8, ఏప్రిల్ 2022, శుక్రవారం
స్టెత్ లెస్ డాక్టర్స్ – భండారు శ్రీనివాసరావు
7, ఏప్రిల్ 2022, గురువారం
మంత్రివర్గాల రాజీనామాలు మూడు ముచ్చట్లు – భండారు శ్రీనివాసరావు
ఆరోజు మంత్రి వర్గం సమావేశమౌతోంది. మధ్యాహ్నం పన్నెండు తర్వాత ముఖ్యమంత్రి విలేకరులతో మాట్లాడతారని కబురొచ్చింది. అందరం బిలబిలమంటూ సచివాలయంలోని ముఖ్యమంత్రి ఛాంబర్కు చేరుకున్నాం. విలేకరులు, అధికారులతో సమావేశాలు నిర్వహించేందుకు ఆ ఛాంబర్ ప్రక్కనే ఒక చిన్న హాలు ఉండేది.
ఓ అరగంట తర్వాత అప్పటి ముఖ్యమంత్రి
శ్రీ అంజయ్య ఆ హాల్లోకి వచ్చారు. విలేకరులందరినీ పేరుపేరునా పలకరిస్తూ మామూలు
కబుర్లలో పడిపోయారు. మధ్యమధ్యలో ఏం మొయిన్ ! (మొయినుద్దీన్ - ముఖ్యమంత్రి
వ్యక్తిగత కార్యదర్శి) అందరికీ అన్నీ (కాఫీ టిఫిన్లు) అందాయా? అని వాకబు చేస్తున్నారు. అప్పటికి దాదాపు ఒంటిగంట కావస్తుండడంతో
చివర్లోకూర్చున్న నాలో అసహనం పెరిగిపోతోంది. మరో పదిమిషాల్లో మధ్యాహ్నం ప్రాంతీయ
వార్తలు మొదలవుతాయి. ఈ బులెటిన్ తప్పిపోతే మళ్లీ సాయంత్రందాకా దిక్కులేదు. కానీ
అంజయ్యగారి కబుర్లు ఒక పట్టాన తేలేలా కనిపించడంలేదు. చివరికి ఏదయితే అదే అయిందని
లేచి ఆయన దగ్గరకు వెళ్లాను. వార్తల టైమ్ అవుతోందని చెప్పేసి, ఏం చెప్పదల్చుకున్నారో ఒక్క ముక్కలో చెప్పండని కోరాను. దానికాయన
పెద్దగా నవ్వేస్తూ `చెప్పడానికేముంది! మంత్రులందరూ (రాజీనామాలు)
ఇచ్చేశారు' అని సైగలతో చెప్పేశారు. నేను రయ్ మంటూ
బయటకు పరుగెత్తి, ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి రేడియోకి ఫోన్
చేసి మంత్రుల రాజీనామా వార్తని అందించాను.
అంజయ్యగారి మంత్రి వర్గాన్ని `జంబోక్యాబినెట్' అని ఎద్దేవా చేసేవారు. అరవైమంది
మంత్రులేమిటి, విడ్డూరం కాకపోతే అనేవారు. కార్టూన్ల
సంగతి సరేసరి. అయినా, ప్రతిదీ తేలిగ్గా తీసుకునే తత్వం
ఆయనది. యాదగిరి (హెలికాప్టర్)తో తనను ముడిపెట్టి ఒక దినపత్రికలో ప్రచురించే
వ్యంగ్య చిత్రాలను కూడా నవ్వుతూ ఆస్వాదించే మనస్తత్వం ఆయనది.
ఇక ఇలాంటి మంత్రివర్గ క్షాళన మరోసారి
జరిగింది. అప్పుడు నేను మాస్కోలో రేడియో మాస్కోలో పనిచేస్తున్నాను. ఆనాడు
ముఖ్యమంత్రి శ్రీ ఎన్టీ రామారావు. ఇలాగే ఆయన కూడా ఒక రోజు హఠాత్తుగా ముప్పయి ఒక్కమంది
మంత్రుల రాజీనామాలను అడిగి తీసుకుని ఆమోదం కోసం గవర్నర్ కు పంపారు. ఆమోద ముద్ర
పడింది. తర్వాత ఆయన ఢిల్లీ వెళ్లి వారం రోజులు అక్కడే వుండి, తర్వాత కానీ కొత్త
మంత్రి వర్గాన్ని ఏర్పాటు చేయలేదని చెప్పుకున్నారు.
పొతే మూడోది. మంత్రివర్గం రాజీనామా కాదు.
