27, నవంబర్ 2021, శనివారం

మాటల ఊరేగింపు పాశం యాదగిరి – భండారు శ్రీనివాసరావు

 ‘ఎందుండి ఎందు బోవుచు ఇందులకేతెంచినారు? అంటాడు ప్రవరాఖ్యుడు తమ ఇంటికి  అతిధిగా వచ్చిన యతితో. (నిజానికి ఇలా చెప్పాపెట్టకుండా వచ్చేవాళ్ళని అభ్యాగతి అంటారని కాలేజీలో మా తెలుగు లెక్చరర్ గారు చెప్పేవారు.

ఎక్కడ నుండి వచ్చారు ఎక్కడకు పోతున్నారు అని అడగడం మర్యాదగా భావించేవారు కాదేమో ఆ కాలంలో.

అలాగే యాదగిరిని ఈ రెండు ప్రశ్నలు అడగడం అనవసరం. కాళ్ళకు పసరు రాసుకోకపోయినా, చక్రాలు తగిలించుకాకపోయినా ఎక్కడి నుంచయినా రాగలడు, అలాగే ఎక్కడికి అయినా పోగలడు. అంచేత ఈ రెంటి నడుమ లభించిన విరామంలో అతడు చెప్పింది వింటూ పోవడమే విజ్ఞుల లక్షణం.

యాదగిరి అంటే తెలియని వాళ్ళకోసం జర్నలిస్టు పాశం యాదగిరి అని పరిచయం చేస్తున్నాను.

కూర్చున్నది కాసేపే అయినా చాలా విషయాలు మాట్లాడాడు. అన్నీ రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది.

గోల్కొండ కోటలో అభ్సీ గేట్ వుంది తెలుసు కదా అన్నాడు.

ఔరంగజీబు సైన్యాలు గోల్కొండ పై దాడి చేసినప్పుడు ఆ కోటకు ఉన్న అయిదు ప్రధాన ద్వారాలలో ఒక ద్వారానికి  ఆఫ్రికన్ దేశం అభ్సీనియా కు చెందిన మహమ్మద్ బిలాల్ అనే నీగ్రో బంటు కాపలాగా వున్నాడు. అతడు అక్కడ వున్నాడు అంటే గోల్కొండ ప్రభువులకు అపరిమితమైన భరోసా. అతడి చివరి శ్వాస వరకు చివరి శత్రువు కూడా  కోటలోకి అడుగుపెట్టలేడని ఓ నమ్మకం. అందుకే ఆ గేటుకు అబ్సీ గేటు అని పేరు పెట్టారు.

ఇంతకీ యాదగిరి ఇదంతా ఎందుకు చెబుతున్నట్టు. బంటు అనేది తెలుగు పదం కాదని చెప్పడానికి.

“సర్కారు జిల్లా తెలుగు అంటారు. నిజానికి అందులో  తెలుగు అనే పదం  తప్ప తెలుగే లేదని అతడి ముక్తాయింపు. ఏమిటంటే సర్కారు తెలుగు కాదు, జిల్లా తెలుగు కాదు. ఆ రెండూ ఉర్దూ పదాలే. నిజం ఒప్పుకోవాలి. అసలు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మాట్లాడుకునే భాషలోనే ఎక్కువ ఉర్దూ పదాలు మనకు వినవస్తాయి, కనబడతాయి. భాష విషయంలో వారిది ఉదారవాదం అని తీర్మానించాడు.

“అమితాబ్ బచన్ వాయిస్ కల్చర్ గురించి గొప్పగా చెబుతారు. నిజానికి ఆయన తండ్రి హరివంశ్ రాయ్ బచన్ కు ఈ ఖ్యాతి దక్కాలి. ఆయన కొడుకు స్వరంలో స్పష్టత రావడం కోసం కఠిన మైన శిక్షణ ఇచ్చాడు. వేదాలు ఎక్కడా రాసిలేవు. వాటిలోని పనసలు ఒక పట్టాన కొరుకుడు పడవు.  గురువు ముఖతః వాటిని విని బట్టీయం వేయాలి. శిష్యుల నోట  ఎక్కడా ఉచ్ఛారణ దోషం రాకుండా చూడడానికి గురువులు చాలా కష్ట పడేవారు. ఒక్కో అక్షరానికి ఒక్కో అర్ధం వుంటుంది. తభావతు లేకుండా పలకాలి. ఉర్దూలో కబర్, ఖబర్ ఈ రెండు పదాలు దగ్గరగా అనిపిస్తాయి. కానీ ‘క ‘ఖ ఒక్క   అక్షరం తేడాతో మొత్తం  అర్ధం మారిపోతుంది. మసీదుల్లో ప్రార్ధనలు కూడా అంతే! అవి చదవడానికి మదర్సాల్లో గట్టి తర్పీదు ఇస్తారు. మహమ్మద్ ప్రవక్త మొట్టమొదట ఈ ప్రార్థన చదవడం కోసం ఎంపిక చేసుకున్నది బిలాల్ అనే వాడిని. మంచి స్వరం తప్పిస్తే అతడిలో గొప్ప అర్హతలు ఏమీ లేవు. అయినా పవిత్రమైన కార్యం కోసం ప్రవక్త అతడినే ఎంపిక చేసుకున్నాడు.

