(PUBLISHED IN 'SURYA' ON 20-11-2016, SUNDAY)
ఎదుటి దృశ్యం సరిగా కనబడాలంటే కంటి
చూపు తేటగా వుండాలి. కంటికి పెట్టుకున్న అద్దాలను బట్టి కూడా ప్రపంచం కానవచ్చే తీరు మారుతూ వుంటుంది.
పెద్ద నోట్లను చెలామణీ లోనుంచి
తప్పిస్తూ మోడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై దేశ వ్యాప్తంగా సాగుతున్న చర్చల
సరళి ఇందుకు చక్కని ఉదాహరణ. ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలోనూ మోడీ నిర్ణయానికి
అనుకూలంగా, ప్రతికూలంగా వెల్లువెత్తుతున్న వ్యాఖ్యానాలు ఒక విషయాన్ని స్పష్టం
చేస్తున్నాయి. అనుకూలంగా మాట్లాడే వాళ్ళు మోడీ పట్ల అవ్యాజానురాగాలతో కూడిన స్వామి
భక్తిని ప్రదర్సిస్తుంటే, వ్యతిరేకులు పూర్తిగా మోడీ పట్ల తమకున్న నిరసన భావాన్ని
వ్యక్తం చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నారు. ఎటువంటి రాగద్వేషాలు లేకుండా
విషయాన్ని అవలోకన చేసేవారికి ఉభయ పక్షాల వాదనలు ఒకరకంగా సరయినవే అనిపిస్తున్నాయి,
అదే సమయంలో వాటిల్లో డొల్లతనమూ కానవస్తోంది.
నల్ల ధనం రాకాసి విషపు కోరలనుంచి
దేశాన్ని విముక్తం చేయడానికి మోడీ తీసుకున్న నిర్ణయం మంచిదే. ఈ విషయంలో మమత బెనర్జీ వంటి
కొద్దిమందికి మినహా అందరిదీ ఏకాభిప్రాయమే. అనేకుల అసహనం, ఆవేశం ఈ నిర్ణయం అమలు
చేసిన తీరుపట్లనే. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా ప్రభుత్వం తీసుకుంటున్న
అనేకానేక దిద్దుబాటు చర్యలే ఇందుకు
సాక్ష్యం. ఈ చర్యలు మరో విషయాన్నీ అన్యాపదేశంగా తెలియచేస్తున్నాయి. అదేమిటంటే,
అత్యంత ప్రభావిత నిర్ణయం తీసుకునే ముందు తగిన ముందు జాగ్రత్త చర్యలు గురించి
ప్రభుత్వం ఆలోచన చేయలేదని. ఎవరు విభేదించినా, విమర్శించినా ఈ ఒక్క విషయంలోనే.
దురదృష్టం ఏమిటంటే ఈ కోవకు చెందిన సద్విమర్శకులను కూడా జాతి వ్యతిరేకుల గాటనకట్టేసే
ప్రయత్నం మరింత దురదృష్టకరం. ఇక నిర్ణయానికి వ్యతిరేకంగా సాగుతున్న ప్రచారాలు కూడా
లక్ష్మణ రేఖను దాటుతున్నాయి. మోడీని వ్యక్తిగతంగా చిన్నబుచ్చే రీతిలో ఇవి సాగుతుండడం
మరో దురదృష్టకర పరిణామం. ఈ రెండు విభిన్న వాదనల్లో అయితే భజనలు, లేకపోతె ఖండనలు మినహా తార్కిక దృష్టి పూర్తిగా లోపిస్తోంది. విచక్షణ పక్కకు తప్పుకుని
అభిమానదురభిమానాలు వెర్రితలలు వేస్తున్నాయి.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే శ్రీ
దుర్ముఖి నామ సంవత్సర పంచాంగ శ్రవణం చేస్తూ గతంలో
శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణానంద స్వామి చెప్పిన మాటలు గుర్తుకు వస్తున్నాయి.
