13, డిసెంబర్ 2016, మంగళవారం

ఆయన రచనాదాహం తీరనిది


జర్నలిష్ట్ కురువృద్ధుడు వి. హనుమంతరావుగారు తన తొంభయ్ రెండో ఏట మంగళవారం  ఉదయం హైదరాబాదులో కన్ను మూశారు. ఈతరం వారికి తెలియని ఈ వృద్ధ పాత్రికేయుడి గురించి తెలియచెప్పాలంటే ఏదో సినిమాలోలా కధను ముందుకూ వెనక్కీ తిప్పాలి.
ముందు హైదరాబాదు. ఇది జరిగి చాలా ఏళ్ళయింది. దేశంలో అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ బాంక్ అయిన స్టేట్ బాంక్ చైర్మన్ గా తల్వార్ గారు వుండేవారు. బాంకులో పనిచేసే అన్ని శ్రేణుల  అధికారులకు శిక్షణ ఇప్పించడానికి దేశం మొత్తానికి కలిపి హైదరాబాదు, బేగంపేటలోని విశాలమైన ఆవరణలో స్టేట్ బాంక్ స్టాఫ్ కాలేజ్ ఏర్పాటు చేసారు. దాన్ని ప్రారంభించడానికి అప్పటి కేంద్ర ఆర్ధిక మంత్రి శ్రీ చవాన్ తో పాటు తల్వార్ గారు కూడా హైదరాబాదు వచ్చారు. ప్రారంభోత్సవం అదీ బాంక్ స్థాయికి తగ్గట్టే ఘనంగా జరిగింది. వివిధ జాతీయ దినపత్రికలు, స్థానిక దినపత్రికల్లో ఆ వార్తను ఫొటోలతో సహా మొదటి పేజీలో చాలా విపులంగా ప్రచురించారు.
ఈ విషయాన్ని ఇక్కడ వొదిలేసి కాసేపు విశాఖపట్నం జిల్లావెళ్లి వద్దాం.
స్టేట్ బాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటయిన వ్యవసాయాభివృద్ధి బాంక్ కూడా రాష్ట్రంలో చాలా చురుగ్గా పనిచేస్తున్న రోజులవి. ఆ బాంక్ శాఖలో పనిచేస్తున్న ఎర్రంరాజుగారనే ఒక యువ అధికారి జిల్లాలోని గ్రామీణ రైతులకు వ్యవసాయ రుణాలు ఇచ్చేందుకు వెడుతూ విశాఖ కేంద్రంగా పనిచేస్తున్న యు.ఎన్.ఐ. వార్తా సంస్థ విలేకరిని వెంటబెట్టుకుని వెళ్ళారు. ఉదయం నుంచి సాయంత్రం దాకా రుణమంజూరీ తంతు కొనసాగింది. మామూలుగా అయితే విలేకరులెవ్వరు సాధారణంగా ఒక చిన్న కార్యక్రమం కోసం అంత సమయం వెచ్చించరు. కానీ ఆ అధికారి తీసుకువెళ్ళింది ఆషామాషీ జర్నలిష్టుని కాదు. తివిరి ఇసుమున తైలం తీయగల సమర్ధుడు అనే పెద్ద పేరు చిన్నతనంలోనే తెచ్చుకున్న వి.హనుమంతరావు గారిని. ఓ చెట్టు నీడన కూర్చుని రైతులకు రుణాల మంజూరీ వ్యవహారాన్ని గమనిస్తున్న ఆయన దృష్టిని ఒక అంశం ఆకట్టుకుంది. పేద రైతులు వాళ్ళ అవసరాల కొద్దీ, లేదా వారి వారి తాహతు కొద్దీ వంద రూపాయలనుంచి రెండు మూడు వేల రూపాయల వరకు రుణాలు తీసుకుంటున్నారు. తీసుకున్న రుణానికి బ్యాంకు అందచేసిన కాగితాలపై వేలిముద్రలు వేస్తున్నారు.  విలేకరిగా ఈ వ్యవహారాన్ని అంతా గమనిస్తూ వచ్చిన హనుమంతరావు రైతులు  పూర్తిచేసిన ఒక ధరఖాస్తు పత్రాన్ని తీసుకుని చూసారు. ఒక్కొక్కదానిపై నాలుగువందల వేలిముద్రలు కనిపించాయి. ఆ విషయాన్ని మరింతగా ధృవపరచుకున్న ఆయన  క్షణం ఆలస్యం చేయకుండా   పోస్ట్ ఆఫీసుకు వెళ్లి, వార్తను రాసి టెలిగ్రాం ద్వారా హైదరాబాదులోని తన ఆఫీసుకు పంపారు.
