19, మే 2014, సోమవారం

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు'

'జ్యోతి కార్టూనిస్ట్ శేఖర్ ఇక లేడు' అంటూ ఆయన సోదరుడు  కృష్ణ పంపిన ఎస్ ఎం ఎస్ తో ఈరోజు మొదలయింది. కానీ ఆయన సుస్తీగా వున్నప్పుడు 'బాపూ' గారు ఆయనకు రాసిన ఉత్తరం చదివిన తరువాత శేఖర్ గారికి మరణం లేదనిపించింది.సాక్షాత్తు  'బాపూ' గారే, శేఖర్ గారికి  'వీరాభిమానిని' అని చెప్పుకోవడమే కాదు,  అక్షరాలా రాసిచ్చిన తరువాత శేఖర్ గారికి నిజంగా మరణం లేదు. ఆయన ఎప్పటికీ చిరంజీవే. సందేహం లేదు.



18, మే 2014, ఆదివారం

సోషల్ మీడియా కోతుల కొత్త నీతులు


(Image courtesy Owner)




17, మే 2014, శనివారం

ఇక భయం లేదు


మోడీ గెలుస్తాడా ? రాహుల్ గెలుస్తాడా ?కేసీఆరా ! చంద్రబాబా! జగనా !
ఇవన్నీ నిన్నటి మాటలు. ఇవాళ ఫలితాలు తేలిపోయాయి. ఇక ఆ చర్చ అనవసరం.
ఓటరుగా మన బాధ్యత మనం పూర్తిచేశాం. ప్రభుత్వాలు ఏర్పడతాయి. పాలకులు కొలువు తీరుతారు. వాళ్లు మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చారా సరే. లేకుంటే, వాళ్ల దగ్గర లేని ఆయుధం,   అయిదేళ్ళ తరువాత మన దగ్గర మాత్రమే వుండే 'ఓటు'  అనే ఆయుధం మనదగ్గరే వుంటుంది. బెంగ  పడాల్సిన పని లేదు.


ఈసారి మనం తెలిసో తెలియకో తెలివిగా ఒక మంచి పని చేశాం. అటు కేంద్రంలో, ఇటు తెలంగాణలో, మరో పక్క సీమాంధ్రలొ ఒకే పార్టీకి ప్రభుత్వం సొంతంగా ఏర్పాటు చేసుకునే సౌలభ్యం ఇచ్చాం. వెనుకటి మాదిరిగా సంకీర్ణాలకి చోటివ్వలేదు. ఎన్నికల ప్రణాళికలో అన్ని పార్టీలు అలవికాని వాగ్దానాలు చేసుకుంటూ పోయాయి. సంకీర్ణ ధర్మం ప్రకారం అమలు చేయలేకపోయాం అని ఇన్నాళ్ళు కుంటి సాకులు చెబుతూ వచ్చాయి.
అది, ఇంకానా ఇకపై కుదరదు.
చెప్పిన మాట నిలబెట్టుకొకపోతే ఆయా పాలక పక్షాలను కాలరు పట్టి నిలదీసే మహత్తర అవకాశాన్ని మనమే కల్పించుకున్నాం.

ఇక భయం లేదు. మనకు మనమే ఒక రక్షరేఖ కల్పించున్నాం.           

జంప్ జిలానీలు - భండారు రామచంద్ర రావు


గోడ దూకితే గారెల గంపలో పడొచ్చు లేదా ముళ్ళకంపపై పడొచ్చు. ఏదైనా జరగొచ్చు.
ఇటీవల ముగిసిన ఎన్నికల్లో 'ఈ జంప్ జిలానీల'  గురించిన వివరాలతో శ్రీ భండారు రామచంద్రరావు ఏర్చికూర్చిన కధనాలు:


(శ్రీ భండారు రామచంద్రరావు)

