21, నవంబర్ 2016, సోమవారం

అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదు


ఈ పన్నెండు రోజుల చర్చల్లో ఒక విషయం మాత్రం తెలిసొచ్చింది, అల్లా చేసివుంటే ఇల్లా జరిగేది కాదని.
ఎనిమిదో తేదీ మంగళవారం రాత్రి ప్రధాని మోడీ ప్రసంగం తయారు చేసిన వారు కొన్ని జాగ్రత్తలు తీసుకుని వుంటే బాగుండేది. ( అసలా నిర్ణయం ప్రధాని కాకుండా రిజర్వ్ బ్యాంక్  అధికార ప్రతినిధిచేత   ప్రకటించి వుంటే బాగుండేది, దీనికి రాజకీయ రంగు అంటివుండేది కాదన్నది ఒక వాదన. 1978లో అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్  కూడా నోట్ల రద్దు ప్రకటన బాధ్యతను అధికారులకే ఒదిలి వేసిన విషయాన్ని ఈ  ‘వాదకులు’ గుర్తు చేస్తున్నారు)
సరే! ప్రకటన ప్రధానమంత్రి స్వయంగా చేశారు. అందులో కొంపలు మునిగేది ఏమీ వుండదు.  కాకపొతే దాన్ని ఆయన తన తరహాలో కాకుండా ఒక  అధికారిక ప్రకటన మాదిరిగా రాసుకొచ్చి చదివి వుంటే బాగుండేదన్న అభిప్రాయం వుంది. అలానే ఒక రాజకీయ నాయకుడి ప్రసంగం మాదిరిగా కాకుండా  క్లుప్తంగా కొన్ని విషయాలను మాత్రమే ప్రస్తావించి వుండాల్సింది. నల్ల కుబేరులపై యుద్ధ ప్రకటనకు మరో అవకాశం వినియోగించుకుని వుండాల్సింది. తన ప్రసంగంలో ప్రధాని  మోడీ మరో విషయాన్ని ప్రస్తావించారు. ఉగ్రవాదుల చేతుల్లో భారత కరెన్సీ, అందువల్ల దేశ భద్రతకు యేర్పడ బోతున్న ముప్పు, వీటి  కారణంగా ఈ హఠాత్ నిర్ణయం తీసుకోవాల్సివచ్చిందని చెప్పిన  ప్రధాని ఆ అంశానికే  ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వుంటే దేశ ప్రజల దృష్టి అటు మళ్ళివుండేది. (నల్ల కుబేరులపై యుద్ధం అంటూ ఓ పక్క చెబుతూ ఆ నోటితోనే  రెండువేల కొత్త నోటు తెస్తున్నట్టు  చెప్పేసరికి అసలు  విషయం జావకారి పోయింది, లేనిపోని అనుమానాలకు ఆస్కారం ఇచ్చినట్టయింది.)
ప్రధాని తన ప్రసంగాన్ని క్లుప్తంగా ముగించి, గత పన్నెండు రోజులుగా తీసుకుంటున్న ఉపశమన చర్యలు గురించి ఆ రోజే ప్రస్తావించి వుంటే సామాన్య ప్రజల మనస్సుల్లో ఇంత గందరగోళం ఏర్పడి వుండేది కాదు. ప్రకటన దరిమిలా  మీడియాలో వస్తున్న  వార్తలను బట్టి ప్రభుత్వం నిర్ణయాలు ప్రకటిస్తూ, మార్చుకుంటూ పోవడం గమనించిన వారికి ప్రభుత్వం  చేసిన తప్పులు (పొరబాట్లు అనాలేమో) దిద్దుకుంటూ పోతోందన్న అభిప్రాయం కలిగింది. సరయిన విధంగా ముందు చూపుతో తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయిందన్న ఆరోపణలకు ఆస్కారం వుండేది కాదు.  నిర్ణయాన్ని సమర్ధించిన వారే  అమల్లో లోపాల గురించి ఇంతగా మాట్లాడాల్సిన అవసరం వచ్చేది కాదు. చర్చలు ఇంత సుదీర్ఘంగా జరిగేవీ కావు, ఇంత రచ్చ జరిగేదీ కాదు.
సరే! జరగాల్సింది  జరిగిపోయింది. నిర్ణయం  వెనక్కి తీసుకునే వీలులేదు. తడబడ్డ కాలునే  కూడదీసుకోవాలి. పైపంచ గాలికి యెగిరి ముళ్ళకంచెపై పడినప్పుడు అది చిరిగిపోకుండా జాగ్రత్తగా బయటకి తీయాలి. దీనికి చాలా సంయమనం కావాలి. మనసు నిగ్రహంగా వుంచుకోవాలి. రాజకీయంగా వచ్చే విమర్శలను ఎదుర్కునే క్రమంలో, ఆవేశకావేశాలతో తీసుకునే నిర్ణయాలు, వ్యాఖ్యలు  మరింత గందరగోళానికి దారితీస్తాయి. ఇది మోడీ అభిమానులకీ, దురభిమానులకీ, వ్యతిరేకులకీ కూడా వర్తిస్తుంది.
ఈ నిర్ణయంలో నిజంగా ఎటువంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేకపోతే ఎవరికీ భయపడాల్సిన అవసరం కానీ, ఎవరినీ భయపెట్టాల్సిన అగత్యం కానీ వుండదు.