మళ్ళీ ఓ మారు హైదరాబాదు వస్తే....
‘వందరూపాయల రుణం కోసం నాలుగు వందల సంతకాలు’ అంటూ యూఎన్ ఐ వార్తాసంస్థ  పంపిన వార్తను ఒక ఇంగ్లీష్ దినపత్రిక మరునాడు మొదటి పేజీలో ప్రచురించింది.  స్టేట్ బాంక్ చైర్మన్ తల్వార్ గారు పాల్గొన్న స్టాఫ్ కాలేజ్ ప్రారంభోత్సవం వార్త కూడా ఫోటోతో సహా మొదటి పుటలోనే ఆ పక్కనే ప్రచురించడం కాకతాళీయం కావచ్చు. కానీ ఆ వార్త స్టేట్ బ్యాంకు రుణాల మంజూరీ విధానాన్ని పూర్తిగా మార్చివేయగలదని ఎవ్వరూ ఆరోజు ఊహించి వుండరు. ఆ వార్త తల్వార్ మహాశయుల దృష్టిలో పడింది. ఆయన వెంటనే మొత్తం వ్యవహారం గురించి ఆరా తీసారు. వంద రూపాయలకు నాలుగు వందల సంతకాలు తీసుకుంటున్న సంగతి నిజమే అని విచారణలో తేలింది. ఆయన  వెంటనే స్పందించి దిద్దుబాటు చర్యలు చేపట్టారు. రుణమంజూరీ పద్దతిని సులభతరం చేస్తూ ఉత్తర్వులు జారీచేసారు.
ఒక జర్నలిస్ట్ తన చుట్టూ ఉన్న విషయాల్ని 'గమనించడం' అలవాటు చేసుకుంటే కొన్ని లక్షల మంది జీవితాల్ని మార్చవచ్చు అనడానికి ఇది ఒక ఉదాహరణ.
జర్నలిజం వృత్తిని అవహేళన చేస్తూ మాట్లాడేవారు, ఈ వృత్తిలో అలవడే అనేకానేక వ్యసనాలను ప్రస్తావిస్తూ వుంటారు. వారి సందేహాలకు సమాధానమే  హనుమంతరావు గారు. రాస్తూ బతకొచ్చని, బతుకుతూ రాయొచ్చని నిరూపిస్తూ డెబ్బయి ఏళ్ళకు పైగా రాస్తూ పోయిన, రాస్తూనే దాటిపోయిన  హనుమంతరావు గారు నిజంగా ధన్యజీవి. రాయడం, రాస్తూవుండడం ఆయనకు వ్యసనం కావచ్చు. కానీ అది సమాజానికి మేలు చేసే విషయం.
గొప్ప జర్నలిష్టుని ప్రపంచం భరిస్తుంది. ఆదరిస్తుంది, అభిమానిస్తుంది. కాని అతగాడిని భరించడం యెంత కష్టమో తెలిసేది మాత్రం  ఆ జర్నలిష్ట్ భార్యకి మాత్రమే. అనుభవంతో చెబుతున్న మాట ఇది. ప్రపంచం బాధ్యత తప్ప ఇంటి బాధ్యత పట్టని గొప్ప జర్నలిష్టులు నాకు చాలామంది తెలుసు. జీ కృష్ణ గారు వారిలో అగ్రగణ్యులు. అలాటి విశిష్ట వ్యక్తులను గౌరవించేటప్పుడు విధిగా వారిని భరించిన భార్యలను కూడా గుర్తుపెట్టుకుని, గుర్తించి గౌరవించాలి. ఆ విధంగా హనుమంతరావు గారికి లభించిన గౌరవ ప్రతిపత్తుల్లో న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన సగంవాటా నిస్సంశయంగా ఆయన అర్ధాంగి సరళ గారిదే.


రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595 

12, డిసెంబర్ 2016, సోమవారం

మెషిన్ ఆల్వేస్ ఫెయిల్స్

అనేవాడు కాలేజీలో మా మాస్టారు.
యంత్రం అన్న తరువాత అది అదేవిధంగా ఎల్లకాలం పనిచేస్తుందన్న గ్యారెంటీ లేదు అనేది ఆయన భావం. ఎప్పుడన్నా పనిచేయక పోవచ్చు, అనడానికి, ఎప్పుడూ పనిచేయదు అనడానికి ఏదో తేడా వుంది అని ఇప్పుడు అర్ధం అవుతోంది కానీ చదువుకునే రోజుల్లో మాస్టారి మాటే వేదం కనుక ఆ మాటే ఇప్పటికీ గుర్తుండిపోయింది.
ఇవాళ మధ్యాన్నం ఏదో పనిమీద బయటకు వెళ్లి తిరిగి రావడానికి ఊబెర్ బుక్ చేయబోతే మొరాయించింది. కార్డు ప్రాబ్లం అంటూ ఏదో మెసేజ్ చదివేలోగానే మాయమై పోతోంది. సమస్య ఏమిటో అర్ధం కాలేదు కానీ ఈ పూటకి ఊబెర్ ప్రాప్తం లేదనుకుని ఆటోని ఆశ్రయించాను. ముందు నూట ఇరవై అని, ఇరవై నా దగ్గర చిల్లర వుండదనుకున్నాడో ఏమో వందకి ఒప్పుకున్నాడు. ఇంటికి వచ్చి చూసుకుంటే AM- ATMSBI పేరిట ఓ ఎస్సెమ్మెస్. “Dear Customer. Your txn at POS ……….declined as account is inoperative or locked. Please contact your branch for resolution.”
ఒకటయితే చూడను అనుకున్నారేమో వరసగా నిమిషానికి ఒకటి చొప్పున మొత్తం నాలుగు పొట్టి సందేశాలు. పక్కనే పేపర్లో ‘కార్డు గీకండి, కోటి గెలవండి” అని వెక్కిరింత వ్యాఖ్య.
ఈరోజు బ్యాంకుకు సెలవు, వరసగా మూడు రోజుల తరువాత రేపు తెరిస్తే అక్కడ ఎలా వుంటుందో ఏమో!
నా ఎక్కవుంటు   inoperative లేక locked అనే విషయం తెలుసుకోవడానికి పడుతూ లేస్తూ బ్యాంకుకు వెళ్ళాలా! ఇంటి నుంచి ఆన్ లైన్లో తెలుసుకునే ఏర్పాటు ఎందుకు చెయ్యరు?
పొద్దున్న ఇంటి నుంచి బయటకు వెళ్ళేటప్పుడు   operative గా వుండి lock కాకుండా వున్న ఎక్కవుంట్ వున్నట్టుండి ఎలా inoperative అయింది లేదా lock అయింది.
పైగా అదే  బ్యాంకులో, అదే బ్రాంచిలో నేను 1975 నుంచి అక్కవుంట్ హోల్డర్ని. ఒక్కసారి కూడా defaulter  అనే ముద్ర నా మీద పడలేదు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యేవరకు కూడా నేను ఆ బ్యాంకుతో అనుబంధం తెంచుకోలేదు. పదేళ్లకు పైగా నా పెన్షన్ అక్కవుంట్ కూడా అక్కడే వుంటోంది. ఇవన్నీ సరే! నేను ఒక సాధారణ పౌరుడ్ని. అంతే అనుకుందాం పోనీ.
 ఇటువంటి సందేశాలు వరస వెంబడి నాలుగు పంపించిన బ్యాంకు వాళ్ళు అసలు విషయం ఏమిటో ముందే ఎందుకు తెలియచేయలేదు? మొత్తం అన్ని పనులు ఇంటి వద్దనుంచే ఆన్ లైన్లో చక్కబెట్టుకోవచ్చు అంటున్నప్పుడు మళ్ళీ ఈ పిలుపులు ఏమిటి.?
మొత్తం దేశం ఆన్ లైన్ వైపు ప్రయాణిస్తుంటే నేను బ్యాంకుకి వెళ్ళకుండా అదే విధానంలో పరిష్కారం చూపెట్టలేరా?
నాకు తెలుసు ఇవన్నీ జవాబు దొరకని  భేతాళ ప్రశ్నలని.
తెలిసి చెప్పక పోయినా ఎవరి తలలు పగలవు, ఆలోచించి ఆలోచించి మన తలలు పగలడం తప్ప.

ఘోరమైన క్రూర జంతువు

మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో పరుచూరి గోపాల కృష్ణ పలుకులు:
“ఎవరెస్టుఎక్కిన తరువాత ఇక ఎక్కే ఎత్తులు వుండవు, కిందకు జారడం తప్ప. అందుకే నేను ఎవరెస్టు ఇంకా ఎక్కుతున్నాను అనే అనుకుంటూ నా వృత్తిలో ముందుకు వెడుతున్నాను, అప్పుడే కాళ్ళు నేల వుంటాయి”
“ప్రపంచంలోని  జంతుజాలాన్ని చూపే ఒక ప్రదర్శనకు వెళ్లాను. వరసగా చూస్తూ పోతున్నాను. కోతులు, కుందేళ్ళు, పులులు, సింహాలు. అన్నీ బొమ్మలే అనుకోండి. చివర ఒక బోర్డు కనిపించింది. “యావత్ సృష్టిలో భయంకరమైన జంతువును మీరిప్పుడు చూడబోతున్నారు”
అక్కడ ఒక అద్దం వుంది. దానికి ఎదురుగా నిలబడివున్న నా ప్రతి బింబమే అందులో నాకు కనిపించింది.
నిజమే కదా! ఈ లోకంలో మనిషిని మించిన భయంకరమైన జంతువు మరోటి ఏముంది? మిగిలిన క్రూర జంతువులు ఆకలి వేసినప్పుడే వేటాడి తింటాయి. కడుపు నిండినా ఆహారాన్ని కూడబెట్టుకునేవాడు ఒక్క మనిషి మాత్రమే!”
“ఒక లఘు చిత్రం చూశాను. నడి రోడ్డు. కరెంటు స్తంభానికి ఒక కుర్రవాడిని  కట్టేసిఉంచుతారు. దారిన పోయే వారందరూ అక్కడ కాసేపు ఆగి ఓ వింత చూసినట్టు చూసి తమ దారిన వెళ్లిపోతుంటారు. సాయంత్రంవరకూ ఇదే తంతు. ‘ఇదేమిటి’ అని ఆరా తీసినవాళ్ళుంటే ఒట్టు.”
చివర్లో ఒకరు రంగప్రవేశం చేసి చెబుతారు. “జనంలో మానవత్వం ఇంకా మిగిలున్నదాలేదా అనేది తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం”  అని.
మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ పరుచూరి గోపాల కృష్ణ ఇలాంటి కబుర్లు ఇంకా చాలా చెప్పారు.
 “ఇతి వార్తాః”

