9, జులై 2015, గురువారం

భాట్టం శ్రీరామమూర్తి, మరికొన్ని జ్ఞాపకాలు

  
అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఒకసారి శాసనసభలో  ఇలా అన్నారు. 'ఈ శ్రీరామమూర్తి ఏదో సభలో మాట్లాడుతూ నన్ను రావణాసురుడితో పోల్చాడు. ఇదేమన్నా బాగుందా శ్రీరామ్మూర్తీ'.
భాట్టం  లేచి 'పాయింట్ ఆఫ్ పర్సనల్ క్లారిఫికేషన్'  లేవనెత్తారు. 'శతకోటి రుద్రాభిషేకాలు భక్తి ప్రపత్తులతో చేసే రావణబ్రహ్మతో ఈ సంజీవరెడ్డిని పోల్చేటంత తప్పిదం నేను  చేస్తానా' అనగానే అందరూ గొల్లున నవ్వారు.


(కీర్తిశేషులు భాట్టం శ్రీరామ్మూర్తి  1926 - 2015)

ఒకసారి కుసుమ గజపతి రాజు మాట్లాడుతూ 'నిజాం షుగర్ ఫాక్టరీ షేర్ విలువ పడిపోయింది మంత్రుల మార్కెట్ విలువ పడిపోయినట్టు' అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి  సంజీవరెడ్డికి విపరీతమైన కోపం వచ్చింది. 'ఈ రాజు (రాణి) సమావేశాలకు సరిగ్గారారు.  ఎప్పుడో ఓసారి వస్తారు. వచ్చి ఏదేదో మాట్లాడతారు. మగవాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు కాని, కాని ఆడ మనిషి కూడా..' అంటూ ఏదో అనబోయారు. భాట్టం లేచి అడ్డుతగిలారు. ఈ మాట వెనక్కి తీసుకోవాలన్నారు.  స్పీకర్ సీఎం వైపు చూసారు. వారు లేవలేదు. అప్పుడు స్పీకర్,  'నేనూ అలాగే అనుకుంటూ వుంటాను మగవాళ్ళు అప్పుడప్పుడూ పిచ్చిగా వ్యవహరిస్తూ వుంటారని' అన్నారు. భాట్టం వెంటనే లేచి చెప్పారు. 'అవును నేనూ మీలాగే! మగవాళ్లు పిచ్చిగా మాట్లాడుతారని ఇప్పుడే గ్రహించగలిగాను.'  సభ ఒక్కసారిగా గొల్లుమంది. కళా వెంకటరావు లేచాడు. ఆయన సామాన్యుడు కాదు. తిప్పికొట్టారు. 'అటువంటి మగవాళ్ళు అందరికీ శ్రీరామమూర్తి ఏకైక ప్రతినిధా అన్నట్టు యెందుకు ఇంతగా ఉలిక్కి పడి లేస్తున్నాడు' అంటూ. భాట్టం నోరు మూతపడింది.
భాట్టం చెప్పిన చిమటా సాంబు కధ
అప్పుడు భాట్టం లోకసభలో టీడీపీ సభ్యుడిగా వున్నారు, బోఫార్స్ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తున్న రోజులు. వరస వాయిదాలతో లోకసభ సమావేశాలు పేరుకు మాత్రమే సాగుతున్నాయి. 'గల్లీ గల్లీ మే హోర్ హై. రాజీవ్ గాంధీ చోర్ హై' అనే నినాదాలు సభలో మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం సభ్యుల సంగతి చెప్పక్కరలేదు. సభ వాయిదా వేసేవరకు ఒకటే అరుపులు కేకలు. పాలకపక్షం ఇది పనికాదనుకుని  సభ వాయిదా వేయకుండా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది. 'ప్రశ్నలు అన్నీ అడిగినట్టే, జవాబులన్నీ చెప్పినట్టే భావించాల'ని స్పీకర్ అంటున్నారు. టీడీపీ సభ్యుడు చిమటా సాంబు ఒక్కసారిగా లేచి వెళ్ళి మంత్రి చిదంబరం చేతిలో వున్న కాగితం లాగాడు. అది చినిగిపోయింది. ఏదో కొట్లాట జరుగుతోందని అంతా చూస్తున్నారు. ఇంతలో ఎవరో గట్టిగా సాంబుతో అన్నారు. 'ఎవరో కొడుతున్నారు అని గట్టిగా  అరిచి కిందపడిపొమ్మ'ని. అన్నట్టే సాంబు కిందపడ్డాడు. 'అమ్మో చంపేశారు మా వాడ్ని' అంటూ మరొకరెవ్వరో గావుకేక పెట్టారు. ఒకరు చేయి పట్టుకుని నాడి  చూస్తుంటే, మరొకరు మొహం మీద నీళ్ళు చల్లుతున్నారు. ఈలోగా డాక్టరు, స్ట్రెచర్  సిద్ధం. 'ఇంజెక్షన్ చేస్తారేమో' అని  సాంబు భయం. 'అదేం లేదు కళ్ళు మూసుకుని పడుకో' మరొకరి ఆదేశం. సాంబుని స్ట్రెచర్ పై తీసుకుని వెళ్లారు. మర్నాడు జాతీయ పత్రికలు అన్నింటిలో ఇదే ప్రధాన వార్త. సాంబు ఒక్కసారిగా హీరో అయిపోయాడు. పార్లమెంటులో పార్టీ కీర్తి ప్రతిష్ట ఇనుమడింపచేసిన సాంబుకి  ఏదో చేయాలని టీడీపీ అధినాయకులు నిర్ణయించారు. సాంబు కోరుకున్నట్టు పౌర విమాన యాన శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిని చేశారు. అలా  అయితే ఉచితంగా అనేక దేశాలు చుట్టి రావచ్చన్నది సాంబు ఆలోచన. పార్టీ నాయకత్వం అనుగ్రహించింది. ఆశీర్వదించింది.
చేజారిన పీయేపీ పదవి
భాట్టం విశాఖలో వుండగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్  కబురు పెట్టారు, ఢిల్లీ వెళ్ళే ముందు హైదరాబాదు వచ్చి కలిసి వెళ్ళమని. భాట్టం ఆయన ఇంటికి వెళ్ళి కలిసారు. ఎన్టీఆర్  అప్పుడు  విద్యాశాఖ మంత్రి  కోటేశ్వర రావుతో మాట్లాడుతున్నారు. బయట చంద్రబాబు నాయుడు  కూర్చుని ఏదో రాసుకుంటూ, చదువుకుంటూ వున్నారు. మంత్రి వెళ్ళిపోయిన  తరువాత ఎన్టీఆర్, భాట్టంతో  అన్నారు. 'లోకసభలో పీయేపీచైర్మన్  గా మిమ్మల్ని  నామినేట్ చేస్తున్నాం. బాగా పనిచేసి పార్టీకి మంచి పేరు తెండి' అని భుజం తట్టారు.  భాట్టం మనసులో అనుమానం. ఉపేంద్ర ఇది జరగనిస్తాడా. అదే పైకి అన్నారు.ఎన్టీఆర్  చిరాకు పడ్డారు. చంద్రబాబును పిలిచారు. వెంటనే ఫోను చేసి ఉపెంద్రతో చెప్పండి, భాట్టం గారే  చైర్మన్ అని. బాబుకు ఉపేంద్ర ఫోనులో దొరకలేదు. 'అన్నగారు చెప్పిన పని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి' అంటూ బాబు షేక్ హాండ్ ఇచ్చారు.  భాట్టం ఢిల్లీ చేరుకునేసరికి అక్కడ సీను మారింది. ఉపేంద్ర మాధవరెడ్డితో మాట్లాడి, 'మాకు  (టీడీపీకి) పీయేపీ చైర్మన్ అక్కరలేదు, సీపీఎం సభ్యుడికి  ఇవ్వండి' అని స్పీకర్ కు ఉత్తరం రాశారు.  భాట్టం ఆరాత్రి ఎన్టీఆర్ కి ఫోను చేసి విషయం వివరించారు. 'అనుకున్నంత పనీ చేసాడా. చూస్తాను యెందుకు చెయ్యడో... మీరే చైర్మన్' అంటూ టేబుల్ మీద చరిచారు. ఎన్టీఆర్'  అంటూ భాట్టం తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఎన్టీఆర్  తెల్లవారు ఝామునే నిద్ర లేస్తారు. భాట్టం ఢిల్లీ నుంచి మళ్ళీ మరునాడు ఉదయమే ఫోను చేశారు. ఈసారి ఎన్టీఆర్ మాటలో తేడా. 'చూడండి శ్రీరామమూర్తి గారు, ఇందులో చాలా పెద్ద జాతీయ విధానాలు ఇమిడి వున్నాయి'  ఈసారి సర్దుకు పొండి అన్నట్టు మాట్లాడారు.  అనుకున్నట్టే పీఏపీ పదవి అందినట్టే అంది భాట్టం చేజారి సీపీఎం సభ్యుడిని వరించింది. ఈ సంఘటనతో భాట్టంకు రాజకీయాల పట్ల విరక్తి కలిగింది. తదుపరి ఎన్నికల్లో పార్టీ లోకసభ టిక్కెట్టు  ఇస్తానన్నా అయన ఒప్పుకోలేదు.
కాంగ్రెస్ అధినాయకత్వంపై ఇందిరాగాంధీ తిరుగుబాటు దరిమిలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చీలిపోయింది. అప్పుడు రాష్ట్రంలో జలగం వెంగల రావు ముఖ్యమంత్రి. ఆయన సంస్థా కాంగ్రెస్ లోనే వుండిపోయారు. ఆయన  మంత్రివర్గంలో అనేకమంది రాజీనామా చేసి ఇందిరా కాంగ్రెస్ లో చేరిపోయారు. జీ రాజారాం, మాణిక్య రావు, లుకలాపు లక్ష్మణ దాసు రాజీనామా చేసినవారిలో వున్నారు.
టియ్యే బిల్లు తెచ్చిన చిక్కు
భాట్టం మంత్రిగా వున్నప్పుడు విశాఖ నుంచి హైదరాబాదు మకాం మార్చినప్పుడు,  దొంగ బిల్లు పెట్టి డబ్బులు డ్రా చేసారని రాజకీయ ప్రత్యర్ధులు దుమారం లేపారు. అదెంత మొత్తం అరువందల చిల్లర. ఆ పిర్యాదు ఢిల్లీ వరకు వెళ్ళింది. తరువాత కేంద్రం నియమించిన విమదలాల్ కమీషన్ కూడా విచారణ జరిపిండి. భాట్టం అధిక మొత్తం  క్లెయిం చేయకపోగా,  తన సొమ్మే కొంత అదనంగా  కోల్పోయాడని కమీషన్ తేల్చి చెప్పింది.
మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ఎస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో భాట్టం అన్నారు. 'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా. ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా  వుంది'
ఈ వ్యాఖ్య సభలో దుమారం రగిలించింది. పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. లేచిపోవడం అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగ్గ పదమా కాదా అన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది.
తోకతపా:
పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన  భాట్టం శ్రీరామ్మూర్తి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు.          


