8, ఏప్రిల్ 2011, శుక్రవారం

ఎవరీ అన్నా హజారే? - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?' - భండారు శ్రీనివాసరావు

'ఎవరీ అన్నా హజారే?'
'ఓ మాజీ సైనికుడు. 1965 లో జరిగిన ఇండో-పాక్ యుద్ధంలో పాల్గొన్నాడు.'
'ఎవరితడు? ఏమిటి ఈయన ప్రత్యేకత? యిరవై నాలుగ్గంటలు దేశవ్యాప్తంగా మీడియా లో వార్తలన్నీ ఈయన గురించే. మహారాష్ట్ర లోని అహమ్మద్ నగర్ జిల్లాలో రాలెగావ్ అనే ఆదర్స ఆదర్శగ్రామ సృష్టికర్త అయిన అన్నా హజారే గురించే. ఏమిటి అన్నా హజారే విశిష్టత? ఏమిటి ఈ గ్రామం గొప్పదనం?'
'స్వయం పోషకంగా, ఎవరిమీదా ఆధారపడకుండా అన్ని హంగులు దీనికి ఏర్పరిచారు. ఈ గ్రామానికి అవసరమయిన విద్యుచ్చక్తి అక్కడే ఉత్పత్తి అవుతుంది. సౌర శక్తి, గాలిమరలు, బయో ఫ్యూయల్ ఇందుకోసం వాడుతున్నారు. మూడు దశాబ్దాల క్రితం వరకు పేదరికం తాండవించిన గ్రామం అంటే ఈనాడు నమ్మడం కష్టం. ఎందుకంటె ఇప్పుడా గ్రామం మొత్తం దేశంలోనే అత్యంత సంపన్నగ్రామాల్లో ఒకటిగా తయారయింది కాబట్టి. దీన్ని ఆదర్శ గ్రామంగా నిర్ణయించడానికి అనేక కారణాలు వున్నాయి. ప్రభుత్వాల మీదా, ప్రభుత్వ పధకాల మీదా ఆధారపడకుండా అన్ని వసతులు గ్రామ ప్రజలే సొంతంగా ఏర్పాటుచేసుకున్నారు. ప్రకృతి సమతుల్యం దెబ్బతినని రీతిలో అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పన జరిగింది. అన్నింటికీ మించి ఆ గ్రామ ప్రజల నడుమ వెల్లివిరిసే సామరస్యాన్ని మరెక్కడా చూడలేము.
ఇన్ని మంచి పనులు ప్రచారం జోలికి పోకుండా చేసిన మంచి వ్యక్తి కాబట్టే భారత ప్రభుత్వం అన్నా హజారేను పద్మ భూషణ్ పురస్కారంతో గౌరవించింది.'
'అది సరే! అన్నా హజారే పోరాటం అంటూ మీడియాలో వస్తోంది. దేనిమీద ఆయన పోరాటం. దేనికోసం ఆయన ఆరాటం?'
'ఆయన ఒక మంచి అంశం మీద పోరాటం ప్రారంభించారు. అవినీతిని నిర్మూలించే ధ్యేయంతో చట్టానికి సవరణ చేయాలన్నది ఆయన డిమాండ్.'
'ఈ రోజుల్లో ఇలాటివి సాధ్యమయ్యే పనులేనా?'
'మామూలు మనుషులకు కష్టమే. కానీ అన్నా హజారే వంటి వ్యక్తులు అనుకుంటే సాధ్యం కానిది వుండదు.
'ఇందుకోసం అన్నా హజారే లోక్ పాల్ బిల్లు కావాలంటున్నారు. మంత్రులతో సహా రాజకీయరంగంలోవున్న వాళ్ళు , ఐ ఏ ఎస్ ఐ పీఎస్ లతో సహా అధికార యంత్రాంగంలో పనిచేసే సిబ్బంది అందర్నీ – ఎవరికీ ఎలాటి మినహాయింపు లేకుండా ఈ బిల్లు పరిధిలోకి తీసుకు రావాలన్నది అన్నా హజారే కోరిక. ఈ బిల్లు ద్వారా ఏర్పడే వ్యవస్థ అత్యంత బలీయంగా వుండాలని కూడా ఆయన కోరుకుంటున్నారు.
'లోక్ పాల్ బిల్లు అంత కొత్త విషయం ఏమీ కాదే. 1972 లోనే అప్పటి కేంద్ర న్యాయ శాఖ మంత్రి శాంతి భూషణ్ ఈ బిల్లును ప్రతిపాదించారు.'
'కానీ ఏమి లాభం! మళ్ళీ ఎవరూ దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. రాజకీయ నాయకులకు, బ్యూరోక్రాట్లకు ఈ బిల్లు పట్ల శ్రద్ధ వుండదు. అక్రమ సంపాదనకు అలవాటు పడిన వారెవ్వరికీ ఇలాటి చట్టాలు రుచించవు.
'అందుకే, మచ్చలేని ప్రజాసేవకుడయిన అన్నా హజారే ఎట్టకేలకు ఈ బిల్లుకు మోక్షం కలిగించడానికి నడుం బిగించాల్సి వచ్చింది. ఇందుకోసం ఆయన ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. ఈ దీక్షకు మద్దతుగా దేశవ్యాప్తంగా స్పందన లభిస్తోంది. ప్రభుత్వం కూడా స్పందించి బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింప చేస్తామని ప్రకటించాలని అన్న హజారే కోరుతున్నారు. ఈ బిల్లు రూపకల్పన కోసం ఒక ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్నది కూడా ఆయన డిమాండ్. ఈ కమిటీలో ప్రభుత్వంతో పాటు ప్రజా సంఘాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించాలని కూడా కోరుతున్నారు. ఎందుకంటె, ఇలాటి ముఖ్యమయిన బిల్లును తయారుచేసే బాధ్యతను కేవలం ప్రభుత్వాలకు వొదిలివేస్తే ప్రయోజనం వుండదని ఆయన అభిప్రాయం.
అన్నా హజారే కోరుకున్న విధంగా బిల్లు తయారయి చట్ట సభల ఆమోదం పొందితే, స్వయం ప్రతిపత్తి కలిగిన లోక్ పాల్ వ్యవస్థ ఏర్పడుతుంది. భారత ఎన్నికల సంఘం మాదిరిగా ఈ లోక్ పాల్ వ్యవస్తకు కూడా సర్వాధికారాలు వుంటాయి. ప్రతి రాష్ట్రం లో స్వయం ప్రతిపత్తి కలిగిన లోకాయుక్త వ్యవస్తలు ఆవిర్భవిస్తాయి. అవినీతి ఆరోపణలు వచ్చిన రాజకీయ నాయకుడిని కానీ, అధికారిని కానీ ఈ వ్యవస్థ విచారిస్తుంది. ఈ దర్యాప్తు ఏళ్ళూ పూళ్ళూ సాగకుండా ఒక్క ఏడాది వ్యవధిలో పూర్తి చేయాల్సి వుంటుంది. కేవలం రెండేళ్ళ లో అవినీతికి పాల్పడిన వ్యక్తిని శిక్షించాల్సి వుంటుంది. బోఫార్స్ కుంభకోణం విషయంలో, భోపాల్ గ్యాస్ దుర్ఘటన విషయంలో ఏమి జరిగిందో గుర్తుకు తెచ్చుకోండి. ఆ దర్యాప్తులు దాదాపు పాతికేళ్ళకు పైగా సాగాయి. చివరికి సాధించింది శూన్యం.
అవినీతి పై అన్న హజారే ప్రారంభించిన ఈ మహోద్యమంలో ఆయన ఒంటరి కాదు.
బాబా రాం దేవ్, మాజీ ఐ.పీ.ఎస్. అధికారి కిరణ్ బేడీ, స్వామి అగ్ని వేష్, సమాచార హక్కు ఉద్యమకారుడు అరవింద్ కేజరీ వాల్, ఇంకా అనేకమంది అన్నా హజారేకు మద్దతుగా నిలిచారు. అలాగే, ప్రముఖ సినీ నటులు అమితాబ్ బచ్చన్, అమీర్ ఖాన్ ఆయనకు బాసటగా నిలబడ్డారు. అందరి బాగుకోసం అన్నా హజారే ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని దేశం నలుమూలలకు, ఇంటింటికీ చేర్చడంలో ప్రతి ఒక్కరు తమకు చేతనయిన విధంగా తోడ్పాటు అందించాలని కోరడానికే ఈ వివరాలు. అవినీతిపై అన్నా హజారే మొదలు పెట్టిన ఈ ఉద్యమ స్పూర్తిని నేల నాలుగు చెరగులకు చేర్చడం ప్రతి ఒక్కరి కర్తవ్యం.' (08-04-2011)

