13, అక్టోబర్ 2015, మంగళవారం

ప్రజలు గమనిస్తున్నారు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 15-10-2015, THURSDAY)
అక్టోబరు ఇరవై రెండో తేదీన, విజయ దశమి పండుగ వేళ  ఆంధ్రప్రదేశ్ నూతన రాష్ట్ర రాజధాని అమరావతి నగర నిర్మాణానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పునాది రాయి వేయబోతున్నారు. అయిదు కోట్ల ఆంద్ర ప్రజలకు నిజంగా ఇది పర్వదినమే. సందేహం లేదు. యావత్  ప్రజానీకాన్ని ఈ చారిత్రిక కార్యక్రమంలో పాలుపంచుకునేలా చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనేక నూతన మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం నుంచిప్రతి పురపాలక వార్డు నుంచి కొంత మట్టి, కొన్ని నీళ్ళు సేకరించి నూతన రాజధాని ప్రాంతానికి తరలించే  కార్యక్రమం ఇప్పటికే పెద్దఎత్తున సాంప్రదాయబద్ధంగా మొదలయింది కూడా. ‘మన మట్టి- మన నీరు- మన సంకల్పం- మన అమరావతి’ అనే ఈ  ఆలోచనలో నవ్యత్వం ఉన్నమాట నిజమే. అది  మెచ్చదగిందే. అయితే ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తున్న ఈ  మహత్తర శంకుస్థాపన  కార్యక్రమం ఏర్పాట్లు జరుగుతున్న విధానం పరికిస్తే మాత్రం అంతా ఏకపక్షంగా సాగిపోతున్నదేమో అనే శంక కలుగుతోంది.
బీహారులో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల తొలి దశలో కేవలం యాభయ్ ఏడు శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమరావతి నగర శంకుస్థాపన ఏర్పాట్లు గురించి చెబుతూ ఈ బీహారు ఎన్నికల ప్రస్తావన ఏమిటన్న అనుమానం చదువరులకు కలగొచ్చు. సంబంధవుందని చెప్పడానికే ఈ ప్రయత్నం. అయిదేళ్ళ క్రితం జరిగిన బీహారు ఎన్నికల తొలి దశలో ఓటు వేసిన వారి శాతం కన్నా ఈ నెల పన్నెండో తేదీ సోమవారం నాడు జరిగిన మొదటి దఫా పోలింగులో అది ఈసారి ఏడు శాతం పెరిగింది.  తాజా  ఎన్నికల ప్రచార ఉధృతితో పోల్చి చూస్తే పోలింగు బూతులకు వెళ్లి బాధ్యతగా  ఓటు హక్కు వినియోగించుకున్న వారి సంఖ్య ఆ మేరకు పెరగలేదనే చెప్పాలి. మొదటి విడత పోలింగు ప్రకారం ప్రతి నూరుమంది ఓటర్లలో కేవలం యాభయ్ ఏడు మంది మాత్రమే ఓటు వేసారు. అసలు ఎన్నికలతో  నిమిత్తం పెట్టుకోకుండా నిర్లిప్తంగా   ఇళ్ళ వద్దనే ఉండిపోయిన వారు నలభయి మూడుమంది ఉన్నారన్న మాట.  నూటికి నూరు శాతం ఓటింగు అనేది ఎన్నడూ జరగని వ్యవహారమే. డెబ్బయి శాతానికి మించి పోలింగు జరగడం అనేది కూడా  చాలా అరుదు.  మొత్తం ఓటర్ల సంఖ్యను పరిగణనలోకి తీసుకుంటే ఎన్నికలో గెలిచిన  అభ్యర్ధికి  పడే  వోట్ల శాతం చాలా తక్కువే. ఈ యాభయ్ ఏడు శాతం మందిలో కూడా ఆయా పార్టీల కార్యకర్తల్నిఅభిమానుల్ని మినహాయిస్తేఎటువంటి ముందస్తు నిర్ణయానికి రాకుండా కేవలం అభ్యర్ధి గుణగణాల ప్రాతిపదికన ఓటు వేసేవారు కూడా గణనీయంగా వుంటారు.  