18, మే 2021, మంగళవారం

ధైర్య్యప్పిల్ల


మాకు తెలిసిన కుటుంబం కనుక పేర్లు చెప్పడం బాగుండదు. కానీ ఈ కరోనా కాలంలో నలుగురు తెలుసుకోవాల్సిన విషయం కనుక మిగిలిన వివరాలు రాస్తున్నాను.
అత్తా మామా, కొడుకూ కోడలు, వాళ్లకు ముగ్గురు పిల్లలు. అత్తామామలు పెద్ద వయసువాళ్ళు. మొగుడికి ఇంటి నుంచే పని. పిల్లలు కూడా అప్పటికి ఆన్ లైన్ క్లాసులు. కోడలు చదువుకున్నది చిన్నా చితకా చదువు కాదు. మంచి డాక్టరు. పైగా, కరోనా కాలంలో సెలవు దొరకని, తప్పనిసరిగా వెళ్ళాల్సిన ఉద్యోగం కూడా.
ఒకరోజు వృద్దురాలయిన అత్తగారికి గొంతులో నొప్పితో పాటు జ్వరం వచ్చింది. ఇంటిల్లిపాదీ కంగారు పడ్డారు. ఆసుపత్రి నుంచి వచ్చిన కోడలు ఏమాత్రం కంగారు పడకుండా, ‘మీకు వచ్చింది కరోనా కాదు’ అని గట్టిగా చెప్పింది. చెప్పింది డాక్టరు. నమ్మక పొతే ఎలా.
ఏదో వైద్యం చేస్తున్నట్టు బ్లడ్ సాంపిల్ తీసుకుంది. ‘కరోనా టెస్ట్ చేయిద్దాం’ అంటే అసలు ఆ అవసరమే లేదు. కొన్ని రోజులు విడిగా వుంటే చాలు అని వాళ్ళ పడక గదిలో అత్తగారిని వుంచి, మామగారి పడకను బయటకు మార్చింది. ఇదంతా ముందు జాగ్రత్త కోసమే కానీ అత్తయ్యకు వచ్చింది కరోనా కాదు అని మళ్ళీ స్థిరంగా చెప్పింది.
రెండోరోజు పాజిటివ్ అన్న రిజల్ట్ వచ్చింది. కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. మీకు వచ్చింది వేరే. నేను మందులిస్తాను, వేసుకోండి, కాకపొతే కొన్ని రోజులు విడిగా, ఒంటరిగా ఉండక తప్పదు అని తేల్చి చెప్పింది.
ఉదయం ఆసుపత్రికే వెళ్ళే ముందే ఆవిడకి అవసరమైన ఆహారం మందులు ఇచ్చి వెళ్ళేది.
తనకు వచ్చింది కరోనా అనే అనుమానం మనసు మూలల్లో ఉన్నప్పటికీ, కోడలు అంత గట్టిగా చెబుతుండేసరికి ఆ అనుమానం ఆవిరై పోయింది. ఎలాంటి భయం లేకుండా ఐసోలేషన్ లో రెండు వారాలు వుండి బయటకు వచ్చింది.
ఇప్పటికీ ఆమెకు తెలియదు, తనకు కరోనా వచ్చి తగ్గిపోయిందని. కోడలుకు తెలుసు, కరోన వచ్చిందని తెలిస్తే అత్తగారు అంత నిబ్బరంగా ఐసోలేషన్ లో గడపలేదని.
మొత్తానికి కోడలు పిల్ల ధైర్యం చేయబట్టి కధ సుఖాంతం అయింది.
(18-05-2021)

17, మే 2021, సోమవారం

టెర్రర్ పోలీస్ గబ్బర్ సింగ్ ఇక లేరు

 మూడున్నర దశాబ్దాల క్రితం హైదరాబాదు పాత బస్తీలో గబ్బర్ సింగ్ అంటే చాలు సంఘ విద్రోహశక్తులకు టెర్రర్.


