భాట్టం శ్రీరామమూర్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
భాట్టం శ్రీరామమూర్తి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

9, జనవరి 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (61) - భండారు శ్రీనివాసరావు

 

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.

అంటే వెలుగు జిలుగుల ప్రభలు విరజిమ్మిన రేడియో  విలేకరిగా నా వృత్తి  జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే!

మళ్ళీ ఈ పదేళ్ళలో  స్వర్ణ యుగం, అంజయ్య గారు ముఖ్యమంత్రిగా వున్న పద్దెనిమిది నెలల కాలం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఆయన ముఖ్యమంత్రిగా అధికారంలో వున్నది ఏడాది మీద 136 రోజులు. ఆయనకు ముందు దాదాపు రెండున్నర సంవత్సరాలు దుర్నిరీక్షంగా పరిపాలన సాగించిన మర్రి చెన్నారెడ్డి గారి స్థానంలో కాంగ్రెస్ అధిష్టానం, ఆరణాల కూలీగా ప్రసిద్ధి చెందిన టంగుటూరి అంజయ్యను ముఖ్యమంత్రిగా నియమించింది. రాష్ట్రానికి చెందిన అతిరథమహారధులైన కాంగ్రెస్ నాయకులను పక్కనబెట్టి అంజయ్యను ఎంపిక చేయడం అందర్నీ ఆశ్చర్యపరచింది.

రేడియో విలేకరిగా చాలామంది రాజకీయ నాయకులు పరిచయం అవుతూ వుంటారు. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. అందులో కొంతమంది మాత్రమే మనల్ని  గుర్తు పెట్టుకుంటారు. మనకి  గుర్తుంటారు. వారిలో ప్రథముడు శ్రీ అంజయ్య. నాకే కాదు, హైదరాబాదులో విలేకరులు అందరికి ఆయన ఆప్తుడు. పేరు పెట్టి విలేకరులను పలకరించే భేషజాలు తెలియని రాజకీయ నాయకుడు. కార్మిక శాఖ మంత్రిగా ఉన్నప్పటి నుంచి తెలుసు. వెంగళరావు మంత్రివర్గంలో పనిచేసిన మండలి వెంకట కృష్ణారావు గారు, భాట్టం శ్రీరామ మూర్తి గారు, కేవీ కేశవులు గారు, హయగ్రీవాచారి గారు  ఇదే కోవలోకి వస్తారు. వార్తలు లేని రోజుల్లో వీరిలో ఎవరి దగ్గరకు వెళ్ళినా ఏదో వార్త చెప్పకుండా పంపరు. తినడానికి ఏదో పెట్టకుండా వదలరు. వీరిలో భాట్టం గారు, హయగ్రీవాచారి గారు ఇంటి నుంచి చిట్టి గారెలు, పులిహోర  వంటివి వండించి సచివాలయంలో విలేకరులను పిలిచి సంతర్పణ చేసేవారు. వీరిని గురించి కొంత చెప్పుకోవాలి.