ఇప్పుడు బంతి పూర్తిగా  సర్కారుకోర్టులోనే  వుంది. అది స్పష్టంగా కానవస్తోంది.            

19, నవంబర్ 2016, శనివారం

దేశానికి పట్టిన ‘నల్ల’ తుప్పు వదిలేనా!

(PUBLISHED IN 'SURYA' ON 20-11-2016, SUNDAY)
ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా  ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ  వుంటుంది.
పెద్ద నోట్లను చెలామణీ లోనుంచి తప్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చల సరళి ఇందుకు చక్కని ఉదాహరణ. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలోనూ మోడీ నిర్ణయానికి అనుకూలంగా, ప్రతికూలంగా వెల్లువెత్తుతున్న వ్యాఖ్యానాలు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మోడీ పట్ల అవ్యాజానురాగాలతో కూడిన స్వామి భక్తిని ప్రదర్సిస్తుంటే, వ్యతిరేకులు పూర్తిగా మోడీ పట్ల తమకున్న నిరసన భావాన్ని వ్యక్తం చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా విషయాన్ని అవలోకన చేసేవారికి ఉభయ పక్షాల వాదనలు ఒకరకంగా సరయినవే అనిపిస్తున్నాయి, అదే సమయంలో వాటిల్లో డొల్లతనమూ కానవస్తోంది.
నల్ల ధనం రాకాసి విషపు కోరలనుంచి దేశాన్ని విముక్తం చేయడానికి మోడీ తీసుకున్న  నిర్ణయం మంచిదే. ఈ విషయంలో మమత బెనర్జీ వంటి కొద్దిమందికి మినహా అందరిదీ ఏకాభిప్రాయమే. అనేకుల అసహనం, ఆవేశం ఈ నిర్ణయం అమలు చేసిన తీరుపట్లనే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా ప్రభుత్వం తీసుకుంటున్న అనేకానేక దిద్దుబాటు చర్యలే  ఇందుకు సాక్ష్యం. ఈ చర్యలు మరో విషయాన్నీ అన్యాపదేశంగా తెలియచేస్తున్నాయి. అదేమిటంటే, అత్యంత ప్రభావిత నిర్ణయం తీసుకునే ముందు తగిన ముందు జాగ్రత్త చర్యలు గురించి ప్రభుత్వం ఆలోచన చేయలేదని. ఎవరు విభేదించినా, విమర్శించినా ఈ ఒక్క విషయంలోనే. దురదృష్టం ఏమిటంటే ఈ కోవకు చెందిన సద్విమర్శకులను కూడా జాతి వ్యతిరేకుల గాటనకట్టేసే ప్రయత్నం మరింత దురదృష్టకరం. ఇక నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు కూడా లక్ష్మణ రేఖను దాటుతున్నాయి. మోడీని వ్యక్తిగతంగా చిన్నబుచ్చే రీతిలో ఇవి సాగుతుండడం మరో దురదృష్టకర పరిణామం. ఈ రెండు విభిన్న వాదనల్లో అయితే  భజనలు, లేకపోతె  ఖండనలు మినహా తార్కిక దృష్టి  పూర్తిగా లోపిస్తోంది. విచక్షణ పక్కకు తప్పుకుని అభిమానదురభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తూ గతంలో  శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.
“ఈ ఏడాది (2016) సెప్టెంబరు నుంచి వచ్చే సంవత్సరం (2017) జనవరి వరకు దేశానికి సంక్షుభిత సమయం. ప్రజలు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అగత్యం వుంది” హైదరాబాదులో కార్తీక మాసం కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా స్వామి మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. “అంశం ఏదైనా సరే, రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడ్డం మంచిద”ని ఆయన మరోమారు హితవు పలికారు.
కొద్ది రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా  చెబుతున్నారు. మంచిదే! సంయమనం ఎప్పుడూ మంచిదే. ఎవ్వరూ కాదనరు.

