9, జూన్ 2021, బుధవారం

సినీ నటి మామిడికాయ తింటే! – భండారు శ్రీనివాసరావు

 

“ప్రముఖ వర్ధమాన సినీ తార జలజా దేవి ఈ ఉదయం ఒంటరిగా కూర్చుని పచ్చి మామిడికాయ కొరుక్కుని తింటున్నట్టు ట్విట్టర్ లో ఓ ఫోటో పోస్టు చేశారు. దీన్ని గురించి మా ప్రత్యేక ప్రతినిధి నిజలింగప్ప ఏమి చెబుతున్నారో విందాం!
“నిజలింగప్పా! ఈ ఫోటోకి సంబంధించి మీకు తెలిసిన నిజమేమిటో మన శ్రోతలకు వివరిస్తారా!”
“త్తప్పకుండా ల్లతా! త్తప్పకుండా!
“జలజా దేవి కరోనా కారణంగా షూటింగులు లేక మూతికి గుడ్డకట్టుకుని ఇంటిపట్టునే వుంటున్నారు. ఎండాకాలం దొరికేవి కాబట్టి మామిడికాయ తిని ఉండవచ్చు. పని లేక తీరిక, చేతిలో ఫోను వున్నాయి కనుక ఫోటో తీసి పెట్టి ఉండవచ్చు. అది మామిడికాయ అని కూడా ఆవిడకి తెలిసి ఉండక పోవచ్చు. కానీ మన బ్యూరో చేసిన పరిశోధన ప్రకారం ఈ ఫోటో ద్వారా తనకు నెల తప్పింది అనే విషయాన్ని ఆవిడ దృశ్యశోభితంగా వ్యక్తపరచినట్టు భావిస్తున్నాను”
“ఈ విషయం ధృవపరచుకోవడం కోసం మెటర్నిటీ ఆసుపత్రిలోని డాక్టర్ మాతా దేవిని అడిగితే ఆవిడ తను చదువుకున్న వైద్య గ్రంధాలలో ఎక్కడా ఈ మామిడికాయ కొరుకుడు ప్రసక్తి లేదని ఘంటా పదంగా చెప్పారు”
“మరయితే మీ పరిశోధనకు ప్రాతిపదిక ఏమిటి నిజలింగప్పా!”
“అక్కడికే వస్తున్నాను ల్లతా! అక్కడికే వస్తున్నాను”
“మీరు అక్కడే వుండండి నిజలింగప్పా! అక్కడే వుండండి. మన బ్యూరో చీఫ్ సత్యపాల్ లైవ్ లో ఈ మామిడి కొరుకుడు గురించి మరిన్ని వివరాలు అందించడానికి లైవ్ లో మైకు పట్టుకుని సిద్ధంగా వుండి చాలాసేపు అయింది. ముందు ఆయన్ని అడుగుదాం. మీరు చెప్పండి సత్య! మీరేమి అనుకుంటున్నారు?”
“సత్య! కాదు, సత్యపాల్ ల్లతా! నిజాన్ని అబద్దాన్ని నీళ్ళూ పాలూ మాదిరిగా విడదీసి చెప్పగలనని నాకు సత్యపాల్ అని పేరు పెట్టారు. ఆ పేరు నిలబెట్టుకోవడానికి నేను ఈ మామిడి కొరుకుడు మీద గత నాలుగు గంటలుగా కంప్యూటర్ ముందు కూర్చుని పెద్ద రీసెర్చ్ చేశాను.
“దాని ప్రకారం ఆమ్రోపనిషత్ లో ఆరవ అధ్యాయం మూడో ఖండికలో ఈ ఆమ్ర ఫలం గురించి సవిస్తరంగా రాయబడి వుంది. కానీ కడుపుతో ఉన్న వాళ్ళు మామిడికాయ కొరుక్కుతింటారని అనే విషయం కలికానికి కూడా కనబడలేదు. గర్భిణి అయిన సీతాదేవి వాల్మీకి ఆశ్రమంలో ఉంటూ మామిడి పండ్లు తిన్నట్టు దాఖలా వుంది కానీ ఆ విషయం వాల్మీకి రామాయణంలో లేదని తలనెరిసిన పండితులు చెబుతున్నారు. పాత తెలుగు సినిమాల్లో తరచుగా కానవచ్చే ఇటువంటి దృశ్యాలని, జలజాదేవి కరోనా కాలంలో పొద్దుపోక టీవీల్లో చూసి ముచ్చటపడి, తానూ అలా మామిడి కాయ తింటున్నట్టుగా ఫోటో తీసి పోస్టు చేసి ఉండవచ్చని నా అభిప్రాయం”
“సత్య! సారీ సత్యా! సారీ పాలా! సత్యపాలా! మీరు అలాగే మైకు చేతిలో పట్టుకుని అలాగే వుండండి, సమయం వచ్చినప్పుడు మరిన్ని వివరాల కోసం మిమ్మల్ని లైవ్ లో తీసుకునే ప్రయత్నం చేస్తాము”
