7, ఆగస్టు 2011, ఆదివారం

గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు


గాయత్రి మంత్రం - భండారు శ్రీనివాసరావు   

(గాయత్రీ మంత్ర ప్రాశస్త్యం గురించి గతంలో సేకరించి అందించిన సమాచారం పట్ల చాలామంది పాఠకులు సహృదయంతో స్పందించారు. వారందరికీ కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ మరికొన్ని అదనపు వివరాలు, విశేషాలు వెల్లడించే ప్రయత్నంలో భాగమే ఇది. మరో విషయం. ఈ రోజు ఆగస్టు ఏడో తేదీ నా 66 వ పుట్టినరోజు. పుణ్యం పురుషార్ధంగా భావించి ఈ అంశం ఎన్నుకున్నాను. ఎక్కడయినా ముద్రారాక్షసాలు కనబడితే  దయచేసి నన్ను క్షమించకండి.)

గాయత్రి మంత్రము.

ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం

భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్

ప్రప్రధమంగా ఋగ్వేదంలో పేర్కొన్న ఈ పవిత్ర మంత్రం ఒక్కో దేవత పేరుతొ ఒక్కోరకంగా ప్రవచించబడింది.

దేవతలు – గాయత్రీ మంత్రాలు



1. అగ్ని గాయత్రి : ఓం మహా జ్వాలాయ విద్మహే

అగ్ని దేవాయ ధీమహి తన్నో అగ్ని: ప్రచోదయాత్

2. ఇంద్ర గాయత్రి : ఓం సహస్ర నేత్రాయ విద్మహే

వజ్ర హస్తాయ ధీమహి తన్నో ఇంద్ర: ప్రచోదయాత్

3. కామ గాయత్రి: ఓం కామదేవాయ విద్మహే

పుష్పబాణాయ ధీమహి తన్నోనంగ: ప్రచోదయాత్

4. కృష్ణ గాయత్రి : ఓం దేవకీ నందనాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో కృష్ణ: ప్రచోదయాత్

5. గణేశ గాయత్రి : ఓం ఏకదంష్ట్రాయ విద్మహే

వక్రతుండాయ ధీమహి తన్నో దంతి: ప్రచోదయాత్

6. గురు గాయత్రి : ఓం సురాచార్యాయ విద్మహే

వాచాస్పత్యాయ ధీమహి తన్నో గురు: ప్రచోదయాత్

7. చంద్ర గాయత్రి : ఓం క్షీర పుత్రాయ విద్మహే

అమృతతత్వాయ ధీమహి తన్నోశ్చంద్ర: ప్రచోదయాత్

8. తులసీ గాయత్రి : ఓం శ్రీ తులస్యై విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో బృందా: ప్రచోదయాత్

9. దుర్గా గాయత్రి : ఓం గిరిజాయై విద్మహే

శివ ప్రియాయై ధీమహి తన్నో దుర్గా ప్రచోదయాత్

10. నారాయణ గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో నారాయణః ప్రచోదయాత్

11. నృసింహ గాయత్రి : ఓం ఉగ్ర నృసింహాయ విద్మహే

వజ్ర నఖాయ ధీమహి తన్నో నృసింహ: ప్రచోదయాత్

12. పృధ్వీ గాయత్రి : ఓం పృధ్వీదేవ్యై విద్మహే

సహస్రమూర్త్యై ధీమహి తన్నో పృధ్వీ ప్రచోదయాత్

13. బ్రహ్మ గాయత్రి : ఓం చతుర్ముఖాయ విద్మహే

హంసారూడాయ ధీమహి తన్నో బ్రహ్మ: ప్రచోదయాత్

14. యమ గాయత్రి : ఓం సూర్యపుత్రాయ విద్మహే

మహాకాలాయ ధీమహి తన్నో యమః ప్రచోదయాత్

15. రాధా గాయత్రి : ఓం వృష భానుజాయై విద్మహే

కృష్ణ ప్రియాయై ధీమహి తన్నో రాధా ప్రచోదయాత్

16. రామ గాయత్రి : ఓం దాశరధాయ విద్మహే

సీతావల్లభాయ ధీమహి తన్నో రామ: ప్రచోదయాత్

17. లక్ష్మీ గాయత్రి : ఓం మహాలక్ష్మేచ విద్మహే

విష్ణు ప్రియాయై ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్

18. వరుణ గాయత్రి : ఓం జలబింబాయ విద్మహే

నీల పురుషాయ ధీమహి తన్నో వరుణః ప్రచోదయాత్

19. విష్ణు గాయత్రి : ఓం నారాయణాయ విద్మహే

వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు: ప్రచోదయాత్

20. శని గాయత్రి : ఓం కాకధ్వజాయ విద్మహే

ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మందః ప్రచోదయాత్

21. శివ గాయత్రి : ఓం పంచవక్త్రాయ విద్మహే

మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్

22. సరస్వతీ గాయత్రి : ఓం సరస్వత్యై విద్మహే

బ్రహ్మ పుత్ర్యై ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్

23. సీతా గాయత్రి : ఓం జనక నందిన్యై విద్మహే

భూమిజాయై ధీమహి తన్నో సీతా: ప్రచోదయాత్

24. సూర్య గాయత్రి : ఓం భాస్కరాయ విద్మహే

దివాకరాయ ధీమహి తన్నో సూర్యః ప్రచోదయాత్

25. హనుమద్గాయత్రి : ఓం అంజనీ సుతాయ విద్మహే

వాయుపుత్రాయ ధీమహి తన్నో మారుతి: ప్రచోదయాత్

26. హయగ్రీవ గాయత్రి : ఓం వాగీశ్వరాయ విద్మహే

హయగ్రీవాయ ధీమహి తన్నో హయగ్రీవః ప్రచోదయాత్

27.హంస గాయత్రి : ఓం పరమహంసాయ విద్మహే

మహాహాంసాయ ధీమహి తన్నో హంసః ప్రచోదయాత్

(గాయత్రి గురించి ఋషిపుంగవుల ప్రశంసలు మరో సారి)

