8, ఫిబ్రవరి 2017, బుధవారం
27, జనవరి 2017, శుక్రవారం
గీత దాటుతున్న నేతలు
(PUBLISHED IN THE EDIT PAGE OF 'SURYA' TELUGU DAILY ON 29-01-2017,SUNDAY)
కాలం ఎవరికోసం ఆగదు, ఎవరికోసం నిలవదు.
అయినా మనిషికి తనమీద తనకు విశ్వాసం అధికం. అందుకే కాలాన్ని జయించాలని కలలు
కంటుంటాడు. అధికారంలో వున్నప్పుడు దానికి ఎదురులేదనుకుంటాడు. ఎదురు వుండకూడదని ఆశ
పడుతుంటాడు. అందిన అధికారం శాశ్వతం అనే భావనలో ఉంటాడు. పదవిలో
లేకపోతే, సాధ్యమైనంత త్వరగా అధికార అందలం ఎక్కాలని ఆత్రుత పడుతుంటాడు. రాజకీయాల్లో ఈ ధోరణి మరింత
ప్రస్పుటం.
గత గురువారం సాయంత్రం విశాఖ విమానాశ్రయంలో ఎంతో హడావిడి. ఏం జరగబోతోందో అనే ఆందోళన. ఏదైనా
జరక్కపోతుందా అనే ఆసక్తి. ఇక మీడియా దృష్టి మొత్తం అక్కడే. కానీ ఏమీ జరగకుండానే
అక్కడికది ముగిసింది.
ఆ మరునాడే అదే విశాఖలో, ప్రభుత్వ
ఆధ్వర్యంలో నలభయ్ దేశాల ప్రతినిధులు
పాల్గొనే భాగస్వామ్య సదస్సు
మొదలయింది. రెండు రోజులపాటు సందడే సందడి.
మీడియాలో గంటల గంటలతరబడి సమాచార ప్రవాహం.
సదస్సు ప్రారంభానికి ముందు రోజు,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని కోరుతూ విశాఖ సాగర
తీరంలో కొవ్వొత్తుల ర్యాలీకి సన్నాహాలు. దానికి చెన్నై మెరీనా తీరంలో జరిగిన
జల్లికట్టుతో ముడి. జల్లికట్టుకు, ప్రత్యేకహోదాకు సంబంధం ఏమిటని పాలకపక్షం
ఎద్దేవా.
‘కొవ్వొత్తుల ర్యాలీ భాగస్వామ్య సదస్సుకు అడ్డంకి. అటువంటి చర్యలతో అభివృద్ధికి
ఆటంకం కలిగించవద్దంటూ’ ర్యాలీపై ఆంక్షలు విధించిన ప్రభుత్వం. విశాఖ తీరం పొడవునా
రహదారుల దిగ్బంధం. డేగ కన్నులతో పోలీసు పహరా.
శాంతియుతంగా జరిపే కొవ్వొత్తుల
ర్యాలీకి, భాగస్వామ్య సదస్సుకు ముడి పెట్టి మాట్లాడం విడ్డూరంగా వుందని
ప్రతిపక్షాల విమర్శ.
చివరికి ఏమి జరిగింది?
కొవ్వొత్తుల ర్యాలీకి ప్రతిపక్ష నేత హాజరు కాకుండా ప్రభుత్వం నిరోధించగలిగింది. కానీ
ఎయిర్ పోర్ట్ ఉదంతంతో జగన్ కు దక్కిన దేశవ్యాప్త ప్రచారానికి అడ్డుకట్ట
వేయలేకపోయింది.
ప్రభుత్వం కోరుకున్నట్టుగానే విశాఖలో
భాగస్వామ్య సదస్సు అట్టహాసంగా మొదలై, విజయవంతంగా ముగిసింది, కొవ్వొత్తుల ర్యాలీని
అనుమతించినా ఇలానే జరిగి వుండేదన్న వ్యాఖ్యానాల నడుమ.
జగన్ ర్యాలీకి రాకూడదని ప్రభుత్వం
కోరుకుంది. ప్రభుత్వం కోరుకున్నట్టుగానే జగన్ ర్యాలీకి హాజరుకాలేకపోయారు. అది ప్రభుత్వ వ్యూహాత్మక
విజయం.
జగన్ కోరుకున్నట్టుగా మీడియాలో విస్తృత
ప్రచారం లభించింది. అది ఆయనకు అయాచితంగా దక్కిన గెలుపు.