“నిజలింగప్పా! ఇప్పుడు చెప్పండి మరిన్ని ఆసక్తికరమైన నిజాలు. ఇంతకీ జలజాదేవి నెల తప్పినట్టా లేదా! తప్పక పొతే మామిడికాయ ఎందుకు కొరుక్కుతిన్నట్టు?”
“ల్లతా! నేను ఇప్పుడు జలజాదేవి ఫ్లాట్ లోనే వున్నాను. మామిడి కొరుకుడు మీద మన ప్రోగ్రాం చూస్తూ కొంత ఆనందంగా, కొంత కోపంగా వున్నారు. పెళ్ళే కాని తనకు నెల తప్పడం ఏమిటని ఆగ్రహంగా వున్నారు. కానీ, ఆమె హావభావాలు చూస్తుంటే, సినిమాలు లేని ఈ కరోనా రోజుల్లో కూడా తన గురించి టీవీలో చూపిస్తున్నందుకు ఆనందమే ఎక్కువ కనబడుతోంది. ఇప్పుడు నేరుగా ఆవిడనే అడిగి తెలుసుకుందాము ఎందుకు మామిడికాయ కొరుక్కు తిన్నారో! టీవీ షో అనగానే హడావిడిగా లోపలకు వెళ్ళారు, మేకప్ చేసుకోవడానికి. అదిగో వచ్చారు.
“చూడండి జలజ గారూ! మామిడికాయ అంటే మీకు అంత ఇష్టమా! లేక ఆ ఫోటో పోస్టు చేయడానికి వేరే ఏదైనా కారణం ఉందా!”
“చూడండి లింగం గారు, అదే నిజలింగప్పగారు. సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేయడానికి వేరే కారణాలు ఉంటాయని ఇప్పుడే మీవల్ల తెలుసుకుంటున్నాను. పత్రికల్లో మా ఫోటోలు రావాలంటే అధికారికంగా యాడ్స్ రూపంలో కొంతా, అనధికారికంగా మరికొంతా పైకం వదిలించుకోవాలనే సంగతి మీకు తెలియంది కాదు. కానీ ఈ సోషల్ మీడియా బుజ్జాయి వుంది చూశారు, ఎంత ముద్దొస్తోందో! ఒక్క మామిడికాయ కొరుకుడు ఏమిటి, వంట రాకపోయినా అద్భుతమైన వంటకాలు పరమాద్బుతంగా స్వయంగా చేస్తున్నట్టు ఎన్ని ఫోటోలయినా, వీడియోలు అయినా ఎంచక్కా ఇట్టే పోస్ట్ చేసుకోవచ్చు. కాచుకుని వుండే మా అభిమానులు, వాటిని అందిపుచ్చుకుని లైకుల మీద లైకులు కొట్టుకుంటూ, షేర్లు చేసుకుంటూ ప్రపంచమంతా తిప్పుతారు. పైగా అంతా పూర్తిగా ఉచితం, ప్రభుత్వ పధకాలమల్లే! ఇక టీవీల పబ్లిసిటీ అంతా ఇంతా కాదు. మీరు మామూలుగా అయితే మా ఇళ్లకు వస్తారా, ఎక్కడో ఫైవ్ స్టార్ హోటల్లోనో, లేదా ప్రైవేట్ గెస్ట్ హౌసుల్లోనో గిఫ్టుబాటు ప్రెస్ మీట్లు పెట్టి పిలిస్తేనే కాని రాని మీరు, ఇప్పుడు చూడండి, మీ అంతట మీరే పరిగెత్తుకుంటూ వచ్చారు, కెమెరా మాన్ ని కూడా వెంటేసుకుని. పైగా లైవ్ టెలికాస్ట్ కూడా. మీయాంఖరమ్మే ఇందాక చెప్పింది కదా! నేను ఓ వర్ధమాన నటిని అని. అందుకే నెమ్మదిగా ఈ కరోనా కాలంలో పబ్లిసిటీ గుట్టుమట్లన్నీ తెలుసుకుంటున్నాను.
“తెలిసిందాండీ నిజ లింగప్ప గారు.
“అదిగో ఆ బుట్టలు పట్టుకుపొండి. వాటిల్లో మంచి రకం బేనిషా కొల్లాపూర్ మామిడిపళ్ళు వున్నాయి. తీసుకుపోయి మీ టీవీ వాళ్ళకు కూడా ఇవ్వండి. తింటూ తింటూ ఇలాంటి మంచి ప్రోగ్రాములు ఇంకా కొన్ని చేయవచ్చు.
“ధన్యవాద్! షుక్రియా, థాంక్స్, కృతజ్ఞతలు”
(09-06-2021)