(07-08-2011)

6, ఆగస్టు 2011, శనివారం

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

(06-08-2011 తేదీ సూర్య దినపత్రిక లో ప్రచురితం)


దేశంలోని మీడియా సంస్తలన్నీ ముక్కున వేలేసుకోవాల్సిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది నిన్న పార్ల మెంట్ హౌస్ లో విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ప్రస్తుతం సోనియా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యకు శస్త్ర చికిత్స అవసరమన్న డాక్టర్ల సలహా మేరకు సోనియా విదేశాలకు వెళ్లారు. రెండు మూడు వారాలపాటు ఆమె అక్కడే వుండవచ్చు. ఆమె లేని సమయంలో పార్టీ వ్యవహారాలను నిర్వహించేందుకు సోనియా నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, జనార్ధన్ ద్వివేదీ,అహ్మద్ పటేల్ వుంటారు” అన్నది ఆ ప్రకటన సారాంశం.

‘వైద్య సంబంధమయిన అంశాల్లో ప్రముఖుల గోప్యతకు గౌరవం ఇవ్వడం సముచితం’ అని కూడా ద్వివేదీ కోరినందువల్ల సోనియా అనారోగ్యానికి సంబంధించి వూహాగానాలకు పోవడం సబబు కాదు. కానీ, సోనియా సాధారణ వ్యక్తి కాదన్న విషయాన్ని ఈ సందర్భంలో గమనంలో వుంచుకోవాలి. ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న యూ.పీ.ఏ. అధినేత్రి. ఆ యూ.పీ.ఏ. ను శాసిస్తున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు. వ్యక్తిగత గోప్యత ముసుగులో అంతటి ప్రాధాన్యం కలిగిన వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా నొక్కిపెట్టడం ఏ కోణంలో నుంచి చూసినా సమంజసమనిపించుకోదు.

ద్వివేదీ ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చేదిగా కూడా వుంది. శస్త్ర చికిత్స విజయవంతమయిందనీ, ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్తితి సంతృప్తికరంగా వుందని చెప్పిన ద్వివేదీ ఆ వెనువెంటనే మాట మార్చి ఆమెకు ఆపరేషన్ ఇంకా జరగలేదనీ, రెండు మూడు రోజుల్లో చేసే అవకాశం వుందని పేర్కొనడం అనేక ఊహాగానాలకు ప్రాణం పోసింది.

సోనియా అనారోగ్యానికి సంబంధించి అనేక కధనాలు మీడియాలో మొదలయ్యాయి. వాటిల్లో నిజానిజాల ప్రసక్తి అటుంచి సోనియా త్వరగా కోలుకోవాలనే అందరూ ఆకాంక్షిస్తారు. అయితే సోనియా ఆరోగ్యానికి సంబంధించి అవసరమయిన దానికన్నా ఎక్కువ గోప్యతను పాటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించదలచుకున్నదన్నదే అసలు ప్రశ్న. సోనియా పరోక్షంలో ఆమె బాధ్యతలను నెత్తిన పెట్టుకున్న నలుగురు సభ్యుల బృందం నుంచి కూడా దీనికి సరయిన సమాధానాన్ని ఆశించే పరిస్తితి వుందనుకోలేము.

గత కొద్ది రోజులుగా సోనియా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్టు కొన్ని పత్రికల్లో వార్తలు వస్తూనే వున్నాయి. కానీ అమెరికాకు వెళ్లి హడావిడిగా శస్త్ర చికిత్స చేయించవలసినంత అనారోగ్యంతో ఆమె బాధ పడడంలేదని అంతా భావిస్తూ వచ్చారు. అవసరమయితే తప్ప బహిరంగ వేదికలమీద కనిపించే వ్యక్తి కాదు కనుక ఆమె అనారోగ్యానికి సంబంధించి వార్తలు బయటపడలేదని అనుకోవచ్చు. కానీ, ఆమె అధ్యక్షురాలిగా వున్న కాంగ్రెస్ పార్టీని ఇటీవలి కాలంలో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మన్మోహన్ అధికారనివాసంలో వారానికి అనేక పర్యాయాలు పార్టీ కోర్ కమిటీ సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. సోనియా కూడా ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నట్టు సమాచారం. తీవ్రమయిన అస్వస్తతతో బాధ పడుతున్న పక్షంలో ఈ మీటింగులకు రావడం సాధ్యం కాదు. ఒకవేళ వస్తుంటే, మిగిలిన కోర్ కమిటీ సభ్యులకు తెలియకుండా విషయాన్ని దాచడం కొన్నాళ్ళ వరకే సాధ్యం. కానీ, వాళ్ళల్లో ఎవ్వరూ సోనియా ఆరోగ్యానికి సంబంధించి ఏనాడూ పెదవి విప్పిన దాఖలా లేదు.

దీన్నిబట్టి సోనియా ఆరోగ్య పరిస్తితి గురించి ఆమె నియమించుకున్న కోటరీలోని వారికి ఎంతో కొంత సమాచారం తెలిసివుంటుందనే అనుకోవాలి. అందుకే తెలంగాణా గురించిన ప్రసక్తి వచ్చినప్పుడు ‘రెండు మూడు మాసాల వ్యవధానం’ అనే మాట ప్రస్తావించడానికి కూడా ఇదొక కారణం అయివుండాలి.

