19, మార్చి 2014, బుధవారం

ఇప్పుడు - అప్పుడు


చూశారా! ఇటీవల రాష్ట్రపతి హైదరాబాదు వచ్చినప్పుడు స్థానిక జర్నలిస్టులను బొలారం లోని రాష్ట్రపతి నిలయంలో కలిశారు. జర్నలిస్టులకు వారికీ మధ్యవున్న 'వేరు బంధం' గమనించారా?



గతంలో నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ అదే భవనంలో విలేకరులను కలుసుకున్నారు. మేమందరం హాయిగా ఆయనతో కరచాలనం చేయగలిగాము.



అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా!

చంద్రబాబు నాయుడు గారు నవ్వుతారా?


ఇదేమీ టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపొతే నవ్వించాలి.
ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!


(చంద్రబాబునాయుడు ఆర్ధికమంత్రిగా వున్నప్పుడు మా వూరునుంచి మా అన్నయ్య కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు వచ్చి బాబుగారిని చూడాలంటే సచివాలయానికి తీసుకువెళ్ళాను. ఆ సమయంలో అక్కడ వున్న విలేకరులతో కలిపి తీసిన  ఫోటో. ఇందులో నేను లేకపోవడానికి కారణం ఫోటో తీసింది నేను కావడమే) 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పనిలో పనిగా 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న జూబిలీ  హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర  పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈలోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, సీఎం బయలుదేరి రావచ్చా అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని.
అవేమిటో చెప్పమని అడిగారు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.

చదువుకున్న వోటర్లకు ఓ విజ్ఞప్తి


సగటు భారతీయ వోటరు అంటే నాకు తగని గౌరవం. దీనికి కారణం వుంది.
అనేక దశాబ్దాల నుంచి ఎన్నికలు చూస్తూ వస్తున్నాను. కాడిజోడెడ్లు (కాంగ్రెస్) కంకీ కొడవలి (కమ్యూనిస్ట్) ప్రమిదె (జనసంఘం) ఇలా పోలింగు కేంద్రంలో గుర్తులు అతికించిన బ్యాలెట్ డబ్బాలు (నిజంగానే డబ్బాలు, ఖాళీ కిరసనాయిలు డబ్బాలు అనుకుంటాను) పెట్టేవాళ్ళు. ఏపార్టీకి వచ్చిన వోట్లు విడిగా లెక్కబెట్టి ఫలితాలు ప్రకటించేవాళ్ళు. తరువాత కాలంలో కాంగ్రెస్ గుర్తు ఆవూ దూడా, ఆ పిదప హస్తం ఇలా మారిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు రెండుగా విడిపోయాయి. జనసంఘం భారతీయ జనతా పార్తీగా పేరుతో బాటు, గుర్తును కమలంగా మార్చుకుంది. అభ్యర్ధుల పేర్లు లేకుండా గుర్తులతో బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వోటింగి యంత్రాలు రంగ ప్రవేశం చేసాయి. చదువుకున్న పోలింగు సిబ్బంది కొంత గందరగోళపడ్డారు కాని నిరక్షరాస్యుడయిన సగటు వోటరు మార్పుకు తేలిగ్గా అలవాటుపడ్డాడు. మనతోబాటే స్వతంత్రం తెచ్చుకున్న ఇరుగుపొరుగు దేశాలు ఎప్పుడో ఒకప్పుడు సైనిక పాలనలోకి జారిపోయాయి కాని మనదగ్గర మాత్రం ప్రభుత్వాలు కేవలం వోటుతోనే మారుతూ వచ్చాయి.


(దయచేసి ఇలా సగటు వోటర్ని అవమానించవద్దు. ఈ వొట్టినీతులు కట్టిపెట్టి,  చేతనయితే పోలింగు రోజు టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా వెళ్ళి వోటు వేసి అందరికీ ఆదర్శంగా నిలవండి.)