సుశ్రవణం – భండారు శ్రీనివాసరావు

 సి.ఎస్.ఎన్.శర్మ గారు. ఫోనులో మాట్లాడే తీరును బట్టి నాకంటే వయసులో పెద్దవారయివుంటారని అనిపిస్తుంది. విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. అనంతరం సత్యసాయి మీద వున్న భక్తి ప్రపత్తులతో పుట్టపర్తిలో భార్యతో కలిసి కొన్నాళ్లు నివాసం వున్నారు. పిల్లవాడు బాగా చదువుకుని పెద్ద డాక్టర్ అయ్యాడు. ఆయన ఉద్యోగరీత్యా శర్మగారి మకాం కూడా హైదరాబాదుకు మారింది. పుట్టపర్తిలో వుండగా సూర్య దినపత్రికలో నేను రాసే వ్యాసాలు చదివి ఒకరోజు ఫోన్ చేశారు. పుట్టపర్తి అనగానే నేను మా అన్నయ్య పర్వతాలరావు గారి గురించి చెప్పాను.

ఆయన నాకు బాగా తెలుసు. బాబా గారి ప్రేయర్ కు వెళ్లినప్పుడు మేమిద్దరం చివరి వరసలో పక్కపక్కనే కూర్చునేవాళ్లం. వారికి అక్కడ పెద్దపెద్ద వాళ్ళందరూ బాగా తెలుసు. పోయి ముందు వరసలో కూర్చున్నా అభ్యంతర పెట్టేవాళ్లు యెవరూ వుండరు. అదే అడిగితే వారి సమాధానం ఏమిటో తెలుసాండి. చిరునవ్వు. అంతే. అలాంటి మనిషిని నేను నా జన్మలో చూడలేదు. తరవాత తరవాత వేరేవారి ద్వారా వారి గురించి సమాచారం తెలిసి ఇంకా ఆశ్చర్యపోయాను. ఆయనలా పెద్దపెద్ద ఉద్యోగాలు చేసినవాళ్లు స్వామి సేవలో వుండడం కొత్తేమీ కాదు. కానీ వారెవ్వరూ పర్వతాలరావుగారిలా నిరాడంబరంగా వుండలేరు. అది మాత్రం వాస్తవం”

శర్మగారికి బాగా చదివే అలవాటు వుంది. యెక్కడెక్కడి పుస్తకాలు సేకరించి శ్రద్ధగా చదువుతారు. చదివిన సంగతులు ఎవరితోనైనా పంచుకోవాలని అనుకుంటారు. శర్మగారికి చాలా విషయాలు తేదీలు, పేర్లతో సహా గుర్తు. కానీ అవన్నీ చెబుతూనే వున్నట్టుండి, “మరచిపోయానండీ మళ్ళీ గుర్తు చేసుకుని ఫోన్ చేస్తాను” అని పెట్టేస్తారు.

అలా ఈరోజు ఓ విషయం చెప్పారు.