కాకపొతే, సోనియాతో తమకు అత్యంత సాన్నిహిత్యం వుందని చెప్పుకునే రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవ్వరికీ సోనియా అనారోగ్యం గురించి ముందస్తుగా తెలిసి వుంటుందనడానికి ఆధారాలు కానరావడంలేదు. గురువారం నాడు పార్టీ విప్ ను సయితం ధిక్కరించి పార్ల మెంట్ సమావేశాలకు టీ కాంగ్రెస్ సభ్యులు హాజరు కాకపోవడం, సోనియా గాంధీ అనారోగ్యం గురించి మీడియాలో వార్తలు రావడం మొదలయిన ఉత్తర క్షణం నుంచి వారి వైఖరిలో మార్పు వస్తున్న సంకేతాలు రావడం – ఈ వాదనను బలపరుస్తున్నాయి. సోనియా అనారోగ్యం నేపధ్యంలో పార్టీని మరింత ఇబ్బంది పెట్టకుండా సోమవారం నుంచి సభకు హాజరు కావాలని వారు నిర్ణయించుకున్నట్టు వెలువడ్డ సమాచారాన్ని బట్టి కూడా వారికి ఏమీ తెలియదని అనుకోవాల్సివస్తోంది.

సోనియా అనారోగ్యం విషయం బయటకు పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని అనుకోవడానికి మరికొన్ని ఆధారాలు వున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభకు ఎన్నికయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు – ఆ సమయంలో సభలో సోనియా గాంధీ కానీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ లేకపోవడం మీడియా దృష్టిని దాటిపోలేదు. కానీ, రాజకీయ వైరుధ్యాల కారణంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో వారిరిరువురూ సభలో లేకుండా జాగ్రత్త పడ్డారని అనుకున్నారు కానీ, అప్పటికే సోనియా గాంధీ అమెరికా చేరుకున్న సంగతిని ఎవరూ పసికట్టలేకపోయారు. ప్రతి చిన్న విషయానికి బ్రేకింగ్ న్యూస్ లతో ఆదరగొడుతూ, తామే ముందు అని వూదరగొట్టే టీవీ చానళ్ళు సోనియా అమెరికా వెళ్ళిన సంగతి పట్టుకోలేకపోవడం విచిత్రం అనిపిస్తుంది. విదేశానికి వెళ్ళబోయే ముందు సోనియా ఏర్పాటుచేసినట్టు చెబుతున్న ఈ కమిటీలో పార్టీలో కాకలుదీరిన సీనియర్లను కాదని మరో నలుగురిని ఎంపిక చేసిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఈ నలుగురిలో రాహుల్ గాంధీ పేరు జాబితాలో ముందు వుండడం మరికొన్ని వూహాగానాలకు వూతమిచ్చేదిగా వుంది. తన పరోక్షంలో పార్టీ వ్యవహారాలను చూడడానికి నియమించిన కమిటీలో ప్రధమ సభ్యుడు, ప్రధాన సభ్యుడు అయిన రాహుల్ గాంధీ తల్లి సోనియా వెంట అమెరికా వెళ్ళిన బృందంలోనే వున్నారు. పైగా, పార్టీ ప్రెసిడెంట్ తరువాత కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ స్తానం ఎవ్వరిది అంటే అనేక దశాబ్దాలనుంచి తటాలున గుర్తువచ్చే ప్రణబ్ ముఖర్జీకి ఇందులో స్తానం కల్పించకపోవడం సరికొత్త వూహాగానాలకు వూపిరిపోస్తోంది. ఈ కమిటీ కేవలం పార్టీ వ్యవహారాలను చూసేందుకు నియమించింది కాబట్టి మంత్రులకు స్తానం కల్పించలేదని అనుకుందామంటే ఇందులో రాహుల్ తరువాత పేరు మరో కేంద్ర మంత్రి ఆంటోనీదే కావడం అంతుబట్టని విషయం.

ప్రణబ్ అంత స్తాయి కాకపోయినా ఆంటోనీ కూడా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. సచ్చీలుడు, నిరాడంబరుడు అవినీతి మరకలు అంటని రాజకీయ నాయకుడని పేరు. యువకుడయిన రాహుల్ కు సరయిన మార్గ నిర్దేశనం చేయడానికి ఆంటోనీ వంటి నాయకుడు అవసరమని సోనియా భావించి వుండవచ్చు.

సోనియా తరువాత పార్టీలో ఎవరి స్తానం ఏమిటి అన్న ప్రశ్నకు ఆమె పరోక్షంగా ఇచ్చిన సమాధానం ఈ కమిటీ నియామకం అనుకోవాలా ? అలా అనుకుంటే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి రాబోతున్నాయన్నది అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కాకపొతే, అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడున్న పద్ధతిలో నడుస్తాయని అనుకోవడానికి మాత్రం వీలుండదు.

(05-08-2011)

5, ఆగస్టు 2011, శుక్రవారం

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు

తీరికలేని మనుషులు - భండారు శ్రీనివాసరావు


మొన్న రాత్రి మహా టీవీలో ఏదో చర్చకు పిలిస్తే వెళ్లాను. తెలకపల్లి రవి గారు, ఘంటా చక్రపాణి గారు కూడా వచ్చారు. ప్రోగ్రాం మధ్యలో అనివార్యంగా వచ్చే ‘విరామ సమయం’లో రవి – మాటల మధ్య ప్రసిద్ధ రష్యన్ రచయిత చెఖోవ్ రాసిన ఓ చిన్న కధ చెప్పారు.