(KSN MURTHY IPS)


గూండాల గుండెల్లో నిద్రపోతూ గబ్బర్ సింగ్ అనే పేరు తెచ్చుకున్న ఆ పోలీసు అధికారి అసలు పేరు కె.ఎస్.ఎన్. మూర్తి. నా మేనకోడలు భర్త ఐ.పి.ఎస్. అధికారి రావులపాటి సీతారామారావు గారెకి బ్యాచ్ మేట్. రాష్ట్రంలో అక్కడా ఇక్కడా కొన్నాళ్ళు పనిచేసి ఇద్దరూ దాదాపు ఒకేసారి హైదరాబాదు వచ్చారు. పాత బస్తీలో పక్కపక్క జోన్లలో ఎసీపీలుగా జాయిన్ అయ్యారు. ఇద్దరి అధికార నివాసాలు కూడా పక్కపక్కనే, పంజాగుట్ట ఆఫీసర్స్ కాలనీలో.

ఆ విధంగా కె.ఎస్.ఎన్. మూర్తి గారు మా కుటుంబ సభ్యులు అందరికీ పరిచయం. మనిషి బొద్దుగా, ఎత్తుగా,  పోలీసు యూనిఫారంలో అయితే మరీ   భీకరంగా కానవచ్చేవారు. చిల్లర రౌడీలను, గ్యాంగ్ లీడర్లను సినిమాల్లో చూపించినట్టు ఉరికించి కొట్టేవాడని, ఆ రోజుల్లో వచ్చిన షోలే సినిమాలో పాత్ర గబ్బర్ సింగ్ అనే నిక్  నేమ్ ఆయనకు స్థిరపడి పోయిందని జనం చెప్పుకునే వారు. పోలీసు డిపార్ట్ మెంటులో పై అధికారులు కూడా ఆయన్ని అసలు పేరుతొ కాకుండా గబ్బర్ సింగ్ అని పిలిచేవారని ప్రతీతి.

ఒకసారి ఆయన భారీ కాయాన్ని తగ్గించుకునేందుకు ప్రకృతి ఆశ్రమంలో చేరి బరువు బాగా తగ్గారు. ఆ రూపంలో గుర్తుపట్టని నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు ‘ఏడీ మన గబ్బర్ సింగ్ రాలేదా ఈ  మీటింగుకు’ అని వాకబు చేశారట.

‘అదేమిటి ఇలా తగ్గిపోయారు, అలా భారీ మనిషిగా ఉంటేనే కదా రౌడీలు మిమ్మల్ని చూసి భయపడతారని అలాంటి చోట్ల పోస్టింగు ఇచ్చింది’ అని ఆశ్చర్యపోయారని సీతారామారావుగారు తన సహచరుడిని తలచుకుంటూ ఓ పాత జ్ఞాపకం పంచుకున్నారు

(16-05-2021).  

   

అద్దంకివారి గేదె

 ఇది ఇప్పటి సంగతి కాదు, అరవై ఏళ్ళ పైమాటే!