ప్రత్యేకహోదా అంశంపై జరుగుతున్న రాజకీయ
పోరులో తాత్కాలికంగానే అయినా విజయం ఎవరిని
వరించింది? ఎవరు జితులు? ఎవరు పరాజితులు? చంద్రబాబు వ్యూహం ఫలించిందా? జగన్
ఎత్తుగడ జయించిందా? ఈ ప్రశ్నలకు ఎవరి జవాబులు వారు చెప్పుకుంటున్నారు. కానీ
నిజానికి గెలిచింది మాత్రం రాజకీయం.
వర్తమానం నుంచి గతంలోకి తొంగి చూస్తే ఇందుకు
ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి. మరెన్నో
పోలికలు కానవస్తాయి.
ముందు గత గురువారం ఏం జరిగిందో
చూద్దాం.
విశాఖ విమానాశ్రయం.
ప్రతిపక్ష నేత వై.ఎస్. జగన్ మోహనరెడ్డి
తన బృందంతో విమానం దిగగానే అడ్డుకున్న పోలీసులు. నిరసనగా రన్ వే పైనే భైఠాయించిన జగన్ బృందం. పోలీసులతో
వాగ్వివాదం. అధికారంలోకి రాగానే సంగతి గుర్తు పెట్టుకుంటామని పోలీసులకు
హెచ్చరికలు. చివరికి జరిగింది ఏమిటి. ర్యాలీలో పాల్గొనకుండానే విశాఖ నుంచి నేరుగా
విమానంలో హైదరాబాదుకు తిరుగు ప్రయాణం.
‘రన్ వే పై నిరసనలా!’ అసహనం వ్యక్తం
చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
ఏడేళ్ళు వెనక్కివెడదాం.
ఔరంగాబాదు విమానాశ్రయం.
బాబ్లీ ప్రాజెక్టు ఆందోళనలో భాగంగా
బస్సు యాత్రలో తెలుగుదేశం నేత, ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబునాయుడు బృందం
అరెస్టు. వారిని స్వరాష్ట్రం పంపడానికి
మహారాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన విమానం ఎక్కడానికి చంద్రబాబు నిరాకరణ. ఎయిర్
పోర్ట్ టార్మాక్ మీదనే భైఠాయింపు.
నచ్చచెప్పి వెనక్కి తిప్పి పంపిన పోలీసులు.
‘ఎయిర్ పోర్ట్ లో నిరసనలా? ఏవిటీ
విడ్డూరం?’ నాటి పాలకపక్షం కాంగ్రెస్ నాయకుల సన్నాయి నొక్కులు.
ఆనాటి సంఘటన గురించి సుప్రసిద్ధ సంపాదకులు,
పత్రికారచయిత ఐ. వెంకటరావు,
చంద్రబాబుపై రాసిన ‘ఒక్కడు’ అనే
గ్రంధంలో గుర్తు చేసుకున్నారిలా.
“మహారాష్ట్ర పోలీసులు వచ్చి ధర్మాబాద్
ఐ.టి.ఐ. ఆడిటోరియంలో వున్న టీ.డీ.పీ. నాయకులను లాగి పడేశారు. కొందరిని చితక
బాదారు. ఎం.ఎల్.ఏ.లు, ఎంపీలని చూడకుండా పిడి గుద్దులు గుద్దారు. పోలీసులు చంద్రబాబునాయుడుతో సహా ఆయన బృందాన్ని
బస్సులో ఎక్కించి తీసుకువెళ్ళారు. ఎటు వెడుతున్నారో తెలియని అయోమయం. మంచి నీళ్ళు
ఇవ్వలేదు, అల్పాహారం ఇవ్వలేదు. నేరుగా ఔరంగాబాదు విమానాశ్రయానికి తీసుకువెళ్ళారు.
మీడియాను రానివ్వలేదు. చంద్రబాబు, మరికొందరు విమానం దగ్గరే బైఠాయింపు జరిపారు.
నినాదాలు చేసారు”
దీన్నిబట్టి తెలుస్తున్నదేమిటంటే,
పోలీసులు నిమిత్తమాతృలు. ఎవరు అధికారంలో వుంటే వారికి నిబద్దులు. అలా అని అందర్నీ
ఒక గాటన కట్టడం కాదు. కర్తవ్యానికి ప్రాధాన్యత ఇచ్చి పోస్టింగులను గురించి పట్టించుకోనివారు వారిలో కూడా చాలామంది లేకపోలేదు.
మరి కొంచెం గతాన్ని తడిమితే.
ఎన్నికలకు ముందు ‘వస్తున్నా మీకోసం’
పేరుతొ చంద్రబాబునాయుడు సుదీర్ఘ పాదయాత్ర.