8, జులై 2015, బుధవారం

పవ'నిజం'

(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 09-07-2015, THURSDAY)

దీపావళి రాత్రి కాల్చి పారేసిన టపాసుల్లో కొన్ని మరునాడు కూడా పేలుతుంటాయి. అలాగే జనసేన నేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై దుమారం కూడా కొనసాగుతోంది.


'ఇంతకీ పవన్ చేసిన వ్యాఖ్యలు ఏమిటి' అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో విధంగా అన్వయించుకుని భాష్యాలు చెబుతున్నారు. మాయాబజార్ సినిమాలో 'ప్రియదర్శిని' పేటిక గుర్తుంది  కదా! అది తెరిచి చూసినవారికి, వారికి ఇష్టమైన వ్యక్తులే అందులో కానవస్తారు. పవన్ వ్యాఖ్యలు కూడా అంతే. ఎవరికి నచ్చిన రీతిలో వారికి కనబడుతున్నాయి. వినబడుతున్నాయి.
'మొత్తం మీద పవన్  ఏమన్నారు' అన్న దానికంటే ఆయన అన్నదానిలో ఒక్కో ముక్కను పట్టుకుని విరగ్గొట్టి చేస్తున్న వ్యాఖ్యానాలే బాగా వినబడుతున్నాయి. కొన్ని టీఆర్ఎస్ కు అనుకూలంగా, మరికొన్ని టీడీపీకి అనుకూలంగా వున్నాయి. అంతే అయితే పేచీయే లేదు. కానీ కొన్ని వ్యాఖ్యలు టీడీపీకి గుండెల్లో గుచ్చినట్టుగా వుంటే మరికొన్ని టీ.ఆర్.ఎస్. వర్గాలకు మింగుడు పడని విధంగా వున్నాయి. అంటే, 'అన్ని వర్గాలను ఆకట్టుకునే విధంగా సినిమా వుండాల'నే సినీ వాణిజ్య సూత్రాలకు అనుగుణంగానే  పవన్ వ్యాఖ్యల తీరు వుందని  విశ్లేషించిన వారున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే, తాను ఒడ్డున తీరిగ్గా  కూర్చుని, ఇద్దరు తెలుగు ప్రభుత్వాధినేతలకు పెద్దమనిషి తరహాలో  సలహాలు, సూచనలు ఇస్తున్నవిధంగా పవన్ ప్రసంగం సాగింది. ఇతరులు చెప్పే నీతి  పాఠాలు వినే పరిస్తితిలో ఉభయ రాష్ట్రాల అధినేతలు వున్నారనుకునే పరిస్తితి  కూడా లేదు. పవన్ ప్రస్తావించిన అంశాలు తెలియనంత రాజకీయ అజ్ఞానులు కూడా వారు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. వారి వారి రాజకీయాలకు అనుగుణంగా వారి ఎత్తుగడలు వుంటున్నాయి. వాటి పరిణామాలు, పర్యవసానాలు యెలా వుంటాయన్నది తెలియని వారు కూడా కాదు. ఒక సినీ నటుడుగా  పవన్ కళ్యాణ్ కు వున్న  బలం ఏమిటో కూడా ఆ ఇద్దరు అధినేతలకు తెలుసు. అందుకే పవన్ వ్యాఖ్యలపై ఆయా పార్టీల ప్రతినిధులు చేస్తున్న విమర్శలు, వ్యాఖ్యానాలు తప్పిస్తే నేరుగా వారిద్దరూ నోరు తెరిచి మాట్లాడింది లేదు.
'పవన్ వ్యాఖ్యలు ఏ ముక్కకు ఆ ముక్క వింటే ఒక అర్ధం ధ్వనిస్తోంది. మొత్తంగా వింటే మొత్తం అర్ధమే మారిపోతోంద'ని పవన్ ప్రసంగం టీవీల్లో చూసిన కొందరు వ్యాఖ్యానించారు. పరస్పర విరుద్ధమైన విషయాలను ఒకేతడవ పేర్కొనడం వల్ల ఆయన అభిప్రాయాల్లో  కొంత స్పష్టత లోపించిందని కూడా మరికొందరు భావించారు.
హైదరాబాదులో సెక్షన్ ఎనిమిది అమలు చేయడం మంచిది కాదనీ, అందుకు తాను వ్యతిరేకమని అన్నారు. ఆ సెక్షన్  అమలుచేస్తే తెలంగాణా ఇచ్చిన ఆనందం తెలంగాణా వారిలో ఆవిరి అయిపోతుందన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. హైదరాబాదులో శాంతిభద్రతలకు విఘాతం కలిగినప్పుడే ఈ సెక్షన్ అమలుచేయాలన్నారు. ఏపీ సీఎం మీద కేసు పెట్టినప్పుడో మరొకప్పుడో కాదని ముక్తాయింపు కూడా  ఇచ్చారు.  ఈ అంశం మీద కంటే, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మరింత ప్రయోజనకారి అయిన 'ప్రత్యేక హోదా' సాధనపై దృష్టి సారించడం మంచిదన్నారు.     
పనిలో పనిగా తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఓ కితాబు ఇచ్చారు. ప్రతిష్టాత్మకంగా ఆయన చేపట్టిన 'యాదాద్రి' (యాదగిరిగుట్ట) సుందరీకరణ, అభివృద్ధి పధకం ప్రధాన రూపశిల్పిగా విజయనగరానికి చెందిన ఆంధ్ర ప్రాంతపు నిపుణుడిని నియమించడం ముదావహమన్నారు. 'మహబాగా చెప్పాడు' అని టీ.ఆర్.ఎస్. శ్రేణులు ముచ్చట పడేలోగా ఆ పార్టీకి ఓ చురక అంటించారు. 'టీడీపీ టిక్కెట్టుపై గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ని తమ పార్టీలోకి తీసుకుపోగలరే కాని, ఆయన్ని గెలిపించిన సనత్ నగర్ నియోజక వర్గం ప్రజల ఆలోచనలు, మనసుల్ని మార్చగలరా?' అని సూటిగా ప్రశ్న సంధించారు.