విశాఖ పోర్టు ట్రస్ట్ లో పనిచేస్తున్నప్పుడు శర్మగారికి చర్ల గణపతి శాస్త్రి గారు అనే పండితుడితో పరిచయం కలిగింది. శాస్త్రిగారికి వాల్తేర్ లో చిన్న ప్రింటింగ్ ప్రెస్ వుంది. ఆయన వయసు యెనభై ఆరు సంవత్సరాలు. ఒక లూనా బండిపై వైజాగులో తిరుగుతూ వుండేవారు. ఆధ్యాత్మిక గ్రంధాలు అనేకం రాశారు. వారు రాసిన ‘గణపతి రామాయణ సుధ’ అనే గ్రంధం గురించి హిందూలో రివ్యూ వచ్చింది. అదొక చెత్త అనే అర్ధం వచ్చేట్టు వుంది ఆ రెవ్యూ. శాస్త్రిగారు అది చదివి బాధ పడతారు అనుకున్నా. కానీ ఆయన చాలా తేలిగ్గా తీసుకున్నారు. తర్వాత అదే గ్రంధానికి సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది.

వారొకసారి విశాఖపట్నం రేడియోలో మాట్లాడారు. నేను కేసెట్ పై రికార్డు చేసుకున్నాను కూడా. ఇప్పుడు కేసెట్లు లేవుకదా! రికార్డర్లు లేవు. ఎలా అని గుంజాటన పడుతుంటే మా వాడు పదిహేను వందలు పెట్టి వాటిల్లో కొన్నిటిని సీడీలు గా మార్పించాడు”

శర్మగారు చెబుతూనే వున్నారు . ఇంతలో “ఏమిటో అండీ! మీకు చెప్పాలని చాలా విషయాలు గుర్తు పెట్టుకుంటాను. అదేమిటో సమయానికి మరిచిపోతుంటాను”

అంత పెద్దమనిషి పెద్ద మనసుతో ఏదో చెబుతుంటే వినడమే కదా నేను చేసేది. వాళ్ళు చెప్పేది అలా వింటుంటే ఆ వయసులో వారికి అదో తృప్తి. (నిజానికి వారి వయసెంతో నాకు తెలియదు. ఇంతవరకు చూడనూ లేదు)

 

7, జూన్ 2021, సోమవారం

ప్రాణం విలువ పెరుగుతోందా!

 

ఎన్నికలకు ముందు ప్రచార పర్వంలో ప్రజల మధ్యనే తిరుగుతూ ‘ఆఖరి నెత్తురు బొట్టు వరకు ప్రజలకొరకు పోరాడతాం’ అనే రాజకీయ నాయకులు అధికారంలోకి రాగానే అంగరక్షకుల వలయాల నడుమ జీవిస్తూ తమను గద్దె నెక్కించిన ప్రజలకు దూరం అవుతూ వుండడం మనం చూస్తూ వున్నాం.

ఇందుకు మినహాయింపులు కూడా లేకపోలేదు.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పీవీ హయాములో మొదటి సారి కేంద్ర ఆర్ధిక మంత్రి అయ్యారు. ముంబైలో స్టేట్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఒక సమావేశానికి ఠంచనుగా వచ్చారు. బ్యాంకు చైర్మన్ తో సహా సీనియర్ అధికారులందరూ ఎదురు చూస్తుండగా ఒక అంబాసిడర్ కారు వచ్చింది. అందులో నుంచి మన్మోహన్ సింగ్ కారు తలుపు తీసుకుని కిందికి దిగారు. వెంట ఒక పియ్యే, డ్రైవర్ ఇంతే సిబ్బంది. వెనుక ఒక పోలీసు జీపులో ఒక ఇనస్పెక్టర్, ఒక కనిస్టీబు, ఇంతే సెక్యూరిటీ.

అది చూసి బ్యాంకు అధికారులు నివ్వెర పోయారు. అంతకు ముందు వారు అనేకమంది ఆర్ధిక మంత్రుల హంగూ, ఆర్భాటం ఎరిగిన వారు కనుకనే వారిలో ఈ నివ్వెరపాటు.