తన పాదయాత్రకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆటంకాలు కల్పిస్తున్నదంటూ పలు సందర్భాలలో ఆగ్రహం
వ్యక్తం చేసిన చంద్రబాబు. తాము మళ్ళీ అధికారంలోకి
వస్తామన్న సంగతిని తమతో సరిగా వ్యవహరించని పోలీసులు గుర్తు పెట్టుకోవాలని
టీ.డీ.పీ. నాయకుల హెచ్చరికలు.
ఇంకొంచెం లోతుకుపోయి గతాన్ని మరింత స్పృశిస్తే.
టీ.డీ.పీ. హయాములో వై.ఎస్. రాజశేఖర
రెడ్డి ప్రతిపక్షనాయకుడిగా వున్నప్పుడు ఆయన తలపెట్టిన పాదయాత్రకు అడుగడుగునా
అడ్డంకులు కల్పించిన పోలీసులు. ఒక దశలో సహనం కోల్పోయి, నిజామాబాదు పోలీసులపై
ఆగ్రహం వ్యక్తం చేసిన వై.ఎస్.ఆర్.
ఇలా గుర్తు చేసుకుంటూ పొతే ఎన్నో
జ్ఞాపకాలు, ఎన్నో దృశ్యాలు.
వీటన్నిటినీ గమనంలో వుంచుకుంటే అర్ధం
అయ్యేది ఏమిటి?
రాజకీయ ప్రకటనలు, స్పందనలు, వ్యాఖ్యలు,
విమర్శలు, ఆరోపణలు అనేవి అధికారంలో
వున్నప్పుడు ఒకరకంగా వుంటాయని. ప్రతిపక్షంలో వున్నప్పుడు వేరే విధంగా సాగుతాయని.
రాజకీయ నాయకులు మారరు. మారిందల్లా
అధికార మార్పిడి ఒక్కటే. అదే వారినలా మారుస్తుంటుంది.
విచిత్రం ఏమిటంటే రాజకీయ నాయకులకు సమస్తం
గుర్తు వుంటుంది. అయితే వీలునుబట్టి
కొన్నింటిని మరిచిపోయినట్టు కనిపిస్తారు.
వున్న అధికారం శాశ్వతం అని పాలకపక్షం,
రానున్న కాలంలో మాదే అధికారం అని ప్రతిపక్షం అనుక్షణం అనుకుంటూ, ఎదురు చెప్పిన
వాళ్లకు తస్మాత్ జాగ్రత్త అంటూ తర్జని
చూపిస్తుంటాయి. అలా లేకపోతే రాజకీయాల్లో నిభాయించుకురావడం చాలా కష్టం. బడా
నాయకులకే ఇది పరిమితం కాదు, గ్రామస్థాయిలో కూడా ఈ ధోరణి హెచ్చు స్థాయిలోనే
వుంటుంది.
సరే! ఈ కధ ఎలాగూ ఇలాగే
నడుస్తూవుంటుంది. కాకపొతే,
‘ఆగండాగండి, మాకూ సమయం వస్తుంది,
అప్పుడు మా తడాఖా చూపిస్తాం’ అని ప్రజలు అనకుండా నేతలు జాగ్రత్త పడడం అవసరమేమో! (28-01-2017)
లేబుళ్లు:
ప్రత్యేక హోదాపై పార్టీల సిగపట్లు
24, జనవరి 2017, మంగళవారం
ఇంకొక్క నిచ్చెన
654321
ఆరు, అయిదు, నాలుగు, మూడు, రెండు, ఒకటి
– అంటే ఆరు లక్షల యాభయ్ నాలుగువేల మూడు వందల ఇరవై ఒకటి.
నా బ్లాగు (https://bhandarusrinivasarao.blogspot.in/)వీక్షకుల సంఖ్య,ఈ అంకెకు చేరింది.
చేర్చిన వారందరికీ అక్షరాలా ఆరు లక్షల
యాభయ్ నాలుగువేల మూడువందల ఇరవై ఒక్క వందనాలు.
భండారు శ్రీనివాసరావు
(654321 అనే ఈ సంఖ్య వెరైటీగా వుందనిపించి ఈ సరదా అన్నమాట)
లేబుళ్లు:
654321,
ఇంకొక్క నిచ్చెన
‘ఊ’ అంటే వస్తుందా!
2015 లో రాసింది
ఆంధ్ర ప్రదేశ్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశంపై ఎక్స్ ప్రెస్ టీవీలో గురువారం సాయంత్రం
చర్చ జరుగుతోంది.
వై.ఎస్.ఆర్.సీ.పీ.