“సాహెబ్! సాహెబా! సాహెబా అంటే తల్లి. మసాబ్ ట్యాంక్ అని పిలుచుకుంటున్న చెరువుకు అసలు పేరు మా సాహెబా టాంక్. కాలక్రమంలో మసాబ్ టాంక్ అయింది. చెరువు రూపురేఖలు లేకుండా పోయింది”

ఇలా సాగిపోయింది యాదగిరి వాగ్జరి.

మా పిల్లలు కూడా శ్రద్ధగా వింటున్నారు.

చాయ్ బిస్కెట్ వంటి స్వల్ప ఆతిధ్యం స్వీకరించి ఇక వెడతాను అని లేచాడు.

జర్నలిస్ట్ కాలనీలో కదా ఇల్లు. ఈ టైంలో ఎలా వెడతావు అన్న ప్రశ్నకు నవ్వలేదు. సరికదా! రాజ కపూర్ నటించిన శ్రీ 420 హిందీ చిత్రంలోని పాట వినిపించాడు.

మేరా జూతా హై జాపానీ, ఏ పంట్లూన్ ఇంగ్లిస్తానీ, సర్ పే లాల్ టోపీ రూసీ,  ఫిర్ దిల్ హై హిందూస్తానీ!

“నికల్ పడే హై ఖులీ సడక్ పర్  అప్నా సీనా తానే

మంజిల్ కహాఁ కహా రుకానా  ఊపర్ వాలా జానే!”

ఇంకాసేపు వుంటే బాగుణ్ణు అనిపించింది.

“పక్కనే మెట్రో. చెక్ పోస్టు దగ్గర దిగితే జర్నలిస్ట్ కాలనీ” అన్నాడు.

పై పాట మళ్ళీ వినిపించింది. యాదగిరి పాడలేదు.

నాకే చెవుల్లో వినిపించినట్టు అనిపించింది, యాదగిరి మాటలు విన్నాక.

(27-11-2021)  

ఒంటి చేత్తో లిఖించిన భారత రాజ్యాంగం – భండారు శ్రీనివాసరావు

 

మత విశ్వాసులకు భగవద్గీత, ఖురాను, బైబిల్ మాదిరిగా ప్రజాస్వామ్యంలో నమ్మకం వున్నవారికి రాజ్యాంగం కూడా ఒక పవిత్ర గ్రంధం.

రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ప్రదర్శించిన దూరదృష్టిని మననం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని వివిధ అంశాలపై ఆసక్తికరమైన విషయాలు మననం చేసుకోవడం వ్యాసకర్త ఉద్దేశ్యం.

“దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అయిన పదం ఏదయినా వుందంటే అది ‘సెక్యులరిజం’. ఈ పదం ఇలా దుర్వినియోగానికి గురికాకుండా భరతవాక్యం పలకాలి. ఎందుకంటే, సమాజంలో ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడానికి ఈ పదం దోహదపడుతోంది” అనేది నేడు కొంత మంది అభిప్రాయం. సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి విస్తృతంగా వాడుతున్న అనువాద పదం ‘లౌకిక వాదం’ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ పీఠికలో చేర్చాలని భావించలేదు. 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిష్టు (సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలను రాజ్యాంగ పీఠికలో కొత్తగా చేర్చారని  వారి నమ్మకం.

“సెక్యులరిజం’ అనే ఆంగ్ల పదానికి ‘ధర్మ నిరపేక్షత’(మతాతీత లౌకిక వాదం) అనే హిందీ అనువాదం సరికాదనీ, దాన్ని ‘పంత్ నిరపేక్ష’ (వర్గాతీత లౌకిక వాదం) అని వుంటే సబబుగా వుండేదని వారు చేసే వ్యాఖ్యానం.

