12, నవంబర్ 2020, గురువారం

వార్తలు చదివిన ఏడిద గోపాల రావు ఇక లేరు

 “ఢిల్లీలో ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని కలవండి”ఇప్పటి పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.

ఆ మాట విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ ఢిల్లీ వదిలి వెళ్ళే వరకు వాళ్ళ బాధ్యతను ఆయన స్వచ్చందంగా, ఆనందంగా భుజానికి ఎత్తుకుంటాడు అని ప్రసిద్ధ జర్నలిస్టు ఆదిరాజు వెంకటేశ్వర రావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం.

ఒక్కమాటలో చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే అతిశయోక్తి కాదు.

ఆయన పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్. ముప్పూటలా వార్తలు చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.

1975 లో నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి న్యూస్ రూములో ఎవరో కోటూబూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు.

వెంకట్రామయ్య గారు కాబోలు నాకు పరిచయం చేస్తూ చెప్పారు, ఏడిద గోపాలరావని. వార్తల్లో పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది) చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.

ముందే చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరుప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు, సంస్థలకు నడుమ ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా సోదరుడు. సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.
రేడియో ఉద్యోగ పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు వచ్చి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక కార్యక్రమాలను కొనసాగించారు. రంగస్థలంపై మహాత్మా గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా పేరు తెచ్చుకున్నారు. పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.

రేడియో వార్తలు చదవడంలో తనదైన ముద్ర వేసిన శ్రీ గోపాలరావు 83 వ ఏట హైదరాబాద్ లో ఈరోజు (గురువారం) కన్నుమూశారు.



(శ్రీ ఏడిద గోపాలరావు)


అబుల్ కలాం అబ్దుల్ కలాం కాదు

 


అందరికీ అన్నీ తెలియాలని లేదు. తెలియని విషయాన్ని తెలిసిన వారిని అడిగి తెలుసుకోవడం మంచిది అనే వారు హైదరాబాదు హిందూ పత్రిక రెసిడెంట్ ఎడిటర్ కీర్తి శేషులు శ్రీ ఆర్.జే.రాజేంద్రప్రసాద్.

పొద్దున్న ఏదో ఛానల్ లో స్క్రోలింగ్  కనబడింది ఈరోజు అబ్దుల్ కలాం జయంతిని జాతీయ విద్య దినోత్సవంగా పాటిస్తున్నారని. మొదటి పదం మినహా అన్నీ కరక్టే. పేరే తప్పు. ఆయన పేరు మౌలానా అబుల్ కలాం ఆజాద్. పూర్తిపేరు  మౌలానా సయ్యీద్ అబుల్ కలాం గులాం మొయుద్దీన్ అహ్మద్ బీన్ ఖైరుద్దీన్ ఆల్ హుస్సేనీ ఆజాద్. 1888 నవంబరు 11 వ తేదీన జన్మించారు. గొప్ప విద్యావేత్త. స్వాతంత్ర సమరంలో పాల్గొన్నారు. స్వతంత్ర భారత దేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి.  ఆయన హయాములోనే జాతీయ విద్య వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. ఈనాడు భారతీయ విద్యాలయాలకు ప్రపంచ ప్రఖ్యాతి తెచ్చిన Indian Institute Of Technology (I.I.T.) University Grants Commission వంటి సంస్థలు ఏర్పాటు చేశారు. ప్రజలందరికీ  ఉచితంగా ప్రాధమిక విద్యను బోధించాలనేది ఆయన ఆశయం. విద్యారంగంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం 1992లో భారత రత్న పురస్కారాన్ని ప్రకటించింది. 1998 లో హైదరాబాదులో మొట్టమొదటి ఉర్దూ విశ్వవిద్యాలయం ఏర్పాటు అయింది. ఆయన జయంతి నవంబరు పదకొండో తేదీని జాతీయ విద్య దినోత్సవంగా జరపాలని 2008లో కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.