ప్రతినిధి చెబుతున్నారు. 'పుష్కరాలకోసం పదిహేను రోజులు రాజమండ్రిలో మకాం వేసినట్టే ముఖ్యమంత్రి
చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మఠం వేసుకుని కూర్చుని యెందుకు కేంద్రం పై ఒత్తిడి
తేవడం లేదన్నది ఆయన ప్రశ్న. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే తమ నాయకుడు జగన్ మోహన
రెడ్డి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేయాల్సి వస్తోందని ఆయన వివరణ.
టీడీపీ ప్రతినిధి
మాట్లాడుతూ, 'తమ నాయకుడు చంద్రబాబు నాయుడు స్పెషల్ స్టేటస్ కోసం అహరహం శ్రమ
పడుతున్నారనీ, ఆయనా, కొందరు మంత్రులు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి, విజ్ఞాపన
పత్రాలు ఇచ్చి వస్తున్నారనీ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక
హోదా సాధించడం కోసం బాబు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదని ఆ ప్రతినిధి ఉవాచ.
బీజేపీ ప్రతినిధి
మాట్లాడుతూ, ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వడానికి ప్రధానమంత్రి
నరేంద్ర మోడీ గారు చిత్తశుద్దితో కట్టుబడి వున్నారని, రాష్ట్రంలోని
ప్రతిపక్ష పార్టీలు అనవసరంగా తమ పార్టీపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని
చెప్పారు.
ఈ చర్చ తీరుతెన్నులు
చూస్తున్నప్పుడు ఓ విషయం గుర్తుకు వచ్చింది.
వెనుకటి రోజుల్లో
ఇళ్ళల్లో నాయనమ్మలు, అమ్ముమ్మలు సాయంత్రం కాగానే పిల్లల్ని చుట్టూ కూర్చోబెట్టుకుని
కధలు చెప్పేవాళ్ళు. పిల్లలు 'ఊ' కొడుతూ, కధలు
వింటూనే నిద్రలోకి జారుకునే వాళ్లు. అలాటి ఒక కధ ఇది.
'అనగనగా
ఓ ఊళ్ళో ఓ ముసలామె వుండేది' కధ మొదలు పెట్టేది బామ్మ.
'ఊ' అనేవాళ్ళు
పిల్లలు.
'ఆ
ముసలావిడ ఓ రోజు బావి గట్టు మీద కూర్చుని బట్టలు కుడుతుంటే చేతిలో సూది జారి
నూతిలో పడిపోయింది'
'ఊ' అనేవాళ్ళు
పిల్లలు ఇంకా చెప్పు అన్నట్టుగా.
'ఊ
అంటే వస్తుందా?' అనేది బామ్మ.
'ఆ' అనేవాళ్ళు
పిల్లలు నోరు తెరిచి.
'ఆ' అంటే
వస్తుందా' అడిగేది బామ్మ.
బావిలో పడ్డ సూది
సంగతేమో కాని, ఆ కధ మాత్రం అలా అనంతంగా సాగిపోయేది.
ఇక విషయానికి వస్తే-
ఆంధ్ర ప్రదేశ్ కు
స్పెషల్ స్టేటస్ రావాలి. అంటే ఏం చేయాలి?
'జంతర్
మంతర్ లో ధర్నా చేస్తే వస్తుందా?'
'ముఖ్యమంత్రి
చంద్రబాబు స్పెషల్ ఫ్లైట్లలో ఢిల్లీ వెళ్ళి మహాజర్లు ఇచ్చి వస్తే వస్తుందా?'
'బీజేపీ
నాయకులు ప్రత్యేక హోదా ఇవ్వడానికి కట్టుబడి వుంటే వస్తుందా?'
'అసలు
వస్తుందా రాదా? వస్తే ఎప్పుడు వస్తుంది?'
'ఎప్పుడా? బావిలో
సూది ముసలమ్మ చేతికి దొరికినప్పుడు'
(30-07-2015)
లేబుళ్లు:
Special Status for AP
మన్ కీ బాత్
ఎక్కడో ఎప్పుడో విన్నట్టుగా వున్న కొన్ని మాటల్ని మళ్ళీ ఓసారి విందాం.మరోసారి మననం చేసుకుందాం.