ఇది మరీ విచిత్రం. ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో
ఆకస్మికంగా మరణించిన దరిమిలా కాంగ్రెస్ అధిష్టానం వయసులో పెద్దవాడు అయిన ఆర్ధిక
మంత్రి శ్రీ కె. రోశయ్యను ఆ పదవికి ఎంపిక
చేసింది. శ్రీ రోశయ్య పాత మంత్రులను అందర్నీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు.
కనీసం వారి శాఖల్లో కూడా ఎలాంటి మార్పులు చేయలేదు. ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయేవరకు
అదే మంత్రివర్గం.
ఇక ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి
శ్రీ జగన్ మోహన్ రెడ్డి తన మంత్రి మండలిలోని ఇరవై నాలుగు మంది మంత్రుల రాజీనామాలు
తీసుకున్నారు. కొత్త మంత్రివర్గం కూర్పు పనిలో వున్నారు.
తోక టపా : పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ప్రధాన మంత్రిగా ఉన్నరోజుల్లో మొరార్జీ దేశాయ్ వంటి సీనియర్ మంత్రులను తప్పించడానికి కామరాజ్ ప్లాన్ పేరుతొ మొత్తం మంత్రివర్గం చేత రాజీనామా చేయించారు.
(07-04-2022)
‘ఏ’ ‘బీ’ ‘సీ’ ‘డీ’ – భండారు శ్రీనివాసరావు
6, ఏప్రిల్ 2022, బుధవారం
నోబుల్
“మిమ్మల్ని టీవీలో చూస్తూ వుంటాను”
ఎస్సారార్
కాలేజి పూర్వ విద్యార్ధుల సమ్మేళనం ముగిసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి బుక్
చేసుకున్న ఉబెర్ డ్రైవర్ బాల్ రెడ్డి , కారు ఎక్కిన వెంటనే, ఈ మాట చెప్పాడు.
కొంచెం ఆశ్చర్యం వేసింది. రాత్రీ పగలు తేడా లేకుండా రోడ్ల మీద తిరిగే వారికి టీవీ
చూసే తీరిక ఎక్కడ వుంటుంది అనేది నా సందేహం.
“రోడ్ల
మీదే జీవితం గడిచిపోతుంది. కొత్త బుకింగ్ వచ్చేవరకు రోడ్ల పక్కన చెట్ల నీడలో
ఆగినప్పుడు మొబైల్ ఫోన్ లో చూస్తుంటాను” నా అనుమానాన్ని కనిపెట్టి
చెప్పినట్టున్నాడు బాల్ రెడ్డి.
“ఇంకో
మాట చెప్పనా! రోజు ఎంత మందిని చూస్తుంటాను. లొకేషన్ కు వచ్చి ఫోన్ చేసేదాకా వాళ్ళు
రారు. మీరు మూడు నిమిషాలు ముందే వచ్చి రోడ్డు మీద నిలుచున్నారు’
‘రిటైర్
అయి పనేమీ లేకుండా వున్నాను. కానీ ఈ క్యాబ్ పొరబాటున
తప్పిపోతే ఇంటికి చేరడం ఎల్లా అనే దూరాలోచనతో ముందుగా వచ్చి రోడ్డు మీద నిలబడ్డాను
అనే నిజాన్ని అతడికి చెప్పలేదు.
“అది
సరే! కారులో నీ వెనక కదా! కూర్చున్నాను. నన్నెలా
గుర్తు పట్టావు?”
“దూరం
నుంచే రోడ్డు మీద నిలబడి వున్న మిమ్మల్ని
చూశాను. మీరు కూడా అందరిలా ఆఖరు నిమిషంలో
వచ్చి ఎక్కితే ఏమో మరి”
తర్వాత
ఏం మాట్లాడాలో నాకు తోచలేదు.
‘మళ్ళీ
మీరు కనబడతారో లేదో, ఒక
మాట ఇప్పుడే చెబుతాను. ఈ మధ్య మీరు టీవీల్లో కనబడడం లేదు. అప్పుడప్పుడు తప్ప. అప్పుడూ
ఇప్పుడూ మీది ఒకే వరస. మీరు అనుకున్నదే
తప్ప టీవీల వాళ్ళు కోరుకున్నట్టు చెప్పరు, అందుకే మిమ్మల్ని పిలవడం లేదేమో
అనుకున్నాను. నిజానికి మీలా నిజాలు చెప్పేవాళ్ళు ఉంటేనే కదా జనాలకు నిజాలు
తెలిసేది’
మూడేళ్ల
క్రితం నా భార్య చనిపోయిన తర్వాత టీవీ స్టూడియోలకు పోవడం పూర్తిగా తగ్గించానన్న
విషయం నేను అతడికి చెప్ప లేదు కానీ, అతడు నాకిచ్చిన కితాబు మాత్రం నోబుల్ పురస్కారం కన్నా మిన్న.