ఖమ్మంజిల్లా దెందుకూరు నివాసి అద్దంకి రాఘవయ్య గారికి గేదెలు అంటే ప్రాణం. ఎక్కడెక్కడో తిరిగి బర్రెలు కొనుక్కు రావడం ఆయనకో వ్యాపకం. ఒకసారి అదేపని మీద బెజవాడ వెళ్ళారు. అద్దంకి శ్రీరామ మూర్తి గారు ప్రముఖ రంగస్థల నటులు. వారి అబ్బాయి కృష్ణ ప్రసాద్. ఇప్పడు ఏం చేస్తున్నారో తెలవదు కానీ, కొన్నాళ్ళు రేడియోలో వార్తలు చదివారు.
బెజవాడలో అద్దంకి శ్రీరామమూర్తి గారి బర్రెను బేరమాడి కొనుక్కున్నారు దెందుకూరు రాఘవయ్య గారు. అలా వేరే చోట కొన్న పశువుల్ని సొంత ఊరు తీసుకువెళ్ళాలి అంటే ‘రహదారి’ రాయించాలి. అంటే ‘ఆ పశువును దొంగతనంగా తీసుకువెళ్ళడం లేదు, డబ్బు పెట్టి కొనుక్కు వెదుతున్నట్టు తెలిపే పత్రం’ అన్నమాట. ఆ రాదారి రాయిస్తుంటే క్రయవిక్రయదారుల ఇంటి పేర్లు ‘ఒక్కటే’ అన్న విషయం బయట పడింది. అప్పుడెవరో అన్నారుట. ‘ పరవాలేదు, అద్దంకివారి గేదె తిరిగి అద్దంకి వారి ఇంటికే వెడుతోంది’ అని.
నేను రాసిన రేడియో న్యూస్ రీడర్లు అనే కధనం చదివి, ఖమ్మం నుంచి అద్దంకి కృష్ణ ప్రసాద్ అనే పెద్దమనిషి ఫోను చేసారు. ఆయన రాఘవయ్య గారి కుమారుడు. హెడ్ మాస్టర్ గా చేసి రిటైర్ అయ్యారు. అద్దంకి శ్రీరామమూర్తి గారి తనయుడు కృష్ణ ప్రసాద్ కూడా రేడియోలో వార్తలు చదివారని ఆయనే నాకు చెప్పారు. ఈ విషయం నిజంగా నాకు తెలియదు. మొత్తంమీద ‘రహదారి’ గురించి ఒక కొత్త విషయం అయితే తెలిసింది. అంతే చాలు.

16, మే 2021, ఆదివారం

జీవితంలో కధలు

 జీవితంలో కొన్ని సంఘటనలు కధలకు ఏమాత్రం తీసిపోవు.

చాలా ఏళ్ళ క్రితం, 2005లో కాబోలు, తానా వారి ఆహ్వానం మేరకు అమెరికా వెళ్లాను.

‘ఎంతకాలం అమెరికాలో వుంటారు అనే ఇమ్మిగ్రేషన్ అధికారి ప్రశ్నకు ‘అయిదు రోజులు’ అని జవాబిచ్చాను. ‘ఫైవ్ డేస్ ఓన్లీ అన్నాడతగాడు ఒకింత ఆశ్చర్యంతో.  నిజానికి నా రిటర్న్ ఫ్లైట్ కూడా ఐదో రోజునే వుంది. తీసి చూపించాను. ఆల్ ది బెస్ట్ అన్నాడు స్టాంప్ వేస్తూ.

బయటకి వచ్చి చూసుకుంటే ఆరు నెలలు అని వుంది. పదేళ్ల మల్టిపుల్ విజిటర్స్ వీసా నాది. అమెరికాలో ఉండడానికి ఎక్కువలో ఎక్కువ అనుమతించే ఆరు మాసాల వ్యవధిని  నాకిచ్చినట్టు.

తానా సభలు జరిగే డెట్రాయిట్ నగరంలో విదేశాల నుంచి వచ్చిన అతిధులకు కొన్ని హోటళ్ళలో బస ఏర్పాటు చేశారు. పెద్ద ఆడంబరంగా లేకపోయినా గదిలో అన్ని వసతులు వున్నాయి. ఒక్కో గదిని  ఇద్దరిద్దరికి  చొప్పున కేటాయించారు. నాతొ పాటు గదిలో ఉన్న వ్యక్తి వచ్చినప్పటి నుంచి చాలా టెన్షన్ తో వున్నట్టు కనిపించాడు. మర్నాడు డెట్రాయిట్ మాజీ మేయర్ , కీర్తిశేషులు ఆల్బర్ట్ కోబో పేరిట నిర్మించిన సువిశాల సభామందిరంలో తానా సభలు మొదలవుతాయి.

అతడితో పెద్దగా మాట్లాడానికి నా దగ్గర కూడా విషయాలు లేవు. అంత పరిచయమూ లేదు. అయినా అతడి మొహంలో కనబడుతున్న  టెన్షన్ తగ్గించడానికి వివరాలు అడుగుతూ మాటల్లో పెట్టాను.