ఆంధ్ర ప్రాంతపు తెలుగు దేశం ఎంపీలు కొందరిపై ఘాటయిన వ్యాఖ్యలు చేశారు. 'పోరాడి సీటు సంపాదించుకుని గెలిచిన వాళ్లు ఇప్పుడు  ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడడంలో ఎంపీలు చేసింది ఏమీ లేదని అన్నారు. టీడీపీ ఎంపీల పేర్లతో పాటు, బీజేపీ కి చెందిన ఆంధ్ర పార్లమెంటు సభ్యుల పేర్లను కూడా అయన బాహాటంగా ప్రస్తావించడం, వారిలో కొందరు కేంద్ర మంత్రులు వుండడం చర్చనీయాంశంగా మారింది. అలాగే, 'తిడితే కేసీఆర్ లాగా తిట్టాలి, పడితే పౌరుషం లేని ఆంధ్ర ఎంపీల్లా పడాలి' అనే పవన్ వ్యాఖ్యలు టీడీపీ శ్రేణుల్లో అలజడి సృష్టించాయి.              
కాకపొతే ఈసారి పవన్ ఎక్కుపెట్టిన బాణాలు  రెండు పార్టీమీద అయినప్పటికీ, వాటిల్లో చురుక్కుమనేవి, చివుక్కుమనిపించేవి తగిలింది మాత్రం టీడీపీకే  అన్నది సుష్పష్టం. ఓటుకు నోటు కేసు విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆంధ్రావారి గురించి ప్రస్తావించేటప్పుడు 'ఆంధ్రోళ్లు' అంటూ కొందరు  టీ.ఆర్.ఎస్. అగ్ర నాయకులు  హీనంగా మాట్లాడుతున్నారని చెప్పిన  విషయాన్ని  మినహాయిస్తే,  పవన్ ఎక్కువగా తన మాటల తూటాలు టీడీపీ మీదనే ఎక్కువగా గురిపెట్టి పేల్చినట్టు కానవస్తోంది. ఒక కేంద్ర మంత్రితో సహా టీడీపీ కి చెందిన పార్లమెంటు సభ్యులు అనేకమంది పవన్ వ్యాఖ్యలను తప్పుపడుతూ స్పందించిన తీరు, వివరణ ఇచ్చిన విధానం  ఇందుకు తార్కాణం.       
సెక్షన్ ఎనిమిది విషయంలో పవన్ చేసిన వ్యాఖ్యల కన్నా వారి వ్యాపారాల ప్రసక్తి తీసుకువస్తూ ఆయన చేసిన ప్రస్తావనలు వారిని బాగా కదిలించినట్టు కానవస్తోంది.
రెండు తెలుగు రాష్టాల నడుమ తలెత్తే వివాదాలను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలతో కమిటీ వేయాలని సలహా ఇచ్చారు. ప్రధాన మంత్రి మోడీ కల్పించుకుని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి తగిన న్యాయం చేయాలని పవన్ కోరారు.
ఒక రకంగా పవన్ వున్న మాటే చెప్పారని సోషల్ మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం సాగుతోంది. 'రెండు రాష్ట్ర ప్రభుత్వాలు  చీటికీ మాటికీ కలహించుకోవడం తగదనీ, చిన్న చిన్న తగాదాలను తెగే దాకా లాగి పెద్దవి చేసుకునే దానికన్నా కాస్త సంయమనంతో సహకరించుకుంటూ పోతే ఉభయ రాష్ట్రాలకు  మంచిది' అని చాలామంది మనస్సులో వున్న మాటే ఆయనా చెప్పారు. మొన్నటికి మొన్న రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సయితం ఇంత విస్పష్టంగా కాకపోయినా ఆయన సహజసిద్ధమైన రీతిలో, ఆ పదవికి వున్న పరిమితుల్లో ఇదే రకమైన సలహా, కాకపొతే, కాస్త క్లుప్తంగా చెప్పారు. దాన్నే పవన్ మరింత పెద్దది చేసి,  పెద్ద తెరపై సినిమా చూపినట్టు విస్తృతంగా, విపులంగా చెప్పారని పవన్ అభిమానులు అంటున్నారు.
ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాత్రమే కాదు, ఒక పౌరుడిగా కూడా తన మనస్సులోని మాటను బయటకు చెప్పే హక్కు, స్వేచ్ఛ పవన్ కళ్యాణ్ కు వున్న మాట నిజమే. అయితే, రాజకీయ పార్టీ పెట్టి, ఎన్నికల్లో నిలబడకుండా, నిలబడ్డవారిలో కొందరి విజయానికి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారణం అయి, ఆ మాట వారిచేత కూడా చెప్పించుకుని రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ స్థాయిలో సయితం ఒక స్థానం సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ నుంచి, ఆయన అభిమానులు, లేదా రాజకీయాల్లో మార్పు కోరుకుంటున్నవారు కోరుకునేది, కోరుకుంటున్నది  వేరే వుందని పవన్ కళ్యాణ్ కానీ, ఆయనకు  అన్నుదన్నుగా వున్నవారు కాని గ్రహిస్తే మంచిది. ఇలా అప్పుడప్పుడూ రాజకీయాకాశంలో తళుక్కుమని మెరుస్తూ, చురుక్కుమనే వ్యాఖ్యలతో మీడియా దృష్టిని ఆకర్షిస్తూ 'పార్ట్ టైం పొలిటీషియన్' అనే ట్యాగ్ లైన్ తో సరిపుచ్చు కోకుండా, తనదైన తరహాలో పూర్తి స్థాయి రాజకీయాలు నడపడం వల్ల కొంత ప్రయోజనం వుండే అవకాశం వుంది. లేకపోతే, 'లాభనష్టాలను ఎప్పటికప్పుడు  బేరీజు వేసుకుంటూ, రెండు పడవలపై జాగ్రత్తగా ప్రయాణిస్తున్నారు' అనే అపప్రధ మోయాల్సి వుంటుంది.   
వరసగా రెండేళ్లు సినిమాలు లేకపోతే నటీనటులను ప్రేక్షకులు మరచిపోతారు. రాజకీయ కార్యకర్తలు ఇందుకు భిన్నం కాదు. తమ నాయకుడు ఎప్పుడూ తమకు అందుబాటులో వుండాలని, తమ నడుమే వుండాలని కోరుకుంటూ వుంటారు. రాజకీయ నాయకులు, మరీ ముఖ్యంగా కొత్తగా పార్టీలు పెట్టిన వాళ్లు ఈ విషయం గమనంలో వుంచుకోవాలి. (08-07-2015)
రచయిత ఈ మెయిల్ : bhandarusr@gmail.com మొబైల్: 98491 30595
NOTE: Courtesy Image Owner