థాంక్స్
బాల్ రెడ్డి!
(06-04-2022)
5, ఏప్రిల్ 2022, మంగళవారం
నిజంగా అది రౌడి కాలేజీనా? – భండారు శ్రీనివాసరావు
ఎస్సారార్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల. ఆరోజుల్లో అంటే ఒక అర్ధ శతాబ్దికి పూర్వం, మొత్తం విజయవాడలో ఇదొక్కటే ప్రభుత్వ కళాశాల. రెండోది ప్రైవేటు యాజమాన్యంలోని లయోలా కాలేజి. స్కూలు చదువు అయిపోయిన తర్వాత పీయూసీ, డిగ్రీలో చేరాలంటే ఈ రెండే దిక్కు. గవర్నమెంటు కాలేజీలో ఫీజులు నామ మాత్రం అయినా రౌడీ కాలేజి అనే పాడు పేరు ఒకటి. లయోలా కాలేజీకి అలాంటి పేరు లేదు కాని సామాన్యులు భరించలేని ఫీజులు గుంజుతారని ప్రతీతి.
ఇదంతా ఎందుకు అంటే ఇవ్వాళ హైదరాబాదులో ఎస్సారార్
కాలేజిలో జంధ్యాల బ్యాచ్ కి చెందిన ముప్పయారు మంది పూర్వ విద్యార్ధులం నారాయణగూడా లోని ఎస్బీఐ గెస్టు హౌస్ లో
కలుసుకున్నాం. అదీ యాభయ్ అయిదేళ్ళ సుదీర్ఘ విరామం తర్వాత. వచ్చిన వారిలో ఓ పదిమంది
భార్యా సమేతంగా వచ్చారు.
వారిలో ఒకావిడ గారు చెప్పారు.
‘అసలు ఇలాంటి మీటింగులకు ఆడవాళ్ళం ఎందుకు
అనిపించింది. అదే మా వారితో చెప్పాను, మీరొక్కరు వెళ్లి రండని. ఈలోగా ఆయన స్నేహితులు
కొంతమంది బలవంత పెట్టారు. దానితో రాకతప్పలేదు. వచ్చిన తర్వాత అనిపించింది,
రాకుండా వుండి వుంటే నేను పొరబాటు చేసిన దాన్ని అయ్యేదానినని. ఈ కాలేజి గురించి
విన్నది వేరేగా వుంది. ఇప్పుడు చూస్తుంటే అక్కడ చదువుకున్న వారు చాలా
సంస్కారవంతులు అనిపిస్తోంది”
మా అందరికీ గొప్ప కాంప్లిమెంట్ కదా!
ప్రముఖ రంగస్థల, సినీ నటుడు, ఈ
పూర్వ విద్యార్ధులలో ఒకరు అయిన సుబ్బరాయ
శర్మ గారు మైకు తీసుకున్నారు. లేదు, మాట్లాడమని అందరు బలవంత పెడితే తీసుకున్నారు.
“ ఈ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసిన విశ్వనాధ సత్యనారాయణ వంటి ప్రముఖ పండితులు, పురాణం సుబ్రమణ్య శర్మ వంటి ఎడిటర్లు, జంధ్యాల, ఏమ్వీ రఘు, మాధవపెద్ది సురేశ్ వంటి సినీ ప్రముఖులు, వైణిక
విద్వాంసుడు అయ్యగారి శ్యామసుందరం, ఇంకా అనేకమంది బ్యాంకర్లు, మల్లాది
వెంకట కృష్ణ మూర్తి వంటి నవలా రచయితలు, మురళి
దేవరకొండ వంటి కధారచయితలు, కవులు,
కళాకారులు అనేకమందిని ఈ కాలేజి సమాజానికి అందించింది. ఇలాంటి కాలేజీని రౌడీ కాలేజ్
అనడం భావ్యమా!” అంటూ తనదైన రీతిలో స్పందించారు.
బ్రిగేడియర్ శ్రీరాములు ఒక ఆసక్తికర అంశాన్ని బయట
పెట్టారు. ఎస్సారార్ కాలేజీలో కొందరు ‘ఘనాపాటీలు’ వున్న మాట వాస్తవమే అన్నారు.