‘ఎవరికీ చెప్పకండి. నేను ఈ ఒక్క రాత్రే వుంటాను. తెల్లారేసరికల్లా వెళ్ళిపోతాను అన్నాడు. నాకు ఆశ్చర్యం. సభలకోసం వచ్చి తెల్లారి వుండననడం ఏమిటి?  ఎక్కడికి అని అడిగేలోగా అతడే అన్నాడు.

‘ఎక్కడికి పోవాలో సరిగ్గా నాకే తెలియదు. పలానా  చోటుకి వెళ్ళమని హైదరాబాదులో చెప్పారు. అదేమిటో ఎక్కడో ఎలా వెళ్ళాలో తెలియదు. కానీ వెళ్లి తీరాలి’ అన్నాడు.

‘సరిపడా డబ్బులు ఉన్నాయా అని అడిగాను. అడిగితే ఇవ్వడానికి నా దగ్గరా ఎక్కువేమీ లేవు. ఏదో అయిదు రోజులు, అదీ వాళ్ళ ఆతిథ్యంలో ఖర్చులు ఏముంటాయి అనే అభిప్రాయంతో ఎక్కువ డాలర్లు కూడా తెచ్చుకోలేదు.

‘అక్కరలేదు. నేను ఆ ఏర్పాటుతోనే వచ్చాను. ఓ మూడు నెలలకు సరిపడా డబ్బులు వున్నాయి. తర్వాత నా అదృష్టం’ అన్నాడతను.

మాటల్లో వివరాలు చెప్పాడు. అతడో ఎలిమెంటరీ స్కూలు టీచరు. పెద్ద సంసారం, చిన్న జీతం. ఎన్నాళ్ళిలా అనుకుంటూ వుంటే ఎవరో చెప్పారు, ‘అమెరికా వెళ్ళు, అది అవకాశాల దేశం, ఏదో ఒక పని దొరక్కపోదు అని.

‘ఎలా వెళ్ళడం?’ అంటే ...

‘అది కూడా అతడే చెప్పాడు. ఏదో ఒక విధంగా విజిటర్ వీసా సంపాదించి వెళ్ళు. ఒక్కసారి అమెరికాలో అడుగుపెడితే రోజుకిన్ని డాలర్లు, గంటకిన్ని డాలర్లు చొప్పున  ఇచ్చే వాళ్ళు వుంటారు. నీ ఖర్చులకు పోను ఇంటికి డబ్బులు కూడా పంపుకోవచ్చు అని ఉత్సాహ పరిచాడు

‘ఏమి చేయాలని ఆలోచిస్తున్న నాకు అతడిచ్చిన ఈ  సలహా మరేదీ ఆలోచించకుండా చేసింది. అంతే! ఉన్న కొంత పొలం అమ్మ వద్దంటున్నా అమ్మేసాను. అప్పటినుంచి చేయని ప్రయత్నం లేదు, వీసా సంపాదించడానికి. ఇన్నేళ్ళకు కుదిరింది. ఇంట్లో బయలుదేరిన దగ్గరి నుంచి ఒకటే బెంగ. మళ్ళీ మా ఊరికి తిరిగి వెడతానా! మా వాళ్ళను మళ్ళీ నా కళ్ళతో చూడగలుగుతానా!’

నాకు ఏమి చెప్పాలో తెలియలేదు. మౌనంగా వుండిపోయాను.

అతడే మొదలు పెట్టాడు మళ్ళీ.

‘ఎవరిదో తెలుగు వాళ్లది ఫాం హౌస్ వుండట, దానికి కేర్ టేకర్ కావాలిట. ఎక్కడో అడవీ ప్రాంతంలో వుందట. పలానా చోటు వరకు రాగలిగితే వాళ్ళే తీసుకు వెడతారట. ఆరు నెలలు స్టాంప్ వేశారు. ఈలోగా ఏదో ఒక మంచి ఉద్యోగం పట్టుకోవాలి

మనిషిని చూస్తే పిరికివాడిలా వున్నాడు. ఇంత ధైర్యం ఎలా చేశాడు? దేశం కాని దేశంలో, ఊరు కాని వూళ్ళో భాష కూడా సరిగా లేకుండా ఎలా నెగ్గుకు రాగలడు?