6, జులై 2015, సోమవారం

నేటి రాజకీయులకు స్పూర్తి - శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి ఇక లేరు

   
(Published in Andhra Bhoomi, Telugu daily on 07-07-2015)

'తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి' అనే దానికి నిలువెత్తు నిర్వచనం శ్రీ భాట్టం శ్రీరామమూర్తి. నిండు జీవితం గడిపి, గడిపిన జీవితానికి చరితార్ధత కల్పించిన ధన్యజీవి. జయప్రకాష్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వంటి అగ్రనేతలకు సన్నిహితుడిగా మెలిగిన ఈ పాత తరం   వృద్ధ రాజకీయవేత్త, మారిన రాజకీయాన్ని, మారిన విలువలను  కళ్ళారా చూసి, తానుమాత్రం మారకుండా   తన ఎనభయ్ తొమ్మిదో ఏట ఈరోజు (సోమవారం)  విశాఖపట్నంలో  కన్ను మూశారు. 1926 లో ధర్మవరం గ్రామంలో, ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో, నన్నయ పంతులు, తరుణమ్మల సంతానంగా   జన్మించిన భాట్టం శ్రీరామమూర్తి,  స్వయం కృషితో ఎదిగి  ఇరవై ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా పనిచేశారు. 1957లో జరిగిన విజయనగరం అసెంబ్లీ  ఉపఎన్నికలో శ్రీ భాట్టం శ్రీరామమూర్తి, సోషలిష్టు పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఎమ్మెల్యేగా వున్న శ్రీ పీవీజీ రాజు లోకసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఆ తరువాత 1962 లో జరిగిన ఎన్నికల్లో కూడా భాట్టం అదే నియోజక వర్గంనుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి  అసెంబ్లీకి రెండో పర్యాయం ఎన్నికయ్యారు. తరువాత విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు (1972, 1978)కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు.  ఎనిమిదేళ్ళు మంత్రిగా, ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా వున్నారు. శ్రీ పీవీ నరసింహారావు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ మర్రి చెన్నారెడ్డి, శ్రీ అంజయ్య మంత్రివర్గాల్లో శ్రీరామమూర్తి కీలకమైన వివిధ శాఖలు నిర్వహించారు. రెండు ప్రపంచ తెలుగు మహాసభలు ఆయన సారధ్యంలోనే జరిగాయి. కౌలాలంపూర్ లో నిర్వహించిన ప్రపంచ సభలకు నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న శ్రీ భాట్టం ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం గారు  మాకు కుండ మార్పిడి చేశారు' అనేవారు శ్రీరామ మూర్తిగారు హాస్యోక్తిగా.    
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో టీడీపీ టిక్కెట్టు మీద శ్రీ శ్రీరామమూర్తి, విశాఖ నియోజకవర్గం నుంచి  తొలిసారి లోకసభకు ఎన్నికయి పార్లమెంటులో తన స్వరం వినిపించారు.  

(నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విశాఖ వచ్చిన సందర్భంలో ఆ నాటి ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానందరెడ్డితో భాట్టం శ్రీరామ మూర్తి)

రాజకీయ జీవితంలో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర శ్రీ శ్రీరామ మూర్తిది. రాజకీయ శత్రువులు సయితం ఆయన నిజాయితీని శంకించలేని స్తితి.  హోదాలు కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు.    మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్  పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి శుభలేఖలు కూడా అచ్చు వేయించలేదు. తన కుటుంబసభ్యులను తీసుకుని ఒక ప్రైవేటు వాహనంలో పెళ్ళికి వెళ్ళి వచ్చారు. డాబూ దర్పాలూ లేవు, వందిమాగధులూ లేరు. అదీ భాట్టం శ్రీరామమూర్తి గారు  పాటించిన జీవన విధానం.
తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది శ్రీరామ మూర్తి గారు తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.          
 ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా పనిచేసిన తరువాత మరో సారి శ్రీ రామారావు విశాఖ నుంచి రెండో మారు పోటీ చేయాలని  శ్రీ శ్రీరామ మూర్తిని  కోరారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న శ్రీ భాట్టం, రామారావుగారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచీ ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక వ్యవహారాలకు దగ్గరగా  వుంటూ వచ్చారు. ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు ఇమ్మని కూడా దేబిరించలేదు. ఆ పుణ్యాత్మురాలు సత్యవతి గారు కూడా భర్తకు తగ్గ భార్య. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా, ఆశయాలకు తగినట్టుగా ఆయన వెంట నడిచారు.
భాట్టం శ్రీరామ మూర్తి గారు ఓ అయిదారేళ్ళ క్రితం కాబోలు,  మిత్రుల కోరికపై తన ఆత్మ కధ రాశారు. దానికి అయన పెట్టుకున్న పేరు 'స్వేచ్చాభారతం'.  సాధారణంగా రాజకీయ నాయకులు రాసే ఆత్మ కధల్లో 'ఆత్మ స్తుతి పరనింద' తొణికిసలాడతాయి. కానీ భాట్టం తరహానే వేరు. ఆయన అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు.
చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా  రాసుకున్నారు.
'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు)  అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి  ఏడుపెందుకు?'      
శ్రీ భాట్టం శ్రీరామ మూర్తికి ఒకనాటి రాజకీయ సహచరుడు, ముఖ్యమైన స్నేహితుడు కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు. అయన కుమారుడు, ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా వున్న శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు. మహాకవి,  సంస్కృత పండితుడు భవభూతి సూక్తిని శ్రీ బుద్ధ ప్రసాద్ అందులో ఉటంకించారు.
'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'
ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి. (06-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్:  98491 30595