“రాజ్యాంగంపై విశ్వాసం లేనివాళ్ళు, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోనివాళ్ళు ఈ నాడు ఇలాంటి ధర్మ పన్నాలు వల్లిస్తున్నారని  వారి ప్రత్యర్థుల వాదన.

“రాజ్యాంగం యెంత మంచిదయినా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపొతే, అంతిమప్రభావం చెడుగానే వుంటుందని ఆనాడే అంబేద్కర్ అన్నారన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.

ఘర్షణాత్మక రాజకీయాలు వద్దని ఒకపక్క చెబుతూనే, సహనం నేటి అవసరం అని ఇంకో పక్క ఉద్ఘాటిస్తూనే, ఉభయ పక్షాలు తద్విరుద్ధంగా ప్రవర్తించడంలో తమ శక్త్యానుసారం పాటుపడుతున్నాయనే వాస్తవం ఎవ్వరికయినా  ఇట్టే బోధపడుతుంది.

భారత రాజ్యాంగం గురించి, దాని విశిష్టతను గురించి బొత్తిగా తెలియని నేటి యువతరానికి తెలియయచేప్పే అనేక ఆసక్తికర అంశాలు ఈనాడు వెలుగులోకి వస్తున్నాయి.

సుమారు  ఏడు దశాబ్దాలుగా అమల్లో వున్నభారత రాజ్యాంగానికి ఘనమైన చరిత్రే వుంది. స్వాతంత్ర పోరాటంలో భాగంగానే సొంత రాజ్యాంగం కావాలంటూ 1930 లోనే కాంగ్రెస్ గళమెత్తింది. కాంగ్రెస్ వాదన ఒప్పుకోవడానికి బ్రిటిష్ పాలకులకు పదహారేళ్ళు పట్టింది. 1946లోనే నాటి వైస్రాయ్ లార్డు వావెల్ ఈ డిమాండును అంగీకరించారు. రాజ్యాంగ రూపకల్పనకు ఉద్దేశించిన పరిషత్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి సభ్యుల సంఖ్య 389 కాగా, దేశ విభజనానంతరం 299 కి తగ్గింది. కొందరు ఎన్నికయిన వారు కాగా మరికొందరు నామినేటెడ్ సభ్యులు. మరో విశేషం ఏమిటంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 24 మంది అమెరికన్లు. రాజ్యాంగ నిర్మాణ చర్చల్లో ఈ విదేశీయులు వారం రోజులు పాల్గొన్నారు. రాజ్యాంగ రచన అక్షరాలా రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిదిరోజుల పాటు సాగింది. ఇందులో 114 రోజులు ముసాయిదా రూపకల్పనకే సరిపోయాయి. చర్చ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించారు. సుదీర్ఘ పరిశీలన తరువాత 2,473 సవరణలను తిరస్కరించారు. 1946 డిసెంబరు లో మొదలయిన రాజ్యాంగ రచన 1949 డిసెంబరు వరకు కొనసాగింది. మరో విచిత్రం ఏమిటంటే ఈ క్రతువు కొనసాగుతున్న కాలంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్తితుల్లో వుంది. మతఘర్షణలు, వర్గ పోరాటాలతో అట్టుడికి పోతున్న రోజులవి. బహుశా ఈ నేపధ్యమే సమానత్వం, స్వేచ్చ, సౌభాతృత్వం, సమ న్యాయం వంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి తేవడానికి రాజ్యాంగ నిర్మాతలను ప్రేరేపించి ఉండవచ్చు. వివిధ దేశాల రాజ్యాంగాలను సవిరంగా అధ్యయనం చేసి, వాటిలోని మంచి లక్షణాలను భారత రాజ్యాంగంలో గుదిగుచ్చారు. ఫ్రాన్స్ నుంచి స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం, రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండు నుంచి ఆదేశిక సూత్రాలు, జపాన్ నుంచి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అమెరికా నుంచి ప్రాధమిక హక్కులు, కెనడా నుంచి సమాఖ్య స్పూర్తి, ఇలా పలు అంశాలకు మన రాజ్యాంగంలో చోటు దొరకడంవల్లనే అది కాల పరీక్షలను తట్టుకుని నిలబడి ప్రజాస్వామ్యం విలసిల్లడానికి తోడ్పడింది. యావత్ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దది. మొత్తం 25 భాగాలు. పన్నెండు షెడ్యూల్స్, 448 అధికరణలు, అయిదు అనుబంధాలు. ఇంతటి విస్తృత రాజ్యాంగాన్ని సరిగ్గా అరవై ఆరేళ్ళ క్రితం నవంబరు 26 న మన రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుంచి స్వేచ్చా భారతం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించింది. ఇన్నేళ్ళ తరువాత తొలిసారి ఈ రోజును అంటే నవంబరు ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవాలనే సత్సంకల్పం పాలకులకు కలిగింది. రాజ్యాంగం గురించి భావి భారత పౌరులయిన విద్యార్ధులకు మరింత అవగాహన కలగడానికి వీలుగా సరళమైన భాషలో ప్రాధమిక దశ నుంచే పాఠ్య ప్రణాళికలలో చేర్చే సదుద్దేశం కూడా ఏలిన వారికి కలిగితే అంతకంటే కావాల్సింది లేదు.

తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రంధాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది.



26-11-2021

26, నవంబర్ 2021, శుక్రవారం

కాణీ ఖర్చులేని ఎనర్జీ టానిక్!- భండారు శ్రీనివాసరావు

 

రాత్రి పది గంటల సమయంలో మా కోడలు (ఇప్పుడు నా కోడలు అనాలేమో, తను లేదుగా) నా గదిలోకి వచ్చింది, రావచ్చా అని అడుగుతూనే.  ఆ సమయంలో ఎప్పుడూ రాని మనిషి రావడం నాకు ఆశ్చర్యం అనిపించింది. తనకు తెలుగు రాదు. నాకు ఆమెకు అర్ధం అయ్యే రీతిలో మాట్లాడగలిగే స్థాయిలో  ఇంగ్లీష్ రాదు. మా మధ్య సంభాషణ తెలుగులో జరిగి వుంటే, అది  ఇలా వుండేది. (నిజానికి ఇదంతా ఇంగ్లీష్ లోనే సాగింది, భాషకు భావం ప్రధానం అనే రీతిలో. అది వేరే మాట)

“భోజనం అయ్యిందా పాపా!”

“లేదమ్మా! ఏం”

“వంటమ్మాయి పొరబాటున పొద్దుటి పెరుగు గిన్నె మీ గదిలో పెట్టి పోయింది. ఇది ఈ పూట తోడుకున్నది”

“సరే! అమ్మా! థాంక్స్!  అక్కడ పెట్టి వెళ్ళు. అయినా ఒక్క పూటకు సర్డుకుంటే  ఏమవుతుంది!”

వెంటనే వెళ్లకపోవడం చూసి అడిగాను నేనే.

“ఏమిటమ్మా! ఏమిటి సంగతి?” ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా!”

“అమెరికాలో థాంక్స్ గివింగ్ డే. వాళ్లకు లాంగ్ వీకెండ్. అంచేత మాకిక్కడ పెద్దగా ఆఫీసు పని వుండదు. కాల్స్ వుండవు. రేపూ ఎల్లుండీ కూడా ఖాళీనే”

మౌనంగా వింటున్నాను.

“అవును కానీ పాపా! చాలా రోజులుగా చూస్తున్నాను. మీరు చాలా సమయం ఒంటరిగా మీ గదిలోనే  వుంటున్నారు. బయటకే రావడం లేదు. ఏదో రాసుకుంటూ వుంటారు. డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకుంటాను”

డెబ్బయి ఆరో ఏడు నడుస్తోంది. ఈ వయసులో వెనక్కి చూస్తూ ముందుకు నడవడమే. అంటే గత అనుభవాలే దిక్సూచి. వాటిని రాసుకుంటూ, వాటిని తలుచుకుంటూ రోజులు గడపడమే పని.

“వున్న ముగ్గురం మధ్యమధ్య కలిసి కూర్చుని రోజులో కాసేపు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా!” అన్న నిషా మాటకి ఆశ్చర్యంగా తలెత్తి చూశాను.

“మంచి ఐడియా! నేనే అందామనుకున్నాను”

“నిజానికి మధ్యాన్నం అందరం కలిసే భోజనం చేస్తున్నాము. కానీ మాటలు వుండడం లేదు.”

“అదీ! నిజమే! ఏదో సినిమా పెడతారు. అది చూస్తూ ఏం మాట్లాడుకుంటాం.”