మాజీ  రాష్ట్రపతి  ఏపీజే  అబ్దుల్  కలాం అనుకుని పొరబడి ఆ టీవీ స్క్రోల్ చేసి ఉండవచ్చు. పొరబాటే కావచ్చు కానీ ఒకింత జాగ్రత్త పడి తెలుసుకుని రాసిఉంటే బాగుండేది అనేది భవదీయుడి అభిప్రాయం.  

 

8, నవంబర్ 2020, ఆదివారం

రోటీ పచ్చళ్ళ వేణుగోపాల్ ఇక లేరు

 


అందరికీ తనదైన శైలిలో రోటీ పచ్చడి రుచి చూపించిన వాసిరెడ్డి వేణుగోపాల్ ఇక లేరు.



అంశం ఎలాటిదైనా సరే నిక్కచ్చిగా, నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టి మరీ చెప్పి పాఠకులను అభిమానులుగా చేసుకున్న వేణుగోపాల్  ఇక లేరు.

స్నేహానికి ప్రాణం ఇస్తూ  చక్కని చిక్కని నైంటీ ఎమ్మెల్ మాటలతో మిత్ర బృందాన్ని అలరించిన వేణుగోపాల్ ఇక లేరు.

నమ్మలేని ఈ నిజాన్ని యాంకర్ మిత్రుడు చంద్ర పొద్దున్నే తెలియచేస్తే, వేణుగోపాల్ గారి సోదరి వాసిరెడ్డి పద్మ గారు ధ్రువ పరిచారు.

వేణుగోపాల్ గారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియచేసుకుంటూ ఒంటరి అయిపోయిన రోలూ రోకళ్ళకు, ఆయన ప్రేమతో పెంచిన అనేక మొగ జీవాలకు సానుభూతి తెలియచేసుకుంటున్నాను.  

7, నవంబర్ 2020, శనివారం

అమెరికా ఎన్నికల్లో కలాలకు సంకెళ్ళు దేనికి?

 సరే! జగను, బాబు, కేసీఆర్, మోడీ, రాహుల్ అంటే మీ లెక్కలేవో మీకున్నాయి. నిష్పక్షపాతంగా రాయాలి అంటే మీ ఇబ్బందులేవో మీకున్నాయి. అలాగే, ఆర్ధిక సంబంధాలు, రాజకీయ అనుబంధాలు వగైరా వగైరా!

మరి ఎవరి కొమ్మూ కాయల్సిన అవసరం లేని సందర్భం వచ్చినప్పుడు కూడా మీడియా స్వతంత్రంగా, స్వేచ్ఛగా, నిర్మొహమాటంగా, భయమూ, బెదురూ లేకుండా వార్తను వార్తగా రాయడానికి ఏమి అడ్డం వస్తోంది. అమెరికా ఎన్నికల్లో ట్రంపునో, బైడన్ నో మోయాల్సిన అవసరం ఏమొచ్చింది?

ట్రంపు మేనమామ కొడుకూ కాదు, బైడన్ మేనత్త కొడుకూ కాదు. వాళ్ళు మీకు ఇచ్చే ఆర్ధిక వత్తాసూ ఏమీ లేనప్పుడు మీ కలాలకు బానిస సంకెళ్ళు దేనికి? ఎందుకోసం?

5, నవంబర్ 2020, గురువారం

అవునా! ఇది నిజమేనా! – భండారు శ్రీనివాసరావు

 

వినగానే ముక్కుమీద వేలేసుకుని ఔరా అని ఆశ్చర్యపోయే సంగతులు అప్పుడప్పుడు చెవిన పడుతుంటాయి. అలాంటిదే ఇది.

సరే! అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ గెలుస్తాడా ట్రంపే మరోసారి విజయం సాధిస్తాడా అనేది ఇవ్వాళ కాకపొతే మరో వారం రోజుల్లో అన్నా నిర్ధారణ అవుతుంది. అప్పటిదాకా టీవీల్లో నిరంతర చర్చలు ఎలాగూ తప్పవు. అదికాదు విన్న సంగతి. ఈ విషయం అమెరికన్ జ్యుడిషియరీ సిష్టం గురించి.