(పరుచూరి వారికి కృతజ్ఞతలు)

యునిసెఫ్ మీడియా అవార్డులు


యునిసెఫ్, సీఎంఎస్ సంయుక్త ఆధ్వర్యంలో మీడియా అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాదులోని తాజ్  డెక్కన్ హోటల్లో జరిగింది. వివిధ మీడియా ఛానళ్ళు, పత్రికలలో వెలువడిన బాలల హక్కులకు సంబంధించిన కధనాలను పరిశీలించి అవార్డులను ఎంపిక చేసిన జ్యూరీ బృందంలో నాతో పాటు ప్రముఖ రచయిత్రి డాక్టర్ మృణాలిని, సీనియర్ జర్నలిష్టు కేబీ లక్ష్మి, జీ. వల్లీశ్వర్, ఎస్. నగేష్ కుమార్, గోవిందరాజు చక్రధర్ వున్నారు. రిటైర్డ్ ఐ.ఏ.ఎస్. అధికారి రేచల్ ఛటర్జీ జ్యూరీ చైర్  పర్సన్ గా వ్యవహరించారు. ప్రసిద్ధ సినీ రచయిత పరుచూరి గోపాల కృష్ణ అవార్డులను ప్రదానం చేశారు. యునిసెఫ్ అధికారి కుట్టి జార్జ్, సీఎంఎస్ ప్రతినిధులు వాసంతి, అనిత పాల్గొన్నారు.