తానమ్మిన సత్యాన్నే బోధించిన ధీశాలి, బోధించిన సత్యాన్నే పాటించిన వ్రతశీలి' అనే దానికి నిలువెత్తు నిర్వచనం శ్రీ భాట్టం శ్రీరామమూర్తి. నిండు జీవితం గడిపి, గడిపిన జీవితానికి చరితార్ధత కల్పించిన ధన్యజీవి. జయప్రకాష్ నారాయణ్, రాంమనోహర్ లోహియా వంటి అగ్రనేతలకు సన్నిహితుడిగా మెలిగిన ఈ పాత తరం   వృద్ధ రాజకీయవేత్త, మారిన రాజకీయాన్ని, మారిన విలువలను  కళ్ళారా చూసి, తాను మాత్రం మారకుండా   తన ఎనభయ్ తొమ్మిదో ఏట విశాఖపట్నంలో  కన్ను మూశారు. 1926 లో ధర్మవరం గ్రామంలో, ఒక సాధారణ బ్రాహ్మణ కుటుంబంలో, నన్నయ పంతులు, తరుణమ్మల సంతానంగా   జన్మించిన భాట్టం శ్రీరామమూర్తి,  స్వయం కృషితో ఎదిగి  ఇరవై ఏళ్లకు పైగా శాసన సభ్యుడిగా పనిచేశారు. 1957లో జరిగిన విజయనగరం అసెంబ్లీ  ఉపఎన్నికలో శ్రీ భాట్టం శ్రీరామమూర్తి, సోషలిష్టు పార్టీ అభ్యర్ధిగా ఏకగ్రీవంగా ఎన్నికయి తొలిసారి శాసన సభలో అడుగుపెట్టారు. అంతకుముందు ఎమ్మెల్యేగా వున్న శ్రీ పీవీజీ రాజు లోకసభకు ఎన్నిక కావడంతో ఈ ఉప ఎన్నిక అవసరం అయింది. ఆ తరువాత 1962 లో జరిగిన ఎన్నికల్లో కూడా భాట్టం అదే నియోజక వర్గంనుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీచేసి  అసెంబ్లీకి రెండో పర్యాయం ఎన్నికయ్యారు. తరువాత విశాఖ జిల్లా పరవాడ నియోజకవర్గం నుంచి వరసగా రెండు సార్లు (1972, 1978)కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు.  ఎనిమిదేళ్ళు మంత్రిగా, ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా వున్నారు. శ్రీ పీవీ నరసింహారావు, శ్రీ జలగం వెంగళరావు, శ్రీ మర్రి చెన్నారెడ్డి, శ్రీ అంజయ్య మంత్రివర్గాల్లో శ్రీరామమూర్తి కీలకమైన వివిధ శాఖలు నిర్వహించారు. రెండు ప్రపంచ తెలుగు మహాసభలు ఆయన సారధ్యంలోనే జరిగాయి. కౌలాలంపూర్ లో నిర్వహించిన ప్రపంచ సభలకు నాటి విద్యాశాఖ మంత్రి శ్రీ మండలి వెంకట కృష్ణారావు కారణాంతరాలవల్ల వెళ్ళలేక పోవడంతో సాంస్కృతిక శాఖ మంత్రిగా వున్న శ్రీ భాట్టం ఆ సభల్లో కీలక ప్రసంగాలు చేసి సభికులను తన అసాధారణ వక్తృత్వ ప్రతిభతో ఆకట్టుకున్నారు. పీవీ మంత్రివర్గంలో వున్న ఈ ఇద్దరు మంత్రుల్ని 'జంట కవులు' అని పిలిచేవాళ్ళు. తరువాత వెంగళరావు ముఖ్యమంత్రి అయినప్పుడు వీరి శాఖల్ని మార్చి ఒకరిది మరొకరికి కట్టబెట్టారు. 'జలగం గారు  మాకు కుండ మార్పిడి చేశారు' అనేవారు శ్రీరామ మూర్తిగారు హాస్యోక్తిగా.    

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. శ్రీ భాట్టం శ్రీరామమూర్తి వ్యక్తిత్వం నచ్చిన నాటి టీడీపీ అధ్యక్షుడు శ్రీ ఎన్టీ రామారావు, ఆయన్ని తమ పార్టీలోకి ఆహ్వానించారు. 1984లో టీడీపీ టిక్కెట్టు మీద శ్రీ శ్రీరామమూర్తి, విశాఖ నియోజకవర్గం నుంచి  తొలిసారి లోకసభకు ఎన్నికయి పార్లమెంటులో తన స్వరం వినిపించారు.  

 

 

రాజకీయ జీవితంలో డబ్బుకు దూరంగా, ప్రజలకు దగ్గరగా గడిపిన చరిత్ర శ్రీ శ్రీరామమూర్తిది. రాజకీయ శత్రువులు సయితం ఆయన నిజాయితీని శంకించలేని స్తితి.  హోదాలు కోరుకోలేదు. ఆస్తులు కూడబెట్టలేదు. విశాఖపట్నంలో ఏ చిన్న ఇంట్లో వున్నారో, జీవిత చరమాంకం వరకు అదే ఇంట్లో గడిపారు.    మంత్రిగా వున్నప్పుడు అత్యంత నిరాడంబరంగా కుమారుడు విద్యాసాగర్  పెళ్లి చేశారు. ఆ పెళ్ళికి శుభలేఖలు కూడా అచ్చు వేయించలేదు. తన కుటుంబసభ్యులను తీసుకుని ఒక ప్రైవేటు వాహనంలో పెళ్ళికి వెళ్ళి వచ్చారు. డాబూ దర్పాలూ లేవు, వందిమాగధులూ లేరు. అదీ భాట్టం శ్రీరామమూర్తి గారు  పాటించిన జీవన విధానం.