అంతా సద్దుమణుగుతుంది సరే! ఈలోపల అసలు సిసలు నల్ల కుబేరులు తమ వద్ద మూలుగుతున్న నల్ల డబ్బు సర్డుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతె, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ అనే తంతుగా తయారవుతుంది.

ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని పాలకపక్షం అంటోంది. అవి రాజకీయం చేయకుండా సూక్తి ముక్తావళి సభలు నిర్వహిస్తూ పొద్దు పుచ్చుతాయని అనుకోవడం అమాయకత్వం. బీజేపీ ఆ స్థానంలో వుంటే,  వేరే విధంగా వ్యవహరిస్తుందని చెప్పలేము. రాజకీయం మూల స్వభావమే అది.
ప్రధానమంత్రి  మోడీ తీసుకున్న ఈ  నిర్ణయం అల్లాటప్పాది  కాదు. మొత్తం జాతిని ప్రభావితం చేసే గొప్ప సాహసోపేత నిర్ణయం.
ఇన్నేళ్ళ స్వతంత్ర  భారతం రుజాగ్రస్తం అయిపొయింది. నల్లధనం అనే మాయ  రోగం జాతి ఒళ్ళంతా పాకింది. ఈ స్తితిలో వున్న దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద నోట్ల రద్దువంటి శస్త్రచికిత్సలు అవసరమే. సందేహం లేదు. అయితే అందుకు జాతి సంసిద్ధంగా ఉందా!
రోగికి తక్షణం శస్త్రచికిత్స అవసరం అని వైద్యుడు నిర్ణయించాడు. దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడాలని అనుకున్నాడు. రోగి బంధువులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్  లోకి తీసుకు వెళ్ళే ముందు బీపీ, షుగర్ పరీక్షలు చేస్తారు. అవి అదుపులో వుంటే తప్ప లేదా  ఎంతో అవసరం అనుకుంటే తప్ప వైద్యుడు రోగి శరీరంపై కత్తి పెట్టడు.
అలాంటి  ‘ముందు’ జాగ్రత్తలు తీసుకోకుండా జాతి మొత్తానికి సంబంధించిన పెద్ద నోట్ల రద్దు వంటి కీలక విషయంలో ముందు వెనుకలు చూసుకోకుండా ఇలా  అడుగు ముందుకు వేయడం సబబేనా! ఇప్పుడు జరుగుతున్నది గమనిస్తుంటే జరిగింది సరయినదేనా అన్న అనుమానం కలిగితే దాన్ని సందేహించాలా!
ఈ నిర్ణయం అమల్లో ఏవైనా అవతవకలు జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటే   ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని కూర్చోవు. అయితే నల్ల ధనం గురించిన వ్యవహారం కాబట్టి, నోరుజారితే అసలుకే మోసం వస్తుందని, జాతి జనుల దృష్టిలో పలచబడి పోతామనే సంకోచంతో మనసులో ఎలా వున్నా కొన్ని ప్రతిపక్షాలు అంతగా విరుచుకు పడడం లేదు. అంచేత అవన్నీ ఈ నిర్ణయానికి ప్రతికూలతను  బాహాటంగా ప్రకటించడం లేదు. ప్రతిపక్షాలంటే రాజకీయం చేస్తున్నాయని సరి పెట్టుకున్నా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల మాటేమిటి? వాటిని అయినా పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం వుంటుంది కదా!
రాజకీయ ‘శంక’ర్రావుల సంగతి పక్కన బెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.
ఉపసంహరణకు అవకాశం లేని బ్రహ్మాస్త్ర ప్రయోగం జరిగిపోయింది.అది  గురితప్పకుండా చూసుకుంటూ,    సమస్యతో నేరుగా సంబంధం లేని వాళ్లపై దాని పరిణామాలు  పడకుండా చూడడం పాలకుల బాధ్యత.
దేశ ఆర్ధికవ్యవస్థను సమూలంగా మార్చే సదుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం, అమలుకు సంబంధించిన కొన్ని అవకతవకల కారణంగా నగుబాటు అయ్యే పరిస్తితి దాపురించడం నిజంగా విషాదం. నిర్ణయాన్ని అవహేళన చేస్తూ సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.   
