17, అక్టోబర్ 2015, శనివారం

చూస్తోంది ఇంతే! చూడాల్సింది ఇంకెంతో!

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 18-10-2015, SUNDAY)
సూటిగా ......సుతిమెత్తగా
చూస్తోంది ఇంతే! చూడాల్సింది ఇంకెంతో!  
‘చెప్పేవాడు లేక చెడిపోయాడ’ని సామెత. నవజాత ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల వరస చూస్తుంటే ఈ నానుడి గుర్తొస్తోంది.
సమస్యల అమావాస్యల్లో ఆవిర్భవించిన ఈ కొత్త రాష్ట్రంలో ప్రతి రోజూ ఒక సమస్యే. ఆ సమస్య కూడా పాలక ప్రతిపక్షాల నడుమ సమస్య. ప్రజల సమస్య యెంత మాత్రం కాదు. వారి సమస్యలు వారికి వున్నాయి. ఆకాశానికి ఎగబాకుతున్న ఒక్క పప్పుల ధరలు చాలు వారి కష్టాలు, సమస్యలు ఏ తీరున వున్నాయో చెప్పడానికి. కానీ అవేవీ ఏలినవారికీ కనపడ్డం లేదు, వారిని నిలదీయాల్సిన ప్రతిపక్షానికీ పట్టడం లేదు. వారి వారి రాజకీయ అంశాలే ఆయా  పార్టీల ప్రాధాన్యతాక్రమంలో మొదటి వరుసలో వున్నాయి.
పాలక పక్షం టీడీపీ, రాజధాని నిర్మాణ శంకుస్థాపన పనుల్లో ప్రస్తుతం మునిగితేలుతోంది. ఏకైక ప్రతిపక్షం వై.ఎస్.ఆర్.సి.పీ. మరో కార్యక్రమం లేనట్టు ప్రత్యేక హోదా అంశాన్ని పట్టుకుని వేళ్ళాడుతోంది. నిజానికి ఈ రెండూ చాలా ముఖ్యమైన అంశాలే. కానీ ప్రాధాన్యత కలిగిన అంశాల జాబితా ఆ కొత్త రాష్ట్రానికి చిన్నదేమీ కాదు. చాంతాడంత వుంది.
సరే! ఎన్నాళ్ళు గానో జనాలు ఎదురుచూస్తున్న రాజధాని శంకుస్థాపన మహోత్సవం ఘడియ దగ్గరపడుతోంది. ప్రభుత్వానికి ఇది అత్యంత ప్రతిష్టాత్మకం. సందేహం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా అదే అన్నారు, తన కళ్ళముందు కనిపిస్తున్నవి రెండే రెండు. అవి రాజధాని, పోలవరం అని. నవజాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అవి రెండూ రెండు కళ్ళు అని కూడా చెప్పారు. ఇది కూడా వాస్తవం. ఈ రెండూ రాష్ట్రానికే కాదు దాన్ని పాలిస్తున్నటీడీపీ రాజకీయ భవిష్యత్తుకు  కూడా అత్యంత ఆవశ్యకం. నిజం చెప్పాలంటే మరో మూడున్నర  ఏళ్ళ తరువాత జరగబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ రెండూ  ఆ పార్టీకి ‘ట్రంపు కార్డులు’. తన పార్టీని గెలుపు దిశగా తీసుకువెళ్ళే యవనాశ్వాలు. 
పాలనాపరంగా చూసినా, రాజకీయ ఎత్తుగడల కోణం నుంచి చూసినా చంద్రబాబునాయుడు ఇప్పుడున్న రాజకీయ నాయకుల్లో అతి సమర్ధుడు. సీనియర్ కూడా. అంచేత ఎన్నికల సమయంలో బ్రహ్మాస్త్రాల మాదిరిగా ఉపయోగపడే ఈ ఆయుధాల విలువ బాగా ఎరిగిన నాయకుడాయన. 
అంచేతే ఆయన రాజధాని నిర్మాణాన్ని సవాలుగా తీసుకుని పనిచేస్తున్నారు. ఎన్నికల నాటికన్నా ఈ స్వప్న నగరాన్ని ఓ మేరకు అయినా పూర్తి చేసి, అది పూర్తిగా పూర్తి చేయాలంటే  తనలాటి సమర్దుడయిన నాయకుడు తప్పనిసరి అనే భావన ప్రజల్లోకి పంపించగలగాలి. అలాగే పోలవరం. ఎన్నికల కోయిల కూసేలోగా దాన్ని పూర్తి చేయడం కష్టమే అయినా పట్టుదల  వుంటే అసాధ్యం కాదని నిరూపించడం ఆయన వ్యూహంలో భాగం కావచ్చు. తన సమర్ధతత పైన నమ్మకంతోనే గత ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపించారని ఆయన విశ్వసిస్తున్నారు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడం ఇప్పుడు చంద్రబాబు ముందున్న సవాలు. ఆ నమ్మకమే తన విజయానికి అసలు సిసలు పునాది. అది జనాల్లో నాటుకుపోయేలా చేయగలిగితే మిగిలిన విషయాలు పట్టించుకోనవసరం లేదు. అందుకోసమే ఆయన మరో పని లేదన్నట్టు రాజధాని నిర్మాణం పట్లే తన శక్తియుక్తులన్నీ వాడుతున్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలు కలిగిన రాజధాని నగరాన్ని ఆయన మూడేళ్ళలో నిర్మించడం సాధ్యం కాదని ఆయనకూ తెలుసు. దశలవారీగానే జరుగుతుందనీ తెలుసు.  కానీ అది పూర్తి కావాలంటే మాత్రం అందులో తన పాత్ర వుండి తీరాలన్న విశ్వాసం కలిగించడం ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా ఆయన ముందున్న మొదటి సవాలు. అందుకే ఎన్ని విమర్శలు ఎదురయినా, ఎన్ని ఆటంకాలు ముందరి కాళ్ళకు బంధం వేస్తున్నా అయన అలుపు ఎరగకుండా ముందుకే సాగుతున్నారు.