తాను నమ్మింది ఆచరించి చూపడం అన్నది శ్రీరామ మూర్తి గారు తన పెళ్ళిలో కూడా ప్రదర్శించి చూపారు. ఆయనది కులాంతర వివాహం. మద్దూరి అన్నపూర్ణయ్య గారి పౌరోహిత్యంలో శ్రీమతి సత్యవతితో జరిగిన ఆ పెండ్లితంతుకయిన ఖర్చు కేవలం పదిహేను రూపాయలు.          

 ఒక పర్యాయం లోకసభ సభ్యుడిగా పనిచేసిన తరువాత మరో సారి శ్రీ రామారావు విశాఖ నుంచి రెండో మారు పోటీ చేయాలని  శ్రీ శ్రీరామ మూర్తిని  కోరారు. కానీ ఎప్పుడో ఒకప్పుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని అనుకున్న శ్రీ భాట్టం, రామారావుగారి కోరికను సున్నితంగా తిరస్కరించారు. అప్పటినుంచీ ఆయన క్రియాశీలక రాజకీయాలకు దూరంగా, ఆధ్యాత్మిక వ్యవహారాలకు దగ్గరగా  వుంటూ వచ్చారు. ఏళ్ళు మీద పడి, కాళ్ళూ చేతులూ సరిగా ఆడని వాళ్లు కూడా పదవులకోసం వెంపర్లాడుతున్న ఈ రోజుల్లో భాట్టం వంటి వారిని ఊహించుకోవడం కూడా కష్టం. అంతేకాదు, అయన తన కుటుంబ సభ్యులనెవ్వరినీ రాజకీయాల్లో ప్రోత్సహించలేదు. తన టిక్కెట్టు తన భార్యకు ఇమ్మని కూడా దేబిరించలేదు. ఆ పుణ్యాత్మురాలు సత్యవతి గారు కూడా భర్తకు తగ్గ భార్య. ఆయన ఆలోచనలకు తగ్గట్టుగా, ఆశయాలకు తగినట్టుగా ఆయన వెంట నడిచారు.

భాట్టం శ్రీరామ మూర్తి గారు  మిత్రుల కోరికపై తన ఆత్మ కధ రాశారు. దానికి అయన పెట్టుకున్న పేరు 'స్వేచ్చాభారతం'.  సాధారణంగా రాజకీయ నాయకులు రాసే ఆత్మ కధల్లో 'ఆత్మ స్తుతి పరనింద' తొణికిసలాడతాయి. కానీ భాట్టం తరహానే వేరు. ఆయన అన్ని విషయాలు చాలా నిక్కచ్చిగా రాసుకున్నారు.

చివర్లో తనకు తానే 'తుది పలుకులు' కూడా  రాసుకున్నారు.

'కోహం (నేనెవర్ని) అంటూ పుట్టావు. సోహం (నేనే నువ్వు అంటే భగవంతుడు)  అంటూ ఆ ఎరుకతో మరణించు. పుట్టిన చోటు చేరడానికి  ఏడుపెందుకు?'      

శ్రీ భాట్టం శ్రీరామ మూర్తికి ఒకనాటి రాజకీయ సహచరుడు, ముఖ్యమైన స్నేహితుడు కీర్తిశేషులు మండలి వెంకట కృష్ణారావు. అయన కుమారుడు  శ్రీ మండలి బుద్ధ ప్రసాద్  ఈ గ్రంధానికి 'ముందు మాట' రాశారు. మహాకవి,  సంస్కృత పండితుడు భవభూతి సూక్తిని శ్రీ బుద్ధ ప్రసాద్ అందులో ఉటంకించారు.

'కాలో హ్యయం నిరవధి:, విపులాచ పృధ్వీ'. విశాలమైన విశ్వంలో, అనంతమైన కాలంలో అసంఖ్యాక ప్రజానీకం పుడుతూ వుంటుంది. గిడుతూ వుంటుంది. వాళ్ళంతా ఎవరికి తెలుసు ? కొద్ది మంది పేర్లే మనం తలచుకుంటూ వుంటాం.'

ఆ కొద్దిమందిలో ఒకరు శ్రీ భాట్టం శ్రీరామ మూర్తి. 