అమెరికాలోని తెలుగువాళ్ల సంస్థ టానాకు చెందిన జై తాళ్ళూరి, ఒక తెలుగు ఛానల్ లో మాట్లాడుతూ చెప్పిన దాని ప్రకారం అక్కడి సుప్రీం కోర్టు జడ్జీలకి పదవీ విరమణ వయసు అంటూ వుండదు. జడ్జీ స్థానం ఖాళీ కావాలంటే వారు రాజీనామా అన్నా చేయాలి, లేదా మరణించాలి. ఒక్కసారి ఆ కుర్చీ ఎక్కితే, చనిపోయేవరకు వారికి ఆ పదవి అంటిపెట్టుకునే వుంటుంది. వారిని నియముంచే అధికారం అమెరికన్ ప్రెసిడెంటుకు మాత్రమే వుంటుంది. కానీ ప్రతి ప్రెసిడెంటుకూ ఆ అవకాశం లభించదు. ఎందుకంటే ఖాళీలు ఏర్పడడం అంత సులభం కాదు. తమ నాలుగేళ్ల పదవీ కాలంలో ఒక జడ్జీని నియమించగలిగితే అదే గొప్ప. ఆ అవకాశం కూడా రాని ప్రెసిడెంట్లు చాలామంది వున్నారు. అలాంటిది డొనాల్డ్ ట్రంపు కి మాత్రం ఏకంగా ముగ్గురిని నియమించే అపూర్వ అవకాశం లభించింది. ఆయన హయాములో మూడు స్థానాలకు ఖాళీ ఏర్పడడమే అందుకు కారణం.

ప్రస్తుతం అమెరికా సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో డెమొక్రాట్ ప్రెసిడెంట్లు నియమించిన వారు నలుగురు కాగా రిపబ్లికన్ ప్రెసిడెంట్లు నియమించిన వాళ్ళు అయిదుగురు వున్నారట.
కౌంటింగ్ సరళిపై అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేసిన ట్రంప్, సుప్రీం తలుపు తడతాను అని అంతకంటే బాజాప్తాగా ప్రకటించడానికి ఇదే కారణమా!

మన దేశంలో కూడా జ్యుడిషియల్ వ్యవస్థకు సంబంధించి చర్చ జరుగుతున్న సందర్భంలో ఇది తెలియరావడం కేవలం కాకతాళీయమే. (05-11-2020)

4, నవంబర్ 2020, బుధవారం

వైట్ హౌస్ లోకి రీ ఎంట్రీ దొరకని అమెరికా అధ్యక్షులు

 


 

అమెరికా అధ్యక్షుల పదవీ కాలం నాలుగేళ్లు. చాలా సందర్భాలలో అమెరికన్ ఓటర్లు మరో నాలుగేళ్ల అవకాశం కల్పిస్తూ ఇంకోసారి వారినే  అధ్యక్షులుగా ఎన్నుకుంటూ వచ్చారు. ఇటీవలి కాలంలో బరాక్ ఒబామా, జార్జ్  డబ్ల్యు బుష్, బిల్ క్లింటన్ లను ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. తాజా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఈ అవకాశం లభిస్తుందా లేదా అనేది లక్ష డాలర్ల ప్రశ్న. ఈసారి ఏమవుతుందో చూడాలి. మొత్తం అమెరికా చరిత్రలో కేవలం పదిమంది  ప్రెసిడెంట్లకు మాత్రమే ఆ దేశపు ఓటర్లు వైట్ హౌస్ లోకి రెండో తడవ ప్రవేశాన్ని నిరాకరించారు. ఎన్నికల్లో వారిని ఓడించారు.

వారిలో ప్రముఖంగా చెప్పుకోదగిన వ్యక్తి జార్జ్ బుష్ సీనియర్.