6, జూన్ 2021, ఆదివారం

ఆడామగా జర సోచో – భండారు శ్రీనివాసరావు


మనం ఒకరితో స్నేహం చేసేది..
మనం ఒకరిని పెళ్ళి చేసుకునేది...
మనం ఒకరిని ప్రేమించేది....
మనం ఒకరిని అభిమానించేది.......
పొద్దస్తమానం వారి తప్పులను ఎత్తిచూపుతూ కించపరచడానికేనా?
పొద్దస్తమానం వారి పొరపాట్లను వేలెట్టి చూపడానికేనా?
పొద్దస్తమానం ఆగర్భ శత్రువుల్లా పోట్లాడుకోవడానికేనా?
ఎక్కడైతే ... హక్కుల ప్రస్తావన రాకుండా ఉంటుందో
ఎక్కడైతే ... చట్టాల(రూల్స్) ప్రస్తావన లేకుండా ఉంటుందో
ఎక్కడైతే ... అహం తన విశ్వరూపాన్ని ప్రదర్శించకుండా ఉంటుందో
ఎక్కడైతే ... బలహీనతలను చూసీ చూడకుండా ఉండడానికి వీలుంటుందో
ఎక్కడైతే ... పొరపాట్లను మన్నించే విశాలమైన మనస్సు ఉంటుందో
ఎక్కడైతే ... తన మాటే నెగ్గాలనే పంతాలు, పట్టింపులు వుండవో
ఎక్కడైతే ...''అవసరానికి'' కాక ''ఆత్మీయతకు” మాత్రమే చోటుంటుందో
ఎక్కడైతే ... చేసిన తప్పుకు క్షమాపణ అడిగే/ మన్నించే వీలుంటుందో
అక్కడ బంధాలు బలంగానే ఉంటాయి.
అక్కడ మనుషులతోపాటు మనసులూ మాట్లాడతాయి.
తప్పే చేయని సత్యహరిశ్ఛంద్రులే కావాలంటే అలాటివాళ్ళు గృహాల్లో దొరకరు వేరే గ్రహాల్లో వెతుక్కోవాల్సిందే.
పొరపాట్లే చేయనివారు కావాలంటే సమాజoలో దొరకరు సమాధుల్లో వెతుక్కోవాల్సిందే!.
ఆలోచించండి.

5, జూన్ 2021, శనివారం

ఏమి బాధలే హలా! - భండారు శ్రీనివాసరావు

 పూర్వం నేను బెజవాడ ఆంధ్రజ్యోతి దినపత్రికలో పనిచేసే రోజుల్లో ఒకసారి ‘బాధ’ అని రాయడానికి పొరబాటున ‘భాద” అని భా కు ఒత్తు తగిలించాను. అది చూసిన ఎడిటర్ నండూరి రామమోహన రావు గారు, ‘ఎంత బాధ అయితే మాత్రం ఇంత భాదా’ అంటూ సుతారంగా ఆ తప్పును ఎత్తి చూపించారు. యాభయ్  ఏళ్ళ తరువాత కూడా నాకిప్పటికీ ఇది జ్ఞాపకం వుంది.

అది సరే! ఈ ‘భాద’ మహాకవి కాళిదాసుకు కూడా తప్పలేదని చెప్పే ఒక ఐతిహ్యం వుంది.

ఓ పండితుడు ఎలాగైనా సరే పాండిత్యంలో కాళిదాసును ఓడించి తీరాలని పట్టుదలతో వచ్చాడు. ఆయన్ని ఆస్థానానికి తీసుకురావడానికి వెళ్ళిన పల్లకీ బోయీల్లో ఒకడుగా కాళిదాసు కూడా కావాలనే వెడతాడు. పల్లకీ మోత అలవాటులేక మాటిమాటికీ భుజం మార్చుకుంటున్న కాళిదాసుని గమనించి పల్లకీలో విలాసంగా కూర్చున్న ఆ పండితుడు అంటాడు ‘ఏమయ్యా పల్లకీ మోయడం భాదగా ఉందా’ అని. భాద అన్న ముక్క వినగానే బోయీ వేషంలో వున్న కాళిదాసు, ‘’భాద అనే నీ అపశబ్దం కంటే పల్లకీ కొమ్ము మోయడం బాధగా లేదులే’ అంటాడు.

దానితో పండితుడికి గర్వభంగం కావడం, కాళిదాసు కాళ్ళమీద పడడం వేరే కధ.

మౌనమే నీ భాష – భండారు శ్రీనివాసరావు

 అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో – చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ – పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని – బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. ‘నా బాబే! నా తండ్రే!’ అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.’ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ ‘ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా’ అనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.

కరివేపాకూ, తోటకూరో  ఏదో ఒక పేరుతొ  చిన్నప్పుడు  చదువుకున్న ఈ నీతికధ అందరికీ తెలిసిందే. ఇటీవల  జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.

