బయటకు కక్కేసాను. ఎట్లాగు దీన్ని చూపించరు అనుకున్నా. 
కానీ అనీంద్ర గట్టివాడు లాగా వున్నాడు, మొత్తం మీద ఎడిట్ చేయకుండా నేను మాట్లాడినది మొత్తం అందులో వుంది.
అదే ఈ వీడియో, దాని  LINK:
https://www.youtube.com/watch?v=Ladz9I2Z5hk&feature=youtu.be
(21-07-2022)