12, డిసెంబర్ 2016, సోమవారం

ఘోరమైన క్రూర జంతువు

మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో పరుచూరి గోపాల కృష్ణ పలుకులు:
“ఎవరెస్టుఎక్కిన తరువాత ఇక ఎక్కే ఎత్తులు వుండవు, కిందకు జారడం తప్ప. అందుకే నేను ఎవరెస్టు ఇంకా ఎక్కుతున్నాను అనే అనుకుంటూ నా వృత్తిలో ముందుకు వెడుతున్నాను, అప్పుడే కాళ్ళు నేల వుంటాయి”
“ప్రపంచంలోని  జంతుజాలాన్ని చూపే ఒక ప్రదర్శనకు వెళ్లాను. వరసగా చూస్తూ పోతున్నాను. కోతులు, కుందేళ్ళు, పులులు, సింహాలు. అన్నీ బొమ్మలే అనుకోండి. చివర ఒక బోర్డు కనిపించింది. “యావత్ సృష్టిలో భయంకరమైన జంతువును మీరిప్పుడు చూడబోతున్నారు”
అక్కడ ఒక అద్దం వుంది. దానికి ఎదురుగా నిలబడివున్న నా ప్రతి బింబమే అందులో నాకు కనిపించింది.
నిజమే కదా! ఈ లోకంలో మనిషిని మించిన భయంకరమైన జంతువు మరోటి ఏముంది? మిగిలిన క్రూర జంతువులు ఆకలి వేసినప్పుడే వేటాడి తింటాయి. కడుపు నిండినా ఆహారాన్ని కూడబెట్టుకునేవాడు ఒక్క మనిషి మాత్రమే!”
“ఒక లఘు చిత్రం చూశాను. నడి రోడ్డు. కరెంటు స్తంభానికి ఒక కుర్రవాడిని  కట్టేసిఉంచుతారు. దారిన పోయే వారందరూ అక్కడ కాసేపు ఆగి ఓ వింత చూసినట్టు చూసి తమ దారిన వెళ్లిపోతుంటారు. సాయంత్రంవరకూ ఇదే తంతు. ‘ఇదేమిటి’ అని ఆరా తీసినవాళ్ళుంటే ఒట్టు.”
చివర్లో ఒకరు రంగప్రవేశం చేసి చెబుతారు. “జనంలో మానవత్వం ఇంకా మిగిలున్నదాలేదా అనేది తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం”  అని.
మీడియా అవార్డుల ప్రదానోత్సవంలో ముఖ్య అతిధిగా ప్రసంగిస్తూ పరుచూరి గోపాల కృష్ణ ఇలాంటి కబుర్లు ఇంకా చాలా చెప్పారు.
 “ఇతి వార్తాః”

(పరుచూరి వారికి కృతజ్ఞతలు)

కామెంట్‌లు లేవు: