సోనియా గాంధి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
సోనియా గాంధి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

6, ఆగస్టు 2011, శనివారం

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

సోనియా తరువాత ఎవరు ? – భండారు శ్రీనివాసరావు

(06-08-2011 తేదీ సూర్య దినపత్రిక లో ప్రచురితం)


దేశంలోని మీడియా సంస్తలన్నీ ముక్కున వేలేసుకోవాల్సిన విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జనార్ధన్ ద్వివేది నిన్న పార్ల మెంట్ హౌస్ లో విలేఖరులకు ఒక ప్రకటన విడుదల చేశారు.

‘ప్రస్తుతం సోనియా ఎదుర్కుంటున్న ఆరోగ్య సమస్యకు శస్త్ర చికిత్స అవసరమన్న డాక్టర్ల సలహా మేరకు సోనియా విదేశాలకు వెళ్లారు. రెండు మూడు వారాలపాటు ఆమె అక్కడే వుండవచ్చు. ఆమె లేని సమయంలో పార్టీ వ్యవహారాలను నిర్వహించేందుకు సోనియా నలుగురు సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో రాహుల్ గాంధీ, ఏకే ఆంటోనీ, జనార్ధన్ ద్వివేదీ,అహ్మద్ పటేల్ వుంటారు” అన్నది ఆ ప్రకటన సారాంశం.

‘వైద్య సంబంధమయిన అంశాల్లో ప్రముఖుల గోప్యతకు గౌరవం ఇవ్వడం సముచితం’ అని కూడా ద్వివేదీ కోరినందువల్ల సోనియా అనారోగ్యానికి సంబంధించి వూహాగానాలకు పోవడం సబబు కాదు. కానీ, సోనియా సాధారణ వ్యక్తి కాదన్న విషయాన్ని ఈ సందర్భంలో గమనంలో వుంచుకోవాలి. ఆమె ఈ దేశాన్ని పాలిస్తున్న యూ.పీ.ఏ. అధినేత్రి. ఆ యూ.పీ.ఏ. ను శాసిస్తున్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షురాలు. వ్యక్తిగత గోప్యత ముసుగులో అంతటి ప్రాధాన్యం కలిగిన వ్యక్తి ఆరోగ్య సమాచారాన్ని పూర్తిగా నొక్కిపెట్టడం ఏ కోణంలో నుంచి చూసినా సమంజసమనిపించుకోదు.

ద్వివేదీ ప్రకటన పలు అనుమానాలకు తావిచ్చేదిగా కూడా వుంది. శస్త్ర చికిత్స విజయవంతమయిందనీ, ప్రస్తుతం సోనియా ఆరోగ్య పరిస్తితి సంతృప్తికరంగా వుందని చెప్పిన ద్వివేదీ ఆ వెనువెంటనే మాట మార్చి ఆమెకు ఆపరేషన్ ఇంకా జరగలేదనీ, రెండు మూడు రోజుల్లో చేసే అవకాశం వుందని పేర్కొనడం అనేక ఊహాగానాలకు ప్రాణం పోసింది.

సోనియా అనారోగ్యానికి సంబంధించి అనేక కధనాలు మీడియాలో మొదలయ్యాయి. వాటిల్లో నిజానిజాల ప్రసక్తి అటుంచి సోనియా త్వరగా కోలుకోవాలనే అందరూ ఆకాంక్షిస్తారు. అయితే సోనియా ఆరోగ్యానికి సంబంధించి అవసరమయిన దానికన్నా ఎక్కువ గోప్యతను పాటించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఏమి సాధించదలచుకున్నదన్నదే అసలు ప్రశ్న. సోనియా పరోక్షంలో ఆమె బాధ్యతలను నెత్తిన పెట్టుకున్న నలుగురు సభ్యుల బృందం నుంచి కూడా దీనికి సరయిన సమాధానాన్ని ఆశించే పరిస్తితి వుందనుకోలేము.

గత కొద్ది రోజులుగా సోనియా తరచుగా అనారోగ్యానికి గురవుతున్నట్టు కొన్ని పత్రికల్లో వార్తలు వస్తూనే వున్నాయి. కానీ అమెరికాకు వెళ్లి హడావిడిగా శస్త్ర చికిత్స చేయించవలసినంత అనారోగ్యంతో ఆమె బాధ పడడంలేదని అంతా భావిస్తూ వచ్చారు. అవసరమయితే తప్ప బహిరంగ వేదికలమీద కనిపించే వ్యక్తి కాదు కనుక ఆమె అనారోగ్యానికి సంబంధించి వార్తలు బయటపడలేదని అనుకోవచ్చు. కానీ, ఆమె అధ్యక్షురాలిగా వున్న కాంగ్రెస్ పార్టీని ఇటీవలి కాలంలో అనేక సమస్యలు పట్టిపీడిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ప్రధాని మన్మోహన్ అధికారనివాసంలో వారానికి అనేక పర్యాయాలు పార్టీ కోర్ కమిటీ సమావేశాలు జరుగుతూ వస్తున్నాయి. సోనియా కూడా ఈ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతున్నట్టు సమాచారం. తీవ్రమయిన అస్వస్తతతో బాధ పడుతున్న పక్షంలో ఈ మీటింగులకు రావడం సాధ్యం కాదు. ఒకవేళ వస్తుంటే, మిగిలిన కోర్ కమిటీ సభ్యులకు తెలియకుండా విషయాన్ని దాచడం కొన్నాళ్ళ వరకే సాధ్యం. కానీ, వాళ్ళల్లో ఎవ్వరూ సోనియా ఆరోగ్యానికి సంబంధించి ఏనాడూ పెదవి విప్పిన దాఖలా లేదు.

దీన్నిబట్టి సోనియా ఆరోగ్య పరిస్తితి గురించి ఆమె నియమించుకున్న కోటరీలోని వారికి ఎంతో కొంత సమాచారం తెలిసివుంటుందనే అనుకోవాలి. అందుకే తెలంగాణా గురించిన ప్రసక్తి వచ్చినప్పుడు ‘రెండు మూడు మాసాల వ్యవధానం’ అనే మాట ప్రస్తావించడానికి కూడా ఇదొక కారణం అయివుండాలి.

కాకపొతే, సోనియాతో తమకు అత్యంత సాన్నిహిత్యం వుందని చెప్పుకునే రాష్ట్ర కాంగ్రెస్ నేతలెవ్వరికీ సోనియా అనారోగ్యం గురించి ముందస్తుగా తెలిసి వుంటుందనడానికి ఆధారాలు కానరావడంలేదు. గురువారం నాడు పార్టీ విప్ ను సయితం ధిక్కరించి పార్ల మెంట్ సమావేశాలకు టీ కాంగ్రెస్ సభ్యులు హాజరు కాకపోవడం, సోనియా గాంధీ అనారోగ్యం గురించి మీడియాలో వార్తలు రావడం మొదలయిన ఉత్తర క్షణం నుంచి వారి వైఖరిలో మార్పు వస్తున్న సంకేతాలు రావడం – ఈ వాదనను బలపరుస్తున్నాయి. సోనియా అనారోగ్యం నేపధ్యంలో పార్టీని మరింత ఇబ్బంది పెట్టకుండా సోమవారం నుంచి సభకు హాజరు కావాలని వారు నిర్ణయించుకున్నట్టు వెలువడ్డ సమాచారాన్ని బట్టి కూడా వారికి ఏమీ తెలియదని అనుకోవాల్సివస్తోంది.