ఈ క్రమంలో ఆహ్వానాల గురించి ప్రతిపక్షం లేవనెత్తిన అంశం టీకప్పులో తుపాను. మంచి కార్యక్రమం జరుగుతున్నప్పుడు, అదీ యావత్ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన ఓ  శుభ సందర్భం దగ్గర పడుతున్నప్పుడు  ప్రతిపక్షనేత తన సహజ శైలిలో ఓ సంచలన ప్రకటన చేసారు. ఈ కార్యక్రమానికి హాజరు కాబోడం లేదని చెప్పడం ఒక ఎత్తు. కానీ జగన్ మోహన్ రెడ్డి మరో అడుగు ముందుకు వేసి, తనకు పిలుపు అందినా వెళ్ళేది లేదని ముక్తాయింపు కూడా ఇచ్చారు. రాష్ట్ర మంత్రులు అంటున్నట్టు అది జగన్ మోహన రెడ్డి రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం కాకపోయినా, తొందరపాటు చర్య అన్నది సుష్పష్టం. రాజధాని నిర్మాణంలో పాలక పక్షం ఒంటెత్తు పోకడలకు పోతున్నదని ఆయన పార్టీ మొదట నుంచీ వాదిస్తోంది. అటువంటి అంశాలను, అందులో బహిర్గతం కాని అంశాలు ఏవైనా వుంటే వాటిని సాక్ష్యాధారాలతో బయట పెట్టడానికి బదులు ఆయన ఎంచుకున్న ఈ ‘బహిష్కరణ’ బాట జనామోదం పొందడం కష్టం.  కాకపొతే, ఆయన పనిలో పనిగా  ఈ  నిర్ణయానికి పురికొల్పిన ఎనిమిది అంశాలను తన ప్రకటనకు జత చేసి రాజకీయ చర్చలకు తెరతీసారు.
వీటిలో చాలావరకు ఆ పార్టీ ప్రస్తావిస్తూ వచ్చిన విషయాలే. చేస్తూ వచ్చిన ఆరోపణలే. శంకుస్థాపన కార్యక్రమానికి కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది జగన్ మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నాయకులు విమర్శిస్తున్నారు. ‘నాలుగయిదు వందల కోట్లు తగలేస్తున్నామన్నది నిరాధారమైన ఆరోపణ. అందులో ఏమాత్రం నిజం లేద’ని తెలుగు దేశం మంత్రులు మూకుమ్మడిగా విరుచుకు పడ్డారు. మంత్రులు చెప్పేది వాస్తవం కావచ్చు. కానీ జరుగుతున్న ప్రచారార్భాటం తీరుతెన్నులు చూస్తుంటే,  ‘ఏమో! నిజమేనేమో!’ అనే శంకలు కలిగే అవకాశం లేకపోలేదు. ఏలికలు ఈ విషయం గమనంలో పెట్టుకోవాలి.
‘శంకుస్థాపన కార్యక్రమానికి రాను’ అని ముందుగానే ప్రకటన చేయడం జగన్ మోహన రెడ్డి పొరబాటే. అలాగే రాష్ట్రంలో ఏకైక ప్రతిపక్షాన్ని  ‘రాష్ట్ర రాజధాని వంటి  అత్యంత ప్రాముఖ్యత’ కలిగిన విషయంలో విశ్వాసంలోకి తీసుకోకుండా వ్యవహరించడం పాలక పక్షం చేసిన పొరబాటు.
వాస్తవంగా చూస్తే వడ్ల గింజలో బియ్యపు గింజ సామెత బాపతు. ఆధిక్యతా భావాన్ని అదుపులో వుంచుకోలేక పోవడం కలిగే పరిణామాలు ఇలానే వుంటాయి. నిజమే రెండు రాజకీయ పార్టీల నడుమ సయోధ్య అంత సులభం కాదు. అందులోనూ రెండు ప్రాంతీయ పార్టీల మధ్య మరింత దుస్తరం. అంత మాత్రాన ప్రతిదీ రాజకీయం చేస్తూ పొతే ప్రయోజనం ఏముంటుంది? రాజధాని నిర్మాణం వంటి ముఖ్యమైన వేడుక జరుగుతున్నప్పుడు ఇష్టం వున్నా లేకపోయినా దాన్ని మనసులో ఉంచుకుని  అందులో పాలుపంచుకోవడం  ప్రతిపక్షం  బాధ్యత. అల్లాగే ప్రతిపక్ష నాయకుడితో పాలక పక్షానికి ఎన్నెన్ని ఇబ్బందికర అంశాలు అడ్డం వున్నా, ఆయన హోదాకు తగినట్టుగా ఆహ్వానం గురించిన సమాచారం ముందస్తుగానే అందించి వుంటే బాగుండేది. పెళ్ళి కార్డు పోస్టులో పంపించే గృహస్తులు కూడా, యెంత పని ఒత్తిళ్ళ నడుమ కూడా తీరిక చేసుకుని చుట్టపక్కాలను, బంధు మిత్రులను ఫోను చేసి ఆహ్వానించడం పరిపాటి. మర్యాద కూడా.  ఎందుకో కారణం తెలవదు కానీ అదిక్కడ లోపించింది.  ఈ రగడ జరక్కముందే ముఖ్యమంత్రే ఫోను చేసి ఆహ్వానించి వుంటే చంద్రబాబు ఔన్నత్యాన్ని గురించి జనం చెప్పుకునే వారు. 1995 లో ఆయన మొదటి సారి ముఖ్యమంత్రి అయినప్పుడు ప్రతిపక్ష నాయకుల ఇళ్ళకు వెళ్లి స్వయంగా ఆహ్వానించిన సంగతి గుర్తున్న వాళ్లకి నేటి ఆయన వ్యవహారశైలి  మింగుడు పడుతుండక పోవచ్చు. ఔదార్యం వల్ల ఒనగూడే ప్రయోజనాలను రాజకీయ నాయకులు కావాలనే కోల్పోతున్నారేమో అనే భావన కలుగుతోంది.
ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ల వ్యవధానం వుంది. వాటిల్లో విజయావకాశాలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటినుంచే  ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకోవడంలో అభ్యంతర పెట్టాల్సింది ఏమీ వుండదు. అయితే ఈ క్రమంలో, ఆంద్రప్రదేశ్ లోని  పాలక ప్రతి పక్షాలు రెండూ ప్రజలు తమపై  పెట్టిన బాధ్యతకు దూరంగా జరుగుతున్నాయేమో అని, ఎన్నోఏళ్ళుగా  రాజకీయాల క్రమం పరిశీలిస్తున్న వారికి అనిపిస్తోంది. ఇది యెంత త్వరగా వాళ్ళు సరిదిద్దుకుంటే రాష్ట్రానికి అంత మంచిది.
కొంచెం సర్దుబాటు, కొంచెం అవగాహన చాలు ఇటువంటి అనవసర అంశాలు వివాదాస్పదం కాకుండా చూడడానికి.
ముందు చెప్పుకున్నట్టుగా చెప్పేవాళ్ళు లేరు. చెప్పినా వినేవాళ్ళు అంతకంటే లేరు.
(17-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595                             


16, అక్టోబర్ 2015, శుక్రవారం

భార్యతో మాట్లాడ్డం ఎలా?