‘గుర్రబ్బండి నడుపుతూ పొట్టపోసుకునే ఒక వృద్ధుడు ఈ కధలోని ప్రధాన పాత్ర. ఆ రోజు ఉదయమే అతడి కొడుకు ఆకస్మికంగా మరణిస్తాడు. అంత దుఃఖంలో కూడా బండి నడపక పోతే పొట్ట గడవని స్తితి అతనిది. తన బండి ఎక్కినవాళ్లకు కుమారుడి మరణ వార్త చెప్పాలని నోరు తెరిచినప్పుడల్లా వాళ్లు అడ్డంపడుతుంటారు. ఎందుకంటె ఈ పాడు ప్రపంచంలో ఎవడి గోలవాడిది. తన కష్ట సుఖాలు పక్కవాడితో పంచుకోవాలనే ఆత్రుత తప్ప ఎదుటివాడి బాధ ఏమిటో ఎవరికీ పట్టదు. చివరికి, ఎవరికీ తన కడుపులోని దుఖం చెప్పుకోకుండానే ఆ రాత్రి ఇంటికి తిరిగి వస్తాడు. కొష్టంలో గుర్రాన్ని కట్టివేస్తూ పిల్లవాడి చావు కబురు దాని చెవిలో వేసి కడుపులో భారం దించుకుంటాడు.’

చెఖోవ్ ఈ కధ రాసి దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ మనుషుల మనస్తత్వాల్లో ఎలాంటి మార్పులేదు.

టీవీల్లో జరిగే చర్చలే దీనికి మంచి ఉదాహరణ. ఎవరికి వారు తమ వాదం వినిపించాలని ప్రయత్నిస్తారే తప్ప ఇతరులమాట వినిపించుకోరు. అందరికీ అన్నీ తెలియాలన్న రూలేమీ లేదు. తెలియంది తెలుసుకుంటే పోయేదీ లేదు. అనవసరమయిన ఈ అభిజాత్యం అవసరమా ? ఎవరికివారే తెలుసుకోవాలి.(05-08-2011)

3, ఆగస్టు 2011, బుధవారం

బాబోయ్! బ్యూరోక్రసీ!! - భండారు శ్రీనివాసరావు

బాబోయ్! బ్యూరోక్రసీ!! - భండారు శ్రీనివాసరావు


ఏమి సేతురా లింగా!


ఆ వార్త దావానలంలా నగరంలో ఒక్కసారిగా గుప్పుమంది.
ఒకరు కాదు, ఇద్దరు కాదు తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన ఓ నిర్మాత, ఒక డైరక్టర్, ఓ రచయిత – వూరిమధ్యవున్న ఓ హోటల్ గదిలో పురుగులమందు తాగి ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి వెళ్ళిన పోలీసులకు ఆ గదిలో ఓ లేఖ దొరికింది.

అందులో ఇలా వుంది.

"అయ్యా!

విషయం : మహాభారతం మీద మీరు నిర్మించాలనుకున్న సినిమా.
రిఫరెన్స్ : ప్రభుత్వం నుంచి ఆర్ధిక సాయం కోసం మీరు పెట్టుకున్న ధరఖాస్తు.

"మీరు పంపిన పై ధరఖాస్తు కింది సంతకందారు పరిశీలనకై వచ్చింది. మహాభారతం అనే సినిమా తీయడానికి ప్రభుత్వ సాయం కోసం మీరు పెట్టుకున్న  ధరఖాస్తును ప్రభుత్వం క్షుణ్ణంగా పరిశీలించింది. మహాభారతం సబ్జెక్ట్ లోని కొన్ని అంశాలు మరీ సున్నితమైనవిగా భావించి ప్రభుత్వం ఈ ధరఖాస్తును పరిశీలించేందుకు ఒక అత్యున్నత స్తాయి సంఘాన్ని ఏర్పాటుచేసింది. ఇందుకోసం మానవ హక్కుల కమిషన్, జాతీయ మహిళా కమిషన్, శ్రామిక హక్కుల కమిషన్ తో పాటు ఈ అంశంతో సంబంధం వున్న వివిధ ప్రభుత్వ శాఖల సూచనలను కూడా సేకరించడం జరిగింది. మీరు దాఖలు చేసిన మహా భారతం స్క్రిప్ట్ ను నిశితంగా పరిశీలించిన తరువాత ఆయా శాఖలు పంపిన సూచనలు సిఫారసులను అభ్యంతరాలతో సహా ఈ కింది విధంగా క్రోడీకరించడం జరిగింది.

1. మీరు పంపిన స్క్రిప్ట్ ప్రకారం మహాభారతం కధలో కౌరవులు అనబడేవారు వంద మంది, వారితోపాటు మరో అయిదుగురు పాండవులు వుంటారని అర్ధం చేసుకోవడం జరిగింది. ఈ సంఖ్యల పట్ల కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. ఆ శాఖ జారీ చేసిన మార్గదర్శిక సూత్రాల ప్రకారం ఒక కుటుంబంలో ఇంత మంది సంతానం వుండడం పూర్తిగా అసంగతం. పైగా అలాటి విషయాలను సినిమా మాధ్యమం ద్వారా ప్రచారం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదు. చిన్న కుటుంబం ఆవశ్యకతను గురించి ప్రచారం చేయడం కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తున్న దృష్ట్యా - ఒకే ఒక్క కుటుంబంలో శత సంతానాన్ని చూపించే మహాభారతం వంటి సినిమాలకు సాయం చేయరాదని ఆ మంత్రిత్వ శాఖ అభిప్రాయ పడింది. ఈ చిత్రంలో కౌరవ పాండవుల సంఖ్యను మూడు దాటకుండా చూసుకోగలిగిన పక్షంలో ఆర్ధిక సాయం చేసే విషయాన్ని పరిశీలించవచ్చని ఆ శాఖ సిఫారసు చేసింది. మీరు స్క్రిప్ట్ ని మార్చుకునే ఉద్దేశ్యం ఉన్నట్టయితే ఈ అంశాన్ని గమనంలో వుంచుకోవలసిందిగా కోరడమయినది.