Photo Courtesy: UNICEF  


10, డిసెంబర్ 2016, శనివారం

రాజకీయ వారసత్వాలు

(PUBLISHED IN "SURYA" TELUGU DAILY ON 11-12-2016, SUNDAY)
మనిషి ఎలా బతికాడన్న విషయం అతడి చావు తెలుపుతుంది అంటారు. ఆ రకంగా జయలలిత గొప్పగా జీవించి నట్టే లెక్క. మహరాణిలాబతికింది. మహారాజ్ఞిలా దాటిపోయింది. చెన్నై నగరంలో ఒక పక్క జన సంద్రం, మరోపక్క జలసంద్రం నడుమ  మెరీనా సైకత తీరంలో సమస్త అధికార లాంఛనాలతో జరిగిన  అంత్యక్రియల్లో భాగంగా  జయలలితకు  రాజకీయ బిక్ష పెట్టిన  ఎం.జీ. రామచంద్రన్  సమాధి సరసనే నిర్మించిన  మరో సమాధిలో గంధపు చెక్కలతో చేసిన  శవ పేటికలో శాశ్వితనిద్రకు ఉపక్రమించింది. తమిళనాట  రాజకీయాలపై  ఒక ప్రగాఢమైన ముద్ర వేసిన జయలలిత శకం ఆ విధంగా  ముగిసింది. ఒక ప్రాంతీయ పార్టీ నాయకురాలికి ఆ స్థాయిలో తుది వీడ్కోలు లభించడం నిజంగా ఒక అరుదయిన రికార్డు. పెద్ద నోట్ల రద్దు వ్యవహారంపై దేశ వ్యాప్తంగా మీడియాలో నిరంతరాయంగా సాగుతూ వస్తున్న చర్చోపచర్చలకు జయలలిత మరణం తాత్కాలికంగా అయినా తెర దించడం గమనిస్తే, ఆవిడ మృతి యావత్  జాతిజనులను  ఎంతగా దిగ్భ్రాంతికి గురిచేసింది అర్ధం అవుతుంది.  
అంతుపట్టని ఆకస్మిక అనారోగ్యానికి గురై ముఖ్యమంత్రి జయలలిత చెన్నై లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి నెలల తరబడి  మృత్యువుతో ఆఖరి పోరాటం చేస్తున్నప్పుడే, ఆవిడ తరువాత అన్నా  డీఎంకే నాయకత్వం ఎవరు స్వీకరించాలనే అంశంపై అనంతంగా  చర్చలు సాగాయి. గతంలో రెండు పర్యాయాలు తాత్కాలికంగా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టి, జయలలితకు  అత్యంత విధేయుడు అనే ముద్ర వేయించుకున్న పన్నీర్ సెల్వం, ఆవిడ చనిపోయిన రోజు అర్ధరాత్రి రాజభవన్ లో మూడోసారి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడంతో జయలలిత వారసత్వం గురించిన చర్చకు కూడా తాత్కాలికంగా తెరపడింది.
ప్రపంచంలో అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పేరుపడిన భారత దేశంలో రాజకీయ వారసుల గురించి మాట్లాడుకోవడం ఒక విచిత్రం. అధికార వ్యవస్థలో కీలకమైన  ప్రధానమంత్రి పదవికి  కానీ, ముఖ్యమంత్రి పదవికి కానీ ఎన్నిక ద్వారా కాకుండా వారసత్వ ప్రాతిపదికపై ఎంపిక జరగడం మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక సాంప్రదాయంగా పరిణమిస్తూ రావడం  ప్రజాస్వామ్యప్రియులను కలత పెడుతోందనడం నిర్వివాదాంశం. తమిళనాడు రాజకీయాలను కంటి చూపుతో శాసించిన అన్నా డీఎంకే నాయకురాలు జయలలిత, తన వారసుడు ఎవరన్నది నిర్దారించకుండానే ఈ లోకం నుంచి నిష్క్రమించడం వారికి ఊరట కలిగిస్తోంది కూడా.  
వివాదాస్పదమైన రాజకీయ వారసత్వాలకు ప్రజామోదం లభిస్తూ వుండడం వల్ల ఎవరూ ఏమీ చేయలేని నిస్సహాయ స్తితిలో ప్రజాస్వామ్య వ్యవస్థ చిక్కుకు పోయింది. జాతీయస్థాయిలో ఇదే పరిస్తితి. అనేక రాష్ట్రాల్లో కూడా ఇదే దుస్తితి.     
ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంగతి తీసుకుందాం. ఆయన కూడా వారసుడి హోదాలోనే అధికార పీఠం అధిరోహించారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ద్వారా ఎంపిక కావడం తప్పనిసరి కనుక ఆ శంఖుతీర్ధం తంతు పూర్తిచేసుకునే ముఖ్యమంత్రి అయ్యారు.   నవీన్  తండ్రి బిజూ పట్నాయక్ గతంలో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆయన పేరు మీద పుట్టిన  బిజూ జనత దళ్ పార్టీ  తరపున ఆయన ఒరిస్సా పాలనాపగ్గాలు చేపట్టారు.  వరసగా మూడు ఎనికల్లో తన పార్టీని విజయపధంలో నడిపించి పార్టీలో, ప్రభుత్వంలో తనకు తిరుగులేదని నిరూపించుకున్న నవీన్ పట్నాయక్, తరచూ అనారోగ్యానికి గురవుతున్నారనే వదంతుల నేపధ్యంలో ఆయనకు  రాజకీయ వారసుడెవరనే చర్చకు రెండేళ్ళక్రితమే తెర లేచింది. ఈ సందర్భంలోనే నవీన్ పట్నాయక్ మేనల్లుడు అరుణ్ పట్నాయక్ పేరు బయటకు వచ్చింది కానీ, రాజకీయాల్లోకి వచ్చే ఆసక్తి లేదని అరుణ్ స్వయంగా ప్రకటించడంతో ఆ చర్చకు నిరుడే  తాళం పడింది.
ఇక పశ్చిమ బెంగాల్ ఆడపులి మమత బెనర్జీ. ఇంటా బయటా ఎదురులేని ఈ వీరవనితకు సయితం  నిజజీవితంలోనూ, రాజకీయ జీవితంలోను వారసులంటూ ఎవరూ లేరు. తన వారసుడు పలానా అని దీదీ కూడా ఎప్పుడూ బయటపెట్టలేదు. అయితే అయిదేళ్ళ క్రితం తన మేనల్లుడు, ఇరవై నాలుగేళ్ల యువకుడు అభిషేక్ బెనర్జీకి  తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షపదవి కట్టబెట్టడంతో ఆ రాష్ట్రంలో  కూడా తృణమూల్ అధినేత్రి  మమత వారసుడి గురించిన చర్చలు మొదలయ్యాయి. రెండువేల పద్నాలుగులో అతగాడికి తృణమూల్ పార్టీ టిక్కెట్టు ఇచ్చి, గెలిపించి  అతి చిన్న వయసులోనే  పార్లమెంటుకి పంపడంతో  ఈ వదంతులకు మరింత బలం సమకూరినట్టయింది. కాకపొతే, రాజకీయ అరంగేట్రం చేసి అయిదేళ్ళు అవుతున్నా అభిషేక్ బెనర్జీ మాత్రం తనేమిటో, తన బలమేమిటో నిరూపించుకున్న సందర్భం లేకపోవడంతో ఆయన గురించి వెలువడిన వారసత్వపు వార్తలకు పురిటిలోనే గండి పడింది.  
ఉత్తరప్రదేశ్  లో బహుజన సమాజ్ పార్టీ అధినాయకురాలు మాయావతి విషయం కూడా ఇదేమాదిరి. ఆవిడకీ వారసులు ఎవరూలేరు. బహుజన సమాజ్  పార్టీ అంటే మాయావతి, మాయావతి అంటే బహుజన్ సమాజ్ పార్టీ అనే  తరహా రాజకీయమే నడుస్తూ వుండడంతో వారసత్వం అంశం అంతగా చర్చకు రావడం లేదు. ద్వితీయశ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించాలనే ప్రజాస్వామిక స్పృహ ఆ పార్టీ  నాయకురాలికి  వున్నట్టు లేదని చెవులు కొరుక్కుంటున్నా ఆవిడ ఏమాత్రం చెవిన పెట్టే పరిస్తితి లేదు.  కాకపొతే, తన రాజకీయ వారసుడిని తాను  ఎన్నడో నిర్ణయించానని ఎనిమిదేళ్ళ క్రితం ఒకసారి ప్రకటించిన మాయావతి, ఆ వారసుడి  పేరు మాత్రం ఇంతవరకు వెల్లడించలేదు. గతంలో మాయావతిపై హత్యాప్రయత్నానికి కుట్ర జరిగినట్టు వార్తలు వెలువడిన నేపధ్యంలో ఏర్పాటయిన ర్యాలీలో ప్రసంగిస్తూ, బీఎస్పీ అధినేత్రి స్వయంగా   ఈ విషయం బయట పెట్టారు. కానీ ఏళ్ళు గడుస్తున్నా తాను ఎంపిక చేసుకున్న వారసుడు ఎవరు అనే దానిపై మళ్ళీ  పెదవి విప్పలేదు.
తమిళనాడులో జయలలిత, ఉత్తర ప్రదేశ్ లో మాయావతి, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ఈ మువ్వురుదీ ఒకే పడవలో ప్రయాణం. వారికి నిజ జీవితంలో వారసులు లేరు. పార్టీలో వారికి ఎదురు లేదు. చుట్టూ జేజేలు కొట్టే భజన బృందాలు ఎన్ని వున్నా ఎవర్నీ నమ్మలేని తత్వం వీరిది.  దిగువ శ్రేణి నాయకులను  తప్ప ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం వీరికి అలవాటులేని పని. అంచేతే భవిష్యత్తులో వీరికి వారసులు ఎవరూ  అంటే ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి.    