అంటే ఏమిటన్నమాట. ఇటీవలి కాలంలో మనల్ని పాలిస్తున్న ఏ పార్టీకి మెజారిటీ ప్రజల మద్దతు పూర్తిగా లేదు. పోలయిన ఓట్లలో ఎక్కువ తెచ్చుకున్న అభ్యర్ధి విజేతగా చట్ట సభలో అడుగుపెడతాడు. అలాటి అభ్యర్ధుల్ని ఎక్కువమందిని గెలిపించుకున్న పార్టీ అయిదేళ్లపాటు పాలిస్తుంది. అంటే ఒకరకంగా ప్రజల్ని పాలిస్తున్న ప్రభుత్వాలన్నీ మైనారిటీ సర్కారులే. కానీ రాజ్యాంగం ఈ లెక్కలు ఒప్పుకోదు. ఎక్కువ ఓట్లుసీట్లు గెలిచినవాళ్ళే రాజ్యాంగం ప్రకారం పాలకులు. మరి అమరావతి శంకుస్థాపన ఏర్పాట్లకుఈ లెక్కలకూ ఏమిటి సంబంధం అంటే వుంది. రాజ్యాంగబద్ధంగా కాదు. నైతికంగా. అదెట్లా అంటే-
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ని పాలిస్తున్న తెలుగుదేశం పార్టీకి  గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కట్టబెట్టి, రాష్ట్రాన్ని పాలించే హక్కును ఆ పార్టీకి  ప్రజలు ఇచ్చారు.  ఆ పార్టీ రూపొందించుకున్న ప్రణాళికలకు అనుగుణంగా పధకాలుప్రాజెక్టులు రూపొందించుకునే వెసులుబాటు హక్కును కూడా ప్రజలే ఆ పార్టీకి ఇచ్చారు. అయితే మొత్తం ఓట్లుఆ ఓట్లలో పోలయిన ఓట్లువీటిని పరిగణనలోకి  తీసుకుంటే ఆ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం అంత గణనీయం కాదు. ఈ పరిస్తితి ఒక్క తెలుగు దేశానిదే కాదు. నిరుడు జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీ తరపున గెలిచినాఆ అభ్యర్ధిది ఇదే వరస. అభ్యర్ధుల్ని గెలిపించుకున్న పార్టీలదీ ఇదే వరస. అంచేతఅయిదు కోట్ల ప్రజలందరికీ  సంబంధించిన అమరావతి వంటి రాష్ట్ర  రాజధాని నిర్మాణం విషయంలో ఏకపక్షంగా వ్యవహరించే నైతిక హక్కును  మెజారిటీ ప్రజలు తెలుగు దేశం పార్టీకి మాత్రమే గుంపగుత్తగా దఖలు పరచినట్టు అర్ధం కాదు. అయితే రాజధానిని ఎక్కడ నిర్మించాలిఎలా నిర్మించాలి అనే విషయంలో పాలకపక్షం తీసుకునే నిర్ణయాలను  తప్పుపట్టే అవకాశం లేదు. ఎన్నికల్లో గెలిచి అధికారానికి వచ్చిన ఆ పార్టీకి అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు.
ఇక్కడ చంద్రబాబుకు సంబంధించి ఒక విషయం. ఆయనకు వున్న  పాలనానుభవం అపారం. రెండు తెలుగు  రాష్ట్రాలలో లెక్కలు  తీసుకున్నా, ఏ లెక్కన చూసినా ఇప్పటి నేతల్లో  ఆయనే సీనియర్. ఇంత  అనుభవం వుండి కూడా, మొత్తం రాష్ట్ర ప్రజలకు సంబంధించిన  కొన్ని అంశాలను, ముఖ్యంగా రాష్ట్ర రాజధాని వంటి అత్యంత ప్రాముఖ్యం కలిగిన విషయాలను ఒక  రాజకోవిదుడి దృష్టితో కాకుండా, ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడిగా, కేవలం రాజకీయ కోణం నుంచే పరిశీలించి, ఆలోచించి ఆయన  నిర్ణయాలు తీసుకుంటున్నట్టు అనిపిస్తోంది. తొమ్మిదేళ్ళ పై చిలుకు అధికార వియోగం వల్ల కలిగిన చేదు అనుభవం ఆయన చేత ఈ అడుగులు వేయిస్తున్నదేమో తెలవదు.