7, ఏప్రిల్ 2011, గురువారం

సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు


సర్వము తానె అయినవాడెవ్వడు? – భండారు శ్రీనివాసరావు



"స్వామి క్షేమం గురించి ఎవ్వరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్వామికి ఎలాటి ఆపదా రాదు. ఒకవేళ అలాటి ఆపదలు సంభవిస్తే స్వామే స్వయంగా వాటినుంచి చెక్కుచెదరకుండా బయటపడగలరు. అందుచేత ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. విచారించాల్సిన అవసరం లేదు. స్వామే అన్నీ సాధించుకుంటూ వస్తాడు. అన్నింటినీ నెగ్గుకుంటూ వస్తాడు. అయినప్పటికీ, పాంచభౌతికమయిన శరీరానికి కొన్ని అవస్తలు తప్పవు. ఆహారం,పరిసరాలు దేహంలో ఎన్నో మార్పులు తెస్తాయి.భౌతికమయిన దేహంలో ఎన్నో జరగవచ్చు. అయితే, ఇవన్నీ తాత్కాలికం. శాశ్వితం కాదు. అంచేత స్వామి మీరంతా ధైర్యంగా వుండాలని కోరుకుంటాడు.

"ఇంతకీ నా మెడిసిన్ ఏమిటి? భక్తులు నాకోసం మనస్పూర్తిగా చేసే ప్రార్ధనలే నా మెడిసిన్. నాకోసం, అది మద్రాస్ కావచ్చు, హైదరాబాదో, ముంబయ్యో, బెంగుళూరో ఏ నగరమయినా కావచ్చు – అక్కడి భక్తులందరూ నా కోసం ప్రార్ధనలు చేశారు. భజనలు చేశారు. నామస్మరణలు చేశారు. తపస్సులు చేశారు. యజ్ఞాలు చేశారు. వారు చేసిన ప్రార్ధనల ఫలితంగానే నేనీనాడు మీ ముందు ఈ విధంగా నిలబడి మాట్లాడుతున్నాను.

"ఈ శరీరం ఇలా బాధ పడాలని నేను కోరుకోలేదు. అలాగని ఇలా బాగుపడాలని కూడా అనుకోలేదు. మీరు మీ ప్రార్ధనల ద్వారా దీన్ని సాధించారు. ఇలా జరగాలని ఆశించిందీ మీరే. కోరుకున్నదీ మీరే. ఈ దేహం నాది కాదు. మీదే. దీన్ని  మీరే కాపాడుకోవాలి. అది మీ బాధ్యత.

"నేను దేహాన్ని కాదు. నేను దేహిని మాత్రమే. దేహం పాంచభౌతికం. దేహి నిరామయుడు.

"ఈ దేహాన్ని రక్షించడం కోసం డాక్టర్లు ఎన్నో చేశారు. ఎంతో కష్టపడ్డారు. వారు తమ విద్యుక్తధర్మాన్ని చక్కగా నిర్వర్తించారు.  అయితే, నేను మాత్రం ఈ దేహాన్ని గురించి ఎంతమాత్రం ఆలోచించలేదు. దేహం పట్ల మమకారం పెంచుకోకూడదన్న మంచి భావనను నేను నిరూపించదలిచాను. ఇప్పుడే కాదు గత రెండేళ్లుగా నేను పదేపదే ఇదే చెబుతూ వస్తున్నాను. దేహం పట్ల అభిమానాన్ని తగ్గించుకోండి. క్రమంగా మీ దేహాభిమానాన్ని తగ్గించుకోండి. ఆత్మాభిమానాన్ని పెంచుకోండి. మీ దేహం మీది కాదు. ఆత్మకు మీరు ప్రతిరూపం. ఈ శరీరం పుడుతుంది. పెరుగుతుంది. ఏదో ఒకనాడు కాలగర్భం లో కలసిపోతుంది. బాధలు, క్లేశాలు అన్నీ దేహానికే. ఆత్మకు కాదు.

"నాకున్న దైవ శక్తిని  నా దేహాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నడూ వాడుకోలేదు. అలా చేయాలనుకుంటే నాకు క్షణం పట్టదు. నా దైహిక బాధలను నేను లిప్త కాలంలో మాయం చేసుకోగలను. నన్ను నేను స్వస్తత పరచుకోవాలన్న స్వార్ధం నాకు లేదు. అలాటి స్వార్ధ భావన నాకు లేశమాత్రంగా కూడా లేదు. ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరు హాయిగా సంతోషంగా వుండాలి. ఇదొక్కటే నాకున్న స్వార్ధపూరితమయిన ఆశ. ఆలోచన.

"ఒక్కటి గుర్తుంచు కోండి. ఈ దేహం పాంచ భౌతికం. కాస్త అటూ ఇటూగా పంచ భూతాల్లో కలసిపోయేదే. కాని దేహంలో వున్న ఆత్మకు చావు పుటకలు లేవు. ఆత్మకు ఎలాటి భవబంధాలు వుండవు. నిజం చెప్పాలంటే, ఆత్మే పరమాత్మ."