'విడిపోతున్న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలి'
'అయిదేళ్ళు కాదు పదేళ్లు ఇవ్వాలి'
'ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇస్తామనే హామీకి కట్టుబడి వున్నాం'
'ఈ విషయంలో మా చిత్తశుద్ధిని శంకించాల్సిన పనిలేదు, ప్రతిపక్షాలు కావాలనే మా మీద బురద చల్లుతున్నాయి'
'ప్రత్యేక హోదా సాధించేవరకు మేము నిద్రపోము'
'ప్రత్యేక హోదా కోసం మా నాయకుడు అనేక పర్యాయాలు ఢిల్లీ వెళ్ళి ప్రధానమంత్రిని కలిసి మహాజర్లు ఇచ్చివచ్చిన సంగతి ప్రతిపక్షాలు మరిచిపోతున్నాయి'
'మేము అధికారంలోకి రాలేక పోవడం వల్ల గత పార్లమెంటు సాక్షిగా మేము ఇచ్చిన ఈ హామీని నిలబెట్టుకోలేకపోయాము. ఈసారి అధికారంలోకి రాగానే ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చి మా మాట నెరవేర్చుకుంటామని మరో హామీ ఇస్తున్నాము'
'ఇచ్చిన హామీని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం నిలబెట్టుకోలేదు, కేంద్రంపై ఒత్తిడి తేవడంలో బీజేపీ మిత్రపక్షం అయిన టీడీపీ ఘోరంగా విఫలం అయ్యింది'
'పద్నాలుగవ ఆర్ధిక సంఘం సిఫారసుల మేరకు ఇప్పుడు ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్తితిలేదు. విభజన చట్టంలోనే ప్రత్యేక హోదాను కాంగ్రెస్ పొందుపరచి వున్నట్టయితే ఇప్పుడీ పరిస్తితి వచ్చేదే కాదు'
'మేము ఇవ్వలేదు సరే. ఇప్పుడు పార్లమెంటులో బిల్లు ఆమోదింపచేయగల మెజారిటీ వుంది. ప్రత్యేక హోదాకు వీలు కల్పిస్తూ చట్ట సవరణ చేయవచ్చు కదా'
'ప్రత్యేక హోదా కుదరదు అన్న కేంద్ర మంత్రి ప్రకటన ఆంధ్ర ప్రదేశ్ కు వర్తించదు'
'ప్రత్యేక హోదా కుదరని పక్షంలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తాం'
'రాజీనామాల వల్ల ప్రత్యేక హోదా వచ్చేటట్టయితే అందుకు మేము సిద్ధం'
ఇవన్నీ ఏడాది కాలంగా వినీ వినీ ప్రజల చెవులకు తుప్పు పట్టింది. అవే మాటలు పదేపదే వింటూ రావడం వల్ల పట్టిన చెవుల తుప్పు ఒదిలిపోయింది కూడా. అందుకే ప్రజలకు ఇప్పుడు సర్వం అర్ధం అవుతోంది. రాజకీయ పార్టీల అసలు తత్వం బోధపడుతోంది.
నిజానికి ఈ మాటలు అన్నీ పైకి చెప్పేవి. మనసులోని మాటలు వేరే.
'ఇవ్వచ్చు. కానీ దగ్గర్లో ఎన్నికలు లేవు. ఇప్పుడు ఇస్తే ఏమిటి లాభం?'
'ఇప్పుడే ఇవ్వాలి. ఎన్నికలకు ముందు ఇస్తే మాకేమిటి లాభం'
'ఇవ్వడం వల్ల మా పార్టీకి ప్రస్తుతం ఎలాటి లాభం లేదు. పైగా నష్టం కూడా. కానీ రాజకీయ ప్రయోజనాలకోసం పోరాడక తప్పదు. రోడ్డెక్కక తప్పదు'
మనసులో మాట అనండి, మన్ కీ బాత్ అనండి. అసలు విషయం ఇది.
(ఏడాది క్రితం రాసింది)
20, జనవరి 2017, శుక్రవారం
శ్వేతసౌధం నుంచి ‘నల్ల సూరీడు’ నిష్క్రమణ
(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 22-01-2017, SUNDAY)
యావత్ ప్రపంచానికి అధికార కేంద్రంగా
చెప్పుకునే అమెరికాలో భారత కాలమానం ప్రకారం జనవరి ఇరవయ్యవ తేదీ, శుక్రవారం రాత్రి
పదిన్నర గంటలకు అధికార మార్పిడి జరిగింది. సంచలనాలకు మారు పేరుగా మారిన రిపబ్లికన్
పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్ గత ఏడాది నవంబరులో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్ పార్టీ
అభ్యర్ధి మిసెస్ హిల్లరీ క్లింటన్ పై అనూహ్య విజయం సాధించిన దరిమిలా ఆ దేశంలో
ఒబామా నేతృత్వంలో సాగుతున్న ఎనిమిదేళ్ళ పాలనకు తెర పడింది. అయితే అమెరికా
రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు నవంబరులో ముగిసి ఫలితాలు వెల్లడి అయినప్పటికీ, కొత్త
అధ్యక్షుడు పదవీ ప్రమాణ స్వీకారం చేసి అధికార బాధ్యతలు స్వీకరించడం మాత్రం జనవరిలోనే
జరగాల్సివుంటుంది. ఆ ప్రకారమే ప్రజలు
ఎంపిక చేసుకున్న కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల 20వ తేదీన శ్వేతసౌధంలో అడుగు పెట్టారు. రెండు పర్యాయాలు అధ్యక్షుడిగా
ఎన్నికయి, అదే భవనంలో నివాసం వుంటున్న
ప్రెసిడెంట్ బరాక్ ఒబామా ఒక సాధారణ పౌరుడిగా వైట్ హౌస్ నుంచి బయటకు
అడుగు పెట్టారు.