విడిపడి ఏర్పడ్డ ఆ కొత్త  రాష్ట్రానికి రాజధాని అనేది ఇప్పుడు ప్రధాన ఆవశ్యకత. నూతన రాష్ట్ర అవసరాల జాబితాలో దాని ప్రాధాన్యం మొట్ట మొదటిది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన రాజధాని నిర్మాణానికి తెలుగుదేశం ప్రభుత్వం  పూనుకున్నప్పుడుఆ ప్రయత్నానికి ప్రజలుపార్టీలు  అందరూ సహకరించాల్సిందే. కానీవారిని ఈ మహత్తర కార్యక్రమంలో  కలుపుకోవడంకలిసిరానివారిని కూడా కలిసివచ్చేలా చేసుకోవడం, ప్రత్యేకించి ప్రజాస్వామ్య యుగంలో  పాలక పక్షం ప్రధాన బాధ్యత. ఈ కర్తవ్య నిర్వహణలో పాలకపక్షం బాధ్యతగా వ్యవహరిస్తున్నట్టు కనిపించడం లేదు.  కనీసం ఆ దిశగా ప్రయత్నించిన  దాఖలాలు కూడా కానరావడం లేదు. పండుగలా చేసుకోవాలని ఓ పక్క పిలుపు ఇస్తున్నారు. మళ్ళీ  అదే నోటితో, బొట్టు పెట్టి పిలవడానికి ఎవరింట్లో పండుగ’ అని మెటికలు విరుస్తున్నారు. పండగ అంటే ఏమిటి. వేలాదిమంది కలిసి చేసుకునే ఉత్సవాలు పండుగే. ఇళ్ళల్లో ఎవరికి వారు చేసుకునే పండుగలు పండుగే.  రాష్ట్రం మొత్తానికి ఇది పండుగ అయినప్పుడు అందరూ కలిసి చేసుకుంటేనే అది పండుగలా వుంటుంది. పార్టీలకి అతీతంగా ఇది జరగాలని పార్టీలతో సంబంధం లేని వాళ్ళు కోరుకుంటున్నారు. కలిసిరాని వాళ్ళు ఉండవచ్చు. కలుపుకు పోవాలని చూసినా వాళ్ళు కలిసి రావడం లేదని సమర్ధించుకునే అవకాశాన్ని పాలక పక్షం చేజేతులా జారవిడుచుకుంటోంది. ప్రభుత్వం ఈ  విషయంలో ఎంతో ఉదారంగా వ్యవహరించింది అనే మంచి మాట నలుగురి చేతా అనిపించుకునే సావకాశాన్ని కూడా ఒదులుకుంటోంది.  మొత్తం రాష్ట్రానికి సంబంధించిన ఇంత  ముఖ్యమైన శుభసందర్భంలో యావన్మందిని కలుపుకు పోవడం లేదన్న అభిప్రాయం జనంలో లేదని పాలక పక్షానికి చెందినవారు కూడా గట్టిగా చెప్పలేక పోతున్నారు. రాజధాని నగర శంకుస్థాపన వంటి  విషయాల్లో ఇలా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించగల నైతిక హక్కు వారికి లేదని చెప్పడానికే ఓట్ల శాతం లెక్కలు వివరించాల్సివచ్చింది. రాజ్యాంగ హక్కు ఉండవచ్చు. అది వేరే విషయం. ఇది నైతికతకు సంబంధించిన అంశం.                                 
 వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీవారికి టీడీపీ పాలక పక్షంగా వుండడం ఇష్టంగా ఉండకపోవచ్చు. అంతమాత్రాన అది పాలక పక్షం కాకుండా పోదు. అల్లాగే,  వై.ఎస్.ఆర్.సీ.పీ. అంటే టీడీపీ నాయకులకుశ్రేణులకు గిట్టకపోవచ్చు. అంతమాత్రాన ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం కాకుండా పోదు. పైగా శాసనసభలో ఆ పార్టీ ప్రధాన ప్రతిపక్షం మాత్రమే కాదుఏకైక ప్రతిపక్షం కూడా. కానీ ఈ వాస్తవాలను   ఏనాడూ గుర్తించిన దాఖలా లేదు. అసలు ఆంద్ర ప్రదేశ్ లో ప్రతి అంశం, టీడీపీ, వై.ఎస్.ఆర్.సి.పీ. అనే  రెండు పార్టీల మధ్య వ్యవహారంగా మారిపోతోంది. ‘నీదా నాదా పైచేయి’ అన్న పద్ధతిలో రూపు దిద్దుకుంటోంది. ఇదొక విషాదం.  
ముఖ్యమంత్రి స్వగ్రామం నారావారి పల్లె నుంచి అమరావతి ప్రాంతానికి మట్టి, నీళ్ళు తరలించే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఒక మాట అన్నారు. ‘కుల, మత, వర్గ, రాజకీయాలకు అతీతంగా అయిదు కోట్ల ఆంధ్రుల మనోభావాలు ప్రతిబింబించేలా నూతన రాజధాని నిర్మాణం జరుగుతుంది’ అని. శంకుస్థాపన కార్యక్రమంతో ఆ శుభ కామనకు అంకురార్పణ జరగాలని కోరుకుందాం. 
  