(2003 సంవత్సరం జులై 13 వ తేదీన పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో శ్రీ సత్య సాయి బాబా చేసిన అనుగ్రహ భాషణం నుంచి ప్రొఫెసర్ జి.వెంకటరామన్ భద్రపరచిన కొన్ని భాగాలు, ఈ నాటి పరిస్తితులకు తగినట్టుగా వున్నాయన్న వుద్దేశ్యంతో బ్లాగులో పెట్టడం జరుగుతోంది. అప్పటికి స్వామి తన విరిగిన కాలుకు పెద్ద శస్త్ర చికిత్స చేయించుకోవడం జరిగింది. – భండారు శ్రీనివాసరావు)

3, ఏప్రిల్ 2011, ఆదివారం

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు

సభా సంఘంతో పరువు నిలబెట్టుకున్న ప్రభుత్వం – భండారు శ్రీనివాసరావు


(ఏప్రిల్ మూడో తేదీ ఆదివారం ‘సూర్య’ దినపత్రికలో ప్రచురితం)

‘నేడే విడుదల, రేపే ఆఖరు, ఈరోజే చూడండి’ అన్న చందంగా సాగిన రాష్ట్ర శాసన సభ బడ్జెట్ సమావేశాలు అనుకున్నట్టుగా జరక్కపోయినా అనుకున్న గడువులో మాత్రం ముగిశాయి. చివరొక్కరోజును మినహాయిస్తే , ముందుగా నిర్ణయించుకున్న కాల వ్యవధిలో ఒక్కటంటే ఒక్కరోజు కూడా సభ సజావుగా సాగిన దాఖలా లేదు. సభాపర్వంలో వాయిదాలకే అధిక సమయం చెల్లిపోయింది.

‘ఐస్ హావిట్ ఐస్ హావిట్ ది మోషన్ ఈజ్ మూవ్డ్ అండ్ ది బిల్ ఈజ్ పాస్డ్’ (Ayes have it. Ayes have it. The motion is moved and the bill is passed) అని స్పీకర్ స్తానంలో వున్న డిప్యూటి స్పీకర్ నాదెండ్ల మనోహర్ అంటుండగానే పరీక్షిత్తు యజ్ఞగుండం దగ్గర నిలబడి ‘సహేంద్ర తక్షకాయ స్వాహా’ అంటే తక్షణం వచ్చి వాలిన తక్షకుడి మాదిరిగా, సమావేశాల్లో చర్చించి ఆమోదించాల్సిన బిల్లులన్నీ ఒకదానివెంట మరొకటి సభ ఆమోదం పొందడం క్షణాల్లో జరిగిపోయింది.(Ayes అంటే - ప్రాచీన ఆంగ్ల భాషలో అనుకూలంగా వోటు చేయడానికి అంగీకరించడం – Nyes have it అంటే వ్యతిరేకించడం అని ఇంగ్లీష్ నిఘంటువు చెబుతోంది-రచయిత)

ఏప్రిల్ ఒకటో తేదీన మొదలయ్యే కొత్త ఆర్ధిక సంవత్సరం నుంచి ఉద్యోగుల జీతభత్యాలు, ఇతర ప్రభుత్వ చెల్లింపులకు ఎలాటి అవరోధం లేకుండా ద్రవ్య వినిమయ బిల్లుతో సహా అన్ని బిల్లులను – ఎలాటి చర్చా లేకుండానే తూనా బొడ్డు తంతుగా నిమిషాలమీద సభ ఆమోదించడాన్ని ఆఖరు రోజున యావదాంధ్ర ప్రజలు టీవీల్లో చూశారు. పనిలో పనిగా శాసనసభ్యుల జీత భత్యాలు ఇబ్బడిముబ్బడిగా పెంచే బిల్లును కూడా సభలోని అన్ని పక్షాలు యధాశక్తి సహకరించి వొడ్డున పడేశాయి. దీనివల్ల అన్నీ కలిపి నెలకు అక్షరాలా 95 వేల రూపాయలు గౌరవ శాసన సభ్యులకు ముడతాయి. ఇంత మాత్రం నెలవారీ జీతాలు పొందేవారు ప్రతిజిల్లాలో హీనపక్షం అయిదారుగురు అధికారులు వున్నప్పుడు, వారి మీద పెత్తనం చేసే తమకు ఆమాత్రం వేతనం లేకపోతే ఏం గౌరవం అనుకున్నారేమో – ఈ ఒక్క విషయంలో మాత్రం పార్టీలకతీతంగా అంతా చేతులు కలిపి ‘మమ అనిపించారు. ఆ చేత్తోనే, మాజీ శాసన సభ్యుల పింఛను గరిష్ట మొత్తాన్ని నెలకు 25 వేలకు పెంచారు. సీపీయం మాత్రం ఈ పెంపుదలను వ్యతిరేకించింది. చర్చ జరగకుండానే ఈ బిల్లు సభ ఆమోదం పొందిన కారణంగా ఆ పార్టీ నిరసన ప్రకటనకే పరిమితమయింది. శాసన సభ కార్యాలయం విడుదలచేసిన వివరాలప్రకారం సభ మొత్తం 29 రోజులు జరిగింది. 15 బిల్లులు ప్రవేశపెట్టగా అందులో 10 బిల్లులు ఆమోదం పొందాయి. అన్ని రోజులు కలిపి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడింది 2 గంటల 58 నిమిషాలయితే, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు 3 గంటల 53 నిమిషాల సమయం తీసుకున్నారు. వాళ్ల మాదిరిగానే రెండు గంటలకు పైగా సమయం వాడుకున్న ఘనత మజ్లిస్ నేత అక్బరుద్దీన్ కు దక్కుతుంది. టీ.ఆర్.ఎస్. సభ్యుడు రాజేందర్, ఒకప్పటి ప్రజారాజ్యం నేత చిరంజీవి - అసలు నోరువిప్పని సభ్యుల జాబితాలో వుండడం విశేషం. అత్యధిక సభా సమయాన్ని ఉపయోగించుకున్న వారిలో లోక్ సత్తా నేత జయప్రకాష్ నారాయణ్ వున్నారు. ఆయన మొత్తం 3 గంటల 27 నిమిషాలు సభలో ప్రసంగించి రెండో స్తానం సంపాదించారు. లెక్కకు 29 రోజులు సభ నడిచినా అందులో వాయిదాలు పడ్డ సమయమే ఎక్కువ. ఇన్ని రోజుల వ్యవధిలో సభ సజావుగా నడిచింది 52 గంటల 30 నిమిషాలే. కాంగ్రెస్ ఇంచుమించు 23 గంటలు, తెలుగుదేశం దాదాపు 14 గంటలు తీసుకున్నాయి. ఈ లెక్కన చూస్తే సభ రోజుకు సరాసరి గంట కంటే తక్కువ కాలం నడిచినట్టు లెక్క. బహుశా సభా సమయం ఎంత వృధా అయినా, చివరిలో ఎలాగో అలాగా గిలెటిన్ అస్త్రం ప్రయోగించి పని పూర్తి చేయొచ్చునన్న ‘ఎరుక’ కలిగిన వారు కాబట్టే చట్టసభలోని సభ్యులందరూ చట్టరీత్యా పూర్తిచేయాల్సిన కార్యక్రమాలను మాత్రం ఎట్టకేలకు తు చ తప్పకుండా పూర్తిచేశారు.