రెండు పర్యాయాలు, అంటే మొత్తం ఎనిమిది సంవత్సరాలు అత్యున్నతమైన
అమెరికా అధ్యక్ష పదవిలో వుంటూ, ఆ దేశపు రాజ్యాంగం ప్రకారం పదవినుంచి తప్పుకుంటూ
ప్రెసిడెంట్ బరాక్ ఒబామా చేసిన సాంప్రదాయ
వీడ్కోలు ప్రసంగం ప్రపంచ వ్యాప్తంగా బహుళ ప్రచారం పొందింది. ఈ సందర్భంగా ఒబామా, తన పదవీ కాలంలో సాధించిన విజయాలను, చేయాలని గట్టిగా
అనుకుని కూడా చేయలేని కొన్ని పనులను ఏకరవు
పెట్టారు. ఉద్వేగం ఆపుకోలేక ఒక దశలో కంట
తడిపెట్టారు కూడా.
వర్ణ వివక్ష మూలాలు కలిగిన అత్యంత సంపన్న దేశానికి ఒబామా ఎనిమిదేళ్ళు తిరుగులేని అధినేతగా వున్నారు. కంటి
చూపుతో ప్రపంచ దేశాలను శాసించగల అపరిమిత అధికారాలను అనుభవించారు. జన్మతః ఆఫ్రికన్
అమెరికన్ అయిన ఒబామా అమెరికా దేశాధ్యక్షుడు కాగలిగారంటే అది అమెరికన్ల ప్రజాస్వామ్య స్పూర్తికి అద్దం పడుతుంది. అయితే,
ఒబామా తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికన్ సమాజంలో ఈనాటికీ అవశేషాలుగా మిగిలివున్న
జాత్యహంకార ధోరణులను గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడం గమనార్హం.
సాధారణంగా రెండు పర్యాయాలు అమెరికా
అధ్యక్షపీఠాన్ని అధిరోహించిన వారు ఆ పదవిని వీడిపోయే సమయానికి ఏదో ఒక విధమైన
ఆరోపణల మరకలు అంటించుకోవడం పరిపాటిగా మారిన అమెరికాలో ఈ నల్ల సూరీడు మాత్రం ఎటువంటి మచ్చా లేకుండా పదవీ విరమణ చేయడం ఆయన
వ్యక్తిత్వ శోభని తెలియచెప్పుతుంది. అమెరికా అధ్యక్షులగురించి గతంలో అనేక రకాల ఆరోపణలు, అధికార దుర్వినియోగం,
వివాహేతర సంబంధాలు ఇలా ఎన్నో కధనాలు, ఊహాగానాలు
వెలువడిన ఘన చరిత్ర కలిగిన ఆ దేశంలో ఒబామా మాత్రం పులుకడిగిన ముత్యంలా
పదవికి గుడ్ బై చెప్పడం విశేషం. ఒబామా కానీ, ఆయన భార్యాపిల్లలు కానీ నలుగురి
నోళ్ళలో నానే విధంగా వైట్ హౌస్ లో ఏనాడూ ప్రవర్తించలేదు. మాటా మన్ననా వారి
వ్యక్తిత్వ శోభని మరింత పెంచాయి.
అభిజాత్య అమెరికన్ సమాజంలో అధికారం
కూడా తోడయితే ఆ వ్యక్తుల ప్రవర్తన ఎలా వుంటుందో ఊహించుకోవచ్చు. కానీ ఈ సాధారణ
అభిప్రాయానికి భిన్నంగా ఆయన అసాధారణ రీతిలో తన నడవడికను ప్రదర్శించి అమెరికా
అధ్యక్షులు ఇలాగా కూడా వుంటారు అని నిరూపించారు. ఎనిమిదేళ్ళ పదవీ కాలంలో ఇలాటి
సందర్భాలు, సన్నివేశాలు కొల్లలుగా కనిపిస్తాయి.
మచ్చుకి కొన్ని.
నిజమా!