మంచివాళ్ల మౌనం మరీ ప్రమాదం అని పెద్దలు జయప్రకాశ్ నారాయణ్ చెబుతుంటారు. అయితే, చెబితే వినేవాళ్ళు లేనప్పుడు, వినిపించుకునే పరిస్తితి లేనప్పుడు మౌనమే శ్రేయస్కరమని విదురనీతి చెబుతోంది. నాకు అర్ధం అయినంతవరకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అర్ధం లేని రగడలో విదురుడి మాటే రైటని పిస్తోంది.

ఇలా మాట్లాడ్డం తగదు అని ఒకరికి చెప్పబోయేలోగా మరొకరు రెచ్చిపోయి మాట్లాడతారు. తెరవబోయిన నోరు ఠక్కున మూతబడిపోతుంది.

4, జూన్ 2021, శుక్రవారం

నా మొదటి స్కూటరు – భండారు శ్రీనివాసరావు

 కలకత్తా (ఇప్పుడు కోల్ కటా) కార్యస్థానంగా కలిగిన యునైటెడ్ బాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ ఎనభయ్యవ దశకం ప్రధమార్ధంలో అనుకుంటాను హైదరాబాదు వచ్చి అప్పటి బంజారా హోటల్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. అలాటి వాటికి రాయని భాస్కరులు (పత్రికా రచయితలు) ఒకరిద్దర్ని మినహాయిస్తే డ్యూటీమీద వచ్చే వాళ్ళు పట్టుమని పదిమంది కూడా వుండేవాళ్ళు కాదు. అందువల్ల మాటా మంతీ మాట్లాడుకోవడానికి వ్యవదానం, వెసులుబాటు ఉండేవి. అప్పటికే జర్నలిజం వృత్తిలో చేరి పుష్కర కాలం గడిచింది కాని (ద్విచక్ర)వాహనయోగం పట్టలేదు. కొత్త స్కూటరు ఖరీదు పదివేల లోపే. బాంకు ఋణం ఇచ్చినా మూడు నాలుగు వేలు చేతినుంచి పెట్టుకోవాల్సి రావడం వల్ల అప్పు ఇచ్చే బాంకులవాళ్ళు వున్నా తీసుకోవడానికి ఓ పట్టాన ధైర్యం చాలేది కాదు. ఈ నేపధ్యంలో యునైటెడ్ బాంకు చైర్మన్ హైదరాబాదు వచ్చారు. ఆయన బాంకులు, లోన్లు గురించి మాట్లాడుతుంటే ఆకాశవాణి న్యూస్ ఎడిటర్ మల్లాది రామారావు జర్నలిస్టులకు స్కూటర్ లోన్లు గురించి కదిలించారు. ఆయన వెంటనే స్పందించి అక్కడ వున్న స్తానిక బాంకు అధికారిని పిలిచి వెంటనే కావాల్సిన వారికి లోన్ శాంక్షన్ చేసి ఆ విషయం తనకు తక్షణం తెలియచేయాల్సిందని హుకుం జారీ చేసారు. సరే ప్రెస్ కాన్ఫరెన్స్, దరిమిలా ఏర్పాటు చేసే విందు భోజనాలు ముగిసిన తరువాత ఎవరి ఇళ్ళకు వాళ్ళం వెళ్ళిపోయాం.