ఈసారి బడ్జెట్ సమావేశాల్లో సంప్రదాయాలకు నీళ్ళు వొదిలిన సందర్భాలు అనేకం. ఉభయ సభల సంయుక్త సమావేశం ఆరంభంలోనే గవర్నర్ కుర్చీ లాగివేయడం, సభ ఆవరణలోనే ఒక సభ్యుడిపై చేయి చేసుకోవడం, బడ్జెట్ సమావేశాలు పూర్తికావడానికి ఒక్క రోజు ముందు సాక్షాత్తు ఒక మంత్ర్రే ప్రతిపక్ష సభ్యులపై సభలోనే భౌతిక దాడికి దిగడం, అసలు శాసనసభకు పోటీగా కొందరు సభ్యులు కలసి వేరేచోట మాక్ అసెంబ్లీ నిర్వహించడం, మరికొందరు సభ్యులు ఏకంగా అనేక రోజులపాటు సభనే బహిష్కరించడం - ఒకటా రెండా ‘ఏమి చెప్పుదు సంజయా!’ అన్నట్టు ఈసారి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నభూతో నభవిష్యతి అన్న చందంగా సంఘటనల మయంగా ముగిసిపోయాయి.

సమావేశాల మధ్యలో వచ్చిన విధాన మండలి ఎన్నికలు వివిధ రాజకీయపార్తీలలోని అవకాశవాదాన్ని ఎత్తిచూపాయి. సిద్ధాంతాలకు తిలోదకాలు వొదిలి అన్ని పార్టీలవాళ్ళు క్రాస్ వోటింగులో తమ ప్రతిభను, సొంత లాభాలపట్ల తమ నిబద్ధతను నిరూపించుకున్నారు.

సాధారణ రాజకీయాలకు విభిన్నమయిన, మరో విచిత్రమయిన పరిస్తితి ఈ సమావేశాల కాలంలో ప్రస్పుటమయింది. పదవిని వొదులుకోవడానికి మామూలుగా ఏ రాజకీయ నాయకుడు వొప్పుకోడన్నది సామాన్య జనంలో వున్న అభిప్రాయం. దీనికి భిన్నంగా ఒక మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణాకు మద్దతుగా పదవికి రాజీనామా చేసారు. క్రాస్ వోటింగ్ ఉదంతానికి సంబంధించి నైతిక బాధ్యతగా ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యులు రాజీనామా చేసారు. అలాగే, టీడీపీ సభ్యుడు, మాజీ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి - తెలంగాణా పట్ల పార్టీ అధిష్టానం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా పార్టీ నుంచి తప్పుకుని టీ.ఆర్.ఎస్. తీర్ధం పుచ్చుకున్నారు. ఈయనగారి రాజీనామా లేఖ డిప్యూటీ స్పీకర్ దగ్గర పెండింగ్ లో వుండిపోయింది. దాన్ని ఆమోదించాలంటూ ఆయన ఏకంగా నిరసన దీక్షకు దిగాల్సివచ్చింది. మంత్రి జూపల్లి కృష్ణారావు రాజీనామా ముఖ్యమంత్రి దగ్గరా, ముగ్గురు టీ.ఆర్.ఎస్. సభ్యుల రాజీనామాలు ఆ పార్టీ  అధినేత దగ్గరా ‘నిద్ర’ చేస్తున్నాయి. రాజీనామా చేసిన మంత్రి తన విధులకు హాజరు కానంటూ మొండికేయడంతో – సమావేశాల సమయంలో ఆయన తరపున సమాధానాలు చెప్పే బాధ్యతను మరో మంత్రికి వొప్పగించాల్సిన విచిత్రమయిన పరిస్తితి. మరోవైపు జగన్ వర్గం సభ్యులు రాజీనామా చేయకుండానే నిండు సభలో పార్టీని ధిక్కరించినా ఏమీ చేయలేని బలహీనత.
సమావేశాల చివరిరోజున సభ్యులు, వివిధ పక్షాల నేతలు అతి ముఖ్యమయిన ఒక అంశంపై జరిగిన సుదీర్ఘమయిన చర్చపట్ల కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించినట్టే కనిపించింది. పారిశ్రామిక ప్రగతి పేరుతొ, ఉపాధి అవకాశాలను పెంచే నెపంతో విచ్చలవిడిగా ప్రభుత్వాలు జరిపిన భూ పందేరాలపై సాగిన ఈ చర్చలో పాల్గొన్నవారందరూ సంయమనంతో చేసిన ప్రసంగాలు, సవివరంగా చేసిన సూచనలు వింటున్న వారికి సభపై గౌరవం కొంత పెరిగింది. కడప ఉపఎన్నికలు గడప ముందుకు వచ్చిన నేపధ్యంలో ఎవరు ఎవరితో కుమ్మక్కయ్యారన్న విషయం పక్కనబెడితే, సభాసంఘం వల్ల ఇష్టారాజ్యంగా జరిపే భూముల పంపిణీల జోరు ఒకమేరకయినా కట్టడి అయ్యే అవకాశం వుంటుంది. రాజకీయంగా కొందరికి ఇబ్బందికరం అయినప్పటికీ, దీని ఏర్పాటుకు ప్రభుత్వం అంగీకరించడం ఈ సమావేశాల కొసమెరుపుగా చెప్పుకోవచ్చు.

ఇంతమాత్రందానికి, శాసన సభ సమావేశాల పేరుతొ ఇంత హడావుడి అవసరమా అన్న సామాన్యుడి ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పేవారులేరు. (02-04-2011)



1, ఏప్రిల్ 2011, శుక్రవారం

తొమ్మిది నమ్మలేని నిజాలు

తొమ్మిది నమ్మలేని నిజాలు




1) ఆస్ట్రేలియాలో తొంభయ్ శాతం మంది ప్రజలు పాలు తాగరు.

2) పాములు రాత్రి వేళల్లో కూడా అయిదు కిలోమీటర్ల దూరంలో వున్న చిన్న జంతువుల్నిసయితం చూడగలవు.

3) సూర్యుడు మండే గోళం . అయినా మనిషి దాన్ని తాకవచ్చు. అదెలా సాధ్యం అంటే వొంటి నిండా పాదరసం పూసుకున్నప్పుడు.

4) ఒక విచిత్రమయిన విషయం ఏమిటంటే గ్రీన్ ల్యాండ్ అనే దేశంలో ఇంతవరకూ కవల పిల్లలు జన్మించలేదు.

5) సమస్త జీవరాశిలో ఒక్క జీబ్రాకు మాత్రమే లివర్ లేదు.

6) ఆరో వాస్తవం ఏమిటంటే పైన పెర్కొన్నదేదీ నిజం కాదు.

7) ఇవన్నీ ఒక్క క్షణం పాటయినా నమ్మినందుకు ధన్యవాదాలు.