కాలేజి ఫంక్షన్లలో పాల్గొనడానికి విద్యార్థినులు జంకుతున్నారు, అదీ తమ వల్లనే అనే
విషయం ఆ ఘనాపాటీలకు తెలిసిపోయింది. వెంటనే వాళ్ళు కార్యక్రమాలు ముగిసిన తర్వాత
వాటిల్లో పాల్గొన్న ఆడపిల్లలను రిక్షాలలో కూర్చోబెట్టి,
సైకిళ్ళపై వెంటవెళ్లి, భద్రంగా ఇళ్ళ దగ్గర దింపే పనిని కొందరు జూనియర్లకు
ఒప్పగించారుట. అంటే ఆ కాలేజీలో ఏళ్ళ తరబడి చదువుతూ తిష్ట వేసిన ఆకతాయిలు కూడా
ఆడపిల్లల పట్ల చక్కటి సంస్కారాన్ని ప్రదర్శించే వారన్నది ఆయన కవి హృదయం.
లైలా కాలేజీలో చేరిన వారు కూడా అవకాశం దొరకగానే
ప్రభుత్వ కళాశాలలో చేరడానికి మక్కువ చూపేవారని, దానికి కారణం
ఎస్సారార్ కాలేజి కోఎడ్యుకేషన్ కాలేజి కావడమే అనేది ధర్మవరపు రామ్మోహన రావు గారి చమత్కారం. డెబ్బయి
పై చిలుకు వయసులో కూడా ఆయన సుస్వరంతో కర్ణుడి జన్మ రహస్యం అంకంలోని పద్యాలను
చక్కగా ఆలపించారు. అలాగే, డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ చేసిన దాసు గారు, ఏలేశ్వరపు ప్రసాద్ గారు పాత పాటలు
వినిపించారు. ఈ వయసులో కూడా తమ గాత్ర మాధుర్యం చెక్కు చెదరకుండా చూసుకోవడం
ఆశ్చర్యం అనిపించింది.
వీణా వాయిద్య కళాకారుడు, దేశ
విదేశాల్లో అనేక ప్రశంసలు, అవార్డులు పొందిన అయ్యగారి శ్యామ సుందరానికి పద్మశ్రీ
పురస్కారం లభిస్తే బాగుంటుందని వచ్చిన మితృలు అందరూ అభిప్రాయ పడ్డారు. వస్తే, అంతకంటే కావాల్సింది ఏముంటుంది?
ఇక కృతజ్ఞతలు చెప్పాల్సిన వ్యక్తి ఒకరున్నారు.
ఆయన స్టేట్ బ్యాంక్ లో ఉన్నత అధికారిగా రిటైర్ అయిన ఎన్.వీ.కే. రావు గారు. ఒక్క
ముక్కలో చెప్పాలి అంటే ఈ యావత్ కార్యక్రమానికి ఆయన కర్తా, కర్మా,
క్రియ.
(05-04-2022)
జంధ్యాల బ్యాచ్ – భండారు శ్రీనివాసరావు
యాభయ్ అయిదేళ్ళ క్రితం నేను ఎలా వుండే వాడినో నాకే తెలియదు. అంటే నా ముఖకవళికలు, రూపు రేఖలు, తలకట్టు, వేసుకునే దుస్తులు, మాట తీరు, నడత, నడవడిక అన్నీ ఖచ్చితంగా మారిపోయే వుంటాయి. నన్ను అప్పుడు చూసిన వారికి ఇప్పుడు చప్పున పోల్చుకోవడం కష్టమే. అప్పుడు బక్కపలచగా ఉండేవాడిని. ఇప్పుడు మరీ బొద్దుగా కాకపోయినా ఒళ్ళు చేశాను. అప్పుడు దుబ్బులా వున్న జుట్టు పలచపడింది. పాపిడి కుడి నుంచి ఎడమకు మారింది. పొట్ట వచ్చింది. ఆహార్యం మారింది. బెల్ బాటమ్స్, పెద్ద కాలర్ చొక్కాలు పోయి ఏదో కొంత పెద్దరికంగా అనిపించే దుస్తులు వచ్చి చేరాయి. సరే అప్పటికీ ఇప్పటికీ మారినది మారండి కాలి చెప్పులే. బూట్లు అప్పుడూ లేవు, ఇప్పుడూ లేవు. కళ్ళజోడు అవసరాన్ని బట్టి కళ్ళమీదకీ, చొక్కా జేబులోకి మారిపోతూ వుండీ లేనట్టు వుంటుంది. మరి ‘వాళ్ళు’ నన్ను ఎలా గుర్తు పట్టేట్టు.