“మీకు తెలుగు సినిమాలు ఇష్టం అని సంతోష్ చెప్పాడు. అందుకని నేను రోజూ మంచి రేటింగ్ వున్న సినిమాలు  సెలక్ట్ చేసి ఉంచుతున్నాను. మీరు వాటిని కూడా పూర్తిగా చూస్తున్నట్టు లేదు”

“............”

“పోనీ ఓ పని చేద్దాం. సినిమా వద్దు. భోంచేస్తూ మాట్లాడుకుందాం. ఏదో ఒకటి. చూసిన సినిమాలమీదే అయినా సరే  ఏవో  ముచ్చట్లు చెప్పుకుందాం!”

“తప్పకుండా! మంచి ఐడియా” అన్నాను మరోసారి.

గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోయింది.

ఈ మధ్యాన్నం కొత్తగా గడిచింది.  ఎన్నో రోజులుగా మౌనం కాపురం చేస్తున్న ఇంట్లో మళ్ళీ మాటలు నోళ్ళు విప్పాయి. నిండా పరచుకున్న స్తబ్ధత తొలగిపోయింది. పట్టపగలే మరోసారి తెల్లవారింది (అవునూ! ఇలాంటి ఆలోచనలు ఇంతకు ముందు నాకెందుకు రాలేదు?)

మాటామంతీలో ఇంత మహత్యం ఉందా!

నిజంగా  మంచి ఐడియా ఇచ్చావు నిషా!

మనసులోని భావాలను వ్యక్తం చేయడానికి ఒక్కోసారి మాటలు దొరకవు. నోరు పెగలదు.

(26-11-2021)

నోరు జారిన మాట - భండారు శ్రీనివాసరావు

 మాధవరావుకు ఎదురుగా ఎవరన్నా కనిపిస్తే నమిలి మింగేయాలన్నంత కోపంగా వుంది. ఆస్పత్రి కారిడారులో అసహనంగా తిరుగుతున్న తీరే ఆయన మానసిక స్తితిని తెలుపుతోంది. మధ్యమధ్యలో ఆసుపత్రి సిబ్బందిని వాకబు చేస్తున్నాడు. డాక్టర్ ఇంకా రాలేదా అని అడుగుతున్నాడు. రోడ్డుప్రమాదంలో గాయపడ్డ తన కొడుకుని తీసుకుని ఆసుపత్రికి వస్తే డాక్టర్ అయిపు లేడు.కబురు చేశాం! వచ్చి చూస్తారు’ అన్న సిబ్బంది అరకొర జవాబులు పుండు మీద కారం చల్లిన చందంగా ఆయనకు మరింత ఆగ్రహాన్ని రగిలిస్తున్నాయి. చుట్టుపక్కలే కాదు చుట్టుపక్కల వూళ్ళల్లో కూడా మరో ఆసుపత్రిలేదు. ఇటు కొడుకు పరిస్తితి ఆయనకు ఆందోళన కలిగిస్తోంది. అటు డాక్టర్ లేకపోవడం ఆ ఆందోళనను ఆగ్రహంగా మారుస్తోంది.

కాసేపటికి ఎదురు చూస్తున్న డాక్టర్ వచ్చాడు. ఆయన మొహం నిర్వికారంగా వుంది. రాగానే గాయపడ్డ బాలుడి గురించి సిబ్బందిని అడిగి లోపలకు వెడుతుంటే మాధవరావుకు కోపం కట్టలు తెంచుకుంది. ఆ కోపం మాటల రూపంలో బయటకు వచ్చింది.

నువ్వేనా ఇక్కడ డాక్టరువి. ఇక్కడ పేషెంట్లు చావుబతుకుల్లో కొట్టుకు చస్తుంటే ఇప్పటిదాకా ఎక్కడ చక్కర్లు కొడుతున్నావు.’

సిబ్బంది మాధవరావుని వారించాలని చూసారు. కానీ ఆయన వినే పరిస్తితిలో వుంటే కదా. అతడి కళ్ళ ముందు గాయపడి రక్తంవోడుతున్న కొడుకు రూపమే కనబడుతోంది.