8) ఎనిమిదోది మాత్రం నిజంగా నిజం. ఈ రోజు ఏప్రిల్ ఒకటో తేదీ. ఆల్ ఫూల్స్ డే.

9) ఫూల్ అనేవాడు ఏ రోజయినా ఫూలే.







31, మార్చి 2011, గురువారం

Opposing JLC is absurd – Bhandaru Srinivas Rao (I.I.S.)

Opposing JLC is absurd – Bhandaru Srinivas Rao (I.I.S.)




The raging controversy over the formation of Joint Legislative Committee (JLC) to probe into land allocations by the state government in the past and suggest new guidelines, is significant in many ways, than been construed by some as 'victimization' of a particular political family or individual, appears as absurd to me.

Such an initiative is a must when successive governments under the guise of `industrial development` and `employment generation` gifted away agricultural as well prime lands to several corporates. One shall appreciate Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy's initiative. As a media practitioner, am sure it was a conscious decision, as he happened to be part and parcel of earlier government headed by Dr Y S Rajasekhara Reddy, in some position or other against whom the main Opposition, Telugu Desam, had levelled serious allegations of impropriety in allocation of lands. These allegations were raised in the state Assembly in the past also by same Opposition Telugu Desam and then Chief Minister Y S Rajasekhara Reddy and his then government chief whip and present chief minister, defended effectively.

The TDP had also incorporate these allegations, especially land allocations to some corporates which helped give berth to late YSR son Y S Jaganmohan Reddy's `Jagapathi Group` which launched the "Saakshi" Telugu newspaper as well "Saakshi TV", in their 2009 election manifesto, but people turned it down. But, yet again TDP raised same allegations and this time around with an obvious intention to embarrass Kiran targetting the late leader’s son, Jaganmohan Reddy, who happens to be the promoter of the media house(s) in question.

Instead of doubting intentions of the Chief Minister for yielding to the Opposition demand for JLC, why not welcome it as he made it clear that only `specific` cases of land allocations will come into probe. The other day, the Saakshi daily has carried an interesting article listing out land allocations done to several corporates during nine year rule of Telugu Desam, headed by Nara Chandrababu Naidu. If those facts are true, then the Opposition too may be floored along with the earlier Congress government if at all there were any flaws.

True any resposible government provide land to a corporate believing it bring in new technology as well provide employment opportunities to locally available skilled labor. None can doubt such intentions of government. If I remember right, YSR during his tenure as Chief Minister, proudly quite often mentioned of the world leader in shoe making Adidas providing succor to 800 or 1000 locals in Nellore. Adidas is benefactor of government land under SEZ. Well, not necessary that single claim of late YSR cannot be taken as face value, to give clean chit for other allocations of his government. He, as Chief Minister, might have believed to those Corporates promises and took the bold step to allocate huge chunks of lands to Corporates. What`s wrong if an action is taken against some of those Corporates who failed to adhere to its time-schedule and misused the lands allotted to them?

No concessions, either to the Congress or earlier TDP governments. The government should only list out those Corporates who grossly violated and have prima facie case of `lease deed` violated to be included into the purview of proposed JLC.

I for one as an analyst don`t see any `conspiracy` against any individual by the ruling Congress or its arch rival Telugu Desam or both together conniving. Can Kiran take the risk of JLC as he heads more or less the same Cabinet that headed by YSR which made these land allocations?

At the same time, I shall also not find fault with aggrieved Saakshi group Chairman and son of former chief minister YS Jaganmohanreddy, for expressing doubts. It is no secret that such ‘opportunities’ are being best utilized in present day politics to outwit their rivals. But, if the intentions of the government as claimed by Kiran Kumar Reddy are true of forming better guidelines by setting up Land Bank for auditing, then why oppose? (31-03-2011)

28, మార్చి 2011, సోమవారం

వీసా - భండారు శ్రీనివాసరావు




వీసా - భండారు శ్రీనివాసరావు

అనగనగా ఒక వూరు. ఆ వూర్లో ఓ జంతు ప్రదర్సన శాల.

అసలే ఇది చిట్టిపొట్టి కధ. ఈ కధలో పదేపదే వచ్చే ఈ పదాన్ని అలా సాగదీసి రాయడం బాగోదు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ల భాషలో పొట్టిగా ‘జూ’ అనుకుందాము.

ఆ జూ లోని ఓ బోనులో జూలు బాగా పెంచుకున్న ఓ సింహం వుంది. రోజుకు కనీసం ఓ కిలో మాంసం కూడా తన మొహాన విదల్చడం లేదని ఆ జూ అధికారులపై దానికి తగని కోపం. జూలు విదిల్చి, కాలు దువ్వాలని వుంది కానీ  ఏం లాభం.  తానున్నది అడవికాదాయే. పైగా ఆ జూ అధికారులు అడవి జంతువులకన్నా క్రూరులు. వాళ్లకు తిక్క తిరిగిందంటే దొంగలెక్కలు రాసి ఆ మాత్రం మాంసం కూడా పెట్టకుండా తన డొక్క మాడ్చగల సమర్ధులన్న సంగతి ఆ మృగ రాజుకు తెలుసు. అందుకే ‘అనువుగాని చోట అధికులమనరాదు’ అన్న నీతి వాక్యం ప్రకారం మిన్నకుండి పోయింది.

కొన్ని రోజులకు ఏం జరిగిందో తెలవదు. దాని గోడు విన్న తధాస్తు దేవతలు కరుణించారేమో తెలియదు. ఏదయితేనేమి. దుబాయిలో వున్న ఓ జూ అధికారి  ఓ రోజు ఈ జూ చూడడానికి వచ్చి, తగిన ఆహారం లేక చిక్కిపోయిన ఈ సింహాన్ని చూశాడు. చక్కనమ్మ చిక్కినా అందం అనుకున్నాడేమో దాన్ని తన దుబాయ్ జూ కు తీసికెళ్ళాడు.

ఎమిరేట్స్ విమానం ఎక్కిన దగ్గరనుంచి సింహానికి ఆకాశంలో తేలిపోతున్న అనుభూతి కలిగింది. ఆ దేశంలో జూలన్నీ సెంట్రల్ ఏసీ అని ఎవరో చెప్పగా విన్న సంగతి గుర్తు వచ్చి దాని వొళ్ళు పులకరించి పోయింది. ఎంచక్కా చల్లటి బోనులో కూర్చుని దుబాయ్ జూ అధికారులు రోజూ ఆహారంగా పెట్టే ఒకటి రెండు మేకలను కడుపారా తింటూ కడుపులో చల్ల కదలకుండా కాలక్షేపం చేసే సన్నివేశాలను వూహించుకుంటూ ఆ సింహం దుబాయ్ జూ చేరుకుంది.