చివరి నిమిషంలో గోడదూకి మటాష్ అయిన జంప్ జిలానీలు-
మైనంపల్లి హనుమంతరావు, జీ. వివేక్,  నోముల నరసింహయ్య, జైపాల్ యాదవ్, కవితా నాయక, టీ. జీ. వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, శిల్పా మోహన రెడ్డి, లబ్బి వెంకటస్వామి, శ్రీనివాసులు రెడ్డి, వరదరాజులరెడ్డి, మాగుంట శ్రీనివాసుల రెడి, బీ. విజయకుమార్, గల్లా అరుణ కుమారి, కొత్తపల్లి సుబ్బారాయుడు, వెల్లంపల్లి శ్రీనివాస్, కుతూహలమ్మ, కారుమూరి నాగేశ్వర రావు, దగ్గుబాటి పురంధేశ్వరి,


సీమాంధ్ర ప్రజాతీర్పు


"అధికారం 'చేతి' లో పెట్టుకుని ప్రజాభీష్టాన్ని తుంగలో తొక్కి గొడ్డలితో నరికినట్టు రాష్ట్రాన్ని రెండుగా చీల్చిన కాంగ్రెస్ పార్టీకి ఐ.పీ.సీ. (ఇండియన్ ప్రజాస్మృతి) 175/25 సెక్షన్  ప్రకారం జీవితకాలపు కఠినశిక్ష  విధించడమైనది.
ఒక దశలో రాష్ట్ర విభజనకు దోహదపడే ప్రకటన చేసిన వై.ఎస్.ఆర్.సీ.పీ. పార్టీకి, ఆ పార్టీ నాయకుడి చిన్న వయస్సును దృష్టిలో పెట్టుకుని  ప్రతిపక్షపాత్రకు పరిమితం చేస్తూ అయిదేళ్ళ శిక్ష విదించడం జరిగింది.
రెండు కళ్ళ సిద్ధాంతంతో ముందు కలవరపెట్టినా, అనాధగా మిగిలిపోయిన సీమాంధ్ర ప్రాంత అభివృద్ధికి అవసరమైన అనుభవం కలిగిన పార్టీగా తెలుగు దేశం పార్టీని గుర్తించి, ఆ పార్టీ  పాత తప్పిదాలను క్షమించి, నిర్దోషిగా భావించి విడుదల చేస్తూ ఆ ప్రాంతపు పాలనాధికారాన్ని అయిదేళ్లపాటు దఖలు చేయడం జరిగింది.
ఈ తీర్పుపై అప్పీలు చేసుకోవడానికి అయిదేళ్ళ వ్యవధానం ఇవ్వడం కూడా జరిగింది.


- సీమాంధ్ర ప్రజానీకం 

15, మే 2014, గురువారం

కాకతాళీయం


ప్రముఖ మానవతావాది, స్త్రీ జనోద్ధరణ ఉద్యమ నాయకురాలు శ్రీమతి మల్లాది సుబ్బమ్మ గారు మరణించినట్టు అమెరికా నుంచి ఇన్నయ్య గారు పెట్టిన పోస్ట్ చదువుతుంటే ఆకాశవాణి మాజీ ఎనౌన్సర్ శ్రీమతి రత్నప్రసాద్ ఫోన్ చేశారు. ఆవిడ పుట్టెడు దుఃఖంలో వుండి మాట్లాడుతున్నారు అనిపించింది. కేవలం రెండు నెలల తేడాలో భర్తను, అల్లుడిని పోగొట్టుకున్న బాధ నుంచి ఇంకా తేరుకోలేదు. మొదలు పెడుతూనే జాతస్య మరణం ధృవం అంటూ - 'ఎందరి గురించో రాస్తుంటావు, నేను పోతే నా గురించి కూడా రాయి బాబూ' అన్నారు. నాకేమనాలో తోచక అలా 'అనకండి ముందూ వెనుకగా అందరం పోవాల్సిన వాళ్ళమే. పోయేదాకా ఇంకా బతుకు వుంది అనే ఆశతో బతుకుతుంటాం.' అని వోదార్చే ప్రయత్నం చేసాను. ఇంతలో ఆవిడకు మరో ఫోను వచ్చినట్టుంది. మళ్ళీ చేస్తాను అని కాసేపట్లో మళ్ళీ ఫోను చేశారు. 'యెంత పనయిందో చూసావా శ్రీనివాసూ, మా వియ్యపురాలు సుబ్బమ్మ గారు పోయారు. ఇప్పుడే సమాచారం అందింది' అన్నారు. అంతకు ముందు ఆవిడ ఫోను మాట్లాడుతున్నప్పుడే నేను ఇన్నయ్య గారు పంపిన ఆ సమాచారమే చదువుతున్నాను. ఆ  సమయంలో చావు వార్త చెప్పడం ఎందుకని మిన్నకుండి పోయాను. నిజానికి మల్లాది  సుబ్బమ్మ గారు ఎవరో కాదు, రత్న ప్రసాదు గారి వియ్యపురాలే. ఆ సమయంలో ఈ విషయం నాకు స్పురణకు రాలేదు. యెంత కాకతాళీయం. నిజానికి మనిషి జీవితమే ఇటువంటి సంఘటనల సమాహారం.