అదే ఉత్తరప్రదేశ్ లో మాయావతికి ప్రధాన ప్రత్యర్ధి అయిన సమాజ్ వాదీ పార్టీ నాయకుడు మూలాయం సింగ్ యాదవ్ తన రాజకీయ వారసుడి విషయంలో లేనిపోని గుంజాటన పడలేదు. మీనమేషాలు లెక్కపెట్టలేదు. ఎవరు ఏమనుకున్నా లెక్కపెట్టకుండా  ఏకంగా తన కుమారుడు అఖిలేష్ యాదవ్ ని ముఖ్యమంత్రి గద్దె మీదనే కూర్చోబెట్టి అధికారపగ్గాలు అప్పచెప్పారు. కుమారుడికి  ముఖ్యమంత్రి పదవిని  అయితే కట్టబెట్టగలిగారు కానీ, తిరుగులేని  అధికారానికి వుండే  సహజస్వభావాన్ని గుర్తించలేకపోయారు. అది వంటబడితే  తండ్రీ కొడుకూ అనే వ్యత్యాసం  వుండదు. ప్రస్తుతం ఉత్తర ప్రదేశ్  అధికారంలో వున్న సమాజ్ వాదీ పార్టీలో బయట పడుతున్న లుకలుకలే ఇందుకు సాక్ష్యం.       
పొతే,  జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఈ వంశపారంపర్య విధానం  దశాబ్దాలుగా సాగుతూనే వస్తోంది. ఆ రాష్ట్రపు తొలి ప్రధానమంత్రి (స్వతంత్రం వచ్చిన కొత్తల్లో, భారత ప్రధాన మంత్రితో పాటు జమ్మూ కాశ్మీర్ కు కూడా  ప్రధానమంత్రి వుండేవారు, తదనంతర కాలంలో దాన్ని కూడా దేశంలోని ఇతర రాష్ట్రాలతో పాటు ముఖ్యమంత్రి హోదాకు అనుగుణంగా  మార్చారు) షేక్ అబ్దుల్లా.  తరువాత ఆయన  కుమారుడు ఫరూక్ అబ్దుల్లా ముఖ్యమంత్రి అయ్యారు. ఫరూక్ తనయుడు ఒమర్ అబ్దుల్లా కూడా వారసత్వాన్ని అందిపుచ్చుకుని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి కాగలిగారు. అలాగే ఆ రాష్ట్రంలోనే  ముఖ్యమంత్రి  ముఫ్తీ  మహమ్మద్ సయీద్ కుమార్తె మెహబూబా ముఫ్తీని తన రాజకీయ వారసురాలిగా ప్రకటించారు. ఆయన మరణానతరం మెహబూబా  ముఖ్యమంత్రి పీఠం ఎక్కగలిగారు.
వారసత్వ రాజకీయాలకు బీహారు కూడా పుట్టిల్లు. రాష్ట్రీయ జనత దళ్ నాయకుడు లాలూ ప్రసాద్ యాదవ్ కోర్టు తీర్పుల దరిమిలా పదవి కోల్పోయినప్పుడు ఎలాంటి భేషజాలకు పోకుండా తన భార్య  శ్రీమతి రబ్రీ దేవినే  ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టి తను వెనుక వుండి పాలన సాగించారు. నితీష్ కుమార్ ప్రస్తుత మంత్రి వర్గంలో కూడా లాలూ కుమారులు ఇద్దరు మంత్రులుగా వున్నారు. ఒక కుమారుడు తేజస్వి యాదవ్  ఉప ముఖ్యమంత్రి కాగా మరో  కుమారుడు  తేజ్ ప్రతాప్ యాదవ్ వైద్య ఆరోగ్య శాఖామంత్రి.
మహారాష్ట్రలో కూడా వారసులకే అధికార పదవులు దక్కడం చూస్తున్నాము. థాకరేలు ఇందుకు  చక్కని ఉదాహరణ. మరాఠా నాయకుడు శరద్ పవార్, ఆయన కుమార్తె సుప్రియ పవార్ ఈ విధమైన ఫామిలీ  పవర్ పాలిటిక్స్ కి ప్రసిద్ధి. కర్ణాటకలో జనతాదళ్ (ఎస్) రాజకీయాలు యావత్తు మాజీ ప్రధానమంత్రి దేవెగౌడ, ఆయన కుటుంబం చుట్టూ పరిభ్రమిస్తూ వుంటాయి.
పంజాబులో శిరోమణి అకాలీ దళ్ నేత ప్రకాష్  బాదల్ ముఖ్యమంత్రి. ఆయన కుమారుడు సుఖ్ బీర్ సింగ్ బాదల్ ఉప ముఖ్యమంత్రి.
రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ సంస్కృతికి దూరంగా లేవనే చెప్పాలి.
ఇక స్వతంత్ర భారతంలో వారసత్వ రాజకీయాలకు ఆద్యులు ఎవరయ్యా అంటే మొదట చెప్పుకోవాల్సింది గాంధీ, నెహ్రూ కుటుంబీకులు గురించి.  పేరులో గాంధీ అని వున్నప్పటికీ జాతి పిత, స్వతంత్ర ప్రదాత మహాత్మా గాంధీకి ఏమాత్రం సంబంధంలేని నెహ్రూ కుటుంబం వారే దేశాన్ని ఎక్కువకాలం పరిపాలించారు.  ప్రముఖ ప్రవచన కారుడు చాగంటి వారు పురాణాల్లోని వంశ వృక్షాలను ఆశువుగా నుడివినట్టు చెప్పాలంటే,  జవహర్ లాల్  నెహ్రూ, ఆయన కుమార్తె ఇందిరాగాంధీ, ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ, ఆయన కుమారుడు.....’ ఇలా సాగిపోతుంది ఆ వారసుల జాబితా.
విచిత్రం ఏమిటంటే గాంధీ, నెహ్రూ కుటుంబీకుల  వారసత్వ రాజకీయాలను చీల్చి చెండాడిన ప్రత్యర్ధులు సయితం అధికారం చేతికి అందగానే నిస్సిగ్గుగా  అదే బాటలో ప్రయాణించడం. అందువల్లే, రాజకీయాల్లో విమర్శలకు విలువ లేకుండా పోతోంది.    
చివరిగా ఒక మాట.
ప్రజాస్వామ్య పదకోశంలో చోటులేని పదం ఏదైనా వుంటే అది రాజకీయ వారసత్వం.
వర్తమాన  రాజకీయాల్లో దానిదే అగ్రస్థానం కావడం దేశానికి పట్టిన దురదృష్టం.  (10-12-2016)
రచయితఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్:  98491 30595