అది కలలు కన్నట్టే దానిని ఒక ప్రత్యేక బోనులో వుంచారు. నీటుగా దుస్తులు ధరించిన జూ పనివాడు ఒకడు పొద్దున్నే వచ్చి చాలా నీటుగా ప్యాక్ చేసిన ఆహారం పొట్లాన్ని అందించాడు. ఇక తన కష్టాలన్నీ తీరిపోయాయి అని అనుకుంటూ సింహం ఆత్రంగా ఆ పాకెట్ విప్పింది. అందులో మూడు నాలుగు అరటి పండ్లు వున్నాయి. అసలే పరాయి దేశం - భాష అర్ధం కాక పొరపడ్డారేమోనని మొదటి రోజు సర్దిచెప్పుకుంది. కానీ రెండో రోజూ, ఆ మరునాడు కూడా పనివాడు అరటి పండ్లే పెట్టడంతో సింహానికి తిక్కరేగింది.

పండ్లు పట్టుకుని వచ్చినవాడిని నిలబెట్టి దులిపేసింది.

‘ఏం ఇక్కడ మీ అందరికీ నన్ను చూస్తే తమాషాగా వుందా. నేనెవరనుకుంటున్నారు. మొత్తం అడవికే రాజుని. అరటి పండ్లు తినడానికి నేనేమన్నా కోతి ననుకుంటున్నారా?’ అని గాండ్రించింది.

అయితే, సింహం గాండ్రింపులకు బెదిరిపోవడానికి ఆ జూ పనివాడు అడవిలో ఏనుగు కాదు కదా. అందుకే అతగాడు తాపీగా జవాబు చెప్పాడు.

“నువ్వు సింహానివన్న విషయం ఇక్కడ పుట్టిన పిల్లులకు కూడా తెలుసు. కాకపోతే నిన్నిక్కడికి ‘కోతి’ వీసా మీద తీసుకొచ్చిన సంగతే నీకు తెలిసినట్టు లేదు”

నీతి:

పరాయి దేశంలో కోతిగా వుండడంకన్నా మాతృదేశంలో సింహంగా బతకడం మేలు.(28-03-2011)

















27, మార్చి 2011, ఆదివారం

కళ్ళు తెరవని కాంగ్రెస్ - భండారు శ్రీనివాసరావు

కళ్ళు తెరవని కాంగ్రెస్ - భండారు శ్రీనివాసరావు

(  మార్చి27 వ తేదీ 'సూర్య ' దినపత్రికలో ప్రచురితం)


కాల్లో ముల్లా? కంట్లో నలుసా? ముందు దేన్ని తీయాలన్న శషభిషలో వున్నట్టుంది ఢిల్లీ లో కాంగ్రెస్ అధినాయకత్వం.
ప్రత్యేక రాష్ట్ర వాదం, సమైక్య వాదం ఒక సమస్య అయితే, సీమాంధ్ర లో జగన్ దూకుడుకు కళ్ళెం వేయడం యెలా అన్నది పార్టీకి మరో జటిల సమస్య. ఈ రెంటికీ, ‘పైపూత’ వైద్యంతో చికిత్స చేయాలని చూసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఈ రెండు సమస్యల విషయంలో అధిష్టానానికి పూర్తి అవగాహన వుందని పార్టీ స్తానిక నాయకులు చేస్తున్న ప్రకటనల పట్ల ఎవరికీ విశ్వాసం కుదరడం లేదు. అధిష్టానవర్గం అధికార ప్రతినిధులమని చెప్పుకుంటూ ఢిల్లీ నుంచి తరచూ వెలువరించే ప్రకటనలు, హెచ్చరికలు గమనిస్తుంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వాస్తవ పరిస్తితి తెలిసిమాట్లాడుతున్నారని అనుకోవడానికి నమ్మకం చిక్కడం లేదు.

ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు గత ఏడేళ్ళకు పైగా కాంగ్రెస్ అధికారంలో వున్నప్పటికీ – ‘వున్నామా లేమా!’ అని ఎప్పటికప్పుడు గిల్లి చూసుకోవాల్సిన దుస్తితిలో పడిపోవడం ఆ పార్టీ దురదృష్టం. ఇటు రాష్ట్రంలో, అటు కేంద్రంలో అధికారం చెలాయిస్తూ కూడా పార్టీని మరింత పటిష్టం చేసుకోవడం సంగతి అటుంచి, చీలికలు పేలికలు కాకుండా చూసుకోలేని పరిస్తితి. రెండేళ్లక్రితం వరకు ఇది కలలో కూడా వూహించలేని విషయం. ఈ పరిణామం పూర్తిగా స్వయంకృతం. దిద్దుబాటు చర్యలపేరుతో ఢిల్లీ పెద్దలు చేస్తున్న ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్నాయే కానీ కలసి రావడం లేదు. ముఖ్యమంత్రుల మార్పు, రాష్ట్ర కాంగ్రెస్ పర్యవేక్షకుల మార్పు ఏదీ కూడా పరిస్తితులను సమూలంగా మార్చలేకపోతున్నాయి. దీనికి కారణం అధిష్టానానికి రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై పట్టు సన్నగిల్లడమయినా కావాలి లేదా తాత్సార ధోరణి ఒక్కటే సమస్యలను పరిష్కరించగలదన్న అభిప్రాయానికి వచ్చయినా వుండాలి. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా తగు వ్యవధానం వున్నప్పుడు పరిష్కారాలను వాయిదా వేస్తె వచ్చే నష్టం ఏముంటుందన్న ధీమా అయినా ఈ అలసత్వానికి కారణం కావచ్చు.

భవిష్యత్తులో ఎన్నికల పరంగా దీనికి భారీ మూల్యం చెల్లించు కోవాల్సి వస్తే అది ఆ పార్టీకి జరిగే నష్టంగా భావించి సరిపుచ్చుకోవచ్చు . కానీ, కాంగ్రెస్ అధిష్టానం అనుసరిస్తున్న ఈ వేచిచూసే సాచివేత వైఖరి వల్ల వాస్తవంగా నష్ట పోతున్నది మాత్రం రాష్ట్ర ప్రజానీకం. గెలిపించి గద్దె మీద కూచోబెట్టిన పార్టీ అంతర్గత కుమ్ములాటలతో పరిపాలనను పక్కనబెడితే ప్రజలు గమనించడం లేదని అనుకుంటే పొరబాటే. ఎన్నికలకు ఇంకా రెండేళ్లపైన వ్యవధి వుంది కదా అన్న ధీమాతో రాష్ట్రాన్ని, రాష్ట్ర సమస్యలను ఇలానే నిర్లక్ష్యం చేస్తూ పోతే, పర్యవసానాలు పార్టీ భవిష్యత్తును మరోరకంగా నిర్దేశించే ప్రమాదం వుంది. ఓటమి’ అనాధ లాటిది. పరాజయానికి ఎవ్వరు బాధ్యత తీసుకోరు. అదే విజయం అయితే – ఆ గెలుపుకు కారణం ‘నేనంటే నేనని’ అనేకమంది సిద్ధం అవుతారు. శాసన మండలికి శాసన సభ నుంచీ, స్తానిక సంస్తల నుంచీ జరిగిన ఎన్నికల ఫలితాలు ఈ సూత్రాన్నే మరోమారు తేటతెల్లం చేసాయి.