1992లో అప్పుడు ప్రెసిడెంటుగా ఉన్న జార్జ్ బుష్ సీనియర్ ని రెండో సారి పోటీ చేసినప్పుడు ఆయన్ని ఓడించి బిల్ క్లింటన్ ని గెలిపించారు. చిత్రం ఏమిటంటే ఓడిపోయిన ప్రెసిడెంట్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వాడయితే, ఆయన మీద ప్రెసిడెంటుగా గెలిచింది డెమోక్రాటిక్ అభ్యర్ధి బిల్ క్లింటన్.

ప్రెసిడెంట్ గెరాల్డ్ ఫోర్డ్ విషయం మరింత విచిత్రం. అమెరికన్ ఓటర్లు  ఫోర్డ్  మహాశయులను నేరుగా ఎన్నికల్లో ప్రెసిడెంటుగా ఎన్నుకోలేదు. కనీసం వైస్ ప్రెసిడెంటుగా కూడా ఎన్నికల్లో గెలవలేదు. అయినా అదృష్టం కొద్దీ గెరాల్డ్ ఫోర్డ్ ఈ రెండు అత్యున్నత పదవులను అనుభవించారు.

1973లో అప్పుడు వైస్ ప్రెసిడెంటుగా ఉన్న స్పిరో ఆగ్న్యూ  రాజీనామా చేసిన ఫలితంగా రాజ్యాంగంలోని ఓ వెసులుబాటు ప్రకారం ఫోర్డ్ ఉపాధ్యక్షులు కాగలిగారు. ఆ తర్వాత వాటర్ గేట్  కుంభకోణం వంటి వివాదాల్లో చిక్కుకుపోయి ప్రెసిడెంట్ నిక్సన్ పదవి నుంచి తప్పుకోవాల్సిరావడంతో వైస్ ప్రెసిడెంటుగా విధులు నిర్వర్తిస్తున్న గెరాల్డ్ ఫోర్డ్ ప్రెసిడెంటు అయ్యారు. హాయిగా మూడేళ్ళపాటు  శ్వేత సౌధం నుంచి దేశాన్ని పాలించారు.

తర్వాత జరిగిన ఎన్నికలలో ప్రెసిడెంటుగా పోటీ చేశారు కానీ ప్రజలు తిరస్కరించారు. 1976 లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో జిమ్మీ కార్టర్ ఆయన్ని ఓడించారు.

అయితే  అమెరికా  ప్రెసిడెంటుగా కార్టర్ పదవి కూడా ఒక టరంతోనే ముగిసింది. 1980లో జరిగిన ప్రెసిడెన్షియల్  ఎన్నికల్లో రొనాల్డ్ రీగన్, జిమ్మీ కార్టర్ ని ఓడించి ప్రెసిడెంట్ అయ్యారు.  రీగన్ ని ప్రెసిడెంటుగా రెండోసారి కూడా ఎన్నుకున్నారు. అత్యధిక మెజారిటీతో ఎన్నిక కావడం ఆ ఎన్నికల్లో విశేషం.

ఈ విధంగా ఒకసారితోనే ప్రజలు ఉద్వాసన పలికిన ప్రెసిడెంట్లు మరికొందరు వున్నారు.

జాన్ ఆడమ్స్. ఈయన అమెరికాకి రెండో ప్రెసిడెంట్. అయినా కానీ ప్రజలు ఆయనాలి రెండోసారి అవకాశం ఇవ్వలేదు. లో జరిగిన ఎన్నికల్లో థామస్ జెఫర్ సన్ ఆయన్ని ఓడించారు. మార్టిన్ వాన్ బరెన్, బెంజామిన్ హారిసన్, గ్రోవర్ క్లీవ్ లాండ్ పరిస్థితి కూడా ఇదే. రెండో సారి అవకాశం వీరికి దక్కలేదు. కాకపొతే క్లీవ్ లాండ్ నాలుగేళ్ల విరామం అనంతరం ప్రెసిడెంటుగా మళ్ళీ పోటీ చేసి గెలిచారు. ఇదంతా పద్ధెనిమిదో శతాబ్దం నాటి ముచ్చట. పందొమ్మిదో శతాబ్దం మొదట్లో కూడా మరో ఇద్దరు ప్రెసిడెంట్లకు అమెరికన్ ఓటర్లు రెండో అవకాశం ఇవ్వలేదు. వారి పేర్లు విలియం హోవర్డ్ టఫ్ట్, హెర్బర్ట్ హోవర్.