               

అందరూ అత్తలే



అదేవిటో దురదృష్టం. కోడళ్ళకు సరే. సినిమావాళ్ళకు కూడా  అత్త అంటే పడదు. అత్త అంటే సూర్యాకాంతం లాంటి గడుసు మనిషని  అనుకునేలా సినిమాలు తీసారు. తీస్తున్నారు.  అత్తలందరికీ అసలు పేరు ఒకటి వుంటుంది కాని, గయ్యాళితనానికి మారుపేరనే పాడుపేరొకటి వారి సొంతం.  సొంతానికి సాధించింది ఏవీ లేకపోయినా పొద్దస్తమానం కోడళ్లను సాధిస్తారనే  ట్యాగ్ లైన్ మరోటి. కోడలు యెంత గుణవంతురాలయినా, నడుం దించకుండా అడవా చాకిరీ యెంత  చేస్తున్నా, 'అదేం రోగమో మా కోడలు పిల్లకు నడుం ఒంగి చావదు, చచ్చినట్టు ప్రతిపనీ నేనొక్కత్తినే చేసుకు చావాలి'  అనే టీవీ సీరియళ్ల అత్తళ్ళకు కొదవ వుండదు. ఇంతకీ ఈ అత్తల పురాణం ఎందుకంటే? -
సాధించే గుణం, వంకలు పెట్టే గుణం, 'అన్ని పనులు నేనే చేస్తున్నాను, వేరేవారికి పనులు చేతకాదు' అనే అత్తల సహజ స్వభావం సమాజంలో అందరిలోను ఎంతో కొంత వుందని చెప్పడానికే.
ఏదయినా ఆఫీసరును కదిపి చూడండి. అక్షరం పొల్లుపోకుండా ఇదే సోది చెబుతాడు. 'తను తప్ప పనిచేసేవారు ఎవ్వరూ లేరనీ, అందరి పనులు తానే నెత్తికెత్తుకుని చేస్తుండబట్టే ఆఫీసు ఈ మాత్రం నడుస్తోంద'నీ అంటాడు. ఆయన కింద పనిచేసేవాడిని అడిగితే ఆయనా తన కింద వాళ్లని గురించి ఇదేవిధమైన అమూల్యాభిప్రాయం వ్యక్తం చేస్తాడు. అంటే ఏమిటన్న మాట, అత్తలకీ వీళ్ళకీ ఏమీ తేడా లేదన్న మాట.
'ఎవ్వరూ పనిచేయడం లేదు అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని అనుక్షణం మధన పడిపోయేవాళ్లు  అడుగడుక్కీ కనిపిస్తుంటారు. నేనూ ఇందుకు మినహాయింపు కాదు. వంకలు పెట్టే వంకర గుణం నాకూ వుంది.
ఈ మధ్య రైల్లో పోతుంటే బోధి వృక్షం కింద బుద్ధుడికి జ్ఞాన బోధ అయినట్టు జీవిత  సత్యం బోధపడింది. వెచ్చటి వేసవి కాలంలో చల్లటి ఏసీ కోచ్ లో అంతా ముసుగుతన్ని పడుకున్న సమయంలో, ప్రపంచం అంతా నిద్రలో జోగుతున్న సమయంలో  పట్టాలపై రైలు  అలుపులేకుండా  పరుగులుతీస్తోంది. ఏదయినా స్టేషన్ వచ్చినప్పుడల్లా రైలు దడదడా  పట్టాలు మారుతున్న ధ్వని వినబడుతూ వుంది. ఆ అర్ధరాత్రి వేళ పట్టాలు మార్చే మనిషి కాస్త ఏమరు పాటుగా వున్నా, కాసింత రెప్ప వాల్చినా రెప్పపాటు కాలంలో ఆ రైల్లోని ప్రయాణీకుల ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తధ్యం. అంటే ఏమిటి, రైల్లో ఇంతమంది జనం హాయిగా కంటినిండా నిద్రపోగలుతున్నారు అంటే ఇంతమందికోసం ఎవరో ఒకరు ఆ నిశిరాత్రివేళ  నిద్ర లేకుండా పనిచేస్తున్నారనే అర్ధం. 'అది అతని డ్యూటీ చేయక ఏం చేస్తాడు' అంటే అతడు పనిచేస్తున్నాడు అనేకదా! కాబట్టి 'మనం ఒక్కళ్ళమే పనిచేస్తున్నాం, మిగిలిన వాళ్లు అందరూ పని దొంగలు' అని రొమ్ము విరుచుకోవడంలో అర్ధం లేదు.
అలాగే మరో ఉదాహరణ. చలి కాలం. నిద్రలేచి కూడా  లేవడానికి బద్దకించి ముసుగు తన్నిపడుకున్నవేళ, మన ఇంటి ముందు ఎవరో పాల ప్యాకెట్లు వుంచి వెడతారు. 'అవి అంత పొద్దున్నే  యెలా వచ్చాయి' అని ఒక్క క్షణం కూడా ఆలోచించం. 'ఇంటింటికీ ఇలా పొద్దున్నే వేస్తున్నాడు అంటే అతడు యెంత పొద్దున్న లేచి వుంటాడు అనే ప్రశ్న నేనయితే ఎప్పుడూ వేసుకున్న పాపాన పోలేదు. ఎందుకంటే నాలోనూ కనిపించని 'అత్త' అవుంది. అదే నాచేత 'అది  అతడి డ్యూటీ' అనే మాట చెప్పిస్తుంది.  అనేది నా థియరీ. అంటే మరి అతడు తన డ్యూటీ చేస్తున్నప్పుడు 'ఎవ్వరూ పనిచేయడం లేదు' అని నేనిచ్చే స్టేట్ మెంట్లకి అర్ధం ఏమిటి?
వేడి వేడి కాఫీ తాగుతూ పత్రికల్లో వచ్చే తాజా వార్తలు  చదివే భోగం  మనకు పట్టింది అంటే ఎవరో  పిల్లాడు తెల్లవారుఝామున్నే నిద్ర లేచి, ఏజెంట్లు  ఇచ్చిన పత్రికలు సైకిల్ మీద పెట్టుకుని ఇంటింటికీ తిరిగి వేయబట్టే కదా! అలాగే తెల్లారకముందే అన్నన్ని వార్తలు మోసుకుని పత్రికలు మన ఇళ్లకు వస్తున్నాయి అంటే  పత్రికాఫీసుల్లో ఎంతమందో మనకోసం నిద్ర కాచి పనిచేయబట్టే కదా!   ఇలాగే, మన  చుట్టూ వున్న పని మనుషులు, వీధులు వూడ్చేవాళ్ళు, ఒకళ్లా ఇద్దరా అనేకమంది ఒళ్ళు దాచుకోకుండా, పనికి బద్ధకించకుండా ఎవరి పనులు వాళ్లు చేస్తూ వుండడం వల్లే, హాయిగా కాలు మీద కాలేసుకుని  కూర్చుని, 'ఎవ్వరూ పనిచేసేవాళ్ళే లేరు, నేనొక్కడ్ని తప్ప. అందుకే దేశం ఇలా తగలడిపోతోంద'ని   సన్నాయి నొక్కులు నొక్కుతున్నాము.
ఒక్కటి నిజం. ఎవ్వరూ పనిచేయకుండా మనకు రోజు గడవడం లేదు. ఒక్కళ్ళూ పనిచేయడం లేదని వంకలు పెట్టకుండా కూడా రోజు గడవడం లేదు. అందుకే అన్నది, అందరిలోనూ ఎంతో కొంత 'అత్తల గుణం' వుందని.(06-07-2015)
Note: Courtesy Image Owner  

                      

3, జులై 2015, శుక్రవారం

పార్టీ మార్పిడులు


(PUBLISHED IN 'SURYA' TELUGU DAILY ON 05-07-2015, SUNDAY)

మొన్నీమధ్య  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చివరి  పీసీసీ అధ్యక్షుడుగా పనిచేసిన  బొత్స సత్యనారాయణ, వై.ఎస్.ఆర్.సీ.పీ. లో చేరారు. దానిపై చర్చలు అనంతంగా సాగుతూ వుండగానే, అదే హోదాను  రెండు పర్యాయాలు అనుభవించి వై.ఎస్.ఆర్. తో కలిసి కాంగ్రెస్ పార్టీని రెండు పర్యాయాలు అధికారంలోకి తీసుకువచ్చి, 'గెలుపు గుర్రం' అని  పేరుపడ్డ డి. శ్రీనివాస్, తాజాగా గులాబీ కండువా కప్పుకుని టీ.ఆర్.ఎస్. లో చేరిపోయారు. 'పార్టీ మార్పిళ్ళకు ఈ పరిణామాలు పరాకాష్ట' అని గిట్టని పార్టీల వాళ్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇలాటి సందర్భాలలో ఉభయపక్షాల నుంచి విమర్శలకు, సమర్ధనలకు అంతే  వుండదు. ఇదేదో కొత్త విషయం అయితే ఆశ్చర్య పడాలి. ఈ చేరికలకు, చీలికలకు ఇది మొదలూ కాదు, చివరా కాదు. అందుకే విమర్శించేవారు మరో సందర్భంలో సమర్ధించడానికి సిద్ధంగా వుండడం అవసరం. సమర్ధించేవారు ఇంకో సందర్భంలో విమర్శించడానికి సంసిద్ధంగా వుండడం కూడా అంతే  అవసరం.  ఎందుకంటే ఈ పార్టీ మార్పిళ్ళు అనేవి అన్ని పార్టీలకి తప్పనిసరి అవసరం కాబట్టి.  ఎవరూ దీనికి అతీతులు కాదు కాబట్టి. మరో 'మార్పిడి' జరిగేవరకు పాత దానిపై దుమారం సాగిపోతుంది, ఆ  తరువాత పాత పడిపోతుంది. ఇదో విష చక్ర భ్రమణం.       
'నిలకడగా  నిల్వవున్న నీరు నాచు పట్టి నీచు వాసన వేస్తుంది. పారే నీరు పారదర్శకంగా స్వచ్చంగా కనబడుతుంది'   
పార్టీ మార్పిడులను సమర్ధిస్తూ ఓ రాజకీయ నేత చేసిన వ్యాఖ్య ఇది. మరి సమర్ధనకు ఈ వ్యాఖ్యను పరాకాష్టగా తీసుకోవాలేమో.  
పార్టీలు ఏర్పడినప్పుడే మార్పిళ్ళ సంస్కృతికి కూడా బీజాలు పడ్డాయంటారు. పార్టీలు వుంటేనే కదా మార్పిళ్ళు జరిగేది. అందుకే రాజకీయుల అవసరాలకు తగ్గట్టు పార్టీలు కూడా పుట్టుకొస్తుంటాయి.
1947లో దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత 1952లో తొలిసారి సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అప్పుడు దేశంలో అందరి నోళ్ళలో నానుతున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ మాత్రమే. కమ్యూనిష్టు పార్టీలు వుండేవి కాని వాటి పాత్ర పరిమితంగా వుండేది. ఆ తరువాత కాంగ్రెస్ పార్టీలోని అసంతృప్తుల పుణ్యమా అని అనేక పార్టీలు పుట్టుకొచ్చాయి. కొన్ని కాలపరీక్షకు తట్టుకున్నాయి. కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. మరికొన్ని ఎంతో కొంత ఓట్ల శాతాన్ని దక్కించుకుంటూ తమ ఉనికిని కాపాడుకుంటున్నాయి.
ఇప్పుడు వేర్వేరు రాష్ట్రాలుగా వున్న రెండు తెలుగు రాష్ట్రాలు  తొలి ఎన్నికల సమయంలో కూడా రెండు వేర్వేరు  రాష్ట్రాలుగానే వున్నాయి. కాకపొతే భౌగోళికంగా కొంత తేడా వుండివుండవచ్చు. పేర్లలో సయితం కొంత మార్పు వుండవచ్చు. ఇప్పటి ఆంధ్ర ప్రదేశ్  అప్పుడు ఆంధ్ర రాష్ట్రం. ఇప్పుడు తెలంగాణాగా  వున్నది అప్పుడు హైదరాబాదు స్టేట్ .  అప్పుడు తెలంగాణాలో వున్న కొన్ని ప్రాంతాలు పొరుగు రాష్ట్రాల్లో చేరిపోయాయి. అలాగే, ఆంధ్ర ప్రాంతంలో వున్న కొన్ని భాగాలు ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు చేసినప్పుడు పొరుగు రాష్ట్రాల్లో కలిసిపోయాయి.
1948లో నిజాం సంస్థానం ఇండియన్ యూనియన్ లో విలీనం అయిన తరువాత హైదరాబాద్ స్టేట్ లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి ఏర్పాటుచేసిన ప్రభుత్వానికి నాటి స్వతంత్ర సమరయోధుడు బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. 1956లో ఆంధ్ర తెలంగాణా ప్రాంతాలతో ఆంధ్రప్రదేశ్ పేరుతొ దేశంలో తొట్టతొలి భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడింది.  నిరుడు 2014 జూన్  రెండో తేదీన తెలంగాణా రాష్ట్రం ఆవిర్భావంతో ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలుగా  అది  విడిపోయింది. విడిపోవడానికి కొద్దికాలం  ముందు నిర్వహించిన అసెంబ్లీ ఎన్నికల్లో అటు ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, ఇటు తెలంగాణాలో టీ.ఆర్.ఎస్. పార్టీ అధికారంలోకి వచ్చాయి. రాష్ట్రాల చీలిక దరిమిలా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొట్టవచ్చినట్టుగా కనిపించిన మార్పు ఒక్కటే ఒక్కటి,  పార్టీ మార్పిళ్ళు. రెండు రాష్ట్రాలమధ్య సహజంగా పరిష్కారం కావాల్సిన అనేక సమస్యలు అలాగే వుండిపోతే, కొత్తగా తెరమీదకు వచ్చిన ఈ పార్టీ మార్పిళ్ళ వ్యవహారం అన్ని సమస్యలను కారుమబ్బులా కమ్మేసి, అనేక అనైతిక, అవాంఛనీయ, అప్రజాస్వామిక పరిణామాలకు దారి తీయడమే కాకుండా వివాదాలు ముదిరి పాకానపడి చివరికి కేసులు, కోర్టుల వరకు వెళ్ళింది.