(నిఝంగా వొట్టు నాకూ తెలవదు. కానీ రాయడానికి తెలవక్కరలేదు అని మాత్రం తెలుసు)

ఓప్పుడు అంటే చాలా చాలా కాలం  కిందట - ఓ సినిమాలో చెప్పినట్టు 'లాంగ్ లాంగ్ ఎగో సో లాంగ్ ఎగో నో బడీ కెన్ సే హౌ లాంగ్ ఎగో' అలా అన్నమాట. అంతకాలం క్రితం నేను మా ఆవిడతో బోలెడు బోలెడు మాట్లాడేవాడిని. పెళ్ళికి ముందు మాట్లాడడానికి వీలుండేది కాదు కాబట్టి ఎక్సర్ సైజ్ పుస్తకాల్లో సీరియల్  ఉత్తరాలు రాసేవాడిని. అవన్నీ మా ఆవిడ పుట్టింటి అరణంగా ఇప్పటికీ అపురూపంగా దాచి పెట్టుకుంది. అలాటివాడిని ఏమైందో ఏమిటో అసలు ఆవిడతో మాట్లాడడమే మానేసాను. చుట్టూ ప్రపంచం పెరిగిపోయి పెళ్ళాంతో అచ్చట్లు ముచ్చట్లు తగ్గిపోవడం అనేది మగవాళ్ళకు పెద్ద అబ్బురమేం కాదు. కానీ బొత్తిగా మాటలు లేకపోతే ఎల్లా. అల్లా ఆలోచించి ఆలోచించి ఎల్లాగైనా సరే మళ్ళీ పాతకాలం మాటా ముచ్చట్ల కాలంలోకి వెళ్లాలని టైం మిషన్ ఎక్కాను. దిగి చూసేసరికి మొత్తం సీనే మారిపోయింది. అరవ తెలుగు సీరియల్ చూస్తూ మా ఆవిడ సమస్త ప్రపంచాన్ని మరచిపోయి అందులో లీనమై వుంది. కల్పించుకుని మాట్లాడబోతే, 'వుండండి అత్త కోడలికి విషం కలిపిన కాఫీ ఇచ్చి ఇప్పటికి మూడు వారాలయింది ఇంతవరకు తాగి చావలేదు. తాగినా చస్తుందో లేదో తెలిసి చావడం లేదు. మీరు చెప్పే  ముచ్చట్లు ఏవో మధ్యలో ప్రకటనలు వస్తున్నప్పుడు చెప్పండి' అనేసింది. ఓహో! మాంత్రికుడి ప్రాణం మర్రి చెట్టు తొర్రలో దాక్కున్న చిలకలో వున్నట్టు మా  ఆవిడ వీక్ నెస్ ఎక్కడ వుందో తెలిసిపోయింది. అక్కణ్ణించి, రెండో గదిలో వున్న రెండో టీవీలో అరవ తెలుగు హిందీ సీరియళ్లన్నీ వరసపెట్టి ఏకధాటిగా చూడ్డం మొదలు పెట్టి, మా  ఆవిడతో మాటలు కలిపి చూసాను. ఈ చిట్కా అమోఘంగా పనిచేసింది. జీడిపాకం కధలే కాబట్టి తోచినట్టు  కధ అల్లి,  జరిగిందీ జరగబోయేది వూహించి చెబుతుంటే  మా ఆవిడ చెవులొప్పగించి వినడం మొదలెట్టింది. ఆ తరువాత నేను ఏ కబుర్లు చెప్పినా తల వూపడం ఆవిడ వొంతయింది.
చట్టబద్ధ హెచ్చరిక: ఇలాటి చిట్కాలు ఎల్లరు భార్యల దగ్గర ఎల్లకాలం పనిచేయకపోవచ్చు. అందరూ మా ఆవిడలాంటి గంగి గోవు రకాలు కాకపోవచ్చు కదా!

(చక్కటి టీవీ కార్టూన్ గీసిన కార్టూనిష్టు గారికి ధన్యవాదాలు)


ఆ రోజులే వేరు


అమరావతి నిర్మాణానికి  పర్యావరణ  అనుమతుల విషయంలో గందరగోళం. ఒక టీవీ వాళ్ళు కేంద్రమంత్రి అనుమతులన్నీ ఇచ్చేసారంటారు. మరో టీవీ లో అనుమతులు ఇవ్వడానికి మేము సిద్ధం, రాష్ట్ర  ప్రభుత్వం నుంచి నివేదిక రావడమే తరువాయి అన్నట్టు స్క్రోలింగు. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియదు. వార్త ఇచ్చేముందు నిర్ధారణ చేసుకోవడం అనేది ప్రాధమిక సూత్రం. అలాటి అవకాశాలు ఈనాటి పాత్రికేయులకు లేవనుకోవాలా?

చాలా ఏళ్ళ క్రితం సంగతి. ఏదో కేసు విషయంలో హైకోర్టు జడ్జి పలానా తీర్పు ఇచ్చారని పీటీఐ వార్తా సంస్థ భోగట్టా. ఇలాటి అంశాలను నిర్ధారించుకోకుండా రేడియో వార్తల్లో చెప్పే వీలు లేదు. సాయంత్రం వార్తల ప్రసార సమయం దగ్గర పడుతోంది. తీర్పు ఇచ్చిన జడ్జి గారు ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడన్నీ ల్యాండ్ లైన్లు. ఫోన్ చేస్తే, జడ్జి గారు బంగ్లా లాన్ లో కూర్చుని టీ తాగుతున్నారని సమాచారం. ఫోను తీసుకుని వెళ్లి ఇవ్వడం కుదురుతుందా అని అనుమానంగానే అడిగాను. ఏ కళన ఉన్నాడో కాని బంట్రోతు ఫోను జడ్జి గారికి ఇచ్చాడు. ఫోన్లో మాటలు వినపడుతున్నాయి. ఎవరది అని జడ్జి గారు అడుగుతున్నారు. రేడియో నుంచి అనగానే లైన్లోకి వచ్చారు. నేను తీర్పు విషయం అడగగానే ఆయన కొంత అసహనానికి గురయ్యారు. అది సహజం కూడా. ‘ఒక న్యాయమూర్తిని ఇలా డిస్టర్బు చేయడం నేరమని తెలుసా’ అంటున్నారు. నేనన్నాను. ‘తెలియదు. కానీ ఇటువంటి వార్తను నిర్ధారించుకోకుండా ప్రసారం చేయడం మాత్రం నేరం’. ఈ జవాబుతో ఆయన మెత్తపడి నేను కోరిన వివరణ ఇచ్చారు. అది వార్తా సంస్థ ఇచ్చిన సమాచారానికి  అనుగుణంగానే వుంది. అయినా కొన్ని సంచలన నిర్ణయాలను ప్రసారం చేసేముందు నిజాన్ని నిర్దారించుకోవడం  నా విధి. అది నేను పాటించాను.  తప్పిస్తే ఆ వార్తాసంస్థ నిబద్ధతను అనుమానించడానికో, మరో దానికో మాత్రం కాదు.