అలాటి చరిత్ర కలిగిన సగటు వోటర్ని డబ్బుకు మద్యానికి అమ్ముడుపోవద్దని నీతులు చెబుతున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. నిజానికి వాళ్ళే ప్రతిఎన్నికలో చురుగ్గా పాల్గొని వోటు హక్కు వినియోగించుకునే వాళ్లు. ఎండయినా వానయినా పోలింగు కేంద్రాల వద్ద క్యూలల్లో వేచి  నిలబడి వోటు వేసేవాళ్ళు. చదువుకున్నవాళ్ళలో ఇలాటి చొరవ కనబడదు. పైపెచ్చు వాళ్లు డబ్బుకు గడ్డి తిని వోటేస్తున్నారని ఎద్దేవా చేస్తుంటారు. ఇది వాళ్లని అవమానించడమే. నిజానికి అధికారానికి భయపడి  వోటేస్తే ఎమర్జెన్సీ తరువాత ఇందిరాగాంధి వోడిపోయేదా ? డబ్బుకు కక్కుర్తి పడి  వోటేస్తే   డబ్బున్నఖామందులందరూ గెలుస్తూ వుండేవారు కదా!
రాజకీయ పార్టీలు డబ్బున్నవాళ్లకు టిక్కెట్లు ఇస్తే వాళ్లు ప్రచారానికి ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారు. నామినేషన్ వేయడానికి వాళ్లు చేసే హడావిడి చూసి ఎవ్వరు మాట్లాడరు. ప్రత్యేక విమానాల్లో, హెలికాఫ్టర్లలో నాయకులు తిరుగుతుంటే ఆ డబ్బెక్కడిది అని అడిగేవాళ్ళు వుండరు. వోటరు దగ్గరకు వచ్చేసరికి అందరూ నీతులు చెప్పేవాళ్ళే!
ఎన్నికల్లో అభ్యర్ధులు ముట్టచెప్పే డబ్బు తీసుకుంటున్నారేమో కాని ఖచ్చితంగా వోటు మాత్రం వాళ్లు అమ్ముకోవడం లేదు. ఇది నిష్టూరంగా ధ్వనించే సత్యం. 

18, మార్చి 2014, మంగళవారం

సంజాయిషీ కాదు వివరణ మాత్రమే.


తిరుపతి అనుభవాలను గురించి కరకుగా రాయడాన్ని కొందరు తప్పుపట్టారు. సరయిన ఏర్పాట్లు జరక్కపోవడం వల్ల అలా రాశానన్నది వారి అభిప్రాయంగా తోచింది. అందుకే ఈ నాలుగు విషయాలు.
ముందే రాశాను తిరుపతి పోయింది తక్కువసార్లే కాని పెట్టిపుట్టుకున్న వాళ్ల తరహాలో తేలిగ్గా దర్శనాలు చేసుకున్న సందర్భాలే  ఎక్కువని.  ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని మార్పులు వచ్చాయి. అందుకే ఎవరినీ ఏమీ అడగకుండా మామూలుగా వెళ్ళి రావడం జరిగింది. ప్రస్తుతం ఈవో గా వున్న శ్రీ ఎమ్జీ గోపాల్, ఖమ్మం  కాలేజీలో మా హిందీ లెక్చరర్ శర్మ గారి కుమారుడు.  అప్పటినుంచి తెలుసు. కెరియర్ రీత్యా సీనియర్ కాని వయసు రీత్యా జూనియర్. అందరికీ సాయపడాలనే తత్వం వున్నమనిషి.  'సమర్ధులైన అధికారులే ఈవోలు గా పనిచేశారు, చేస్తున్నారు' అని కూడా రాయడం ఇందుకోసమే. అలాగే పాలకమండలి చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు. హైదరాబాదులో మా బోటి వారందరికీ చిరపరిచితులు. ఆయన చైర్మన్ అయిన కొత్తలో తిరుపతి వెడితే దూరం నుంచే గమనించి 'ఏం సీనూ బాగున్నావా' అని కావలించుకున్నారంటే  ఆయనతో వున్న సాన్నిహిత్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మనిషి భోలా శంకరుడు. ఆయన భార్య ఆయన కంటే నాలుగాకులు ఆధ్యాత్మికపరురాలు. ఆ భార్యా భర్తలు ఇద్దరూ, వారి ఇంటికి వెళ్ళినప్పుడు వద్దని వారించినా  మా ఆలుమగలకు  కాళ్ళకు దణ్ణాలు పెట్టేవాళ్ళు. ఆవిడ నిమ్స్, కేన్సర్ ఆసుపత్రులకు వారం వారం వెళ్ళి పళ్ళూ వగైరా పంచిపెడుతూ వుండడం మాకు తెలుసు. వాళ్లింట్లో హోమాలు అవీ జరిగితే మేము వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఇన్ని పరిచయాలు వున్నప్పటికీ మామూలుగా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రావాలన్న అభిలాష ఇంతపని చేయించింది. అప్పుడు కళ్ళ బడ్డ సంగతులే పూసగుచ్చి రాశాను.
జర్నలిష్టులకు వర్తించే సామెత ఒకటుంది.
'ఎక్కడయినా బావ కాని వంగతోట దగ్గర కాదు'