ఈ చిక్కుముళ్ళు ఎప్పుడూ విడివడతాయో ఎవ్వరూ చెప్పలేని పరిస్తితి. 'మీరంటే మీరే కారణం' అంటూ వివాదాలకు కేంద్ర బిందువులయిన రెండు ప్రధాన పార్టీలు వీధులకెక్కి వీరంగాలు చేస్తూ వుండడం, అటూ ఇటూ పార్టీల నాయకులు. కార్యకర్తలు, అభిమానులు వేర్వేరు పారావారాలుగా విడిపోయి వాదోపవాదాలకు దిగడంతో సామరస్య పరిష్కారం ఆశలు సన్నగిల్లుతున్నాయి.   దీనికి ముగింపు ఎప్పుడన్నది కాలమే చెప్పాలి.
పోతే, ఇన్ని సమస్యలకు మూలకారణంగా పేర్కొంటున్న పార్టీ మార్పిళ్ళు ముందే చెప్పినట్టు పార్టీలు పుట్టినప్పుడే పురుడు పోసుకున్నాయి. అసలు కొత్త పార్టీలు పుట్టుకు రావడానికి ప్రధాన కారణం పార్టీల్లో పుట్టుకొచ్చే  రాజకీయ అసంతృప్తులే అనే వాదం వుంది.     
సాధారణంగా  ప్రతిపక్షంలో వున్నవాళ్ళు పాలకపక్షం వైపు చూడడం సహజం. కానీ,పాలక పక్షం నుంచి ప్రతిపక్షం వైపు దూకే సాంప్రదాయానికి ఎప్పుడో రామాయణ కాలంలోనే విభీషణుడు విత్తు నాటాడు. తటస్థులను తమవైపు తిప్పుకోవడం మహాభారతంలో కానవస్తుంది.      
స్వతంత్రం వచ్చిన కొత్తల్లో వచ్చిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీది ఏకపక్షంగా సాగిన వ్యవహారం ఏమీ కాదు. స్వతంత్రం తెచ్చిన ఖ్యాతి, తొలి ఎన్నికల్లో అ పార్టీకి బాగా ఉపయోగపడిన మాట వాస్తవమే అయినప్పటికీ ఇప్పటితో పోలిస్తే అప్పుడున్న పార్టీల సంఖ్య  కూడా తక్కువేమీ కాదు. జనత పార్టీ, స్వతంత్ర పార్టీ, జనసంఘం పేర్లు  ఈనాడు కొందరికి తెలిసి  వుండవచ్చునేమో కాని, 1952 లో జరిగిన ఎన్నికల్లో సోషలిష్టు పార్టీ, ప్రజా సోషలిష్టు పార్టీ,  నేషనలిష్టు డెమొక్రాటిక్ పార్టీ, కృషికార్ లోక్ పార్టీ, కే.ఎల్.పీ, ఎన్.సీ.ఎఫ్,  జస్టిస్ పార్టీ,  ప్రజాపార్టీ, కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ, పీపుల్స్ డెమొక్రాటిక్ ఫ్రంట్ ఇలా అనేక పార్టీలు వుండేవి. కమ్యూనిస్ట్ పార్టీ (అప్పటికి ఒక్కటే) సరేసరి. వీటిల్లో కొన్ని పార్టీల పేర్లు చూడగానే, 'తల్లి పార్టీ ఏమిటి? అందునుంచి  వేరుపడి ఏర్పడ్డ కొత్త పార్టీ ఏమిటి?' అన్న విషయం సులభంగానే బోధపడుతుంది. 1952 లో ఆంధ్ర ప్రాంతంలో  జరిగిన అసెంబ్లీ  ఎన్నికల్లో నలభయ్ ఒక్క  స్థానాలు గెలుచుకున్న కమ్యూనిష్టులు, నలభయ్ స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం కావడం మూలాన, ఆంధ్ర ప్రాంతంలో ఎక్కువ స్థానాలు గెలుచుకున్నప్పటికీ అధికార పీఠం ఎక్కే అవకాశం కమ్యూనిష్టులకు లభించలేదు. ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డ అనంతరం 1955లో జరిగిన ఎన్నికల నాటికి కాంగ్రెస్ తెలివిన పడింది.    ఇతర పార్టీలను కలుపుకుని యునైటెడ్ కాంగ్రెస్ పేరుతొ పోటీ చేసి  బయటపడగలిగింది. ఆ ఎన్నికల్లో కమ్యూనిష్టు పార్టీకి కేవలం పదిహేను సీట్లే దక్కాయి. ఇక, కారణాలు ఏమైతేనేం, అప్పటి నుంచి ఈనాటివరకు కమ్యూనిష్టు పార్టీలకు ఆ పూర్వ వైభవం మళ్ళీ అనుభవం లోకి రాకుండా పోయింది. అందుకే,  ఆంధ్ర రాష్ట్రం ఏర్పడకముందు ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో భాగంగా వున్న శ్రీకాకుళం నుంచి కర్నూలు జిల్లావరకు వున్న ప్రాంతంలో 1952లో జరిగిన ఎన్నికలను, తొలి తెలుగు ప్రాంతీయ పార్టీ, తెలుగుదేశం పార్టీ  పోటీ చేసిన 1983 ఎన్నికలను  చరిత్రను మలుపు తిప్పిన ఎన్నికలుగా పేర్కొంటూ వుంటారు.          
గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
పార్టీ మార్పిడి కూడా లాటరీ వంటిదే. కొందరికి లాభం. కొందరికి ఖేదం.
అయినా అర్ధం కానిది ఒకటే.   
రాజకీయుల్లో ఎవరిని కదిలించినా గెలుపు తధ్యం అంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే సిద్ధమైపోయారని చెబుతారు. ఇంతాచేసి, తమమీద తమకే నమ్మకం లేనట్టు చొక్కాలు మార్చినట్టు  పార్టీలు మారుతుంటారు.
ఏవిటో అంతా వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.