ఇలా  ఉండేవి ఆ రోజులు. నిజంగా  ఆ రోజులే వేరు.            

15, అక్టోబర్ 2015, గురువారం

మరపురాని మనుషులు


తురగా కృష్ణ మోహన రావు పేరిట ఉత్తమ జర్నలిష్ట్ అవార్డ్ స్వీకరించిన సందర్భంలో నా ప్రసంగ పాఠం  
"తురగా కృష్ణ మోహన రావుగారు.
"ఎందుకో ఆయన కూడా ఈ వేదిక మీద వున్నట్టే నాకనిపిస్తోంది. నిన్న పోతే రేపటికి మూడు అనుకునే ఈ పాడులోకంలో కృష్ణ మోహనరావుగారు చనిపోయి ఒకటా రెండా – మరో  ఒకటిరెండేళ్ళలో నలభై ఏళ్ళు కావస్తోంది. అయినా, ఇన్నేళ్ళ తరువాత కూడా  ఆయన్ని స్మరించుకుంటూ ఇంతమంది ఇక్కడకు వచ్చారంటే -  ఏ లెక్కన చూసుకున్నా – నా దృష్టిలో   ఆయన బతికున్నట్టే లెక్క. అంత గొప్ప మనిషి కాబట్టే ఆయన పేరుమీద ఇస్తున్న ఈ అవార్డ్ తీసుకోవడానికి గర్వపడుతున్నాను. అందుకే జానకీరాణి గారు ఫోను చేసి చెప్పినప్పుడు కాదనలేకపోయాను. కాకపొతే, ముసలితనంలో వసంతం అన్నట్టుగా రిటైర్ అయి ఎనిమిదేళ్ళు పూర్తి అవుతుంటే ఇప్పుడు ఉత్తమ జర్నలిస్టో, అలాటిదో ఈ  అవార్డ్ ఏమిటి చెప్పండి.  కానీ రేడియోలో పనిచేసిన మా బోంట్లకు జానకీరాణి గారంటే భయంతో కూడిన గౌరవం ఏం చేస్తాం? కాదనే ధైర్యం ఎక్కడిది ?
"జానకీరాణి గారు అంటే గౌరవం. ఆవిడ వయస్సు కొంతా, ఆవిడ కలివిడితనం కొంతా కలిపి గౌరవం ఆవిడంటే. భయం దేనికంటే- నేనే గలగలా మాట్లాడుతానని అంతా అంటారు. జానకీరాణి గారు గలగలా మాత్రమే కాదు – దడ దడలాడిస్తూ దడదడా కూడా మాట్లాడతారు.
"ఇక అసలు విషయానికి వస్తే – నేను చదువుకుండే రోజుల్లో ఆంధ్ర పత్రిక వారపత్రికలో ‘రాజధాని కబుర్లు’ అనే శీర్షిక వచ్చేది. ప్రవీణ్ అనే ఆయన రాస్తుండేవారు. ఆ రాసే విధానం నాకు బాగా నచ్చేది. ఎప్పుడయినా హైదరాబాదు వెడితే ఆయనగారిని కలవాలని అనుకునేవాడిని. ఆయన  అంటే ఎందుకో ఇష్టం. ఆయనే తురగా  కృష్ణ మోహన రావు గారని చాలాకాలం తరువాత తెలిసింది. నాకు వారితో మరో బాదరాయణ సంబంధం కూడా వుంది. కృష్ణ మోహన రావుగారు అకాల మృత్యువాత పడిన తరువాత వారు చేసిన రేడియో విలేకరి ఉద్యోగంలోకే నేను ప్రవేశించాను. అది చిన్న ఉద్యోగం కావచ్చు.  అయినా అంత పెద్ద మనిషి చేసిన ఉద్యోగం కాబట్టి నాకది పెద్ద ఉద్యోగమే.
"కృష్ణ మోహన రావుగారు మంచి హాస్య రచయిత. అంటే నా అర్ధం మంచి హాస్యం రాస్తారని. ఆహ్లాదకరమైన హాస్యం రాస్తారని. ఆరోగ్యకరమైన హాస్యం రాస్తారని. ఆయన రచనలు  చదివిన అనుభవంతో నేను ఈ మాట  చెబుతున్నాను.
"తురగా వారు చిలికించిన  హాస్యం లాంటి హాస్యం  ఈ నాటి సమాజానికి ఎంతో  అవసరం. జనంలో  ‘నవ్వు’ చచ్చిపోతోందేమో అని నాకు ఒక్కోసారి చచ్చేంత భయం వేస్తుంటుంది. నవ్వుతూ మాట్లాడేవాళ్ళతో మాట్లాడిచూడండి. కోపాలు తాపాలు మాయమైపోతాయి. బీపీలు గట్రా తగ్గిపోతాయి. దురదృష్టం ఏమిటంటే అలా నవ్వేవాళ్ళు, నవ్వించే వాళ్ళు  బాగా తగ్గిపోతున్నారు. ఇదొక విషాదం.
మరి ఏమిటి శరణ్యం. వుంది.  ఇదిగో కృష్ణ మోహనరావు గారు రాసిన ఈ ‘మాట కచ్చేరీ’ మొదలుపెట్టండి. పుస్తకం చదువుతూ మీరేమో ముసిముసినవ్వులు. ఆ నవ్వుల్ని చూస్తూ మీ ఆవిడ కూడా ‘ఏమిటీ నవ్వేది మా ఆయనేనా’ అని అనుమానంతో కూడిన నవ్వులు. ఇక ఆ ఇంట్లో ఒకటే నవ్వులవాన. మళ్ళీ మాట్లాడితే నవ్వుల తుపాన్.
"ఒక విషయం నేను గట్టిగా చెప్పగలను.
ఈనాడు మనం అనుభవిస్తున్న అన్ని రకాల రుగ్మతలకీ నవ్వే చక్కటి ఔషధం. కాణీ ఖర్చులేని ‘ఆరోగ్య శ్రీ’
"రేడియోలో పనిచేసే రోజుల్లో నా బల్ల మీద అద్దం కింద ఒక కాగితం మీద రాసిపెట్టుకున్నాను.
“మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి.”
"పుట్టగానే ఏడిస్తేనే బతికినట్టు లెక్క. బతికివున్నప్పుడు నవ్వితేనే బతికున్నట్టు లెక్క. ఈ లెక్క కుదరాలంటే తురగా కృష్ణ మోహనరావు గారి రచనలు  చదవండి. వాటిని  ఆస్వాదించండి. అన్ని లెక్కలు, అన్ని తిక్కలు ఇట్టే కుదిరిపోతాయి.
"ఎనీ డౌట్ ?  నాకయితే లేదు.
"ఇది సగర్వంగా  నేనిస్తున్న సర్టిఫికేట్"