ఏం మాట్లాడవు. అవునులే ఏం చెబుతావు. ఇదే నీ కన్న కొడుకు ఇలా ఆసుపత్రిలో పడివుంటే ఇలానే తాపీగా, నింపాదిగా వస్తావా? అసలు జనం ప్రాణాలంటే మీకు లెక్కలేకుండా పోతోంది’

మాధవరావు మాటల తీవ్రత పెరుగుతూనే వుంది. డాక్టర్ మాత్రం ఏమీ పట్టించుకోనట్టు ఆపరేషన్ థియేటర్ లోకి వెళ్లిపోవడం చూసి ఆయన అరికాలు మంట నెత్తికెక్కింది.

ఆపరేషన్ జరిగినంత సేపు మాధవరావు శాపనార్ధాలు సాగుతూనే వున్నాయి.

కాసేపటికి తలుపులు తెరుచుకున్నాయి. డాక్టర్ బయటకు వచ్చాడు.

భగవంతుడు దయామయుడు. నా మానవ ప్రయత్నానికి ఆయన పూర్తిగా సహకరించాడు. మీ అబ్బాయికి ఇక ఏం భయం లేదు, మా వాళ్ళు చూసుకుంటారు’ అంటూ ఎవరో తరుముతున్నట్టుగా వెళ్ళిపోయాడు.

మాధవరావుకు డాక్టర్ మాటలు యెంత ఉపశమనం కలిగించాయో, ఆయన అలా ఉరుకులు పరుగుల మీద బయటకు వెళ్లిపోవడం అంతే ఆగ్రహాన్ని కలిగించింది.

ఛీ! ఏం డాక్టర్లు. బయట ఇంత ఆందోళనగా ఎదురు చూస్తున్న మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా, ఏదో మా ప్రయత్నం మేము చేసాము. దేవుడి దయవల్లే మీ వాడు బతికాడంటూ పొడిపొడిగా చెప్పేసి అలా వెళ్ళిపోతాడా? యెంత నిర్లక్ష్యం? యెంత పొగరు?’ అంటూ చిందులు వేసాడు.

నర్సు కళ్లనీరు పెట్టుకుంటూ చెప్పింది.

అయ్యా! మీ పిల్లవాడికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు. మా డాక్టర్ గారిది అమృత హస్తం. పోతే, మీరు వచ్చినప్పుడు ఆసుపత్రిలో డాక్టరు గారు లేని మాట నిజమే. ఆ సమయంలో ఆయన శ్మశానంలో వున్నారు. వొక్కగానొక్క కొడుకు రాత్రే రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే చనిపోయాడు. కర్మకాండలో వున్నాకూడా, మేము కబురు చేయగానే అంత్య క్రియల కార్యక్రమం మధ్యలో వొదిలేసి వచ్చారు. మీ అబ్బాయికి ఆపరేషన్ చేసి మళ్ళీ మిగిలిన తంతు పూర్తిచేయడం కోసం అక్కడికే వెళ్లారు’




(నెట్లో కనబడిన ఒక ఇంగ్లీష్ కధనానికి స్వేఛ్చానువాదం - ఇమేజ్ సొంతదారుకు కృతజ్ఞతలు)

25, నవంబర్ 2021, గురువారం

‘నా బలమా! నీ నామ బలమా!’ – భండారు శ్రీనివాసరావు

 

నాకు గంధర్వుల శాపం వుంది. అదేదో సినిమాలోలా విన్నది వెంటనే నోట్ చేసుకుంటే తప్ప ఆ తర్వాత గుర్తుండదు.

నాకు అప్పుడప్పుడు మితృలు పాశం యాదగిరి, ఆర్వీవీ కృష్ణారావు, అమెరికా నుంచి వీవీ శాస్త్రి గారు, తరచుగా మా అన్నగారు రామచంద్రరావు ఫోన్లు చేస్తుంటారు. ఆ మాటల్లో ఎన్నెన్నో పాత ముచ్చట్లు దొర్లుతుంటాయి. చాలా మంచి సంగతులు. వాళ్లకు రాయాలని తోచదు. నాకు రాయకపోతే తోచదు. కానీ చెప్పాను కదా! పాడు మతిమరపు. వెంటనే రాసుకుంటే సరి. లేకపోతె ఇంతే సంగతులు.

మొన్న రామజోగి మందు గురించి చెప్పిన కృష్ణారావు గారు రాత్రి మళ్ళీ ఫోన్ చేశారు.

ఈసారి ఇదిగో ఈ నామ బలం గురించి చెప్పారు.