నిజంగా నిజమని నమ్మలేం అనిపించే ఈ సంఘటన నిజంగానే జరిగింది. ప్రెసిడెంట్ ఒబామా స్వయంగా చెప్పకపోతే
అసలీవిషయం బయటకు పొక్కేదే కాదు. నమ్మడానికి వీల్లేని ఈ కధా కమామిషూ ఏమిటంటే-
ఒకసారి
న్యూయార్క్ లో జరిగిన ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ సమావేశాల్లో పాల్గొనడానికి
అమెరికా అధ్యక్షులవారు సతీ సమేతంగా వాషింగ్టన్ నుంచి బయలుదేరి ఆ నగరం వెళ్ళారు.
అక్కడ గడిపిన రోజుల్లో ఓ రోజు
వీలుచేసుకుని హోటల్లో భోజనం చేయడానికి భార్యను వెంటబెట్టుకుని వెళ్ళారు.
అమెరికా ప్రెసిడెంటు ఏమిటి? హోటల్లో భోజనం ఏమిటి? అనే సన్నాయి నొక్కుళ్ళు
మనదేశంలోనే.
సరే!
హోటల్లో దంపతులిద్దరూ మాట మంతీ
చెప్పుకుంటూ భోజనం ముగించిన తరువాత బిల్లు చెల్లించడానికి క్రెడిట్ కార్డు
తీసిచ్చారు. అది తీసుకువెళ్ళిన బేరర్ అంతే వేగంతో తిరిగొచ్చి, 'ప్రెసిడెంట్! మీ
క్రెడిట్ కార్డు చెల్లదు' అని చావు కబురు చల్లగా చెప్పాడు. పక్కన భార్య వుండబట్టీ, ఆవిడ తన కార్డు తీసి
ఇవ్వబట్టీ ప్రెసిడెంట్ ఒబామా గారి పరువు ఆ పూటకు నిలబడింది. అయితే ఈ వ్యవహారం
వెంటనే బయటకు పొక్కలేదు. తరువాత ఎప్పుడో ఒక
మీటింగులో మాట్లాడుతూ ఒబామా మహాశయులే మాటవరసకు అన్నట్టు ఈ మాట బయటపెట్టారు.
క్రెడిట్ కార్డ్లు, వాటి భద్రత గురించి జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ ఈ విషయం
స్వయంగా ఒబామా గారే వెల్లడించడంతో ఈ కధనం మీడియాలో గుప్పుమంది.
బరాక్ హుస్సేన్ ఒబామా
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం అన్నది
– 2001 సెప్టెంబర్
11వ తేదీన
అల్ ఖయిదా విసిరిన పంజా దెబ్బకు ఆ దేశం గడగడ లాడిన తరువాతనే జరగడం గమనార్హం. తమ
పోరు ఉగ్రవాదం మీదనే కాని ఒక మతం మీద కాదన్న పద్ధతిలో అమెరికన్ వోటర్లు తీర్పు
ఇచ్చినట్టు అప్పట్లో పత్రికలు పొగడ్తల వర్షం కురిపించాయి. శ్వేత జాతీయులకు వర్ణ
వివక్ష ఎక్కువ అనే అపప్రదని సమూలంగా తొలగించుకుంటూ అమెరికా దేశీయులు బరాక్
హుస్సేన్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఎంతగానో
పులకించిపోయింది. వొంటి రంగు మూలంగా పాశ్చాత్య దేశాలలో అదేమాదిరి వివక్షను
ఎంతోకొంత ఎదుర్కొంటున్న భారతీయులు సయితం ఒబామా విజయాన్ని తమ గెలుపుగా భావించి పండగ
చేసుకున్నారు. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నిక కావడానికి ముందూ, ఆ తరువాతా ‘నేను
క్రైస్తవుడినే’ అని
బరాక్ హుస్సేన్ ఒబామా బహిరంగంగా ప్రకటించుకున్నప్పటికీ, ముస్లింగా ధ్వనించే తన
పేరును మాత్రం మార్చుకోలేదు. అధ్యక్షుడిగా ఎన్నికయిన తరువాత టర్కీలో జరిపిన తొలి
విదేశీ పర్యటనలో మసీదులోకి పాదరక్షలతో ప్రవేశించడం అప్పట్లో వివాదాస్పదమయింది
కూడా. అయినా ఒబామా విశ్వ శాంతికి చేసిన కృషికి గుర్తింపుగా ఆయనకు నోబెల్ శాంతి
బహుమతి లభించింది.
అలాగే మరొక స్వానుభవం.
ఇది జరిగి కొన్నేళ్ళు అవుతోంది.