('తురగా అవార్డు'కు నన్ను ఎంపిక చేసిన తురగా జానకీరాణి గారు ఈ లోకం నుంచే తప్పుకుని నేటికి ఏడాది. ఈ ప్రధమ వర్ధంతి రోజున ఆవిడను మరో సారి ఇలా గుర్తు చేసుకుంటున్నాను - భండారు శ్రీనివాసరావు)

14, అక్టోబర్ 2015, బుధవారం

రేపు లేదు


పెసిమిజం అనుకోకండి. నిజంగా  రేపనేదే లేదు. నిన్న చరిత్ర. నేడు నిజం. రేపు అనుమానం.
మా ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చారు. నిజంగా ఆయన అన్నింట్లో పెద్దమనిషే. సందేహం లేదు. రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు వుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు వున్నాయి. ఒక రోజు ఆవిడ ఓ మొగుడ్ని ఓ కోరిక కోరింది, డ్రాయింగు రూములో మాదిరిగానే బెడ్ రూమ్ లో కూడా ఓ ఏసీ పెట్టించమని. ఓస్ అదెంత పని అనుకున్నాడు. ఓ షాపుకు వెళ్లి మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం కల్లా పెడతానన్నాడు. విధి మరోలా తలచింది. ఎలాటి రోగంరొష్టు లేని ఆయన భార్య ఆ రాత్రే విపరీతమైన గుండెపోటు వచ్చి కన్ను మూసింది.
మా ఇంట్లో ఏసీ గదిలో కూర్చోమంటే ఆయనకు మనస్కరించలేదు. సెల వేసినట్టు భార్య అడిగిన ఆఖరు కోరిక గుర్తు చేసుకోవడమే ఆయనకు ఓ గుర్తులా మిగిలి పోయింది.
‘రాత్రి వరకు కబుర్లు చెప్పిన మనిషి మరునాడు లేదు. ఇక రేపు వుందనే నమ్మకం ఏమిటి? అది ఓ భ్రమ’ అన్నాడాయన.     
నిజమే అనిపించింది.
అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలన్న మాట. 
ఎందుకంటే రేపు మనది కాదు.  