“ఈ ఏడాది (2016) సెప్టెంబరు నుంచి వచ్చే సంవత్సరం (2017) జనవరి వరకు దేశానికి సంక్షుభిత సమయం. ప్రజలు, ప్రత్యేకించి రాజకీయ నాయకులు సంయమనం పాటించాల్సిన అగత్యం వుంది”
హైదరాబాదులో కార్తీక మాసం కోటి దీపోత్సవ కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా స్వామి
మళ్ళీ ఇదే విషయాన్ని ప్రస్తావించడం గమనార్హం. “అంశం ఏదైనా సరే, రాజకీయ నాయకులు
ఆచితూచి మాట్లాడ్డం మంచిద”ని ఆయన మరోమారు హితవు పలికారు.
కొద్ది రోజులు ఓపిక పడితే అంతా
సర్దుకుంటుందని ప్రభుత్వ పెద్దలు కూడా
చెబుతున్నారు. మంచిదే! సంయమనం ఎప్పుడూ మంచిదే. ఎవ్వరూ కాదనరు.
ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయని
పాలకపక్షం అంటోంది. అవి రాజకీయం చేయకుండా సూక్తి ముక్తావళి సభలు నిర్వహిస్తూ
పొద్దు పుచ్చుతాయని అనుకోవడం అమాయకత్వం. బీజేపీ ఆ స్థానంలో వుంటే, వేరే విధంగా వ్యవహరిస్తుందని చెప్పలేము. రాజకీయం
మూల స్వభావమే అది.
ప్రధానమంత్రి మోడీ తీసుకున్న ఈ నిర్ణయం అల్లాటప్పాది కాదు. మొత్తం జాతిని ప్రభావితం చేసే గొప్ప
సాహసోపేత నిర్ణయం.
ఇన్నేళ్ళ స్వతంత్ర భారతం రుజాగ్రస్తం అయిపొయింది. నల్లధనం అనే మాయ రోగం జాతి ఒళ్ళంతా పాకింది. ఈ స్తితిలో వున్న
దేశ ఆర్ధిక వ్యవస్థను మళ్ళీ గాడిలో పెట్టాలంటే పెద్ద నోట్ల రద్దువంటి
శస్త్రచికిత్సలు అవసరమే. సందేహం లేదు. అయితే అందుకు జాతి సంసిద్ధంగా ఉందా!
రోగికి తక్షణం శస్త్రచికిత్స అవసరం అని
వైద్యుడు నిర్ణయించాడు. దుష్టాంగాన్ని ఖండించి శిష్టాంగాన్ని కాపాడాలని
అనుకున్నాడు. రోగి బంధువులు అంగీకరించారు. ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకు వెళ్ళే ముందు బీపీ, షుగర్ పరీక్షలు
చేస్తారు. అవి అదుపులో వుంటే తప్ప లేదా
ఎంతో అవసరం అనుకుంటే తప్ప వైద్యుడు రోగి శరీరంపై కత్తి పెట్టడు.
అలాంటి ‘ముందు’ జాగ్రత్తలు తీసుకోకుండా జాతి మొత్తానికి
సంబంధించిన పెద్ద నోట్ల రద్దు వంటి కీలక విషయంలో ముందు వెనుకలు చూసుకోకుండా ఇలా అడుగు ముందుకు వేయడం సబబేనా! ఇప్పుడు
జరుగుతున్నది గమనిస్తుంటే జరిగింది సరయినదేనా అన్న అనుమానం కలిగితే దాన్ని
సందేహించాలా!
ఈ నిర్ణయం అమల్లో ఏవైనా అవతవకలు
జరుగుతున్నాయని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అనుకుంటే ప్రతిపక్షాలు చేతులు ముడుచుకుని కూర్చోవు. అయితే
నల్ల ధనం గురించిన వ్యవహారం కాబట్టి, నోరుజారితే అసలుకే మోసం వస్తుందని, జాతి జనుల
దృష్టిలో పలచబడి పోతామనే సంకోచంతో మనసులో ఎలా వున్నా కొన్ని ప్రతిపక్షాలు అంతగా
విరుచుకు పడడం లేదు. అంచేత అవన్నీ ఈ నిర్ణయానికి ప్రతికూలతను బాహాటంగా ప్రకటించడం లేదు. ప్రతిపక్షాలంటే
రాజకీయం చేస్తున్నాయని సరి పెట్టుకున్నా సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యల మాటేమిటి?