‘ఇంటాబయటా క్యూలే’ అన్నాడొక వ్యాఖ్యానకారుడు.
‘ఇంట్లో కూచుని టీవీ పెడితే  క్యూ లైను దృశ్యాలు. కాలు బయట పెడితే, ఏ.టి.ఎం.లు, బ్యాంకుల దగ్గరా క్యూలైన్లు’ అనేది ఆయన కవి హృదయం. ‘యావత్ దేశం క్యూ లైన్లలోనేవుంద’న్నాడు మరో ఉత్ప్రేక్షాలంకారుడు. కాకపోతే కాసింత అతిశయోక్తి వుందనిపించడం సహజం.
కూసింత ఆలస్యంగా తీసుకున్న ఉపశమన చర్యల పుణ్యమాఅని కాసిన్ని కరెన్సీ నోట్లు జనం జేబుల్లోకి చేరడంతో బోసిపోయిన జాతి మళ్ళీ లక్ష్మీ కళ సంతరించుకుంటోంది.
‘చూసింది ఇంతే!చూడాల్సింది ఎంతో వుంది’అని భయపెడుతున్నారు నిరాశావాదులు. రానున్న కొద్ది రోజుల్లో వందేళ్ళు వెనక్కి పోతామన్నది హెచ్చరికతో కూడిన వారి వాదం. 
‘బాగుపడుతుంది, సర్దుకుంటుంది’ అంటున్నారు ఆశావాదులు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని భావయుక్తంగా భరోసా ఇస్తున్నారు. ‘యెంత?  యాభయ్ రోజులేగా! చూస్తుండగానే గడిచిపోతాయి. వేచి చూస్తే పోలా!’ అనేది వారి ఉచిత సలహా.
ఈ సలహాలు నచ్చినా నచ్చకపోయినా చేసేది ఏమీ లేదు సామాన్యులకు. వారు పుట్టడమే పుట్టెడు కష్టాలతో పుట్టారు. వాటి మధ్యే పెరిగారు. క్యూలు కొత్తకాదు, కష్టాలు కొత్తకాదు. కాకపోతే తమ కష్టార్జితం తమ ఖాతాలో వేసుకోవడానికి, తమ వద్ద వున్న కరెన్సీ నోట్లు చెల్లుతాయి అని ధీమాగా జేబులో వుంచుకోవడానికి  ఇన్నిన్ని  ఇబ్బందులు పడాలా అనేదే వారి ఆక్రోశం. అదొక్కటే ఏలినవారు ఆలోచించుకోవాల్సిన విషయం.  
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిపడుతున్న లెక్కలు చూపని డబ్బు లక్షల కోట్లల్లో వున్నట్టు ప్రభుత్వ వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. నిస్సందేహంగా నిజమే అయివుండవచ్చు. బ్యాంకుల సిబ్బంది పాట్లు ఎలా వున్నా బ్యాంకు క్యాష్ చెస్టులు మాత్రం వరద గోదారిలా పొంగి పొర్లుతున్నాయి.  బ్యాంకుల్లో డబ్బు డిపాజిట్ చేయడానికి పెరుగుతున్న  క్యూలే దీనికి రుజువు.  
ఉపశృతి:
బాధలు, ఇబ్బందులు అనేవి నిజానికి సాపేక్షం (రెలెటివ్).
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే  తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని  జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఎదురయ్యే అవస్థలను అన్నింటినీ  స్కూటరువాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా మాత్రమే గుర్తున్నాయి.
ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మనం అనుకునే ఇబ్బందులు వేరు, మన  పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్న ఇబ్బందే కదా! ఆ మాత్రం దేశం కోసం సర్డుకుపోలేరా అని  చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు. 
తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే  రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!   (19-11-2016)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com, మొబైల్: 98491 30595