డబ్బు అవసరాలవల్ల, మరీ పచ్చిగా చెప్పాలంటే డబ్బు యావలో పడి జీవితంలో ఇంత రిస్క్ తీసుకోవాలా!

ఆ రాత్రి ఎక్కడో డిన్నర్ ఏర్పాటు చేశారు. అతడు రాలేదు. ఏదో కొనుక్కుని తింటాను రానన్నాడు. వచ్చేసరికి నిద్ర పోతున్నాడు.

తెల్లారి చూస్తే పక్క మీద లేడు, అసలు గదిలోనే లేడు.

ఇంత పెద్ద సువిశాల దేశంలోకి అతడు ఒంటరిగా నడుచుకుంటూ వెడుతున్న దృశ్యమే నా ఊహకు మిగిలింది.

అతడు ఉద్యోగం సంపాదించుకున్నాడా! ఆ దేశంలో స్థిర పడ్డాడా! ఎప్పటికయినా మన దేశానికి వచ్చి భార్యాబిడ్డలను చూడగలిగాడా! అలా జరిగితే ఎంత బాగుంటుందో కదా!

ఆ తర్వాత ఎప్పుడు అమెరికా వెళ్ళినా నా మదిలో ఈ ప్రశ్నలు తలెత్తేవి. కాకపోతే జవాబు దొరకని ప్రశ్నలు.  (16-05-2021)         

కరెంటులో బల్లి పడింది

 

హైదరాబాదులో మీకు ఒక్కరికే అధికారులు స్పందిస్తారా అని ఒక మిత్రుడు కామెంటు పెట్టారు. ఒక్కోసారి నాకూ ఈ అనుమానం వస్తుంటుంది. జర్నలిస్టు అవతారం చాలించి జనసామాన్యంలో నలుగురితో నారాయణ అంటూ జీవితం ప్రారంభించి కూడా పదహారేళ్ళు దాటిపోయింది. నాకు తెలిసిన అధికారులు కూడా తదనంతర కాలంలో రిటైర్డ్ జాబితాలో చేరిపోయారు. నిజం చెప్పాలంటే చాలామంది ఫోన్ నెంబర్లు కూడా తెలవదు.
మళ్ళీ కరెంటు కోతలు మొదలయినట్టున్నాయే అని పెట్టిన పోస్టుకు ముగ్గురు ఉన్నతాధికారులు స్పందించడం నాకు ముచ్చట అనిపించింది. వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు. నేను వాళ్లకి ఒకటే చెప్పాను. కరెంటు సరఫరా పునరుద్ధరణ అయిన దానికంటే కూడా మీ ప్రతిస్పందన నాకు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చిందని.
అందరికీ ఇలా జరుగుతుందా అనేది నిజంగా శేష ప్రశ్నే. నా దగ్గర కూడా జవాబు లేదు.
ఈ పోస్టుకు కూడా ఓ చిన్న నేపధ్యం వుంది.
కొద్ది సేపటి క్రితం ఆనంద్ గారనే పెద్ద మనిషి ఫోన్ చేశారు. ఆయన పెద్ద మనిషే కాదు, విద్యుత్ శాఖలో పెద్ద అధికారి కూడా. (SE).
రాత్రి ఓ బల్లి కారణంగా విద్యుత్ సరఫరాకు కొంత అంతరాయం కలిగిందని చెబితే ఆశ్చర్యపోయాను. చెట్ల కొమ్మల వల్ల అప్పుడప్పుడూ ఇలా జరుగుతుందని తెలుసు. కానీ బల్లిపాటు వల్ల కూడా కరెంటు ట్రిప్ అవుతుందన్న మాట.
సరే! ఈ సంగతి పక్కనపెడితే నేను చెప్పేది ఒక్కటే. స్పందించే అధికారులు, సిబ్బంది వుంటే ప్రజలకు ఓ భరోసా వుంటుంది. చెప్పింది వినే నాధుడు వుంటే సగం సమస్య తీరుతుందంటారు.
(16-05-2021)

15, మే 2021, శనివారం

2017 లో ఒక రోజు

 ఇలా కూడా జరుగుతుంది

పన్నెండు గంటలు కొట్టడానికి ఒక్క నిమిషం మాత్రమే వ్యవధి వుంది.