ముక్తాయింపు :       
ప్రధాన రాజకీయ పార్టీల కార్యాలయాల్లో తరచుగా వినబడుతున్న మాట:
"ఈరోజు ప్లస్సెంత ? మైనస్ యెంత?" (03-07-2015)
రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com మొబైల్: 98491 30595

NOTE: Courtesy Image Owner  

2, జులై 2015, గురువారం

ఆత్మ విశ్వాసం


ఏకాంబరరానికి దిక్కు తోచడం లేదు. వున్నదంతా వ్యాపారంలో పెట్టాడు. కాలం కలిసిరాలేదు. లాభాలమాట దేవుడెరుగు, పెట్టిన పెట్టుబళ్ళు కూడా  వెనక్కి రాలేదు. పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయాడు. ఫోను మోగితే అప్పులవాళ్లేమో అని భయం. తలుపు తడితే తీయడానికి సంకోచం, అప్పిచ్చిన వాళ్లు ఏకంగా ఇంటి మీదికే వచ్చేరేమో అని. ఒక్కోసారి ఆర్ధిక  ఇబ్బందులు తట్టుకోలేక ఆత్మహత్య ఆలోచన కూడా మదిలో మెదిలేది.
దిక్కు తోచని ఏకాంబరం ఓ రోజు మధ్యాన్నం నిర్మానుష్యంగా పార్కుకు వెళ్ళి ఓ బెంచీ మీద కూర్చుని దిక్కులు చూస్తున్నాడు. ఇంతలో ఓ వృద్ధుడు అతడి వద్దకు వచ్చాడు. మొహం చూస్తే ఎక్కడో చూసిన మొహమే అనిపించేలా వుంది.  సూటూ బూటూ డబ్బున్న వాడి మాదిరిగానే కనిపించాడు. ఆ వచ్చిన వాడు తనని తాను పరిచయం చేసుకున్నాడు. అసలే సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఏకాంబరానికి అతడెవరో తెలియగానే మతి పోయింది. ఆ వృద్ధుడు ఆ వూర్లోనే కాదు, ఆ ప్రాంతంలోనే అత్యంత ధనికుడు. దేశ విదేశాల్లో అనేక వ్యాపారాలు వున్నాయి. అతడిలా అన్నాడు.
'చూడండి. మీరేదో ఇబ్బందుల్లో వున్నట్టున్నారు. ఆర్ధిక సమస్య అయితే నాకు ఒదిలేయండి' అంటూ మాట్లాడుతూనే జేబులోనుంచి చెక్కు పుస్తకం తీసి చెక్కుపై సంతకం చేసి ఇచ్చాడు. ఇచ్చి చెప్పాడు. 'సరిగ్గా ఏడాది తరువాత ఇదే పార్కులో కలుద్దాం. వడ్డీ అవసరం లేదు కాని అసలు మాత్రం ఇవ్వండి చాలు'
చెక్కు చేతిలో పెట్టి అతడు గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
తీసి చూస్తే పాతిక లక్షలకు రాసిన చెక్కు అది. అప్పులు తీర్చగా  ఇంకా కొంత మిగులుతుంది కూడా. ఏదయితేనేం భగవంతుడు,  వృద్ధుడి రూపంలో వచ్చి  తనకో దారి చూపించాడు.
ఇంటికి వెడుతూ ఆ చెక్కును బ్యాంకులో డిపాజిట్ చేద్దామని అనుకున్నాడు. ఇంతలో అతడికి మరో ఆలోచన వచ్చింది. పాతిక లక్షల చెక్కు. అదీ దేశంలో కెల్లా అత్యంత ధనవంతుడు ఇచ్చిన చెక్కు. అది తన జేబులో వుంది. ఇక దేనికీ భయపడాల్సిన పనిలేదు. ముందు వ్యాపారవ్యవహారాలు చక్కదిద్దాలి. ఎటొచ్చి ఎటు పోయినా రామబాణం వంటి చెక్కు తన దగ్గరే  వుంది.


ఆ వూహ అతడిలో ఆత్మ విశ్వాసం నింపింది. ఇక ఆ రోజు నుంచి అతడి తరహా తీరు పూర్తిగా  మారిపోయాయి. చెక్కు ఇచ్చిన ఆత్మ బలంతో అతడు ముందుకు అడుగులు వేసాడు. వెనుకటి ఆత్మన్యూనతా భావం మచ్చుకు కూడా కానరాకుండా పోయింది. ఆత్మవిశ్వాసంతో సాగించిన  అతడి వ్యాపారానికి కూడా తిరుగు లేకుండా పోయింది. లాభాలు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయి. చేసిన అప్పులన్నీ వడ్డీతో సహా తీర్చాడు.
చూస్తుండగానే ఏడాది గిర్రున తిరిగింది. వృద్ధుడికి ఇచ్చిన మాట ప్రకారం ఆ చెక్కు తీసుకుని అదే పార్కుకు వెళ్ళి అదే బెంచీ మీద కూర్చుని ఎదురుచూడ్డం మొదలు పెట్టాడు. అనుకున్నట్టే వృద్ధుడు వచ్చాడు. 'మిత్రమా యెలా వున్నావు? కులాసాయేనా'  అని కుశల ప్రశ్నలు వేసాడు. 'మీ దయవల్ల బాగున్నాను. పోతే, మీ చెక్కు ఉపయోగించుకునే అవసరం పడలేదు' అంటూ చెక్కు అతడి చేతిలో పెట్టి దణ్ణం పెట్టాడు ఏకాంబరం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఇద్దరు మగ నర్సులు వచ్చారు. 'ఇక్కడ వున్నావా మహా ప్రభూ! నీకోసం ఆసుపత్రి అంతా వెతుకుతున్నాం' అంటూ  ఏకాంబరం వైపు చూసి చెప్పారు. 'నేను పలానా పలానా. గొప్ప ధనికుడ్ని. డబ్బేమన్నా కావాలా అని అడిగాడా! అడిగేవుంటాడు. అతడికి ఇది మామూలే. ఎందుకంటే  ఇది మామూలు పిచ్చి కాదు' అంటూ ఆ వృద్ధుడిని బలవంతాన తీసుకుపోయారు.
ఏకాంబరం నివ్వెరపోయాడు. ఎంతో ధనికుడు అనుకున్న ఇతడు పిచ్చివాడా. అతడిచ్చింది చెల్లని చెక్కా!'
కానీ ఆ తరువాత ఆలోచిస్తే ఆ పిచ్చివాడి రూపంలో అతడికో జీవిత సత్యం బోధపడింది.
ఆ చెక్కు వుందన్న భరోసాతో అతడు వ్యాపారంలో ముందుకు సాగాడు. 'అవసరం అయినప్పుడు అదే ఆదుకుంటుంది' అన్న 'నమ్మకం' అతడ్ని ముందుకు నడిపించింది. ఆ ఆత్మ విశ్వాసం ఎంతో కలిసివచ్చింది. పట్టింది బంగారం అయ్యింది. అప్పుడే ఆ చెక్కు బ్యాంకులో వేసి వుంటే అసలు విషయం తెలిసిపోయేది. కధ అక్కడే పూర్తిగా ఆగిపోయేది.
భగవంతుడు కూడా అలాటి భరోసానే. ప్రతిదానికీ దేవుడ్ని వాడుకోవాలని చూడకుండా ఆయన మన వెంటే వున్నాడనే నమ్మకంతో ముందుకు వెడితే అంతా బాగుంటుంది. మనిషి కృషికి దేవుడు అనబడే ఓ కానరాని అదృశ్య శక్తి అండ ఎప్పుడూ  వుంటుంది.
(ఓ ఇంగ్లీష్ గల్పిక ఆధారంగా)
NOTE : Courtesy Image Owner

దొందూదొందే


కొత్తగా పెళ్ళయిన వధూవరులను పల్లకిలో తీసుకువెడుతున్నారు. దారిలో పూతపూసిన చింత చెట్టు కనిపించింది.
'చింత చెత్తు పూత పూసింది' అన్నది పెళ్ళికూతురు.
ఆమెకు 'ట' పలకదు.
'పూతే కాలం వస్తే పూస్తుంది కదా!' అన్నాడు పెళ్ళికొడుకు. అతడికి 'చ' పలకదు.
ఈ ఇద్దరి మాటలు వింటూ అన్నాడు పల్లకి బోయీల్లో ఒకడు.

'దొందూదొందే కొందప్పా!'
అతగాడికి 'డ' పలకదు.  



NOTE: Courtesy Image Owner