18, నవంబర్ 2016, శుక్రవారం

యాభయ్ రోజుల పరీక్షా కాలం


‘ఇంటాబయటా క్యూలే’ అన్నాడొక వ్యాఖ్యానకారుడు.
‘ఇంట్లో కూచుని టీవీ పెడితే  క్యూ లైను దృశ్యాలు. కాలు బయట పెడితే, ఏ.టి.ఎం.లు, బ్యాంకుల దగ్గరా క్యూలైన్లు’ అనేది ఆయన కవి హృదయం. యావత్ దేశం క్యూ లైన్లలోనే వుందిపొమ్మన్నాడు మరో ఉత్ప్రేక్షాలంకారుడు. కాకపోతే కాసింత అతిశయోక్తి వుందనిపించడం సహజం.
కూసింత ఆలస్యంగా తీసుకున్న ఉపశమన చర్యల పుణ్యమా అని కాసిన్ని కరెన్సీ నోట్లు జనం జేబుల్లోకి చేరడంతో బోసిపోయిన నగరం మళ్ళీ లక్ష్మీ కళ సంతరించుకుంటోంది.
‘చూసింది ఇంతే!చూడాల్సింది ఎంతో వుంది’అని భయపెడుతున్నారు నిరాశావాదులు. రానున్న కొద్ది రోజుల్లో వందేళ్ళు వెనక్కి పోతామన్నది హెచ్చరికతో కూడిన వారి వాదం.  
‘బాగుపడుతుంది, సర్దుకుంటుంది’ అంటున్నారు ఆశావాదులు. ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని భావయుక్తంగా భరోసా ఇస్తున్నారు. ‘యెంత?  యాభయ్ రోజులేగా! వేచి చూస్తే పోలా!’ అనేది వారి ఉచిత సలహా.
నచ్చినా నచ్చకపోయినా చేసేది ఏమీ లేదు సామాన్యులకు. వారు పుట్టడమే పుట్టెడు కష్టాలతో పుట్టారు. వాటి మధ్యే పెరిగారు. క్యూలు కొత్తకాదు, కష్టాలు కొత్తకాదు. కాకపోతే తమ కష్టార్జితం తమ ఖాతాలో వేసుకోవడానికి ఇన్ని ఇబ్బందులు పడాలా అనేదే వారి ఆక్రోశం.       

17, నవంబర్ 2016, గురువారం

అప్పు అనగానేమి!

ఒకడు తుమ్మితే పక్కన వున్నవాడికి కూడా తుమ్ము వస్తుంది అంటారు. ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా, చదివినా ‘అప్పు’ మాటే కాబట్టి నా పాత అప్పుకధ ఒకటి పాత బాకీలా గుర్తుకొస్తోంది.