వాళ్ళు
అంటే ఎప్పుడో యాభయ్ అయిదేళ్ళ క్రితం బెజవాడ ఎస్సారార్ కాలేజి బీకాం (జంధ్యాల
బ్యాచ్) వాళ్ళు. మేమందరం మూడేళ్లు కలిసి
చదువుకున్న వాళ్ళం. మా క్లాసులో వందమందిమి వుండేవాళ్ళం. అదొక రికార్డు అప్పట్లో.
నా రోల్ నెంబరు 66. నేను సరే, వాళ్ళు నన్ను ఎలా గుర్తు పడతారు? ఏమో తినబోతూ రుచి అడగడం ఎందుకు?
మా
కాలేజి మేట్స్ బ్రిగేడియర్ శ్రీరాములు, ధర్మవరపు రామ్మోహన రావు, బ్యాంకర్ ఎన్వీకే రావు చొరవతో ఈ కలయిక ఆలోచన పురుడు పోసుకుంది. ఈరోజు
ఆచరణకు నోచుకుంది.
ఈవేళ
పదిన్నరగంటలకు హైదరాబాదు నారాయణ గూడా లోని స్టేట్ బ్యాంక్ గెస్ట్ హౌస్ లో దాదాపు
నలభయ్ మందిమి కలవబోతున్నాం. సాయంత్రం దాకా అక్కడే కబుర్లతో కాలక్షేపం. అలనాటి
ముచ్చట్లు,
చిలిపి చేష్టల పునశ్చరణ.
(05-04-2022)
3, ఏప్రిల్ 2022, ఆదివారం
ఐ.ఏ.ఎస్. అంటే ... భండారు శ్రీనివాసరావు
(Published
in ANDHRA PRABHA on 05-04-2022, SUNDAY)
ఐ.ఏ.ఎస్. అధికారుల విషయంలో ఈ నడుమ పత్రికల్లో,
సామాజిక మాధ్యమాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. స్వతంత్రం వచ్చిన కొత్తల్లో ఆనాటి
బ్రిటిష్ సాంప్రదాయిక పరిపాలనా పద్ధతులకు విభిన్నంగా ఒక స్వతంత్ర అధికారిక
వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలనే సదుద్దేశంతో ఈ అఖిల భారత సర్వీసు అధికారుల
వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. బ్రిటిష్ పాలనలో కొనసాగిన ఐ.సి.ఎస్. వ్యవస్థ
స్థానంలో ఐ.ఏ.ఎస్. పరిపాలనా వ్యవస్థ రూపుదిద్దుకుంది.
ఇన్నేళ్ళ
అనుభవంలో ఇది ఏమైనా సత్ఫలితాలు ఇచ్చిందా లేక ఇతర వ్యవస్థల మాదిరిగానే అవసరమైన
సచ్ఛీలతను కోల్పోయిందా అనేది ఈ చర్చల సారాంశం.
కాలం గడుస్తున్న కొద్దీ మారుతున్న పరిణామాలకు
అనుగుణంగా వ్యవస్థల్లో మంచి చెడులలో కూడా స్థాయీ బేధం తప్పదు. ఐ.ఏ.ఎస్. అంటే అయాం
ఎట్ యువర్ సర్వీసు అనే అర్ధం కాస్తా మారిపోయి,
అయాం ఎట్ మై బాస్ సర్వీసు అనే పెడర్ధం వ్యాప్తి చెందుతోంది. ప్రభుత్వ
పెద్దలకు తగిన సమయంలో తగిన సలహాలు ఇచ్చి పరిపాలనను గాడిలో పెట్టాల్సిన ఐ.ఏ.ఎస్.
అధికారులే దోవ తప్పుతున్నారనే అపార్థాలు ప్రబలుతున్నాయి. బహిరంగ వేదికలపై రాజకీయ
పెద్దలకు పాదాభివందనాలు చేయడం, విదూషకులను మించి పొగడ్తలతో ముంచెత్తడం ఐ.ఏ.ఎస్.
అధికారుల స్థాయికి తగ్గ పని కాదని విమర్శకుల అభిప్రాయంగా తోస్తోంది. అయితే ఎవరో కొందరిని బూచిగా చూపెట్టి మొత్తం వ్యవస్థను
తప్పుపట్టడం కూడా మంచి పనికాదు.
ఈ నేపధ్యంలో కొందరు మంచి అధికారులను
సంస్మరించుకోవడం ఈ వ్యాసకర్త ఉద్దేశ్యం.
అనేక సంవత్సరాల
క్రితం రెవెన్యూ బోర్డు సభ్యుడు, సీనియర్ ఐ.ఏ.ఎస్.