2. ప్రస్తుత ప్రజాస్వామ్య యుగంలో రాజులు, చక్రవర్తులను సినిమాల్లో చూపించడం భావ్యం కాదని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభిప్రాయపడింది. కాకపొతే, కౌరవులను లోక సభ సభ్యులుగాను, పాండవులను రాజ్యసభ సభ్యులుగాను చూపిస్తూ స్క్రిప్ట్ లో మార్పులు చేసిన పక్షంలో దరఖాస్తును పరిశీలించవచ్చని ఆ శాఖ సూచించింది. కధ చివరిలో కౌరవులను పాండవు లు జయించినట్టు చూపడం పట్ల కూడా ఈ శాఖ అభ్యంతరం తెలిపింది. లోక సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు ఒకరికొకరు తీసిపోరు అన్న పద్ధతిలో ముగింపు వుండాలని ఈ శాఖ స్పష్టం చేసింది.
౩. శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ ఈ కధలోని మరో ప్రధాన అంశంపై అభ్యంతరం తెలిపింది. మీరు పంపిన మహాభారతం స్ర్కిప్ట్ ప్రకారం కౌరవులు క్లోనింగ్ విధానం ప్రకారం ఒక కుండలో జన్మించినట్టు వుంది. ప్రస్తుత చట్టాల ప్రకారం భారత దేశంలో క్లోనింగ్ నిషేధం. ఈ దృష్ట్యా , కౌరవులు సాధారణ పద్ధతిలో జన్మించినట్టు స్క్రిప్ట్ ను మార్చాల్సి వుంటుంది.

4. జాతీయ మహిళా హక్కుల కమిషన్ అభ్యంతరం మరో రకంగా వుంది. అయిదుగురు పాండవులకు కలిపి ఒకే భార్య వున్నట్టుగా స్క్రిప్ట్ లో చూపించారు. మహిళలను కించబరిచే విధంగా రూపొందించిన ఈ కధను ఎట్టి పరిస్తితిలోను ప్రస్తుతం వున్న రీతిలో అనుమతించడం తగదని స్పష్టం చేసింది.

5. ఈ చిత్రంలో దృతరాష్ట్రుడు అనే పాత్రను అంధుడిగా చూపించారు. దానికితోడు ఈ దృతరాష్ట్రుడిని ఉద్దేశించి ఇతర పాత్రలు అనేక దృశ్యాలలో అంధుడు, అంధుడు అని నిందాపూర్వకంగా మాట్లాడినట్టు గా స్క్రిప్ట్ లో వుంది. ఈ దృశ్యాలను తొలగించాలని వికలాంగుల మంత్రిత్వశాఖ గట్టిగా సిఫారసు చేసింది.

6. ఈ చిత్ర కధ ప్రకారం ఓఘట్టంలో ద్రౌపది అనే స్త్రీ పాత్రను నిండు సభలో వస్త్రాపహరణం చేసినట్టు వుంది. ఇది యావత్ స్త్రీ జాతికే అవమానకరమని , ఈ సన్నివేశాన్ని స్క్రిప్ట్ లో నుంచి తొలగించాలని మహిళా శిశు సంక్షేమ శాఖ తన సిఫారసులో పేర్కొన్నది.

పోతే, ఇలాటి సన్నివేశాలను సినిమాల్లో చూపించడంవల్ల మహిళా సంఘాలనుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యే అవకాశం వుందని, దరిమిలా శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కావచ్చుననీ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ హెచ్చరించింది. ఈ సన్నివేశాలను తొలగించకుండా స్క్రిప్ట్ ని ఆమోదించడం తమకు సమ్మతం కాదని పేర్కొన్నది.

7. కౌరవ పాండవులను జూదరులుగా చూపించారని, ప్రజల్లో జూద ప్రవృత్తిని ప్రోత్సహించే విధంగా వున్న సన్నివేశాలను తొలగించాలని కూడా హోం శాఖ సూచించింది. అంతగా కధకు అవసరం అనుకుంటే కౌరవ పాండవులు గుర్రపు పందేల్లో పోటీ పడినట్టు చూపవచ్చని ఆ శాఖ సలహా ఇచ్చింది. గుర్రపు పందేలు జూదం కిందికి రావని సుప్రీం కోర్ట్ గతంలో పేర్కొన్న విషయాన్ని హోం శాఖ తన సిఫార్సుకు జత చేసింది.

8. విరాటరాజు కొలువులో పాండవులు ప్రచ్చన్న వేషాలలో ఎలాటి జీత భత్యాలు లేకుండా పని చేసినట్టు చూపించారు. ఇది వెట్టిచాకిరీ కిందకు వస్తుందని, 1976 వెట్టిచాకిరి నిర్మూలన చట్టంలో పేర్కొన్న అధికరణాలకు ఇది విరుద్ధమని మానవ హక్కుల కమిషన్ అభిప్రాయపడింది. అందువల్ల విరాట పర్వాన్ని మహాభారతం స్క్రిప్ట్ నుంచి తొలగించాలని కోరింది.