అసందర్భంగా అనిపించినా ఆ సందర్భం ప్రస్తావించదలిచాను. 1970 ప్రాంతంలో నేను విజయవాడలో ఒక ప్రముఖ తెలుగు దినపత్రికలో పని చేసే రోజుల్లో జర్నలిష్టుగా సంఘంలో నా జీవితం ఒక మెట్టు పైన వుండేది. జీతభత్యాల రీత్యా చూసుకున్నప్పుడు దారిద్య్ర రేఖకు దిగువన వుండేది. జీతానికీ, జీవితానికీ పొంతనలేని ఆ రోజుల్లో ఒకరోజు, ఒక్క రూపాయంటే ఒక్క రూపాయి జరూరుగా కావాల్సి వచ్చింది. ఇల్లంతా గాలించినా పాతిక పైసలు కూడా లేవు. పిల్లవాడికి పోతపాలు. పాలసీసా పగిలిపోయింది. నేనూ మా ఆవిడా దిగులు మొహాలు వేసుకుని కూర్చుని వుంటే రామారావు అని కొత్తగా పరిచయం అయిన వ్యక్తి మా ఇంటికి వచ్చాడు. అతడాసమయంలో అలా రావడం మా ఇద్దరికీ బాగనిపించలేదు. పరిస్తితి గమనించాడేమో వచ్చిన వాడు వచ్చినట్టే వెళ్ళిపోయాడు. అలా వెళ్ళిన వాడు ఇట్టే తిరిగి వచ్చాడు. అతడి చేతిలో పాలసీసా. మా ప్రాణాలు లేచి వచ్చాయి. కొద్దిరోజులుగా నానుంచి ఓ సాయం కోరుతూ అతడు నా వెంట తిరుగుతున్నాడు. అతనో పెయింటర్. సొంతంగా వ్యాపారం పెట్టుకోవాలనే తపన. బ్యాంకులో పూచీకత్తు ఇచ్చేవాళ్ళు కావాలంటున్నారు. అతడు చేసిన సాయానికి ప్రతిగా బ్యాంకుకు వెళ్లి హామీ సంతకం చేసి పదివేలు అప్పు ఇప్పించాను. వెంటనే, హైదరాబాదు ఆకాశవాణిలో ఉద్యోగం రావడం, ఆ తరువాత మాస్కో రేడియోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళడం ఈ హడావిడిలో నేను బెజవాడ బ్యాంకు అప్పు సంగతి మరచిపోయాను. ఈలోగా అప్పుతీసుకున్న వ్యక్తి వ్యాపారం సరిగ్గా నడవక రోడ్డున పడడం, బ్యాంకు వాళ్ళు హామీదారునయిన నా చిరునామా పట్టుకుని మాస్కోలోని ఇండియన్ ఎంబసీ ద్వారా లక్ష రూపాయలకు కోర్టు ఇచ్చిన డిక్రీ చేతిలో పెట్టడం సినిమాలోలా జరిగిపోయాయి. ప్రభుత్వ ఉద్యోగిని కదా, అప్పు వసూలుకు నేను వారికి కనిపించి వుండడంలో ఆశ్చర్యం లేదు. ఆశ్చర్యం అల్లా ఇప్పుడు అలా జరగడం లేదేమిటని!

మన దేశానికి పట్టిన ‘నల్ల’ తుప్పు వదిలేనా!

ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా  ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ  వుంటుంది.

పెద్ద నోట్లను చెలామణీ లోనుంచి తప్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చల సరళి ఇందుకు చక్కని ఉదాహరణ.

 ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే శ్రీ దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తూ గతంలో  పరిపూర్ణానంద స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.

“ఈ ఏడాది (2016) సెప్టెంబరు నుంచి వచ్చే సంవత్సరం (2017) జనవరి వరకు దేశానికి సంక్షుభిత సమయం. ప్రజలు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అగత్యం వుంది” హైదరాబాదులో కార్తీక మాసం కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా స్వామి మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. “అంశం ఏదైనా సరే, రాజకీయ నాయకులు ఆచితూచి మాట్లాడ్డం మంచిద”ని ఆయన మరోమారు హితవు పలికారు.