కింది ఫోటో:



(నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి విశాఖ వచ్చిన సందర్భంలో ఆ నాటి ముఖ్యమంత్రి  కాసు బ్రహ్మానందరెడ్డితో భాట్టం శ్రీరామ మూర్తి)

 

(ఇంకావుంది)  

9, జులై 2015, గురువారం

భాట్టం శ్రీరామమూర్తి, మరికొన్ని జ్ఞాపకాలు

  
అప్పుడు ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి. ఒకసారి శాసనసభలో  ఇలా అన్నారు. 'ఈ శ్రీరామమూర్తి ఏదో సభలో మాట్లాడుతూ నన్ను రావణాసురుడితో పోల్చాడు. ఇదేమన్నా బాగుందా శ్రీరామ్మూర్తీ'.
భాట్టం  లేచి 'పాయింట్ ఆఫ్ పర్సనల్ క్లారిఫికేషన్'  లేవనెత్తారు. 'శతకోటి రుద్రాభిషేకాలు భక్తి ప్రపత్తులతో చేసే రావణబ్రహ్మతో ఈ సంజీవరెడ్డిని పోల్చేటంత తప్పిదం నేను  చేస్తానా' అనగానే అందరూ గొల్లున నవ్వారు.


(కీర్తిశేషులు భాట్టం శ్రీరామ్మూర్తి  1926 - 2015)