రెండు రోజుల తరువాత కోటీ లోని యునైటెడ్ బాంకు నుంచి ఫోను వచ్చింది. లోను కోసం రాలేదేవిటి అని వాకబు. ఆశ్చర్యం వేసింది. నమ్మబుద్ది వేయలేదు. అపనమ్మకంతోనే అక్కడికి వెళ్లాను. బాంకు అధికారి స్కూటరు లోనులో ఓ ఇరవై శాతం అయినా ముందు ధరావతు మొత్తంగా కట్టమన్నాడు. ఆ డబ్బే వుంటే మీ దగ్గరకు ఎందుకు వస్తామని లేచి రాబోతుంటే ఆయనే మళ్ళీ కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి ‘మీకు లోను శాంక్షన్ చేసి మళ్ళీ మా హెడ్ ఆఫీసుకు ఈ సాయంత్రానికల్లా రిపోర్ట్ చేసుకోవాలి, ముందు చెక్కు తీసుకు వెళ్ళండి’ అని హామీదారుల సంతకాలు కూడా అడక్కుండా కాసేపట్లో చెక్కు చేతిలో పెట్టాడు. ఆ రోజుల్లోనే, గుజరాత్ గవర్నమెంటు వాళ్ళ గిర్నార్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. అంతా వెస్పా స్కూటర్ మోజులో వున్నారు. కానీ అది దొరకాలంటే చాలా ఏళ్ళు వెయిట్ చేయాలి. దాంతో చాలామందికి గిర్నార్ స్కూటర్ వరప్రసాదంలా కనబడింది. అంతకు రెండు రోజులముందే ఎక్స్ ప్రెస్ సుందరం గారు గిర్నార్ కొనుక్కుని దాన్నే నాకు సిఫారసు చేయడంతో నేనూ అదే కొనుక్కున్నాను. మా వైభోగం ఎలా ఉండేదంటే గిర్నార్ మనిషి మా ఇంటికే వచ్చి స్కూటర్ ను సర్వీసింగుకు తీసుకువెళ్ళేవాడు.
1987లో మాస్కో వెళ్ళడానికి కొన్ని మాసాల ముందు జరిగిన ‘హెల్మెట్ ధరించని జర్నలిస్ట్ అరెస్ట్’ అనే సంచలన ఉదంతానికి కారణమైన ‘నేను’, ఆరోజు వెడుతున్నది ఈ గిర్నార్ స్కూటర్ మీదనే.
ఆ కధ అనేక మలుపులు తిరిగి సుఖాంతం అయింది కానీ ఆనాటి నుంచి స్కూటర్ ఎక్కలేదు.




ఇక హెల్మెట్ ఉపాఖ్యానం ఏమిటంటే:
హెల్మెట్ నిబంధన పాటించనందుకు నన్ను ఓ పోలీసు ఇన్స్పెక్టర్ పట్టుకుని హుమాయూన్ నగర్ పోలీసు స్టేషన్ లో పెట్టారు. ఈ సంగతి తెలిసి వివిధ పత్రికల్లో పనిచేసే విలేకరులు, సీనియర్లు స్టేషన్ బయట ధర్నా చేశారు. మర్నాడు అసెంబ్లీ ఈ కారణంగా వాయిదా పడింది. ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ సంఘటన పై దర్యాపుకు రిటైర్డ్ న్యాయమూర్తి చైర్మన్ గా ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ పోలీసు అధికారిని బదిలీ చేశారు ఈ క్రమంలో..
చిత్రంగా మరో మలుపు తిరిగింది. రాయలసీమకు చెందిన ఆ న్యాయమూర్తికి గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ లో కార్యాలయం ఏర్పాటు చేశారు. అక్కడ కలుసుకోవాలని నాకు వర్తమానం పంపారు.
తీరా వెడితే ఆ రిటైర్డ్ జడ్జి గారి అమ్మాయి రేడియోలో నా జీవన స్రవంతి కార్యక్రమానికి అభిమాని. నన్ను చూస్తాను అంటే ఆయన వెంటబెట్టుకుని వచ్చారు. హెల్మెట్ లేదని నన్ను పట్టుకున్న ఇన్స్పెక్టర్ కూడా వచ్చారు. ఆయన మా ఆఫీసులో పనిచేసే ఓ ఉద్యోగికి చుట్టం. అతడ్ని తీసుకుని మా ఇంటికి వచ్చి తన ఉద్యోగానికి ఇబ్బంది లేకుండా చూడమని కోరాడు. ఆ విషయం నేను అప్పుడే మరచిపోయాను కాబట్టి మీకు అపకారం చేసే ఉద్దేశ్యం నాకు లేదని అతడికి భరోసా ఇచ్చాను.
తర్వాత అదే మాట జడ్జి గారెతో చెప్పాను. త్వరలోనే నేను మాస్కో పోతున్నాను కాబట్టి, ఎవరూ నా కారణంగా బాధ పడడం ఇష్టం లేదని అన్నాను. జరిగింది దురదృష్టకర సంఘటన కాబట్టి మరచిపోవడమే దీనికి పరిష్కారం అని కూడా చెప్పాను.
ఆయన నా మాట మన్నించారు. ఆవిధంగానే కేసు మూసేశారు.
తర్వాత చాలా కాలానికి (అప్పుడు నేను ఇండియాలో లేను) అసెంబ్లీకి ప్రభుత్వం ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పించింది.
కధకు ఆవిధంగా శుభం కార్డు పడింది.