కడుపు నిండిన కబుర్లు


"ఏమిటి మీ విషయం. పెట్టి పుట్టినట్టున్నారు. అందుకే తీరిగ్గా కూర్చుని ఇలా ఎడాపెడా రాసేస్తున్నారు' అని అడిగారొక ఫేస్ లెస్ బుక్ మిత్రుడొకరు.
పెట్టి పుట్టిన బాపతు కాకపోయినా పుట్టి పెట్టిన సంగతి కొంత నిజమే. 'ఇన్నేళ్ళు ఉద్యోగాలు చేసి ఒక్క ఇల్లు కూడా ఏర్పరచుకోలేదా' అని ఎద్దేవా చేస్తుంటాడు నా పత్రికా మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ  కూడా, అక్కడికి  తానో (సొంత) ఇంటివాడయినట్టు.
కొందరు ఆస్తుల్ని కూడబెట్టుకుంటారు. అదేమిటో చిత్రం నేను ఆస్తుల్ని కన్నాను, ఇద్దరు కొడుకుల రూపంలో. చిన్నతనంలో వాళ్లకు ఏం చేసామో యేమో గుర్తు లేదు (అసలు ఏమన్నా చేస్తే కదా గుర్తు వుండడానికని మా ఆవిడ సన్నాయి నొక్కులు). కానీ, ఇప్పుడు మా పెద్దతనంలో మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇక ఇళ్ళూ వాకిళ్ళూ లేవని బెంగ యెందుకు?
అందుకే ఇలా తిని కూర్చుని తీరిగ్గా 'కడుపు నిండిన కబుర్లు' చెప్పడం.

అర్ధం అయిందా ఫేస్ లెస్ (నేమ్ లెస్) బుక్ స్నేహితుడు గారూ!.     

అయోమయం పార్టీలు


గెలుపు తధ్యం అంటారు. ఎదుటి పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే సిద్ధమైపోయారని చెబుతారు. రాబోయే రాజ్యం తమదే అని కాబోయే సీఎం  తామే అని బల్లగుద్ది చెబుతుంటారు. అన్ని పెద్దపార్టీలదీ దాదాపు ఇదే వరస. మరి అంత భరోసా వుంటే పక్క గూటి పక్షులు వచ్చి చేరుతుంటే అంత సంతోషపడడాలు, కండువాలు కప్పి ఫోటోలు తీయించుకోవడాలు, పత్రికల్లో వేయించుకోవడాలు   ఎందుకో అర్ధం కాదు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడే సమయంలో కంచె దూకుతున్న జంపు జిలానీలు పార్టీలకి బలుపా వాపా. ఏవిటో అంత వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.       

17, మార్చి 2014, సోమవారం

బతికి పోయాం

వార్త : "........పద్నాలుగు రోజుల రిమాండ్ "
వ్యాఖ్య : "రాష్ట్రపతి పాలన పుణ్యం. లేకపోతే వాళ్లు ఈపాటికి మన పక్కవీధి బారులో చిందులేస్తూ వుండేవారు."