కొద్ది రోజులు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా  చెబుతున్నారు. మంచిదే! సంయమనం ఎప్పుడూ మంచిదే. ఎవ్వరూ కాదనరు.

అంతా సద్దుమణుగుతుంది సరే! ఈలోపల అసలు సిసలు నల్ల కుబేరులు తమ వద్ద మూలుగుతున్న నల్ల డబ్బు సర్డుకోకుండా, సర్దుబాటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతె, ‘తాళము వేసితిని, గొళ్ళెము మరచితిని’ అనే తంతు అవుతుంది.     

 

16, నవంబర్ 2016, బుధవారం

రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చు కదా!


బాధలు, ఇబ్బందులు రెలెటివ్ అని తీర్మానించాడు ఒకాయన.
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే  తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు. తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని  జీతం పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం మొదలయింది కానీ, జీవితంలో ఇబ్బందులను స్కూటరు వాలా కోణం నుంచే గమనించడం కూడా మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి. సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా గుర్తున్నాయి.
ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు, కష్టాలు రెలెటివ్. మేం  అనుకునే ఇబ్బందులు వేరు, మా పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్నబుచ్చడం పెద్దరికం అనిపించుకోదు.  
తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే  రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే!

రాజకీయ చెణుకులు



రాజకీయాల్లో వుండేవాళ్ళల్లో కూడా హాస్యపు పాలు ఎక్కువే. అయితే ఇటీవలి కాలంలో అది తక్కువైపోతూ అసహనపు పాలు ఎక్కువవుతోంది. కొన్ని పాత ముచ్చట్లు గుర్తు చేసుకుందాం.
నెహ్రూ మంత్రి వర్గంలో కృష్ణ మీనన్ రక్షణ మంత్రి. పాకీస్తాన్ కి అమెరికా ఆయుధ సాయంపై పార్లమెంటులో చర్చ జరుగుతోంది. ఆ ఆయుధాలను భారత దేశానికి వ్యతిరేకంగా వాడడం జరగదు అనే వాదాన్ని ఖండిస్తూ అయన ఇలా అన్నారు.
“ఆకులూఅలం తిని పొట్టనింపుకునే శాకాహార పులిని నేనింతవరకూ చూడలేదు”
సభలో భారత ఆటోమొబైల్ పరిశ్రమకు సంబంధించి చర్చ నడుస్తోంది.
ఒక ప్రతిపక్ష  సభ్యుడు ఇలా అన్నారు.                               
“మన దేశంలో తయారయ్యే మోటారు కారులో శబ్దం చేయని భాగం ఏదైనా ఉన్నదంటే అది కారు హారన్ మాత్రమే”
బ్రిటిష్ ప్రభుత్వంతో చర్చలకు మహాత్మాగాంధీ ఇంగ్లండ్ బయలుదేరుతున్నారు. ఒకరన్నారు.
“అక్కడ బ్రిటిష్ ప్రభువును ఇలానే చాలీచాలని ధోతీ పై కండువాతో   కలుసుకుంటారా!”
“ఏమిటి ఇబ్బంది, నాకు లేకపోయినా బ్రిటిష్ ప్రభువువద్ద  ఇద్దరికి  సరిపడా దుస్తులు వుండే వుంటాయి కదా!” గాంధి జవాబు.