ఓసారి, అంటే అప్పుడెప్పుడో దశాబ్దాల కిందట మంగళంపల్లి బాల మురళీ కృష్ణ గారు బెజవాడ వచ్చారు. యథావిధిగా ఇండియన్ మెడిసిన్ హౌస్ డి.ఎల్. నారాయణ గారింట్లో మధ్యాన్న భోజనం. ఆ సాయంత్రం కచేరీ.

నారాయణ గారికి ఆయుర్వేద వైద్యశాల వారసత్వంగా వచ్చింది. వారి హయాములో మూడు పువ్వులు ఆరు కాయలుగా విలసిల్లింది.

భోజనాల సమయంలో కృష్ణారావు గారు బాల మురళి గారితో అన్నారు. ‘నారాయణ గారి చవులూరించే విందు, మరి వీనుల విందుగా మీ విందు మాత్రమే మిగిలింది’

ఈ మాటలు గుర్తుపెట్టుకున్నట్టుగా ఆ సాయంత్రం కచేరీలో బాల మురళి గారు ఆనంద భైరవి రాగంలో ‘ నా బలమా! నీ నామ బలమా’ అనే త్యాగరాయ విరచిత కీర్తన సుమధురంగా పాడారు. ఆయుర్వేద వైద్యంలో డి.ఎల్. నారాయణ గారి ఆనంద భైరవి అనే ఔషధం వుంది. అలాగే కృష్ణారావు గారు అడిగిన వీనుల విందు లాంటి ఆనంద భైరవి రాగం వుంది.

సరే ఇదలా ఉంచితే ..

ఒకానొక కాలంలో ఆయుర్వేద వైద్యం తెలుగునాట విలసిల్లింది. చింతలూరు వెంకటేశ్వర ఆయుర్వేద నిలయానికి ఆ రోజుల్లో వెయ్యి కోట్ల టర్నోవర్ ఉండేదని చెప్పుకునేవారు. దాదాపు ప్రతి గ్రామంలో ఆయుర్వేద వైద్యులు వుండే వాళ్ళు. మిస్సమ్మ సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర అటు స్కూలు టీచరు, ఇటు ఆయుర్వేద వైద్యం. పిల్లల చేత మందులు అరగదీయించడం గుర్తుండే వుంటుంది.

ప్రముఖ దర్శకుడు కేవీ రెడ్డి గారికి భవిష్యత్ వాణి తెలుసల్లె వుంది. ఆయుర్వేదానికి ముందు ముందు కాలం చెల్లిపోతుందన్న అనుమానం కలిగిందేమో తెలియదు. దొంగ రాముడు సినిమాలో ఒక సన్నివేశం పెట్టారు.

చిన్న నాగేశ్వర రావు తల్లికి జబ్బు చేసి ప్రాణం మీదకు వస్తే, ఆయుర్వేద వైద్యుడుగా వేసిన వంగర వెంకట సుబ్బయ్య రోగి నాడి పట్టి చూసి ఒక మందు చీటీ రాసిచ్చి పట్రంమంటాడు. చిల్లి కాణీ జేబులో లేకపోయినా చిన్న నాగేశ్వర రావు పరిగెత్తుకుంటూ ఆయుర్వేదం మందులు అమ్మే షాపుకి పరిగెడతాడు. షాపు వాడు చీటీ చూసి మందుల అలమరా తెరిచి, ఓ సీసా తీసి దానిపై వున్న దుమ్ము ఉఫ్ అని ఊది పిల్లాడి చేతికి ఇస్తాడు. అంటే ఆయుర్వేద మందులకు భవిష్యత్తులో గిరాకీ తగ్గి దుమ్ము కొట్టుకు పోతాయనే సంకేతం అందులో ఉందంటారు కృష్ణారావు గారు.

పూర్వం పాసింజర్ రైళ్ళలో ఆయుర్వేదం మందులు అమ్మేవాళ్లు. కస్తూరి మాత్రలు, సువర్ణ శూర్యావతి, పైత్యాంతక రసం, కాశీ దారాలు, ఇత్తడి పిన్నీసులు, పేల దువ్వెనలు వగైరా వగైరా. ఒక పొడవాటి కర్రకు వీటిని వేలాడగట్టి అటూ ఇటూ ఊపుతూ రైల్లో తిరిగి అమ్మేవాడు.