13, అక్టోబర్ 2015, మంగళవారం

ప్రజలు గమనిస్తున్నారు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 15-10-2015, THURSDAY)
అక్టోబరు ఇరవై రెండో తేదీన, విజయ దశమి పండుగ వేళ  ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునాది రాయి వేయబోతున్నారు. అయిదు కోట్ల ఆంద్ర ప్రజలకు నిజంగా ఇది పర్వదినమే. సందేహం లేదు. యావత్  ప్రజానీకాన్ని ఈ చారిత్రిక కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనేక నూతన మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచిప్రతి పురపాలక వార్డు నుంచి కొంత మట్టి, కొన్ని నీళ్ళు సేకరించి నూతన రాజధాని ప్రాంతానికి తరలించే  కార్యక్రమం ఇప్పటికే పెద్దఎత్తున సాంప్రదాయబద్ధంగా మొదలయింది కూడా. ‘మన మట్టి- మన నీరు- మన సంకల్పం- మన అమరావతి’ అనే ఈ  ఆలోచనలో నవ్యత్వం ఉన్నమాట నిజమే. అది  మెచ్చదగిందే. అయితే ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న ఈ  మహత్తర శంకుస్థాపన  కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్న విధానం పరికిస్తే మాత్రం అంతా ఏకపక్షంగా సాగిపోతున్నదేమో అనే శంక కలుగుతోంది.
బీహారులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో కేవలం యాభయ్ ఏడు శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమరావతి నగర శంకుస్థాపన ఏర్పాట్లు గురించి చెబుతూ ఈ బీహారు ఎన్నికల ప్రస్తావన ఏమిటన్న అనుమానం చదువరులకు కలగొచ్చు. సంబంధవుందని చెప్పడానికే ఈ ప్రయత్నం. అయిదేళ్ళ క్రితం జరిగిన బీహారు ఎన్నికల తొలి దశలో ఓటు వేసిన వారి శాతం కన్నా ఈ నెల పన్నెండో తేదీ సోమవారం నాడు జరిగిన మొదటి దఫా పోలింగులో అది ఈసారి ఏడు శాతం పెరిగింది.  తాజా  ఎన్నికల ప్రచార ఉధృతితో పోల్చి చూస్తే పోలింగు బూతులకు వెళ్లి బాధ్యతగా  ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య ఆ మేరకు పెరగలేదనే చెప్పాలి. మొదటి విడత పోలింగు ప్రకారం ప్రతి నూరుమంది ఓటర్లలో కేవలం యాభయ్ ఏడు మంది మాత్రమే ఓటు వేసారు. అసలు ఎన్నికలతో  నిమిత్తం పెట్టుకోకుండా నిర్లిప్తంగా   ఇళ్ళ వద్దనే ఉండిపోయిన వారు నలభయి మూడుమంది ఉన్నారన్న మాట.  నూటికి నూరు శాతం ఓటింగు అనేది ఎన్నడూ జరగని వ్యవహారమే. డెబ్బయి శాతానికి మించి పోలింగు జరగడం అనేది కూడా  చాలా అరుదు.  మొత్తం ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికలో గెలిచిన  అభ్యర్ధికి  పడే  వోట్ల శాతం చాలా తక్కువే. ఈ యాభయ్ ఏడు శాతం మందిలో కూడా ఆయా పార్టీల కార్యకర్తల్నిఅభిమానుల్ని మినహాయిస్తేఎటువంటి ముందస్తు నిర్ణయానికి రాకుండా కేవలం అభ్యర్ధి గుణగణాల ప్రాతిపదికన ఓటు వేసేవారు కూడా గణనీయంగా వుంటారు.  అంటే ఏమిటన్నమాట. ఇటీవలి కాలంలో మనల్ని పాలిస్తున్న ఏ పార్టీకి మెజారిటీ ప్రజల మద్దతు పూర్తిగా లేదు. పోలయిన ఓట్లలో ఎక్కువ తెచ్చుకున్న అభ్యర్ధి విజేతగా చట్ట సభలో అడుగుపెడతాడు. అలాటి అభ్యర్ధుల్ని ఎక్కువమందిని గెలిపించుకున్న పార్టీ అయిదేళ్లపాటు పాలిస్తుంది. అంటే ఒకరకంగా ప్రజల్ని పాలిస్తున్న ప్రభుత్వాలన్నీ మైనారిటీ సర్కారులే. కానీ రాజ్యాంగం ఈ లెక్కలు ఒప్పుకోదు. ఎక్కువ ఓట్లుసీట్లు గెలిచినవాళ్ళే రాజ్యాంగం ప్రకారం పాలకులు. మరి అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లకుఈ లెక్కలకూ ఏమిటి సంబంధం అంటే వుంది. రాజ్యాంగబద్ధంగా కాదు. నైతికంగా. అదెట్లా అంటే-
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్న తెలుగుదేశం పార్టీకి  గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కట్టబెట్టి, రాష్ట్రాన్ని పాలించే హక్కును ఆ పార్టీకి  ప్రజలు ఇచ్చారు.  ఆ పార్టీ రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా పధకాలుప్రాజెక్టులు రూపొందించుకునే వెసులుబాటు హక్కును కూడా ప్రజలే ఆ పార్టీకి ఇచ్చారు. అయితే మొత్తం ఓట్లుఆ ఓట్లలో పోలయిన ఓట్లువీటిని పరిగణనలోకి  తీసుకుంటే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం అంత గణనీయం కాదు. ఈ పరిస్తితి ఒక్క తెలుగు దేశానిదే కాదు. నిరుడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ తరపున గెలిచినాఆ అభ్యర్ధిది ఇదే వరస. అభ్యర్ధుల్ని గెలిపించుకున్న పార్టీలదీ ఇదే వరస. అంచేతఅయిదు కోట్ల ప్రజలందరికీ  సంబంధించిన అమరావతి వంటి రాష్ట్ర  రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించే నైతిక హక్కును  మెజారిటీ ప్రజలు తెలుగు దేశం పార్టీకి మాత్రమే గుంపగుత్తగా దఖలు పరచినట్టు అర్ధం కాదు. అయితే రాజధానిని ఎక్కడ నిర్మించాలిఎలా నిర్మించాలి అనే విషయంలో పాలకపక్షం తీసుకునే నిర్ణయాలను  తప్పుపట్టే అవకాశం లేదు. ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన ఆ పార్టీకి అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
ఇక్కడ చంద్రబాబుకు సంబంధించి ఒక విషయం. ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నా, ఏ లెక్కన చూసినా ఇప్పటి నేతల్లో  ఆయనే సీనియర్. ఇంత  అనుభవం వుండి కూడా, మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన  కొన్ని అంశాలను, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఒక  రాజకోవిదుడి దృష్టితో కాకుండా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా, కేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించి, ఆలోచించి ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు.
విడిపడి ఏర్పడ్డ ఆ కొత్త  రాష్ట్రానికి రాజధాని అనేది ఇప్పుడు ప్రధాన ఆవశ్యకత. నూతన రాష్ట్ర అవసరాల జాబితాలో దాని ప్రాధాన్యం మొట్ట మొదటిది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం  పూనుకున్నప్పుడుఆ ప్రయత్నానికి ప్రజలుపార్టీలు  అందరూ సహకరించాల్సిందే. కానీవారిని ఈ మహత్తర కార్యక్రమంలో  కలుపుకోవడంకలిసిరానివారిని కూడా కలిసివచ్చేలా చేసుకోవడం, ప్రత్యేకించి ప్రజాస్వామ్య యుగంలో  పాలక పక్షం ప్రధాన బాధ్యత. ఈ కర్తవ్య నిర్వహణలో పాలకపక్షం బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదు.  కనీసం ఆ దిశగా ప్రయత్నించిన  దాఖలాలు కూడా కానరావడం లేదు. పండుగలా చేసుకోవాలని ఓ పక్క పిలుపు ఇస్తున్నారు. మళ్ళీ  అదే నోటితో, బొట్టు పెట్టి పిలవడానికి ఎవరింట్లో పండుగ’ అని మెటికలు విరుస్తున్నారు. పండగ అంటే ఏమిటి. వేలాదిమంది కలిసి చేసుకునే ఉత్సవాలు పండుగే. ఇళ్ళల్లో ఎవరికి వారు చేసుకునే పండుగలు పండుగే.  రాష్ట్రం మొత్తానికి ఇది పండుగ అయినప్పుడు అందరూ కలిసి చేసుకుంటేనే అది పండుగలా వుంటుంది. పార్టీలకి అతీతంగా ఇది జరగాలని పార్టీలతో సంబంధం లేని వాళ్ళు కోరుకుంటున్నారు. కలిసిరాని వాళ్ళు ఉండవచ్చు. కలుపుకు పోవాలని చూసినా వాళ్ళు కలిసి రావడం లేదని సమర్ధించుకునే అవకాశాన్ని పాలక పక్షం చేజేతులా జారవిడుచుకుంటోంది. ప్రభుత్వం ఈ  విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించింది అనే మంచి మాట నలుగురి చేతా అనిపించుకునే సావకాశాన్ని కూడా ఒదులుకుంటోంది.  మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇంత  ముఖ్యమైన శుభసందర్భంలో యావన్మందిని కలుపుకు పోవడం లేదన్న అభిప్రాయం జనంలో లేదని పాలక పక్షానికి చెందినవారు కూడా గట్టిగా చెప్పలేక పోతున్నారు. రాజధాని నగర శంకుస్థాపన వంటి  విషయాల్లో ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించగల నైతిక హక్కు వారికి లేదని చెప్పడానికే ఓట్ల శాతం లెక్కలు వివరించాల్సివచ్చింది. రాజ్యాంగ హక్కు ఉండవచ్చు. అది వేరే విషయం. ఇది నైతికతకు సంబంధించిన అంశం.                                 
 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీవారికి టీడీపీ పాలక పక్షంగా వుండడం ఇష్టంగా ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది పాలక పక్షం కాకుండా పోదు. అల్లాగే,  వై.ఎస్.ఆర్.సీ.పీ. అంటే టీడీపీ నాయకులకుశ్రేణులకు గిట్టకపోవచ్చు. అంతమాత్రాన ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాకుండా పోదు. పైగా శాసనసభలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం మాత్రమే కాదుఏకైక ప్రతిపక్షం కూడా. కానీ ఈ వాస్తవాలను   ఏనాడూ గుర్తించిన దాఖలా లేదు. అసలు ఆంద్ర ప్రదేశ్ లో ప్రతి అంశం, టీడీపీ, వై.ఎస్.ఆర్.సి.పీ. అనే  రెండు పార్టీల మధ్య వ్యవహారంగా మారిపోతోంది. ‘నీదా నాదా పైచేయి’ అన్న పద్ధతిలో రూపు దిద్దుకుంటోంది. ఇదొక విషాదం.  
ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారి పల్లె నుంచి అమరావతి ప్రాంతానికి మట్టి, నీళ్ళు తరలించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. ‘కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అయిదు కోట్ల ఆంధ్రుల మనోభావాలు ప్రతిబింబించేలా నూతన రాజధాని నిర్మాణం జరుగుతుంది’ అని. శంకుస్థాపన కార్యక్రమంతో ఆ శుభ కామనకు అంకురార్పణ జరగాలని కోరుకుందాం. 
  