వాటిని అయినా పరిగణన లోకి తీసుకోవాల్సిన అవసరం వుంటుంది కదా!
రాజకీయ ‘శంక’ర్రావుల సంగతి పక్కన
బెట్టండి. రాజకీయాలకు అతీతంగా ఆలోచించండి.
ఉపసంహరణకు అవకాశం లేని బ్రహ్మాస్త్ర
ప్రయోగం జరిగిపోయింది.అది గురితప్పకుండా
చూసుకుంటూ, సమస్యతో నేరుగా సంబంధం లేని వాళ్లపై దాని
పరిణామాలు పడకుండా చూడడం పాలకుల బాధ్యత.
దేశ ఆర్ధికవ్యవస్థను సమూలంగా మార్చే
సదుద్దేశ్యంతో తీసుకున్న నిర్ణయం, అమలుకు సంబంధించిన కొన్ని అవకతవకల కారణంగా
నగుబాటు అయ్యే పరిస్తితి దాపురించడం నిజంగా విషాదం. నిర్ణయాన్ని అవహేళన చేస్తూ
సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం.
‘ఇంటాబయటా క్యూలే’ అన్నాడొక
వ్యాఖ్యానకారుడు.
‘ఇంట్లో కూచుని టీవీ పెడితే క్యూ లైను దృశ్యాలు. కాలు బయట పెడితే,
ఏ.టి.ఎం.లు, బ్యాంకుల దగ్గరా క్యూలైన్లు’ అనేది ఆయన కవి హృదయం. ‘యావత్ దేశం క్యూ లైన్లలోనేవుంద’న్నాడు
మరో ఉత్ప్రేక్షాలంకారుడు. కాకపోతే కాసింత అతిశయోక్తి వుందనిపించడం సహజం.
కూసింత ఆలస్యంగా తీసుకున్న ఉపశమన చర్యల
పుణ్యమాఅని కాసిన్ని కరెన్సీ నోట్లు జనం జేబుల్లోకి చేరడంతో బోసిపోయిన జాతి మళ్ళీ
లక్ష్మీ కళ సంతరించుకుంటోంది.
‘చూసింది ఇంతే!చూడాల్సింది ఎంతో
వుంది’అని భయపెడుతున్నారు నిరాశావాదులు. రానున్న కొద్ది రోజుల్లో వందేళ్ళు వెనక్కి
పోతామన్నది హెచ్చరికతో కూడిన వారి వాదం.
‘బాగుపడుతుంది, సర్దుకుంటుంది’
అంటున్నారు ఆశావాదులు. ‘ఉందిలే మంచి కాలం ముందు ముందునా’ అని భావయుక్తంగా భరోసా
ఇస్తున్నారు. ‘యెంత? యాభయ్ రోజులేగా! చూస్తుండగానే
గడిచిపోతాయి. వేచి చూస్తే పోలా!’ అనేది వారి ఉచిత సలహా.
ఈ సలహాలు నచ్చినా నచ్చకపోయినా చేసేది
ఏమీ లేదు సామాన్యులకు. వారు పుట్టడమే పుట్టెడు కష్టాలతో పుట్టారు. వాటి మధ్యే
పెరిగారు. క్యూలు కొత్తకాదు, కష్టాలు కొత్తకాదు. కాకపోతే తమ కష్టార్జితం తమ ఖాతాలో
వేసుకోవడానికి, తమ వద్ద వున్న కరెన్సీ నోట్లు చెల్లుతాయి అని ధీమాగా జేబులో వుంచుకోవడానికి
ఇన్నిన్ని ఇబ్బందులు పడాలా అనేదే వారి ఆక్రోశం. అదొక్కటే
ఏలినవారు ఆలోచించుకోవాల్సిన విషయం.