1949 లో ప్రధాని నెహ్రూ మొదటిసారి అమెరికా పర్యటన చేసి స్వదేశానికి తిరిగివచ్చారు. అక్కడి సంస్కృతీ సంప్రదాయాలపై ముఖ్యంగా నాగరీకం పేరుతొ సమాజంలో సాగుతున్న పద్దతులు ఆయనకు నచ్చలేదు. ఆ భావాలను  మొత్తం ఆయన ఒక్క ముక్కలో ఇలా చెప్పారు.
“ఏమైనా సరే! ఎవ్వరూ కూడా ‘మొట్టమొదటిసారి’  మాత్రం అమెరికా వెళ్ళకూడదు”
సరోజినీనాయుడు మహాత్మా గాంధీ గురించి ఘాటుగా వ్యాఖ్యానించింది.
“ఈ గాంధీగారి  నిరాడంబరత్వం  ఏమో కానీ ఆయన్ని ఇలా సాదాసీదాగా వుంచడానికి మనం ఎంతో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తోంది. ఆయన గారు ఈ సంగతి ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో!”
సర్దార్ పటేల్ ని కూడా ఆమె వదిలి పెట్టలేదు.
“ ఈ ఉక్కు మనిషికి అగ్రికల్చర్ తప్ప అసలు కల్చర్ అంటే ఎంతమాత్రం తెలియదు”
ప్రతిపక్ష సభ్యుడు పిలూ మోడీ మంచి హాస్య చతురత కలవాడు. భారీ కాయానికి తగ్గట్టే హాస్యం కూడా అదే మోతాదులో వుండేది. ఆ రోజుల్లో ప్రధాని ఇందిరాగాంధీ,  ఏ  సమస్య  వచ్చినా, మొండిగా  దాన్ని అమెరికా గూఢచారిసంస్థ సీఐఏ తో ముడిపెట్టి మాట్లాడుతూ వుండేవారు. అది విని వినీ చిర్రెత్తుకొచ్చిన పిలూ మోడీ “నేను సీఐఏ ఏజంటును’ అని రాసి వున్న బ్యాడ్జీని ఇందిరాగాంధీకి కనిపించేలా తన చొక్కాకు తగిలించుకుని సభకు వచ్చారు.
అప్పుడు రాజీవ్ గాంధి ప్రధాని. తెలుగుదేశం సభ్యుడు పర్వతనేని ఉపేంద్ర  ప్రతిపక్ష నాయకుడు. రాజీవ్ గాంధి ఏదో విదేశ పర్యటన ముగించుకుని వచ్చి సభలో అడుగు పెట్టారు. పదేపదే విదేశీ యాత్రలు చేసే ప్రధానిగా అప్పటికే ఆయనపై ప్రతిపక్షాలు ఓ ముద్ర వేసాయి. ప్రధాని రావడం చూసి ఉపేంద్ర తన స్థానంలో నిలబడి అన్నారు. “ చాలా అరుదుగా ఢిల్లీని సందర్శిస్తున్న భారత ప్రధానికి స్వాగతం పలుకుతున్నాం”
1950 ప్రాంతాల్లో పీ. గోవింద మీనన్ ట్రావెన్ కూర్, కొచిన్ రాష్ట్రానికి (తరువాత కేరళ రాష్ట్రంగా పేరు మారింది) ముఖ్యమంత్రి. టీ.వీ.థామస్ ప్రతిపక్ష నాయకుడు.
తను కూర్చున్న స్థానాన్ని చూపిస్తూ ముఖ్యమంత్రి అన్నారు. “నా ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవడానికి ప్రతిపక్ష నాయకుడు చాలా ఆత్రుత పడుతున్నారు. అది ఆయనకు ఈ జన్మలో సాధ్యం అయ్యేపని కాదని నేను చెప్పదలచుకున్నాను.  ఈ కుర్చీ ఎక్కాలంటే ఆయన మళ్ళీ మనిషి జన్మ కాదు,  నల్లి జన్మ ఎత్తాలి.”
బ్రిటిష్ ప్రధానిగా రామ్సే మెక్ డోనాల్డ్ కి మెతక మనిషి అనే పేరు. ప్రతిపక్షంలో వున్న విన్ స్టన్ చర్చిల్ ఆయన్ని గురించి ఒకసారి ఇలా వ్యాఖ్యానించారు.
ఈ మెక్ డోనాల్డ్  ఎలాటి వాడంటే  గొర్రె తోలు కప్పుకున్న మరో గొర్రె”