9. కౌరవ పాండవ యుద్ధంలో అభిమన్యుడనే పదహారేళ్ళ కుర్రవాడు యుద్ధంలో పాల్గొన్నట్టు చూపారు. అంత చిన్నకుర్రవాడు యుద్ధం చేసినట్టు చూపించడం 1986 బాల కార్మిక నిరోధక చట్టం నిబంధనలకు వ్యతిరేకమని జాతీయ లేబర్ కమిషన్ అభ్యంతరం తెలిపింది. యుద్ధంలో పాల్గొన్న అభిమన్యుడికి పరిహారం చెల్లించినట్టు స్క్రిప్ట్ లో ఎక్కడా పేర్కొనక పోవడం – 1948 కనీస వేతన చట్టం లోని నిబంధనలకు వ్యతిరేకమని అభిప్రాయపడింది. అభిమన్యుడి పాత్రకు సంబంధించి స్క్రిప్ట్ లో తగు మార్పులు చేయాలని సిఫారసు చేసింది.

10. మహాభారతం స్క్రిప్ట్ లో శ్రీకృష్ణుడు అనే పాత్ర వుంది. నెమలి ఈకలను తలపై ధరిస్తూ ఈ పాత్ర కనిపిస్తుంది. నెమలి జాతీయ పక్షి కావున ఆ పక్షి ఈకలతో కృష్ణుడిని చూపించడం 1972 వన్యప్రాణి సంరక్షణ చట్టానికి విరుద్ధం. అందువల్ల కృష్ణ పాత్ర ఆహార్యాన్ని ఈ సిఫార్సుకు అనుగుణంగా మార్చుకోవాల్సిందిగా కోరడమయినది.

11. యుద్ధసన్నివేశాలలో ఏనుగులను, గుర్రాలను వాడినట్టు స్క్రిప్ట్ లో వుంది. 1890 జంతుహింస నిరోధక చట్టం, 1960 జంతుహింస నిరోధక(సవరణ) చట్టం నిబంధనల ప్రకారం యుద్ధ సన్నివేశాలకు సంబంధించి తగు మార్పులు చేసుకోవాల్సిందిగా కోరడమయినది. జంతుహింస విషయమై శ్రీమతి మేనకా గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపధ్యంలో – మహాభారత సంగ్రామ దృశ్యాలలో వాటిని చూపించడం మరిన్ని ఆందోళనలకు దారితీసే అవకాశం వుంది.

12. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ పొదుపుకు సంబంధించి ఇటీవల జారీ చేసిన మార్గదర్శిక సూత్రాలను మహాభారతం స్క్రిప్ట్ తయారీలో పాటించినట్టు లేదు. అన్నివేలమంది సైనికులు అనవసరమని ఆ శాఖ అభిప్రాయపడింది. యుద్ధంలో పాల్గొన్న సైనికులు 1959 ఆయుధాల చట్టం అలాగే 1878 భారతీయ ఆయుధ చట్టం కింద లైసెన్సులు పొందినట్టు రుజువులు చూపించడం అవసరమని ఆంతరంగిక భద్రతా శాఖ పేర్కొన్నది.

"అందువల్ల మీరు పంపిన మహాభారతం స్క్రిప్ట్ కు పైన సూచించిన విధంగా అవసరమయిన మార్పులను చేసిన పక్షంలో మీ సినిమా నిర్మాణానికి మీరు కోరిన ఆర్ధిక సాయం మంజూరు చేసే విషయాన్ని పరిశీలించడం జరుగుతుందని ఇందుమూలంగా తెలియచేయడం జరుగుతోంది. తగిన మార్పులు చేర్పులతో కూడిన మహాభారతం సినిమా స్క్రిప్ట్ ను తిరిగి పంపవలసిందిగా కింది సంతకందారు మిమ్మల్ని కోరుతున్నారు.

కావున తెలియపరచడమయినది."

(సంతకం)

అండర్ సెక్రెటరీ, భారత ప్రభుత్వం

(నెట్లో చక్కర్లు కొడుతున్న ఆంగ్ల రూపానికి స్వేచ్చానువాదం )

-03-08-2011

2, ఆగస్టు 2011, మంగళవారం

నమ్మలేని నిజాలు - భండారు శ్రీనివాసరావు


నమ్మలేని నిజాలు - భండారు శ్రీనివాసరావు

ఒకానొక కాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగు ప్రొఫెసర్ పోస్టుకు ప్రకటన వెలువడినప్పుడు, కరీంనగరులో కళాశాలలో పనిచేస్తున్న మహాకవి విశ్వనాథ సత్యనారాయణ గారు దరఖాస్తు చేసుకొన్నారు.

కవిసమ్రాట్

 ఇంటర్వ్యూ రోజున విశ్వవిద్యాలయంలో నాటి  తెలుగు శాఖాధిపతి -  అభ్యర్థి అయిన  విశ్వనాథ వారిపై  ప్రశ్నలు సంధించడం ప్రారంభించారు.

తెలుగు శాఖాధిపతి : నీ పేరు?

విశ్వనాథ వారు : ( "నన్నే గుర్తించ లేదా? పైగా ఏక వచన ప్రయోగమా ?" అని కోపం వచ్చినా తమాయించుకొని ... ) విశ్వనాథ సత్యనారాయణ.

తెలుగు శాఖాధిపతి : ఏమేం కావ్యాలు వ్రాసావు?