9, డిసెంబర్ 2016, శుక్రవారం

మరణం అంటే.....

.....అన్నీ అలాగే వుండి మనం ఒక్కళ్ళమే లేకపోవడం.

రేపు లేదురా! ఈరోజు మనదిరా!

“రేడియోవాళ్ళు  నీకెంత జీతం ఇస్తారు?” ఆయన అడిగిన ప్రశ్న ఇది.
బేసిక్ 325, ఇతర అలవెన్సులు అదనం అని మాత్రం వుంది నాకొచ్చిన నియామక పత్రంలో.
1975లో ఆంధ్రజ్యోతిలో నా నెల జీతం అక్షరాలా నూట డెబ్బయి అయిదు. అప్పటికి అయిదేళ్ళు అయింది అక్కడ చేరి.
భత్యాలుగా వచ్చేది ఎంతో తెలియకపోయినా  నికరంగా 325 వస్తున్నప్పుడు ఆలోచన ఎందుకు” అంటూ ప్రోత్సహించాడు సహోద్యోగి ఎల్వీ రమణ, ‘ఓ వందా రెండువందలకోసం హైదరాబాదు దాకా పోవడం అవసరమా’ అనే నా మీమాంస గమనించి.
హైదరాబాదు వెళ్ళాలనే నిర్ణయం ఖరారు అయింది. కానీ చిల్లర మల్లర అప్పులు తీర్చి వెళ్ళాలి కదా! దానికోసం ఒక పెద్ద అప్పు చేయాలి కదా!
అప్పుడు గుర్తొచ్చాడు మా కుటుంబంలో ఒక పెద్దాయన. చిన్నా పెద్దా అందరికీ ఆయన మామయ్యే. చంద్రం మామయ్య. ఎలిమెంటరీ స్కూలు టీచరుగా పాతికేళ్ళ క్రితం  రిటైరయి నెలకు ఎనభయ్ రూపాయలు పించను పుచ్చుకుంటున్నాడు. కొంత భూమీ పుట్రా వుంది. దాని మీద అయివేజు, పించను డబ్బులు కలిపి పొదంగా, ఏ చీకూ చింతా లేకుండా  జీవితం గడుపుతున్న పెద్దమనిషి ఆయన. నిక్కచ్చిగా వ్యవహారం చేసే తత్వం కాబట్టి నికరంగా ఎంతో కొంత రొక్కం చేతిలో వుండేవుంటుంది. అందుకే ఆయన గుర్తు వచ్చాడు.
వెంటనే బస్సెక్కి పెనుగంచి ప్రోలు వెళ్లాను. వెళ్లి కలిశాను. కలిసి ఓ వెయ్యి రూపాయలు సర్దమని అడిగాను. అప్పుడు ఆయన అడిగిన మొదటి ప్రశ్నఇది.
“రేడియో వాళ్ళు నీకెంత జీతం ఇస్తారు?”      
“ఖచ్చితంగా తెలియదు కానీ, 325 మాత్రం నికరం.” నా జవాబు.
అప్పుడాయన నాకు జీవితానికి సరిపడే భగవద్గీత చెప్పాడు. అది ఆచరిస్తే జీవితపు చరమాంకంలో అందరూ ఆయనలాగే నిశ్చింతగా కాలం గడిపే వాళ్ళేమో అని అనిపిస్తుంది ఇప్పుడు.
“ఒరేయ్ సన్నాసీ. (ఆయన అందర్నీ అలాగే పిలుస్తాడు) నేను చెప్పేది కాస్త గుర్తు పెట్టుకో. అలవెన్సులూ అవీ కలిపి నీకు అయిదు వందలు వస్తుందనుకుందాం. అందులో 499 ఖర్చు పెట్టుకో. పరవాలేదు, సుఖపడతావు. అయిదు వందలూ తగలేయి. సుఖపడక పోయినా కష్ట పడవు. వచ్చేది అయిదు వందలు అయితే, ఒక్క రూపాయే కదా అని 501  ఖర్చు పెట్టావు అనుకో. ఇంతే సంగతులు. నిన్ను దేవుడు కూడా కాపాడలేడు. ఆదాయాన్ని మించి చేసే ఆ ఒక్క రూపాయి ఖర్చయినా, అప్పయినా, జామెట్రిక్ ప్రోగ్రెషన్ లో  వందలు, వేరుగా పెరిగి నీ మెడకు చుట్టుకుంటుంది. మెడలోతు గోతిలో పడతావు సుమా!”
ఇలాంటి మాటలు చెవికెక్కే వయసు కాదు నాది. పైగా అవన్నీ చాదస్తం మాటలు అని కొట్టిపారేసే వయసు.
చంద్రం మామయ్య  నేను అడిగిన చేబదులు సర్దుబాటు చేసాడా అన్నది కాదు ప్రశ్న. చివరికి  ఆయన చెప్పినట్టే జరిగిందన్నది నా జవాబు.    

తత్వం బోధపడే వేళకు అనుభవం వస్తుంది. కానీ ఏం లాభం?