ఉపశృతి : ‘నైతిక హక్కుచిత్తశుద్ధిప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు.
మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే  ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.
ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతు నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదుఅసలు ఏ పార్టీకి చెందనివాళ్ళురాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.   (13-10-2015)  

NOTE: Courtesy Image Owner


4 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

ప్రజలు గమనిస్తే ఏమౌతుంది సర్? ... మహా అయితే ప్రభుత్వాన్ని మారుస్తారు. ఆ వచ్చే ప్రభుత్వం కూడా అటువంటిదే కదా.ప్రజలు గమనించినంత మాత్రాన అద్భుతాలు ఏం జరగవు. ఆ విషయం మా కంటే అనుభవజ్ఞులైన మీకే ఎక్కువ తెలుసు. ఏమంటారు?

భండారు శ్రీనివాసరావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత- ఏమనమంటారు? ఏంతో కష్టపడి అధికారంలోకి వచ్చే పార్టీలను ప్రజలు ఒక్క ఓటుతో తొలగించి మరో పార్టీకి పట్టం కట్టడం అంటే చిన్న విషయం కాదు. తాము శాస్వితం అనుకునే ఈ అధికార పీఠం అశాస్వితమన్న ఎరుక వారిలో ఎప్పటికన్నా కలగక పోతుందా, నాలుగు శాస్వితమైన మంచి పనులు చేయక పోతారా అన్నదే భవదీయుడి ఆశ

Jai Gottimukkala చెప్పారు...

"ఈ అధికార పీఠం అశాస్వితమన్న ఎరుక వారిలో ఎప్పటికన్నా కలగక పోతుందా"

పదవి శాశ్వతం కాదని అందరికీ తెలుసునండీ. అందుకే ఉన్న కొద్ది రోజులలో ఎంత కుదిరితే అంత వెనక్కేసుకుందామని వెంపర్లాడుతారు!