ప్రపంచం అంతా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి సిద్ధమై వుంది.

నేను రెడీ’ అన్నాడాయన మేనల్లుడితో. మేనమామ అన్నమాటే ఆ పెద్దరికం ఎన్నడూ చూపించేవాడు కాదు. ఒక స్నేహితుడికంటే ఎక్కువ చనువు ఆయనతో.

పిల్లలు అమెరికాలో వుంటారు. న్యూ యియర్ బెల్స్ మోగుతుండగానే వాళ్ళు ఒకరి వెంబడి మరొకరు వీడియో కాల్స్ చేశారు. చేతిలో గ్లాసుతోనే వాళ్ళని గ్రీట్ చేసాడు. కాసేపు మాటలు, ముచ్చట్లు. అన్నీ విస్కీ సిప్ చేస్తూనే. చేస్తూనే కుర్చీలో ఓ పక్కకి ఒరిగిపోయాడు. ఏం జరిగిందో అందరికీ తెలిసేలోగానే జరగకూడనిది జరిగిపోయింది. పక్క పోర్షన్ లో ఉంటున్న డాక్టర్ వచ్చి చూసి చెప్పిన ఆ సంగతి విని ఇంటిల్లిపాదీ మ్రాన్పడి పోయారు.

అప్పటి దాకా అన్ని కబుర్లు చెప్పిన ఆ మనిషి ఇక లేరు. ‘నేను రెడీ’ అంటే అర్ధం ఇదా!

మొన్న రాత్రి విందు భోజనం సందర్భంలో ఆ మేనల్లుడు చెప్పిన కధనం ఇది.

Yes. Truth is stranger than fiction.

 

14, మే 2021, శుక్రవారం

నేరము శిక్ష పత్రికలు

 