సోనియా అనారోగ్యం విషయం బయటకు పొక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని అనుకోవడానికి మరికొన్ని ఆధారాలు వున్నాయి. వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున లోకసభకు ఎన్నికయిన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి సభ్యుడిగా ప్రమాణం చేయడానికి వచ్చినప్పుడు – ఆ సమయంలో సభలో సోనియా గాంధీ కానీ, ప్రధాని మన్మోహన్ సింగ్ కానీ లేకపోవడం మీడియా దృష్టిని దాటిపోలేదు. కానీ, రాజకీయ వైరుధ్యాల కారణంగా జగన్ మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో వారిరిరువురూ సభలో లేకుండా జాగ్రత్త పడ్డారని అనుకున్నారు కానీ, అప్పటికే సోనియా గాంధీ అమెరికా చేరుకున్న సంగతిని ఎవరూ పసికట్టలేకపోయారు. ప్రతి చిన్న విషయానికి బ్రేకింగ్ న్యూస్ లతో ఆదరగొడుతూ, తామే ముందు అని వూదరగొట్టే టీవీ చానళ్ళు సోనియా అమెరికా వెళ్ళిన సంగతి పట్టుకోలేకపోవడం విచిత్రం అనిపిస్తుంది. విదేశానికి వెళ్ళబోయే ముందు సోనియా ఏర్పాటుచేసినట్టు చెబుతున్న ఈ కమిటీలో పార్టీలో కాకలుదీరిన సీనియర్లను కాదని మరో నలుగురిని ఎంపిక చేసిన తీరు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మళ్ళీ ఈ నలుగురిలో రాహుల్ గాంధీ పేరు జాబితాలో ముందు వుండడం మరికొన్ని వూహాగానాలకు వూతమిచ్చేదిగా వుంది. తన పరోక్షంలో పార్టీ వ్యవహారాలను చూడడానికి నియమించిన కమిటీలో ప్రధమ సభ్యుడు, ప్రధాన సభ్యుడు అయిన రాహుల్ గాంధీ తల్లి సోనియా వెంట అమెరికా వెళ్ళిన బృందంలోనే వున్నారు. పైగా, పార్టీ ప్రెసిడెంట్ తరువాత కాంగ్రెస్ పార్టీలో ద్వితీయ స్తానం ఎవ్వరిది అంటే అనేక దశాబ్దాలనుంచి తటాలున గుర్తువచ్చే ప్రణబ్ ముఖర్జీకి ఇందులో స్తానం కల్పించకపోవడం సరికొత్త వూహాగానాలకు వూపిరిపోస్తోంది. ఈ కమిటీ కేవలం పార్టీ వ్యవహారాలను చూసేందుకు నియమించింది కాబట్టి మంత్రులకు స్తానం కల్పించలేదని అనుకుందామంటే ఇందులో రాహుల్ తరువాత పేరు మరో కేంద్ర మంత్రి ఆంటోనీదే కావడం అంతుబట్టని విషయం.

ప్రణబ్ అంత స్తాయి కాకపోయినా ఆంటోనీ కూడా కాంగ్రెస్ లో సీనియర్ నాయకుడే. సచ్చీలుడు, నిరాడంబరుడు అవినీతి మరకలు అంటని రాజకీయ నాయకుడని పేరు. యువకుడయిన రాహుల్ కు సరయిన మార్గ నిర్దేశనం చేయడానికి ఆంటోనీ వంటి నాయకుడు అవసరమని సోనియా భావించి వుండవచ్చు.

సోనియా తరువాత పార్టీలో ఎవరి స్తానం ఏమిటి అన్న ప్రశ్నకు ఆమె పరోక్షంగా ఇచ్చిన సమాధానం ఈ కమిటీ నియామకం అనుకోవాలా ? అలా అనుకుంటే పార్టీ పగ్గాలు ఎవరి చేతిలోకి రాబోతున్నాయన్నది అర్ధం చేసుకోవడం అంత కష్టమేమీ కాదు. కాకపొతే, అప్పుడు కాంగ్రెస్ రాజకీయాలు ఇప్పుడున్న పద్ధతిలో నడుస్తాయని అనుకోవడానికి మాత్రం వీలుండదు.

(05-08-2011)