ఉపశృతి : ‘నైతిక హక్కుచిత్తశుద్ధిప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు.
మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే  ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.
ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతు నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదుఅసలు ఏ పార్టీకి చెందనివాళ్ళురాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.   (13-10-2015)  

NOTE: Courtesy Image Owner


9, అక్టోబర్ 2015, శుక్రవారం

ప్రతిపక్షరహిత ప్రజాస్వామ్యం

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 11-10-2015, SUNDAY)

ఒకానొక కాలంలో మహాత్మా గాంధీ, లోక్ నాయక జయప్రకాష్ నారాయణ్ ప్రవచించిన పార్టీ రహిత ప్రజాస్వామ్యం అనే సూత్రాన్ని నాస్తిక ఉద్యమ నిర్మాత ‘గోరా’ (గోపరాజు రామచంద్ర రావు), 70 వ దశకంలో  ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేసారు. బహుళ పార్టీ వ్యవస్థ వల్ల జరిగే మేలుకన్నా కీడే ఎక్కువన్నది ఈ సిద్ధాంత కర్తల సూత్రీకరణ. కాల క్రమంలో ఈ వాదన పూర్తిగా మరుగున పడిపోయింది.
గత కొన్ని దశాబ్దాలుగా దేశంలోని అన్ని వ్యవస్థలను రాజకీయ పార్టీలే శాసిస్తూ వస్తున్నాయి.  ప్రతి రాజకీయ పార్టీకి చెప్పుకోవడానికి కొన్ని మూలసిద్ధాంతాలు ఉన్నప్పటికీ, కాలమాన పరిస్తితులను బట్టి ఆ సిద్ధాంతాలను కొంత పక్కన బెట్టి వ్యవహరించే పరిస్తితి ఈనాడు చూస్తున్నాము. ఇప్పుడు ప్రతి అంశాన్ని, విజయావకాశాలు, రాజకీయంగా ఒనగూడే లాభనష్టాల నిష్పత్తి కోణం నుంచే ఆయా రాజకీయ పార్టీలు పరిశీలిస్తున్నాయి. అధికారమే పరమావధి అయినప్పుడు సిద్ధాంతాలకు నీళ్ళు ఒదిలి అవకాశవాద రాజకీయాలకు పెద్ద పీట వేయడంలో ఆశ్చర్యం లేదు. ఎన్నికలకు ముందు సీట్ల సర్దుబాటుతో మొదలయ్యే ఈ కప్పదాట్లు అధికార పీఠం అధిరోహించిన తరువాత మరింత వికృత రూపాన్ని, స్వభావాన్ని సంతరించుకుంటున్నాయి. ఎదుటి పక్షాన్ని ఎదిరించడం కోసం, నిలువరించడం కోసం  పలు విపక్షాలతో రాజీపడి దానికి భావసారూప్యం అనే అందమైన అర్ధం లేని  పదాన్ని అడ్డు పెట్టుకోవడం రాజకీయాలను గమనించేవారికి అనుభవమే. అలా మొదలయ్యే ఈ అవకరం క్రమంగా రాజకీయ కూటముల ఆవిర్భావానికి మార్గం వేసింది. అయితే, అధికారంలో పై చేయి కోసం వెంపర్లాటలు, పదవుల పంపిణీలో కీచులాటలు, సిద్ధాంత ప్రాతిపదికలేని ఈ రాజకీయ కూటముల అస్తిత్వానికే ముప్పు తెచ్చిన సందర్భాలు కూడా గతంలో అనేకం. ఈ దిశలో ఒక అడుగు ముందుకు వేసి, ప్రతిపక్షాలన్నీ ఏకమై, తమ పార్టీ పేరును, సిద్ధాంతాలను పక్కనబెట్టి  ఒకే పేరుతొ, ఒకే జెండాతో, ఒకే ఎన్నికల గుర్తుతో,  ఒకే ఒక్క అజెండాతో,  కాంగ్రెస్ ఓటమి, ఇంకా గట్టిగా చెప్పాలంటే నాటి పాలకురాలు ఇందిరాగాంధీని గద్దె దించడానికి జరిగిన ‘జనతాపార్టీ’ ప్రయోగం, ఈ స్వార్ధ రాజకీయ కీచులాటల కారణంగానే మూన్నాళ్ళ ముచ్చటగా ముగిసిపోయింది.
పాలక పక్షాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రతిపక్షాలు ఏకమైనట్టు ఈనాడు ప్రతిపక్షాలను కనుమరుగు చేయడానికి పాలక పక్షాలు అంతే పట్టుదలగా పనిచేస్తున్నాయి. ప్రతి పక్షాలను గౌరవించడం సంగతి అటుంచి అసలు వాటి ఉనికిని గుర్తించడానికి కూడా విముఖత చూపుతున్నాయి. చట్ట సభల్లోనే కాకుండా చట్ట సభల వెలుపల కూడా ప్రతిపక్షాల పొడగిట్టని తత్వాలు,  ఎదుటి పార్టీలను చీల్చి సొంత బలం పెంచుకునే ప్రయత్నాలు కొత్త రాజకీయ సంస్కృతిగా రూపుదిద్దుకుంటున్నాయి. కొద్ది హెచ్చు తగ్గులు మినహా ఏపార్టీ కూడా దీనికి మినహాయింపు కాదనే చెప్పాలి. ఈ బలహీనత వల్లే, ఓ పక్క  పార్టీ మార్పిళ్లు నిస్సిగ్గుగా సాగిపోతున్నప్పుడు కూడా,  ఓ ఖండన ప్రకటన చేసి ఊరుకోవడం మినహా గట్టిగా నిలదీయలేకపోతున్నాయి. అంతే కాదు గద్దె ఎక్కిన వెంటనే, ఒకప్పుడు తాము కూడా ప్రతిపక్ష  పాత్ర పోషించిన విషయం గుర్తు చేసుకోవడానికి సయితం  పాలక పక్షాలు ఇష్టపడడం లేదు. ఆ రోజుల్లో చెప్పిన మాటలను, చేసిన వాగ్దానాలను, ఇచ్చిన హామీలను స్పురణకు తెచ్చుకోవడానికి కూడా ఇచ్చగించడం లేదు. పైపెచ్చు ఇప్పుడు తాము అనుభవిస్తున్న పాలక పక్షం హోదా సదా  శాస్వితం అనే భ్రమలో ఉంటున్నాయి.
అయితే చరిత్ర చెప్పే పాఠాలు వేరుగా వున్నాయి.