ఒకసారి కుసుమ గజపతి రాజు మాట్లాడుతూ 'నిజాం షుగర్ ఫాక్టరీ షేర్ విలువ పడిపోయింది మంత్రుల మార్కెట్ విలువ పడిపోయినట్టు' అంటూ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి  సంజీవరెడ్డికి విపరీతమైన కోపం వచ్చింది. 'ఈ రాజు (రాణి) సమావేశాలకు సరిగ్గారారు.  ఎప్పుడో ఓసారి వస్తారు. వచ్చి ఏదేదో మాట్లాడతారు. మగవాళ్ళు అయితే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతారు కాని, కాని ఆడ మనిషి కూడా..' అంటూ ఏదో అనబోయారు. భాట్టం లేచి అడ్డుతగిలారు. ఈ మాట వెనక్కి తీసుకోవాలన్నారు.  స్పీకర్ సీఎం వైపు చూసారు. వారు లేవలేదు. అప్పుడు స్పీకర్,  'నేనూ అలాగే అనుకుంటూ వుంటాను మగవాళ్ళు అప్పుడప్పుడూ పిచ్చిగా వ్యవహరిస్తూ వుంటారని' అన్నారు. భాట్టం వెంటనే లేచి చెప్పారు. 'అవును నేనూ మీలాగే! మగవాళ్లు పిచ్చిగా మాట్లాడుతారని ఇప్పుడే గ్రహించగలిగాను.'  సభ ఒక్కసారిగా గొల్లుమంది. కళా వెంకటరావు లేచాడు. ఆయన సామాన్యుడు కాదు. తిప్పికొట్టారు. 'అటువంటి మగవాళ్ళు అందరికీ శ్రీరామమూర్తి ఏకైక ప్రతినిధా అన్నట్టు యెందుకు ఇంతగా ఉలిక్కి పడి లేస్తున్నాడు' అంటూ. భాట్టం నోరు మూతపడింది.
భాట్టం చెప్పిన చిమటా సాంబు కధ
అప్పుడు భాట్టం లోకసభలో టీడీపీ సభ్యుడిగా వున్నారు, బోఫార్స్ వ్యవహారం పార్లమెంటును కుదిపేస్తున్న రోజులు. వరస వాయిదాలతో లోకసభ సమావేశాలు పేరుకు మాత్రమే సాగుతున్నాయి. 'గల్లీ గల్లీ మే హోర్ హై. రాజీవ్ గాంధీ చోర్ హై' అనే నినాదాలు సభలో మిన్నంటుతున్నాయి. ముఖ్యంగా సీపీఎం సభ్యుల సంగతి చెప్పక్కరలేదు. సభ వాయిదా వేసేవరకు ఒకటే అరుపులు కేకలు. పాలకపక్షం ఇది పనికాదనుకుని  సభ వాయిదా వేయకుండా కార్యక్రమాలు కొనసాగించాలని నిర్ణయించింది. 'ప్రశ్నలు అన్నీ అడిగినట్టే, జవాబులన్నీ చెప్పినట్టే భావించాల'ని స్పీకర్ అంటున్నారు. టీడీపీ సభ్యుడు చిమటా సాంబు ఒక్కసారిగా లేచి వెళ్ళి మంత్రి చిదంబరం చేతిలో వున్న కాగితం లాగాడు. అది చినిగిపోయింది. ఏదో కొట్లాట జరుగుతోందని అంతా చూస్తున్నారు. ఇంతలో ఎవరో గట్టిగా సాంబుతో అన్నారు. 'ఎవరో కొడుతున్నారు అని గట్టిగా  అరిచి కిందపడిపొమ్మ'ని. అన్నట్టే సాంబు కిందపడ్డాడు. 'అమ్మో చంపేశారు మా వాడ్ని' అంటూ మరొకరెవ్వరో గావుకేక పెట్టారు. ఒకరు చేయి పట్టుకుని నాడి  చూస్తుంటే, మరొకరు మొహం మీద నీళ్ళు చల్లుతున్నారు. ఈలోగా డాక్టరు, స్ట్రెచర్  సిద్ధం. 'ఇంజెక్షన్ చేస్తారేమో' అని  సాంబు భయం. 'అదేం లేదు కళ్ళు మూసుకుని పడుకో' మరొకరి ఆదేశం. సాంబుని స్ట్రెచర్ పై తీసుకుని వెళ్లారు. మర్నాడు జాతీయ పత్రికలు అన్నింటిలో ఇదే ప్రధాన వార్త. సాంబు ఒక్కసారిగా హీరో అయిపోయాడు. పార్లమెంటులో పార్టీ కీర్తి ప్రతిష్ట ఇనుమడింపచేసిన సాంబుకి  ఏదో చేయాలని టీడీపీ అధినాయకులు నిర్ణయించారు. సాంబు కోరుకున్నట్టు పౌర విమాన యాన శాఖ సంప్రదింపుల కమిటీలో సభ్యుడిని చేశారు. అలా  అయితే ఉచితంగా అనేక దేశాలు చుట్టి రావచ్చన్నది సాంబు ఆలోచన. పార్టీ నాయకత్వం అనుగ్రహించింది. ఆశీర్వదించింది.
చేజారిన పీయేపీ పదవి