అధికారి అనంత రామన్ ఖమ్మం దౌరాకు వచ్చారు. రెవెన్యూ బోర్డు సభ్యుడు అందులోను మొదటి
సభ్యుడు అంటే చీఫ్ సెక్రెటరీ తరువాత అంతటి హోదా కలిగిన ఆఫీసరు. ఆ రోజుల్లో ఉన్నతాధికారులు
కూడా రైళ్ళల్లోనే ప్రయాణాలు చేసేవాళ్ళు. అలాగే రైల్లో ఖమ్మం చేరుకున్న అనంత రామన్
ని జిల్లా కలెక్టర్ సయ్యద్ హషీం ఆలీ రిసీవ్ చేసుకుని దగ్గరలోని ప్రభుత్వ అతిధి
గృహం హిల్ బంగ్లాలో దిగబెట్టారు. మర్నాడు అధికారిక సమావేశాలు, సమీక్షలు
ముగించుకున్న తర్వాత అనంత రామన్ గుట్ట మీద నరసింహస్వామి గుడి చూడాలని వుందన్న కోరిక వెలిబుచ్చారు. కలెక్టరు జీపులో అనంత రామన్ గుడికి వెళ్లి పూజలు అవీ
ముగించుకుని వచ్చారు. హైదరాబాదు
రైలెక్కేముందు అనంత రామన్ కలెక్టర్ చేతిలో కొన్ని నోట్లు పెట్టి చెప్పారు.
‘మీరు జీపు
ఇచ్చినన్ను గుడికి పంపారు, సంతోషం. కానీ అది ప్రభుత్వ వాహనం. కాబట్టి ఈ డబ్బు ప్రభుత్వ ట్రెజరీలో జమ
చేయించండి’.
ప్రభుత్వ ధనం అంటే పాముగా పరిగణించే రోజులవి.
ఖమ్మం జిల్లా కలెక్టర్
ఆర్. పార్ధసారధి ఓ రోజు ఉదయం జీపు
తీసుకుని ఏదో ప్రాంతానికి టూరుకు వెళ్లి తిరిగి వస్తుంటే, రెబ్బవరం అనే గ్రామానికి
దగ్గరలో టైరు పంక్చర్ అయింది. పంక్చర్ వేయించడానికి డ్రైవర్ కొన్ని మైళ్ళ దూరంలో
వున్న మరో పెద్ద వూరికి వెళ్ళాడు. అతడు రావడానికి బాగా వ్యవధి వుంది. అటూ ఇటూ చూస్తున్న కలెక్టర్ దృష్టికి దగ్గరలో ఓ వూరు జాడ కనిపించింది. కొందరు ఆడవాళ్ళు
బిందెలు చంకన పెట్టుకుని వస్తూ కానవచ్చారు. ఆయన
వారిని పలకరించి, 'నీళ్ళ కోసం ఇంత దూరం ఎందుకు పడుతూ లేస్తూ వస్తున్నారు, మీ వూళ్ళో మంచి
నీటి బావి లేదా?' అని ప్రశ్నించారు. 'వూళ్ళో బావులకేం చాలా వున్నాయి, కానీ మమ్మల్ని
అక్కడ నీళ్ళు తోడుకోనివ్వరు' అని బదులు
చెప్పారు. కలెక్టర్ సాలోచనగా తలపంకించి ఊరుకున్నారు. ఈలోగా టైరు పంక్చర్
వేయించుకుని డ్రైవర్ తిరిగివచ్చాడు.
కలెక్టర్ తన మానాన తాను పొతే కధే లేదు. ఏం చేయాలో వెంటనే ఆలోచించి పెట్టుకున్నారు.
డ్రైవర్ ని నేరుగా జిల్లా కేంద్రానికి పంపించి తాను రోడ్డు పక్కన ఓ మోరీ మీద కూర్చుండిపోయారు. ఈలోగా ఆయన మౌఖిక
ఆదేశాలు అందుకున్న కలెక్టర్ సిబ్బంది, స్థానిక తాసిల్దారు
టైప్ రైటర్లు, కలెక్టర్ అధికారిక
ముద్రిక తదితరాలతో సహా అక్కడికి వచ్చారు. ఊళ్ళోకి కబురు పంపి సర్పంచుని
రప్పించారు. ఈ హడావిడి అంతా చూసి ఊరిజనం అంతా అక్కడ పోగయ్యారు. వూరి వెలుపల నుంచి
మంచి నీళ్ళు తెచ్చుకునే వారికి వారి గూడెంలోనే ఒక మంచి నీటి బావి మంజూరు చేయాలని
కోరుతూ సర్పంచు నుంచి ఓ
అభ్యర్ధన పత్రం తీసుకున్నారు. దానికి అక్కడికక్కడే స్థానిక అధికారి నుంచి ఆమోద
ముద్ర వేయించారు. తనకున్న విశేష అధికారాలను ఉపయోగించుకుంటూ అందుకు అవసరమైన నిధులను
తక్షణమే మంజూరు చేస్తూ ఆ మోరీ మీదనే కూర్చుని సంతకం
చేసి, కింద స్టాంపు వేసారు. ఆ వెనువెంటనే కూలీలను పిలిపించారు. బావి తవ్వకానికి ఆయనే స్వయంగా గడ్డపారతో మొదటి పలుగు
వేసి స్వీకారం చుట్టారు. ఝాము పొద్దెక్కక ముందే ఝామ్మని బావి పని మొదలయింది.