ఇక ప్రస్తుతానికి వస్తే, అమెరికాకి 45వ అధ్యక్షుడిగా 2016లో ఎన్నికయిన డొనాల్డ్ ట్రంప్ 2020 నవంబరు ఎన్నికల్లో మరో మారు పోటీ చేస్తూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.  (04-11-2020)

 

 

 

3, నవంబర్ 2020, మంగళవారం

ఆధార్ విషయంలో అక్కడ లేని అభ్యంతరం ఇక్కడెందుకు?

 కొన్నేళ్ళ క్రితం (అప్పటికి  రాష్ట్రం విడిపోలేదు) నేను అమెరికా వెళ్లాను. మా అబ్బాయికి తెలిసిన తెలుగువాళ్లు అక్కడే ఇళ్ళూ ఆస్తులూ కొనుక్కుంటున్నారు. హైదరాబాదులోనో లేదా తెలిసిన వేరే ఏదైనా ప్రాంతంలోనో కొనుక్కోవచ్చు కదా అని అడిగాను.

‘అదీ అయింది. మళ్ళీ జన్మలో మన దగ్గర ఇల్లు, ఆస్తి కొనకూడదని అనిపించే అనుభవం అయింది. లక్షలు పోసి కొన్నాము.  కొని రిజిస్టర్  చేయించుకుని అమెరికా తిరిగి వచ్చే రోజున ఆ స్థలం మాదంటూ ఎవరో లాయర్ నోటీసు పంపారు. అక్కడ వుండి పరిష్కారం  చేసే వ్యవధానం లేదు. చివరికి వాళ్ళు అడిగిన డబ్బిచ్చి పనిచేయించుకున్నాము. కానీ ఇప్పటికీ ఏదో ఒక లిటిగేషన్. ఇక అది మాది కాదు అనుకుని వదిలేసాము. అదే ఇక్కడ చూడండి. నెట్లో చూసి వేరే ఎక్కడో రాష్ట్రంలో అపార్ట్ మెంటు కొన్నాము. అంతా ఆన్ లైన్లోనే పని అయిపొయింది. ఏదైనా ఇక్కడ నమ్మకంగా పనులు అవుతాయి. కిరికిరి వ్యవహారాలు, లిటిగేషన్లు వుండవు అని భగవద్గీత చెప్పాడాయన.

మరో మాట కూడా అన్నాడు. ‘ఇక్కడిలాగా మనదగ్గర కూడా నమ్మకంగా ఆస్తులు కొనగలమనే ధీమా మన ప్రభుత్వాలు ఇస్తే ఇక్కడ ఎవ్వరూ ఆస్తులు కొనరు, అక్కడే ఇన్వెస్ట్  చేస్తారు

మళ్ళీ ఇన్నాల్టికి తెలంగాణా ప్రభుత్వం ధరణి పోర్టల్ రూపొందించి అలాంటి భరోసా ఇద్దామనే ప్రయత్నం చేస్తోంది. ఈలోగా ఎవరో కోర్టు కెక్కారు.

ఆధార్ కోసం వత్తిడి  చేయవద్దని ఆర్డరు వేశారు అంటున్నారు. వ్యక్తిగత వివరాలు బహిరంగం కాకూడదట. మరి తిరుపతి వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు బాజాప్తాగా ఆధార్ జిరాక్స్ అడిగి తీసుకుంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో ఇస్తున్నాము. అక్కడ  లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు?

ఇదంతా చూస్తుంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఎంతటి బలవత్తరమైనదో అర్ధం అవుతోంది.

(నాకు లీగల్ విషయాల్లో  పరిజ్ఞానం అంతగా లేదు. నాకు సొంతంగా  ఇళ్ళూ వాకిలి అంటూ లేవు.  నేను రాసింది కేవలం పౌరుల కోణం నుంచే)