వెనకటి రోజుల్లో వైద్యుడు అనేవాడు ముందు నాడి పట్టి చూసేవాడు. వున్న ఊళ్ళో వైద్యం కనుక రోగుల శరీర తత్వం వాళ్లకి బాగా తెలుసు. అందుకు తగ్గ మందులు కుప్పెల్లో అరగదీసి, కల్వంలో నూరి అప్పటికప్పుడు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆయుర్వేదం వంటి దేశీయ వైద్య ప్రక్రియల్లో కూడా కార్పొరేట్ శక్తులు అడుగు పెట్టడంతో ఆకర్షణీయమైన ప్యాకెట్లలో అవి కూడా ఇంగ్లీష్ అలోపతి మందుల్లాగా మార్కెట్లో విరివిగా దొరుకుతున్న మాట వాస్తవమే అయినా, అందులో భారతీయ ఆత్మ లోపిస్తోంది. రోగికీ, వైద్యుడికీ నడుమ ఉండాల్సిన సున్నితమైన అనుబంధం చెరిగిపోతోంది. నాడి పట్టి చూడకుండానే చేసే వైద్యంలో డబ్బు ఉండవచ్చు కాని, జబ్బు నయం చేసే శక్తి క్రమంగా లోపిస్తోంది.

పోలీసు జులుం – భండారు శ్రీనివాసరావు


ఏకాంబరం ఇంటికి పోలీసులు వచ్చారు. తలుపు తీశాడు. పోలీసులను చూడగానే పక్క పోర్షన్ వాళ్ళు తలుపులు మూసుకున్నారు.

వాళ్లు ఏదో అడిగారు. ఏకాంబరం ఏదో చెప్పాడు. మర్నాడు స్టేషన్ కు పలానా టైముకు రమ్మని చెప్పి వెళ్ళిపోయారు.

ఏకాంబరానికి, అతడి భార్యకు భయంతో ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. సెలవు పెట్టి మర్నాడు పోలీసు స్టేషన్ కు వెళ్ళాడు. గంటలు గంటలు వెయిట్ చేయించి తర్వాత అసలు విషయం చెప్పారు, ఎవరో అనుకుని పొరబాటున అతడి ఇంటికి వచ్చారుట. వాళ్ళ మాటలో ఏమాత్రం క్షమాపణ ధోరణి ధ్వనించలేదు. అయినా  ఏకాంబరం కిమ్మనకుండా బతుకు జీవుడా అంటూ  బయట పడ్డాడు.

అదే రాజకీయ రక్ష రేకు వుంటే... మొత్తం కధే వేరుగా వుండేది.

ఈ దేశంలో చట్టాలు సామాన్యులపట్ల ఒక రకంగా, అసామాన్యుల పట్ల మరోరకంగా అమలవుతాయి.

ఇందుకు ఉదాహరణలు కోకొల్లలు. టీవీ పెడితే చాలు, పేపరు తిరగేస్తే చాలు. ఇవే వార్తలు.

23, నవంబర్ 2021, మంగళవారం

ఆకాశంబున నుండి, శంభుని శిరంబందుండి – భండారు శ్రీనివాసరావు


సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు హైదరాబాదులో మా చుట్ట పక్కాల్లో చాలా మంది ఫోన్ రిసీవ్ చేసుకోరు. కారణం వారే చెప్పారు. ఆ సమయంలో ఎస్వీ బీసీ (టీటీడీ) టీవీ ఛానల్ లో భగవద్గీత మీద కుప్పా విశ్వనాధ శర్మ గారు అనే పెద్దాయన ప్రవచనం చెబుతారని, దాన్ని క్రమం తప్పకుండా ఆసక్తిగా వింటామని, అంచేత ఫోన్లు మాట్లాడమని.
ఈరోజు ఎందుకో ఛానల్స్ మారుస్తుంటే ఈ ఛానల్ తగిలింది. మా వాళ్ళు చెప్పినట్టు ఓ స్పురద్రూపి, కంచుకంఠంతో భగవద్గీతసారం గురించి చెబుతున్నారు. చ్యవనుడు, కౌశికుడి వృత్తాంతం ఆసాంతం వింటూ పోయాను. ఆసక్తికరంగా అనిపించింది. శర్మగారి ప్రవచనం తర్వాత నారాయణతీర్ధుల వారి కీర్తనలు శ్రవణానందకరంగా అనిపించాయి.
ఆ ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అలవాటుగా రిమోట్ టీవీ చర్చల వైపు మొగ్గింది.
అంతే!......... ఇక చెప్పడానికి ఏముంది?
23-11-2021