విశ్వనాథ వారు : ( పేరు చెప్పాక కూడా అటువంటి ప్రశ్న వేసేసరికి పట్ట లేని కోపంతో ... ) “నేనేం కావ్యాలు వ్రాసానో కూడా తెలియకుండానే ఇక్కడ ’తెలుగు శాఖాధిపతి’ ఎలా అయ్యావురా? నీలాంటి వాడు ఉన్నంత కాలం ఈ విశ్వవిద్యాలయం మెట్లపై అడుగిడను” ( అంటూ కోపంగా వెళ్ళిపోయారు.)

తరువాత విశ్వనాథ వారు ఏ విశ్వవిద్యాలయంలోను ’ప్రొఫెసర్’ మెట్టెక్కలేక పోవడం తెలుగువారి  దురదృష్టం.

చాలా ఏళ్ళ తరువాత ఈ విషయం విశ్వనాథ వారు కూడ స్వయంగా వ్రాసుకొన్నారు.

కొసమెరుపు :

విశ్వనాథ వారు ఈ విషయాన్ని బయటపెట్టాక, రిటైరైన ఆ తెలుగు శాఖాధిపతిని ఒక సాహిత్యాభిమాని " ఇది నిజమేనా? " అని అడిగాడు. దానికి ఆ సాహితీమూర్తి సమాధానం –

“ఆయన మహాకవి అని నాకు తెలుసు. కాని ఇంటర్వ్యూలలో పరీక్షకుడు తనకు సమాధానాలు తెలిసి కూడా అభ్యర్థిని ప్రశ్నిస్తాడని ఆయనకు తెలియదు. ఆయనకు ఆ కనీస జ్ఞానం కొరవడడం శోచనీయం."

ఆనాటి ఆ తెలుగు శాఖాధిపతి - ఆచార్య బిరుదురాజు రామరాజు గారు.

బిరుదురాజు రామరాజు

సేకరణ: ఆచార్య ఫణీంద్ర

1, ఆగస్టు 2011, సోమవారం

జీవనస్రవంతి – -భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి – -భండారు శ్రీనివాసరావు

తపస్సు చేయగా చేయగా భగవంతుడు ప్రత్యక్షమై రెండు వరాలు కోరుకోమన్నాడు.
భక్తుడు భక్తి పులకాంకితుడై – ప్రపంచంలో అన్నింటికన్నా ఉత్తమమయిన ఒక వైన్ బాటిల్ నూ, సమస్త విశ్వంలోనే సర్వోత్తమంయిన మహిళామణినీ అనుగ్రహించమన్నాడు. ఆ దేవ దేవుడు ప్రసాదించి అదృశ్యమయ్యాడు.
భక్తుడు కళ్ళు తెరిచి చూస్తే, ఎదురుగా ఒక వైన్ బాటిల్, ఆ పక్కనే మాతృత్వ మధురిమకూ సేవాతత్పరతకూ ప్రతీక అయిన మదర్ తెరిస్సా కనిపించారు.
నీతి: కోరుకునే కోరిక ఏదయినా అది నిర్దిష్టంగా వుండాలి.

నాలుగు చీమలు అడవి దారెంట వెడుతుంటే ఓ ఏనుగు ఎదురు పడింది.
ఒక చీమ మిగిలిన వాటితో చెప్పింది నలుగురం కలసి ఏనుగుని చంపేద్దామని.
రెండో చీమ ‘అలాకాదు. ఏనుగు కాలు ఒకటి విరిచేసి వొదిలేద్దాం’ అంది.
మూడోది ‘మన దారికి అడ్డొచ్చిన ఈ ఏనుగును ఒడిసిపట్టుకుని దూరంగా విసిరేద్దాం’ అంది భుజాలు ఎగరేస్తూ.

నాలుగో చీమ వాటిని వారిస్తూ ఉదారంగా చెప్పింది.

‘అదేమో వొంటరిదాయే. మనం చూస్తే నలుగురం వున్నాం . పాపం ఆ ఏనుగుని ఇవ్వాల్టికి వొదిలేస్తే పోలా.’

మనుషులు చేసే తెలివితక్కువ పనులను కూడా మనసారా అభినందించాల్సిన సందర్భం ఒకటి వుంది. - అది పెళ్లి .


గర్ల్ ఫ్రెండ్ లేకపోతే జీవితంలో ఏదో కోల్పోయినట్టే .
వుంటే మాత్రం జీవితంలో మిగిలినవి అన్నీ పోగొట్టుకున్నట్టే.

చీకట్లు చుట్టుముట్టినప్పుడు వెలుగు ప్రసాదించమని భగవంతుడిని ప్రార్ధించండి. అప్పటికీ చీకటి తొలగకపోతే వెంటనే వెళ్లి - ఎలెక్ట్రిసిటీ బిల్ కట్టండి. 

(01-08-2011)



31, జులై 2011, ఆదివారం

మగవారికి మాత్రమే - భండారు శ్రీనివాసరావు

మగవారికి మాత్రమే - భండారు శ్రీనివాసరావు

(తమలపాకుతో నీవిట్లంటే తలుపుచెక్కతో నేనిట్లంటా)




(కొందరు ఆడవాళ్ళను గురించి మరికొందరు మగవాళ్లు సరదాగా చెప్పిన మాటలు ఇవి. వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలు అందరు ఆడవాళ్ళకు వర్తించాలని రూలేమీ లేదు)

“పెళ్లి తర్వాత భార్యాభర్తలు ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు గా వుంటారు. కలసివున్నట్టుగా కనిపిస్తారు కానీ ఎన్నటికీ కలవలేరు.”- అల్ గోరె
“మగవాళ్ళు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. మంచి భార్య దొరికిందా సుఖపడతారు. లేకపోతే నష్టం లేదు. పెద్ద వేదాంతి గా మారే అవకాశాలు పెరుగుతాయి.”- సోక్రటీస్