శాసన సభ నుంచి జరిగిన ఎన్నికల్లో ఆయా పార్టీల అధినాయకత్వాలే విజయం కోసం నానా పాట్లు పడ్డాయి. వున్న బలం గెలుపుకు చాలకపోయినా, లేని బలంతో కొత్త బలుపును నిరూపించుకోవాలని అన్ని పార్టీలు సిద్ధాంతాలను, సూత్రాలను నిస్సిగ్గుగా గాలికి వొదిలేశాయి. సాంకేతికంగా, చట్టపరంగా కొన్ని పార్టీలు గెలిచివుండవచ్చు. మరికొన్ని వోడిపోయి వుండవచ్చు. కానీ, నైతికంగా చూసినప్పుడు అన్నీ వోడిపోయాయనే చెప్పాలి.

ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా అపహాస్యం పాలుచేశాయి. గెలుపే ధ్యేయంగా సాగిన ఈ ఎన్నికల్లో రాజకీయాలకు అంటిన మకిలి ఓ పట్టాన వొదలడం కష్టం. శత్రువు శత్రువు మిత్రుడు అన్న రాజకీయ నీతిని అడ్డం పెట్టుకుని తొక్కని అడ్డదోవంటూ లేదు. పొత్తులు పెట్టుకోవడంలో, పోటీ పెట్టడంలో ఎత్తులు,పై ఎత్తులు, విచ్చలవిడిగా సాగిన ధన ప్రవాహం, ఎవరు యే పార్టీ అన్న దానితో నిమిత్తం లేకుండా గెలుపే పరమావధిగా బట్టబయలయిన స్తానిక నేతల వ్యవహారం - రానున్న కాలంలో రాష్ట్ర రాజకీయ చిత్రాన్ని కొంతవరకు ఆవిష్కరించగలిగాయి. అంతేకాదు, ఈ రెండు ఎన్నికల్లో తమ నిర్వాకానికి ఆయా పార్టీలు ఇచ్చుకుంటున్న సంజాయిషీలు చూస్తుంటే, ఒకే నాలుకతో రెండు రకాలుగా యెలా మాట్లాడవచ్చో సులభంగా బోధపడుతుంది.

ఎదురయిన పరాభవాన్ని సమర్ధించుకుంటూ, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలు – ప్రజాభిప్రాయాన్ని మదింపు వేసుకోవడంలో వారి అభిజాత్యానికి అహంకారానికి అద్దం పడుతున్నాయి. ఓటమి నుంచి హుందాగా గుణపాఠం నేర్చుకోవడానికి బదులు అదొక ఓటమే కాదనే పద్దతిలో సమర్ధించుకునే క్రమం ప్రజల్లో వారిని పలుచన చేస్తోంది. ఉదాహరణకు కడప జిల్లానే తీసుకుంటే, అక్కడ జరిగిన ఎన్నికల్లో సర్వశక్తులు వొడ్డి పోరాడింది కాంగ్రెస్ పార్టీయే. ఇంచార్జ్ మంత్రితో సహా జిల్లాకు చెందిన మంత్రులందరినీ సమరాంగణంలో మోహరించినా, సాక్షాత్తు వైయస్సార్ సోదరుడు, రాష్ట్ర మంత్రి వివేకానంద రెడ్డి జిల్లాలోనే మకాం వేసి కాపుకాసినా, చివరాఖరుకు కాంగ్రెస్ కు జన్మతః విరోధి అయిన తెలుగుదేశం పార్టీతో కుమ్మక్కయినా, - పది వోట్ల తేడాతో ప్రత్యర్ధి చేతిలో పరాజయం పాలయిన విషయాన్ని తేలిగ్గాతీసుకుంటున్న తీరు ఆక్షేపణీయం. కింద పడ్డా పైచేయి మాదే అన్న రీతిలో – కడప జిల్లాలో కాంగ్రెస్ పరిస్తితి పటిష్టంగానే వుందని బీరాలు పలకడం ఏ ప్రమాణాల ప్రకారం చూసినా శోభ స్కరం రం కాదు. ఎన్నికల్లో డబ్బు స్వైరవిహారం చేయడం వల్లనే తమ అభ్యర్ధులు ఓడిపోయారంటూ అధికార పార్టీ చేస్తున్న వాదనలకు సయితం సరయిన పునాదులు లేవు. పైగా అలాటి ఆరోపణలు అధికారంలో వున్న పార్టీ చేస్తే నమ్మేవారు వుంటారని అనుకోవడాన్ని మించిన భ్రమ మరోటి వుండదు. ఈ ఎన్నికల్లో వోటు హక్కు కలిగిన స్తానిక సంస్తల ప్రజాప్రతినిధుల పదవీ కాలం మరికొద్ది నెలల్లో ముగియనున్నందున, జగన్ వర్గం డబ్బు వెదజల్లి వారిని టోకుగా కొనుగోలుచేశారని, అలాటి టక్కుటమార విద్యల్లో పట్టాలు పుచ్చుకున్న కాంగ్రెస్ నాయకులే ఆరోపించడం మరింత విడ్డూరంగా వుంది. ఇలా ఓటమిని సమర్ధించుకునే నాయకులు, శాసన సభ నియోజకవర్గం నుంచి విధాన మండలికి అంతకు కొద్ది ముందు జరిగిన ఎన్నికల విషయాన్ని మరచిపోయి మాట్లాడుతున్నారు. సొంత పార్టీ వారే క్రాస్ ఓటింగుకు పాల్పడ్డ కారణంగా, విధానమండలి ప్రస్తుత ఉపాధ్యక్షుడే ఓటమి అంచువరకు వెళ్లి , ప్రాధాన్యతా వోట్ల పుణ్యమా అని గట్టెక్కిన సంగతి వారు వీలునుబట్టి మరచిపోయినా జనాలకు మాత్రం ఇంకా గుర్తుంది. సభలో వున్న సంఖ్యాబలాన్ని బట్టి కాకుండా మిగులు ఓట్లకు అదనపు ఓట్లను రాబట్టుకుని మరో అభ్యర్ధిని అదనంగా గెలిపించుకోవడం అన్నది చట్టబద్ధమే అయినా, అది అనైతిక విధానాలకు మార్గం వేసే ప్రమాదం వుందన్న విషయం గుర్తెరిగి కూడా ఆ మార్గాన్నే ఎంచుకోవడం కాంగ్రెస్ వారికే మింగుడు పడలేదు. పార్టీ అధికార అభ్యర్ధి మహమ్మద్ జానీ గెలుపోటముల మధ్య చాలాసేపు కొట్టుమిట్టాడిన వైనం , ఎన్నికల ఎత్తుగడలు కొండొకచో ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం వుందనడానికి మరో ఉదాహరణ. ప్రాధాన్యతా ఓట్ల కేటాయింపులో ముఖ్యమంత్రి రాజకీయ చతురతను అద్భుతంగా ప్రదర్శించి, నిలబెట్టిన అభ్యర్ధుల నందరినీ గెలిపించుకోగలిగారన్న ఆనందం అధికార పార్టీకి ఆవిరై పోయింది. పోతే, కోడింగ్ విధానం ద్వారా ‘రహస్య బాలెట్’ లోని రహస్యాన్ని బట్టబయలుచేసే వ్యవహారాలు ఎంతవరకు చట్ట సమ్మతం అన్నదానిపై కూడా సమగ్రమయిన చర్చ జరగాల్సిన అవసరాన్ని ఈ ఎన్నికలు బయటపెట్టాయి. అదేవిధంగా, మరికొద్ది కాలంలో పదవీకాలం పూర్తయ్యే తరుణంలో స్తానిక సంస్తల ప్రజా ప్రతినిధులను ఓటర్లుగా పెట్టి ఎన్నికలు జరిపే బదులు, వాటికి కొత్తవారు ఎన్నికయినదాకా ఆగి ఈ ఎన్నికలు నిర్వహించి వుంటే సరిపోయేది. అమ్ముడుపోయారన్న అపవాదు ఇప్పుడున్న వారికి మిగిలేది కూడా కాదు.