భాట్టం విశాఖలో వుండగా ముఖ్యమంత్రి ఎన్టీఆర్  కబురు పెట్టారు, ఢిల్లీ వెళ్ళే ముందు హైదరాబాదు వచ్చి కలిసి వెళ్ళమని. భాట్టం ఆయన ఇంటికి వెళ్ళి కలిసారు. ఎన్టీఆర్  అప్పుడు  విద్యాశాఖ మంత్రి  కోటేశ్వర రావుతో మాట్లాడుతున్నారు. బయట చంద్రబాబు నాయుడు  కూర్చుని ఏదో రాసుకుంటూ, చదువుకుంటూ వున్నారు. మంత్రి వెళ్ళిపోయిన  తరువాత ఎన్టీఆర్, భాట్టంతో  అన్నారు. 'లోకసభలో పీయేపీచైర్మన్  గా మిమ్మల్ని  నామినేట్ చేస్తున్నాం. బాగా పనిచేసి పార్టీకి మంచి పేరు తెండి' అని భుజం తట్టారు.  భాట్టం మనసులో అనుమానం. ఉపేంద్ర ఇది జరగనిస్తాడా. అదే పైకి అన్నారు.ఎన్టీఆర్  చిరాకు పడ్డారు. చంద్రబాబును పిలిచారు. వెంటనే ఫోను చేసి ఉపెంద్రతో చెప్పండి, భాట్టం గారే  చైర్మన్ అని. బాబుకు ఉపేంద్ర ఫోనులో దొరకలేదు. 'అన్నగారు చెప్పిన పని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళి రండి' అంటూ బాబు షేక్ హాండ్ ఇచ్చారు.  భాట్టం ఢిల్లీ చేరుకునేసరికి అక్కడ సీను మారింది. ఉపేంద్ర మాధవరెడ్డితో మాట్లాడి, 'మాకు  (టీడీపీకి) పీయేపీ చైర్మన్ అక్కరలేదు, సీపీఎం సభ్యుడికి  ఇవ్వండి' అని స్పీకర్ కు ఉత్తరం రాశారు.  భాట్టం ఆరాత్రి ఎన్టీఆర్ కి ఫోను చేసి విషయం వివరించారు. 'అనుకున్నంత పనీ చేసాడా. చూస్తాను యెందుకు చెయ్యడో... మీరే చైర్మన్' అంటూ టేబుల్ మీద చరిచారు. ఎన్టీఆర్'  అంటూ భాట్టం తన జీవిత చరిత్రలో రాసుకున్నారు. ఎన్టీఆర్  తెల్లవారు ఝామునే నిద్ర లేస్తారు. భాట్టం ఢిల్లీ నుంచి మళ్ళీ మరునాడు ఉదయమే ఫోను చేశారు. ఈసారి ఎన్టీఆర్ మాటలో తేడా. 'చూడండి శ్రీరామమూర్తి గారు, ఇందులో చాలా పెద్ద జాతీయ విధానాలు ఇమిడి వున్నాయి'  ఈసారి సర్దుకు పొండి అన్నట్టు మాట్లాడారు.  అనుకున్నట్టే పీఏపీ పదవి అందినట్టే అంది భాట్టం చేజారి సీపీఎం సభ్యుడిని వరించింది. ఈ సంఘటనతో భాట్టంకు రాజకీయాల పట్ల విరక్తి కలిగింది. తదుపరి ఎన్నికల్లో పార్టీ లోకసభ టిక్కెట్టు  ఇస్తానన్నా అయన ఒప్పుకోలేదు.
కాంగ్రెస్ అధినాయకత్వంపై ఇందిరాగాంధీ తిరుగుబాటు దరిమిలా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ చీలిపోయింది. అప్పుడు రాష్ట్రంలో జలగం వెంగల రావు ముఖ్యమంత్రి. ఆయన సంస్థా కాంగ్రెస్ లోనే వుండిపోయారు. ఆయన  మంత్రివర్గంలో అనేకమంది రాజీనామా చేసి ఇందిరా కాంగ్రెస్ లో చేరిపోయారు. జీ రాజారాం, మాణిక్య రావు, లుకలాపు లక్ష్మణ దాసు రాజీనామా చేసినవారిలో వున్నారు.
టియ్యే బిల్లు తెచ్చిన చిక్కు
భాట్టం మంత్రిగా వున్నప్పుడు విశాఖ నుంచి హైదరాబాదు మకాం మార్చినప్పుడు,  దొంగ బిల్లు పెట్టి డబ్బులు డ్రా చేసారని రాజకీయ ప్రత్యర్ధులు దుమారం లేపారు. అదెంత మొత్తం అరువందల చిల్లర. ఆ పిర్యాదు ఢిల్లీ వరకు వెళ్ళింది. తరువాత కేంద్రం నియమించిన విమదలాల్ కమీషన్ కూడా విచారణ జరిపిండి. భాట్టం అధిక మొత్తం  క్లెయిం చేయకపోగా,  తన సొమ్మే కొంత అదనంగా  కోల్పోయాడని కమీషన్ తేల్చి చెప్పింది.
మర్రి చెన్నారెడ్డి మొదటిసారి ముఖ్యమంత్రి కాగానే కాంగ్రెస్ ఎస్ నుంచి ఇందిరా కాంగ్రెస్ కు వలసలు మొదలయ్యాయి. ఎన్నికలు ముగియగానే పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఆయన వైపు మళ్లిపోతున్నారు. అసెంబ్లీలో భాట్టం అన్నారు. 'చెన్నారెడ్డి గారి ఆకర్షణ శక్తి అమోఘం. ఎన్నికల్లో గెలిచిన వాళ్లు జమాఖర్చులు కూడా ఇంకా దాఖలు చేయలేదు. దానికి ముందే పరకాయ ప్రవేశాలా. ఈ తంతు చూస్తూ వుంటే మంగళ సూత్రాలతో, మధు పర్కాలతో పెళ్లి పీటల మీదనుంచి లేచిపోతున్నట్టుగా  వుంది'
ఈ వ్యాఖ్య సభలో దుమారం రగిలించింది. పార్టీ మారిన వాళ్ళలో మహిళా సభ్యులు కూడా వున్నారు. లేచిపోవడం అనే పదానికి అభ్యంతరం తెలిపారు. అది సభలో వాడతగ్గ పదమా కాదా అన్న దానిపై విస్తృతంగా చర్చ జరిగింది.
తోకతపా:
పార్టీ మార్పిళ్ళపై ఇంతటి ఘాటు వ్యాఖ్య చేసిన  భాట్టం శ్రీరామ్మూర్తి కూడా కాంగ్రెస్ లో చేరిపోయారు.