అమెరికా పశ్చిమతీరంలోని సియాటిల్
నగరంలో కాపురం వుంటున్న మా పెద్దబ్బాయి సందీప్ కుటుంబంతో కొన్నాళ్ళు గడపడానికి
నేనూ మా ఆవిడా వెళ్ళాము. అక్కడ కూడా టీవీ ఛానళ్ళ హడావిడి ఎక్కువే. ఒకరోజు పర్యటనపై
ఆ నగరానికి వచ్చివెడుతున్న అమెరికా ప్రెసిడెంట్ - ‘ఎయిర్ ఫోర్స్ వన్’ విమానానికి అధికారులు క్లియరెన్స్
ఇవ్వకపోవడం వల్ల ఒబామా ఎయిర్ పోర్ట్ లోనే
కొద్దిసేపు వుండిపోవాల్సివచ్చిందని స్క్రోలింగులు పరుగులు పెట్టాయి. అయితే
అసలు విషయం మరునాడు పేపరు చూస్తే తెలిసింది. ఒక రోగిని తీసుకువస్తున్న హెలికాప్టర్
దిగడానికి వీలుగా అధ్యక్షుడి విమానాన్ని కొద్దిసేపు ఆపేశారని ఒక వార్త
సారాంశం.
ఉపశృతి:
అమెరికా
నలభయ్ అయిదవ అధ్యక్షుడిగా పదవిని స్వీకరించిన డోనాల్డ్ ట్రంప్, ఎనిమిదేళ్ళ తరువాత
శ్వేతసౌధం వీడిన బరాక్ ఒబామా, వీరిద్దరికీ తమ భార్యల గురించి వింతయిన అభిప్రాయాలు
వున్నాయి. ఇటువంటి సరదా వ్యాఖ్యలు సరదాగా
చేస్తారు కాబట్టి వాటిని సరదగా తీసుకుంటే ఏ ఇబ్బందీ వుండదు.
“ రెండు పెళ్ళిళ్ళు
చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను
వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్
ట్రంప్
“మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది.
తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”- బరాక్ ఒబామా
17, జనవరి 2017, మంగళవారం
రెండు చావులు
నిజానికి ఇది జనవరి మొదట్లోనే రాయాలి.
తెలుగు సినిమాలు, తెలుగు జీవితాలు సెంటిమెంటు మీద ఆధారపడి నడుస్తున్నాయి. కొత్త
ఏడాది ఆరంభాన్ని చావులతో మొదలు పెట్టడం ఎందుకనే సందేహం నన్ను నిలువరించింది.
అంచేతే ఈ కాలయాపన.
పుట్టిన ప్రతివారికీ మరణం తప్పదు. ఎవరు
ఎప్పుడు అనేదే తెలియదు. ఎలా అన్నదే ఆ మనిషి ఎటువంటి బతుకు బతికాడు అన్నది
తెలుపుతుంది.
ఈరోజు ఆమె చనిపోయి పన్నెండో రోజు. చుట్టపక్కాలు
అందరూ వచ్చారు. ఆమె అనాయాస మరణం గురించి మననం చేసుకున్నారు. కోటికొక్కరికి మాత్రమె
దొరికే వరం అది.
ఆ రోజు రాత్రి భార్యా భర్తా ఇద్దరూ
భోంచేసి చెరో సోఫాలో పడుకుని టీవీ
చూస్తున్నారు. కాసేపటి తరువాత భార్య సోఫానుంచి చేతులు వేలాయడం భర్త కళ్ళ పడింది.
చుట్టుపక్కల వారిని లేపి దగ్గర్లోని ఆసుపత్రికి తీసుకు వెళ్ళే సరికి అంతా
అయిపొయింది. విగత జీవిగా ఆవిడ ఇంటికి తిరిగొచ్చింది.
ఇక రెండో సంఘటన.
కొత్త
సంవత్సరం కనిపెంచిన వారితో
గడుపుదామని ఆమె అమెరికా నుంచి ఇండియా వచ్చింది. హైదరాబాదు విమానాశ్రయంలో తండ్రిని చూడగానే
ఆమెకు కళ్ళనీళ్ళు తిరిగాయి. ఆయనలో ఏదో తేడా.
ఆందోళన వున్నా అత్తవారింటికి ముందు
వెళ్ళడం కోడలిగా తన విధి. తప్పదు. అలాగే వెళ్ళింది.
మర్నాడు పొద్దున్నే ఫోను. నిన్న కనపడ్డ తండ్రి ఈ రోజు లేడు. ఇది
జరిగే పనా.
అయినా జరిగింది.
విధి వైపరీత్యం అంటే ఇదే!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)