“తన భర్త గొప్పగొప్ప పనులు చేసి విజయాలు సాధించాలని ప్రతి భార్యా ఉత్సాహపడుతుంది. అతడిని ఆవైపుగా ప్రోత్సహిస్తుంది. కానీ, అంతవరకే. మొగుడు వాటిని సాధించడం మాత్రం ఇష్టపడదు.” - మైక్ టైసన్

“బహుశా ఎవ్వరూ జవాబు చెప్పలేని ప్రశ్న ఏదయినా వుందా అని నన్నడిగితే నా మెదడుకు ఒక్కటే తడుతోంది- ఆడది కోరుకునేది ఏమిటి ? అన్నదే ఆ ప్రశ్న.” – జార్జ్ క్లూనీ

“నేను మా ఆవిడతో మాట్లాడింది కేవలం మూడంటే మూడే ముక్కలు. ఆమె బదులుగా ఏకంగా ఒక దండకమే చదివింది.” – బిల్ క్లింటన్

“మీరూ మీ ఆవిడా ఇన్నేళ్ళుగా కలసి కలతలు లేని కాపురం చేస్తున్నారు. ఏమిటి ఇందులో రహస్యం అని నా మిత్రులు అడుగుతుంటారు.ఇందులో పెద్దగా దాచుకోవాల్సింది ఏమీ లేదు. ఎన్ని పని వొత్తిడులు వున్నా వీలు చేసుకుని వారానికి రెండు సార్లు ఏదయినా రెస్టారెంటుకు వెళ్లి మంచి సంగీతం వింటూ క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తుంటాము. కాకపొతే ఆవిడ ప్రతి మంగళవారం శుక్రవారం వెడుతుంది. నేను మాత్రం శని,ఆదివారాల్లో వెడుతుంటాను.” – జార్జ్ డబ్ల్యు. బుష్

“ఉగ్రవాదం అన్నా ఉగ్రవాదులన్నా నాకు భయమనిపించదు. నేను పెళ్లి చేసుకుని రెండేళ్ళయింది.”- -రూడీ గిలానీ

“ రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాను అన్నమాటేకాని నిజానికి సుఖపడిందేమీ లేదు. మొదటి భార్య నన్ను వొదిలేసింది. రెండో ఆవిడ ఆ పని చెయ్యకపోగా ముగ్గురు పిల్లలకు తండ్రిని చేసింది.” – డొనాల్డ్ ట్రంప్

“కాపురం పది కాలాలపాటు సజావుగా సాగాలంటే భర్తలకు నేను చెప్పే సలహాలు రెండే రెండు.
ఒకటి. మీరు చెప్పేది రైట్ కాదని తెలిసినప్పుడు నిజాయితీగా దాన్ని భార్యముందు వొప్పుకోండి. రెండు. మీరే రైట్ అనుకున్నప్పుడు దాన్ని మీ ఆవిడతో చెప్పకుండా నోరుమూసుకోండి.” - షాక్విల్ ఓ’ నీల్

“భార్య పుట్టినరోజు మరచిపోకుండా గట్టిగా గుర్తు పెట్టుకోవాలనుకుంటే ఒక మార్గం వుంది. ఓ ఏడాది దాన్ని గురించి మరచిపోయి చూడండి. ఆ తర్వాత గుర్తుంచుకోవడం ఎలాగో ఆవిడే నేర్పుతుంది.” - కోబె బ్రియాంట్
“పెళ్ళికి ముందు ఏం చేసానో తెలుసా ? జీవితంలో ఏవేం కావాలనుకున్నానో అన్నీ చేసికూర్చున్నాను.”.- డేవిడ్ హాసెల్ హాఫ్

“నేనూ మా ఆవిడా ఇరవై ఏళ్ళపాటు హాయిగా, నిశ్చింతగా వున్నాము. ఆ తర్వాతే ఇద్దరం కలుసుకోవడం, పెళ్ళిచేసుకోవడం జరిగింది.”- అలెక్ బాల్డ్విన్

“మంచి భార్యకో మంచి లక్షణం వుంటుంది. తప్పు తనదైనప్పుడు భర్తను ఉదారంగా క్షమిస్తుంది.”-బరాక్ ఒబామా

“వివాహం అనేది ఒక యుద్ధం లాటిది. కాకపొతే ఈ యుద్ధరంగంలో శత్రువులిద్దరూ కలసి ఒకే చోట నిద్రిస్తారు.” – టమ్మీ లీ

ఒకడు చెప్పాడు.” నా భార్య దేవత”
“అంత అదృష్టం అందరికీ వుంటుందా. మా ఆవిడ బతికే వుంది.” – జిమ్మీ కిమ్మెల్

“లేడీస్ ఫస్ట్ అంటారు ఎందుకని ?”


“దేవుడు కూడా ఆ మాటనే నమ్ముకుని ఆడవాళ్లనే ముందు లోకంలోకి పంపాడు. వాళ్లు మొత్తం ప్రపంచాన్ని ఒక మెస్ చేసికూర్చుంటారని ఆయనకూ తెలియదు” – డేవిడ్ లెటర్ మాన్

“ముందు ఎంగేజ్ మెంట్ రింగ్. తరువాత మ్యారేజ్ రింగ్. ఆ తరువాత ...”
“ఇంకేం రింగ్. మిగిలేది ఒక్కటే. సఫరింగ్” - జే లెనో

(31-07-2011)