అంతకుముందు ఆ ఊరిజనం ఇలాటి అధికారిని చూడలేదు సరికదా కనీసం వినికూడా వుండలేదు.
అందుకే అందరి మొహాల్లో నిండుకున్న నిబిడాశ్చర్యం. ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో
వారి వూరిలో ఓ అభివృద్ధి కార్యక్రమానికి శుభారంభం జరిగింది. పొద్దుగూకే సమయానికి
బావిలో సమృద్ధిగా జలపడింది. ఆ వూరి గూడెం జనానికి కొత్త పొద్దు పొడిచింది.
“నేను ఏది చెబితే అదే జీవో” అనే వారు 1978 లో తొలిసారి ముఖ్యమంత్రి అయిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి.
ఆయన వ్యవహారశైలి విలక్షణంగా వుండేది.
తను అనుకున్నది నిమిషాలమీద కాదు క్షణాలలో జరిగిపోవాలని పట్టుబట్టేవారు.
చెప్పినవెంటనే జరిగిపోవాలనే ఆయన నైజం
నిఖార్సయిన అధికారులకు ఒక పట్టాన మింగుడు పడేదికాదు.
సీనియర్ ఐ ఏ ఎస్ అధికారి ఎస్. ఆర్.
రామ్మూర్తి ముఖ్యమంత్రి పేషీలో వుండేవారు.
ఆయనకేమో అంతా రూలు ప్రకారం నడవాలి. రూలు పేరెత్తితే రూళ్లకర్ర పట్టుకుని హుంకరించే
తత్వం చెన్నారెడ్డిది. ‘ఎవరయ్యా ఈ రూల్స్ పెట్టింది. మనం
పెట్టుకున్నవేగా, మార్చుకుంటే పోలా!’ అనే వారు.
‘అలా మార్చుకున్నప్పుడు మాకేమిటి అభ్యంతరం? కానీ, అప్పటిదాకా, ఇప్పుడున్న రూలే మాకు రూలు’
అన్నది రామ్మూర్తి గారి రూలు.
ఏమయితేనేం, కొన్నాళ్ళకి రామ్మూర్తి గారే సర్దుకున్నారు. అంటే రూల్స్ తో
సమాధాన పడ్డారని కాదు. అప్పటికి సరే అని, సంబంధిత ఫైలు మళ్లీ సీ ఏం పేషీకి వచ్చినప్పుడు నెమ్మదిగా
చెబితే సేఎమ్ వింటారులే అని ఒక
మధ్యేమార్గం కనుక్కున్నారు. అప్పటినినుంచి చెన్నారెడ్డి ఏదయినా అడగ్గానే రామ్మూర్తి వెంటనే ‘యస్ సర్’ (తప్పకుండా చేద్దాం సర్) అనేవారు. ఆ ఒక్క మాటతో
చెన్నారెడ్డి ఖుష్. ఫైల్ మళ్లీ పేషీకి
వచ్చిన తరవాత సీ ఏం గారికి చూపించేటప్పుడు మాత్రం రూలు ప్రకారం ఆ పని చేయడం ఎలా
కుదరదో వివరంగా చెప్పి, ‘నో సర్’ (కుదరదు సర్
) అనేవారు. ప్రభుత్వం ఎలా పనిచేస్తుందో ఆ ఆనుపానులన్నీ తెలిసిన చెన్నారెడ్డి కూడా కిమ్మనకుండా
తలపంకించి వూరుకునేవారు.
ఇదంతా
తెలిసిన వారు, ఆయన ఇంటి పేరు ‘యస్ ఆర్’ తో ముడిపెట్టి, ‘ఫైలు రాకముందు యస్ సర్ రామ్మూర్తి, వచ్చిన తరవాత నో సర్
రామ్మూర్తి’ అని సరదాగా అనుకునే వారు.