1984 లో ఇందిరాగాంధీ హత్యానంతరం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ అప్పటివరకు కనీ వినీ ఎరుగని అఖండ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. మొత్తం 520 లోక సభ స్థానాల్లో ఏకంగా 411  సీట్లు గెలుచుకుని  భారత ఎన్నికల ఇతిహాసంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికింది.
రాజీవ్ గాంధి తల్లిగారయిన ఇందిర హయాములో కానీ, ఆయన  తాతగారయిన భారత ప్రధమ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ కాలంలో కానీ కాంగ్రెస్ పార్టీ ఇంతటి ఘన విజయాన్ని సాధించలేదు. అలాగే నేడు దేశాన్ని పాలిస్తున్న బీజేపీ అధినాయకుడు నరేంద్ర మోడీ పార్టీకి ఆ నాడు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఈ సువిశాల భారతంలో లభించిన సీట్లు అక్షరాలా రెండే రెండు. వాటిల్లో ఒకటి అవిభాజ్య ఆంద్ర ప్రదేశ్ లోని హనుమకొండ కాగా, ఏకే పటేల్ అనే బీజేపీ అభ్యర్ధి  గెలుపొందిన  గుజరాత్ లోని మెహ్సానా నియోజక వర్గం రెండోది. హనుమకొండ నుంచే కాదు మొత్తం ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్ సభలో బీజేపీకి ప్రాతినిధ్యం వహించిన ఏకైక వ్యక్తి చందుపట్ల జంగారెడ్డి. ఇక ఆ ఎన్నికల్లో వాజ్ పాయ్, అద్వానీ వంటి బీజేపీ అగ్రనాయకులందరూ పరాజయం పాలయ్యారు.    అలాటి బీజేపీ తిరిగి అయిదేళ్లలోనే పుంజుకుని ఎన్నికల్లో 85 స్థానాలకు ఎగబాకింది. 1984 లో రికార్డు స్థాయిలో అత్యధిక సీట్లు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ,  అదే రాజీవ్ నాయకత్వంలో 197 స్థానాలకు పడిపోయి ప్రధాన ప్రతిపక్ష పాత్రకు పరిమితమయింది. 1984 లో 30 సీట్లు గెలుచుకుని లోక సభ లో ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కించుకున్న ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ అయిదేళ్ళ తరువాత జరిగిన ఎన్నికల్లో కేవలం రెండే సీట్లు గెలవగలిగింది.
పొతే, ఇటీవలి కాలంలో జరిగిన ఎన్నికల్లో కూడా దేశ ప్రజలు తమ ఓటు హక్కు ఉపయోగించి ఇదేమాదిరి రికార్డులకు తెర తీసారు. నిరుడు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ నాయకత్వంలో మొత్తం 336 సీట్లు సంపాదించి  ఎన్డీయే కూటమి సాధించిన విజయం నిజంగా చరిత్రాత్మకం. సంకీర్ణ యుగంలో జాతీయ పార్టీల ప్రాభవం క్రమేపీ కనుమరుగయిపోతున్న సమయంలో మోడీ, బీజేపీ గుర్తు మీద  282 సీట్లు సంపాదించి పెట్టి ఆ పార్టీకి అపూర్వ వైభవం కట్టబెట్టారు. ఎన్డీయే కూటమిలోని ఇతర పార్టీల ఆసరా, అవసరం లేకుండా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సత్తా ఆ పార్టీకి లభించడం ఇప్పటి రోజుల్లో చాలా ఘనమైన సంగతే. అయితే నెలలు తిరక్కుండానే ఏం జరిగిందన్నది కూడా గమనార్హం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఎదురయిన అవమానం అంతా ఇంతా కాదు. రాజకీయాల్లో పసికూన ‘ఆప్’ చేతుల్లో  ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవాల్సిన విషమ స్తితి. ఆ ఎన్నికల్లో కేజ్రీవాల్ నాయకత్వంలో ‘ఆప్’ భారత ఎన్నికల చరిత్రనే తిరగరాసింది.  ఢిల్లీ అసెంబ్లీ లోని మొత్తం డెబ్బయి స్థానాల్లో అక్షరాలా అరవై ఏడు సీట్లలో ఆ పార్టీ  విజయం సాధించి, అప్పటికి  మంచి ఊపులో ఊగిపోతున్న భారతీయ జనతా పార్టీ నాయకులకు చుక్కలు చూపించింది. దేశానికి స్వతంత్రం వచ్చిన దాదిగా ఇన్నేళ్ళుగా జరిగిన మొత్తం మూడువందల అసెంబ్లీ ఎన్నికల్లో  ఎప్పుడూ ఏ  పార్టీ కూడా ఇంతటి ఘన విజయం సొంతం చేసుకోలేదు.
కాబట్టి రాజకీయులు నేర్చుకోవాల్సిన పాఠం ఏమిటంటే సాధించిన విజయాలు సాధించబోయే విజయాలకు సోపానాలు కావాలి. శిఖరం ఎక్కిన వాడు అక్కడే వుండిపోడు. ఎప్పుడో ఒకప్పుడు కిందికి దిగకతప్పదు.  అలా దిగినప్పుడు మళ్ళీ ఎక్కే ప్రయత్నం మానుకోకూడదు. అధికార పీఠం అనేది ఈ ప్రజాస్వామ్య యుగంలో శాస్వితం కాదు. అధికారం దక్కినప్పుడు కాలయాపన చేయకుండా, జనం తమకు అధికార పగ్గాలు అందించిన నిర్దిష్ట  కాల వ్యవధిలోనే  ప్రజలకు చేసే నాలుగు మంచి పనులే శాస్వితంగా  మిగిలిపోతాయి.

ప్రజలు అధికారం ఇచ్చింది తమ పార్టీలను బలోపేతం చేసుకోవడానికి కాదు. దీపం ఉండగానే సొంత ఇల్లు చక్కబెట్టుకోవడానికి అంతకంటే కాదు.  సమాజ హితాన్ని కాంక్షిస్తూ యావత్  ప్రజానీకానికి మేలు చేసే పనులు చేస్తూ సంక్షేమ సమాజాన్ని నిర్మించడానికి. ఇది గుర్తు చేయడానికే, చరిత్ర చెప్పే పాఠాలను ఇలా గుర్తు చేయాల్సి వస్తోంది. (09-10-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595          

NOTE: Courtesy Image Owner