పెద్ద నోట్ల రద్దు నిర్ణయం దరిమిలా
ప్రభుత్వ ఖజానాలోకి వచ్చిపడుతున్న లెక్కలు చూపని డబ్బు లక్షల కోట్లల్లో వున్నట్టు ప్రభుత్వ
వర్గాలు లెక్కలు చెబుతున్నాయి. నిస్సందేహంగా నిజమే అయివుండవచ్చు. బ్యాంకుల
సిబ్బంది పాట్లు ఎలా వున్నా బ్యాంకు క్యాష్ చెస్టులు మాత్రం వరద గోదారిలా పొంగి
పొర్లుతున్నాయి. బ్యాంకుల్లో డబ్బు
డిపాజిట్ చేయడానికి పెరుగుతున్న క్యూలే
దీనికి రుజువు.
ఉపశృతి:
బాధలు, ఇబ్బందులు అనేవి నిజానికి సాపేక్షం
(రెలెటివ్).
నేను 1975 లో రేడియోలో చేరడానికి హైదరాబాదు వచ్చినప్పుడు చిక్కడపల్లిలో అద్దెకు
ఉండేవాడిని. చేసే ఉద్యోగం రేడియోలో అయినా రిపోర్టర్ గా నేను వెళ్ళాల్సింది మాత్రం
సచివాలయానికో మరో చోటికో. అసలానౌకరీయే
తిరుగుళ్ళ ఉద్యోగం. సిటీ బస్సుల్లో తిరగడానికి సర్కారువారిచ్చిన ఉచిత పాసు
వుండేది. ఆ రోజుల్లో నాకు బస్సు ప్రయాణీకుల తిప్పలు తప్ప వేరేవి పట్టేవి కావు.
తరువాత మూడో పే కమీషన్ ధర్మమా అని జీతం
పెరిగి నా ప్రయాణాలు సిటీ బస్సుల నుంచి ఆటోల స్థాయికి మారాయి. ఇక అప్పటినుంచి ఆటోల
వల్ల, ఆటోవాలాల వల్ల ప్రయాణీకులు పడుతున్న ఇబ్బందులే నా కంటికి భూతద్దంలో మాదిరిగా
పెద్దగా కనబడడం మొదలయింది. ఓ పుష్కరం తరువాత స్కూటరు కొనడం ఝామ్మని తిరగడం
మొదలయింది కానీ, జీవితంలో ఎదురయ్యే అవస్థలను అన్నింటినీ స్కూటరువాలా కోణం నుంచే గమనించడం కూడా
మొదలయింది. ఇలా బోలెడు జీవితం సినిమా రీలులా తిరిగి, కారూ, డ్రైవరు వైభోగం పిల్లల
ద్వారా సంక్రమించిన తరువాత ఇబ్బందుల రంగూ, రుచీ, వాసనా మరో రూపం సంతరించుకున్నాయి.
సిటీ బస్సు, ఆటో, స్కూటరు రోజుల ఇబ్బందులు మూగమనసులు సినిమాలోలా లీలగా మాత్రమే
గుర్తున్నాయి.
ఏతావాతా చెప్పేది ఏమిటంటే ఇబ్బందులు,
కష్టాలు రెలెటివ్. మనం అనుకునే ఇబ్బందులు వేరు, మన పనివాళ్ళ ఇబ్బందులు వేరు. మనం ఏ ఇబ్బందీ లేకుండా
వుంటున్నామంటే అందరూ అలా వుంటున్నారని కాదు. ఎవరి ఇబ్బందులు వారివి. మనకు చిన్నవే
కావచ్చు వారికి పెద్దవి కావచ్చు. అలాటివారిని చిన్న ఇబ్బందే కదా! ఆ మాత్రం దేశం
కోసం సర్డుకుపోలేరా అని చిన్నబుచ్చడం
పెద్దరికం అనిపించుకోదు.
తినడానికి రొట్టె లేక ఆకలితో ఓ అమ్మాయి
ఏడుస్తుంటే ‘ రొట్టె దొరక్కపోతే కేకు తినొచ్చుకదా!’ అనే రాజకుమారి జోకులు పుట్టింది ఇందుకే! (19-11-2016)