సయ్యద్ హషీం ఆలీ ఖమ్మం జిల్లా కలెక్టర్ గా
పనిచేశారు.
ఆ రోజుల్లో ఖమ్మం కలెక్టర్ ఆఫీసు ట్రంకు రోడ్డులో
వుండేది. చాలా చిన్న భవంతి. మెట్లు ఎక్కగానే ఎదురుగా స్వింగ్ డోర్. దాని వెనుక ఒక
నీలంగుడ్డ పరచిన మేజా బల్ల. వెనుక కుర్చీలో కలెక్టర్. అదీ పరిస్తితి. అటాచ్డ్ బాత్
రూమ్ కూడా వుండేది కాదు. వెనక పెరట్లో ఎక్కడో దూరంగా వుండేది.
ఓ రోజు కలెక్టర్ ని కలవడానికి భద్రాచలం దగ్గర ఓ
పల్లెటూరు నుంచి ఓ రైతు వచ్చాడు. గుమ్మం ముందు హమేషా వుండే డవాలా బంట్రోతు ఆ
సమయంలో ఏదో పనిమీద వెళ్ళాడు. లోపల కలెక్టర్ గారు బాత్రూంకు పోవడానికి లేచి పెరటి
ద్వారం వైపు వెడుతున్నారు. సరిగ్గా ఆ టైంలో రైతు స్వింగ్ డోర్ తెరుచుకుని
‘కలెక్టర్ దొరగారెక్కడ?’ అని అడిగాడు. తాను అడుగుతున్నది సాక్షాత్తు కలెక్టర్ నే
అని అతడికి తెలియదు. హషీం ఆలీగారు ఏమాత్రం నొచ్చుకోకుండా, అతడిని కూర్చోబెట్టి
విషయం తెలుసుకుని సమస్యను పరిష్కరించే విషయంలో తన కింది సిబ్బందికి తగు సూచనలు
ఇచ్చి పంపేశారు.
సురేష్
చందా అనే ఓ ఐ.ఏ.ఎస్. అధికారి తెలంగాణా సచివాలయంలో ఒక ఉన్నత స్థానంలో పని చేసేవారు.
రాష్ట్రం మొత్తంలో ఆరోగ్య, వైద్య
సేవలు ఆయా ప్రభుత్వ ఆసుపత్రులలో ఎలా అందుతున్నాయో పర్యవేక్షించే బాధ్యత ఆయనది.
యువకుడు కావడం వల్ల కంప్యూటర్ పరిజ్ఞానం హెచ్చుగా ఉండడంలో ఆశ్చర్యం లేదు. అంచేత తన
శాఖ పని తీరు మెరుగుపరుచుకోవడానికి ఈ అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వాడుకోవాలని
భావించి, తెలంగాణాలో
పేరొందిన గాంధి ఆసుపత్రితో మొదలు పెట్టి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని
అనుకున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఏమూల ఏం జరుగుతున్నదో సచివాలయంలోని తన చాంబర్ నుంచే
కనిపెట్టి చూసే ఉద్దేశ్యంతో ఆ ఆసుపత్రిలో సుమారు రెండువందల నిఘా కెమెరాలను
అమర్చాలని తలపెట్టారు. కిందవాళ్ళు చేసే పనులను కనిపెట్టి చూడడం ఆయన బాధ్యతల్లో
ఒకటి. కానీ, తాను
ఎలా పనిచేస్తున్నది కూడా నలుగురికీ తెలియాలి కదా! అందుకని ఈ ప్రయోగాన్ని ఆయన
తనతోనే ప్రారంభించారు. చడీచప్పుడూ కాకుండా తన కార్యాలయంలో ఒక నిఘా కెమెరాను
ఏర్పాటు చేసుకున్నారు. తన గదిలో ఏం జరిగేది, తనను
కలుసుకోవడానికి ఎవరెవరు వచ్చేది, ఏం
మాట్లాడేది రికార్డు చేయడం కోసం ఈ కెమెరా. అయితే ఈ కెమెరా రికార్డు చేసేది తను
ఒక్కరే కాకుండా ఎవరయినా సరే చూడగలిగేలా ఇంటర్నెట్ తో దాన్ని అనుసంధానం చేయడం ఇందులోని ఒక ప్రత్యేకత.
వ్యవస్థకు
చీడలు పట్టకుండా చూడడానికి ఇలాంటి అధికారులు,, సంఖ్య స్వల్పమే అయినా ఇంకా
మరికొందరు వున్నారు. అదే ఊరట.