ఇది జరిగిన కధే. అంచేత ఓ కధలా ముచ్చటిద్దాం. పేర్లూ, ఊర్లూ తర్వాత చెప్పుకుందాం.
అతడో పెద్ద అధికారి. భార్యా, ముగ్గురు పిల్లలు. ఉద్యోగ బాధ్యతల కారణంగా అతడు నెలలో చాలా రోజులు వేరే ఊళ్లలో ఉంటుంటాడు. ఈ క్రమంలో అతడి భార్యకు భర్త స్నేహితుడితో సంబంధం ఏర్పడుతుంది. విడాకులు తీసుకుని అతడ్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుంది. కానీ ఆ ప్రియుడి ఉద్దేశ్యం వేరు. ఆడవాళ్ళను వాడుకుని వదిలేసే రకం.
ఈ విషయం భర్తకు తెలుస్తుంది. అధికార రీత్యా ప్రభుత్వం అతడికి సమకూర్చిన రివాల్వర్ తీసుకుని భార్యను లోబరుచుకున్న వ్యక్తి ఇంటికి వెడతాడు. నా భార్యను పెళ్లి చేసుకుని, నా పిల్లల్ని నీ పిల్లలుగా చూసుకునే ఉద్దేశ్యం ఉందా లేదా అని నేరుగా అడిగేస్తాడు. ‘నాతొ కాలక్షేపం చేసిన ప్రతి అమ్మాయిని పెళ్ళాడాలంటే నేను వెయ్యి పెళ్ళిళ్ళు చేసుకోవాలని అతడు ఎకసెక్కంగా మాట్లాడుతాడు. భర్తకు పట్టలేని ఆగ్రహం కలిగి పిస్టల్ తో కాలుస్తాడు. భార్య ప్రియుడు అక్కడికక్కడే ప్రాణాలు విడుస్తాడు. అతడు నేరుగా పోలీసు స్టేషన్ కు వెళ్లి నేరం ఒప్పుకుని లొంగిపోతాడు. కేసు విచారణ సుదీర్ఘంగా సాగుతుంది. జ్యూరీ అతడ్ని నిర్దోషిగా పరిగణిస్తుంది. కానీ సెషన్స్ జడ్జి జ్యూరీ నిర్ణయాన్ని కాదని కేసును హై కోర్టుకు పంపుతాడు. అక్కడ అతడికి జీవిత ఖైదు విధిస్తారు. హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టు ధ్రువ పరుస్తుంది.
ఇక్కడ కధ మరో మలుపు తిరుగుతుంది.
ఇప్పుడు పేర్లూ వివరాలు చెప్పుకుందాం. అతడి పేరు నానావతి. నేవీ కమాండర్. స్నేహితుడి పేరు ప్రేమ్ ఆహూజా. బాగా డబ్బున్నవాడు. విలాసపురుషుడు.
కధలో మలుపుకు కారణం ఓ పత్రిక. ఒకానొక రోజుల్లో విపరీతమైన పాఠకాదరణ కలిగిన ఇంగ్లీష్ వారపత్రిక బ్లిట్జ్. ఆ పత్రిక ఎడిటర్ ఆర్కే కరంజియా.
ఆ పత్రిక ముద్దాయిని భుజాలకు ఎత్తుకుంటుంది. ధారావాహిక కధనాలు అతడికి మద్దతుగా ప్రచురిస్తుంది. దానితో ప్రజలందరూ ఆ కేసు గురించే మాట్టాడుకోవడం మొదలవుతుంది. పాతిక పైసల పత్రికను రెండు రూపాయలు పెట్టి కొనుక్కుని చదివేవారు. నానావతి పేరుతొ పిల్లలు ఆడుకునే బొమ్మ పిస్తోల్లు, ఆహూజా పేరుతొ టీ షర్ట్లులు అమ్మడం మొదలైంది. నానావతికి నైతిక మద్దతు తెలుపుతూ ర్యాలీలు, ఊరేగింపులు జరుగుతాయి. దేశవ్యాప్తంగా నానావతి కేసు ఓ సంచలనంగా మారుతుంది.
చివరికి అప్పటి మహారాష్ట్ర గవర్నర్ శ్రీమతి విజయలక్ష్మి పండిట్ క్షమాభిక్ష పెట్టి అతడి యావజ్జీవ శిక్షను రద్దు చేయడంతో కధ సుఖాంతమవుతుంది.
కేసు నుంచి బయట పడిన నానావతి తన కుటుంబాన్ని తీసుకుని కెనడా వెళ్లి అక్కడే సెటిల్ అయి అక్కడే చనిపోవడంతో అతడి కధ ముగుస్తుంది.
ఇక్కడ ఓ విషయం చెప్పుకోవాలి. బ్లిట్జ్ పత్రిక యజమాని, సంపాదకుడు ఆర్కే కరంజియా పార్సీ. ముద్దాయి నానావతి కూడా పార్సీ.
1959లో కాబోలు ఇది జరిగింది. అప్పుడు నేను స్కూల్లో చదువుకుంటున్నాను. ఆంధ్ర పత్రిక వాళ్ళు దీన్ని ఓ సీరియల్ గా ప్రచురించేవారు. బ్లిట్జ్ పత్రిక ఏమి రాసిందో తెలియదు కానీ అంధ్రపత్రిక మాత్రం ఆసక్తికరమైన వార్తా కధనాలను వండి వార్చేది.
కోర్టులో వాదోపవాదాలు ఎలా జరుగుతాయో తెలుసుకోవడం మీద ఆ రోజుల్లో జనాలకు చాలా ఆసక్తి వుండేది. ప్రాసిక్యూషన్ తరపున రాం జెట్ మలానీ వాదిస్తే, ముద్దాయి నానావతి తరపున ఖండాలావాలా ఈ కేసు వాదించారు.
ఇరవై నాలుగు గంటల టీవీ చానళ్ళ కాలంలో జరిగివుంటే పండగే పండగ.
(14-05-2021)