(Smt. Malladi Subbamma garu)

దేవుడూ, ఆత్మలు అవీ నమ్మని మనిషి కాబట్టి సుబ్బమ్మ గారి విషయంలో -  'సుబ్బమ్మగారి ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలి' అనే షరా మామూలు సందేశాలు అవసరం పడవు.

ముందు కుక్క సంగతి చూద్దాం.


(కొల్లూరు సురేష్ బాబు గారు పోస్ట్ చేసిన ఇంగ్లీష్ గల్పికకు స్వేచ్చానువాదం)


ఏకాంబరం : " ఉదయం నుంచీ నా భార్య కనిపించడం లేదు"
ఇనస్పెక్టర్ : కొన్ని గుర్తులు చెప్పండి. ఆవిడ యెంత హైట్ వుంటారు?
ఏకాంబరం : "నేనెప్పుడు గమనించలేదు"
ఇనస్పెక్టర్ : "పోనీ లావా సన్నమా యెలా  వుంటారు/"
ఏకాంబరం : "అంత సన్నమేం కాదు, కొద్దిగా బొద్దుగా వుండొచ్చు"
ఇనస్పెక్టర్ :  "కళ్ళ రంగు?"
ఏకాంబరం :  "అంత శ్రద్ధగా ఎప్పుడూ గమనించలేదు"
ఇనస్పెక్టర్ :  "చివరి సారి చూసినప్పుడు ఏ దుస్తులతో వున్నారు, చీరె కట్టుకున్నారా, చుడీదారా?"
ఏకాంబరం : నైట్ డ్రెస్? నో నో ఇనస్పెక్టర్! సరిగా గుర్తుకు రావడం లేదు"
ఇనస్పెక్టర్ : పోనీ ఆవిడ వెంట ఎవరైనా వెళ్ళారా?
ఏకాంబరం : ఎప్పుడూ మా కుక్క రోమియో మా ఆవిడ వెంటే వుంటుంది. దాన్నే వెంటేసుకుని వెళ్ళి వుంటుంది. మా రోమియో అంటే గుర్తుకు వస్తోంది ఇనస్పెక్టర్ . దాని అందం దానిదే. తెల్లగా బొద్దుగా వుంటుంది. నిగనిగ లాడే జుట్టు. తేనె కళ్ళు. ఏడాది వయసు నిండలేదు కానీ ఇదిగో నా మోకాళ్ళ ఎత్తు పెరిగింది. గోళ్ళు వొంపు తిరిగి వుంటాయి. మాంసం లేకపోతే ముద్ద ముట్టదు అంటే నమ్మండి. ఎంతో ముచ్చటపడి బంగారు తాపడంతో గొలుసు కూడా  చేయించాము. అది కనబడకపోతే ఎలాగో వుంది ఇనస్పెక్టర్"

ఇనస్పెక్టర్ : ఓహో ! అలాగా! అయితే మేమిప్పుడు వెతకాల్సింది మీ కుక్కను."     
NOTE: Image Courtesy Cartoonist)