ఏదయితేనేం –ప్రత్యక్ష ప్రజాతీర్పు కాకపోయినా –శాసన మండలికి జరిగిన ఈ ఎన్నికలు రాష్ట్రంలో రాజకీయపార్టీల బలాబలాలను కొంతమేరకయినా ప్రజలముందు వుంచాయి. కాంగ్రెస్ లో కుమ్ములాటలు తమకు ముందు ముందు రాజకీయంగా మేలుచేస్తాయని తెలుగు దేశం పార్టీ నమ్మడానికి ఈ ఫలితాలు దోహదం చేసాయి. పసికూనగానే వున్న యువనేత పార్టీ నేరుగా ఈ ఎన్నికల్లో పాల్గొనకపోయినా తన అభ్యర్ధులను స్వతంత్రులుగా నిలబెట్టి కాంగ్రెస్, టీ.డీ.పీ. లకు దీటుగా, వాటితో సమానంగా ఫలితాలను సాధించి రాష్ట్ర రాజకీయాలపై తన పట్టును ప్రదర్శించి చూపింది. రానున్న కాలంలో పార్టీని మరింత పటిష్టం చేసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఆ పార్టీకి తగిన ఊతం ఇచ్చాయి. ఇక, కాంగ్రెస్ విషయానికి వస్తే -ఇంకా రెండేళ్లు అధికారం లో వుంటామన్న ఆశ మినహా భవిష్యత్తు అంధకార బంధురమే అనిపించేలా వున్నాయి ఈ పార్టీ సాధించిన విజయాలు.
అయితే, అఖిలభారత స్తాయిలో చూసినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ అనేది కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యమయిన రాష్ట్రం. ఎందుకంటె, ఈ రాష్ట్రం నుంచి గెలిచిన పార్టీ ఎంపీలే కేంద్రంలో యుపీఏ ప్రభుత్వానికి ప్రాణ వాయువు అందిస్తున్నారు. కానీ, వారంతా ప్రాంతీయ ప్రాతిపదికపై రెండుగా చీలిపోయి కునారిల్లుతు వుండడం పార్టీ అధిష్టానానికి కలిసి వచ్చింది. మంత్రి పదవుల పంపిణీలో సంఖ్యాబలానికి తగ్గ వాటా దక్కకపోయినా, కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ లలో రాష్ట్రాన్ని చిన్న చూపు చూసినా, అభివృద్ధి పధకాల మంజూరులో ఆంధ్ర ప్రదేశ్ కు చిన్న పీట వేసినా ఎవరూ కిమ్మనలేని పరిస్తితి.

ప్రాంతీయ విభేదాలతో సతమవుతూ, ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటూ నలుగురిలో నగుబాటు అవుతున్న సొంత పార్టీ ఎంపీల వ్యవహారం నానాటికి తీసికట్టు చందంగా తయారవుతూ వుండడంతో, రాష్ట్ర పార్టీ వ్యవహారాలకు కొత్త కాని సరికొత్త పార్టీ ఇంచార్జ్ - గులాం నబీ అజాద్ సర్దుబాటు చర్యలకు నడుం బిగించారు. ఆదిలోనే హంసపాదు మాదిరిగా, ఇరుపక్షాలను ఒక్క చోట చేర్చి మాట్లాడడం ‘జాదూ సామ్రాట్’ గా పేరున్న అజాద్ కు కూడా సాధ్యం కాలేదంటే పరిస్థితులు ఎంతగా ముదిరి పోయాయో అర్ధం అవుతుంది. కలివిడిగా కాకపోయినా, విడివిడిగా ఇరు ప్రాంతాల కాంగ్రెస్ ఎంపీలతో ఎట్టకేలకు సమావేశం కాగలిగానన్న తృప్తి మాత్రం ఆయనకు మిగిలింది. తెలంగాణా మినహా మరే ఇతర ప్రతిపాదన కూడా తమకు ఎంత మాత్రం సమ్మతం కాదని కుండ బద్దలు కొట్టి చెప్పామని తెలంగాణా ఎంపీలు తరువాత బయట మీడియాతో బల్లగుద్ది మరీ చెప్పారు. సీమాంధ్ర ఎంపీలు మాత్రం కొంత లౌక్యం ప్రదర్శించారు.. తెలంగాణా ప్రస్తావనే రాలేదని వాళ్ళు స్పష్టం చేసారు. అయితే, రాష్ట్రం లో పార్టీ పరిస్తితి ఆశాజనకంగా లేదన్న విషయాన్ని ఆజాద్ చెవిన వేసారు.

వరసగా రెండు పర్యాయాలు అధికార పీఠం ఎక్కిన యుపీఏ సర్కారుకు మరో రెండేళ్లలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు చాలా కీలకం. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటె, రాహుల్ ను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టాలన్న సోనియా అభిలాష నెరవేరాలంటే, రాష్ట్రం నుంచి ఎన్నికయ్యే పార్టీ ఎంపీల సంఖ్య ఇతోధికంగా వుండేట్టు చూసుకోవాలి.కనీసం ఇప్పటికంటే తగ్గకుండా జాగ్రత్త పడాలి. ఈ దృష్ట్యా అయినా కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై దృష్టి పెట్టాల్సి వుంటుంది. జగన్ పార్టీ విషయంలో తాత్సారమయినా, టీ. ఆర్. ఎస్. విలీన ప్రతిపాదన అయినా ఈ కోణం నుంచి ఆలోచించి చేస్తున్నవే అన్న అభిప్రాయం రాజకీయ పరిశీలకుల్లో వుంది. త్వరలో జరగనున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పెట్టుకున్న ఆశలపై నీళ్ళు చల్లుతాయో లేదో ఓ మేరకు తెలిపే అవకాశం వుంది. అందుకే, తెలంగాణా అయినా, జగన్ వ్యవహారం అయినా అప్పటివరకు ఇంత తాత్సారం.(26-03-2011)